Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

సమస్తం.. పుస్తకం
పుస్తకం అంటే ఆపాద మస్తకం మనల్ని స్ప•శించే ఓ నేస్తం.
మంచి పుస్తకం మన మస్తిస్కాన్ని తెరుస్తుంది.
భావాలను, ఆలోచనలను విశాలం చేస్తుంది.
జీవన సరళిని మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.
అందుకే పుస్తకం అంటే కేవలం కాగితాల పుటలు కాదు..
పుస్తకం అంటే ఓ భావం.. ఓ బంధం.. ఓ భావోద్వేగం.
మనిషిని మహోన్నతుడిని చేసేది పుస్తకమే.
పుస్తకం మాట్లాడదు. కానీ, మనతో ఎన్నో భావాలను పలికిస్తుంది. ఆలోచనల్ని చిలకరిస్తుంది. ఊరడిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది. కథలు చెబుతుంది. కలలు కనేలా చేస్తుంది. వాటిని సాకారం చేసుకునే సంకల్పాన్నిస్తుంది.
అక్షరమనే ఆయుధంతో లక్ష్యాలను ఛేదించే శక్తినిస్తుంది.
మంచి పుస్తకంలోని ఒక్క పేజీ తిరగేస్తే చాలు.. మనతో పరిచయం పెంచుకుని తనే ఓ ప్రపంచమవుతుంది.
పుస్తకమంటే ఏకాంతంలో తోడుండే నేస్తం..
ఓటమిలో ఓదార్పు.. లక్ష్యసాధనలో చేదోడువాదోడు..
కష్టంలో కుంగిపోనివ్వదు. విజయానికి పొంగిపోనివ్వదు.
మనలోని అసలైన మనిషికి ప్రాణం పోస్తుంది.
మన ఇంట్లో ఓ పాత పుస్తకం ఉందంటే మంచిచెడులు చెప్పే అవ్వ ఉన్నట్టే.. ఇంట్లోకి కొత్త పుస్తకం వచ్చిందంటే అప్పుడే పుట్టిన ఆడపిల్లంతటి అబ్బురం, అపురూపం.
అందుకే పుస్తకం అంటే ఓ బంధం.. ఓ భావోద్వేగం.
ఏటా డిసెంబరు - జనవరి నెలల్లో అనేక పండుగలు, పబ్బాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పండుగ కూడా వస్తుంది. డిసెంబరులో హైదరాబాద్లోనూ, దీని తరువాత జనవరిలో విజయవాడలోనూ పుస్తక మహోత్సవం నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ‘పుస్తకం’ గురించి కాసింత మననం చేసుకుందాం. పుస్తకాన్ని మనదాన్ని చేసుకుందాం.
ఒకసారి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన
ఒకసారి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్ జరుగుతోంది. వ్యాపార సంస్థ యజమాని డైరెక్టర్లకు ఒక ప్రశ్న వేశాడు.
‘ఈ ప్రపంచంలో వెలకట్టలేని ఖరీదైన భూమి ఎక్కడ ఉంది?’.
‘గల్ఫ్ దేశాల్లో..’ అని కొందరు చెప్పారు.
‘ఆఫ్రికాలోని వజ్రాల గనులు..’ అని ఇంకొందరు చెప్పారు.
ఇవేవీ సరైన సమాధానాలు కాదని పెదవి విరిచాడు యజమాని. అక్కడంతా నిశ్శబ్దం అలముకుంది.
ఆయనే నిశ్శబ్దాన్ని చీలుస్తూ, ‘ఈ ప్రపంచంలో అతి ఖరీదైన స్థలం శ్మశానం’ అన్నాడు.
అక్కడ మళ్లీ నిశ్శబ్దం అలముకుంది.
‘శ్మశానమా? అదెలా?’ అనేదే అక్కడున్న అందరి సందేహం.
అప్పుడా యజమాని ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘ఈ లోకంలో అనాదిగా కోట్లానుకోట్ల మంది పుడుతున్నారు. మరణిస్తున్నారు. ఇంకా పుడుతూనే ఉన్నారు. చనిపోతూనే ఉన్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటల్ని ఈ ప్రపంచానికి పంచారు. కానీ, ఎక్కువ మంది మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సును, అద్భుతమైన ఆలోచనలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడటం లేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కలేదు. వారి ఆలోచనలూ, భావాలూ అన్నీ సమాధుల్లోనే నిక్షిప్తమైపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడైనా ఉంటుందా?’.
ఆనాటి సమావేశంలో పాల్గొన్న వారిలో టాడ్ హెన్రీ (•శీ•• •వఅతీ•)
ఒకరు.
కంపెనీ యజమాని చెప్పిన మాటలు హెన్రీ మనసులో గట్టిగా నాటుకుపోయాయి. అంతకుమించి హత్తుకుపోయాయి.
ఆ ప్రేరణతోనే హెన్రీ నిణఱవ వఎజూ•••
అనే పుస్తకం రాశాడు. తరువాత కాలంలో అద్భుతమైన రచయితగా పేరొందాడు.
ఆయన ఈ పుస్తకంలో ఏమంటాడంటే..
మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్లకండి. మీలో ఉన్న ఆలోచనలను, మంచిని ఈ లోకానికి పంచేసి వెళ్లండి’.
ఈ పుస్తకం చెప్పేదేమంటే-
‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్లండి.
మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
మీకు ఏదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
ప్రేమను పంచండి. దాన్ని మీలోనే దాచుకుని వృధా చేయకండి.
ఇవ్వాల్సిందంతా లోకానికి ఇచ్చేశాక ఖాళీగా వెళ్లిపోదాం..
అప్పుడు హాయిగా, ప్రశాంతంగా.. Let us Die Empty!
ఇదే కథను పుస్తకాలకు అన్వయించి చూడండి.
కాలక్రమంలో ఎన్ని పుస్తకాలు గతించిపోతున్నాయి?..
అందులోని మంచి విషయాలు నలుగురికీ చేరకుండా ఎలా మరుగైపోతున్నాయో గమనించారా?.
మన భారతదేశంలో.. అందునా తెలుగునేలపై అద్భుతమైన సాహిత్యం వెల్లివిరిసింది. అందులో పిల్లల కథల నుంచి పెద్దల విషయాల వరకు స్ప•శించని అంశమంటూ లేదు. కానీ మనం అసలు పాత పుస్తకం వాసనే చూడటం లేదు. ఇంట్లో పాత పుస్తకం ఉంటే పాత సామాను వాడికి అమ్మేయడమే నైజమైపోయింది.
ఇలా ఎన్ని పుస్తకాలు తమలోని మంచిని లోకానికి చాటకుండానే చిరిగిపోయాయో? ఇంకెన్ని అక్షరాలు చెరిగిపోయాయో?!. మరెన్ని అక్షరాలు చెదిరిపోయాయో!?
మనిషికి విషయజ్ఞానంతో పాటు మానసిక వికాసం, వినయం, విచక్షణా జ్ఞానం, మానవ సంబంధాలు.. ఇలా ఎన్నో నేర్పే గురువు పుస్తకం. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడం మన బాధ్యతే అయినా వారిని బడిలో చేర్చి చదివించడం ఒక్కటే ఆ బాధ్యతకు పరమావధి కాకూడదు. వారికి ఆలోచనల రెక్కలు తొడగడానికి మంచి పుస్తకాలను చదివించడం అలవాటుగా చేయాలి. వాళ్ల జీవితానికి, వ్యక్తిత్వానికి ఈ పుస్తకాలన్నీ పునాదులవుతాయి.
పిల్లల చేత చదివించడమే కాదు, పెద్దలుగా మనమూ చదివి, ఏది మంచి పుస్తకమో.. ఏ పుస్తకంలో యే మంచి విషయాలు ఉన్నాయో వారికి చెప్పాలి.
ఏ పుస్తకం చదవాలో చెబుతారా?
మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి పుస్తకాలు చదవాలి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో చెప్పాలంటే, మనం మనకంటే ఎవరైనా పెద్దవాళ్లను కలిస్తే, ‘అయ్యా! నేను జీవితంలో తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏదైనా సూచిస్తారా?’ అని అడగాలట. అప్పుడు ఆ పెద్దలు తమ అనుభవంతో మంచి పుస్తకాలేవో చెబుతారట.
పుస్తకాలు చాలా ఉంటాయి. చాలా దొరుకుతాయి. అలాగని ఏవి పడితే అవి చదవకూడదు. అప్పుడు మంచి పుస్తకం ఏదనేది ఎలా తెలుస్తుందంటే.. ‘మంచి పుస్తకాలను సూచించాల’ని మన పెద్దలను అడిగినపుడు.. లేదా వాటిని చదివిన వారిని అడిగినపుడు. మనం చదివే పుస్తకాల ద్వారా మనలోని సునిశిత ప్రజ్ఞ బయటపడాలి. మంచి ఆలోచనలు కలగాలి. మన ఆలోచనా పరిధిని ఆ పుస్తకంలోని అంశాలు పెంచాలి. చదివే ప్రతి మంచి పుస్తకంపై చదువరి వ్యక్తిగత సమీక్ష రాసుకోవాలి.
పుస్తకం ఎందుకు నచ్చింది? అందులో నచ్చిన/నచ్చని అంశాలేమిటి? అనేవి ఆ పుస్తకంలోని ఖాళీ పేజీల్లో రాయాలి. ఈ అలవాటు జీవితంలో ఏది మంచి? ఏది చెడు? అనే వివేచించుకునే నిర్ణయాత్మక శక్తిని ఇస్తుంది. తుదిగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది.
మన దేశంలో గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వారి ఇళ్లు చూస్తే.. అది ఇల్లా? గ్రంథాలయమా? అన్నట్టుంటుంది. ఎందుకంటే గొప్పవాళ్ల ఇళ్లలో ఉండేవి అనవసర వస్తువులు కావు. పుస్తకాలే!.
ఢిల్లీలోని మన భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు చెందిన తీన్మూర్తి భవన్కు వెళ్తే.. ఇప్పటికీ చాలా షెల్ఫ్లు పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి.
విద్యార్థులు ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నారు. చదువుల ఒత్తిడి, పోటీతో సతమతం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి పుస్తకమే మంచి నేస్తం అవుతుంది. సందిగ్ధావస్థలో ఉన్నపుడు మంచి నిర్ణయాలు తీసుకోగల ప్రజ్ఞ అంకురించాలంటే మంచి విషయాలను తెలిపే పుస్తకాలను చదువుతుండాలి.
పాఠ్య పుస్తకాల్లోని విషయాలు జీవించడం నేర్పవు. భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి వారి ప్రసంగాలు, రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలను చదవడం, మననం చేసుకోవడం పిల్లల దినచర్యలో భాగమైతే.. మహోన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలుగుతారు.
ఇవి తప్పక చదివించండి సుమా!
పాఠ్య పుస్తకాలు తప్ప అన్య పుస్తకాల ముఖమెరుగని పిల్లలను నేడు చూస్తున్నాం. గతంలో బడిలో చదువులతోపాటు రామాయణ-భారతాలు, పంచతంత్ర కథలు వంటివి పిల్లల చేత పెద్దలు చదివించే వారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు పట్టుకుంటే పిల్లల వీపు పగలగొట్టే పరిస్థితి. బడికెళ్లడం, అక్కడ చెప్పింది వినడం, తీరిక దొరికితే వీడియో గేమ్లు ఆడటం విద్యార్థుల దినచర్యగా మారింది.
రోజులో అరగంటైనా మంచి పుస్తకాలు చదవాలి. స్వయంగా చదవడం అనేది మెదడుకు బాగా ఎక్కుతుంది. విశ్లేషిస్తుంది. ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ పక్రియ అంతా మన నియంత్రణలోనే జరుగుతుంది. అదే వీడియోలు, కంప్యూటర్లు చూసి చదవడం, నేర్చుకోవడం చేస్తే పైన చెప్పిన పక్రియయేదీ జరగదు. దృశ్యం ఎప్పుడూ డిస్ట్రబెన్స్ కలిగిస్తుంది. పిల్లల్లో విషయాల్ని అర్థం చేసుకుని విశ్లేషించుకునే సామర్థ్యం పెరగాలంటే పఠనమే ఏకైక మార్గం. అందుకు వారి కోసం తల్లిదండ్రులు కొన్ని మంచి పుస్తకాలను చదివించాలి. ఇటీవల ప్రతి భారతీయ విద్యార్థి తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాల జాబితాను వెలువరించారు. ఇవే అత్యుత్తమ పుస్తకాలని కాదు. అంతకంటే మంచివీ ఉండొచ్చు. కానీ వీటి పఠనంతో విద్యార్థుల మనో సామర్థ్యాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అవేమిటంటే..
రామాయణం/మహా భారతం/భాగవతం
ఈ గ్రంథాలను ఇప్పటికే పలువురు పలువిధాలుగా రాశారు. కానీ, భారతీయ రాజకీయవేత్త, ప్రముఖ చరిత్రకారుడు సి.రాజగోపాలాచారి గారు రాసిన రామాయణ, భారతాలను పిల్లలు తప్పక చదవాలి. ఇందులో ఆయన ఆయా పాత్రల లక్షణాలు, వారు పాటించిన విలువల గురించి ఎంతో బాగా వివరించారు. అవి పిల్లలపై మంచి ముద్ర వేస్తాయి. ఇక, భాగవత కథలు సరళ భాషలో అందుబాటులో ఉన్నాయి.
అమర్ చిత్రకథలు: పిల్లలు చదవడానికి బాగా ఇష్టపడే కథల్లో ఇవీ ఒకటి. ఇందులో భారత చరిత్ర, పురాణాలు, మతం, సంప్రదాయాల వంటి బోలెడు విషయాలున్నాయి. మాల్గుడి డేస్: ఆర్కే నారాయణ్ రాసిన ఈ పుస్తకంలో 32 కథలుంటాయి. స్వామి అనే పిల్లవాడు రెండో తరగతి విద్యార్థి. అతని స్నేహితులు, ఇల్లు, తను చదివే పాఠశాల గురించి ఈ కథలు ఎన్నో విషయాలను చెబుతాయి.
పంచతంత్ర: విష్ణుశర్మ రాసిన ఈ కథల పుస్తకం పిల్లలకు ప్రియమైనది. ఐదు భాగాల ఈ పుస్తకంలోని కథలన్నీ జంతువుల చుట్టూ తిరుగుతూ పిల్లల్లో ఆసక్తిని పెంచుతాయి. మనిషి పాటించాల్సిన ధర్మాలను, నీతి సూత్రాలను చక్కని కథల రూపంలో మలిచారు.
ది వేదాస్ అండ్ ఉపనిషద్స్ ఫర్ చిల్డ్రన్: వేదాలు, పురాణాలు అంత తేలిగ్గా అర్థం కావు. వీటిని పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో సరళంగా రాశారు.
హితోపదేశం: ఇందులోని కథలు జంతువుల పాత్రలతో ఉంటాయి కాబట్టి పిల్లలను ఆసక్తిగా చదివిస్తాయి. విధి, దయ, నైపుణ్యం, తెలివి వంటివి నేర్పుతాయి.
ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్: భారతీయ చారిత్రక వారసత్వం గురించి పిల్లలకు ఇది అవగాహన కలిగిస్తుంది.
ఇంకా, కాశీ-మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, చందమామ కథలు, విక్రమార్క-భేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు వంటివి పిల్లల్లో పఠనాసక్తిని, జిజ్ఞాసను, నైతికత, క్షమ, దయ వంటి సుగుణాలను పెంచుతాయి.
ఇప్పుడు నడక నేర్వని బుడతడు కూడా వేలి కొసలతో డిజిటల్ విద్య సాగిస్తున్నాడు. వర్చువల్, ఆన్లైన్ క్లాసులతో కుస్తీ పడుతున్నాడు. అయితే, ఈ డిజిటల్ మాధ్యమాల్లోని కృత్రిమత్వం, యాంత్రికత్వం పిల్లల్ని ఆలోచనల్లేని మనుషులుగా మారుస్తోంది.
స్కూలు/కాలేజీ పుస్తకాలు చదవడం తప్ప వేరే లోకం లేదన్నంతగా పిల్లల ప్రపంచానికి ద్వారాలు మూసేస్తున్నాం.
మనం పైసా పైసా కూడబెట్టి పిల్లలకు ఆస్తిని ఇవ్వడానికి ప్రాణం పెడుతున్నాం తప్ప, మనిషికి ప్రాణం పోసి మనీషిని చేసే పుస్తక సంపదను మాత్రం పిల్లలకు వారసత్వంగా అందించలేకపోతున్నాం.
అందుకే మన అజ్ఞానానికి పుస్తకం పగలబడి నవ్వుతోంది.
ఒకప్పుడు బాల్యం, ‘అనగనగా..’ అంటూ అమ్మో, అమ్మమ్మో, తాతయ్యో చెప్పే కథలతో ప్రారంభమయ్యేది. ఇప్పుడు కథలు చెప్పే వారు లేరు. పిల్లల్లో ఆ జిజ్ఞాస కలిగించే తీరికా ఎవరికీ లేదు.
ఇక, మన తెలుగు నాట ప్రసిద్దికెక్కిన అత్యుత్తమ పుస్తకాలను పరిచయం చేసుకుందాం.
తీరిక చేసుకుని ఇవి తప్పక చదవండి..
కొందరికి ఫిక్షన్ ఇష్టం.. కొందరికి చరిత్ర ఇష్టం.. మరికొందరికి వేర్వేరు అభిరుచులు, ఆసక్తి ఉంటాయి. కాబట్టి ఫలానా పుస్తకమే ఉత్తమమైనదనీ చెప్పడం భావ్యం కాదు. కాకపోతే చాలామంది చదివిన పుస్తకాల్లో గొప్పగా అనిపించినవి మాత్రం కొన్ని కామన్గా ఉంటాయి. అటువంటి కొన్ని పుస్తకాలివి.. జీవితంలో తప్పక చదవాల్సినవి.
తెలుగు భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి గారి ఆత్మకథ అనుభవాలూ - జ్ఞాపకాలూ చదవాలి.
గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథల్లో అద్భుతమైనది- హంపీ నుంచి హరప్పా దాకా (తిరుమల రామచంద్ర).
మహాత్మాగాంధీ జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే సత్యశోధన అనే ఆయన రాసిన ఆత్మకథ చదవాలి.
గిరీశం లెక్చర్లు, మధురవాణి ముచ్చట్లు, రామప్పపంతులు కోతలు, చీపురుకట్ట తిరగేసే పూటకూళ్లమ్మ.. వీళ్లందరి మనస్తత్వాల్ని పట్టి చూపుతుంది గురజాడ వారి కన్యాశుల్కం నాటకం.
తెలుగు వచ్చిన వారంతా, తెలుగు వారమని చెప్పుకునే వారంతా చదవాల్సింది- విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు.
పుస్తకం నిండా తన బాధేదో తాను పడుతున్నా.. ఆయా సన్నివేశాల ద్వారా చదివే వారిని మాత్రం నవ్వించే రచన ముళ్లపూడి గారి కోతికొమ్మచ్చి (3 భాగాలు).
ఇక, ముళ్లపూడి మాటలు, బాపు గీతలు గిలిగింతలు పెట్టాలంటే బుడుగు పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిందే.
తానొక విశ్వనరుడినని ఎలుగెత్తారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. ఆయన కవితా విశ్వరూపం చూడాలంటే ఆయన అన్ని రచనలు ఒకే పుస్తకంలో లభించే సంకలనాన్ని చదవాలి.
ఉమర్ ఖయ్యూం రుబాయీలను తేనెతో కలిపి తెలుగు వారితో తాగించిన కవి దువ్వూరి రామిరెడ్డి. ఈయన పానశాలలో కవితలను తాగితే ఆనందంతో మత్తెక్కిపోవాల్సిందే.
‘నేను సైతం’ అంటూ శ్రీశ్రీ పారించిన విప్లవం మహాప్రస్థానం.. ఇది చదివితే మనం, మన ఆలోచనలు మరో ప్రస్థానం వైపు సాగుతాయంటే అతిశయోక్తి కాదు.
సరదా కథలతో చెంపలు ఛెళ్లుమనిపించే చక్కులతో కూడినవి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలు.
హిందూమతం గురించి, సనాతన ధర్మం గురించి ఏమైనా సందేహాలున్నాయా? అయితే వెంటనే కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాముల వారి జగ•ద్గురు బోధలు తిరగేయండి.
ఎందరో తత్త్వవేత్తలు.. వారి తత్త్వసారం గురించి తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పింది త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తలు.
ఇంకా, విద్యాప్రకాశానంద స్వామి వారి గీతామకరందం, సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు, పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం.. ఇవన్నీ ఆధ్యాత్మికతను, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
చలం అన్ని పుస్తకాలూ అద్భుతమే. మైదానంతో అలజడి సృష్టించిన ఈయన ప్రేమలేఖలు పుస్తకం కూడా చాలా బాగుంటుంది.
కథలెలా రాయాలో నేర్చుకోవాలని ఉందా? అయితే, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం చదివేయండి.
స్వయంగా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఆ భావన కలగాలంటే మల్లాది వారి చలవ మిరియాలు చదవండి.
మన వేషభాషలు, అలవాట్లు, మనస్తత్వాలపై సెటైర్లు వేసిన వారు భమిడిపాటి కామేశ్వరరావు గారు. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్నరుచి.. వీటిని చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉంటారు.
మునిమాణిక్యం - కాంతం గార్లు తెలుగు నాట పంచిన హాస్యం కూడా తక్కువేమీ కాదు. ముని మానిక్యం గారి అన్ని రచనలూ చదివిస్తాయి, నవ్విస్తాయి.
సమాజం, సాహిత్యం.. ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే కొడవగంటి కుటుంబరావు గారి అన్ని పుస్తకాలూ చదవాలి.
‘నువ్వు ఎక్కదల్చుకున్న రైలు జీవితకాలం లేటు’ వంటి ప్రసిద్ధ కవితా వాక్యం ఏ పుస్తకంలోనిదో తెలుసా? అయితే, ఇలాంటి కొటేషన్లు మరిన్ని కావాలంటే ఆరుద్ర త్వమేవాహమ్ చదివేయండి. ఇంకా ఈయన రూపుదిద్దిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం సమస్త తెలుగు సాహిత్య చరిత్రను కళ్లకు కడుతుంది.
తెలుగు వారిని జ్ఞానపీఠం ఎక్కించిన వారు డాక్టర్ సి.నారాయణరెడ్డి. ఈయన విశ్వంభరలో మనిషే మహా నాయకుడు.
తెలుగు సినీ రంగ ప్రముఖుల విశేషాలు తెలుసుకోవాలంటే వేటూరి సుందరరామ్మూర్తి గారి కొమ్మ కొమ్మకో సన్నాయి చదవాలి.
సినీ పరిశ్రమలో కథానాయికగా ఎదిగి.. అథపాతాళానికి పడిపోయిన మంజరి కథను పాకుడురాళ్లుగా మలిచారు రావూరి భరద్వాజ గారు.
కరుణశ్రీ గారి ఉదయశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అనువాద పుస్తకాలు, అగ్నిధారలు కురిపించి, రుద్రవీణలు మోగించిన దాశరథి సాహిత్యం, గుంటూరు శేషేంద్రశర్మ కవితలు, కాళోజీ నా గొడవ, వంశీ పసలపూడి కథలు, కేఎన్వై పతంజలి కథలు-పతంజలి భాష్యం, శ్రీరమణ మిథునం, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి తప్పక చదవాల్సిన జాబితాలో ఉండే పుస్తకాలు.
నండూరి రామ్మోహనరావు గారి రాజు-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లల్లో ఊహాశక్తిని, భాషా పటిమను పెంచుతాయి.
రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావి శాస్త్రి), చాగంటి సోమయాజులు (చాసో), వేలూరి శివరామశాస్త్రి గారి కథలు మళ్లీ మళ్లీ చదవాలనిపించేవే.
తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన.
పైన చెప్పుకున్న వారిలో చాలామంది ఇప్పుడు లేరు.
అసలు సిసలు తెలుగు సాహిత్యానికే గతి లేదంటే ఇక అనువాద పుస్తకాల గురించి చెప్పేదేముంది? పాత కాలం నాటి తెలుగు అనువాద పుస్తకాలు అమూల్య సంపద వంటివి. కొన్నాళ్లకు అవేవీ దొరకకపోవచ్చు. ముందు తరాల కంటబడకుండానే మాయమైపోవచ్చు. అలాంటి కొన్ని అపురూపమైన అనువాద పుస్తకాల జాబితా ఇది. ఇవి పెద్దలతో పాటు పిల్లలూ తప్పక చదవాల్సినవి. ఈ జాబితాలో లేనివి కూడా ఇంకా మంచి పుస్తకాలై ఉండొచ్చు. ఒకసారి ప్రయత్నించండి..
ప్రకృతి పిలుపు (జాక్ లండన్ - కొడవగంటి కుటుంబరావు)
• వనవాసి (భిభూతిభూషణ్ బందోపాధ్యాయ - సూరంపూడి సీతారాం)
• పథేర్ పాంచాలి (భిభూతిభూషణ్ బందోపాధ్యాయ - మద్దిపట్ల సూరి)
• అన్నా కరేనినా (లియో టాల్స్టాయ్ - ఆర్వీయార్)
• యుద్ధము- శాంతి (లియో టాల్స్టాయ్ - రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు)
• చెంఘీజ్ఖాన్ (హెన్రి హోవర్త్ - తెన్నేటి సూరి)
• నేరము - శిక్ష (దోస్తాయే విస్కీ -శివం)
• ఏడు తరాలు (అలెక్స్ హేలీ - సహవాసి)
• గోరా (రవీంద్రనాథ్ ఠాగూర్ - శివశంకరస్వామి)
• యయాతి (విష్ణుసఖారాం ఖండేకార్ - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
• దాటు (ఎస్.ఎల్.భైరప్ప - పరిమి నరసింహం)
• మరణాంతం (శివరాం కారంత్ - తిరుమల రామచంద్ర)
• ఫౌంటెన్హెడ్ (అయాన్రాండ్ - రెంటాల శ్రీవేంకటేశ్వరరావు)
• అమ్మ (మాక్సింగోర్కీ - క్రొవ్విడి లింగరాజు)
• సాగరగర్భంలో సాహసయాత్ర (జుల్స్ వెర్న్ - వినాయక)
• ఆదర్శ జీవులు (అంతోనియా కొప్తాయెవా - అట్లూరి పిచ్చేశ్వరరావు)
• స్వామి స్నేహితులు (ఆర్కే నారాయణ్ - శ్రీనివాస చక్రవర్తి)
• 80 రోజుల్లో భూప్రదక్షణం (జుల్స్ వెర్న్ - ముళ్లపూడి వెంకటరమణ)
• ఓల్గా నుంచి గంగ వరకు (రాహుల్ సాంకృత్యాయన్ - అల్లూరి సత్యనారాయణ రాజు)
• జీవనపాశం (సోమర్సెట్ మాం - కాకాని చక్రపాణి),
• రంగభూమి (ప్రేమ్చంద్ - సుంకర, ఆలూరి, కౌముది),
• తమస్ (భీష్మ సహానీ - యార్లగడ్డ లక్ష్మీప్రసాద్),
• ఆనందమఠం (బంకించంద్ర చటర్జీ - అక్కిరాజు రమాపతిరావు).
కానీ, తెలుగు అందాలను అక్షరాలలో గుదిగుచ్చి మనకందించిన వారి రచనా సంపద మాత్రం ఇంకా మిగిలి ఉంది. వాటిని చదివి ఆస్వాదించడం మన వంతు.
రామాయణంలోని ప్రతి శ్లోకం రమణీయమే. 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా చదవాలనుకుంటే పుల్లెల శ్రీరామచంద్రుడి గారి రామాయణం తిరగేయాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆంధ్ర మహాభారతం (15 పుస్తకాల సెట్టు), పోతన భాగవతం, రామకృష్ణ మఠం వారి ఉపనిషత్తుల పుస్తకాలు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆధ్యాత్మికానుభూతిని పంచుతాయి.
ఇవి కూడా చదవండి..
ముందే చెప్పినట్టు ఫలానా పుస్తకమే మంచిదని తీర్మానించడానికి లేదు. వేటికవే ప్రత్యేకతలున్న పుస్తకాలు మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆ మధ్య ప్రముఖ తెలుగు దినపత్రిక పలువురు రచయితలు, సాహితీ అభిమానులతో మాట్లాడి తప్పక చదవాల్సిన వంద తెలుగు పుస్తకాల జాబితాను రూపొందించింది. వాటిలో కొన్ని పుస్తకాలను ఈ వ్యాసంలో వివిధ చోట్ల ప్రస్తావించడం జరిగింది. అలా ప్రస్తావించినవి గాక మిగతా అరుదైన, తప్పక చదవాల్సిన పుస్తకాల జాబితా ఇది.
ఆంధ్ర మహాభారతం (కవిత్రయం), మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ), చివరకు మిగిలేది (బుచ్చిబాబు), అసమర్థుని జీవయాత్ర (గోపీచంద్), కాలాతీత వ్యక్తులు (డాక్టర్ శ్రీదేవి), కళా పూర్ణోదయం (పింగళి సూరన), గబ్బిలం (గుర్రం జాషువా), వసు చరిత్ర (భట్టుమూర్తి), అతడు-ఆమె (ఉప్పల లక్ష్మణరావు), అముక్త మాల్యద (శ్రీకృష్ణదేవరాయలు), ఎంకి పాటలు (నండూరి సుబ్బారావు), కవితత్వ విచారము (డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి), వేమన పద్యాలు (యోగి వేమన), కృష్ణపక్షం (కృష్ణశాస్త్రి), మట్టి మనిషి (వాసిరెడ్డి సీతాదేవి), ఆంధ్రుల సాంఘిక చరిత్ర (డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి), ఆంధ్ర మహాభాగవతం (పోతన), బారిస్టరు పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి), మొల్ల రామాయణం (మొల్ల), కాశీయాత్ర చరిత్ర (ఏనుగుల వీరాస్వామి), వర విక్రయం (కాళ్లకూరి నారాయణరావు), వైతాళికులు (ముద్దుకృష్ణ), ఫిడేలు రాగాల డజన్ (పఠాభి), సౌందరనందము (పింగళి, కాటూరి), విజయ విలాసం (చేమకూర వేంకటకవి), కీలుబొమ్మలు (జీవీ కృష్ణారావు), కొల్లాయి గడితేనేమి (మహీధర రామమోహనరావు), మను చరిత్ర (అల్లసాని పెద్దన), పాండురంగ మహాత్మ్యం (తెనాలి రామకృష్ణ), ప్రజల మనిషి (వట్టికోట ఆళ్వార్ స్వామి), జీవనయానం, చిల్లర దేవుళ్లు (డాక్టర్ దాశరథి రంగాచార్య), పాండవోద్యోగ విజయములు (తిరుపతి వేంకట కవులు), దిగంబర కవిత (దిగంబర కవులు), ఇల్లాలి ముచ్చట్లు (పురాణం సుబ్రహ్మణ్యశర్మ), నీలిమేఘాలు, స్వేచ్ఛ (ఓల్గా), శివతాండవం (పుట్టపర్తి నారాయణాచార్యులు), అపంశయ్య (నవీన్), గణపతి (చిలకమర్తి లక్ష్మీనరసింహం), రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం పంతులు), నారాయణరావు (అడవి బాపిరాజు), నేను - నా దేశం (దర్శి చెంచయ్య), నీతిచంద్రిక (చిన్నయసూరి), ప్రతాపరుద్రీయం (వేదం వెంకటరాయశాస్త్రి), పారిజాతాపహరణం (నంది తిమ్మన), పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం (శ్రీనాథుడు), రాధికా సాంత్వనము (ముద్దు పళని), స్వప్న లిపి (అజంతా), సారస్వత వివేచన (రాచమల్లు రామచంద్రారెడ్డి), ఉత్తర రామాయణం (కంకంటి పాపరాజు) విశ్వదర్శనం- పాశ్చాత్య చింతన, విశ్వదర్శనం- భారతీయ చింతన (నండూరి రామమోహనరావు), అనుక్షణికం (వడ్డెర చండీదాస్), ఆధునిక మహాభారతం (గుంటూరు శేషేంద్ర శర్మ), అడవి ఉప్పొంగిన రాత్రి (విమల), చాటు పద్య మంజరి (వేటూరి ప్రభాకరశాస్త్రి), కుమార సంభవం (నన్నెచోడుడు), కొయ్య గుర్రం (నగ్నముని), మైనా (శీలా వీర్రాజు), మా భూమి (సుంకర, వాసిరెడ్డి), రాముడుండాడు.. రాజ్యముండాది, అతడు అడవిని జయించాడు (కేశవరెడ్డి), రంగనాథ రామాయణం (గోన బుద్ధారెడ్డి), సౌభద్రుని ప్రణయయాత్ర (నాయని సుబ్బారావు), సూత పురాణం- 1,2 భాగాలు (త్రిపురనేని రామస్వామి చౌదరి), శివారెడ్డి కవిత (శివారెడ్డి), సాహిత్యంలో దృక్పథాలు (ఆర్ఎస్ సుదర్శనం), కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి), తృణకంకణం (రాయప్రోలు), హృదయనేత్రి (మాలతీచందూర్), బ్రౌను నిఘంటువు (చార్లెస్ బ్రౌన్), మరవరాని మాటలు (బూదరాజు రాధాకృష్ణ), తెలుగు సామెతలు - జనజీవనం (డాక్టర్ పాపిరెడ్డి నరసింహారెడ్డి), హాస వ్యాస మంజరి (నల్లాన్ చక్రవర్తి శేషాచార్య).
చివరిగా- ఓ మంచి పుస్తకం చదివితే అది మనసుపై చెరగని ముద్ర వేయాలి. ఆలోచనల్ని, ప్రశ్నల్ని లేవనెత్తాలి. మనల్ని మనం తడిమి చూసుకోవాలి.
తల్లిదండ్రులు, గురువులు మనల్ని కొంత వరకే తీర్చిదిద్దగలరు. కానీ, మనల్ని మనం కొత్తగా రూపుదిద్దుకోవాలంటే మాత్రం తప్పకుండా పుస్తకాలు చదవాలి.
అందుకే పుస్తకమే సమస్తం..
అదే మన నేస్తం.

ఆదియందు వాక్యముండెను..
ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను..
అమ్మ చేతి గోరుముద్దల్లా తేలికగా వంటబట్టే తేట తెలుగు పదాలే పరిశుద్ధ గ్రంథాన్ని క్రైస్తవులకు ఎంతో చేరువ చేశాయి. తెలుగు భాష ఆధ్యాత్మికంగా చైతన్యపరిచే మాధ్యమం కాబట్టే, తెలుగు అనువాద క్రైస్తవ మత గ్రంథం క్రైస్తవుల చేతుల్లో కరదీపికై వెలుగుతోంది. ఈ గ్రంథంలోని విషయాలను ప్రత్యేక సత్యాలుగానూ, దేవుని అభీష్టాన్ని తెలిపే దివ్యవాణి గానూ భక్తులు భావిస్తారు. ఈ భావనకు దగ్గరగా ఉండేదే ప్రారంభంలో పేర్కొన్న వాక్యం. ఇది యెహాను సువార్తలో ఉంది.
‘ఆదియందు వాక్యముండెను.
వాక్యము దేవుని యొద్ద ఉండెను.
వాక్యము దేవుడై ఉండెను..’ అనడం ద్వారా వాక్యానికి దైవత్వాన్ని ఆపాదించి, భగవంతునితో ఆధ్యాత్మికంగా అనుబంధం ఏర్పరిచే వంతెనగా దాన్ని నిలిపే ప్రయత్నం జరిగింది.
తాత్విక ధోరణితో పాటు జ్ఞానవంతమైన ఉపదేశాలు, ఉపమానాలు క్రీస్తుకు భక్తులను దగ్గర చేసేందుకు దోహదపడ్డాయంటే అందుకు కారణం.. తెలుగులోకి బైబిలు సరళానువాదమే కారణం.
నైతికత, మానవ జీవితంలోని కఠిన వాస్తవాలు, పాప ఫలం, పరలోక రాజ్యం.. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు పామరులు సైతం మనసుకు ఎక్కించుకుని తమ జీవితాలను సన్మార్గంలో నడిపించుకునేందుకు బైబిలులోని కొన్ని అందమైన, అర్థవంతమైన వాక్యాలు దోహదం చేశాయి. ఇలాంటి అమూల్యమైన వాక్యాలు పరిశుద్ధ గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి.
‘ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు: పరలోక రాజ్యము వారిది.
దు:ఖపడువారు ధన్యులు: వారు ఓదార్చబడుదురు.
సాత్వికులు ధన్యులు: వారు భూలోకమును స్వతంత్రించుకొందురు.
నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు: వారు తృప్తిపరచబడుదురు’.
ఇలాంటివే మరెన్నో మచ్చుతునకలాంటి వాక్యాలు ఆధ్యాత్మికపరులందరినీ మంచి మార్గంలో నడిపిస్తాయి.
బైబిలులో ప్రధానంగా వి(క)నిపించే పదాలు ‘గాస్పెల్’, ‘ఆమెన్’, ‘హలేలూయా’ తదితరాలు..
గాస్పెల్ అంటే సువార్త అని తెలుగు అర్థం.
ఆమెన్ అంటే తథాస్తు అని అర్థం.
హలేలూయా అనే హిబ్రూ పదానికి తెలుగు అర్థం- దేవునికి స్తుతి కలుగు గాక.
ఏ మత గ్రంథంలోనివైనా కానీయండి. వాటిలోని పదాలు, వాక్యాలు, ఆధ్యాత్మిక బోధనలు సార్వకాలీనమైనవి.
అవి సార్వజనీనమైనవి.
నిత్యమై, సత్యమై నిలిచి జనరంజకంగా భాసిల్లిన క్రీస్తు బోధనలు జీవన నాణ్యతను మెరుగుపరిచే మహిమాన్విత మేలి ముత్యాలు.
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
కార్తీక దీపశోభ
తెలుగు పత్రిక నవంబర్ 2023 సంచికలో కార్తీక శోభ ఉట్టిపడింది. ఆ మాస విశేషాలను తెలుపుతూ ఇచ్చిన ముఖచిత్ర కథనం చదివించింది. కార్తీకంలో హరిహరుల ప్రాశస్త్యాన్ని తెలుపుతూ కార్తీక మాస విధులు, వ్రత కథలతో అందించిన ఈ కథనం బాగుంది.
- పి.సంతోష్కుమార్, అనన్య, కవిత, రేవతి, సుధాకరరావు, వెంకటరమణ, ఆన్లైన్ పాఠకులు
నీతి కథలు
వరుసగా ప్రతి సంచికలో అందిస్తున్న నీతి కథలు చదివిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని నీతి కథలను సులభంగా, సరళంగా అర్థమయ్యేలా అందిస్తున్నందుకు అభినందనలు.
- కే.ఆర్.రమేశ్, నారాయణ, వాసు, వై.ప్రతిమాశంకర్, కె.అన్నపూర్ణ, రవిచంద్ర- హైదరాబాద్/విశాఖపట్నం
నచ్చిన పుస్తకాలు
నవంబరు 2023 తెలుగుపత్రికలో సినిమా శీర్షిక కింద హీరోయిన్ రష్మికకు నచ్చిన పుస్తకాల గురించి ఇవ్వడం బాగుంది. నటీనటుల ఇలాంటి వ్యక్తిగత అభిరుచులు ఇతరులకు కూడా ఆసక్తి కలిగిస్తాయి.
- రామచంద్ర, విజయవాడ
పురాణ పాత్రలు
తెలుగు పత్రికలో వరుసగా అందిస్తున్న పురాణ పాత్రలు, వాటి నేపథ్యాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం.
- పి.వెంకట్, తిరుపతి

అద్భుతహ: మార్గశీర్షోహ
2023- డిసెంబరు 1, శుక్రవారం, కార్తీక బహుళ చతుర్థి నుంచి
2023- డిసెంబరు 31, ఆదివారం, మార్గశిర శుద్ధ చతుర్థి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-కార్తీకం- మార్గశిరం- హేమంత రుతువు-దక్షిణాయణం
ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక - మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. డిసెంబరు 1, కార్తీక బహుళ చతుర్థి నుంచి డిసెంబరు 12 కార్తీక బహుళ అమావాస్య వరకు కార్తీక మాస తిథులు, ఆపై డిసెంబరు 13 మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి డిసెంబరు 31 మార్గశిర శుద్ధ చతుర్థి వరకు మార్గశిర మాస తిథులు కొనసాగుతాయి.
ఉత్పన్న ఏకాదశి, నాగ పంచమి, మోక్షద ఏకాదశి, మత్స్య ద్వాదశి, గీతా జయంతి, హనుమద్వ్రతం, దత్తాత్రేయ జయంతి, సుబ్రహ్మణ్య షష్ఠి వంటివి ఈ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.
మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చే మాసానికి ‘మార్గశిర’ మాసం అని పేరు. మృగశిర అనే పేరుకు ‘అగ్రహాయణిక’ అనే పర్యాయనామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. అంటే మాసాల్లో మార్గశిరానిదే అగ్రస్థానమన్న మాట. అందుకే మనకు గల పన్నెండు మాసాల్లో అతి విశిష్టమైనదిగా, అగ్రగణ్యమైనదిగా ఈ మాసం ఉంది. ఒకప్పుడు మనకు సంవత్సరారంభం మార్గశిర మాసంతోనే అయ్యేదట. అందుకే కాబోలు శ్రీకృష్ణుడు గీతాబోధనలో తాను ‘మాసానాం మార్గశీర్షోహ:’ అన్నాడు. అంటే ‘మాసాలలో తాను మార్గశిరాన్ని’ అని భావం. కాబట్టి ఏ విధంగా చూసినా మార్గశిర మాసం ఉత్క•ష్టమైనది. మార్గశిరంతోనే హేమంత రుతువు ప్రారంభమవుతుంది. దీని మరుసటి మాసం పుష్యమితో కలిపి ఈ రుతువు కొనసాగుతుంది. హేమంత రుతువును భాగవంత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. కార్తీక మాసంలో పుట్టిన చలి.. మార్గశిరం నాటికి బాగా పెరుగుతుంది. ‘మార్గశిర మాసంలో పుట్టే చలి.. మంటలో పడినా పోద’ని సామెత. గజగజ వణికించే ఈ శీతాకాలపు మాసంలో మన పెద్దలు అందుకు తగిన ఆహార నియమాలను విధించారు. అందుకనుగుణంగా తగిన వ్రతాచరణను నిర్దేశించారు. ఇక, శ్రీమహా విష్ణువుకు ఈ నెలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి వైష్ణవులకు అత్యంత పవిత్రమైనది. కుమారస్వామి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు పూజలందుకుంటాడు. ఈనాటి పూజల పర్వాన్నే ఆంధప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో సుబ్రహ్మణ్య షష్టిగా వ్యవహరిస్తారు. త్రిమూర్తుల అంశతో జన్మించిన విశ్వగురువు దత్తాత్రేయుని జయంతి తిథి కూడా ఈ మాసంలోనిదే. ఇక, ధనుర్మాసం ప్రారంభమయ్యేది కూడా మార్గశిర మాసంలోనే. ఇంకా మరెన్నో పండుగలకు, పర్వాలకు ప్రసిద్ధమైనది మార్గశిర మాసం. వాటి విశేషాలు తెలుసుకుందాం.
కార్తీక బహుళ చతుర్థి
డిసెంబరు 1, శుక్రవారం
కార్తీక బహుళ చతుర్థితో డిసెంబరు మాసం ప్రారంభమవుతుంది. సాధారణంగా చతుర్థి తిథి వినాయక సంబంధమైనది కాబట్టి ఆయనను ఈనాడు పూజించాలి. ఈ చతుర్థి బహుళ చతుర్థిగా ప్రతీతి. కార్తీక బహుళ చవితి నాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ పూజా పక్రియనే బహుళ చతుర్థి వ్రతంగా వ్యవహరిస్తారు. ఇది పన్నెండు సంవత్సరాలు లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు సంబంధించిన సౌభాగ్యప్రదమైన వ్రతాలలో ఇది ఒకటి. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఇక, ఏటా డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ఉద్దేశం.
కార్తీక బహుళ షష్ఠి
డిసెంబరు 3, ఆదివారం
ఈనాటి నుంచి జ్యేష్ట కార్తె ఆరంభమవుతుంది. ఈనాడు ప్రత్యేకంగా ఆచరించాల్సిన వ్రత విధులేమీ లేవు.
కార్తీక బహుళ సప్తమి
డిసెంబరు 4, సోమవారం
కార్తీక బహుళ సప్తమి నాడు వచ్చే పైతా మహాకృచ్ఛ వ్రతం మిక్కిలి విచిత్రమైనది. మనకు ఏటా అనేక వ్రతాలు వస్తుంటాయి. వాటి ఆచరణ విధానాలు రకరకాలుగా ఉంటాయి. అయితే కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో వివరంగా ఉంది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని ఆ గ్రంథంలో వివరించారు. అలాగే, సప్తమి తిథి సూర్యారాధనకు సంబంధించినది. కాబట్టి దీన్ని మిత్రా సప్తమిగానూ వ్యవహరిస్తారు.
కార్తీక బహుళ అష్టమి
డిసెంబరు 5, మంగళవారం
కార్తీక బహుళ అష్టమిని ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అని వ్యవహరిస్తారు. ఈ క్రమంలో ఈ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి వ్రతం కూడా ఆచరిస్తారు. సాధారణంగా ఏడాది పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమిని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతి సంవత్సరంలో వచ్చే కార్తీక బహుళ అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలనేది ఈ వ్రత నియమం. పేరును బట్టి ఇది దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే వ్రతం కావచ్చునని పండితుల అభిప్రాయం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. అష్టమి తిథి కాలభైరవుడి పేరున ప్రసిద్ధినొంది ఉంది.
కార్తీక బహుళ ఏకాదశి
డిసెంబరు 8, శుక్రవారం
మనకు ఏటా నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. వీటిలో బహుళ (కృష్ణ) పక్షంలో వచ్చే ఏకాదశులు కొన్ని కాగా, శుక్ల (శుద్ధ) పక్షంలో వచ్చే ఏకాదశులు మరికొన్ని. మొత్తానికి ప్రతి ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉంది. వీటిలో ఏ ఏకాదశి ప్రత్యేకత, విశేషం ఆ ఏకాదశిదే. ఈ క్రమంలో వచ్చే కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. దీనినే ఉత్పన్న ఏకాదశి అనీ అంటారు. ఆయా ఏకాదశుల నాడు వివిధ దేవతలను పూజించడం ఆచారమైతే.. చాలా వరకు ఏకాదశి తిథులు విష్ణు పూజార్హంగానే ఉంటాయి. ఇక, ఈ కార్తీక బహుళ ఏకాదశి నాడు ‘ఏకాదశి దేవి’ని పూజిస్తారు. ఏకాదశీ దేవి ఈ తిథి నాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే ఈ ఏకాదశికి ఆమె పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని పురాణ కథనం. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు
ఉపవాసం ఉంటారు.
కార్తీక బహుళ ద్వాదశి
డిసెంబరు 9, శనివారం
కార్తీక బహుళ ద్వాదశి యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. ఈనాడు దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.
కార్తీక బహుళ త్రయోదశి
డిసెంబరు 11, సోమవారం
కార్తీక బహుళ ద్వాదశి తిథి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమధర్మరాజుకు తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు. అలాగే, ఈనాడు ధన్తేరస్ పర్వాన్ని నిర్వహించుకునే ఆచారం కూడా చాలా ప్రాంతాల్లో ఉంది. దీనినే ధన్వంతరి త్రయోదశి అనీ అంటారు. ఈ సందర్భంగా ధన్వంతరి జయంతిగా కూడా జరుపుకుంటుంటారు. ఈ రెండు పర్వాల గురించి తెలుగు పత్రిక నవంబరు సంచికలో మనం వివరంగా తెలుసుకున్నాం.
కార్తీక బహుళ చతుర్దశి
డిసెంబరు 11, సోమవారం
త్రయోదశి ఘడియల్లోనే చతుర్దశి తిథి కూడా ఇమిడి ఉంది. కాబట్టి త్రయోదశి, చతుర్దశి తిథులు ఒకే తేదీన ఉన్నాయి. ఇక, కార్తీక బహుళ చతుర్దశి తిథిని సాధారణంగా చిత్రా చతుర్ధశిగా వ్యవహరిస్తుంటారు. ఈ తిథి భౌమవారం (మంగళవారం)తో కలిసి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అనడం పరిపాటి. ఈనాటి పూజా కలాపం శివుడికి సంబంధించినది. కాబట్టే ఈనాడు పరమేశ్వరుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలం (నువ్వుల నూనె)తో స్నానం చేయాలి. చంద్రాస్తమయ సమయంలో ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి. ఇంకా ఈనాడు చతుర్దశశాక భక్షణ, బ్రహ్మకూర్చ, యమ, జలకృచ్ఛ, కృచ్ఛ మున్నగు వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.
కార్తీక బహుళ అమావాస్య
డిసెంబరు 12, మంగళవారం
గీతా జయంతి ఎప్పుడనేది ఇప్పటికీ స్పష్టత లేదు. కార్తీక బహుళ అమావాస్య (డిసెంబరు 12, 2023) నాడని కొందరు, మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబరు 23, 2023) నాడని ఇంకొందరు అంటారు. కాబట్టి మనకు వివాదాలతో పని లేకుండా ఈ రెండు తిథుల్లోనూ గీతా జయంతిని నిర్వహించుకుంటే ఏ గొడవా ఉండదు. ఇక, గీతా జయంతి గురించి వ్యావహారికంలో ఉన్న వాస్తవాల ప్రకారం.. కార్తీక బహుళ అమావాస్య నాడు భగవద్గీత పుట్టిందని కొందరు అంటారు. అంటే ఈరోజు గీతా జయంతి. ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
కానీ, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జనన దినంగా నిర్ధారించి చెప్పడానికి లేదని ఇంకొందరు పండితులు వాదిస్తారు.
మహా భారత కాలమానం ప్రకారం.. మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది (58) రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. దీన్ని వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తిక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తిక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తిక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం నాడు, అనగా శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. దీనిని బట్టి కార్తిక బహుళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు. భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు దు:ఖ పీడితుడు అయ్యాడు. యుద్ధంలో తన బంధువులను వధించడం తన వల్ల కాదని శోకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం కార్తిక బహుళ అమావాస్య నాటి ఉదయమేనని అంటారు.
ఇక, మన తెలుగు పంచాంగాలలో మాత్రం మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్ 23, 2023) తిథి నాడే గీతా జయంతిగా పేర్కొన్నారు. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయమై ఎక్కడా స్పష్టత లేదు. కాబట్టి, పవిత్రమైన గీతా పఠనాన్ని, గీతా జయంతిని ఈ రెండు దినాల్లోనూ, అంటే.. ఇటు కార్తీక బహుళ అమావాస్య (డిసెంబర్ 12, 2023, మంగళవారం) నాడు, అటు మార్గశిర శుద్ధ ఏకాదశి (డిసెంబర్ 23, 2023, శనివారం) నాడు సాగించడం మధ్యేమార్గం, పుణ్యప్రదం కూడా.
మార్గశిర శుద్ధ పాడ్యమి
డిసెంబరు 13, బుధవారం
ఈనాటి నుంచి మార్గశిర మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఇది హేమంత రుతువు ఆరంభ దినం. అలాగే, ధనుర్మాసం ప్రారంభం కూడా ఈనాటి నుంచే. ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మార్గశిర శుద్ధ తదియ
డిసెంబరు 15, శుక్రవారం
మార్గశిర శుద్ధ తదియ నాడు ఆచరించదగిన వ్రతాలు చాలానే ఉన్నాయి. ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ తదితర వ్రతాలు వీటిలో ముఖ్యమైనవి. వీటి గురించి వివరాలు చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి. అలాగే, ఈ తిథి నాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి దినం.
మార్గశిర శుద్ధ చతుర్థి
డిసెంబరు 16, శనివారం
చతుర్థి తిథి సాధారణంగా వినాయక పూజార్హమై ఉంటుంది. కాబట్టి ఈనాడు వినాయకుని ప్రీత్యర్థం పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరాలు గలిగిన వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు ఢుంఢి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది. ఢుంఢి అనే పదం గణపతి సంబంధమైనదే. కాబట్టి ఇది కూడా వినాయక సంబంధమైన పూజాకల్పమే.
మార్గశిర శుద్ధ పంచమి
డిసెంబరు 17, ఆదివారం
మార్గశిర శుద్ధ పంచమి తిథి నాడు దక్షిణాదిన నాగపంచమిగా ప్రసిద్ధి. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. కాగా, ధనుర్మాసం ప్రారంభం ఈనాటి నుంచేనని మరికొన్ని పంచాంగాలలో ఉంది.
మార్గశిర శుద్ధ షష్ఠి
డిసెంబరు 18, సోమవారం
మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి తిథి. తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు,
పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారం. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు దట్టంగా అలముకుంటాయి. కానీ వర్షాలు పడవు. కాబట్టే వానలు కురవని మబ్బులను షష్ఠి మబ్బులని అంటారు. ఇక, తమిళులు మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగిందని ఐతిహ్యం.
పురాణగాథ ఇలా ఉన్నా.. ఇది ప్రధానంగా నాగులకు సంబంధించిన పర్వం. ఈనాడు నాగులను పూజిస్తారు. సంతాన భాగ్యం కోరుకునే వారు సర్పపూజ రూపేణా కుమారస్వామినే ఆరాధిస్తారు. పాములు వ్యవసాయదారులకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటాయి. ఎలుకలను తినడం ద్వారా ఇవి పంటలను కాపాడతాయి. అలాగే, చలి ముసురుకునే ఈ కాలంలో పాములు పొలాల్లోని బొరియలు, భూమి అడుగు భాగంలో దాక్కుని ఉంటాయి. వ్యవసాయ సంబంధ పనులు చేసేటపుడు అటు సర్పాలకు, తమకు కూడా హాని కలగకూడదనే ఉద్దేశంతో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి నాడు రైతులు ఎక్కువగా పువ్వులు, పడగలు సమర్పించి నాగపూజలు చేస్తుంటారు.
మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఇంకా చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలకు కూడా ప్రతీతమై ఉందని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ సప్తమి
డిసెంబరు 19, మంగళవారం
మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్య పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.
మార్గశిర శుద్ధ అష్టమి
డిసెంబరు 20, బుధవారం
మార్గశిర శుద్ధ అష్టమి తిథి అటు దుర్గాపూజుకు, ఇటు కాలభైరవుని పూజకు ప్రతీతి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవాష్టమిగానే ఆచరణలో ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి తదితర పేర్లు కాలాష్టమికి ఉన్నాయి.
ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహిమ విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవుడు అలాగే చేశాడు. దీంతో కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. ఈ పాపం పోవడానికి తాను నరికిన బ్రహ్మ తల కపాలం పట్టుకుని తీర్థయాత్రలు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’. ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తుతించిన స్తోత్రం మన భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో తిరుగులేనిది.
మార్గశిర శుద్ధ నవమి
డిసెంబరు 21, గురువారం
మార్గశిర శుద్ధ నవమి నాడు త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పురుషార్థ చింతామణిలో దేవీపూజ చేయాలని ఉంది. మొత్తానికి నవమి తిథి శక్త్యారాధనకు విశేషమైనది. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా అర్చిస్తారు. తెలుగు పంచాంగాలలో ఈనాటి తిథి గురించి శుక్ర మౌడ్యమి త్యాగము అని పేర్కొన్నారు. ఈనాడు నందిని నవమి అని తెలుగు పంచాంగాలలో ఉంది.
మార్గశిర శుద్ధ దశమి
డిసెంబరు 22, శుక్రవారం
మార్గశిర శుద్ధ దశమి తిథి నాడు ఆరోగ్య వ్రతం ఆచరించాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి. పదార్థ వ్రతం, ధర్మ వ్రతం వంటివీ ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించాల్సిన ఆయా వ్రతాల పేర్లను బట్టి ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించి ఉద్దేశించిన తిథిగా కనిపిస్తోంది.
మార్గశిర శుద్ధ ఏకాదశి
డిసెంబరు 23, శనివారం
మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి డిసెంబరు 23న ఉండగా, డిసెంబరు 22, దశమి తిథి నాడు మోక్షజ ఏకాదశి అని తెలుగు క్యాలెండర్లలో ఉంది. ఈమధ్య తిథుల విషయంలో తరచూ గందరగోళం నెలకొంటోంది. ఇదలా ఉంచితే, ఈ ఏకాదశి తిథి మోక్షజ ఏకాదశిగా ప్రతీతి. దీనినే ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ, ఈనాడు వైకాసనుడనే రాజు తన తండ్రికి తను ఆచరించిన వ్రతం ద్వారా మోక్షం కలిగించినందున మోక్షదైకాదశి అనీ అంటారు. దీనికే సౌఖ్యదైకాదశీ అనే పేరూ ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఇట్లు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనిని మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఇక, ఈనాడే గీతా జయంతి అని తెలుగు పంచాంగాలలో ఉంది.
మార్గశిర శుద్ధ ద్వాదశి
డిసెంబరు 23, శనివారం
మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి ఏకాదశి తిథితోనే కూడి ఉంది. కాబట్టి డిసెంబరు 23నే ద్వాదశి నాటి వ్రతకర్మలను ఆచరించాలి. ఇంకా ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం. భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.
మార్గశిర శుద్ధ త్రయోదశి
డిసెంబరు 24, ఆదివారం
మార్గశిర శుద్ధ త్రయోదశి తిథి నాడు అనంగ త్రయోదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని జరుపుతారు.
మార్గశిర శుద్ధ చతుర్దశి
డిసెంబరు 25, సోమవారం
మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శావ్రణికా తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆంబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
కాగా, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతిని కొన్ని ప్రాంతాల్లో ఈనాడే నిర్వహిస్తారు. మరికొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు ఆయన జయంతిని జరుపుతారు.
మార్గశిర శుద్ధ పూర్ణిమ
డిసెంబరు 26, మంగళవారం
మార్గశిర శుద్ధ పౌర్ణమి అనేక విధాలుగా ప్రశస్తమై ఉంది. ఈ పౌర్ణమి విశేషాల్లోకి వెళ్తే.. వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. మార్గశిర పూర్ణిమతో ఈ యమదంష్ట్ర దినాలు అంతమవుతాయి. మార్గశిర పూర్ణిమ నాడు ఆంధప్రదేశ్లోని పలు ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి ఉంది. ఇలా రొట్టెలు కొరికి కుక్కలకు వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం. మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది. మార్గశిర పూర్ణిమను తెలుగునాట కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడూ ఇలాగే నోము అసంపూర్తిగా ముగుస్తుంది. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. ఈనాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. జోగుళాంబ గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరులో సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం ఉంది. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.
ఇక దత్తాత్రేయుని జయంతి తిథి మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడేనని కూడా అంటారు. మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల (శుద్ధ) చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం.
మార్గశిర బహుళ పాడ్యమి
డిసెంబరు 26, మంగళవారం
మార్గశిర బహుళ పాడ్యమి నాడు నవ సంవత్సరోత్సవ మహోత్సవం నిర్వహించాలని నీలమత పురాణం చెబుతోంది. ఇది కాశ్మీర్లో కొత్త సంవత్సర మహోత్సవమని తెలుస్తోంది. ఎందుకంటే నీలమత పురాణం కశ్మీర దేశానికి చెందిన విశిష్ట రచన. దీనిని బట్టి కాశ్మీర్కు ఇది ఉగాది పర్వదినం వంటిది. ఇంకా, ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావ్యాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
గుంటనక్క- విశ్వప్రేమ
నక్క బావ డొక్క కాలి
ఎక్కడేమి దొరకక
తిక్కపట్టినట్టు తిరిగి
తిరిగి చివరకు
గుడిసెపైన కూరుచున్న
కోడిపుంజు వైపు చూసి
‘మంచి వార్త.. మంచి వార్త’
అంచు పిలిచెను
గుంటనక్క గారి జోరు
కంట జూచి కోడిపుంజు
‘ఏమిటేమి?’టంచు ప్రశ్న
వేసి నంతనె
‘విననె లేదటోయి! నీవు
‘విశ్వప్రేమ’ అనెడి పేరు!
ఇంక మీరు, మేము ఆప్త
బంధు మిత్రులం
నేటి నుంచి విశ్వప్రేమ
చాటవలయు మనము
రమ్ము, కట్టకేగి కాస్త షికారు
కొట్టి వత్తము’
నక్కబావ ఇట్టులనగ కోడిపుంజు
పట్టలేని సంతసాన
గొంతుచాచి ఒక్కమారు
కూత వేసెను
‘ఒక్క క్షణము తాళు మదుగొ
కుక్క బావ వచ్చుచుండె
వాని తోడ కలిసి పోవ
వచ్చు’నన్నది కోడిపుంజు
తక్షణంబె గుంటనక్క
తారుకొంచు నుంచ జూచి
‘పోదువేటి కం’చు కోడి
పుంజు పలికెను
‘కుక్క బావ ఎరుగుదాయె
విశ్వప్రేమ యనెడి పేరు’
అంచు నక్క తిరిగి చూచి
పరుగు తీసెను
‘వట్టి పాడు రోజింతకు
ఒకరి ననిన ఫలమే’మని
పరుగు తీస్తూ గుంటనక్క
పలవరించెను.
పాలబుగ్గల పాపాయి
పాలబుగ్గలా పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
పాలబుగ్గలా పాపాయికి
పాలు కావాలి
ఓ లాలి కావాలి
బోసినవ్వులా పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
బోసినవ్వులా పాపాయికి
అమ్మ కావాలి
ఓ బొమ్మ కావాలి
జిలిబిలి పలుకుల పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
జిలిబిలి పలుకుల పాపాయికి
జిలేబి కావాలి
ఓ గులాబి కావాలి
బుడిబుడి నడకల పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
బుడిబుడి నడకల పాపాయికి
బువ్వ కావాలి
ఓ అవ్వ కావాలి
పరుగులు తీసే పాపాయికి
ఏమి కావాలి?
ఏమేమి కావాలి?
పరుగులు తీసే పాపాయికి
పండ్లు కావాలి
బొమ్మరిండ్లు కావాలి
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
December 08, 2023
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia