బోనాల జాతర.. జగన్నాథ యాత

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఏడో మాసం- జూలై. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది నాలుగో మాసం. జూలై నెల.. జ్యేష్ఠ – ఆషాఢ మాసాల కలయిక. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జ్యేష్ఠ మాస తిథులు.. ఆపై జూలై 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి. శుభ ముహూర్తాల పరంగా ఆషాఢం అంతగా అనుకూలమైనది కాదని అంటారు. కానీ తొలి ఏకాదశి, యోగిని ఏకాదశి, బోనాల జాతర, గురుపూర్ణిమ వంటి పర్వాలు ఈ నెలలో ముఖ్యమైనవి. అలాగే, జగత్ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథ యాత్ర ఈ నెలలోనే నిర్వహిస్తారు.

2024- జూలై 1, సోమవారం, జ్యేష్ఠ బహుళ దశమి నుంచి
2024- జూలై 31, బుధవారం ఆషాఢ బహుళ ఏకాదశి వరకు..
శ్రీ క్రోధి నామ సంవత్సరం – జ్యేష్ఠం- వైశాఖ మాసం – గ్రీష్మ రుతువు- దక్షిణాయనం

ఆషాఢ మాసం పల్లెల్లోని అమ్మవార్ల జాతర్లకు ప్రసిద్ధి.
ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెల్లో జాతర వాతావరణం అలుముకుని ఉంటుంది. గ్రామ దేవతల పూజలతో బోనమెత్తిన పల్లెలు.. శిగాలూగే భక్తజనంతో ఆధ్యాత్మికత నెలకొంటుంది.
గృహనిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనదీ మాసం. ఈ నెలలో వచ్చే పర్వాల్లో అత్యంత విశిష్టమైనది, విష్ణువుకు ప్రీతికరమైనది.. ‘తొలి ఏకాదశి’.
ఇంకా ఈ మాసంతోనే నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మ్యాస వ్రతం శ్రీకారం చుట్టుకుంటుంది. ఆషాఢ మాసం నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.
‘ఆషాఢం’ అనే మాటకు ‘బ్రహ్మచారుల చేత ఉండే మోదుగు దండం’, ‘మలయ పర్వతం’ అని అర్థం. ఆషాఢం శూన్య మాసం. అయితేనేం సాంస్క•తిక వైశిష్ట్యాన్ని సంతరించుకున్న మాసమిది.
కొన్ని ప్రాంతాల్లో ఆషాఢ స్నానాలు ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణ విశేష ఫలితాలను ఇస్తాయని విశ్వాసం.
ఇక, తెలుగు నాట రైతుల నోట బాగా పలికే నానుడి- ‘ఆషాఢ మేఘం’. ఆకాశంలో నల్లమబ్బులు అలముకునే మాసమిది. అయితే, ఈ మేఘాలు త్వరగా కురిసేవి కావు. దట్టంగా కమ్ముకుని హడావుడి చేసి మెల్లగా చెదిరిపోతాయి.

అందుకే రైతులు ఆషాఢ మేఘాలను చూసి త్వరగా విత్తు విత్తరు. ఎందుకంటే, ఆషాఢంలోనే ప్రధానమైన ఖరీఫ్‍ సీజన్‍ ఆరంభం అవుతుంది. చినుకు పడటమే ఆలస్యం.. దుక్కిదున్ని విత్తనాలు విత్తడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. కానీ, ఆషాఢ మేఘాలు ఎంతకీ చినుకు రాల్చవు. అందుకే ఆషాఢ మేఘాలను నమ్మి సాగులో ముందుకు పోకూడదని రైతులు అంటారు.
మరోపక్క ఆషాఢ మేఘాల తీరును బట్టేనే•మో నమ్మించి మోసం చేసేవాళ్లను, అతి వినయం ఒలకబోసే వాళ్లను ‘ఆషాఢభూతు’లని అంటారు. ఇక, అతివలు అరచేతుల నిండా నఖరంజని (గోరింటాకు) సింగారించుకుని మురిసిపోయేదీ ఈ నెలలోనే!
ఆషాఢంలో సాధారణంగా శుభ ముహూర్తాలు ఉండవు. వివాహ, గృహ సంబంధ కార్యాలను ఈ నెలలో వాయిదా వేస్తారు. అయితే, ఆయా తిథులను అనుసరించి నిర్వర్తించాల్సిన పూజాధికాలు, ఆచారాలు కొన్ని ఈ నెలలో ఉన్నాయి.
ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు.
మునగ కూర బాగా తినాలని నియమం.
అలాగే, ఆషాఢంలో అనపపప్పు వాడాలని అంటారు. ఇవి రెండూ కూడా ఆరోగ్య హేతువులు. ఆషాఢం మాసంలో అల్లుడు అత్తవారి ఇంటి గడప తొక్కకూడదని, అత్తగారి ముఖం చూడకూడదని అంటారు. తెలుగు నాట బాగా ఆచరణలో ఉన్న ఆచారమిది. కొత్తగా పెళ్లయిన జంటకు ఇది విరహ మాసం. ఇద్దరూ కలవకూడదని అంటారు. ఈ నెలలో వచ్చే పర్వాల్లో అత్యంత విశిష్టమైనది, విష్ణువుకు ప్రీతికరమైనది.. ‘తొలి ఏకాదశి’. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ నెల నుంచే ఆరంభమవుతుంది. గురువును సైతం దైవంగా భావించి, ఎంచి కొలిచే మన భారతీయ గడ్డపై గురువును పూజించడానికి ఒక విశిష్టమైన రోజు ఉంది. అదే గురుపూర్ణిమ. అదీ ఈ నెలలోనిదే. ఇంకా ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథుల పరిచయం..

జ్యేష్ఠ బహుళ దశమి
జూలై 1, సోమవారం

జూలై మాసపు ఆరంభ దినమిది. ఈనాడు కుసుమ హరనాథ జయంతి. ఇతరత్రా తిథానుసారం ఈనాడు చేయాల్సిన విధాయకృత్యాలేవీ లేవు. ఇక, భారతదేశంలో ఏటా జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తుంటారు.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి
జూలై 2, మంగళవారం

ఈ తిథి యోగినీ ఏకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. కుబేరుడు ప్రతి రోజూ శివపూజ చేస్తుండే వాడు. ఆ పూజకు అతని తోటమాలి ప్రతి రోజూ పూవులు అందిస్తుండే వాడు. తోటమాలి భార్యాలోలుడై ఒకసారి పూజ వేళకు కుబేరుడికి పువ్వులు అందించలేకపోయాడు. దీంతో కుబేరుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడు కుబేరుడు ఆ తోటమాలిని కుష్ఠు రోగ పీడితుడివి కావాలని శపించాడు. ఆ వ్యాధితో బాధపడుతున్న తోటమాలి వేడుకుని ముక్తి కోరగా ఏకాదశి వ్రతాన్ని శాస్త్రయుక్తంగా ఆచరించిన ఫలితంగా కుష్ఠు రోగం నుంచి విముక్తుడయ్యాడు.
అలాగే ఈనాడు వట సావిత్రీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ తిథి ప్రకారం మర్రిచెట్టు కింద ఉన్న సావిత్రిని రాత్రి వేళ పూజించాలి. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ పూర్ణిమ నాడు, జ్యేష్ఠ అమావాస్య నాడు కూడా చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు స్త్రీలు ఉపవసించి జలముతో వటవృక్షాన్ని తడపాలి. ఆ చెట్టు చుట్టూ నూట ఎనిమిది (108) సార్లు దారం చుడుతూ ప్రదక్షిణం చేయాలి. మర్నాడు సువాసినీ స్త్రీలకు భోజనం పెట్టాలి. ఈ వ్రతం చేసే స్త్రీ సర్వదా సౌభాగ్యవతి అవుతుందని శాస్త్ర వచనం.

జ్యేష్ఠ బహుళ ద్వాదశి
జూలై 3, బుధవారం

ఈనాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. ఇది తప్ప జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, ముఖ్యమైన పూజాధికాలేమీ లేవు.

జ్యేష్ఠ బహుళ త్రయోదశి
జూలై 4, గురువారం

జ్యేష్ఠ బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వం. ఈ తిథి నాడే చతుర్దశి తిథి కూడా కూడి ఉంది. ఇది శివుడికి ప్రీతికరమైన తిథి. అలాగే ఈనాడు రోహిణి వ్రతం కూడా ఆచరిస్తారు.

జ్యేష్ఠ బహుళ అమావాస్య
జూలై 5, శుక్రవారం

జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు భోగశాయి పూజ చేయాలని అంటారు. ఈ పూజ చేసి ఉపవాసం ఉండాలి. హేమాద్రి పండితుడు ఈ పూజకు సంబంధించిన వివరాలను హేమాద్రి వ్రత ఖండంలో పేర్కొన్నారు. ఇంకా ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

ఆషాఢ శుద్ధ పాడ్యమి
జూలై 6, శనివారం

ఈనాటి నుంచి పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. అలాగే ఆషాఢ మాసానికి ఆరంభ దినమిది.

ఆషాఢ శుద్ధ విదియ
జూలై 7, ఆదివారం

పూరీ జగన్నాథస్వామి రథోత్సవం ఈనాడే. అలాగే, తెలంగాణలో ఈనాటి నుంచి బోనాల పండుగ. ఇది బోనాల పర్వానికి ఆరంభ దినం. జూలై 7వ తేదీ, ఆషాఢ శుద్ధ విదియ నాడు మొదలయ్యే ఈ పండుగ ఆపై వచ్చే ఆదివారాల్లో (జూలై 7, జూలై 14, జూలై 21, జూలై 28, ఆగస్టు 4) తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పర్వాన్నే ఆషాఢ బోనాలుగా వ్యవహరిస్తారు. తొలుత గోల్కొండలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సృష్టి, స్థితి, లయ కారణభూతమైన ఆది పరాశక్తే బోనాల ఉత్సవాల్లో ఆరాధ్య దేవత. ఈనాటి నుంచి తెలంగాణ పల్లెల్లో కొలువుదీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. వీరికి బోనం (అన్నం, ఇతర పదార్థాలతో కూడిన కుండ)లో భక్తులు మొక్కులు, నైవేద్యాలు సమర్పిస్తారు. బోనంలో వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతో కలిపిన నీరు ఉంటాయి. సాంక్రమిక వ్యాధుల నివారణకు ఈ దినుసులన్నీ ఎంతగానో ఉపకరిస్తాయి. మహిళలు మొక్కుబడులను బోనాల రూపంలో తీర్చుకుంటారు. మహంకాళి దేవతకు ఈ సంబురాల్లో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ప్రకృతి శక్తి విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. వీరి శుభ దీవెనల వల్లే గ్రామాల్లో ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. తొలుత గోల్కొండ అమ్మవారి పూజలతో బోనాల తొలి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆపై హైదరాబాద్‍ పాత నగరంలోని లాల్‍దర్వాజా అమ్మవారి జాతర, సి•కింద్రాబాద్‍ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు.
ఇక, ఆషాఢ శుద్ధ విదియ నాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క•తిక అంశాలుగా మారిపోయాయి.
జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుంటారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగన్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్‍, తులసీదాస్‍, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం.
బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు సైతం పూరీ జగన్నాథ రథోత్సవాన్ని చిత్రీకరించేందుకు దాదాపు నెల రోజుల ముందు నుంచే సన్నాహాలు చేసుకుంటాయంటే అంతర్జాతీయంగా ఈ రథయాత్ర ఎంత ప్రసిద్ధమైనదో ఊహించుకోవచ్చు. నేత్రపర్వం చేసే రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా తిలకించాలని భక్తులు భావిస్తారు. ఈసారి ఎన్నికల సమయంలో జగన్నాథుని రత్న గర్భాలయం వార్తల్లో నిలిచింది. మూడు గదులతోఉండే ఈ గర్భాలయంలో అనంతమైన ధన, కనక వస్తు భాండాగారమని, ఇందులో ఎంత ధనముందో లెక్క వేయడం కూడా సాధ్యం కాదని దీనిపై పలు కథనాలు వెలువడ్డాయి. గత కొన్నేళ్లలో దీన్ని తెరిచే యత్నాలు విఫలమయ్యాయి.

ఆషాఢ శుద్ధ తదియ
జూలై 8, సోమవారం

ఆషాఢ శుద్ధ తదియ తిథి జూలై 8, 9 తేదీల్లో కూడా కొనసాగుతోంది. మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం ఈనాటి నుంచి ఇస్లామిక్‍ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఆషాఢ శుద్ధ చవితి
జూలై 10, బుధవారం

ఆషాఢ శుద్ధ చతుర్థి.. గణేశ చతుర్థి తిథి. ఈనాడు గణపతిని పూజించాలి. ఈనాడు చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు.

ఆషాఢ శుద్ధ పంచమి
జూలై 11, గురువారం

ఆషాఢ శుద్ధ పంచమి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. సూచకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. అంటే ఇది మనకు ఇంచుమించు ఆషాఢ మాసంతో సమానమైనది. ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు. స్కందుడి (కుమారస్వామి)ని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు.
అలాగే, ఈనాడు ప్రపంచ జనాభా దినోత్సవం.

ఆషాఢ శుద్ధ షష్ఠి
జూలై 12, శుక్రవారం

ఆషాఢ శుద్ధ షష్ఠి.. స్కంద షష్ఠి, కుమారషష్ఠిగా ప్రసిద్ధి. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పిలువబడే కుమారస్వామిని పూజిస్తారు. ఈ పూజనే స్కంద వ్రతంగా వ్యవహరిస్తారు. ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని శోడశోపచారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లను మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి. ఈ వ్రతాచరణను ప్రధానంగా శరీరారోగ్యం కోసం నిర్దేశించారు. ఇక, కుమారస్వామి జన్మ వృత్తాంతంలోకి వెళ్తే.. కుమారస్వామినే స్కందుడని, కార్తికేయుడని, సుబ్రహ్మణ్యుడనే నామాంతరాలతో పిలుస్తారు. కుమారస్వామి జననం గురించి పురాణాలు భిన్న గాథలు చెబుతున్నాయి. శివ పార్వతులు మన్మథ క్రీడలో ఉండగా, వారికి తనను మించిన ప్రభావవంతుడు ఉదయిస్తాడని భయపడిన ఇంద్రుడు వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు. అగ్నిని ఆ సమయంలో చూసిన శివుడు పార్వతికి దూరం జరిగాడు. శివతేజం (వీర్యం) భూమిపై పడింది. అగ్ని దాన్ని భరించలేక గంగలో వదిలాడు. గంగ దాన్ని రెల్లు పొదల్లో జారవిడిచింది. ఆ రెల్లు పొదల్లో కుమారస్వామి జననం జరిగింది. శరవనం (రెల్లు)లో జన్మించిన కారణంగా శరవణుడయ్యాడు. కృత్తికలుగా పిలిచే ఆరుగురు ముని కన్యలు ఆ శిశువును తీసుకెళ్లి బదరికా వనంలో వదిలారు. కృత్తికలు పెంచిన వాడు కనుక కార్తికేయుడయ్యాడు.

ఆషాఢ శుద్ధ సప్తమి
జూలై 13, శనివారం

ఆషాఢ శుద్ధ సప్తమి నాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని కూడా అంటారు.

ఆషాఢ శుద్ధ అష్టమి
జూలై 14, ఆదివారం

ఆషాఢ శుద్ధ అష్టమి నాడు బోనాల పండుగలో రెండో ఆదివారం. ఆషాఢ శుద్ధ అష్టమి తిథి దుర్గాష్టమి వ్రత దినం. ఈనాడు మహిష్నాఘ్నీ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామ యాష్టమీ అని పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని అందులో ఉంది.

ఆషాఢ శుద్ధ నవమి
జూలై 15, సోమవారం

ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఐంద్రాదేవిని పూజించాలని స్మ•తి కౌస్తుభంలో వివరించారు. ఈమె కూడా శక్తి దేవతే.

ఆషాఢ శుద్ధ దశమి
జూలై 16, మంగళవారం

ఆషాఢ శుద్ధ దశమి తిథి కర్కాటక సంక్రమణ దినం. ఈనాటి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇక, ఆషాఢ శుద్ధ దశమి నాడు శాక వ్రతం ఆచరించాలి. ఈ తిథి నాటి నుంచే శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమంగా పెట్టారు. ఆరోగ్య పరిరక్షణ ఈ శాక వ్రతం ఉద్దేశం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.
ఆషాఢ శుద్ధ దశమి నాడు తిరుమల శ్రీవారికి పుష్ప పల్లకీసేవ నిర్వహిస్తారు.

ఆషాఢ శుద్ధ ఏకాదశి
జూలై 17, బుధవారం

ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రతీతి. దీనినే ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అనీ అంటారు.
ఏకాదశి నాడు భుజించే వాడు చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ పాపాన్ని పోగొట్టుకోలేడని ప్రతీతి. ఒకసారి బ్రహ్మ ఫాల భాగం నుంచి ఒక చెమట బిందువు కిందపడిందట. దాని నుంచి ఓ రాక్షసుడు పుట్టాడు.
‘ప్రభూ నాకు నివాసం చూపు’ అని ఆ రాక్షసుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ- ‘నువ్వు ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో వారి శాల్యన్నపు మెతుకులతో నివసిస్తావు. పిదప వారి కడుపుల్లోకి చేరి క్రిములుగా మారతావు’ అని చెప్పాడట.
అందువల్లే దక్షిణ భారతదేశంలో ఏకాదశి నాడు వరి అన్నం చాలామంది తినరు.
ఇక, ఆషాఢ శుద్ధ ఏకాదశి విషయానికి వస్తే- దక్షిణాయనంలో వచ్చే తొలి పర్వమిది. అందుకే ఇది తొలి ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. ఇది పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధం. కుల, వర్గ భేదాలకు అతీతంగా ఈ పండుగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం అనూచానంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవడానికి అనువైన సమయమిది. ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక పౌరాణిక గాథలు ఈ వ్రతం ఇహపరాల నడుమ సేతుబంధనం వంటిదని వర్ణించాయి. తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి నాడు ఉపవసించి యథాశక్తి భగవంతుడిని కొలవాలని ఆయా పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢ శుద్ధ ద్వాదశి
జూలై 18, గురువారం

ఆషాఢ శుద్ధ ద్వాదశిని వాసుదేవ ద్వాదశిగా వ్యవహరిస్తారు. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఈనాటి నుంచే చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవుతుంది. వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.
చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన పాలను, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, రా•మాషములు, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు. పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.
‘చతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానకారుతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణ్యం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువున చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.
భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని
పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.

ఆషాఢ శుద్ధ త్రయోదశి
జూలై 19, శుక్రవారం

ఆషాఢ శుద్ధ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

ఆషాఢ శుద్ధ చతుర్దశి
జూలై 20, శనివారం

ఆషాఢ శుద్ధ చతుర్దశి, జూలై 20, శనివారం నుంచి పునర్వసు కార్తె ప్రారంభం అవుతుంది.

ఆషాఢ శుద్ధ పూర్ణిమ
జూలై 21, ఆదివారం

ఆషాఢ శుద్ధ పూర్ణిమ తిథి గురుపూర్ణిమ తిథి. సనాతన హైందవ సమాజంలో తల్లిదండ్రుల తరువాత స్థానం గురువులదే. అందుకే ఈనాడు గురువులను పూజించి, గౌరవిస్తారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమ నాడే వేదవ్యాసుడు జన్మించాడని, ఈ కారణంగానే దీనికి వ్యాస పూర్ణిమ అనే పేరు వచ్చిందని అంటారు. మహా భారత గ్రంథకర్త•, అష్టాదశ పురాణ గ్రంథకర్త అయిన వ్యాసుని ఈనాడు విశేషంగా పూజిస్తారు. వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని చెబుతారు.
చాతుర్మ్యాస కాలారంభంలో వచ్చే తొలి పౌర్ణమే గురుపూర్ణిమ కావడం విశేషం. తమకు సమీపంగా నివసిస్తున్న తపస్సంపన్నులను పూజించి, జ్ఞానాన్ని సంపాదించే ఆచారానికి గురుపూర్ణిమ ఒక భూమికగా నిలుస్తుంది. గురుపూజ శ్రేష్టమైనది. అందుకే ఈ పూర్ణిమ నాడు వేదవ్యాసుడితో పాటు జగద్గురు ఆదిశంకరుల వారిని, షిర్డీ సాయిబాబాను, దత్తాత్రేయుడిని, ఇతర గురుపరంపరలోని శ్రేష్ఠులను పూజించడం ఆనవాయితీ. ముఖ్యంగా దక్షిణాదిలోని కుంభకోణంలో, శృంగేరిలో ఈనాడు శంకర పీఠాలు అత్యంత వైభవంతో వెలుగొందుతాయి.
అలాగే, మన తెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలోని పూర్వ మహబూబ్‍నగర్‍ జిల్లా కసుమర్తి గ్రామంలో భీమా నది కృష్ణా నదిలో కలిసే చోట చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ జితేంద్రరాయ పేరిట దైవం ఉంది. వ్యాస పూర్ణిమ నాడు ఇక్కడ జాతర నిర్వహిస్తారు.
ఇంకా ఈనాడు శివ శయన వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కోకిలా వ్రతాన్ని కూడా ఆచరిస్తారని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

ఆషాఢ బహుళ పాడ్యమి
జూలై 22, సోమవారం

ఆషాఢ బహుళ పాడ్యమి తిథి నాడు మృగశీర్షా వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు కోకిలా వ్రతాన్ని ఆచరించాలని కూడా అందులో ఉంది. చతుర్వర్గ చింతామణిలో- ఆషాఢ బహుళ పాడ్యమి నాడు ధర్మావాప్తి వ్రతం ఆచరించాలని రాశారు.

ఆషాఢ బహుళ విదియ
జూలై 23, మంగళవారం

ఆషాఢ బహుళ విదియ తిథి నాడు ఆచరించాల్సిన పూజ గురించి.. ‘క్షీరసాగరే సలక్ష్మీ మధుసూదన పూజ’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో వర్ణించారు. అంటే, దీనిని బట్టి ఈనాడు లక్ష్మీ సహిత మధుసూదనుడిని పూజించాలని తెలుస్తోంది. ఇంకా ఈనాడు అష్టనాగ పూజ, మానస పూజ నిర్వహించాలని వేర్వేరు గ్రంథాల్లో ఉంది. మరికొన్ని గ్రంథాలు ఆషాఢ బహుళ విదియ తిథి విజయతీర్థ పుణ్యదినమని పేర్కొంటున్నాయి.

ఆషాఢ బహుళ అష్టమి
జూలై 28, ఆదివారం

ఈ తిథి రౌచ్య మన్వంతరాది తిథి. రౌచ్యుడు పదమూడవ మనువు. అతనికి రేచ్చుడు అనే మరో పేరు కూడా ఉంది. ఈయన రుచి అనే వాని కుమారుడు. మొదట రుచి మహర్షి వివాహం చేసుకోలేదు. అందువల్ల ఒకనాడు పితరులు అతనికి కనిపించి పెళ్లి చేసుకుని సంతానం పొందాలని చెబుతారు. ఈ క్రమంలో అతను బ్రహ్మ ఆదేశానుసారం మాలిని అనే అప్సరస కుమార్తెను వివాహమాడతాడు. ఫలితంగా ఆయనకు ఒక కొడుకు పుడతాడు. అతనే రేచ్చుడనే పేరుతో త్రయోదశి మన్వంతరాధి పత్యం వహిస్తున్నాడు. ఈ మన్వంతరానికి దివస్పతి నామకుడు ఇంద్రుడు. ధృతిమంతుడు, తత్త్వదర్శి మున్నగు వారు సప్తర్షులు.

ఆషాఢ బహుళ నవమి
జూలై 29, సోమవారం

ఆషాఢ బహుళ నవమి.. సాధారణంగా నవమి తిథి దుర్గాపూజకు ఉద్దేశించినది. ఈనాడు అమ్మవారిని ఆరాధించడం రివాజు.

ఆషాఢ బహుళ ఏకాదశి
జూలై 31, బుధవారం

ఆషాఢ బహుళ ఏకాదశి.. కామికైకాదశి పర్వం. దీనినే కామిక ఏకాదశి అనీ అంటారు. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని కామదైకాదశి అని వర్ణించారు. ఈనాటి ఏకాదశీ వ్రతాచరణం వల్ల అభీష్టాలు నెరవేరుతాయని అంటారు. .‘కామ’ అంటే కోరిక అని అర్థం. మనసులోని కోరికలను సిద్ధింపచేసే ఏకాదశి కాబట్టి ఇది కామిక ఏకాదశి అయింది. విష్ణువును ఆరాధించడం, తులసీ దళాలతో ఆయనను పూజించడం, వెన్నను దానం చేయడం వంటి ఈ ఏకాదశి ప్రత్యేకతలు. ఈనాడు శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్య ఫలం కాశీలోని గంగాస్నానం కన్నా, హిమాలయాలలో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దాని కన్నా, గురు గ్రహం సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారం గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. ఈ ఏకాదశి నాడు పాలు ఇచ్చే ఆవును, దూడ, గ్రాసంతో కలిసి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. గతంలో చేసిన పాపాలకు భయపడే వారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఇక, కామిక ఏకాదశి నాడు జారగణ చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు రాత్రంతా నిద్రపోకుండా జాగరణ ఉండే వారు యమధర్మరాజు కోపానికి గురికారని అంటారు. అలాగే, తులసీ మాతను కూడా ఈనాడు ఆరాధిస్తారు. తులసీ పూజ చేసే వారి పుణ్యాన్నే తప్ప పాపాన్ని చిత్రగుప్తుడు లెక్కలోనికి తీసుకోడని అంటారు.

Review బోనాల జాతర.. జగన్నాథ యాత.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top