Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page
ఆడుతూపాడుతూ.. చదవాలి..గెలవాలి!
నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ఈ మాసపు ప్రత్యేక కథనమిది..
ఏ పిల్లాడూ బడికెళ్లనని మారాం చేయడు.. నడుం వంగిపోయే బరువుతో బ్యాగులు మోస్తూ ఏ విద్యార్థీ కనిపించడు. యూనిఫాం, హోంవర్కులూ, వార్షిక పరీక్షలూ మార్కులూ, ర్యాంకుల పోటీ, రోజంతా సాగే స్కూలు.. స్టడీ అవర్లూ, ట్యూషన్లూ.. ఇవేవీ అక్కడ కనిపించవు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులను కష్టపెట్టే ఏ చిన్న విధానమూ అక్కడ అమలు చేయరు. అయితేనేం.. ప్రపంచంలోని అత్యుత్తమమైన, అత్యద్భుతమైన విద్యావ్యవస్థ అక్కడుంది. ఈ విషయంలో ప్రపంచంలోనే తొలి స్థానం సంపాదించింది. బాగా చదివే విద్యార్థీ.. మాదిరిగా చదివే విద్యార్థీ.. అంటూ అక్కడ తారతమ్యాలేవీ లేవు. అక్కడ ప్రతి విద్యార్థీ టాపరే. ఇదంతా ఎక్కడంటే ఫిన్లాండ్లో. పిల్లల్ని స్కూలుకు పంపే తల్లిదండ్రులూ.. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులూ.. ఫిన్లాండ్ దేశ విద్యా విధానం గురించి, అక్కడ అనుసరిస్తున్న పద్ధతుల గురించి తెలుసుకోవడం తప్పనిసరి.
ఒకటీ.. ఒకటీ.. ఒకటీ..
రెండు.. మూడు.. మూడు..
నాలుగు..
పదిలోపు వంద ర్యాంకులు..
వెయ్యిలోపు పదివేల ర్యాంకులు..
పరీక్ష ఏదైనా.. పోటీ ఏదైనా.. ఫలితం మా విద్యాసంస్థదే..
మన తెలుగు రాష్ట్రాల్లో వార్షిక, పోటీ పరీక్షలు ఫలితాలు వెలువడినప్పుడల్లా టీవీల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిపోయే ఆయా విద్యాసంస్థల ప్రకటనలివి.. ఏ దినప•త్రికలు తిరగేసినా కనిపించే అడ్వర్టైజ్మెంట్లు ఇవి..
ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో.. మంచి ర్యాంకులు వచ్చిన పిల్లలే పోటీ ప్రపంచంలో మనుషుల్లా కనిపిస్తున్నారు. టాప్ ర్యాంకు వచ్చిన వాళ్లనే సమాజం నెత్తిన పెట్టుకుంటోంది. క్రికెట్లో కోహ్లీలా బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్నా.. నటనలో వర్ధమాన హీరోలను తలదన్నే టాలెంట్ ఉన్నా.. చదువుల్లో మాత్రం మంచి మార్కులు, మంచి ర్యాంకు రాకపోతే మన సమాజం దృష్టిలో ఆ పిల్లాడు మొద్దావతారమే. అందుకే మన దేశంలో చాలామంది చిన్నారులు అంకెల వేటలో పడి
అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు. పరీక్షలో అనుకున్న మార్కుల కంటే పది మార్కులు తగ్గితే మహా పాపం చేసినట్టుగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆరాటాలు, విద్యాసంస్థల ఒత్తిడీ కలిసి మన విద్యార్థుల పరిస్థితిని దయనీయంగా మార్చేస్తున్నాయి.
బుల్లి దేశం.. ప్రపంచానికే పెద్ద పాఠం!
ర్యాంకుల కోసం విద్యార్థులపై మన దేశ విద్యా వ్యవస్థలో ప్రయోగించే సామ దాన భేద దండోపాయాలెన్నో! అయినా మనం సాధించలేకపోతున్న ఉత్తమ ఫలితాలను ప్రపంచంలో అత్యుత్తమ విద్యావ్యవస్థ కలిగిన దేశంగా పేరున్న ఫిన్లాండ్ ఆడుతూపాడుతూ సాధించేస్తోంది. ఐరోపాలోని ఓ చిన్న దేశమైన ఫిన్లాండ్ విద్యార్థులపై ఏమాత్రం ఒత్తిడి పెట్టకుండానే వాళ్లను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చని నిరూపిస్తోంది. పరీక్షలు, ర్యాంకుల ప్రస్తావన లేకుండానే వాళ్లను ఇంజినీర్లూ, డాక్టర్లూ ఇతర వృత్తి నిపుణులుగా తయారుచేస్తోంది. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లండ్లాంటి దేశాలకు కూడా పిల్లల్ని చదివించే విషయంలో ఫిన్లాండ్ కొత్త పాఠాలు నేర్పిస్తోంది. ఏటా తన బోధనా పద్ధతులను మార్చుకుంటూ, కొత్త ప్రమాణాలను అందుకుంటూ గత 45 ఏళ్లలో అక్కడి విద్యావ్యవస్థ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. మూడేళ్లకోసారి విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించే ‘పోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసెస్మెంట్’ (పిసా) లెక్కల్లో అమెరికా, జపాన్, చైనాలాంటి దిగ్గజ దేశాలను దాటి చిట్టి దేశమైన ఫిన్లాండ్కు చెందిన పిల్లలు వరుసగా తొలి స్థానాన్ని సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థీ కలలుగనే తరగతి గదులూ, ప్రతి పాఠశాలా అనుసరించాల్సిన విధానాలూ, అందరు తల్లిదండ్రులూ పాటించాల్సిన నియమాలూ ఫిన్లాండ్ సొంతం..
చదవడానికెందుకు తొందర.. ముందు ‘ఎదగాలి’!
మన దేశంలో తల్లిదండ్రులు పిల్లలకు రెండేళ్లు దాటగానే రెక్కపట్టుకుని స్కూళ్లో పడేస్తారు. ఏడాది దాటగానే మొదట స్కూళ్ల వేట మొదలుపెడతారు. స్కూలుకు పంపడానికి ముందే అ..ఆలు, ఏబీసీడీలు ఇంట్లోనే బట్టీ పట్టిస్తారు. కానీ ఫిన్లాండ్లో పిల్లలు స్కూల్లో అడుగుపెట్టాలంటే కనీసం ఏడేళ్లు నిండాల్సిందే.. అప్పటి వరకూ వాళ్లు పలకా బలపం, పుస్తకాలూ, పెన్సిళ్లూ పట్టుకోరు. అలాగని నేర్చుకునే వయసునీ వృథా చేసుకోరు. డే కేర్ సెంటర్లలో ఉంటూ తమ మెదడుకు పదును పెట్టుకునే పనిలో పడతారు. సాధారణంగా తొలి ఆరేళ్లలోనే పిల్లల మెదడు కణాలు 90 శాతం విచ్చుకుంటాయి. దేన్నయినా త్వరగా గ్రహించే శక్తి పెరుగుతూ వస్తుంది. అన్ని దేశాల్లో ఆరేళ్లలోపు వయసులోనే పిల్లలకు లెక్కలు, సైన్స్లాంటి అంశాలకు సంబంధించిన ప్రాథమిక విషయాలు బోధిస్తారు. ఫిన్లాండ్లో మాత్రం తొలి ఆరేళ్లలో పాఠాలకు బదులుగా పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. అందరితో కలిసి ఆడుకోవడం, పద్ధతిగా తినడం, నిద్రపోవడం, ఒకరికొకరు సహాయపడటం, శుభ్రత పాటించడం, భావవ్యక్తీకరణ నైపుణ్యం, జాలీ, దయా, సామాజిక స్ప•హ.. ఇలాంటి అన్ని జీవన నైపుణ్యాలను అలవరచుకునేలా ప్రోత్సహిస్తారు. బడికి ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ, మంచి పౌరుడిగా ఎదగడానికి పునాది మాత్రం పసి వయసులోనే పడాలనేది ఫిన్లాండ్వాసుల నమ్మకం. అందుకే తొలి ఆరేళ్లను దాని కోసమే కేటాయిస్తారు. ‘నేర్చుకోవాల్సిన వయసు వచ్చినపుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు. తొందరపెట్టి వాళ్లలో ఒత్తిడి పెంచాల్సిన పని లేదు’ అంటారు అక్కడి ఉపాధ్యాయులు.
చదువు ఉచితం.. నైపుణ్యాలు సొంతం
ఉన్నత విద్యావంతులే మంచి పౌరులుగా మారతారు. అలాంటి ప్రజలున్న దేశమే ఉన్నతంగా ఎదుగుతుందనేది ఫిన్లాండ్ నమ్మిన సిద్ధాంతం. అందుకే ఆ దేశంలో పుట్టిన ప్రతి చిన్నారి చదువు బాధ్యతనూ ప్రభుత్వమే మోస్తుంది. ఎనిమిది నెలల వయసులో డే కేర్ సెంటర్లో కాలు పెట్టినప్పటి నుంచి పాతికేళ్ల తరువాత యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకునేంత వరకూ రూపాయి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికీ ఆ దేశం ఉచిత విద్యనందిస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు పాఠశాలల ఊసే అక్కడ వినిపించదు. చిన్న కార్మికుడి నుంచి దేశాధినేత వరకూ అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని బయటకు రావాల్సిందే. పుట్టుకతో ఎంత సంపన్నులైనా చదువు విషయంలో మాత్రం అక్కడి పిల్లలంతా సమానమే. చిన్న పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకూ అన్ని స్కూళ్లలో ఒకే తరహా శిక్షణ, బోధన పిల్లలకు అందుతుంది. పిల్లలంతా సమాన నైపుణ్యాలతో ఎదుగుతారు.
పల్లె నుంచి పట్నం దాకా ఒకేటే విధానం.. ఒకే పాఠం
మనకు తెలిసిన వారికెవరికైనా పిల్లలు పుట్టారంటే జాన్సన్ బేబీపౌడర్ సెట్టూ, స్వెట్టర్లూ, ఉగ్గు గిన్నె, ఉయ్యాల, శిశువుకు సరిపడా దుస్తులు.. ఇలాంటివే మనం కానుకలుగా ఇస్తాం. ఫిన్లాండ్లో మాత్రం బిడ్డ పుట్టాక ఆస్పత్రి నుంచి వెళ్లేటపుడు వైద్యులు మూడు పుస్తకాలను తల్లిదండ్రుల చేతిలో పెడతారు. పిల్లల్ని బాగా చదివిస్తూనే తల్లిదండ్రులూ పుస్తకాల్ని చదివే అలవాటు కొనసాగించాలని సూచిస్తూ ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలంటే తొలి రోజుల్లో తల్లి సంరక్షణ చాలా కీలకం. అందుకే అన్ని సంస్థలూ తప్పనిసరిగా ఎనిమిది నెలల ప్రసూతి సెలవుల్ని
మహిళలకు అందిస్తాయి. ఆ తరువాత కూడా ఉద్యోగానికి వెళ్లని తల్లులు ఆదాయం గురించి బెంగపడకుండా మూడేళ్ల పాటు ‘డే కేర్ అలవెన్స్’ పేరుతో ప్రభుత్వం కొంత డబ్బుని చెల్లిస్తుంది. కానీ, ఆ అవకాశాన్ని ఉపయోగించుకునే తల్లుల సంఖ్య అక్కడ ఐదు శాతంలోపే. దానికి కారణం ప్రభుత్వ పరిధిలో ఉచితంగా పనిచేసే ‘డే కేర్’ కేంద్రాలే. ఎనిమిది నెలల వయసు నుంచి ఆరేళ్లు వచ్చే వరకూ పిల్లలంతా ఆ ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో హాయిగా పెరగొచ్చు. అక్కడ ప్రతి పన్నెండు మంది పిల్లలకూ ఓ టీచర్, ఇద్దరు నర్సుల చొప్పున అందుబాటులో ఉంటారు. చిన్నారుల ఆలనాపాలనతో పాటు వాళ్లలో జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యతనూ వాళ్లే తీసుకుంటారు. దాదాపు ఐదేళ్ల పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర పన్నెండు మంది పిల్లలు పెరుగుతారు. తల్లిదండ్రుల తరువాత పిల్లలకు అంతటి అనుబంధం టీచర్లతోనే అల్లుకుంటుంది. దాంతో వాళ్ల స్వభావాన్నీ, సామర్థ్యాన్నీ అర్థం చేసుకుని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు దొరుకుతుంది. ఆ ఐదేళ్లూ తరగతి గది పాఠాలు పిల్లల దగ్గరికి రావు. పక్షలూ, జంతువులూ, చెట్లూ, మనుషులూ, ఆహారం.. ఇలా చుట్టూ కనిపించే అంశాల గురించే పిల్లలకు నేర్పిస్తారు. సంరక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తయ్యాక కూడా ఏ స్కూల్లో చేర్పించాలా అని తల్లిదండ్రులు తలలు పట్టుకోవాల్సిన పనిలేదు. పల్లె నుంచి పట్నం దాకా ప్రతి స్కూలుకీ ప్రభుత్వం నుంచి ఒకే స్థాయిలో నిధులు అందుతాయి. ఒకే తరహా విద్యార్హతలూ, సామర్థ్యమున్న ఉపాధ్యాయులు ఉంటారు. అన్ని పాఠశాలల్లో ఒకేలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి అక్కడన్నీ మంచి స్కూళ్లే!.
నిర్బంధమే కానీ.. స్వర్గధామమే!
ఏడేళ్ల వయసు నుంచి పదహారేళ్ల వరకూ అంటే ఒకటి నుంచి తొమ్మిదో గ్రేడ్ దాకా ప్రతి ఒక్కరూ కచ్చితంగా చదువుకుని తీరాలన్నది ఫిన్లాండ్లో తూచా తప్పకుండా అమలయ్యే నిబంధన. అందుకే ప్రస్తుత తరంలో అక్కడ నిరక్షరాస్యులు ఒక్కరంటే ఒక్కరు కూడా అక్కడ కనిపించరు. పేరుకే అది నిర్బంధ విద్య. ఆచరణలో మాత్రం అక్కడి తరగతి గదులు పిల్లల పాలిట స్వర్గధామాలే. ఒంటి మీద రంగురంగుల దుస్తులుంటేనే పిల్లలకు ఉత్సాహం. అందుకే అక్కడ స్కూళ్లలో ఏకరూప దుస్తుల (యూనిఫాం) విధానాన్ని పక్కన పెట్టేశారు. చదువూ, పుస్తకాలూ పిల్లలకెప్పుడూ భారం కాకూడదని ‘హోం వర్క్’ పద్ధతినీ తీసేశారు. ఆరో తరగతి దాకా పిల్లలు ఇంటి దగ్గర పుస్తకం తెరవాల్సిన పనిలేదు. ఆపై తరగతుల వాళ్లకు ఇచ్చే హోంవర్క్ను పూర్తి చేయడానికి అరగంటకు మించి సమయం పట్టకూడదనేది మరో ప్రధాన నియమం. పిల్లల నిద్రకు ఫిన్లాండ్ చాలా ప్రాధాన్యమిస్తుంది. అందుకే పాఠశాలల గేట్లు తొమ్మిది తరువాతే తెరుచుకుని మధ్యాహ్నం రెండున్నరకల్లా మూతబడతాయి. అంటే హైస్కూల్ పూర్తయ్యే దాకా అక్కడి పిల్లలకు నిత్యం ఒంటిపూట బడులే. రోజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు పీరియడ్లకు మించి జరగవు. ప్రతి పీరియడ్ మధ్యలో కనీసం పదిహేను నిమిషాల విరామం ఉంటుంది. ఆ సమయంలో ఠంచనుగా పిల్లలకు చిరుతిళ్లు అందుతాయి. రోజుకో గంట ఆటల విరామమూ తప్పనిసరి. పిల్లల భోజనం గురించి తల్లిదండ్రులు బెంగపెట్టుకోనక్కర్లేదు. చదువు పూర్తయ్యే దాకా చక్కని పోషకాహారాన్ని పిల్లలకు ఇష్టమైన రుచుల్లో ప్రతిరోజూ ప్రభుత్వమే పూర్తి ఉచితంగా అందిస్తుంది.
తేడాల్లేవ్.. అందరూ ఒకటే..
‘అందరూ సమానంగా చదవాలి. అందరూ టాపర్లు కావాలి’ అనేది ఫిన్లాండ్ విద్యాశాఖ లక్ష్యం. అందుకే విద్యార్థుల మధ్య హెచ్చుతగ్గులను ఎత్తిచూపే పరీక్షలూ, మార్కుల విధానానికి ఆ దేశం పూర్తిగా దూరం. అన్ని దేశాల్లో మాదిరిగా త్రైమాసిక, వార్షిక పరీక్షలంటూ పిల్లలకు పితలాటకాలుండవు. ఒక్కో తరగతిలో 15 - 20కి మించి విద్యార్థులు ఉండటానికి వీల్లేదు. కనీసం నాలుగు తరగతుల వరకూ ఒకే ఉపాధ్యాయుల బృందం పిల్లలకు పాఠాలు చెబుతుంది. అంటే వరుసగా నాలుగేళ్ల పాటు పిల్లల సామర్థ్యం, తెలివితేటలు, సబ్జెక్టులపై పట్టులాంటి అంశాల గురించి టీచర్లకు అవగాహన కలుగుతుంది. దాంతో పిల్లల్లోని లోపాలను సరిచేస్తూ ఏటికేడు వాళ్లని మెరుగుపరచడానికి కావాల్సినంత సమయమూ టీచర్లకు దొరుకుతుంది. ఒకట్రెండు పరీక్షలతో కాకుండా ఎప్పటికప్పుడు రకరకాల అంశాల్లో విద్యార్థులు చూపే ప్రతిభ ఆధారంగా వాళ్ల సామర్థ్యాన్ని టీచర్లు అంచనా వేస్తారు. ఏడాది చివరిలో గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టినా, వాటిలో మార్కుల్ని మాత్రం బయటపెట్టరు. అంటే పరీక్షలు రాసేది విద్యార్థులైనా వాటి ద్వారా తామెంత బాగా చెబుతున్నదీ, తాము చెబుతున్న విషయాలను పిల్లలు ఏ మేరకు అర్థం చేసుకుంటున్నారన్నదీ టీచర్లు అంచనా వేసుకుంటారు. ఆ జవాబు పత్రాల ఆధారంగా మరుసటి ఏడాది తమ శిక్షణ తీరులో మార్పులు చేసుకుంటారు. మొత్తంగా ఒక్కో తరగతి మారే కొద్దీ విద్యార్థుల విజ్ఞానంతో పాటు వ్యక్తిత్వాన్నీ పెంపొందించడమే లక్ష్యంగా ఫిన్లాండ్ విద్యా విధానం సాగుతుంది.
‘పెద్ద పరీక్ష ఒక్కటే..
పదహారేళ్లు వచ్చే వరకూ పరీక్షలే తెలియకుండా పెరిగిన విద్యార్థులు, తొమ్మిదో గ్రేడ్ చివరిలో తమ జీవితంలో ‘పెద్ద పరీక్ష’ రాస్తారు. పై చదువులకు వెళ్లాలంటే అది పాసై తీరాల్సిందే. అపరిమితమైన పాఠాలూ, పిల్లలకు భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగపడని అంశాలూ ఫిన్లాండ్ విద్యా వ్యవస్థలో కనిపించవు. రోజువారీ వృత్తుల్లో ఉపయోగపడే లెక్కలూ, సైన్స్కి సంబంధించిన అంశాలను పరిమితంగానే వారికి నేర్పిస్తారు. పరీక్షలు కూడా విద్యార్థులు బుర్రలు బద్దలుకొట్టుకునేంత కఠినంగా కాకుండా, ఆయా అంశాల్లో వారి ప్రాథమిక జ్ఞానాన్ని పరీక్షించేవిగానే ఉంటాయి. అందుకే పరీక్షల్లో తప్పే విద్యార్థులు దాదాపుగా ఉండరు. తొమ్మిదో గ్రేడ్ తరువాత చదువు కొనసాగించాలా వద్దా అన్నది పిల్లల ఇష్టం. ఉన్నత డిగ్రీలు చదవాలనుకునే వాళ్లు ‘అప్పర్ సెకండరీ ఎడ్యుకేషన్’ కాలేజీల బాట పడతారు. చదువుపై ఆసక్తి లేని వాళ్లు వొకేషనల్ కోర్సుల్లో శిక్షణ తీసుకుని జీవితాల్లో స్థిరపడతారు. రెండిట్లో ఏ దారి ఎంచుకున్నా, ఆ ఫీజుల భారమంతా ప్రభుత్వానిదే. మొత్తంగా చదువు పూర్తయ్యే వరకూ పిల్లల ఖర్చులూ, పాఠశాలలో విద్యా ప్రమాణాల గురించి ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉండదు. పోటీ, ఒత్తిడిలో పడిపోయి బాల్యాన్ని కోల్పోవాల్సిన ఆగత్యం పిల్లలకూ ఉండదు.
మన దగ్గర బతకలేక బడిపంతులు.. అక్కడ సూపర్స్టార్
మన దేశంలో ‘బతకలేక బడిపంతులు’ అనేది నానుడి. ఫిన్లాండ్లో మాత్రం ‘బతకాలంటే బడిపంతులే’ అనేది ఒరవడి. ఆ దేశంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తుల్లో వైద్యుల తరువాత స్థానం ఉపాధ్యాయులదే. జీతాల విషయంలోనూ అదే వరస. టాలెంట్ ఉన్న టీచర్లను ఆ దేశం నెత్తిన పెట్టుకుంటుంది. తమ ఎదుగుదలకు ముఖ్య కారణం మంచి ఉపాధ్యాయులే అని ఆ దేశం బల్లగుద్ది మరీ చెబుతుంది. అందుకే ఫిన్లాండ్లో బోధన ఓ ‘స్టార్ ఉద్యోగం’. కుర్రాళ్లంతా టీచర్లుగా మారడానికి ఉవ్విళ్లూరతారు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచే దాని కోసం కసరత్తు ప్రారంభిస్తారు. కానీ, ఆ ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. ఓ ఆరు నెలలు పుస్తకాలు తిరగేసి, పరీక్ష రాసి టీచర్ అయిపోదామంటే అక్కడ కుదరదు. ఎలిమెంటరీ స్కూల్ టీచర్గా చేరాలంటే కనీసం మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సెకండరీ స్కూల్ టీచర్లకైతే పీహెచ్డీ తప్పనిసరి. ఏటా టీచర్ పోస్టులకు వచ్చే దరఖాస్తుల్లో కేవలం పది శాతమే తుది పరిశీలనకు ఎంపికవుతాయి. వాటిని జల్లెడ పడితే ఎక్కువ శాతం మంది వివిధ యూనివర్సిటీల టాపర్లే కనిపిస్తారు. ఉద్యోగ ప్రవేశ పరీక్ష ద్వారా వాళ్లలోంచి ఇంకొందరిని ఎంపిక చేస్తారు. ఆ తరువాత దశ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిత్వం, విజ్ఞానం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తారు. కేవలం జీతం కోసం కాకుండా బోధనపైన మక్కువతో ఆ వృత్తిలో అడుగుపెట్టే వారినే చివరికి ఎంపిక చేస్తారు. రెండు మూడు నెలల పాటు సాగే ఈ పక్రియ మన సివిల్ సర్వీసు అభ్యర్థుల ఎంపిక విధానానికి ఏమాత్రం తీసిపోదు. ఎంపికైన టీచర్లకు ఏడాది పాటు పిల్లలకు బోధించే విధానాలపైన శిక్షణ ఉంటుంది. అన్ని కఠినమైన దశలను దాటి వస్తారు కాబట్టే టీచర్లంటే అక్కడి వాళ్లకి అంత గౌరవం. పిల్లకు శిక్షణ ఇవ్వడం తప్ప శిక్షించే సంస్క•తి అక్కడి స్కూళ్లలో కనిపించదు. ఆ గురువులపైన అంత నమ్మకం ఉండబట్టే అక్కడ ‘పేరెంట్-టీచర్ సమావేశాలూ’ ఉండవు.
ఎంత తక్కువో అంత ఎక్కువ..
‘లెస్ ఈజ్ మోర్’ అనేది ఫిన్లాండ్ ప్రజల జీవన సూత్రం. అందుకే పసి మెదళ్లపైన గుదిబండలా మారే మార్కులూ, ర్యాంకులూ, గ్రేడ్ విధానాలూ, టాపర్లూ, మొద్దులూ అనే తారతమ్యాలూ, పేదాగొప్పా తేడాలూ, మంచి స్కూళ్లూ- చెడ్డ స్కూళ్లూ అన్న భేదాలూ, పల్లెలు - పట్టణాలూ అనే వ్యత్యాసాలూ అక్కడి వ్యవస్థలో లేవు. పిల్లలంతా ఒక్కటే. వాళ్లకు అందాల్సిన విద్యా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా ఆ దేశం అనుసరిస్తోంది. పాఠ్య పుస్తకాన్ని పిల్లల చేతిలో పెట్టడానికి ముందే వారి వ్యక్తిత్వాన్ని నిర్మించే పాఠాలకు అక్కడ పునాది పడుతోంది. మంచి విద్యార్థులనూ, మంచి పౌరులనూ దేశానికి అందించడానికి పిల్లల దృష్టిలో చెడ్డ తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా మిగలాల్సిన అవసరం లేదని ఫిన్లాండ్ నిరూపిస్తోంది.
అన్నింటా ఫైన్.. ఫిన్లాండ్!
ఆ మధ్య కనెక్టికట్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక అక్షరాస్యత కలిగిన దేశాల్లో తొలి స్థానం ఫిన్లాండ్ది. చదువుతో పాటు చదువుకున్న వాళ్ల వ్యవహారశైలినీ పరిగణనలోకి తీసుకుని నిర్వహించిన నాగరిక దేశాల సర్వేలోనూ ఈ దేశానికే తొలి స్థానం దక్కింది.
• తరగతిలోని విద్యార్థుల మధ్య ప్రతిభ విషయంలో అతి తక్కువ వ్యత్యాసం ఉన్న దేశం ఫిన్లాండే. తెలివైన విద్యార్థుల కంటే, త్వరగా పాఠాలను అర్థం చేసుకోలేని పిల్లల దగ్గరే టీచర్లు ఎక్కువ సమయం గడపడం, సగటున పదిహేను మంది పిల్లలకు ఒకే టీచర్ ఉండటం దానికి కారణం. ప్రతిభ ఆధారంగా పిల్లల్ని వేర్వేరు సెక్షన్లలో కూర్చోబెట్టే పద్ధతి ఆ దేశంలోని విద్యావిధానంలో లేదు.
• ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ బోధనా గంటలు, స్కూళ్లకు ఎక్కువ సెలవులు ఉన్న దేశం కూడా ఫిన్లాండే. అక్కడ స్కూళ్లు గరిష్టంగా 180 రోజులు మాత్రమే పనిచేస్తాయి. భారత్లో దాదాపు 240 రోజుల పాటు స్కూళ్లు తెరిచి ఉంటాయి. అక్కడ సగటున ఒక ఉపాధ్యాయుడు ఏడాదికి 600 గంటల పాటు పాఠాలు చెబుతాడు. అదే మన దేశంలో ఆ సంఖ్య దాదాపు 1,700 గంటలు.
• భవిష్యత్తులో విద్యార్థుల వృత్తిగత జీవితంలో పెద్దగా ఉపయోగపడని జాగ్రఫీ, హిస్టరీలాంటి కొన్ని సబ్జెక్టులను సిలబస్ నుంచి తప్పించాలని ఇటీవల నిర్ణయించారు. వాటి స్థానంలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న సాంకేతికత, సమకాలీన అంశాల గురించి బోధిస్తారు.
• ఫిన్లాండ్లో స్కూల్ సిలబస్ను తయారు చేసే బాధ్యత పూర్తిగా టీచర్లదే. వివిధ ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త పాఠ్యాంశాలను చేరుస్తూ, పాత వాటిని తొలగిస్తూ ఉంటాయి.
• ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో పిల్లల పుస్తకాలను ప్రచురించే దేశం ఫిన్లాండ్దే. ప్రతి సిటీ బస్సులో, రైల్లో ఓ పుస్తకాల స్టాండ్ కనిపిస్తుంది. విదేశీ కార్యక్రమాలను అనువదించకుండానే అక్కడి టీవీల్లో ప్రసారం చేస్తూ వాటి కింద సబ్టైటిళ్లు వేస్తారు. టీవీ చూస్తూనే పిల్లలు స్థానిక భాషను చదవడం నేర్చుకునేందుకే ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు.
• పదకొండేళ్లు వచ్చాకే ఫిన్లాండ్ పిల్లలకు ఇంగ్లిష్ పాఠాలు మొదలవుతాయి. అప్పటి దాకా బోధనంతా ఫిన్నిష్, స్వీడిష్ భాషల్లో సాగుతుంది. అక్కడ ఒక్కో విద్యార్థి సగటున నాలుగు భాషలు మాట్లాడగలడు.
• పోటీ పరీక్షలూ, కాలేజీలకు ప్రవేశ పరీక్షలూ, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లూ లేని దేశం ఫిన్లాండ్. హైస్కూల్ దశలోనే విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్ణయించుకుని దానికి తగ్గ కోర్సులే చేస్తారు. ఆ విద్యార్థుల సంఖ్యకు సరిపడా వృత్తి విద్యా సీట్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది.

ప్రకృతికాంత మెడలో చేమంతుల హారం.. హేమంతం!
తస్య తే వసంత: శిర: గ్రీష్మో దక్షిణ: పక్ష: ।
వర్షా: పుచ్ఛం, శరద్ ఉత్తర: పక్ష:, హేమంతో మధ్యం ।।
సంవత్సరమనే పక్షికి వసంతం శిరసు అయితే గ్రీష్మం కుడి రెక్క. వర్ష రుతువు తోక. శరదృతువు ఎడమ రెక్క కాగా, హేమంతం మధ్య భాగం అని చెబుతుందీ మంత్రం.
ప్రకృతిలో కలిగే మార్పులకు సాక్షి..
ఆధ్యాత్మిక సాధకులకు రక్ష..
కవులకు, కావ్యాలకు అక్షరమాలిక..
వేదం చెప్పిన కాల స్వరూపం..
పరమాత్మ ఉపదేశించిన గీతాసారం..
ఇవన్నీ తనలో ఇముడ్చుకున్న అందమైన రుతువు హేమంతం.
హేమంత రుతువు ఆధ్యాత్మిక కోణంలో ఆహ్లాదకరమైనదే కాదు.. అనంత సిద్ధులనూ ప్రసాదించే అద్భుత సందర్భం.
వానజాడలు పూర్తిగా కనుమరుగై.. అప్పటికే ప్రవేశించిన చలిని రెట్టింపు చేస్తూ ప్రకృతికాంతకు చేమంతుల హారం వేస్తుంది హేమంతం.
శరత్కాలానికి వీడ్కోలు పలికి.. ప్రకృతి హేమంతానికి స్వాగతం పలికే వేళకు అప్పటి వరకు వర్షాలతో నిండిన వాతావరణం నెమ్మదిగా శీతలంగా మారుతుంది.
పగటి కాల వ్యవధి తగ్గుతుంది. రాత్రి నిడివి పెరుగుతుంది.
శీతలగాలులు ప్రతాపం చూపుతాయి.
ఇతర రుతువులకు భిన్నంగా హేమంతం మనుషులను దగ్గర చేస్తుంది. ఆహ్లాదాన్ని పెంచుతుంది. అంతేకాదు.. అందరూ కలిసి ఒక్కటిగా నడిస్తే సమాజం ఎంత ఉన్నతంగా ఎదుగుతుందో చెబుతుంది.
వేదకాలంలో సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అంటే హేమంతంతోనే మొదలయ్యేదట.
ఆ కాలంలో మార్గశిర మాసాన్ని ‘అగ్రహాయణిక’ అనే పేరుతో వ్యవహరించే వారు.
ఆధ్యాత్మిక చింతనకు బీజం వేసే మాసం మార్గశిరం అయితే, అందుకు వేదికయ్యేది హేమంత రుతువు.
చంద్రుడు మన:కారకుడు. అంటే మన మానసిక స్థితి చంద్రుడి వృద్ధిక్షయాలను బట్టే ఉంటుంది. అటువంటి చంద్రుడు పూర్తిగా అనుకూలించే కాలం హేమంతం.
ఆదికవి వాల్మీకి నుంచి ఆధునిక కవుల వరకూ అందరికీ హేమంతం అంటే మక్కువ.
ఇక, ప్రబంధ కవులైతే హేమంత వర్ణనలతో తమ గ్రంథాలను రంగరించారు.
శ్రీరామచంద్రుడికీ హేమంతమంటే ఎంతో ఇష్టమట.
మనకూ అనుకూలిస్తానంటూ హేమంతం స్వాగతం పలుకుతోంది.
ఆధ్యాత్మిక సాధనకైనా, మంచి పని తలపెట్టడానికైనా ఇదే తరుణం.
- డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
పురాణ పాత్రలు
పురాణపాత్రలను ఇదివరకటి కంటే భిన్నంగా చాలా వివరంగా పరిచయం చేస్తున్నారు. గత కొద్ది సంచికలుగా మంధర, త్రిజటుడు శత్రుఘ్నుడు గురించి అందించిన వివరాలు ఎంతగానో చదివించాయి. ముఖ్యంగా అక్టోబరు సంచికలో ముగ్గురన్నల ముద్దుల తమ్ముడు పేరుతో శత్రుఘ్నుడి గురించి ఇదివరకెన్నడూ చదవని విషయాలు తెలుసుకోగలిగాము. మునుముందు కూడా పురాణ పాత్రలను ఇలాగే వివరంగా అందించండి.
- కేఎస్ రవి, పి.ప్రసాద్, సీహెచ్.రవికాంత్, పొద్దుటూరు వినీల్, సుశీల, కె.కిరణ్కుమార్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
దీపకాంతులు
దీపావళి పర్వాన్ని పురస్కరించుకుని మార్కెట్లో అందుబాటులో ఉన్న వెరైటీ దీపాల గురించి అందించిన వివరాలు బాగున్నాయి.
- యశోద-తిరుపతి
కార్తీక శోభ
తెలుగు పత్రిక అక్టోబరు సంచికలో కార్తీక మాసం.. దీపావళి పర్వం గురించి తెలియచెబుతూ నెల పొడవునా దీపోత్సవం ఎంత వైభవంగా జరుగుతుందో వివరంగా తెలియచెప్పారు. మన సంప్రదాయంలో దీపానికి ఉన్న ప్రాముఖ్యతను, ఆధ్యాత్మికంగా అది చూపే ప్రభావాన్ని తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం బాగుంది.
-వెంకట్రావు, హైదరాబాద్

ఆధ్యాత్మిక ‘మార్గ’దర్శి
ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో పదకొండో మాసం- నవంబరు. తెలుగు పంచాంగం ప్రకారం ఇది కార్తీక- మార్గశిర మాసాల కలయిక. ఈ మాసంలో నవంబరు 20, గురువారం వరకు కార్తీక మాస తిథులు కొనసాగుతాయి. ఆ తదుపరి నవంబరు 21, శుక్రవారం నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతాయి. కార్తీక, మార్గశిర మాసాల కలయిక అయిన ఈ నవంబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో క్షీరాబ్ది ద్వాదశి, కార్తీకపూర్ణిమ - జ్వాలా తోరణం, ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన్న ఏకాదశి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటివి ప్రధాన పర్వాలు. ఇంకా సత్యసాయిబాబా జయంతి, బాలల దినోత్సవం (నెహ్రూ జయంతి) వంటివీ ఈ నెలలోనే పలకరిస్తాయి.
2025- నవంబరు 1, శనివారం, కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి
2025- నవంబరు 30, ఆదివారం, మార్గశిర శుద్ధ దశమి వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-కార్తీకం /మార్గశిరం-శరద్
-హేమంత రుతువులు- దక్షిణాయణం
మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసానికి ‘మార్గశిర’ మాసం అని పేరు. మృగశిర అనే పేరుకు ‘అగ్రహాయణిక’ అనే పర్యాయనామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. అంటే మాసాల్లో మార్గశిరానిదే అగ్రస్థానమన్న మాట. అందుకే మనకు గల పన్నెండు మాసాల్లో అతి విశిష్టమైనదిగా, అగ్రగణ్యమైనదిగా ఈ మాసం ఉంది. ఒకప్పుడు మనకు సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అయ్యేదట. అందుకే కాబోలు శ్రీకృష్ణుడు గీతాబోధనలో తాను ‘మాసానాం మార్గశీర్షోహ:’ అన్నాడు. అంటే ‘మాసాలలో తాను మార్గశిరాన్ని’ అని భావం. కాబట్టి ఏ విధంగా చూసినా మార్గశిర మాసం ఉత్కష్టమైనది. మార్గశిరంతోనే హేమంత రుతువు ప్రారంభమవుతుంది. దీని మరుసటి మాసం పుష్యమితో కలిపి ఈ రుతువు కొనసాగుతుంది. హేమంత రుతువును భాగవత దశమ స్కంధంలో వర్ణిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగి జలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. కార్తీక మాసంలో పుట్టిన చలి.. మార్గశిరం నాటికి బాగా పెరుగుతుంది. ‘మార్గశిర మాసంలో పుట్టే చలి.. మంటలో పడినా పోద’ని సామెత. గజగజ వణికించే ఈ శీతాకాలపు మాసంలో మన పెద్దలు అందుకు తగిన ఆహార నియమాలను విధించారు. అందుకనుగుణంగా తగిన వ్రతాచరణను నిర్దేశించారు. ఇక, శ్రీమహా విష్ణువుకు ఈ నెలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. కుమారస్వామి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పూజలందుకుంటాడు. ఈనాటి పూజల పర్వాన్నే ఆంధప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో సుబ్రహ్మణషష్టిగా వ్యవహరిస్తారు. ఇక, ఈ నెలలోని మొదటి 20 రోజులు కార్తీకమాసంలోనివి. కార్తీకపూర్ణిమ, జ్వాలా తోరణ ఉత్సవం, చిలుక ద్వాదశి వంటి కార్తీకమాసపు పర్వాలు ఈ మాసాన్ని దేదీప్యమానం చేస్తాయి. ఇంకా మరెన్నో పండుగలకు, పర్వాలకు ప్రసిద్ధమైనది కార్తీక- మార్గశిర మాసాల కలయిక అయిన నవంబరు మాసం. ఆయా పండుగలు, పర్వాల విశేషాలు తెలుసుకుందాం.
కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబరు 1, శనివారం
కార్తీక శుద్ధ దశమి చాలా విధాలుగా ప్రశస్తమైనది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి ఇది. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం ఈ కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే ఈనాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని, దేవుత్తని ఏకాదశి, ఉత్థాన్న ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి.
అలాగే, నవంబరు 1 ఆంధప్రదేశ్ అవతరణ దినోత్సవం.
కార్తీక శుద్ధ ద్వాదశి
నవంబరు 2, ఆదివారం
కార్తీక శుద్ధ ద్వాదశి అనేక విధాలుగా ప్రసిద్ధం. ఈ తిథి అనేక వ్రతాలు, పూజలకు ముగింపు, ఆరంభ దినం. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని, అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిలుక ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. కాబట్టి ఈ ద్వాదశికి ఆ పేరు వచ్చి ఉండొచ్చు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని అంటారు. ఈనాడు తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యమని చెబుతారు. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. కేవలం ఉసిరితో తినే పదార్థాలను మాత్రమే తయారు చేస్తారు.
అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు నిద్రలేచి, క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటాడు.
కాబట్టే ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఏర్పడింది. కొన్నిచోట్ల కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసి కల్యాణం కూడా నిర్వహిస్తారు. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి, •కైశిక ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వివిధ వ్రతాలు ఆచరిస్తారు. ఈ వ్రత నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఈనాడు తిరుమల శ్రీవారికి ఆస్థానం నిర్వహిస్తారు.
కార్తీక శుద్ధ త్రయోదశి
నవంబరు 3, సోమవారం
కార్తీక శుద్ధ త్రయోదశి శని త్రయోదశి తిథి. శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైన తిథి ఇది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గోత్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. విశ్వేశ్వర వ్రతాన్ని ఆచరించాలని మరికొన్ని వ్రత పుస్తకాలలోనూ ఉంది. అలాగే, ఈనాడు సోమ ప్రదోష వ్రతాన్ని నిర్వహించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఇది శివ సంబంధమైన వ్రతం.
కార్తీక శుద్ధ చతుర్దశి
నవంబరు 4, మంగళవారం
కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం. కార్తీక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడని అంటారు. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని ఆయా వ్రత గ్రంథాలలో, పురాణాలలో ఉంది. కాబట్టి ఇది శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన పర్వదినం.
కార్తీక శుద్ధ పూర్ణిమ
నవంబరు 5, బుధవారం
కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశలా వెలుగొందుతుంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు
మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 720 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్ హిందూ హాలీడేస్ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.
జ్వాలాతోరణ ఉత్సవం
కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి వెంటులు ఆ మూడు బాజులకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం. పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ. ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇంకా, కార్తీక పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.
కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగిందని అంటారు. కొన్నిచోట్ల ఈనాడు ఉమామహేశ్వర వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
కాగా, ఆంధప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గల సువర్ణముఖీ నది తీర్థ ముక్కోటిని ఈనాడు నిర్వహిస్తారు. అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదేరోజు నాడు నారాయణవనం శ్రీవేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ముగుస్తుంది. చిత్తూరు జిల్లా నగరిలో వేంచేసి ఉన్న శ్రీ కరియ మాణిక్యస్వామి వారి పవిత్రోత్సవాన్ని ఈనాడే నిర్వహిస్తారు.
సిక్కు మత గురువు గురునానక్ జయంతి దినం కూడా ఈనాడే. పది మంది సిక్కు గురువులలో ఈయన మొదటి వారు.
కార్తీక బహుళ పాడ్యమి
నవంబరు 6, గురువారం
కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం చేస్తే మహా ఫలప్రదమని అంటారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈనాటి నుంచి విశాఖ కార్తె ప్రారంభమవుతుంది.
కార్తీక బహుళ విదియ
నవంబరు 7, శుక్రవారం
కార్తీక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది. ఇది దేవి (అమ్మవారు)కి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది.
కార్తీక బహుళ తదియ
నవంబరు 8, శనివారం
కార్తీక బహుళ తదియ నాడే సంకష్టహర చతుర్థి జరుపుకోవాలని పంచాంగాలు, క్యాలెండర్లలో ఉంది. నిజానికి చతుర్థి తిథి నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కానీ, దీనిని ఈనాడే జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.
కార్తీక బహుళ చవితి
నవంబరు 9, ఆదివారం
కార్తీక బహుళ చతుర్ధి (చవితి) స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి. ఇది పన్నెండు సంవత్సరాలు, లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ తిథిని దశరథ చతుర్థిగానూ వ్యవహరిస్తారు.
అలాగే, సంకష్ట హర గణపతిని విశేషంగా పూజిస్తారు. కానీ, సంకష్టహర చతుర్థిని ఇంతకుముందు రోజే జరుపుకోవాలని పంచాంగాలలో ఉంది.
అలాగే, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి సన్నిధిలో ఈనాడు లక్ష బిల్వార్చన నిర్వహిస్తారు.
కార్తీక బహుళ పంచమి
నవంబరు 10, సోమవారం
పంచమి తిథి నాగ సంబంధమైనది. కార్తీక బహుళ పంచమి నాడు ప్రజలు తమ శ్రేయస్సు, సంతోషం కోసం నాగ విగ్రహాల ముందు నూనె దీపాలు వెలిగిస్తారు. ఈ రోజు చేసే పూజల వల్ల కాలసర్ప దోషాలు, కుజ దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
కార్తీక బహుళ షష్ఠి నాడు ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజలు, వ్రతాల గురించి వ్రత గ్రంథాలలోనూ, పంచాంగాలలోనూ విశేషంగా ఏమీ ప్రస్తావించలేదు.
కార్తీక బహుళ సప్తమి
నవంబరు 11, మంగళవారం
మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. కాగా, షష్ఠి ఘడియల్లోనే ఈ సప్తమి తిథి కూడా వస్తుంది. కాబట్టి నవంబరు 11నే ఈ పూజలు నిర్వహించుకోవాలి.
కార్తీక బహుళ అష్టమి
నవంబరు 12, బుధవారం
కార్తీక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి. ఇంకా ఈ తిథిని బుధ అష్టమిగానూ వ్యవహరిస్తారు. సాధారణంగా బుధవారంతో అష్టమి తిథి కూడి వస్తే దానిని బుధాష్టమిగా పిలుస్తారు. బుధాష్టమి నాడు ఉపవాసం ఉండి శివపార్వతులు, గణపతిని పూజిస్తారు. ఈనాడు చేసే పూజల వల్ల పుణ్యం లభిస్తుందని, జీవితంలో అభివృద్ధి సాధించవచ్చని అంటారు.
కార్తీక బహుళ నవమి
నవంబరు 13, గురువారం
కార్తీక బహుళ నవమి ప్రత్యేకించి ఏ పూజకూ, ఆచారానికీ నిర్దేశించి లేకపోయినా.. సాధారణంగా నవమి నాడు దుర్గామాతను పూజించడం సంప్రదాయం.
కార్తీక బహుళ దశమి
నవంబరు 14, శుక్రవారం
కార్తీక బహుళ దశమి నాడు తిథానుసారం ఆచరించాల్సిన పూజా విధులేమీ లేవు. కాగా, నవంబరు 14 మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి దినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నారులు ఆయనను ‘చాచా నెహ్రూ’గా పిలుచుకుంటారు. అందుకే ఆయన జయంతి దినమైన నవంబరు 14న ఏటా చిన్నారుల దినోత్సవం నిర్వహిస్తారు.
కార్తీక బహుళ ఏకాదశి
నవంబరు 15, శనివారం
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. ఈ ఏకాదశికే ఉత్పన్న ఏకాదశి, సర్వ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి.
ఈనాటి నుంచే వృశ్చిక సంక్రమణం ప్రారంభం అవుతుంది.
కార్తీక బహుళ ద్వాదశి
నవంబరు 16, ఆదివారం
కార్తీక బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకా ఈనాడు యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.
ఇలా ఉండగా, తిరుచానూరు శ్రీ పద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలకు ఈనాడు అంకురార్పణ పూజలు నిర్వహిస్తారు. ఇదే రోజు అమ్మవారికి లక్ష కుంకుమార్చన కూడా నిర్వహిస్తారు. అలాగే, నాగులాపురంలోని శ్రీవేద నారాయణస్వామి వారి పవిత్రోత్సవం కూడా ఈనాడే.
కార్తీక బహుళ త్రయోదశి
నవంబరు 17, సోమవారం
కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు.
కాగా, త్రయోదశి తిథి నాడు ఔషధాలకు అధిపతి అయిన ధన్వంతరిని కూడా పూజిస్తుంటారు. త్రయోదశి తిథి నవంబరు 18న కూడా కొనసాగుతోంది. కాబట్టి ఈ రోజు కూడా.. అంటే నవంబరు 17, 18 (సోమ, మంగళవారాలు) తేదీల్లో యమదీప దానం, ధన్వంతరి పూజ, ధన త్రయోదశి పర్వాలను నిర్వహించుకోవచ్చు. ప్రదోష వ్రతాన్ని కూడా ఈరోజే నిర్వహించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ప్రకారం ధన త్రయోదశి, ధన్వంతరి జయంతి పర్వాలు ఈనాడే. కాగా, తిరుచానూరు శ్రీపద్మావతీ తాయార్ల బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచి ప్రారంభం అవుతాయి. తి.తి.దే కేలండర్ ప్రకారం ఈనాడే మాస శివరాత్రి.
కార్తీక బహుళ చతుర్దశి
నవంబరు 19, బుధవారం
కార్తీక బహుళ చతుర్దశి తిథి సాధారణంగా భౌమవారం (బుధవారం)తో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు. ఈ తిథి సరిగ్గా బుధవారం నాడే ఉంది కాబట్టి ఈనాడు చిత్రా చతుర్దశిని ఆచరించాలి. సాధారణంగా చిత్రా చతుర్దశి నాడు శివుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలంతో స్నానం చేయాలి. చంద్రాస్తమయ వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి.
కార్తీక బహుళ అమావాస్య
నవంబరు 20, గురువారం
కార్తీక బహుళ అమావాస్య తిథి.. అమావాస్య దినం. కార్తీక మాసంలో ఇది చివరి తిథి. ఈనాటితో కార్తీకమాసం ముగుస్తుంది. కార్తీకబహుళ అమావాస్య గీతా జయంతి దినమని కూడా కొందరు చెబుతారు. గీతా జయంతి ఎప్పుడనే విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. కార్తీక బహుళ అమావాస్య (నవంబరు 20, 2025) నాడని కొందరు, మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబరు 1, 2025) నాడని ఇంకొందరు అంటారు. ఇక, కొన్ని కేలండర్లలో నవంబరు 30 గీతా జయంతి దినంగా సూచిస్తున్నారు. కాబట్టి మనకు వివాదాలతో పని లేకుండా ఈ రెండు తిథుల్లోనూ గీతా జయంతిని నిర్వహించుకుంటే ఏ గొడవా ఉండదు. ఇక, గీతా జయంతి గురించి వ్యావహారికంలో ఉన్న వాస్తవాల ప్రకారం.. కార్తీక బహుళ అమావాస్య నాడు భగవద్గీత పుట్టిందని కొందరు అంటారు. అంటే ఈరోజు గీతా జయంతి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర
శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
కానీ, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జనన దినంగా నిర్ధారించి చెప్పడానికి లేదని ఇంకొందరు పండితులు వాదిస్తారు.
మహా భారత కాలమానం ప్రకారం.. మాఘ
శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది (58) రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. దీన్ని వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీకబహుళ అమావాస్య అవుతుంది.
కార్తీకమాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తీకపూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం నాడు, అనగా శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. దీనిని బట్టి కార్తీకబహుళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు. భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు దు:ఖ పీడితుడు అయ్యాడు. యుద్ధంలో తన బంధువులను వధించడం తన వల్ల కాదని శోకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం కార్తీకబహుళ అమావాస్య నాటి ఉదయమేనని అంటారు. ఇక, మన తెలుగు పంచాంగాలలో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్ 1, 2025) తిథి నాడే గీతా జయంతిగా పేర్కొన్నారు. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయమై ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి, పవిత్రమైన గీతా పఠనాన్ని, గీతా జయంతిని ఈ రెండు దినాల్లోనూ, అంటే.. ఇటు కార్తీక బహుళ అమావాస్య (నవంబరు 20 2025, గురువారం) నాడు, అటు మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్ 1, 2025, సోమవారం) నాడు సాగించడం మధ్యేమార్గం, పుణ్యప్రదం కూడా.
మార్గశిర శుద్ధ పాడ్యమి
నవంబరు 21, శుక్రవారం
ఈనాటి నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఇది హేమంత రుతువు ఆరంభ దినం. ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పోలి స్వర్గం ఈ తిథినాడేనని అంటున్నారు. దీనినే పోలి పాడ్యమి అనీ అంటారు. కార్తీక అమావాస్య మరుసటి రోజు వచ్చే ము్య•మైన రోజు ఇది. ఈరోజు మహిళలు సమీపంలోని చెరువులు, నదులలో కనీసం 30 వత్తులతో అరటి దొప్పలలో దీపాలు వెలిగించి వదులుతారు. అనంతరం పోలి కథను చదువుతారు. శివాలయాల్లో శివుడికి అభిషేకాలు, పూజలు చేస్తారు. ‘పోలి’ కథ ఆసక్తికరమైనది.
ఒక ఊళ్లో ఉమ్మడి కుంటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో చిన్న కోడలి పేరు పోలి. ఆమెకు దైవభక్తి ఎక్కువ. పోలి అంటే ఆమె అత్తకు నచ్చేది కాదు. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అనుకుంటూ పోలి దైవభక్తిని తక్కువ చేసి చూసేది. పోలిని కలుపుకోకుండా మిగతా నలుగురు కోడళ్లతో కలిసి పూజలు, వ్రతాలు చేయించేది. ఒకసారి కార్తీక మాసంలో ఎలాగైనా చిన్న కోడలు పోలి చేత దీపం వెలిగించకుండా చేయాలని అత్త పన్నాగం పన్నింది. నలుగురు కోడళ్లనూ వెంటబెట్టుకుని శివాలయానికి వెళ్లింది. పోలి దీపం వెలిగించకుండా, పూజ చేయకుండా ఉండేలా పూజా సామగ్రి లేకుండా చేసింది. కానీ, పోలి మాత్రం ఇంటి పెరట్లోని పత్తి చెట్టు నుంచి కొద్ది పత్తిని తీసుకుని వత్తులు చేసుకుంది. కవ్వానికి మిగిలిన కొద్ది వెన్నను ఊడ్చి దీపం వెలిగించింది. ఆ దీపం అత్తగారి కంటపడకుండా దానిపై బుట్ట బోర్లించింది. ఇలా కార్తీక మాసం పొడవునా చాటుగా పూజలు చేస్తూ, దీపాలు వెలిగించింది. మాసం చివరిలో కార్తీక బహుళ అమావాస్య నాడు తక్కిన కోడళ్లతో గుడికి వెళ్తూ.. పోలికి చేతినిండా ఇంటి పని అప్పజెప్పింది. కార్తీక మాసం చివరి రోజు చేసిన పూజ కార్తీక మాసం పొడవునా చేసిన పూజకు సమానం అవుతుంది కాబట్టి ఆ పుణ్యం పోలికి దక్కకూడదనేది అత్త ప్రయత్నం. కానీ, పోలి మాత్రం ఇంటి పనులన్నీ పూర్తి చేసి, పూజ ముగించి దీపం వెలిగించింది. అత్త ఎన్ని అవాంతరాలు పెట్టినా తన పూజాదులు మానని పోలి భక్తికి మెచ్చిన దేవతలు ఆమె ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి తీసుకెళ్లడానికి పుష్పక విమానంలో వచ్చారు. గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త, మిగతా కోడళ్లు దేవతలు, విమానం తమ కోసమే వచ్చాయని భావించారు. దేవతలు పోలిని స్వర్గానికి తీసుకెళ్తుండగా, అత్త, మిగిలిన తోటికోడళ్లు పోలి కాళ్లు పట్టుకుని తామూ వెళ్లేందుకు యత్నించారు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఫలించలేదు. కల్మషం లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని, మీకు లేదని చెప్పి దేవతలు అత్తను, నలుగురు కోడళ్లును నెట్టేశారు. అలా పోలి పాడ్యమి/ పోలి స్వర్గం ఆచరణలోకి వచ్చింది. ఈనాడు 30 వత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది. ఈరోజు దీపదానం చేయడం చాలా మంచిదని అంటారు.
మార్గశిర శుద్ధ తదియ
నవంబరు 23, ఆదివారం
మార్గశిర శుద్ధ తదియ నాడు ఆచరించదగిన వ్రతాలు చాలానే ఉన్నాయి. ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ తదితర వ్రతాలు వీటిలో ముఖ్యమైనవి. వీటి గురించి వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి. అలాగే, ఈ తిథి నాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు తెలుగు వారి ఆరాధ్య దైవమైన పుట్టపర్తి శ్రీసత్యసాయి బాబా పుణ్య తిథి కూడా.
మార్గశిర శుద్ధ చవితి
నవంబరు 24, సోమవారం
చతుర్థి తిథి సాధారణంగా వినాయక పూజార్హమై ఉంటుంది. కాబట్టి ఈనాడు వినాయకుని ప్రీత్యర్థం పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరాలు గలిగిన వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు డుండి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది. డుండి అనే పదం గణపతి సంబంధమైనదే. కాబట్టి ఇది కూడా వినాయక సంబంధమైన పూజాకల్పమే.
మార్గశిర శుద్ధ పంచమి
నవంబరు 25, మంగళవారం
మార్గశిర శుద్ధ పంచమి తిథి దక్షిణాదిన నాగపంచమిగా ప్రసిద్ధి. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
మార్గశిర శుద్ధ షష్ఠి
నవంబరు 26, బుధవారం
మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిథి. తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారం. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు దట్టంగా అలముకుంటాయి. కానీ వర్షాలు పడవు. కాబట్టే వానలు కురవని మబ్బులను షష్ఠి మబ్బులని అంటారు. ఇక, తమిళులు మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని
సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగిందని ఐతిహ్యం. పురాణగాథ ఇలా ఉన్నా.. ఇది ప్రధానంగా నాగులకు సంబంధించిన పర్వం. ఈనాడు నాగులను పూజిస్తారు. సంతాన భాగ్యం కోరుకునే వారు సర్పపూజ రూపేణా కుమారస్వామినే ఆరాధిస్తారు. పాములు వ్యవసాయదారులకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటాయి. ఎలుకలను తినడం ద్వారా ఇవి పంటలను కాపాడతాయి. అలాగే, చలి ముసురుకునే ఈ కాలంలో పాములు పొలాల్లోని బొరియలు, భూమి అడుగు భాగంలో దాక్కుని ఉంటాయి. వ్యవసాయ సంబంధ పనులు చేసేటపుడు అటు సర్పాలకు, తమకు కూడా హాని కలగకూడదనే ఉద్దేశంతో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు రైతులు ఎక్కువగా పువ్వులు, పడగలు సమర్పించి నాగపూజలు చేస్తుంటారు.
మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఇంకా చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలకు కూడా ప్రతీతమై ఉందని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ సప్తమి
నవంబరు 27, గురువారం
మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్య పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ అష్టమి
నవంబరు 28, శుక్రవారం
దుర్గాపూజకు, ఇటు కాలభైరవుని పూజకు ప్రతీతి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగానే ఆచరణలో ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి తదితర పేర్లు కాలాష్టమికి ఉన్నాయి.
ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహిమ విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’. ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. అలా కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడయ్యాడు. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. కాశీలోనే కాదు.. ఈ భూమిపై ఉన్న ప్రతి శివాలయానికీ కాలభైరవుడే క్షేత్ర పాలకుడు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తుతించిన స్తోత్రం మన భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో మహత్తరమైనది.
మార్గశిర శుద్ధ నవమి
నవంబరు 29, శనివారం
మార్గశిర శుద్ధ నవమి నాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది. మొత్తానికి నవమి తిథి శక్త్యారాధనకు విశేషమైనది. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా అర్చిస్తారు. తెలుగు పంచాగాలలో ఈనాటి తిథి గురించి శుక్ర మౌడ్యమి త్యాగము అని పేర్కొన్నారు. ఈనాడు నందిని నవమి అని తెలుగు పంచాంగాలలో ఉంది.
మార్గశిర శుద్ధ దశమి
నవంబరు 30, ఆదివారం
మార్గశిర శుద్ధ దశమి తిథి నాడు ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించాల్సిన ఆయా వ్రతాల పేర్లను బట్టి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబధించి ఉద్దేశించిన తిథిగా కనిపిస్తోంది.

లేజీ టీన్స్.. డేంజర్ బెల్స్
పిల్లలంటే లేడిలా పరుగెత్తాలి. ఉత్సాహంతో ఉరకలెత్తాలి. అది వారి వయసు సహజ స్వభావం. బడి నుంచి వచ్చాక మైదానంలోనో, ఇంటి ఆరుబయటో అలసిపోయేలా ఆడేవారు. ఆకలేసినపుడు ఇంటికెళ్లి అన్నం తినేవారు. హోంవర్క్, ఇతరత్రా పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమించే ముందు పెద్దోళ్ల చేత కథలు చెప్పించుకుని కమ్మని నిద్రలోకి జారుకునే వారు. ఇదంతా గతకాలపు పిల్లల జీవితం. మరి ఈ కాలం పిల్లలు అలా ఉన్నారా?. బడి నుంచి ఇంటికి రాగానే అలసిపోయినట్టు అయిపోతున్నారు. అయితే పుస్తకాలతో కుస్తీ.. లేదంటే ఫోన్లతో కాలక్షేపం.. శారీరక వ్యాయామమన్నదే లేదు. అసలు శరీరపు సాధారణ కదలికలే లేవు. ఇది పజ్రారోగ్యానికి సంబంధించిన ఆందోళనకర పరిస్థితి అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ). ఈ సంస్థ ఇంకా ఏం చెబుతోందో బాలల దినోత్సవం (నవంబరు 14) సందర్భంగా మన పిల్లల క్షేమాన్ని కాంక్షించి ఒకసారి తెలుసుకుందాం..
ప్రపంచవ్యాప్తంగా బడికెళ్లే పిల్లల్లో 80 శాతం మంది (మరీ ముఖ్యంగా భారత్లో) రోజూ కనీసం గంటసేపైనా శారీరక వ్యాయామాన్నిచ్చే ఆటపాటల్లో కానీ, పనుల్లో కానీ పాలుపంచుకోవడం లేదు. బాలురలో 78 శాతం మంది, బాలికల్లో 85 శాతం మంది శారీరక వ్యాయామానికి పూర్తిగా దూరంగా ఉన్నారు. వివిధ ఆర్థిక పరిస్థితులు గల 146 దేశాలలో 11 నుంచి 17 ఏళ్ల వయసు గల 16 లక్షల మంది పిల్లలపై ఇటీవల ఓ అధ్యయనం నిర్వహించారు. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఈ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటపాటైనా శారీరక శ్రమ కలిగించే ఆటపాటలు, వ్యాయామం లేదా పనుల వంటి కాలక్షేపాలు ఉండాలి. నిజానికి ఆర్థిక పరిస్థితి అత్యంత దుర్బరంగా గల టోంగా, సమోవా, ఆప్ఘనిస్తాన్, జాంబియా- ఈ నాలుగు దేశాల్లోని పిల్లలు రోజూ గంటకుపైగా శారీరక శ్రమనిచ్చే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, వీరికి తగినంత శారీరక శ్రమ ఉన్నా.. పోషకాహార లోపం పట్టిపీడిస్తోంది. ఇది మరో సమస్య. ఇక, భారత్ వంటి దేశాల్లోని పిల్లలు అసలు ఒంటికి చెమట పట్టనివ్వడం లేదు. అంటే శరీరాన్ని కనీస స్థాయిలో కూడా కదపడం లేదన్నమాట.
మన దేశంలో పదిహేడేళ్లలోపు వయసు గల 73.9 శాతం మంది శారీరక వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. 71.8 శాతం బాలురు, 76.3 శాతం బాలికలు తగినంత శారీరక వ్యాయామం లేకుండా ఉంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే ఇది కొంచెం నయమైన పరిస్థితే అయినా, ఇది మునుముందు పెను ప్రజారోగ్య సమస్యను సృష్టించనుందని సదరు అధ్యయనంలో తేలింది.
భారత్లో 2001 నాటికి 76 శాతం బాలురు తగినంత శారీరక వ్యాయామం లేకుండా ఉండేవారు. బాలురు క్రికెట్ మోజులో పడటంతో ఇప్పుడు పరిస్థితి కొంచెం మెరుగైందట!. దీంతో ఇలాంటి పిల్లల శాతం 71.8 శాతానికి చేరుకుంది. శారీరక వ్యాయామమన్నదే లేని బాలికలు 2001 నాటికి 76.6 శాతం ఉండగా, 2016 నాటికి 76.3 శాతానికి చేరుకుంది. దీనిని పెద్ద మార్పుగా పరిగణించలేం. భారత్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని బాలల జీవనశైలిలో వ్యత్యాసాలు చాలా ఉన్నాయని అధ్యయనంలో గుర్తించారు. అలాగే ఆయా కుటుంబాల ఆర్థిక నేపథ్యాలు కూడా పిల్లలను కనీస శ్రమకు దూరం చేస్తున్నాయని తేలింది. భారత్లోని గ్రామీణ ప్రాంతాల బాలలు తమ దినచర్యలో భాగంగా చేసే పనులతోనే తగినంత వ్యాయామం పొందగలుగుతున్నారు. పట్టణాల్లోనూ, నగరాల్లోనూ అటువంటి పరిస్థితుల్లేవు. అయితే, బాలలకు తగినంత శారీరక వ్యాయామం లేని పరిస్థితులు భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్ది, బాలలకు తగిన వ్యాయామం లభించేలా ప్రభుత్వాలు, కుటుంబాలు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కారణాలు అనేకం..
నేడు పిల్లలు ఆటపాటలకు దూరమైపోవడానికి సవాలక్ష కారణాలున్నాయి. చదువుల్లో పెరిగిన పోటీతో పిల్లలను పుస్తకాలు తప్ప మరే వ్యాపకానికీ తల్లిదండ్రులు అలవాటు చేయడం లేదు. పిల్లలు కూడా అయితే చదువు.. లేదంటే ఫోన్తో కాలక్షేపం చేయడాన్ని ఓ అలవాటుగా మార్చుకుంటున్నారు. నిజానికి ఆటలాడటం, రోజులో కొంతసేపు శారీరక వ్యాయామం చేయడం పిల్లల ప్రాథమిక హక్కు. అందుకు తగిన అవకాశాలను అటు ప్రభుత్వాలతో పాటు ఇటు తల్లిదండ్రులు కల్పించాలి. టీనేజీ పిల్లలను శారీరక వ్యాయామం వైపు మళ్లించేందుకు ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని, విద్య, పట్టణ ప్రణాళిక, రోడ్డు భద్రత వంటి అంశాల్లో మౌలికమైన మార్పులు తేవాలని డబ్ల్యూహెచ్ఓ సిఫారసు చేస్తోంది. పిల్లలకు తగినంత శారీరక వ్యాయామం లేకుంటే వారు స్థూలకాయం, గుండెజబ్బులు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రుగ్మతలకు లోనై అకాల మరణాలకు బలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. పిల్లల మానసిక, శారీరక వికాసానికి క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో నలుగురు శారీరక వ్యాయామానికి దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలనేది ఆరోగ్య నిపుణుల మాట.
పిల్లల్ని వ్యాయామానికి దూరం చేస్తున్నవివే..
టీవీ, స్మార్ట్ఫోన్లు, వీడియోగేమ్స్ వంటి ఎలక్ట్రానిక్ వినోద సాధనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా పిల్లల జీవనశైలిలో పెను మార్పులు వచ్చాయి. ప్రధానంగా ఎలక్ట్రానిక్ వినోద సాధనాలు పిల్లలను వ్యాయామానికి, ఆరుబయటి క్రీడలకు దూరం చేస్తున్నాయి. పాఠశాలల్లో, చదువుల్లో కలిగే ఒత్తిడి నుంచి బయటపడటానికి పిల్లలు తీరిక వేళల్లో టీవీ కార్యక్రమాలు చూడటానికి, వీడియోగేమ్స్ ఆడటానికి అలవాటు పడుతున్నారు. మితిమీరిన పట్టణీకరణ కూడా పిల్లలను వారి సహజసిద్ధమైన ఆటపాటలకు దూరం చేస్తోంది. పట్టణాలు, నగరాల్లోని ఇరుకిరుకు ఇళ్లలో, అపార్ట్మెంట్ ఫ్లాట్లలో పిల్లలకు ఆడుకునేందుకు కాసింత స్థలమే కరువవుతోంది. చాలాచోట్ల కనీసం ఇళ్లకు చేరువగా పిల్లల పార్కులు కూడా ఉండటం లేదు. ఉన్న కాసిన్నీ మాయమైపోతున్నాయి. బడి నుంచి ఇంటికి రాగానే పుస్తకాలు ముందేసుకుని చదువులో మునిగిపోయే పిల్లలను బుద్ధిమంతులుగా పరిగణించడం, ఆరుబయట ఆటల కోసం పరుగులు తీసే వారిని ఆకతాయిలుగా చూడటం వంటివి పిల్లలపై చాలా ప్రభావం చూపుతున్నాయి. మారిపోతున్న సామాజిక విలువలకు పై ధోరణి అద్దం పడుతుంది.
పిల్లలకు వ్యాయామం ఎందుకంటే..
ఎదిగే వయసులో పిల్లలకు తగినంత శారీరక వ్యాయామం అవసరం. ముఖ్యంగా 11 నుంచి 17 ఏళ్ల మధ్య పిల్లల్లో ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఆ వయసు పిల్లలకు రోజూ కనీసం గంటసేపు సాధారణ శ్రమ కలిగించే స్థాయి నుంచి కాస్త తీవ్రస్థాయి శ్రమ కలిగించే వ్యాయామం అవసరం. ఈ వయసులో వ్యాయామం చేయడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
• వేగంగా పరుగులు తీయడం, సైకిల్ తొక్కడం, ఆరుబయట ఆటలాడటం వల్ల గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.
• ఆరుబయట శరీరానికి శ్రమ కలిగించే ఆటలు ఆడటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
• బరువులు ఎత్తడం, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆటలు ఆడటం వల్ల కండరాల, ఎముకల దారుఢ్యం పెరుగుతుంది. వెన్నెముకకు బలం కలిగి నిలుచునే తీరు చక్కగా మారుతుంది.
• శ్రమ కలిగించే ఆటల వల్ల శరీరంలోని కొవ్వు కరిగి స్థూలకాయం రాకుండా ఉంటుంది. బరువు ఆరోగ్యకరమైన రీతిలో అదుపులో ఉంటుంది.
• పిల్లలంతా కలసిమెలసి బృందాలుగా ఏర్పడి ఆడుకోవడం వల్ల పిల్లల్లో స్నేహశీలత, సామాజిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటివి దూరమవుతాయి.
• కొత్త కొత్త ఆటలు ఆడే క్రమంలో పిల్లలు కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోగలుగుతారు. ఆటల ద్వారా పిల్లల్లో ఆకళింపు శక్తి పెరుగుతుంది.
• గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఆడే ఆటల వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి దూరమై, చక్కగా నిద్ర పడుతుంది.
పిల్లలకు ఎలాంటి
వ్యాయామాలు అవసరం?
ఎదిగే వయసులోని పిల్లలకు శారీరక వ్యాయామం తప్పనిసరి. తరగతి గదుల్లో గంటల తరబడి కూర్చుని గడిపే వారికి రోజులో కొంతసేపైనా కాస్తంత ఆటవిడుపు ఉండాలి. ఆ ఆటవిడుపు ఫోన్లు, టీవీలు, వీడియోగేమ్స్తో కాలక్షేపం వంటివి కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి నుంచి బయటపడే సాకుతో పిల్లలు టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా కాస్త ఆరుబయట ఆటపాటల్లో కాలక్షేపం చేసేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలతో పాటు తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాల్లోనూ పిల్లలు పాల్గొనాలి. టీనేజీ పిల్లలకు రోజుకు కనీసం గంటసేపు శారీరక వ్యాయామం అవసరం. వారానికి మూడు రోజులు కాస్త తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి.
• వేగంగా నడక, ఈత, సైకిల్ తొక్కడం, డ్యాన్స్ చేయడం, తోట పని, ఇంటి పనులు వంటివి సాధారణ శ్రమ కలిగించే వ్యాయామాలు. ఇలాంటి వ్యాయామాలతో కూడిన వ్యాపకాలు పిల్లల జీవనశైలిలో రోజూ ఉండేలా చూసుకోవాలి.
• పరుగు, పరుగులతో కూడిన క్రికెట్, ఫుట్బాల్, హాకీ వంటి ఆటలు శరీరానికి కాస్త శ్రమను కలిగిస్తాయి. ఎముకలకు, కండరాలకు దారుఢ్యాన్ని కలిగించేలా బరువులు ఎత్తడం, గుంజీలు తీయడం, పుషప్స్, మెట్లు లేదా ఎత్తయిన గుట్టలపైకి ఎక్కడం వంటి వ్యాయామాలు కూడా తీవ్ర శ్రమ కలిగించే వ్యాయామాల కోవలోకే వస్తాయి. టీనేజీ పిల్లలకు ఇలాంటి వ్యాయామాలు కనీసం వారంలో మూడు రోజులైనా అవసరం.
వ్యాయామం లేని పిల్లలు..
కలిగే అనర్థాలు..
కనీస వ్యాయామం లేని జీవనశైలి కారణంగా పిల్లలకు అప్పటికప్పుడే ఎలాంటి అనర్థాలు కలగకపోవచ్చు. కానీ, దీర్ఘకాలికంగా ఈ జీవనశైలి దారుణమైన దుష్ప్రభావాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి.
• తగినంత వ్యాయామం లేకుంటే స్థూలకాయం ఏర్పడే ముప్పు పెరుగుతుంది. స్థూలకాయం వల్ల చిన్న వయసులోనే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులు తలెత్తుతాయి.
• వ్యాయామం లేని పిల్లల్లో కండరాలు, ఎముకలు తగిన రీతిలో బలంగా ఎదగవు. ఇలాంటి వారు పెరిగే కొద్దీ ఎముకలను బలహీనపరిచే ఆస్థియోపొరాసిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలుంటాయి. • శారీరక వ్యాయామం లేని వారిలో మానసిక స్థైర్యం కూడా తక్కువ ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇలాంటి వారు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలతో కుంగిపోయే ప్రమాదం ఉంది. • ఆరుబయట ఆటపాటల్లో గడపాల్సిన సమయంలో స్మార్ట్ఫోన్లు, టీవీ, ల్యాప్టాప్ తెరల ముందు కాలక్షేపం చేయడం వల్ల పిల్లల్లో కంటి సంబంధ రుగ్మతలు పెరుగుతాయి.
• వ్యాయామం లేని పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
• వ్యాయామం లేని వారిలో ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు, ఉబ్బసం వంటివి తరచూ ఇబ్బందిపెట్టే అవకాశాలు ఉంటాయి. • దీర్ఘకాలం వ్యాయామం లేని జీవనశైలి గడిపే వారికి కొన్ని రకాల కేన్సర్లు సోకే ప్రమాదం కూడా ఉందని పలు అధ్యయనాల్లో ఇప్పటికే తేలింది.
ఎవరి బాధ్యత ఎంతంటే..?
చాలా కొద్దిమందిని మినహాయిస్తే పిల్లల్లో ఎక్కువ మందికి ఆటపాటలపై సహజంగానే ఆసక్తి ఉంటుంది. పిల్లల ఆసక్తులను గమనించి తల్లిదండ్రులు వారిని ఆటల వైపు మళ్లించాలి. శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే ఇంటి పనులు చేయించడం అలవాటు చేయాలి. స్వయంగా చేసే పనుల్లోని ఆనందం వారికి తెలిసేలా చేయాలి. ప్రతి పాఠశాలకూ, క్రీడా మైదానం, క్రీడా పరికరాలు ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. తమ పిల్లలు చేరబోయే పాఠశాలలో క్రీడా సౌకర్యాలు, ఇతరత్రా పిల్లల్లో వికాసాన్ని కలిగించే కార్యకలాపాలకు చోటుందో లేదో గమనించాలి. ఆటలను, వ్యాయామాన్ని పిల్లల రోజువారీ పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. పిల్లల శారీరక వ్యాయామ అవసరాలపై ప్రభుత్వాలు, తల్లిదండ్రులు ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
November 15, 2025
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40
Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia




















