Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page
పరవశమే.. పరమశివా!
బుద్ధిని శివుడిలో నిలిపి ధ్యానం చేసేవాడు సాక్షాత్తూ శివుడే అవుతాడట! భక్తుడిలోని భక్తికి, చిత్తశుద్ధికి వశమయ్యేవాడు శివుడు. అందుకే ఆయన భక్తవశంకరుడు. ఈ విశ్వానికే నాథుడు- విశ్వనాథుడు. ఈ సృష్టిలోని అణువణువూ ఆయన చైతన్యానికి నిదర్శనమే.. ఈ సృష్టిలోని ప్రతి కదలికా ఆయన తాండవమే.. ఆ మహా దేవదేవుడిని స్మరించే రోజే- శివరాత్రి. శివనామ స్మరణం, రుద్రాక్ష ధారణం, విభూతి ధారణం.. ఈ మూడూ శివచిహ్నాలు. వీటిని పాటించే వారిని తీర్థదేహులని అంటారు. అంటే- తరించిన వారని అర్థం. ఏ రీతిలోనైనా మనసును మహాదేవుడి ఆధీనంలో ఉంచడమే అసలైన శివరాత్రి. అందుకే శివరాత్రి నాడు ‘హర హర మహదేవ.. శంభోశంకర’ అంటూ సమస్త ప్రకృతి పరమశివుడి ఎదుట మోకరిల్లుతుంది. ముల్లోకాలనూ ఏలే దేవతల్లో శివుడు భోళాశంకరుడు. సనాతనుడు. భక్తజన వల్లభుడు. భూతనాథుడు. చంద్రశేఖరుడు. వైద్యనాథుడు. చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. భక్తితో కొలిచే తన భక్తులకు ఇట్టే వశమయ్యే శివుడి దర్శనం సర్వపాపహరణం. ప్రతి నెలా అమావాస్యకు ముందు రోజు వచ్చే చతుర్దశి ఆ మాసానికి శివరాత్రి అయితే, మాఘ మాసంలో వచ్చే కృష్ణ చతుర్దశి మహా శివరాత్రి అవుతుంది. ఈ చతుర్దశి నాటి అర్ధరాత్రికి తురీయ సంధ్య అని పేరు. అదే లింగోద్భవ కాలం. ఈ విశ్వమంతా వ్యాప్తమై ఉన్న ఈశ్వరతత్త్వమే లింగమని నిర్వచించాయి శాస్త్రాలు. ఆ సూక్ష్మ భగవత్ తత్త్వాన్ని ఆవిష్కరించుకునేందుకు అనువైన కాలమే ఈ తురీయ సంధ్యాకాలం. ఇక, క్షీరసాగర మథనం సమయంలో అమృతానికి ముందు హాలాహలం పుట్టింది. అది ముల్లోకాలనూ దహించి వేసే ప్రమాదం ఉండటంతో దేవదానవులంతా భీతావహులై తమను రక్షించాలంటూ పరమేశ్వరుడిని వేడుకున్నారు. దీంతో లోక రక్షణార్థం ఆ గరళాన్ని తానే మింగి, గొంతులో బంధించి గరళకంఠుడిగా పేరొందాడు శివుడు. ఈ హాలాహల ప్రభావంతో ఆయన కంఠం నీలంగా మారిపోవడంతో, ఆయన నీలకంఠుడయ్యాడు. అలా ఆయన గరళాన్ని కంఠంలో ఉంచుకున్న రోజే మహా శివరాత్రి పర్వదినమని కూడా అంటారు. స్నానం, మంత్రం, దయ, దానం, సత్యం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞానం, మనశ్శుద్ధి.. ఈ ఎనిమిది శౌచాలు శివరాత్రి నాడు తప్పనిసరిగా పాటించాలని చెబుతారు. ఉపవాసం, జాగరణ.. శివరాత్రి నాడు పాటించాల్సిన ముఖ్య నియమాలు. ఈ రెండూ శరీరాన్ని యోగ చైతన్యంతో నింపి ఈశ్వరతత్త్వ అనుసంధానానికి సహకరిస్తాయి. తాత్త్వికంగా చూస్తే అంతర్ముఖం కావడమే ఉపవాసం. ఆ ఏకాగ్రతలో పూర్ణ చైతన్యంతో తాదాత్మ్యం పొందడమే జాగరణ. శివరాత్రి నాడు మహా శివుడిని భక్తులు ఏ రీతిగా కొలిచినా.. మనసును మాత్రం మహాదేవుడి ఆధీనంలోనే ఉంచాలి. పరమశివుడికి అయిదు ముఖాలని వేదం చెప్పింది. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశాన.. ఇవి పరమశివుని అయిదు ముఖాలు. ఈ అయిదు రూపాలతో విశ్వమంతా శివ చైతన్యం పరివ్యాప్తమై ఉంటుందనేది వైదిక భావన. రుద్రాధ్యాయంలోని మంత్ర భాగాన్ని ‘నమకం’, ‘చమకం’ అని పిలుస్తారు. ప్రతి మంత్రం చివర ‘నమో.. నమ:’ అని ఉన్న భాగాన్ని నమకం అంటారు. ప్రతి మంత్రం చివర ‘చ మే.. చ మే..’ అని ఉన్న భాగాన్ని చమకం అనీ అంటారు. ఈ నమక, చమకాలలోని సారాంశాన్ని గ్రహించగలిగితే.. సృష్టి అంతా పరమేశ్వర స్వరూపమే అనే అవగాహన కలుగుతుంది. శివుడు తాండవం చేసేటపుడు ఢమరుకం మోగిస్తాడు. అది ఆయనకు ఇష్టమైన తాళవాద్యం. ఆ ధ్వనులే పద్నాలుగు రకాలు. వీటినే మన మహర్షులు గుర్తుపెట్టుకున్నారు. వీటినే పరమేశ్వర సూత్రాలని పిలుస్తారు. పాణిని వంటి మహర్షులు వ్యాకరణం రాయడానికి ఈ సూత్రాలనే ఆధారం చేసుకున్నారట!. శివలింగ మహిమను తెలిపేదే లింగాష్టకం. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మలభాసిత శోభిత లింగం జన్మజ దు:ఖ వినాశక లింగం తత్ప్రణమామి సదాశివ లింగం .. అంటూ సాగే లింగాష్టకాన్ని వినని వారుండరు. ఆరాధన విషయంలో ఇతర దేవతల కన్నా శివుడికి ఓ ప్రత్యేకత ఉంది. అదేమంటే శివుడిని మూర్తిరూపంలోనూ, లింగ రూపంలోనూ పూజించడం. శివలింగ పూజ విశిష్టత లింగ మహా పురాణం మొదటి అధ్యాయంలో సంపూర్ణంగా ఉంది. శివాలయాలకు వెళ్తే మనకు దర్శనమిచ్చేది లింగమే. మిగిలిన దేవతలంతా వారి వారి రూపాల్లో సాక్షాత్కరిస్తే, శివుడు ఇలా లింగ రూపంలో కనిపిస్తాడేమిటని ఎవరైనా భావించవచ్చు. అయితే, మూర్తి కన్నా ఎక్కువ విశేషాలు లింగ రూపంలోనే ఉన్నాయి. శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పీఠం.. దానిపైన లింగం అమరి ఉంటుంది. ఆ పీఠం మామూలు పీఠం కాదు. అది బ్రహ్మ దేవుడికి ప్రతిరూపం. ఈ పీఠం మీద కొద్దిగా విశాలంగా పానవట్టం ఉంటుంది. అది విష్ణువుకు ప్రతిరూపం. దాని మీద లింగం ఉంటుంది. అది శివుడికి ప్రతీక. ఇప్పుడు మొత్తం పీఠం కింది నుంచి పైదాకా గమనిస్తే పీఠంలో బ్రహ్మదేవుడు, దానిపైన ఉండే పానవట్టంలో విష్ణువు, దానిపైన ఉండే లింగంలో శివుడు ఉంటారని గ్రహించాలి. ఇలా ముగ్గురు ప్రధాన దేవతలు ఒకచోట కలిసి ఉండే స్థానం కనుకనే శివలింగానికి అంతటి ప్రాశస్త్యం. సాలగ్రామాల పూజ కంటే శివలింగ పూజ అందుకే అగ్రగణ్యమైనది. శివలింగంలో బ్రహ్మ, విష్ణు మహేశ్వరులే కాక శక్తి కూడా నిండి ఉంటుంది. ఆ శక్తి పానవట్టం కింది పీఠంలో ఉంటుంది. పైన శివలింగంలో శివుడు ఉంటాడు. ఈ కోణంలో చూస్తే శివశక్తి స్వరూపంగా శివలింగం దర్శనమిస్తుంది. అందుకే శివుడి విషయంలో మూర్తి పూజ కంటే లింగార్చనకే అనంత ఫలప్రదమని శైవాగమాలు, మహా భారతంలాంటి ఇతిహాస, పురాణాలు వివరిస్తున్నాయి. అలాగే, అకార, ఉకార, మకారంతో కూడిన ప్రణవాత్మకం శివలింగం. ఇదే స్థూల, సూక్ష్మ పరాత్పరాల కలయికగా కూడా ఉంటుంది. ఈ శివలింగానికి రుగ్వేదం ముఖంగానూ, సామవేదం నాలుకగానూ, యజుర్వేదం కంఠంగానూ, అధర్వణ వేదం హృదయంగానూ ఉంటాయి. ఈ సృష్టి అంతా లింగస్వరూపమే. శివలింగం సామాన్యమైనది కాదు. అది రజో గుణంలో బ్రహ్మదేవుడై, సత్వగుణంలో విష్ణువై, తమోగుణంలో రుద్రుడై సృష్టి, స్థితి, లయలకు ఆధారమై ఉంటుంది. అందుకే తన విషయంలో లింగరూపాన్నే పూజించాలని శివుడు అనేక సందర్భాలలో భక్తులకు చెప్పినట్టు కూడా పలు పురాణాలలో కనిపిస్తుంది. లింగం అంటే గుర్తు అని అర్థం. శివలింగం శివుడికి గుర్తు. ఆ గుర్తుతోనే శివుడు విష్ణువు, బ్రహ్మకు చాలాచోట్ల జ్ఞానోదయాన్ని కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లింగం అనే నిరాకార స్వరూపం జ్యోతిర్లింగాలుగా, వాయులింగాలుగా శివుడు అవతరించి భక్తులను అనుగ్రహించిన సందర్భాలు పురాణాలలో కోకొల్లలుగా ఉన్నాయి. అసలు ఈ సృష్టి అంతా లింగ స్వరూపమే. పద్నాలుగు లోకాల ప్రపంచమంతా ఒక పెద్ద శివలింగం వంటిదని లింగపురాణం వివరిస్తోంది. ఈ జగత్తంతా శివశక్త్యాత్మకమని పెద్దలు చెబుతారు. అలాంటి ఈ జగత్తులో బిందువు శక్తి అని, నాదమే శివుడని వివరించి చెబుతోంది శివ మహాపురాణం. బిందువైన శక్తి నాదమైన శివుడిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అయితే ఈ జగత్తు అంతా బిందువును అవలంబించి ఉంటుంది. అలా చూసినట్టయితే బిందునాదాలు రెండూ ఈ జగత్తు అంతటికీ ఆధారమని అనిపిస్తుంది. ఇక, ఈ బ్రహ్మాండమంతా ఓ పెద్ద శివలింగమే అని అనుకున్నప్పుడు ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నది శక్తి, శివుడు అని ఇట్టే అర్థమవుతుంది. బిందునాదాల వల్లనే జన్మ పరంపరలు ఏర్పడుతుంటాయి. అందుకే జన్మ నివృత్తి కలగాలంటే శివలింగాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో అభిషేకిస్తుండాలి. బిందు స్వరూపిణి అయిన దేవి తల్లి అనీ, నాద స్వరూపుడైన శివుడు తండ్రి అనీ భావించి, తల్లిదండ్రుల స్వరూపమైన శివలింగాన్ని ఆరాధించాలి. శివలింగాన్ని పూజించడంతో పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. శివలింగ పూజ వల్ల ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అనంతమైన ఆనందాన్ని ప్రాప్తింపచేస్తాడు. జీవన్ముక్తిని కోరుకుని పునర్జన్మ రాహిత్యాన్ని కాంక్షించే వారు శివలింగాన్ని ఆరాధించడమే మేలు. షడ్లింగం లేదా మహా లింగం అనే లింగార్చన ఎంతో గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఇంతకీ ఈ షడ్లింగం లేదా మహా లింగం అంటే ఏమిటి? అనే దానికి శైవాగమం వివరణ ఇస్తోంది. ప్రణవం లేదా ఓంకారాన్నే షడ్లింగమని, మహా లింగమని అంటారు. ఓంకారంలో మిళితమై ఉన్న అకారాన్ని ఆచారలింగం అనీ, ఉకారాన్ని గురులింగమనీ, మకారాన్ని శివలింగమనీ, బిందువును చరలింగమనీ, నాదాన్ని ప్రసాద లింగమనీ అంటారు. అకార, ఉకార, మకార, బిందునాదాలు కలిసిన ప్రణవాన్ని మహాలింగమని అంటారు. అలాగే, మరికొందరు ఉకారాన్ని చరలింగమనీ, మకారాన్ని ప్రతిష్టిత యంత్రలింగనీ, బిందులింగమనీ, నాదలింగమనీ ఈ వరుసలో అకార, ఉకార, మకార, బిందునాదాల కలయికతో ఏర్పడిన ప్రణవాన్ని (ఓమ్) ధ్వని లింగమనీ అంటారు. శ్రీకాళహస్తి- వాయులింగం మహా శివరాత్రి పర్వదినాన దక్షిణ భారతదేశంలోని పంచభూత లింగాలు వెలసిన ఐదు దివ్యక్షేత్రాల్లో ఘనంగా వేడుకలను నిర్వహిస్తారు. వీటిలో ఒక క్షేత్రం ఆంధప్రదేశ్లో ఉండగా, మిగతా నాలుగు క్షేత్రాలు తమిళనాడులో కొలువుదీరాయి. ఈ దివ్యక్షేత్రాలను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసంగా, నత్యవ్రత మహాభాస్కర క్షేత్రంగా, శివానందైక నిలయంగా అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. ఇది ఆంధప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉంది. పంచభూత లింగాల్లో మనిషికి ఆయువు అయిన వాయు క్షేత్రంగా ఇది విరాజిల్లుతోంది. మూడు మూగజీవాల భక్తి, ఆరాధనల ఫలితంగా ఏర్పడినదే శ్రీ (సాలె పురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు)- శ్రీకాళహస్తి. మనిషి మనుగడకు పంచభూతాలు ఎంతో అవసరం. వీటి గమనంతోనే మన మనుగడ సాగుతుంది. నింగి, నేల, గాలి, నీరు, నిప్పు.. ఇవే పంచభూతాలు. వీటిలో వాయువుకు ప్రతిరూపంగా శ్రీకాళహస్తిలో ఈశ్వరుడు స్వయంభువుగా వాయులింగేశ్వరుడిగా వెలిశాడు. స్వామి గర్భాలయంలో ఎడమ వైపున రెండు దీపాలు కనిపిస్తాయి. వీటినే వాయుదీపాలని అంటారు. స్వామి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలకు ప్రతీకగా ఈ వాయుదీపాల కదలికను పేర్కొంటారు. నవగ్రహాలు, ఇరవై ఏడు నక్షత్రాల సౌర మండలం శివుడి ఆజ్ఞతో నడుస్తుంటాయి. రాహు కేతువులు కూడా ఆయన కనుసన్నల్లోనే ఉంటారు. ఎవరైనా గ్రహదోషాలు, రాహుకేతు దోషాలు, సర్పదోషాల వంటి గ్రహపీడలతో బాధింపబడుతుంటే, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రాన్ని సందర్శించి గ్రహదోష పూజలు చేయించుకుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడంతోనే గ్రహదోషాలు వదిలిపోతాయని అంటారు. అంతటి మహిమాన్వితమైన క్షేత్రం- వాయులింగేశ్వర శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం. శ్రీకాళహస్తి దివ్యక్షేత్రానికి పడమర వైపున ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న స్వర్ణముఖీ నది బ్రహ్మదేవుడి వరప్రసాదంతో అగస్త్యముని తప ప్రభావం వల్ల దక్షిణ కైలాసం అనే కొండల్లో నుంచి పుట్టినట్టు స్థల పురాణం చెబుతోంది. సర్వేశ్వరుడు సృష్టికర్త బ్రహ్మను పిలిచి కైలాసాన్ని సృష్టించాలని ఆదేశించగా, బ్రహ్మ కైలాసాన్ని సృష్టించే సమయంలో తడబాటుతో కొంత భాగం భూమిపై పడిపోయిందట. ఆ భాగమే దక్షిణ కైలాసంగా పిలిచే శ్రీకాళహస్తి క్షేత్రమని అంటారు. ఈ క్షేత్రం మూడు మూగజీవాలకు ముక్తినిచ్చిన ముక్తిధామంగా వెలుగొందుతోంది. చిదంబరం- ఆకాశలింగం ఈ క్షేత్రం తమిళనాడులోని కడలూరు జిల్లా కారేకల్కు ఉత్తరంగా అరవై కి.మీ. దూరంలో చిదంబరం నగర నడిబొడ్డున ఉంది. ఇక్కడ శివుడు ఆకాశ లింగం రూపంలో ఉంటాడు. తమిళ సంఘం సాహిత్య రచనల ప్రకారం.. సనాతన విశ్వకర్మల వంశస్తుడైన విదువేల్విడుగు పెరుషత్తాన్ ఈ ఆలయ పున:సృష్టికి ప్రధాన రూపకర్తగా చెబుతారు. చోళ, పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయం జీర్ణోద్ధరణ జరిగినట్టు ప్రతీతి. హిందూ సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుడి అయిదు పవిత్ర పంచభూత క్షేత్రాల్లో ఒకటి. నలభై ఎకరాల వైశాల్యంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలతో వెలిసిన అతికొద్ది ఆలయాల్లో ఇది ఒకటి. క్రీస్తు శకం 1213లో వనకోవరైయన్ ఈ ఆలయాన్ని పున నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తున్న భంగిమలో నటరాజ రూపంలో వెలసి భక్తులకు వరాలిస్తున్నాడు. క్షణంలోని శత, సహస్ర భాగంలో పరమాణువులు నిరంతరంగా నశిస్తూ, జనిస్తూ ఉండే లయ ఈ సకల సృష్టికి మూలం. అది సృష్టిలో సమతూకానికి కారణం అవుతుంది. లయతో కూడిన సృష్టి క్రమమే శివతాండవం. అందుకు ప్రతీక ఇక్కడి నటరాజ మూర్తి. కంచి- పృథ్వీలింగం ఇక్కడ శివుడు పృధ్వీలింగమై వెలిశాడు. ఈ ఆలయ గోపురం ఎత్తు 59 మీటర్లు. దేశంలోనే అతిపెద్ద గోపురాల్లో ఇదీ ఒకటి. ఇక్కడ వెలసిన స్వామి ఏకాంబరేశ్వరుడు. ఈ దేవాలయంలో సుమారు 3,500 ఏళ్ల వయసు కలిగిన మామిడిచెట్టు ఉంది. ఈ చెట్టులోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచి గల పళ్లు కాస్తాయి. ఈ చెట్టు నీడలో ప్రస్తుతం మరో కొత్త మామిడి మొక్కను నాటారు. పురాతన మామిడి వృక్షం కాండాన్ని అద్దాలపెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని వధూవరులుగా దర్శనమిస్తారు. ఏకాంబరేశ్వరునికి నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు, 1008 శివలింగాలు ప్రతిష్టించారు. జంబుకేశ్వరం- జలలింగం తమిళనాడులోని తిరుచ్చికి 11 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి ఏనుగుల చేత పూజలందుకున్నాడని స్థల పురాణం. ఈ ప్రాంతంలో పూర్వం జంబు వృక్షాలు (నేరేడు) అధికంగా ఉండటం వల్ల దీనికి జంబుకేశ్వరం అనే పేరు వచ్చింది. ఇక్కడ జంబుకేశ్వరుడు పశ్చిమాభిముఖంగా వెలసి ఉన్నాడు. గర్భగుడి పక్కనే అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. జంబుకేశ్వరుడిగా పేరొందిన ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది. కానీ నీటిలో లేదు. లింగం పానవట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది. దీన్ని భక్తులకు స్పష్టంగా చూపేందుకు లింగం పానవట్టంపై ఒక వస్త్రం కప్పుతారు. అది నీటి తడితో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించినట్టు, తరువాత పల్లవులు, పాండ్యులు, విజయనగర రాజులు జీర్ణోద్ధారణ చేసినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధుడైన సుందర్ సంబందర్ తదితరులు ఈ స్వామిని సేవించి తరించినట్టు చెబుతారు. గతంలో ఈ ఆలయాన్ని కంచి కామకోటి పీటం పర్యవేక్షించేది. ఈ ఆలయం విశాలమైన ప్రాకారాలతో, ఎత్తయిన గోపురాలతో వెలిసింది. ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. తిరువణ్ణామలై- అగ్నిలింగం పంచభూత లింగాల్లో తేజోలింగం తమిళనాడులోని తిరువణ్ణామలైలో వెలసింది. అన్నామలై కొండ దిగువల ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువన్నామలైలోనే ఉంది. తిరువణ్ణామలై చెన్నైకి 185 కిలోమీటర్లు, బెంగళూరుకు 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెన్పేపై నది మీద ఉన్న డ్యాం ఇక్కడ మంచి పర్యాటక ప్రదేశం. ఈ ఆలయంలో తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రం యోగులకు, సిద్ధులకు నిలయం. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా అరుణాచలేశ్వరం కొండ పైనే ఉండేవారు. తమిళ నెల కార్తికంలో ఇక్కడ జరిగే ఉత్సవాలు ప్రసిద్ధిచెందాయి. కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణలు చేస్తారు.
శివతత్త్వమే మనతత్త్వం
శివం.. శివం అంటే మనసు పరవశం చెందుతుంది. శివతత్త్వం జీవన వేదం. నిరాకార స్వరూపుడైన శివుడి భావాలను, మననం చేసుకుంటే జీవితం ఆనందసాగరం అవుతుంది. శివుని అలంకరణలను మన జీవన విధానానికి అన్వయించుకుని చూద్దాం! పరమశివుడికి నిరాడంబర జీవితం. మనిషి కూడా భ్రమ కలిగించే ఆస్తులను చూసి గర్వంగా కాకుండా సామాన్య జీవితం గడపాలన్నది శివుడిలో ఇమిడివున్న నిరాడంబర తత్త్వం చాటుతుంది. అవసరాన్ని మించి ఖర్చులతో ఆనక ఇబ్బందుల పాలవడం ఎంతమాత్రం మంచిది కాదని ఆయన నిరాడంబరత్వం వివరిస్తుంది. ఆయన తానుండే శ్మశానమే కైలాసంగా భావించాడు. ఎక్కడ ఉంటున్నామన్నది ప్రధానం కాకుండా ఎంత సంతోషంగా ఉంటున్నామన్నదే ముఖ్యమని గుర్తించాలి. శివుడి శిరస్సున చంద్రుడు ఉంటాడు. చంద్రుడు జీవన కళలకు ప్రతిరూపం. మనిషి శరీరంలో శిరస్సు ప్రధాన భాగం. అందుకే అది ఎత్తున ఉంటుంది. బాధల్ని మనసులోకి రానివ్వకుండా జీవితం గడపాలి. శివుడి వాహనం నంది. నంది అంటే ఆనందం కలిగించేది. మనిషి కూడా ఆనందం అనే వాహనంలో నిత్యం ప్రయాణించాలి. ఎదుటి వారికి ఇబ్బంది, కష్టం కలగనీయకుండా జీవించడం అలవర్చుకోవాలి. శివుడు గరళాన్ని మింగి గొంతులో దాచుకున్నాడు. క్షీరసాగర మథనంలో అమృతం కన్నా ముందు వచ్చిన విషాన్ని పరమశివుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఇలాగే జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను గొంతు దిగనివ్వకుండా దాచుకుని హుందాగా జీవించాలి. శివుడు త్రినేత్రుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని పరమశివుడి యొక్క మూడు కళ్లని చెబుతారు. సూర్యుడు ఆరోగ్యం, చంద్రుడు జీవన కళలు, అగ్ని తేజోమయమైన జీవితానికి సంకేతాలు. ఇందులో రెండు మానవుల మాదిరిగానే ఉన్నా మరో కన్ను నుదుటన నిలువుగా ఉంటుంది. ఇది జ్ఞాననేత్రం. కనిపించిన అంశాన్ని జ్ఞాన సంబంధ దృష్టితో చూడటం అలవర్చుకోవాలి. మనకు తెలిసిందే నిజమని, భ్రమను వాస్తవంగా అన్వయించుకుని సమాజంపై ప్రభావం చూపవద్దని ఇందులో పరమార్థం. శివుడు అర్థనారీశ్వరుడు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులే. సమాజం పురుషాధిక్యం కావడంతో మహిళలకు అనుకున్నంత ప్రాధాన్యం లభించడం లేదు. పరమశివుడే తన భార్య పార్వతికి శరీరంలో సగ భాగం అందించి ఆదరించిన క్రమంలో ప్రతివారూ మహిళాభ్యుదయాన్ని కాంక్షించాలి. శివుడి నెత్తిన గంగ ఉంటుంది. గంగ అంటే జలం. జలం పవిత్రతను ఆపాదిస్తుంది. సమస్త జీవకోటికి అది ప్రాణాధారం. ప్రతి ఒక్కరూ ఉన్నంతలో పవిత్రంగా ఉంటూ సమాజాన్ని పవిత్రంగా ఉంచాలనేది ఈ అలంకరణ తెలియచెబుతుంది. శివుడు నిరంతర ధ్యానమగ్నుడు. బయట ఎంత కల్లోలంగా ఉన్నా స్థితప్రజ్ఞతతో వ్యవహరించాలి. ప్రశాంత వాతావరణంలోనే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. శివుడు ఆనందతాండవం చేస్తుంటాడు. అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా పరహితం కోరుకుంటే మన ముఖాన నిత్యం చిరునవ్వు తాండవిస్తుంది. శివుడి నివాస స్థలం శ్మశానం. ఎన్ని సుఖదు:ఖాలు అనుభవించినా చివరకు చేరేది అక్కడికే. అనవసర భోగాలకు తావివ్వకుండా ప్రశాంత జీవనం గడపాలనేది దీని భావన. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు - కుమార్ అన్నవరపు రాజేశ్వరి అన్నవరపు
ఉత్తరాయణం
కొత్త సందేశం వసంతానికి స్వాగతం పలుకుతూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తూ జరుపుకునే శ్రీపంచమి వేడుక గురించి తెలుగు పత్రిక ఫిబ్రవరి 2024 సంచికలో అందించిన ముఖచిత్ర కథనం చాలా బాగుంది. ‘జగత్తంతా సరస్వతీ మాతను ఆశ్రయించి జీవిస్తోంది. ఆ తల్లి పాదాలను నమ్ముకుని నేను జీవిస్తున్నాను’ అనేది నూటికి నూరుపాళ్లు నిజం. వసంత రుతు వర్ణనలు, సరస్వతీ దేవి మహత్తుల గురించి ఈ ప్రత్యేక కథనంలో బాగా వివరించారు. - కె.రాహుల్, సి.హరిప్రసాద్, పి.వెంకటరమణ, కైలాస్, టి.తిరుపతి, ఆర్.కమలాదేవి మరికొందరు ఆన్లైన్ పాఠకులు వస్తు గుణాలు ‘వస్తు గుణ దీపిక’ శీర్షిక కింద ఆయా వస్తువులు, పదార్థాల లక్షణాలు, వాటిలోని ఔషధ విశేషాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఇలాంటి కొత్త శీర్షికలు మరిన్ని ప్రారంభించండి. - ఉపేంద్రనాథ్, చంద్రకళ, రమేశ్చంద్ర, రవి, ఆర్.కృష్ణకాంత్- హైదరాబాద్ అవీ..ఇవీ సామెత కథలు, జాతీయాల వివరణ, పురాణ పురుషుల పరిచయం, మహర్షుల చరిత్ర, వస్తుగుణ దీపిక, మాసం- విశేషం, పిల్లల పాటలు వంటి శీర్షికలు బాగుంటున్నాయి. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. - మరికొందరు పాఠకులు
శివరాత్రి.. విష్ణుధాతి
2024- మార్చి 1, శుక్రవారం, మాఘ బహుళ షష్టి నుంచి 2024- మార్చి 31, ఆదివారం, ఫాల్గుణ బహుళ షష్టి వరకు.. శ్రీశోభకృతు నామ సంవత్సరం- మాఘం- ఫాల్గుణ మాసం -శిశిర రుతువు-ఉత్తరాయణం ఆంగ్లమానం ప్రకారం మార్చి నెల సంవత్సరంలో మూడో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ-ఫాల్గుణ మాసాల తిథుల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. మార్చి 1, మాఘ బహుళ షష్ఠి నుంచి నుంచి మార్చి 10, మాఘ బహుళ అమావాస్య వరకు మాఘ మాస తిథులు, ఆపై మార్చి 11, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి మార్చి 31, ఫాల్గుణ బహుళ షష్టి వరకు ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి. మాఘ-ఫాల్గుణ మాసాల కలయిక అయిన ఈ నెలలో విజయ ఏకాదశి, మహా శివరాత్రి, ఆమలిక ఏకాదశి, హోలీ వంటివి ప్రధాన పర్వాలు, పండుగలు. మాఘ - ఫాల్గుణ మాసాలు శిశిర రుతువు కాలం. చెట్లన్నీ ఆకులు రాల్చే కాలం. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది (పన్నెండవది). ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు వచ్చింది. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని నింపే ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఇక, మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి మహా విశిష్టమైనదనే విషయం తెలిసిందే. మార్చి 8న నిర్వహించే ఈ మహా పర్వం నాడు దేశమంతా హరహర మహాదేవ శంభో అనే మహాదేవుని నినాదం మారుమోగుతుంది. ఫాల్గుణ మాసంలో ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. అందుకే కాబోలు ఉసిరికాయతో ముడిపడి ఉండే ఒక ఏకాదశి తిథి (అమలక ఏకాదశి) ఫాల్గుణ మాసంలో వస్తుంది. అలాగే, నువ్వులు, మామిడిపూత (చూత కుసుమం) వంటివి ఈ నెలలో విరివిగా వినియోగిస్తారు. దశావతారాలలో ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశిని ఈ మాసంలోనే నిర్వహిస్తారు. మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనుక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే ముఖ్యమైన పర్వాలు, పండుగలు, ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం. మాఘ బహుళ షష్ఠి మార్చి 1, శుక్రవారం మాఘ బహుళ షష్ఠి తిథి మార్చి 1న ఆరంభమై 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ తిథి కుమారస్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ తిథి నాడు సు్ర•హ్మణ్యేశ్వరుడికి తమిళనాట విశేష పూజలు జరుగుతాయి. ఇక, ఈ తిథి.. యశోద జయంతి తిథిగానూ ప్రసిద్ధి. యశోద శ్రీకృష్ణుడి తల్లి. మాఘ బహుళ సప్తమి మార్చి 3, ఆదివారం మాఘ బహుళ సప్తమి నాడు విక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. మాఘ బహుళ అష్టమి మార్చి 4, సోమవారం మాఘ బహుళ అష్టమి- సీతా అష్టమి. ఈనాడే కాలాష్టమి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో మాత్రం.. ఈనాడు మంగలా వ్రతం ఆచరించాలని ఉంది. ఇక, సీతాష్టమి అని పేర్కొనడం వల్ల ఇది సీతాదేవికి సంబంధించిన పర్వమై అయి ఉండొచ్చునని, ఇది దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరభారత దేశంలో ఈనాడు సీతాదేవికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. మాఘ బహుళ నవమి/దశమి మార్చి 5, మంగళవారం మాఘ బహుళ నవమి/దశమి.. ఈ రెండు తిథులూ మార్చి 5నే కూడి ఉన్నాయి. నవమి తిథి సాధారణంగా దుర్గారాధనకు ఉద్దేశించినది. ఇక, మార్చి 5 స్వామి దయానంద సరస్వతి జయంతి తిథి. ఈయన గుజరాత్కు చెందిన వర్తక కుటుంబంలో జన్మించారు. ఈయన ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు. అజ్ఞానం, దారిద్య్రం, అన్యాయాలను ఎదురించి పోరాడిన యోధుడు. హిందూ ధర్మస్థాపనకు నడుం బిగించి దేశమంతటా పర్యటించి హిందూ సమాజాన్ని సంఘటితం చేసిన రుషి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని కీలకపాత్రను పోషించారు. తదనంతర కాలంలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. పద్నాలుగేళ్ల వయసులోనే భగవంతుడిని వెతకడానికంటూ ఇల్లు వదిలివెళ్లాడు. ఎందరెందరో యోగులను కలిసి ‘దయానంద’ అనే పేరొందారు. అనంతరం మథురలోని స్వామి విరజానంద సరస్వతి వద్ద వేదవేదాంగాలను ఔపోసన పట్టాడు. దయానంద సరస్వతి పేరుతో గురువు ఆదేశానుసారం దేశమంతటా పర్యటించి ధర్మస్థాపనకు యత్నించాడు. మాఘ బహుళ ఏకాదశి మార్చి 6, బుధవారం మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అనీ, విజయైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనుల విజయవంతానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొన్నారు. మాఘ బహుళ ద్వాదశి మార్చి 7, గురువారం మాఘ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాసిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి నాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలి. ఇదిలా ఉండగా, మూల, ఆషాఢ నక్షత్రాలతో కూడిన మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణం చెబుతోంది. అందులో వివరించిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి తిథికి ముందురోజు (మాఘ బహుళ ఏకాదశి)న ఉపవాసం ఉండి ద్వాదశి నాడు నువ్వులు దానం చేయాలి. మాఘ మాసంలో ఎక్కువగా నువ్వులతో ముడిపడిన పర్వాలు ఉంటాయి. ఈ తిథి కూడా అందులో భాగమై ఉండి ఉండొచ్చు. మాఘ బహుళ త్రయోదశి మార్చి 8, శుక్రవారం మాఘ బహుళ త్రయోదశి తిథి నాడు మహా శివరాత్రి పర్వం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని ‘శివరాత్రి మహాత్మ్యం’ అనే గ్రంథం చెబుతోంది. ప్రతిరోజూ రాత్రి శివుడిని పదకొండు సార్లు తలుచుకుని నిద్రపోవాలని, అలా శివుడిని తలుస్తూ రాత్రులు నిద్రపోవడం వల్లన ప్రతిరాత్రి శివరాత్రి అవుతుందని అంటారు. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా రోజంతా శివుడిని తలచుకుని ఆధ్యాత్మికతను ఆస్వాదించే అలాగే, మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విజయం సాధించిన, ఆదర్శంగా, స్ఫూర్తిమంతంగా నిలుస్తున్న నారీమణుల విజయానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తున్నారు. అలాగే, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం. మాఘ బహుళ చతుర్దశి మార్చి 9, శనివారం మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు రతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ తిథి నాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది. ఇంకా ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోద యానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మిన పూలతో పూజించాలి. మాఘ బహుళ అమావాస్య మార్చి 10, ఆదివారం ఇది మాఘ మాసపు చివరి తిథి. మాఘ బహుళ అమావాస్య తిథి పితృకర్మలు నిర్వహించడానికి ఉద్ధిష్టమైనది. అలాగే, ఈ తిథి మన్వాది దినమని ఆమాదేర్ జ్యోతిషీలో ఉంది. ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాము డిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్యావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మార్చి 11, సోమవారం ఈనాటి నుంచి ఫాల్గుణ మాస తిథులు ఆరంభమవుతున్నాయి. తొలి తిథి- ఫాల్గుణ శుద్ధ పాడ్యమి. ఈనాడు చంద్ర దర్శనం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ విదియ/తదియ మార్చి 12, మంగళవారం ఫాల్గుణ శుద్ధ విదియ తిథి రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిన గురువు- రామకృష్ణ పరమహంస. ఈయన పుట్టినప్పటి పేరు గదాధర్ చటోపాధ్యాయ. పశ్చిమబెంగాల్ సాంస్క•తిక పునరుజ్జీవనంలో ఈయన పాత్ర, ప్రభావం చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద ఈయన శిష్యులలో ప్రథముడు. సృష్టిని ఏకత్వంతో చూడాలని, అన్ని జీవుల్లోనూ దైవత్వాన్ని దర్శించాలని, అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కామం, స్వార్థం, కోరికల నుంచి విడివడితేనే భగవంతుడిని దర్శించుకోగలమని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో దారులున్నట్టే.. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయని.. రామకృష్ణ పరమహంస బోధించారు. ఇక, విదియ తిథి ఘడియల్లోనే తదియ ఘడియలు కూడా కూడి ఉన్నాయి. ఫాల్గుణ శుద్ధ తదియ నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. ఫాల్గుణ శుద్ధ చవితి మార్చి 13, బుధవారం ఫాల్గుణ శుద్ధ చతుర్థి.. మంగళకరమైన తిథి. ఈనాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డూండి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. అలాగే, సంతానాన్ని కోరే వారు ఈనాడు పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు చేసే నువ్వుల దానం కారణంగానే ఈ చతుర్థికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది. ఫాల్గుణ శుద్ధ పంచమి మార్చి 14, గురువారం ఫాల్గుణ శుద్ధ పంచమి తిథి నాడు అనంత పంచమీ వ్రతం ఆచరిస్తారు. అనంత పద్మనాభస్వామిని ఈనాడు పూజించాలి. ఈ మేరకు చతుర్వర్గ చింతామణిలో వివరాలు ఉన్నాయి. ఫాల్గుణ శుద్ధ షష్టి మార్చి 15, శుక్రవారం ఫాల్గుణ శుద్ధ షష్ఠి తిథి.. స్కంద షష్ఠి పర్వం. కుమారస్వామిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఫాల్గుణ శుద్ధ సప్తమి మార్చి 16, శనివారం ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. అర్క సంపుట సప్తమి, కామదా సప్తమి, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలను ఆచరించాలి. ఇవన్నీ సూర్య సంబంధమైన వ్రతాలు. కాగా, ఈనాడు ఆంధప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం ఈయన జీవితాంతం పాటుబడ్డారు. ఈయన 1901, మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరి జిల్లాలోని పడమటిపాలెం. 25 ఏళ్ల వయసులో భార్యను, బిడ్డను కోల్పోయిన ఈయన వైరాగ్యంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనంతరం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952, అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952, డిసెంబర్ 15న దీక్షలోనే పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. తదనంతర పరిణామాలతో అదే ఏడాది డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. ఫాల్గుణ శుద్ధ అష్టమి మార్చి 17, ఆదివారం ఫాల్గుణ శుద్ధ అష్టమి మాసిక దుర్గాష్టమి తిథి. మాసానికి రెండుసార్లు (శుద్ధ/బహుళ) వచ్చే అష్టమి నాడు సాధారణంగా దేవీ ఆరాధనకు ప్రతీతి. ఇంకా ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు దుర్గాష్టమి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు. ఫాల్గుణ శుద్ధ నవమి మార్చి 18, సోమవారం సాధారణంగా అష్టమి తిథి మాదిరిగానే నవమి తిథి కూడా దుర్గాదేవి పూజకు, ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు దుర్గాపూజ చేయాలని పలు వ్రత గ్రంథాలలో ఉంది. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మార్చి 20, బుధవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనేక విధాలుగా ప్రసిద్ధి. వీటిలో మొదట చెప్పుకోవాల్సింది ‘అమలిక ఏకాదశి’ గురించి. అమలికం అంటే ఉసిరికాయ. అంటే ఇది ఉసిరికాయతో ముడిపడిన ఏకాదశి. అందుకే ఇది అమలైక్యాదశిగా వినుతికెక్కింది. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు. అధిక మాసం లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే అమలికలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించి ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక. ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత నియమాల్లో దానికో స్థానాన్ని కల్పించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు. మన వంటకాల్లో ఏదో విధంగా ఉసిరి వాడాలనేది ఈ పర్వం ఉద్దేశం. బహుశా ఉసురు (ప్రాణం) నిలిపేది కాబట్టి తెలుగులో ఇది ఉసురుకాయ.. కాల క్రమంలో ఉసిరి కాయ అనే పేరు స్థిరపడి ఉంటుంది. అరవం, కన్నడం, మలయాళంలో దీనిని నెల్లికాయ అని పిలుస్తారు. సంస్క•తంలో ఉసిరికాయకు ఐదారు పేర్లు వరకు ఉన్నాయి. ఆమలకం (గుణమును ధరించునది), ధాత్రి (దాది వంటిది), వయస్థ (వయస్సున నిలుపునది), ఫలరవ (సారవంతమైనది), అమృత (అమృతము వంటిది), శీతఫలి ( శీతవీర్యము కలది) అనే అర్థాలు కలిగిన పేర్లు ఉసిరికాయకు ఉన్నాయి. అలాగే, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మరో విధంగా కూడా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని పురాణగాథ. దీనినే ఆంధప్రదేశ్లోని గోదావరి జిల్లాల వారు ‘కోరుకొండ ఏకాదశి’ అనీ అంటారు. కోరుకొండలో నరసింహస్వామి కోవెలలో ఈనాడు గొప్ప తిరునాళ్లు జరుగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉండిన మామిడికాయలు ఇప్పటికి కోడిగుడ్డు పరిమాణానికి ఎదుగుతాయి. ఇది చెప్పడానికే పై సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి మార్చి 21, గురువారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని చెబుతారు. ఈ ద్వాదశిని నృసింహ ద్వాదశిగానూ వ్యవహరిస్తారు. కాగా, పుష్యమితో కూడిన ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైన పర్వమే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజలు కూడా చేసే ఆచారం ఉంది. ఫాల్గుణ శుద్ధ త్రయోదశి మార్చి 22/23, శుక్ర/శనివారాలు ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి మార్చి 24, ఆదివారం ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు కూడా హోలికా దహన్ నిర్వహిస్తారు. దీనిని ‘చోటీ హోళీ’గా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మార్చి 25, సోమవారం ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు. హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు. హోలిక అనే రాక్షసి దహనమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని హేమాద్రికాండం, భవిష్యత్తు పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు అనే గ్రంథాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం.. హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు అటువంటి ప్రయత్నాలన్నిటినీ అధిగమించి క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతడి సోదరి హోలికకు ఓ పై వస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా ఆ వస్త్రం ధరించిన వారిని ఏమీ చేయదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించాలని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపచేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ మాయా వస్త్రం గాలికి ఎగిరిపోయి, చివరికి ఆ మంటల్లో ఆమే దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు. దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని ఈ వృత్తాంతం తెలియ చెబుతుంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు. భగవద్గీత, కృష్ణతత్వాన్ని విస్త•తంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు వారి జయంతి తిథి కూడా ఈనాడే. మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. ఫాల్గుణ బహుళ పాడ్యమి మార్చి 26, మంగళవారం ఫాల్గుణ బహుళ పాడ్యమినే హోలీ పర్వదినంగా కొన్నిచోట్ల భావించి ఆచరిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ తరువాత దినమే కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్లీల ఆరంభమవుతుంది. హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు తెరగుల రంగులతో పువ్వులు పొటమరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు. ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంభోత్సవ సమయం. అయితే, మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం.. పౌర్ణమి నాడే హోలీ పర్వమని పేర్కొన్నారు. ఫాల్గుణ బహుళ విదియ మార్చి 27, బుధవారం ఫాల్గుణ బహుళ విదియ కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చిన తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు. ఫాల్గుణ బహుళ తదియ మార్చి 28, గురువారం ఫాల్గుణ బహుళ తదియ తిథి కల్పాది దినం. ఈనాడు ఛత్రపతి శివాజీ జయంతి దినం. ఫాల్గుణ బహుళ చతుర్థి మార్చి 29, శుక్రవారం ఫాల్గుణ బహుళ చతుర్థి వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి. దీనినే సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు. చతుర్థి తిథి ఘడియల్లోనే పంచమి తిథి కూడా ప్రవేశిస్తోంది. ఈ కారణంగా ఇదేరోజు రంగ పంచమి వ్రతాలను ఆచరించాలి. ఫాల్గుణ బహుళ షష్టి మార్చి 31, శనివారం ఫాల్గుణ బహుళ షష్ఠి దేవసేనకు అధిపతి అయిన కుమారస్వామిని పూజించడానికి అనువైన తిథి. ప్రత్యేకించి తమిళనాట షష్ఠి నాడు ఈయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుమారస్వామి.. వివిధ ప్రాంతాల్లో స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధమై
ఎవరు గొప్ప?
పూర్వం ఒక అడవిలో అనేక రకాలైన పక్షులు ఉండేవి. అవి ఆ అడవిలో దొరికిన ఆహారాన్ని తిని సుఖంగా, స్వేచ్ఛగా జీవిస్తుండేవి. అలాగే, ఒక్కోసారి వాటికి వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండేది. వారి బారి నుంచి ఎలాగో తప్పించుకుని ఆనందంగా ఆ అడవిలో జీవిస్తుండేవి. ఇదిలాఉండగా, ఒకరోజున ఆ అడవిలోకి ఎక్కడి నుంచో ఒక ముసలి కోతి వచ్చింది. అది కొద్దికాలానికే ఆ అడవి జంతువులతో బాగా కలిసిపోయింది. వాటితో కలసిమెలసి తిరుగుతూ, తన ప్రవర్తనతో తెలివైనదని అనిపించుకుంటూ ఆ జంతువులు, పక్షుల మధ్య చెలామణి అయ్యేది. ఇలా ఉండగా, కొంతకాలానికి ఆ అడవిలోని పక్షులకు, జంతువులకు తమలో తాము ఎవరు గొప్ప అనే చర్చ జరిగింది. తాము గొప్ప అంటే తామే గొప్ప అంటూ ఇరుపక్షాలూ వాదులాడుకున్నాయి. ఎంతసేపటికీ వాటి తగవు తీరలేదు. చివరకు ఆ జంతువులు, పక్షులు అన్నీ కలిసి ముసలి కోతి వద్దకు వచ్చాయి. తమలో ఎవరు గొప్పో తేల్చి చెప్పాలని దాన్ని కోరాయి. ముసలికోతి నెత్తి గోక్కుంటూ, పేలను నోటిలో వేసుకుంటూ, వాటితో ఇలా అంది- ‘మీలో ఎవరు గొప్పో తేల్చాలంటే ముందుగా మీరు పక్షులలో పక్షులు, జంతువులతో జంతువులు ఇట్లా ఒకరితో మరొకరు యుద్ధం చేయండి. అప్పుడు ఎవరు మిగులుతారో వారే గొప్ప కింద లెక్క’. ముసలికోతి మాటలు వినడంతోనే పక్షులు, జంతువులు తమలో తాము కలహానికి దిగాయి. విచక్షణ మరిచిపోయి ఒకదానిపై మరొకటి పడి ముష్టియుద్ధానికి దిగాయి. అప్పుడు ఆ అడవి అంతా జంతువులు, పక్షుల అరుపులు, గర్జనలతో కోలాహలంగా మారిపోయింది. ఆ సమయంలో ఆ అడవికి చెంతనే గల పల్లెలో కొందరు బోయవాళ్లు ఉన్నారు. వారంతా పక్షులు, జంతువుల వేట కోసం సిద్ధంగా ఉన్నారు. ఈలోగా అడవిలోని కోలాహలమంతా వారి చెవిన పడింది. వెంటనే విల్లు బాణాలు తీసుకుని పరుగున అడవిలోకి వచ్చారు. తమలో తాము కలహించుకుంటున్న పక్షులు, జంతువులపైకి బోయవాళ్లు బాణాలు గురిపెట్టి వదిలారు. మామూలుగానైతే అవి వేటగాళ్ల ఉచ్చుకు, గురికి దొరక్కుండా తెలివిగా తప్పించుకునేవి. ఇప్పుడవి తమలో తాము దెబ్బలాడుకుంటూ వేటగాళ్ల ముప్పును గమనించలేకపోయాయి. దీంతో చాలా వరకు పక్షులు, జంతువులు వేటగాళ్ల బాణం దెబ్బలకు బలైపోయాయి. ఇన్నాళ్లూ ఒక్క పక్షీ, జంతువూ దొరకక, నిరాశతో రోజూ వెనుదిరిగిన అనుభవం గల వేటగాళ్లు దొరికిందే అదనుగా దొరికిన వాటిని దొరికినట్టు వేటాడసాగారు. ఇలా చాలా జంతువులు, పక్షులు బాణం దెబ్బలు తగిలి అక్కడికక్కడే మరణించాయి. మరికొన్ని మాత్రం తెలివి తెచ్చుకుని వేటగాళ్ల గురికి చిక్కకుండా తప్పించుకుని అడవిలోకి పారిపోయాయి. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అన్ని పక్షులు, జంతువులు కలిసి చెంపలేసుకున్నాయి. తమలో తాము కలహించుకుని, తెలివి తప్పి ప్రవర్తించడం వల్లనే వేటగాళ్లకు చిక్కి తమలోని కొన్ని జీవులు బలైపోయాయని రోదించాయి. అప్పటి నుంచి తమలో ఎవరు గొప్ప అనే భేషజాలకు పోకుండా అంతా కలసిమెలసి సుఖంగా జీవించాలని నిర్ణయించుకున్నాయి. అందరమూ సమానమనే భావంతో ఐక్యమత్యంతో జీవించాలని ప్రతినబూనాయి. నీతి: ఎవరు గొప్ప అని కాదు. అందరూ కలిసి ఉంటేనే సుఖం.
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
March 28, 2024
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40
Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia