
టెక్సాస్లోని ఇర్వింగ్లో మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం అట్టహాసంగా జరిగింది. ఇర్వింగ్లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాలో జూన్ 25న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యోగా డే ని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యూస్టన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మాట్ రినాల్డి, ఇర్వింగ్ సిటీ మేయర్ రిక్ స్టోఫర్, కాన్సుల్ అమ్రిత్ పాల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దాదాపు 5 వందల మందికి పైగా ఔత్సాహికులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాంధీ మెమోరియల్ను ఏర్పాటు చేయడంలో కృషి చేసిన ఎంజీఎంఎన్టీ ఛైర్మన్ డాక్టర్ తోటకూర ప్రసాద్ను అభినందించారు. గాంధీజీ ప్రతిరోజు ధ్యానంతో పాటు యోగా చేసేవారని దీంతో ఆయన స్వీయ క్రమశిక్షణ, ఓపిక, ధైర్యాన్ని పొందడంలో విజయం సాధించారని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు ప్రాధాన్యం లభించడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన కృషిని బోర్డు కార్యదర్శి రావు కల్వల వివరించారు. అనంతరం కార్యక్రమంలో భాగంగా ఔత్సాహికులు, అతిథులు యోగా చేశారు. ఈ సందర్భంగా అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎం.వి.రావు కల్వల, శబ్నమ్ మొగ్డిల్, లాల్ దస్వాని, బి. నరసింహా, సల్మాన్ ఫర్షోరీ మరియు జాన్ హమ్మాండ్ తదితరులు పాల్గొన్నారు.
Review ఇర్వింగ్ లో ఘనంగా యోగ డే..!.