Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

అందరూ బాగుండాలి యోగా వర్థిల్లాలి
శరీరాన్ని యోగా.. మనసును ధ్యానం నియంత్రించి జీవన నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చికిత్సకూ లొంగని కొన్ని వ్యాధులు యోగాభ్యాసంతో నయమవుతున్నాయి. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమతో పాటు ఒత్తిడినీ మోస్తున్నారు. ఈ యాంగ్జయిటీ కారణంగా శరీరంలో చోటుచేసుకునే మార్పులు.. మనపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగానే.. మనిషి, మనసు అదుపు తప్పుతున్నాయి. అసంతృప్తి, ఆందోళన, డిప్రెషన్.. ఇంకా మానసిక రుగ్మతలు మనసు అదుపు తప్పడం వల్లనే కలుగుతున్నాయి. వీటన్నిటికీ చక్కని, తేలికైన పరిష్కారం- యోగా మాత్రమేనని నేటి ఆధునిక పరిశోధనలు తెలియచెబుతున్నాయి. యోగా మనసులోని గజిబిజి ఆలోచనలను పారద్రోలి పంచేంద్రియాలకు సాంత్వన అందిస్తుంది. మెదడులో మెదిలే ఆలోచనల్ని నియంత్రించి ధ్యాసను ఏకాగ్రత వైపు మళ్లిస్తుంది. ఇది యోగాతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే వెంటనే చేయాల్సిన పని.. జీవనశైలిని మార్చుకోవడం. ప్రాచీన కాలం నాటి జీవన విధానాలు.. ఆశ్రమ వాతావరణం.. సంప్రదాయ ఆహార విహారాలు.. వీటి మధ్య గడుపుతూ, వీటిని స్వయంగా అనుభూతి చెందితే ఎంతటి మనిషైనా, ఎటువంటి మనసైనా దెబ్బకు ‘యోగా దారి’లో పడాల్సిందే. మరి అటువంటి అనుభూతిని ఆస్వాదించాలనుకుంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ‘వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం (ఎస్-వీవైఏఎస్ఏ)కు వెళ్లాల్సిందే. దేశంలోనే పప్రథమ యోగ విశ్వవిద్యాలయం (డీమ్డ్) ఇది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ విశ్వవిద్యాలయం.. ఇక్కడి వాతావరణం.. ఇక్కడ అందుబాటులో ఉన్న యోగవిద్య, ఇక్కడ దొరుకుతున్న శారీరక, మానసిక సాంత్వన గురించి తెలుసుకుందాం. జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం..
పతంజలి మహర్షి ఈ ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక ‘యోగా’. యోగాచార్యులు, యోగ పురుషుడు, యోగదాత అయిన ఆయన యోగ సూత్రాల రూపంలో మానవ లోకానికి అందించిన ఈ ‘యోగ నిధి’.. మానవజాతిలోని ఏ తరానికైనా తలమానికం అవుతుంది. తపోవనాల్లో, ఆశ్రమాల్లో ప్రాణం పోసుకున్న యోగ సూత్రాలకు శాస్త్ర ప్రతిపత్తిని కల్పించిన పతంజలి యోగ దాత కాక మరెవరు? భారతగడ్డపై పుట్టి విశ్వవ్యాప్తమైన యోగా.. ఒత్తిడితో కూడిన ఆధునిక జీవితాలకు, రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త జబ్బులను నయం చేయడానికి సరికొత్త రూపం సంతరించుకుంటోంది. అందుకు బెంగళూరులోని ఈ వినూత్న విశ్వవిద్యాలయం వేదికైంది.
రమేశ్లాంటి వారెందరో?!
రమేశ్కు ఉన్నట్టుండి చూపు మందగించింది. వయసు కూడా పెద్ద ఎక్కువేమీ కాదు. దీంతో కారణం ఏమిటో తెలియక ఆందోళనతో కంటివైద్యుడిని సంప్రదించి, కంటిఅద్దాలు పెట్టుకున్నాడు.
హమ్మయ్యా.. సమస్య తీరిందనుకునేలోగా, రమేశ్ ఒకరోజు మెట్లు దిగుతూ పడిపోవడంతో కాలు బెణికింది. నెలల తరబడి మంచంపై నుంచి లేవలేని పరిస్థితి.. ఎముకల డాక్టరు వద్దకు వెళ్లి ఎంతోకొంత వదిలించుకుంటే తప్ప మళ్లీ లేచి నిలబడలేదు.
చిరుద్యోగి అయిన రమేశ్ రోజుల వ్యవధిలో తనకెదురైన ఈ రెండు ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ రోజుల తరబడి తిరిగాడు. అందుకోసం తన తాహతుకు మించి చాలా డబ్బు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుమించి విలువైన సమయం వృథా అయింది.
ఎంతో చురుగ్గా ఉండే రమేశ్.. ఈ రెండు అనుభవాలతో ఎందుకో సైలెంట్ అయిపోయాడు. పిలిస్తే కానీ పలకడు. మనసంతా ఆందోళన.. పైకి ఇదీ అని చెప్పుకోలేని కారణంతో అసంతృప్తి.. మానసిక ఒత్తిడితో సతమతమవసాగాడు. ఎవరో సలహా ఇస్తే మానసిక వైద్యుడిని కలిశాడు. ఆ వైద్యుడు ఏవో మందులు రాశాడు. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడు. కానీ సమస్య తీరలేదు.
ఉద్యోగ, సంసార బాధ్యతలు.. ఆరోగ్య సమస్యలు.. వాటిపి నయం చేసుకోవడానికి అవుతున్న ఖర్చు, అందుకోసం కరిగిపోతున్న సమయం.. ఇలా రమేశ్ జీవితం ఒడిదుడుకుల మధ్య సాగుతూనే ఉంది.
కాలినొప్పికి ఓ డాక్టరు.. గుండెనొప్పికి ఇంకో డాక్టరు.. కంటివైద్యానికి మరో డాక్టరు.. ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి, వాటికి వచ్చే జబ్బులకు ఒక్కో ప్రత్యేక వైద్యుడు.. ఇంత ఆధునిక కాలంలోనూ మనిషికి ఒకేచోట.. పరిపూర్ణ ఆరోగ్యం లభించే చోటే లేదా?
ఈ రోజుల్లో ఒక వ్యాధి తగ్గించుకునే సరికి సైడ్ఎఫెక్ట్గా మరో జబ్బు పుట్టుకొస్తోంది. దాన్ని నయం చేసుకునే సరికి ఇంకో రుగ్మత పుడుతుంది.
మరి మనిషికి సంపూర్ణ ఆరోగ్యం ఎలా లభిస్తుంది? ఎక్కడ లభిస్తుంది.
.. ఇలా తన ఆలోచనలకు తనలోనే నవ్వుకున్నాడు రమేశ్. ఒక మనిషిలో కలిగే రుగ్మతలు, ఆరోగ్య సమస్యలకు ఒకేచోట వైద్యం లభించడం కానీ, ఒకేచోట సంపూర్ణ ఆరోగ్యం లభించడం కానీ అసంభవం అనుకున్నాడు.
అలా భావిస్తున్న సమయంలోనే అతడికి బెంగళూరులోని ‘వివేకానంద యోగ అనుసంధాన సంస్థానం’ గురించి తెలిసింది.
వెంటనే అక్కడికి బయల్దేరాడు. ఇప్పుడతను అక్కడే ఉన్నాడు. ఆ విశ్వవిద్యాలయం గురించి తెలుసుకోవడానికి మనమూ అక్కడికి వెళ్దాం పదండి..
పరిపూర్ణ ఆరోగ్యం ప్రశ్నార్థకం కాదు..
ఒక్కో అవయవానికి ఒక్కో వైద్యం.. పరిపూర్ణ ఆరోగ్యం ప్రశ్నార్థకం.. మనిషికి పరిపూర్ణ ఆరోగ్యం.. అంటే ఒకేచోట శరీరం, మనసు మొత్తాన్ని నయం చేయగల వైద్యమేదీ లేదా? దీనికి సమాధానమే- బెంగళూరు యోగ విశ్వవిద్యాలయం. ఇక్కడ సమీకృత యోగ చికిత్స లభిస్తుంది. యోగాసనాలు, ఆయుర్వేదం, ప్రకృతి చికిత్స, ఆక్యుపంచన్, ఫిజియోథెరపీ, సైకోథెరపీ, ఆక్యుప్రెషన్, పోషకాహారం.. ఈ ఎనిమిది అంశాల మేలు కలయిక ఈ యోగ విశ్వవిద్యాలయం. ఈ ఎనిమిదీ.. మనిషికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి.
ఈ యోగ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టగానే.. ఎప్పుడో వేదకాలం నాటి వాతావరణంలోకి అడుగిడిన అనుభూతి కలుగుతుంది. వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారుంటారు.. కానీ ఎక్కడా మందుల వాసన.. ఆస్పత్రుల్లో కనిపించే మంచాలు.. రోగుల మూలుగులు.. ఇలాంటివేవీ కనిపించవు.
ఇక్కడ రోగుల ఆరోగ్యస్థితి, అవసరాన్ని నిపుణులు చికిత్సా విధానాన్ని నిర్ణయిస్తారు. వారం నుంచి నెలలో దాదాపు నయం చేస్తారు.
కానీ, ఇక్కడ అడుగుపెట్టే ముందు కచ్చితంగా.. అన్నీ నాకు తెలుసనే అహాన్ని విడిచిపెట్టాలి. మన హోదాలను తీసి అవతల పెట్టాలి. ఎవరైనా, ఎంతటివారైనా సరే.. ఒక విద్యార్థిలా మారిపోవాలి. ఏకాగ్రతతో ఉండాలి. మనసును అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే ఇక్కడకు వచ్చిన మీరు సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వెళ్తారు. మన మునులూ, రుషులూ అనుభవపూర్వకంగా గ్రహించిన యోగ ఫలాలను ప్రపంచానికి అందించడం.. నిగూఢమైన అంశాలను పరిశోధనలతో వెలికితీయడం.. తేలికైన యోగ చికిత్స విధానాలను సమాజానికి మరింతగా చేరువ చేయడం.. ఈ యోగ విశ్వవిద్యాలయం
లక్ష్యాలు.
ఇక్కడ ఒక్కసారి అడుగుపెడితే మొత్తం జీవనశైలి మారిపోతుంది.. కాదు కాదు.. మార్చేస్తారు. ఇక్కడికి వచ్చే వారు కచ్చితంగా సమయపాలన పాటించేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదీ టైమ్ టేబుల్..
ఉదయం 5.00: సరిగ్గా ఈ సమయానికి నిద్రలేవాలి.
5.30: ఈ సమయంలోగా (అరగంట) కాలకృత్యాలు తీర్చుకోవాలి.
5.30 - 6.00: ధ్యానం.
7.00: యోగాంశాలపై బోధన.. నిపుణుల సలహా సూచనలకు అనుగుణంగా, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఎవరికి అవసరమైన ఆసనాలు వారికి నేర్పిస్తారు.
8.00: ఫలహారం. ఆ తరువాత న్యూరాలజీ, అంకాలజీ, పల్మనాలజీ, కార్డియాలజీ, సైకియాట్రీ, రుమటాలజీ, మెటబాలిక్ డిజార్డర్స్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఎండోక్రినాలజీ వంటి వివిధ విభాగాల పర్యవేక్షణలో అవసరమైన వారికి రెండు గంటల పాటు వైద్యం, చికిత్స అందిస్తారు.
10.45: ప్రాణాయామ రహస్యాల బోధన.
మధ్యాహ్నం 1.00: భోజనం.
భోజనాలు పూర్తయ్యాక ఉపన్యాసాలు, భజనలు ఉంటాయి.
రాత్రి 9.00: కచ్చితంగా లైట్లు ఆర్పేసి నిద్రకు ఉపక్రమించాలి. నిమిషమైనా తప్పని సమయపాలన.. చక్కని క్రమశిక్షణ.. మానసిక స్వస్థతను కలిగించే ఉపశమన చర్యలు, యోగసనాలు.. ఆరోగ్యవంతమైన పోషకాహారం.. జ్ఞానం కలిగించే ఆధ్యాత్మిక ఉపన్యాసాలు.. భక్తియోగం కలిగించే భజనలు.. మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణం.. అసలు ఈ దినచర్యే ఒక గొప్ప చికిత్స. ఈ సమయపాలన పాటిస్తే చాలు.. సగం రుగ్మతలు తగ్గిపోతాయి. ఈ ఆలోచన వెనుక ఆ నలుగురు..
అసలు జీవితం అంటే ఏమిటి?
జీవన పరమార్థం ఏమిటి?
ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది?..
ఇవీ ఆయన మదిలో ఎడతెరిపి లేని సంవాదాలు.. ఎగతెగని ఆలోచనలు.. అలా ఆ అన్వేషణలో వేదాంతం చక్కని చుక్కాని అయింది. ఎవరైనా తనను తాను తెలుసుకోవాలంటే, అందుకు ఆధ్యాత్మికతను మించిన మార్గం ఉందా?
ఈ స్పష్టత వచ్చాక ఆయన ఇక క్షణమైనా ఉపేక్షించలేదు. ‘నాసా’లో ఉద్యోగాన్ని వదిలేశారు.
ఇంతకీ ఆయన ఎవరు?
డాక్టర్ నాగేంద్ర.. ప్రస్తుత యోగా విశ్వవిద్యాలయం స్థాపనలో మూలస్తంభం లాంటి వ్యక్తి ఈయన. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ అందుకున్న ఘనత నాగేంద్రది. అనంతరం ఆయన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’లో పనిచేశారు.
తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని, జీవితంపై ఒక స్పష్టత వచ్చాక డాక్టర్ నాగేంద్ర నేరుగా తమిళనాడులోని కన్యాకుమారికి చేరుకుని, అక్కడ ఏక్నాథ్ రానాడే నిర్వహిస్తున్న వివేకానంద యోగా కేంద్రంలో చేరారు.
యోగాను ఓ సామాజిక అవసరంగా ఈ ప్రపంచానికి చాటిచెప్పాలనేది ఏక్నాథ్ ఆశయం. అందుకోసం పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసి దాని బాధ్యతలను ఈయనకే అప్పగించారు. కొంతకాలానికి ఆధ్యాత్మికపరురాలైన మేనత్త యోగసేవ నిమిత్తం నలభై ఎకరాలను డాక్టర్ నాగేంద్రకు అప్పగించారు. దీంతో బెంగళూరు శివార్లలోని ఆ స్థలంలో నాగేంద్ర.. వివేకానంద అనుసంధాన సమితిని ప్రారంభించారు. ఈ యోగ సమితి పాఠ్య ప్రణాళికను రూపొందించింది కూడా డాక్టర్ నాగేంద్రే. ప్రస్తుతం ఈయన ఈ విశ్వవిద్యాలయం కులపతి (చాన్స్లర్) హోదాలో ఉన్నారు. యోగా ద్వారా సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకు 2016లో పద్మశ్రీ పురస్కారాన్ని అందించి సత్కరించింది.
ఇంతకీ ఈ ప్రయత్నంలో, ఈ మజిలీలో ఆయనకు మరో ముగ్గురు తోడయ్యారు. యోగా వర్సిటీ వెనుక వీరిదీ కీలకపాత్ర.
అందులో ఒకరు డాక్టర్ నాగరత్న. ఈమె డాక్టర్ నాగేంద్రకు స్వయానా సోదరి. విశ్వవిద్యాలయ స్థాపనలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఈమె విశ్వవిద్యాలయంలోని ‘యోగా అండ్ లైఫ్ సైన్సెస్ విభాగాధిపతిగా ఉన్నారు.
మూడో వ్యక్తి.. ప్రొఫెసర్ రఘురాం. ఈయనది తెలంగాణలోని ఖమ్మం జిల్లా. డాక్టర్ నాగేందర్కు స్వయానా బావమరిది. ఈయన భోపాల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నారు.
నాలుగో వ్యక్తి.. డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం. ఈయనది ఆంధప్రదేశ్. వివేకానంద రచనలతో ప్రభావితులైన ఈయన యోగా విశ్వవిద్యాలయ అభివృద్ధికి సలహాదారు హోదాలో కొనసాగుతున్నారు. ఈయన పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ మాజీ ప్రిన్సిపాల్.
1972లో ప్రారంభం..
వివేకానంద యోగ అనుసంధాన సంస్థ (యోగా విశ్వవిద్యాలయం) 1972లో ప్రారంభమైంది.
యోగా పట్ల జనం ఆకర్షితులు కావడం, సాధకుల సంఖ్య పెరగడం, దాతలు ముందుకు రావడంతో సంస్థ ప్రాంగణం 40 ఎకరాల నుంచి నూటపది ఎకరాలకు పెరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యాన్ని గుర్తెరిగి మరింతగా ప్రోత్సహించడంతో ఈ విశ్వవిద్యాలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. యోగా, జీవనశైలులపై లోతైన పరిశోధనలు చేయడానికి వీలుగా అవసరమైన నిధులు మంజూరు చేసింది. 2002 నాటికి ఈ సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యోగా గురించి ప్రచారం చేయడంలో విశ్వవిద్యాలయం తనవంతు కృషి చేస్తోంది. అమెరికా, చైనా, జపాన్తో పాటు పలు దేశాల్లో ఇరవై యోగా కేంద్రాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఇక, కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా యోగాను తప్పనిసరి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టేందుకు, స్పోర్టస్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ విభాగాన్ని ప్రారంభించేందుకు ఈ వర్సిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, వర్సిటీ తరపున ‘యోగసుధ’ అనే ఆంగ్ల మాస పత్రికను నడుపుతున్నారు. అలాగే, ‘ఐ జాయ్’ అనే ఆన్లైన్ యోగా జర్నల్నూ నిర్వహిస్తోంది. ఇక, దేశంలోని యోగా సంస్థలన్నింటినీ ఇండియన్ యోగా అసోసియేషన్ పేరుతో ఒకచోటికి చేర్చి ‘యోగవాణి’ అనే మాసపత్రికను కూడా ఈ సంస్థ నడుపుతోంది. యోగా వర్సిటీ ఆవరణలో సరస్వతీ గ్రంథాలయం ఉంది. ఇక్కడ ఎంతో యోగ విజ్ఞానం అందుబాటులో ఉంది.
బాధ, దు:ఖం ఒకటి కాదు..
ఇక్కడ చాలా సూక్ష్మమైన విషయాలను చాలా చక్కగా, అర్థమయ్యేలా బోధిస్తారు. చాలామంది బాధ, దు:ఖం ఒకటేనని అనుకుంటారు. కానీ, బాధ వేరు. దు:ఖం వేరు. బాధ శారీరకమైనదైతే, దు:ఖం మానసికమైనది. యోగా వర్సిటీలో అందరికీ నేర్పే తొలి పాఠం ఇదే. ఇలాంటివే రోజూ నేర్పుతుంటారు. అదో నిరంతర అభ్యాసం. ఈ అభ్యాసం ద్వారా లభించే అవగాహనతో ఎంతటి అనారోగ్యాన్ని అయినా తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. మరణమంటే భయం పోతుంది. అద్భుతమైన మనశ్శాంతి లభిస్తుంది. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ఎవరు, ఏవిధమైన ఆరోగ్య సమస్య ఎదుర్కొంటున్నా.. ఇక్కడకు వచ్చి పది పదిహేను రోజులుంటే చాలు జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. నేడు జీవనశైలి వ్యాధులుగా పరిణమించిన ఒత్తిడి, మధుమేహం, ఊబకాయం, రక్తపోటు వంటి అనేకానేక సమస్యలకు ఇక్కడ యోగా ద్వారా పరిష్కారాన్ని చూపుతున్నారు. ఒత్తిడికి లోనయ్యే వారి కోసం సెల్ఫ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్సెసివ్ టెన్షన్ పేరుతో శిక్షణ శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఆరోగ్యధామానికి అనుబంధంగా ఆసుపత్రి ఉంది. క్యాన్సర్ బాధితుల కోసం ‘అమృతం’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ‘సైన్స్ వితిన్ యోగా’ అనేది ఈ సంస్థ నినాదం. ఈ వర్సిటీకి అనుబంధంగా నడుపుతున్న 600 పడకల యోగా థెరపీ ఆసుపత్రిని కేంద్రం సెంటర్ ఆఫ్ అడ్వాన్స్ రిసెర్చ్ ఇన్ యోగా అండ్ న్యూరోఫిజియాలజీగా గుర్తించడం విశేషం.
పరిశోధనలు.. నిరంతరం..
ఆధునిక జీవితం మన ముందు వదులుతున్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అటువంటి పరిస్థితుల్లో పుట్టుకొస్తున్న వ్యాధులకూ, ఆరోగ్య సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారాన్ని కనుగొనేందుకు ఈ సంస్థ నిరంతరం పరిశోధనలు సాగిస్తోంది. యోగా లోతుపాతుల్ని శోధించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, సవాళ్లకూ యోగాను ఒక పరిష్కార మార్గంగా ఎలా మలుచుకోవచ్చనేది శాస్త్రీయంగా నిరూపించే ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. ఇప్పటిదాకా ఈ సంస్థ ఏడు వందలకుపైగా పరిశోధనా పత్రాలను సమర్పించింది. 2013 నుంచి మూడేళ్ల క్రితం వరకు యోగాకు సంబంధించిన వివిధ అంశాలపై పన్నెండు పరిశోధనలను పూర్తిచేసింది. ప్రస్తుతం అంతే సంఖ్యలో మరికొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాతో పాటు మరికొన్ని భారతీయ పరిశోధన, విద్యాసంస్థలు యోగా వర్సిటీతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
అంతా ఆశ్రమ పద్ధతిలోనే..
యోగా విశ్వవిద్యాలయం ప్రాచీన కాలం నాటి గురుకులాన్ని తలపిస్తుంది. గురువు ఒక ఉన్నత పీఠంపై కూర్చుంటారు. శిష్యులు పద్మాసీనులై శ్రద్ధగా పాఠాలు వింటారు. చెట్ల కిందే పాఠాలు.. అక్కడే పవర్ పాయింట్ ప్రజంటేషన్లు.. తాళపత్రాలు.. లాప్టాప్లు.. అంతా పాత-కొత్త మేలు కలయికగా అక్కడి వాతావరణం కనిపిస్తుంది. ఈ యోగా వర్సిటీ ఆధ్వర్యంలో యోగ ఉపాధ్యాయ శిక్షణ కోర్సు కూడా నిర్వహిస్తున్నారు. ఇది నెల రోజుల వ్యవధి కోర్సు. అలాగే, యోగాలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ డిప్లొమా, మాస్టర్స్ కోర్సులతో పాటు దూరవిద్య, ఆన్లైన్ కోర్సులూ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మాస్టర్స్ కోర్సుకు యూజీసీ అనుమతి కూడా ఉంది. వర్సిటీ ఆవరణలో యోగా, ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, నర్సింగ్ కళాశాలలున్నాయి. రెండు వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల దినచర్య అయితే తెల్లవారుజామున నాలుగున్నర నుంచే మొదలవుతుంది.
ఇక్కడ నేర్పే పాఠాలు జీవితంలో క్రమశిక్షణగా మెలగడం, చక్కగా నెగ్గుకురావడం ఎలాగో నేర్పుతాయి.
ఎలా వెళ్లాలి? ఎలా చేరాలి?
ఈ యెగా విశ్వవిద్యాలయం బెంగళూరు నగరానికి 32 కి.మీ. దూరంలో ఉంది. అనారోగ్యంతో ఉన్న వారే కాదు.. ఆరోగ్యంగా ఉన్న వారూ ఇక్కడ చేరవచ్చు. యోగ చికిత్సకు మొదట పేరు నమోదు చేయించుకోవాలి. ప్రతి మంగళవారం కొత్త వారిని చేర్చుకుంటారు. ప్రతి సోమవారం డిశ్చార్జి చేస్తారు. అన్ని రోజుల్లోనూ సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. ఇక, వసతి గురించి అసలు చింతే లేదు. ఇక్కడ డార్మెటరీ, సింగిల్, డబుల్ రూమ్స్, ఏసీ, కాటేజీ, సూట్ వంటి విభాగాలున్నాయి. మనం కోరుకునే సౌకర్యాన్ని బట్టి, అక్కడ ఉండే సమయాన్ని బట్టి ధరలు ఉంటాయి.
ఇక ఇక్కడ భోజనంగా శాకాహారాన్ని, సాత్వికాహారాన్ని మాత్రమే అందిస్తారు. నిర్ణీత సమయంలో మాత్రమే మొబైల్ ఫోన్లను అనుమతిస్తారు. సిగరెట్లు, మద్యం, మాంసాహారం వంటివి ఆవరణలో నిషిద్ధం.

ప్రేమ జీవన వేదం..
ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దవైపోతున్నాయి.
ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది.
కానీ, మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం ఇరుకై•పోతున్నాయి.
వస్తువుల్ని ప్రేమించి.. మనుషులను ద్వేషించుకునే ధోరణి ప్రబలిపోతోంది.
వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం.
ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు ఎంతో ‘స్మార్ట్’..
కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం చాలా ‘హార్డ్’గా మారిపోతున్నాం.
అందరిదీ అదే తీరు. ఇదే లోకం రీతిగా మారిపోయింది.
అసూయ, ద్వేషం అనేవి అనివార్య గుణాలైపోయాయి.
ఒకరినొకరు అకారణంగా ద్వేషించుకోవడం అనేది నేడు చాలా ‘కామన్’ అయిపోయింది.
మనసు నిండా ద్వేషాన్ని నింపుకుంటే.. చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం.
అంతెందుకు? మనల్ని మనం జయించలేం.
ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు. మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విభజన రేఖలు గీస్తుంది. వివక్షను నూరిపోస్తుంది. కులం, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా మనుషులను విభజిస్తుంది. సాటి మనుషుల మధ్య హక్కుల రెక్కలను నిర్దాక్షిణ్యంగా తెగ్గొడుతుంది.
ద్వేషం.. ఎల్లప్పుడూ విషాన్ని కక్కుతుంది. ద్వేషంతో మాట్లాడే ఒక్క మాట.. ఒక్క పదం.. వేనవేల జీవితాల్లో అంతులేని విషాదాలను సృష్టిస్తుంది. చరిత్రలో మానని గాయాన్ని రేపుతుంది. విద్వేషాగ్నిని రగిలిస్తుంది.
ద్వేషం.. పైకి మనిషిని మనిషిగానే ఉంచుతుంది. కానీ, లోపల మానవత్వాన్ని చంపేస్తుంది. దీనికి విరుగుడు మంత్రం- రెండక్షరాల ప్రేమ.
ద్వేషాన్ని జయించే ఏకైక అహింసా ఆయుధం.. ఈ ప్రపంచంలో ‘ప్రేమ’ ఒక్కటే. దీనితో లోకాన్ని జయించవచ్చు. మనం చేసే పనిలో విజయం సాధించవచ్చు. మనల్ని మనం జయించవచ్చు.
ద్వేషం.. ప్రేమ.. ఈ రెండూ మనలోని స్వభావాలే. వీటిలో మనం ఏ స్వభావానికి లోబడితే.. ఆ స్వభావిగా మనం రూపుదిద్దుకుంటాం.
ప్రేమ, దయ, ••రుణ, సహృదయత అనే నాలుగు పునాది రాళ్లపై ఉన్న భూమిపై మనం జీవిస్తున్నాం. కానీ, మన ప్రవర్తనతో, మన దృక్పథాలతో ఈ పునాదిరాళ్లను మనకు మనమే బలహీనం చేసుకుంటున్నాం.
పునాది బలహీనమైతే భవనం కుప్పకూలిపోతుంది.
మనుషుల్లో నైతిక పరివర్తన కొరవడితే మానవత్వం పతనమైపోతుంది.
ప్రేమైనా.. ద్వేషమైనా మనలోని స్వభావాలే.
మనం ప్రేమించే స్వభావులం కావాలంటే.. మనకు మనం ప్రేమతత్వాన్ని సంతరించుకోవాలి.
అప్పుడే మనుషులు నడయాడే ఈ నేల ప్రేమానందాల నందనవనం అవుతుంది.
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
పెరటి వైద్యం
మన ఇంటి పెరటిలోనే పెంచుకోదగిన ఔషధ మొక్కలు, వాటి సాయంతో తగ్గించుకోగల వివిధ వ్యాధుల గురించి తెలిపిన తెలుగు పత్రిక మే 2023 సంచికలోని ఆరోగ్య భాగ్యం శీర్షిక ఎంతగానో బాగుంది. మన భారతీయ సంప్రదాయంలోని పెరటి చెట్టు, వంటగది ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిపే కథనమిది.
- ఆర్.శేషగిరిరావు, ఎ.శ్రీనివాస్, ఆనంద్సాయి- హైదరాబాద్
వైశాఖ విశేషం
తెలుగు పత్రిక మే 2023 సంచికలో వైశాఖ మాసం గురించి అందించిన విశేషాలు బాగున్నాయి. ఈ మాసాన్ని మాధవ మాసం అంటారనీ, సాధన మాసంగానూ వ్యవహరిస్తారంటూ ఈ మాసంలో ఆచరించదగిన వ్రతాలు, నియమాల గురించి బాగా వివరించారు.
- కె.అరుంధతి- తిరుపతి, ఆర్.విజయభాస్కర్- విశాఖపట్నం, పి.యాదగిరి- వరంగల్, మరికొందరు పాఠకులు
నేటి నీతి కథలు
తెలుగుపత్రిక మే- 2023 సంచికలో అందించిన భారతంలో నీతి కథలు చదివించాయి. భారత, భాగవత, రామాయణాల్లో చక్కని నీతి కథలు ఉన్నాయి. అటువంటివి మరిన్ని అందించే ప్రయత్నం చేయండి. ఇవి నేటి తరం నేర్వాల్సిన నీతి కథలు.
-టి.మధుబాబు, విజయవాడ

వ్రతాల సాధన..బోనాల జాతర
ఆంగ్లమానం ప్రకారం ఆరవ నెల జూన్. ఇది తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ట - ఆషాఢ మాసాల
కలయిక. జ్యేష్ట మాసంలోని కొన్ని రోజులు, ఆషాఢ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. జూన్ 18 వరకు జ్యేష్ఠ మాస తిథులు, ఆపై 19 నుంచి 30 వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి. తొలి ఏకాదశి, యోగినీ ఏకాదశి, పూరీ జగన్నాథస్వామి రథోత్సవం వంటివి ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్య పర్వాలు. ఇంకా జ్యేష్ట, ఆషాఢ మాసాల కలయిక అయిన జూన్ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం..
2023- జూన్ 1, గురువారం, జ్యేష్ట శుద్ధ ద్వాదశి నుంచి
2023- జూన్ 30, శుక్రవారం, ఆషాఢ శుద్ధ ద్వాదశి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-జ్యేష్ఠం-ఆషాఢం- గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం
జ్యేష్ట మాస తిథులు ఇరవై రోజులు.. ఆషాఢ మాస తిథులు పది రోజుల పాటు ఉండే జూన్ నెల- శూన్య మాసం. శుభ ముహూర్తాలు లేకున్నా.. ఆచరించదగిన, పాటింపదగిన పర్వాలు, ఆచారాలు ఈ నెలలో కూడా ఉన్నాయి. ప్రధానంగా ఆషాఢ మాసం ప్రారంభమయ్యేది ఈ నెలలోనే. అతివల అరచేత గోరింటాకు సింగారమై మెరిసేది ఈ నెలలోనే! ఆషాఢంలో సాధారణంగా శుభ ముహూర్తాలు పెట్టుకోరు. వివాహ, గృహ సంబంధ కార్యాలను ఈ నెలలో వాయిదా వేస్తారు. అయితే, ఆయా తిథులను అనుసరించి నిర్వర్తించాల్సిన పూజాధికాలు, ఆచారాలు కొన్ని ఈ నెలలో ఉన్నాయి. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు. మునగ కూర కూడా తినాలని నియమం. అలాగే, ఆషాఢంలో అనపపప్పు వాడాలని అంటారు. ఈ నెలలో వచ్చే పర్వాల్లో అత్యంత విశిష్టమైనది, విష్ణువుకు ప్రీతికరమైనది.. ‘తొలి ఏకాదశి’. చాతుర్మాస్య వ్రతం కూడా ఈ నెల నుంచే ఆరంభం అవుతుంది. అలాగే, గురువును సైతం దైవంగా భావించి, ఎంచి కొలిచే మన భారతీయ గడ్డపై గురువును పూజించడానికి ఒక విశిష్టమైన రోజు ఉంది. అదే గురుపూర్ణిమ. అదీ ఈ నెలలోనే వస్తుంది. ఈ నెలలో తెలుగు రాష్ట్రాలలోని పల్లెల్లో జాతర సంరంభం నెలకొంటోంది. ఎటుచూసినా అమ్మవార్ల పూజలతో బోనమెత్తిన పల్లెలు.. శివాలూగే భక్తజనంతో సందడి వాతావరణం అలముకుంటుంది. అందుకే ఆషాఢ మాసం అమ్మ వారి ఆరాధనకు శ్రేష్ఠమైనది. గృహనిర్మాణాలను ఈ మాసంలో ఆరంభించరు. శుభ కార్యక్రమాలను తలపెట్టరు. అయితే, ఆధ్యాత్మికంగా చూస్తే శక్తివంతమైనది ఈ మాసం. జ్యేష్ఠ - ఆషాఢ మాసాల కలయికతో కూడిన జూన్ మాసం.. అటు మండు వేసవికి, ఇటు వర్ష రుతువు ఆరంభ దినాలకు వారధి. నెల చివరకు వచ్చేసరికి ఎండలు చల్లబడతాయి.
జ్యేష్ట శుద్ధ ద్వాదశి/చంపక ద్వాదశి
జూన్ 1, గురువారం
జ్యేష్ట శుద్ధ ద్వాదశి తిథి నాడు చంపక ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని కూడా అంటారు. అలాగే, దీనిని రామలక్ష్మణ ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు కూర్మ జయంతి అని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీశంకరాచార్య కైలాసగమనం ఈ తిథి నాడే జరిగింది. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
జ్యేష్ట శుద్ధ త్రయోదశి/
తివ్రతాల ముహూర్త దినం
జూన్ 2, శుక్రవారం
మూడు వ్రతాలు చేసే ముహూర్త దినం- జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి.
ఒకటి- దుర్గంధ దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం.
రెండు- జాతి త్రిరాత్రి వ్రతం.
మూడు- రంభా త్రిరాత్రి వ్రతం.
చివరి రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం సాగేవి. ఈ మూడు వ్రతాల రీత్యానే కాక ఈనాడు మరొక విషయం చేత కూడా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి విద్యారణ్యారాధాన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారు. విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగుపెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. అమ్మవారు ప్రసన్నరాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నాడు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించాడు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరిహర రాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.
విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమను విద్యారణ్య స్వామి తన హయాంలో పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేకం చేశాడు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.
ఇక, ఈ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాలకు పుట్టినరోజులాంటిది. జూన్ 2ను ఆంధప్రదేశ్లో పునర్విభజన దినంగానూ, తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవంగానూ నిర్వహిస్తున్నారు.
జ్యేష్ట శుద్ధ చతుర్దంశి/చంపక చతుర్దశి,
జూన్ 3, శనివారం
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి చంపక చతుర్దశి. ఈనాడు వాయు వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, రుద్ర వ్రతం చేయాలని స్మతి కౌస్తుభం చెబుతున్నాయి.
జ్యేష్ట శుద్ధ పూర్ణిమ/ఏరువాక పూర్ణిమ/వట సావిత్రి వ్రతం
జూన్ 4, ఆదివారం
వర్ష రుతువు ఆరంభానికి సంకేతం.. జ్యేష్ట శుద్ధ పూర్ణిమ. ఈనాడు జరుపుకునే పర్వం ఏరువాక పున్నమి. ఇదే తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలున్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది. ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది. ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు. ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసిన తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి
పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకొనిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పుర్ణిమ పూర్వ కాలం నుంచి సంప్రదాయంలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’, ‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’, ‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’, ‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’.. తెలుగు నాట ప్రాచుర్యం గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఈ కాలంలో బండలు పగిలే భరణి కార్తె ఎండలు, రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తెతో ముంగిళ్లు చల్లబడతాయి. ఆపై ఆరుద్ర వాన అదును వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. రోహిణిలో విత్తనాలు చల్లితే రోళ్లు కూడా నిండని అల్ప పంట చేతికందుతుందని మన రైతుల నమ్మకం.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి కథ వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితులైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ‘వట’ అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.
కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ అనంతరం వచ్చే జ్యేష్ఠ బహుళ పాడ్యమి మొదలు జ్యేష్ఠ బహుళ సప్తమి వరకు ఎటువంటి ప్రత్యేక దినాలు లేవు.
జ్యేష్ట బహుళ అష్టమి/శివపూజకు
అంకురార్పణ
జూన్ 11, ఆదివారం
జ్యేష్ట బహుళ అష్టమి తిథి నాడు తిందుకాష్టమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక్కడి నుంచి మొదలుకుని దాదాపు ఏడాది పాటు శివపూజ చేయాలని నియమం. అలాగే ఈనాడు వినాయకాష్టమిగా నీలమత పురాణంలో పేర్కొన్నారు. త్రిలోచన పూజ, శీతలాష్టమి అనీ అంటారు.
జ్యేష్ట బహుళ ద్వాదశి
జూన్ 15, గురువారం
జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన వ్రతాలు, ముఖ్యమైన పూజాధికాలేమీ లేవు. కానీ, ప్రదోష వ్రతం మాత్రం ఆచరిస్తారు.
జ్యేష్ట బహుళ త్రయోదశి
జూన్ 16, శుక్రవారం
జ్యేష్ఠ బహుళ త్రయోదశి నాడు రోహిణీ వ్రతాన్ని ఆచరిస్తారు.
జ్యేష్ట బహుళ చతుర్దశి
జూన్ 16, శనివారం
జ్యేష్ఠ బహుళ చతుర్దశి తిథి శివుడికి ప్రీతికరమైనది. ఇది మాస శివరాత్రి తిథి.
జ్యేష్ట బహుళ అమావాస్య/
భోగశాయి పూజ
జూన్ 17, ఆదివారం
జ్యేష్ఠ బహుళ అమావాస్య నాడు భోగశాయి పూజ చేయాలని అంటారు. ఈ పూజ చేసి ఉపవాసం ఉండాలి. హేమాద్రి పండితుడు ఈ పూజకు సంబంధించిన వివరాలను హేమాద్రి వ్రత ఖండంలో పేర్కొన్నారు. ఇంకా ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. జ్యేష్ఠ బహుళ అమావాస్య మిథున సంక్రాంతి పర్వదినం.
అలాగే, జూన్ 17, ఆదివారం అంతర్జాతీయ పితృ దినోత్సవం (ఫాదర్స్ డే)గా పాటిస్తారు.
ఆషాఢ శుద్ధ పాడ్యమి
జూన్ 19, సోమవారం
ఈనాటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది.
ఆషాఢ శుద్ధ విదియ/జగన్నాథ రథయాత్ర
జూన్ 20, మంగళవారం
ఆషాఢ శుద్ధ విదియ తిథి నాడు పూరీ జగన్నాథ స్వామి రథోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. ఈనాడు ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్రను చూసి తీరవలసిందే. ఈ రథయాత్ర జగత్ప్రసిద్ధమైనది. అలాగే, ఈ తిథి శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినమని ప్రతీతి. ఒడిశాలోని పూరీ క్షేత్రానికి ‘పురుషోత్తమ క్షేత్రం’ అని మరో పేరు. వివిధ పురాణాల్లో ఈ క్షేత్ర ప్రశస్తి ఉంది. నారాయణుడు మొదట ఈ సాగర తీరంలోని అరణ్యాల్లో నీల మాధవుడిగా నెలకొని ఉన్నాడని అంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు స్వామికి రథయాత్ర జరుగుతుంది. నాటి నుంచి పది రోజులు గుండిచా మందిరంలో కొలువుదీరి సర్వులనూ అనుగ్రహించే దర్శనం ఒక మహా సౌభాగ్యం. ఈ రథయాత్ర ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రధానాలయం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా మందిరానికి వెళ్లే విశాల మార్గం (బొడొదండొ) లక్షలాది భక్తులతో కళకళలాడుతుంది. ఉపనిషత్తుల్లో వర్ణించిన విధంగా- శరీర రథంలో పరమాత్మను దర్శించే (కఠోపనిషత్తు) అంతర్ముఖ సాధనకు ఈ యాత్ర ఒక ప్రతీక. శ్రీ క్షేత్రమని కూడా ప్రసిద్ధి పొందిన ఈ మహా స్థలం, ఇక్కడి ధర్మాలు ఒడిశా సంస్క•తిపై ప్రగాఢ ప్రభావం కలిగి ఉండటమే కాక, ప్రపంచం దృష్టిని సైతం ఆకర్షించే సాంస్క•తిక అంశాలుగా మారిపోయాయి. జగన్నాథుని ‘నందిఘోష’ రథం, బలభద్రుడి ‘తాళధ్వజ’ రథం, సుభద్రాదేవి ‘దర్పాదళన’ రథాలను ఏటా దారువులతో నిర్మిస్తుంటారు. వాటి శిల్ప వైఖరి, వాటిలో పరివేష్టించే దేవతలు, ఈ క్షేత్రానికే పరిమితమైన ప్రత్యేకతలు. రథంలో ఉన్న జగన్నాథుడిని, పది రోజులు గుండిచా మండపంలో ఉండే స్వామిని దర్శిస్తే వేయి యాగాలు చేసిన ఫలం లభిస్తుందని స్కంద పురాణం చెబుతోంది. ఆదిశంకరులు ఈ క్షేత్రంలో గోవర్ధన మఠాన్ని స్థాపించి, స్వామిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. శ్రీరామానుజాచార్య, నింబార్కాచార్య, చైతన్య మహాప్రభు, గురునానక్, తులసీదాస్, వల్లభాచార్య వంటి మహాత్ములు జగన్నాథుని దర్శనంతో పులకించారు. ఆధ్యాత్మిక శక్తికి, చారిత్రక ప్రశస్తికి కేంద్రం ఈ క్షేత్రం. పూరీ జగన్నాథుని రథయాత్రను జీవితంలో ఒకసారైనా కనులారా వీక్షించాలని భక్తులు తలుస్తారు.
ఆషాఢ శుద్ధ తదియ/యోగా దినోత్సవం
జూన్ 21, బుధవారం
ఆషాఢ శుద్ధ తదియ నాడు ఆచరించాల్సిన ప్రత్యేక వ్రతాలేమీ లేవు. అయితే, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనాడే. యోగాకు పుట్టినిల్లు మన భరతఖండమే కావడం విశేషం. ఈ గడ్డపై పుట్టిన యోగా పక్రియ ప్రస్తుతం దాదాపు 180కిపైగా దేశాల్లో అధికారిక ఆరోగ్య విధానంగా అమలవుతోంది. ఇది భారతీయులకు గర్వకారణం.
అలాగే, సంవత్సరంలోనే సుదీర్ఘమైన రోజు జూన్ 21. ఈ రోజు పగలు, రాత్రి సమయాలు సుదీర్ఘంగా ఉంటాయి. దీనినే లాంగెస్ట్ డే అంటారు.
ఆషాఢ శుద్ధ పంచమి
జూన్ 23, శుక్రవారం
ఆషాఢ శుద్ధ పంచమి తిథి నాడు కావేరీ నదీ తీరవాసులు ‘ఆడిపదినెట్టు’ అనే పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఆదిపదినెట్టు అంటే ఆషాఢ మాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. మనకు మాత్రం ఇది ఆషాఢ మాసం ఐదవ రోజువుతుంది. ప్రాయకంగా ఈనాటికి కావేరి నదికి కొత్త నీళ్లు వస్తాయి. కాబట్టి అక్కడ ఇది వ్యవసాయ పనులకు అనువైన కాలం. కావేరీ వాసులు ఈ మాసాన్ని ‘ఆడా మాసం’గా కూడా వ్యవహరిస్తారు. ఈ తిథిని ‘స్కంద పంచమి’గా కూడా పిలుస్తారు. స్కందుడి (కుమారస్వామి)ని ఈ రోజు విశేషంగా ఆరాధిస్తారు.
ఆషాఢ శుద్ధ షష్ఠి
జూన్ 24, శనివారం
ఆషాఢ శుద్ధ షష్ఠి నాడు స్కంద వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని శోడశోపచారాలతో పూజించాలి. ఉపవాసం ఉండాలి. నీళ్లు మాత్రమే తీసుకోవాలి. మర్నాడు స్వామిని దర్శించుకోవాలి. ఈ వ్రతాచరణను ప్రధానంగా శరీరారోగ్యానికి నిర్దేశించారు.
ఆషాఢ శుద్ధ సప్తమి/తెలంగాణ బోనాలు పండుగ ప్రారంభం
జూన్ 25, ఆదివారం
ఆషాఢ శుద్ధ సప్తమి నాడు ద్వాదశీ సప్తమీ పూజ నిర్వహిస్తారు. ఇది సూర్యారాధనకు ఉద్ధిష్టమైన తిథి. ఈనాడు చేసే పూజను ‘మిత్రాఖ్య భాస్కర పూజ’ అని అంటారు.
ఇక, తెలంగాణలో ఈనాటి నుంచి బోనాల పండుగ. ఇది బోనాల పర్వానికి ఆరంభ దినం. జూన్ 25వ తేదీ, ఆదివారం, ఆషాఢ శుద్ధ సప్తమి నుంచి మొదలయ్యే ఈ పండుగ ఆపైన వచ్చే ఆదివారాల (జూలై 2, 9, 16)లో తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీటినే ఆషాఢ బోనాలుగా వ్యవహరిస్తారు. సృష్టి, స్థితి, లయ కారణభూతమైన ఆది పరాశక్తే బోనాల ఉత్సవాల్లో ఆరాధ్య దేవత. ఈనాటి నుంచి తెలంగాణ పల్లెల్లో కొలువుదీరిన అమ్మవార్లు ప్రత్యేక పూజలు అందుకుంటారు. వీరికి బోనం (అన్నం, ఇతర పదార్థాలతో కూడిన కుండ)లో భక్తులు మొక్కులు, నైవేద్యాలు సమర్పిస్తారు. బోనంలో వండిన అన్నం, బెల్లం, పెరుగు, వేపాకులతో కలిపిన నీరు ఉంటాయి. సాంక్రమిక వ్యాధుల నివారణకు ఈ దినుసులన్నీ ఎంతగానో ఉపకరిస్తాయి. మహిళలు మొక్కుబడులను బోనాల రూపంలో తీర్చుకుంటారు. మహంకాళి దేవతకు ఈ సంబరాల్లో విశేషమైన పూజలు జరుగుతుంటాయి. ప్రకృతి శక్తి విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతం చెబుతోంది. వీరి శుభ దీవెనల వల్లే గ్రామాల్లో ఉపద్రవాలు, అరిష్టాలు కలగకుండా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. తొలుత గోల్కొండ అమ్మవారి పూజలతో బోనాల తొలి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆపై హైదరాబాద్ పాత నగరంలోని లాల్దర్వాజా అమ్మవారి జాతర, సి•కింద్రాబాద్ ఉజ్జయినీ శ్రీ మహంకాళి అమ్మవారి జాతర నిర్వహిస్తారు.
ఆషాఢ శుద్ధ అష్టమి
జూన్ 26, సోమవారం
ఆషాఢ శుద్ధ అష్టమి తిథి నాడు మహిషఘ్నీ పూజ చేయాలని స్మతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. గదాధర పద్ధతి అనే మరో గ్రంథంలో ఆషాఢ శుద్ధ అష్టమి దుర్గాష్టమి అనీ, పరశురామి యాష్టమీ అని పేర్కొన్నారు. అష్టమి నాడు మహిషాసుర మర్దని పూజ చేయాలని అందులో ఉంది.
ఆషాఢ శుద్ధ నవమి
జూన్ 27, మంగళవారం
ఆషాఢ శుద్ధ నవమి తిథి నాడు ఐంద్రాదేవిని పూజించాలని స్మతి కౌస్తుభంలో వివరించారు. ఈమె శక్తి దేవత.
ఆషాఢ శుద్ధ దశమి
జూన్ 28, బుధవారం
ఆషాఢ శుద్ధ దశమి నాటి నుంచే శాక వ్రత మహాలక్ష్మీ వ్రతం ఆరంభం అవుతుంది. దీనినే దధి వ్రతారంభమనీ అంటారు. ఈనాడు మహాలక్ష్మిని పూజించి నెల పాటు ఆకుకూరలు తినడం మాని ఆకు కూరలు దానం చేయాలి. శాక వ్రతం అనేది చాతుర్మాస్య వ్రతం ఆచరించే నాలుగు నెలల్లో ఒక వ్రతాచరణ మాసం. ఈ మాసానికి సంబంధించి, ఈ మాసంలో లభించే ఆహార పదార్థాలనే భుజించాలని నియమంగా పెట్టారు. ఆరోగ్య పరిరక్షణ ఈ శాక వ్రతం ఉద్దేశం. అలాగే, ఆషాఢ శుద్ధ దశమి చాక్షుస మన్వంతరాది దినం. చాక్షుస మనువు మనువుల్లో ఆరవ వాడు. ఈయన ఉగ్రుడనే రాజు కుమార్తె అయిన విదర్భను వివాహమాడాడు. ఇతని మన్వంతరమున మనోజవుడు అనేవాడు ఇంద్రుడు. సుమేధ, అతి నామ మున్నగు వారు సప్తర్షులు.
ఆషాఢ శుద్ధ ఏకాదశి/తొలి ఏకాదశి
జూన్ 29, గురువారం
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రతీతి. దీనినే ‘సర్వేషాంశయనైక’ ఏకాదశి అని, దేవశయని ఏకాదశి అనీ అంటారు.
ఏకాదశి అనగా, ప్రతి పక్షము (15 రోజులు)నకు ఒకసారి వచ్చే పదకొండవ (11) తిథి. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏడాది పొడవునా ఇలా 24 ఏకాదశులు ఉంటాయి. ఏకాదశులన్నీ పుణ్యప్రదాలు. ఆ రోజున హరినామ కీర్తన ప్రధానంగా చేస్తారు. కాబట్టి ఏకాదశిని ‘హరివాసరం’ అని కూడా అంటారు. శిష్టులు ఏకాదశి నాడు పరమ నిష్టగా ఉండి ఉపవాసం ఆచరిస్తారు. దశమి నాటి రాత్రి నిరాహారుడై, ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా, ద్వాదశి ఉదయం పారాయణమొనర్చి, ద్వాదశి నాడు రాత్రి కూడా నిరాహారుడై ఉండాలి. అప్పుడు కాని ఏకాదశి వ్రతం సంపూర్ణం కాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారు ఆ రోజు సూర్యచంద్రాది గ్రహణముల కాలంలో భూరి దానం ఇస్తే పుణ్యం కలుగుతుంది. అంతేకాక అశ్వమేథ యజ్ఞ ఫలం, అరవై వేల సంవత్సరాల తపఃఫలం పొందుతారని ప్రతీతి. ఏకాదశి నాడు ఉపవసించడం- బ్రాహ్మణులకు దానం ఇవ్వడం కంటే, విద్యార్థులకు వేద విద్యాదానం చేయడం కంటే ఉత్తమమైనదని పురాణేతిహాసాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండలేని వారికి వాయు పురాణంలో ప్రత్యామ్నాయాలు చూపారు. ఉపవాసం చేయలేనపుడు వాయు భక్షణం, అది చేతకానపుడు పంచగవ్యం లేక నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. అదీ సాధ్యం కానపుడు ఉడకని పదార్థాలు లేక హవిష్యాన్నం తినవచ్చు. ఇది కూడా చేయలేని వారు ఒక్క పొద్దు ఉండవచ్చు.
ఏకాదశి నాడు భుజించే వాడు చాంద్రాయణ వ్రతం చేస్తే కాని ఆ పాపాన్ని పోగొట్టుకోలేడని ప్రతీతి. ఒకసారి బ్రహ్మ ఫాల భాగం నుంచి ఒక చెమట బిందువు కిందపడిందట. దాని నుంచి ఓ రాక్షసుడు పుట్టాడు.
‘ప్రభూ నాకు నివాసం చూపు’ అని ఆ రాక్షసుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ- ‘నువ్వు ఏకాదశి నాడు ఎవరైతే భుజిస్తారో వారి శాల్యన్నపు మెతుకులతో నివసిస్తావు. పిదప వారి కడుపుల్లోకి చేరి క్రిములుగా మారతావు’ అని చెప్పాడట.
అందువల్లే దక్షిణ భారతదేశంలో ఏకాదశి నాడు వరి అన్నం చాలామంది తినరు.
ఇక, ఆషాఢ శుద్ధ ఏకాదశి విషయానికి వస్తే- ఇది తొలి ఏకాదశి. ఇది పుణ్యతిథిగా, పవిత్రమైన రోజుగా ప్రసిద్ధి కుల, వర్గ భేదాలకు అతీతంగా ఈ పండుగ రోజున భగవంతుడి ధ్యానంలో ఉపవసించడం సంప్రదాయంగా వస్తున్న గొప్ప ఆచారం. శరీరాన్ని, మనసును శుభ్రం చేసుకోవడానికి అనువైన సమయమిది. ఏకాదశి మహాత్మ్యం గురించి అనేక పౌరాణిక గాథలు ఈ వ్రతం ఇహపరాల నడుమ సేతుబంధనం వంటిదని వర్ణించాయి. తొలి ఏకాదశి పర్వం అనేక విధాలుగా ఉద్ధిష్టమై ఉంది. ఈ తిథి నాడు ఉపవససించి యథాశక్తి భగవంతుడిని కొలవాలని ఆయా పురాణాలు చెబుతున్నాయి.
ఆషాఢ శుద్ధ ద్వాదశి/చాతుర్మ్యాస వ్రతారంభం/వాసుదేవ ద్వాదశి
జూన్ 30, శుక్రవారం
ఆషాఢ శుద్ధ ద్వాదశిని వాసుదేవ ద్వాదశిగా వ్యవహరిస్తారు. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకో ముఖ్య విశేషం ఏమిటంటే ఈనాటి నుంచే చాతుర్మ్యాస వ్రతం ఆరంభమవుతుంది. వర్ష (ఏడాది) కాలంలో అపథ్య ఆహారం మాన్పించే ఆరోగ్య పరిరక్షణ సూత్రంగా ఈ వ్రతం రూపుదాల్చిందని అంటారు. సంప్రదాయ ధార్మిక భావనలు, ఆరోగ్య పరిరక్షణ నియమాల సమ్మేళనమే ఈ వ్రతాచరణ సంకల్పంగా భావించవచ్చు. అందుకే మహిళలకు చాతుర్మాస్య వ్రతం అత్యంత ప్రీతకరమైనది.
చాతుర్మాస్య వ్రత విధానం గురించి స్కాంద, భవిష్యోత్తర పురాణాల్లో విపులంగా ఉంది. శ్రావణ మాసంలో కూరలను, భాద్రపదాన పెరుగును, ఆశ్వయుజాన పాలును, కార్తీక మాసాన పప్పు పదార్థాలను వదిలిపెట్టి భుజించాలని వాటిలో ఉంది. ఇంకా నిమ్మ, రా•మాషములు, ముల్లంగి, ఎర్రముల్లంగి, గుమ్మడి, చెరుకు, కొత్త ఉసిరిక, చింత మొదలైన వాటిని త్యజించాలని స్కాంద పురాణంలో ఉంది. పాత ఉసిరిక ఎక్కడ దొరికినా, దానిని సంపాదించి తినాలని అందులో పేర్కొన్నారు. పై ఆహార పదార్థాల నిషేధాన్ని బట్టి వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని మానిపించి, ఆరోగ్య పరిరక్షణమే ఈ వ్రత పరమార్థమని స్పష్టమవుతోంది. వర్షా కాలం క్రిమికీటకాలకు పుట్టినిల్లు. కొత్త రోగాలు పుట్టుకొస్తాయి. కాబట్టి ఈ వ్రతం అపథ్య ఆహారాన్ని త్యజించిందని భావించాలి.
‘చతుర్మాస్య’మనగా నాలుగు నెలల కృత్యం. రుతువులు మూడు. అవి- వర్ష రుతువు, హేమంతం, వసంతం. వైదిక కాలంలో ఒక్కో రుతువు కాల వ్యవధి నాలుగు నెలలు. వానాకాలంతోనే సంవత్సరం ఆరంభం అవుతుంది. అందుకే సంవత్సరాన్ని ‘వర్ష’ అని కూడా అంటారు. ప్రతి రుతువు ప్రారంభంలో ప్రత్యేక యాగాలు కూడా ఆరంభమవుతాయి. ఈ పద్ధతి ప్రకారం- ఫాల్గుణ పూర్ణిమ నుంచి వైశ్య దేవ యజ్ఞం, ఆషాఢ పూర్ణిమ నుంచి వరుణ ప్రఘాస యజ్ఞం, కార్తీక పూర్ణిమ నుంచి సాకమేథ యజ్ఞం నిర్వహించాలని శతపథ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. ఈ వరుస క్రమంలో వర్ష రుతువున చాతుర్మాస్యం నిర్వహించుకోవడం ఆచారంగా వస్తోంది.
చాతుర్మాస్యం ఆషాఢ శుక్ల (శుద్ధ) ఏకాదశితో ప్రారంభమై కార్తీక శుక్ల ద్వాదశితో సమాప్తం అవుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి సంవత్సరానికి ప్రథమ ఏకాదశి. ఈ ఏకాదశినాడు విష్ణువు క్షీర సముద్రంలో శేష పానుపుపై శయనిస్తాడని పురాణ ప్రతీతి. ఈ వ్రతమును ఏకాదశి నుంచి కానీ, కటక సంక్రాంతి దినం నుంచి కానీ, ఆషాఢ పూర్ణిమ నుంచి కానీ ఆరంభించవచ్చు. చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించడం వల్ల సంవత్సరకృత్య పాపాలన్నీ నశిస్తాయని భారత వచనం.
భీష్ముడు శేషధర్మంలో చాతుర్మాస్యం స్త్రీలకే ముఖ్యమైనదని పేర్కొన్నాడు. అయినా ఇది అందరూ ఆచరించదగిన వ్రతం. ముఖ్యంగా ఆశ్రమవాసులకు ఇది ముఖ్యమైన వ్రతమని పురాణాల్లో ఉంది. ఇక, బుద్ధుడు చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్టు జాతక కథల్లో ఉంది. ఈ వ్రతాన్ని ఆ కథల్లో ‘కత్తిక నక్ఖత్త’, ‘కత్తికరత్తి’, ‘కత్తికఛన’ అని వర్ణించారు. రాజగృహం, అవంతి, వారణాసి తదితర మహా నగరాల్లో ఈ చాతుర్మాస్య సమాప్యుప్త ఉత్సవాల సప్తాహం అత్యంత వైభవంగా నిర్వహించే వారు. జైనులు ఇప్పటికీ చాతుర్మాస్య కాలంలో అత్యంత నిష్టగా అహింసా వ్రతాన్ని ఆచరిస్తారు.

నామం పెట్టడం.. టోపీ వేయడం
మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి జాతీయం. జాతీయాలనే పదబంధాలనీ, పలుకుబడులనీ అంటారు. విడివిడి మాటలు కలిసి విశేషార్థంలో ఏర్పడేది జాతీయం. జాతీయంలోని అర్థానికీ, లక్ష్యార్థానికీ పోలిక ఉంది. వ్యాకరణంలోని శబ్ద పల్లవాలు ఇలాంటివే. జాతీయాలను లేదా సామెతలను మరో భాషలోకి అనువదించలేం. కానీ, వాటికి సమానార్థకమైనవి ఉండొచ్చు.
ప్రాచీన కవుల కావ్యాల్లో కూడా జాతీయాలు కనిపిస్తాయి. ఉబుసుపోక, ఎకసెక్కమాడు, కడుపుచల్లగా వంటివి కవులు ప్రయోగించారు.
ఇంటిపోరు, అత్తగారి సాధింపు, గుండెల మీద కుంపటి మొదలైనవి కుటుంబ సంబంధమైన జాతీయాలు.మన పై అధికారి కఠినంగా ఉంటే, ‘వాడు నా మొగుడురా బాబా’ అంటాం. పెళ్లీడుకొచ్చినా పెళ్లికాకపోతే అదొక భారంగా భావించి పూర్వం కూతురును ఉద్దేశించి ‘గుండెలపై కుంపటి’ అనేవారు.
జాతీయాల్లో శరీర అవయవాలను ఉపయోగించి చెప్పేవి చాలా ఉన్నాయి. తలలో నాలుక, చెవి కోసుకోవడం, కళ్లకద్దుకోవడం, పొట్టకొట్టడం, నోరు పారేసుకోవడం, ఒంటికాలిపై లేవడం, కళ్లలో నిప్పులు పోసుకోవడం, నోరెట్టుకుని జీవించడం వంటివి.
సామెతల్లోలాగా జాతీయాల్లోనూ రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించినవి ఉన్నాయి.
రామరాజ్యం, లక్ష్మణరేఖ, ఉబతాభక్తి, కబంధహస్తం మొదలైనవి రామాయణానికి సంబంధించినవి.
శల్యసారథ్యం, పద్మవ్యూహం, కీచకుడు, గొంతెమ్మకోరిక వంటివి భారతానికి సంబంధించినవి.
సంస్క•త సాహిత్య ప్రభావంతో ఆపాదమస్తకం, కాకతాళీయం, నభూతోనభవిష్యతి, అసిధారావ్రతం వంటివి ఏర్పడ్డాయి.
మన ఆచారాలు, నమ్మకాలకు సంబంధించిన వాటిలో మూగనోము, నీ కడుపున పుడతా, పప్పన్నం పెట్టడం, తిలోదకాలు వంటివి ఉన్నాయి.
నాటక సాహిత్యంలోని నాంది, భరతవాక్యం అనేవి కూడా జాతీయాలు అయ్యాయి. ‘నీ భరతం పడతా’ అనడం తెలిసిందే. కొన్ని జాతీయాలు అలంకారికంగా, కవితాపరంగా ఉంటాయి. గాలిమేడలు, ఇసుకేస్తే రాలనంత, కైంకర్యం, కుంభకోణం వంటివన్నమాట
ఒకే వస్తువుపై అనేక జాతీయాలు ఉన్నాయి. కాకి గోల, కాకి మూక, కాకి బంగారం, కాకి కూడు,, కాకి ఎంగిలి వంటివి ఈ కోవకు చెందుతాయి.
ఖరారునామా, ఖరాబు చేయడం, గులాంగిరి, ఖతం వంటివి ఉర్దూ ప్రభావం వల్ల ఏర్పడ్డాయి. సామెతలకు మాదిరిగానే జాతీయాలకూ కథలున్నాయి. ఇక, జంట పదాలుగా ఉపయోగించే జాతీయాలూ లేకపోలేదు. అవకతవకలు, కారాలూ మిరియాలూ, రాతకోతలు అనేవి ఇలాంటివే. ఇక, ఠక్కున నవ్వించే జాతీయాలకు మన తెలుగులో కొదవలేదు. పుల్లయ్య వేమారం, ఉత్సవ విగ్రహం, కరువులో అధిక మాసం, అలకపాన్పు, పానకంలో పుడక, నూతిలో కప్ప, గంగిరెద్దు, అతివృష్టి-అనావృష్టి, మసిపూసి మారేడుకాయ, కళ్లలో నిప్పులుపోసుకోవడం, పక్కలో బల్లెం, నామం పెట్టడం, టోపీ వేయడం, తాటాకులు కట్టడం వంటివి నవ్వు పుట్టించే జాతీయాలు.
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
June 03, 2023
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia