Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం
నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం
ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు.
శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది.
అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది. ఈ వివరాలన్నీ తాంత్రిక గ్రంథాలలో ఉన్నాయి.
అంతటి అద్భుతశక్తి మరి ఏ ఇతర మంత్రంలోనూ కనిపించదు. అందువల్లనే గాయత్రిదేవిని రోజులో మూడు సమయాలలోఆరాధించే ఉపాసకులకు ఈ ఇరవై నలుగురు దేవతల శక్తి లభిస్తుంది. గాయత్రిని ఉదయం, మధ్యాహ్నం, సాయం సంధ్య వేళల్లో ఆరాధించడం ఉత్తమం. మూడు సంధ్య వేళల్లో ఉపాసనలు అందుకుంటుంది కాబట్టే గాయత్రి దేవిని త్రిసంధ్యాదేవిగానూ పిలుస్తారు.
మంత్రాలలో పరమోత్క•ష్టమైన ఆ మహా మంత్ర విశేషాలు.. జూన్ 11, శనివారం, గాయత్రి జయంతి సందర్భంగా..
శ్రీ గాయత్రి మంత్రం విశ్వశాంతికి మూల మంత్రం.
గాయత్రి మంత్రం ఒక దివ్యజ్ఞానం.
గాయత్రి దేవమాత.
గాయత్రి ఉపాసన వల్ల మనిషి దేవత అవుతాడు.
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలో నిండి ఉన్న ధర్మం, నీతి, జీవితం, కళ, సామాజిక వ్యవహరణలను గురించిన బోధ.. మనిషి ఆలోచనలనూ, భావనలనూ, లక్ష్యాలనూ, దృక్పథాన్ని ప్రక్షాళన చేసే శారీరక, మానసిక క్రియలలో సత్వగుణమూ, ధర్మనిష్టా పెంపొందుతాయి. గాయత్రి మహా మంత్రంలోని మంత్రాక్షరాలు చేసే మహా బోధనలను అనుసరిస్తే దైవీక్రియ అమలు జరుగుతుంది. కనుకనే గాయత్రి వేద మంత్రాల సారం అయ్యింది. ఆ మంత్రాక్షరాలలో ఇమిడి ఉన్న సారాన్ని గ్రహించే ప్రయత్నమే ఈ వ్యాసం..
ఓం
ప్రకృతి అంరాళంలో ‘ఓం’ వంటి ధ్వని ప్రతి క్షణం ఉత్పన్నం అవుతోంది.
ఈ పరమేశ్వర నామాన్ని సూక్ష్మ ప్రకృతి ప్రతి క్షణం జపిస్తోంది. నినదిస్తోంది. కనుక ఈ నామం అకృత్రిమం. స్వయం వ్యక్తం. సర్వశ్రేష్టమైనది.
ఆస్తికత అంటే అర్థం- సత్వగుణాన్నీ, దైవీయ, ఈశ్వరీయ, పారమార్థిక భావనలనూ హృదయంలో నింపుకోవడం. నాస్తికత అంటే అర్థం- తామసంతో, అసురత్వంతో, భోగవాదంతో, స్వార్థంతో కూడిన వాసనలలో మునిగిపోవడం.
‘ఓం’లో అ ఉ మ్ అనే మూడు అక్షరాలు కలిసి ఉన్నాయి.
‘అ’ అంటే అర్థం- ఆత్మ పరాయణత్వం.
మనసును శారీరక విషయాల నుంచి తప్పించి, ఆత్మానందంలో ఓలలాడటం.
‘ఉ’ అంటే అర్థం- ఉన్నతి.
శారీరక, మానసిక, సామాజిక, ఆర్థిక, ఆధ్యాత్మిక సంపదలతో మనసును నింపుకోవడం.
‘మ్’ అంటే అర్థం- మహోన్నత గొప్పతనం.
క్షుద్రతనూ, సంకుచితతత్వాన్ని, స్వార్థపరత్వాన్ని, ఇంద్రియ చాపల్యాన్ని వదులుకోవడం.
ఆదర్శాలు, ప్రేమ, దయ, ఉదారత, సేవ, త్యాగం, సంయమనం ఆధారంగా జీవితాన్ని నిర్మించుకోవడం.
భూ:
మనం శరీరాలము కాము. ప్రాణులము. ఆత్మలము. శరీరానికి ప్రాధాన్యాన్ని ఇస్తూ, ఆత్మను ఉపేక్షించడం భౌతికవాదం.
ఆత్మకు ప్రాధాన్యం ఇస్తూ, శరీరాన్ని తగు విధంగా రక్షించుకోవడం ఆధ్యాత్మ వాదం.
మనం ఆత్మలమనీ, కనుక మన శ్రేయస్సు ఆత్మ పరాయణత్వంలో ఉన్నదనీ గాయత్రి చెబుతుంది.
మనం ఆత్మవాదులం కావాలి.
ఆత్మ కల్యాణానికీ, ఆత్మచింతనకూ, ఆత్మోన్నతికీ, ఆత్మగౌరవానికీ అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. వాటి కోసం నిరంతరం కృషి చేయాలి.
సమాజ సేవ ద్వారా విరాట్ పురుషుడూ, విశ్వ మానవుడూ అయిన పరమాత్మను ఆరాధించాలి.
భువ
ఈ అక్షరం మనకు కర్మయోగ సందేశాన్ని ఇస్తోంది.
ఎందుకంటే- కర్మయోగం ఆధారంగానే మనం అన్ని రకాల దు:ఖాల నుంచి విడుదల పొందగలుగుతాయి. సత్ఫలితాలను సాధించాలంటే మన జీవనం వికాసం పొందాలంటే చేయవలసిన పనిలో మనం పూర్తిగా నిమగ్నం కావాలి. ఇలా నిర్ణయించుకోవడంలో బుద్ధి కుశలత, దూరదృష్టి, వివేకం ఇమిడి ఉన్నాయి.
మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు- వైఫల్యానికి కుంగిపోవడంలో, సాఫల్యానికి పొంగిపోవడంలో అర్థం లేదు.
మనం చేసే పనులకు ఫలితాన్ని ఇచ్చే శక్తి వేరొకటి. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని నిష్టతో పూర్తి చేయాలంతే. ఈ భావనతోనే కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
ఈ భావననే అనాసక్త యోగం అంటారు.
ఈ దృక్పథం కలిగిన వ్యక్తి ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు.
దు:ఖంలో, కష్టంలో విచారించవలసినదేదీ అతడికి కనిపించదు.
స్వ:
మనసును నీ లోపల స్థిరంగా ఉంచుకోవాలి.
మనసులో లోలోపల దృఢంగా ఉండాలి.
సంఘటనలను, పరిస్థితులనూ నీటి అలలుగా పరిగణించాలి.
వాటిలో ఆడుకుని ఆనందించాలి.
అనుకూల పరిస్థితుల్లోని స్వారస్వాన్నీ, ప్రతికూల పరిస్థితుల్లోని స్వారస్వాన్నీ ఆస్వాదించాలి.
అయితే- వాటి వల్ల ఉద్విగ్నులం కాకూడదు. అస్థిరుడవు కావద్దు.
మనసు సమతూకాన్ని కోల్పోకూడదు.
సంతోష, దు:ఖాల ఈ బాల్య క్రీడలలో మనం మునిగిపోకూడదు.
మనం ఆత్మపరాయణులం కావాలి.
‘స్వ:’ గురించి తెలుసుకోవాలి.
ఆత్మచింతనలో, ఆత్మవిశ్వాసంలో,
ఆత్మగౌరవంలో, ఆత్మనిష్టలో, ఆత్మసాధనలో, ఆత్మోన్నతిలో, ఆత్మ నిర్మాణంలో మనం మన ఇచ్ఛాశక్తిని, ఊహాశక్తిని, క్రియాశక్తినీ వినియోగించాలి.
ఎందుకంటే లోపలి మూల కేంద్రం, జన్మస్థలి ఆత్మయే.
ఆత్మస్థితుడైన మనిషి యొక్క అంతరంగం ఆరోగ్యకరంగా ఉంటుంది. కనుక అతడు సదా సంతోషంగా ఉంటాడు.
మన ప్రతి ఇచ్ఛనూ, ప్రతి అవసరాన్నీ పూర్తి చేసుకునే బలం మనకు పూర్తిగా ఉంది.
శరీర బలం, బుద్ధి బలం, విద్యా బలం, ధన బలం, సంఘటన బలం, శీల బలం, ఆత్మ బలం- ఈ ఏడూ జీవితంలో వెలుగునూ, ప్రతిష్ఠనూ, సంపదనూ, స్థిరత్వాన్నీ నింపడానికి అవసరం అవుతాయి.
గాయత్రి మంత్రార్థం
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు శక్తులివే..
1. తత్, 2. స, 3. వి, 4. తు,
5. వ, 6. రే, 7. ణ్యం, 8. భ,
9. ర్గ:, 10. దే, 11. వ, 12. స్య,
13. ధీ, 14. మ, 15. హి, 16. ధి, 17. యో, 18. యో, 19. న:,
20. ప్ర, 21. చో, 22. ద, 23. యా, 24. త్.
గాయత్రి మంత్రార్థం
బ్రహ్మ పురాణంలో శ్రీగాయత్రి మంత్రార్థం గురించి ఇలా వివరించారు..
ఓం- ఓంకారం సర్వమంత్రాలకు మూల మంత్రంగా చెప్పబడింది.
భూ:- నుంచి పృథ్వీ లోకం.
భువ:- నుంచి అంతరిక్షము.
స్వ:- నుంచి స్వర్గ లోకము.
తత్- నుంచి తేజస్సు (అంటే అగ్ని దేవత).
సవితు:- సవిత అంటే ఆదిత్యుడు.
వరేణ్యం:- అన్నవరేణ్యం (అంటే ప్రజాపతి).
భర్గ:- సర్వదేవాత్మకమైనది.
దేవస్య:- దేవుడైన వాడే పురుషుడు (ఈతడినే విష్ణువు అంటారు).
ధీమహి:- ఐశ్వర్యం (ఐశ్వర్యం అంటే మహేశ్వరుడు).
గాయత్రి మంత్రంలో సకల దేవతల శక్తులు ఇమిడి ఉన్నాయి. సృష్టిలోని ప్రధానమైన ఇరవై నలుగురు దేవతల దైవీ శక్తితో కూడినదే గాయత్రి మంత్రం.
అంటే- ఒక్క గాయత్రి మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను స్మరించిన పుణ్యం లభిస్తుంది.
వరేణ్యమ్
మనం దురాలోచనలను వదిలి సదాలోచనలను స్వీకరించాలి.
అమంగళకరమైన ఆలోచనలను వదిలి మంగళకరమైన ఆలోచనలను స్వీకరించాలి.
అందువల్ల మనస్తాపం, అసంతృప్తి అంతం అవుతాయి.
అన్ని పరిస్థితుల్లో ఆనందం తాండవిస్తుంది.
ఒక మనిషి యొక్క అంతరిక ఉన్నతియే అతడి శ్రేష్టత్వానికి కారణం అవుతుంది.
మనం గొప్పవాళ్లం కావాలి. శ్రేష్టులం కావాలి. సంపన్నులం కావాలి.
అయితే, భౌతిక వస్తువు కాక, అంతరిక పరిస్థితి వాటికి పునాది కావాలి.
భర్గో
మనుషులు పాపరహితులు కావాలి. పాపాల వల్ల కలిగే దుష్ఫలితాలను గుర్తించి, వాటిని ఏవగించుకోవాలి. వాటిని నాశనం చేయడం కోసం నిరంతరం సంఘర్షణ జరుపుతూ ఉండాలి.
పవిత్రత కోసం మన కృషి కొనసాగిత, ప్రపంచంలోని కష్టాల నుంచీ, భవ బంధనాల నుంచీ విముక్తి పొంది, మనం జీవన్ముక్తునిలో ఉండే స్వర్గమయ ఆనందాన్ని చూరగొనగలుగుతాము.
దేవస్య
మలినమైన దృక్పథాన్ని వదిలి, విశుద్ధమైన ఆలోచనా విధానాన్ని అవలంభించాలి. అసురత్వపు విధానాన్ని వదిలి దేవత్వపు కార్యకలాపాలను చేపట్టాలి.
భవిష్యత్తులో దు:ఖాన్ని కలిగించే, ఆత్మను పతనం చెందించే క్షణిక సుఖాలకూ, ఆకర్షణలకూ, ప్రలోభాలకూ దూరంగా ఉండాలి.
మనం దేవతత్వాన్ని వికసింప చేసుకోవాలనీ, దేవత్వాన్ని ప్రోత్సహించాలనీ, దైవీయమైన ఆత్మ సంకేతాలను అనుసరించాలని ఈ పదం ద్వారా గాయత్రి మంత్రం బోధిస్తోంది.
ధీమహి
మనం మన లోపల సద్గుణాలను నింపుకోవాలి.
నమత్రగా, మధురంగా, శిష్టంగా, భయరహితంగా, దయాళువుగా, పురుషార్థ పూరితంగా, అలసత్వరహితంగా, శ్రమశీలంగా మన స్వభావాన్ని మలుచుకోవాలి.
మన వ్యవహరణలో ఉదారత, సత్యసంధత, నిజాయితీ, కపటరాహిత్యం, సహృదయత, న్యాయ పరాయణత్వం, సమానత్వం, ఉద్యమించే గుణం ప్రతిబింబించాలి.
ఆరోగ్యం, కీర్తి, ప్రతిష్ట, ఉన్నత పదవి, ధనం, వైభవం.. ఇవన్నీ అందించే గుణాలనూ, లక్షణాలనూ, విశేషతలనూ, అర్హతలనూ మనం గడించాలి.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇరవై ఆరు దైవీ గుణాల గురించి వివరించాడు.
వాటి సారాంశం ఏమిటంటే- ఉద్వేగం లేకపోవడం, స్వచ్ఛత, వివేకశీలత, సహనశీలత, సంయమనం, శక్తి సమీకరణ,
ఉదారత, కర్తవ్య పరాయణత. ఈ గుణాలను మన స్వభావంలో, అభ్యాసంలో ఇమడ్చడం అంటే- శిఖరాగ్ర స్థాయి సంపదను ఉత్పత్తి చేయడమే.
గాయత్రి ప్రాదుర్భావం
గాయత్రి అంటే ఎవరు?
ఈమె ఎలా ఆవిర్భవించింది?
ఒకసారి ఇదే సందేహం వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే ఆయన విధాత వద్దకు వెళ్లి గాయత్రితత్వాన్ని తెలపాలని కోరాడు.
‘నా స్ఫురణమాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమైందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంగా వ్యవహరిస్తారు.
నా నుంచి అగ్ని, అగ్ని నుంచి వాయువు, వాయువు నుంచి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి’ అని బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి వివరించాడు.
సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దళపరాం
సహస్ర నేత్రాం గాయత్రీం శరణ మహం ప్రపద్యే
గాయత్రి మంత్రం అన్ని మంత్రాల్లోకెల్లా శ్రేష్ఠమైనది.
‘న గాయత్య్రా నరం మంత్రం న మాతు: పరదైవతమ్’
అంటే- తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన మంత్రం లేవు.
గయాన్ త్రాయతే ఇతి గాయత్రి
శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. ఆమె ఒక స్వతంత్రమైన దేవి, దేవత కాదు. పరబ్రహ్మ, పరమాత్మల క్రియా భాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి. గాయత్రే బ్రహ్మమని శతపథ బ్రాహ్మణం చెబుతోంది.
ధియో
ఏ గ్రంథం కన్నా, ఏ వ్యక్తికన్నా వివేకం మరింత ప్రధానమైనది.
కనుక, బుద్ధి సంగతమూ, వివేక సమ్మతమూ, మనకు యోగ్యమూ, సముచితమూ అయిన దానిని మాత్రమే గ్రహించాలి. వివేకం అనే గీటురాయి మీద గీయడం ద్వారా మనం ప్రతి సందర్భంలో మంచిచెడ్డలను కనుగొనగలుగుతాము.
మనం వివేకవంతులం కావాలి. వివేకాన్ని అవలంభించాలి.
వివేకమనే గీటురాయిపై గీసి, మనం మన ఆలోచనలనూ, పనులనూ నిర్ణయించుకోవాలి.
యోన
మన శక్తులలో, మన సాధనలలో- అవి తక్కువగా ఉన్నా, హెచ్చుగా ఉన్నా- అతి కనీసమైన భాగాన్ని మన అవసరాల కోసం వినియోగించాలి.
మిగతా భాగాన్ని నిస్వార్థ భావంతో అసమర్థులకు పంచాలి.
కూడబెట్టడం, అనుభవించడం అనే ఎండమావుల వెంట పరుగులు తీయకూడదు.
మన అవసరాలను కనీస స్థాయికి తగ్గించుకోవాలి.
వాటిని పూర్తి చేసుకున్న తరువాత మిగిలి ఉన్న శక్తిలో అత్యధిక భాగాన్ని బలహీనులనూ, పేదలనూ, అమాయకులనూ, చదువు రాని వారినీ పైకి తీసుకురావడం కోసం ఖర్చు చేయాలి.
ఈ పని చేయడం అంటే, దైవకార్యంలో పాల్గొనడమే.
మన బుద్ధి కుశలతనూ, దూరదృష్టినీ, కర్తవ్య పరాయణతనూ నిరూపించడానికి ఇదో మంచి అవకాశం.
ఆత్మ సంయమనంతో, పరమార్థంతో కూడిన ఈ దైవ మార్గాన్ని ‘యోన’ మనకు చూపుతుంది. ఈ మార్గంలో పయనించే గాయత్రి ఉపాసకుడు జీవన లక్ష్యాన్ని సాధించి తీరుతాడు.
ప్రచోదయాత్
ఓ భగవంతుడా! మాకు ప్రేరణను ప్రసాదించు.
మా బుద్ధికి స్ఫూర్తిని ఇవ్వు.
బుద్ధిలో ప్రేరణ జనిస్తే- ధనం, వైభవం అన్నీ స్వయంగా మన కాళ్ల వద్ద మోకరిల్లుతాయి.
ఈ ప్రేరణ లేకపోతే కుబేరుని ఖజానాను పొందినప్పటికీ, సోమరులు దాన్ని వృథా చేస్తారు.
గాయత్రిలోని ‘ప్రచోదయాత్’ శబ్దంతో సద్బుద్ధికి మాత్రమే ప్రేరణ ఇవ్వవలసిందని మనం పరమాత్మను యాచించాలి.
మనం మనం మన మాటలతో, చర్యలతో ఎవరినీ నిరుత్సాహపరచకూడదు.
ఆత్మవిశ్వాసాన్ని కూలదోసే మాటలను, నిరాశ అనే కూపంలో కూరుకుపోయేటట్టుచేసే మాటలను మనం ఎవరికీ చెప్పకూడదు.
ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించాలి.
మనిషిలోని ఆలోచనలను ఉన్నతం, ఉదాత్తం చేసేదీ, సన్మార్గంలో పయనించడానికి మనిషి ఆత్మను ప్రోత్సహించేదీ అయిన జ్ఞానాన్ని ఇవ్వడం అన్నింటినీ మించిన దానం. మనం మనల్ని ప్రాణవంతులను చేసుకోవాలి. ఇతరులలో ప్రాణశక్తిని నింపాలి.
శక్తి తరంగం.. గాయత్రి మంత్రం
గాయత్రి మంత్రం విశిష్టత గురించి రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవాన్ని పొందుతారని అంటారు.
ఓం భూర్భువ: సువ: తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్
ఇది గాయత్రి మంత్రం. ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైనది. ఈ మంత్రాన్ని పఠిస్తే సకల దేవతలను ప్రార్థించినట్టేనని రుగ్వేదంలో ఉంది. ఈ మంత్రాన్ని ఒక నిర్థిష్ట పద్ధతిలో జపించినా లేదా విన్నా వెలువడే ధ్వని తరంగాలు మనసును, శరీరాన్ని ఉల్లాసపరిచి తేజోవంతం చేస్తాయని అంటారు. మనోబుద్ధి కూడా వికసిస్తుంది. దీనిని ప్రయోగాత్మకంగా నిరూపించడానికి అనేక పరిశోధనలు, ప్రయత్నాలు, అధ్యయనాలు కూడా జరిగాయి. గాయత్రి మంత్ర జపం వల్ల ఒకవిధమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి పెరుగుతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది.
గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలు కొనసాగుతున్న అనుభవాలను పొందుతారట.
ఈ మంత్ర పఠనం వల్ల ఎల్లప్పుడూ జీవిత సత్యాలను గ్రహించి, వాటికి అనుగుణంగా మసులుకుని విజయాలను సొంతం చేసుకుంటారని పురాణాల్లో ఉంది.
గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి శిరస్సు చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయట.
గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని జ్ఞాన సంపన్నుడిగా, ధైర్యవంతుడిగా చేసి తరగని శక్తి సామర్థ్యాలను నింపుతుందని అంటారు.
రుగ్వేదంలో పేర్కొన్న ప్రకారం- గాయత్రీ మంత్రానికి అధిష్ఠాన దేవత- సవిత. అగ్ని ముఖం, రుషి- విశ్వామిత్రుడు.
‘ప్రణవ రూపమైన ఓంకారానికి నేను వందనం చేస్తూ, విశ్వాన్ని ప్రకాశింపచేసే సూర్యతేజమైన సవితను ఉపాసిస్తున్నాను’ అనేది గాయత్రి మంత్రానికి ఉన్న అనేక అర్థాలలో ఒకటి.
గాయత్రి మంత్ర సృష్టికర్త.. విశ్వామిత
రుచీకుని కుమారుడైన విశ్వామిత్రుడు మహా తపశ్శక్తి సంపన్నుడు. తన తపో బలంతో రుషిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుని లోకపూజ్యుడయ్యాడు.
విశ్వామిత్రుడు తన తపశ్శక్తితో అనేక వేద మంత్రాలను దర్శించాడు. అందుకే ఆయనను మహా మంతద్రష్ట అని కూడా అంటారు. గాయత్రి దేవి అనుగ్రహంతోనే విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేశాడని అంటారు.
రుగ్వేదంలోని పది మండలాల్లో 3వ మండలాన్ని వైశ్వామిత్ర మండలం అంటారు.
ఇందులో అరవై రెండు సూక్తులు ఉన్నాయి.
ఈ మంత్రాలన్నీ విశ్వామిత్రుడు సృష్టించినవే. ఈ వైశ్వామిత్ర మండలంలో గల బ్రహ్మ గాయత్రి మంత్రాన్ని విశ్వామిత్రుడే స్వయంగా దర్శించి, ఆపై లోకానికి కానుకగా అందించాడు. విశ్వామిత్రుడి వల్లనే వైశామిత్ర మండలం, తృతీయ భాగం, 62వ సూక్తిలో పదవ మంత్రం గాయత్రి మహా మంత్రంగా ప్రసిద్ధిగాంచింది.
విశ్వామిత్రుడే లేకపోతే ఈ లోకానికి గాయత్రి మంత్రం లభించేది కాదు.
గాయత్రి మంత్రం సమస్త వేద మంత్రాలకు మూలమైన మంత్రం.
అన్ని మంత్రాలకూ ఇదే బీజ మంత్రం.
గాయత్రి దేవి ఎలా ఉంటుంది?
ఆమె రూపు ఏమిటి?
స్వరూపమేమిటి?
ఆమెను ఎలా ఆరాధించాలి?
.. ఈ విషయాలన్నీ మనకు తెలియచేసిన ప్రథమ గురువు విశ్వామిత్రుడే.
ముక్తావిద్రుమ హేమనీల ధవళ ఛాయైర్ముఖై
స్త్రీ క్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం
తత్వార్ధ వర్ణాత్మికాం గాయత్రీం
వరదా భయాం కుశ
కశాంశుభ్రం కపాలం గుణాంశంఖం
చక్ర మదార
విందయుగళం హస్తైర్వహంతీం భజే ।।
‘గాయత్రి దేవి వేదమాత. ఆ తల్లి ముత్యాలు, మణిమాణిక్యాలు, ముంగాలు, బంగారం, నీలమణి, ఉజ్వల కాంతితో సమానమైన అయిదు ముఖాలతో మెరుస్తూ ఉంటుంది. ఆవిడ మూడు నేత్రాలతో విరాజిల్లుతుంటుంది. ఆవిడ ముఖకాంతి అనుపమానం. ఆవిడ రత్నమయ కిరీటంలో చంద్రుడు ప్రకాశిస్తుంటాడు. ఆ కిరీటం ఇరవై నాలుగు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. ఆవిడ వరప్రదాయిని. గాయత్రి మాత చేతులలో అంకుశం, వరదముద్ర, కుశ, పాశ, శుభ్రం కపాలం, గద, శంఖం, చక్రం, రెండు కమలాలు ఉంటాయి’ అని పై శ్లోకానికి భావం.
ఈ పరమ పవిత్రమైన మంత్రాన్ని, ఈ మంత్రం మూల దేవత అయిన గాయత్రి దేవిని లోకానికి పరిచయం చేసి పునీతులను చేసిన వాడు విశ్వామిత్రుడు.
విశ్వామిత్రుడు సమ్హిత, విశ్వామిత్ర స్మ•తి అనే గ్రంథాలలో ఈ శ్లోకం కనిపిస్తుంది. ఇంకా అందులో ఆయన గాయత్రిదేవి ఆరాధన, వర్ణనల గురించి ఎంతో అందంగా రాశారు.
ఇరవై నాలుగు దైవీశక్తుల గాయతి
పరమశివుడు బ్రహ్మానందంతో తన ఢమరుకంతో చేసిన ఇరవై
నాలుగు (24) ధ్వనులే శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలు.
ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై
నాలుగు దైవిక శక్తులకు ప్రతీకలు.
వీటికి ఇరవై నాలుగు పేర్లు ఉన్నాయి.
వీటిలో పన్నెండు (12) వైదిక మార్గాలు
కాగా, మిగతా పన్నెండు (12) తాంత్రిక మార్గాలు. ఈ ఇరవై నాలుగు అక్షరాలు నివాసం ఉండే ఇరవై నాలుగు దైవశక్తులు ఆయా పేర్లతో పూజలందుకుంటాయి. గాయత్రి మంత్రాన్ని అనన్య భక్తితో పఠించే వారిని ఆ ఇరవై నాలుగు శక్తులు సర్వవేళలా కాపాడుతాయి. ఈ ఇరవై నాలుగు బీజాక్షరాతో ఇరవై నాలుగు దేవతలకు సంబంధించిన గాయత్రి మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నింటినీ కలిపి ‘చతుర్వింశతి గాయత్రి’ అంటారు.
గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు.. వారి చైతన్య శక్తుల
మంత్రార్థాల వివరణ ఇది..
1. వినాయకుడు (తత్):
ఓం ఏకదంష్ట్రాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నోదంతి: ప్రచోదయాత్
విఘ్నేశ్వరుడు సఫలత్వ శక్తికి అధిపతి. విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఞానాన్నీ ప్రసాదిస్తాడు.
2. నృసింహ భగవానుడు (స):
ఓం ఉగ్రసింహాయ విద్మహే
వజ్రనఖాయ ధీమహి
తన్నో నృసింహ ప్రచోదయాత్
నారసింహుడు పరాక్రమ శక్తికి అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.
3. విష్ణుదేవుడు (వి):
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో విష్ణు: ప్రచోదయాత్
విష్ణువు పాలనా శక్తికి అధిష్టాన దేవత అయిన విష్ణువు సకల జీవ రక్షకుడు.
4. శివదేవుడు (తు:):
ఓం పంచవక్త్రాయ విద్మహే
మహాదేవాయ ధీమహి
తన్నో రుద్ర: ప్రచోదయాత్
శివుడు సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని, పర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించే దయామయుడు.
5. కృష్ణభగవానుడు (వ):
ఓం దేవకీనందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో కృష్ణ: ప్రచోదయాత్
కృష్ణుడు యోగశక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ, ఆత్మనిష్టలను, వైరాగ్య, జ్ఞాన, సౌందర్యాదులను ప్రసాదిస్తాడు.
6. రాధాదేవి (రే):
ఓం వృషభానుజాయై విద్మహే
కృష్ణ ప్రియాయ ధీమహి
తన్నో రాధా: ప్రచోదయాత్
ఈమె ప్రేమశక్తికి అధినేత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగచేసి, అసూయా ద్వేష భావాలను దూరం చేస్తుంది.
7. లక్ష్మీదేవి (ణ్యం):
ఓం మహాలక్ష్య్మోచ విద్మహే
విష్ణు ప్రియాయై ధీమహి
తన్నో లక్ష్మి: ప్రచోదయాత్
లక్ష్మీదేవి ధన వైభవ శక్తులు అధిష్టాత్రి. సకల లోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా
అందించే దేవత ఈమె.
8. అగ్నిదేవుడు (భ):
ఓం మహా జ్వాలాయ విద్మహే
అగ్ని దేవాయ ధీమహి
తన్నో అగ్ని: ప్రచోదయాత్
తేజోశక్తికి అధినేత అయిన
అగ్నిదేవుడు ప్రకాశం, శక్తి,
తేజస్సు, శక్తి, సామర్థ్యాలను
ప్రసాదిస్తాడు.
9. ఇంద్రదేవుడు (ర్గో):
ఓం సహస్ర నేత్రాయ విద్మహే
వజ్రహస్తామ ధీమహి
తన్నో ఇంద్ర: ప్రచోదయాత్
ఇంద్రుడు రక్షాశక్తికి అధినేత.
ఇంద్రుడు
అనారోగ్యాలు, శతృభయాలు, భూత ప్రేతాదుల నుంచి రక్షిస్తాడు.
10. సరస్వతి (దే):
ఓం సర్వస్వత్యై విద్మహే
బ్రహ్మపుత్య్రై ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్
సరస్వతీ దేవి విద్యా ప్రదాత. జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.
11. దుర్గాదేవి (వ):
ఓం గిరిజాయై విద్మహే
శివప్రియాయై ధీమహి
తన్నో దుర్గా ప్రచోదయాత్
దుర్గాదేవి దమనశక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శతృవుల బారి నుంచి కాపాడుతూ సకల ఐశ్వర్యాలనూ ప్రసాదిస్తుంది.
12. హనుమంతుడు (స్య):
ఓం అంజనీసుతాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో మారుతి: ప్రచోదయాత్
నిష్టాశక్తికి ఉపకారి హనుమంతుడు. తన భక్తులకు భక్తి, నిష్ట, కర్తవ్య పరాయణతత్వం, బ్రహ్మచర్య పాలనా శక్తి అనుగ్రహిస్తాడు.
13. పృథ్వీదేవి (భూమాత)- (ధీ):
ఓం పృథ్వీదేవ్యై విద్మహే
సహస్రమూర్త్యై ధీమహి
తన్నో పృథ్వీ ప్రచోదయాత్
భూదేవి ధారణాశక్తికి అధినేత్రి. ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని, నిరంతరత్వాన్నీ ప్రసాదిస్తుంది.
14. సూర్యదేవుడు (మ):
ఓం భాస్కరాయ విద్మహే
దివాకరాయ ధీమహి
తన్నో సూర్య: ప్రచోదయాత్
సూర్యుడు ప్రాణశక్తికి అధిపతి. ఆరోగ్యాన్నీ, సుదీర్ఘ జీవనాన్నీ, ప్రాణశక్తినీ, వికాసాన్నీ, తేజస్సునూ ప్రసాదిస్తాడు.
15. శ్రీరాముడు (హి):
ఓం దాశరథాయ విద్మహే
సీతావల్లభాయ ధీమహి
తన్నో రామ: ప్రచోదయాత్
రాముడు ధర్మం, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వంలాంటి గుణాలకు ప్రతీక. మర్యాదాశక్తికి అధిష్టాత ఈయన.
16. సీతాదేవి (ధి):
ఓం జనక నందిన్యై విద్మహే
భూమిజాయై ధీమహి
తన్నో సీతా: ప్రచోదయాత్
సీతాదవి తపశ్శక్తి అధినేత్రి. అనన్య భావాలతో భక్తులను తపోనిష్టులుగా తయారుచేసి, ఆధ్మాత్మికోన్నతి వైపు ప్రేరేపించే శక్తిధాత్రి ఈమె.
17. చంద్రదేవుడు (యో):
ఓం క్షీర పుత్రాయ విద్మహే
అమృతతత్వాయ ధీమహి
తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్
చంద్రుడు శాంతి శక్తికి అధిష్ఠాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదించే దైవం ఈయన.
18. యమదేవుడు (యో):
ఓం సూర్యపుత్రాయ విద్మహే
మహా కాలాయ ధీమహి
తన్నో యమ: ప్రచోదయాత్
కాలశక్త్యాధిపతి యముడు. మృత్యువుకు భయపడకుండా సకల జనులను సమాయత్తవం చేసే దైవం ఈయన.
19. బ్రహ్మదేవుడు (న:):
ఓం చతుర్ముఖాయ విద్మహే
హంసారూఢాయ ధీమహి
తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్
బ్రహ్మ సకల సృష్టికి అధిపతి. సకల జనులకు శక్తిని ప్రసాదిస్తాడు.
20. వరుణదేవుడు (ప్ర):
ఓం జలబింబాయ విద్మహే
నీల పురుషాయ ధీమహి
తన్నో వరుణ: ప్రచోదయాత్
వరుణుడు భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళుత్వాన్ని, ప్రసన్నతను, ఆనందాన్ని అందిస్తాడు.
21. నారాయణుడు (చో):
ఓం నారాయణాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి
తన్నో నారాయణ: ప్రచోదయాత్
ఆదర్శ శక్తికి అధిష్ఠాత నారాయణుడు. నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.
22. హయగ్రీవుడు (ద):
ఓం వాగీశ్వరాయ విద్మహే
హయగ్రీవాయ ధీమహి
తన్నో హయగ్రీవ: ప్రచోదయాత్
హయగ్రీవుడు సాహసశక్తికి అధిష్ఠాత. ఉత్సాహాన్ని, సాహసాన్ని ప్రసాదిస్తాడు.
23. హంస దేవత (య):
ఓం పరమహంసాయ విద్మహే
మహా హంసాయ ధీమహి
తన్నో హంస: ప్రచోదయాత్
వివేక శక్తికి హంస అధిష్ఠాత్రి. హంస యొక్క క్షీరనీర వివేకశక్తి జగత్ ప్రసిద్ధమైనది.
24. తులసీదేవి (త్):
ఓం శ్రీ తులస్యై విద్మహే
విష్ణుప్రియాయై ధీమహి
తన్నో బృందా: ప్రచోదయాత్
సేవాశక్తికి అధిష్ఠాత్రి తులసీదేవి. ఆత్మశాంతి, దు:ఖ నివారణ వంటి ఫలాలను అనుగ్రహిస్తుంది.

సంపాదకీయం మహా మంత్రం
బ్రాహ్మీ ముహూర్త కాలంలో ప్రకృతిలో చేతనా శక్తి పరుచుకుంటున్న వేళ.. నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ.. అపూర్వ తేజో విరాజితుడైన ముని సత్తుముని కంఠంలో నుంచి వెలువడిన సుస్వర మంత్రఝురి- గాయత్రి మంత్రం.
ఇది సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషణాలను నిర్దేశించే అద్భుత చంధో తరంగం.
ఉత్క•ష్టమైన గాయత్రి మంత్రాన్ని సృష్టించిన ఆ రుషి సత్తముడు మరెవరో కాదు.. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడైన విశ్వామిత్ర మహర్షి.
ఈ మహా రుషి తపశ్శక్తిలో నుంచి వెలువడిన మంత్రమే ఇది.
ఓమ్ భూర్భవ స్వ: ఓమ్త త్సవితుర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్
ఇదే గాయత్రి మూల మంత్రం.
వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమే. గాయత్రి మహా మంత్రానికి వ్యాఖ్యాన రూపంలో రామాయణ మహాకావ్య రచన జరిగిందని అంటారు.
ఈ విశ్వంలో తల్లిని మించిన దైవం లేదు.
గాయత్రిని మించిన మంత్రం లేదు.
త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్టించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్ప బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుందని మన ప్రాచీన రుషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రి దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం.
హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రి మంత్రం సర్వ శ్రేష్ఠమైనది.
నాలుగు వేదాలలో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు.
ప్రతి నిత్యం నియమ నిష్టలతో గాయత్రిని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని రోజులోని మూడు కాలా (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం)ల్లో పదిసార్లు చొప్పున జపిస్తే ఎంతో మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ, చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్లకు ఉండే పాదరక్షలను వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయొచ్చు. గాయత్రి మంత్రాన్ని జపిస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది.
గాయత్రి మంత్రంతో పాటుగా, ‘ఓం నమో గాయత్రి మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీగాయత్రి మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.
గాయత్రి మంత్రంలోని అక్షరాలకు మంత్రార్థం, ఆయా అక్షరాల శబ్దం, మంత్రంలోని ఒక్కో అక్షరం ఏయే దేవతలను ప్రతిబింబిస్తుందనే విశేషాల కథనం.. లోపలి పేజీల్లో చదవండి..
(2022, జూన్ 11, శనివారం- గాయత్రి జయంతి)
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
యాదాద్రి వైభవం
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృషింహ స్వామి వారి క్షేత్ర విశేషాలు, కొత్త ఆలయ పునర్నిర్మాణ గురించిన విశేషాలతో వెలువడిన మే 2022 తెలుగుపత్రిక సంచిక ఎంతో బాగుంది. ఆలయ పునర్నిర్మాణంలో వాడిన శిలలు, వాటిని ఎక్కడి నుంచి సేకరించారు?, పంచతల రాజగోపురాల గురించి విశేషాలు చదివించాయి.
- కేఆర్ రామ్మోహనరావు, పి.చంద్రశేఖర్, సి.కోటేశ్వర్, కొత్తకోట వెంకటేశ్, టి.రాంగోపాల్, ప్రభాకరశర్మ, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
బ్రహ్మానందం
మనిషి కోరుకునేది ఆనందమే. అయితే ఆ ఆనందం ఎటువంటిదనేది ముఖ్యం. విషయానందం, విద్యానందం, బ్రహ్మానందం గురించి పిట్టకథలతో వివరించిన తీరు బాగుంది. మే తెలుగు పత్రిక సంచికలో అందించిన ఈ ఆధ్యాత్మిక వికాసం శీర్షిక అలరించింది.
- రాజగోపాలం, కడలి గోపాలకృష్ణ, మహేశ్వరరావు, టి.షర్మిల, కె.బాపూరావు, కేఆర్ సంతోష్కుమార్- హైదరాబాద్
ప్రతి పేజీలో..
తెలుగు పత్రిక ప్రతి పేజీలో అందిస్తున్న ప్రత్యేక విశేషాలు చదివిస్తున్నాయి. ఆయా దినోత్సవాలు, ముఖ్యమైన రోజులపై వివరణ బాగుంది.
- శంకర్, విజయవాడ
‘‘డబ్బు, పరపతి, సంపత్తి, అధికారం.. ఇవన్నీ అద్దెకుండేవి మాత్రమే.
ఇల్లు మారుతూ ఉంటాయి. చిరునవ్వు, ఆత్మీయత, ప్రేమ..
ఇవి మాత్రమే సొంతమైనవి. ఇవి ఉన్నచోటనే ఉంటాయి’’
- శ్రీ షిర్డీ సాయిబాబా

విశిష్టం.. జ్యేష్ఠం
ఆంగ్ల సంవత్సరాల వరుసలో జ్యేష్ఠ మాసం.. జూన్ నెల కింద వస్తుంది. ఇది ఆంగ్లమానం ప్రకారం ఆరవ నెల అయితే, తెలుగు సంవత్సరాల వరుసలో మూడవ మాసం. పితృ దేవతల రుణం తీర్చుకోవడానికి, పితృదేవతల పూజలకు, శ్రాద్ధాధికాలకు జ్యేష్ఠ మాసం విశిష్టమైనది. ఈ నెలలోనూ కొన్ని ముఖ్యమైన పర్వాలు, వ్రతాలు ఆచరించవలసినవి ఉన్నాయి. జ్యేష్ఠ మాసం సృష్టికర్త బ్రహ్మకు ప్రీతికరమైన మాసమని అంటారు. ఏరువాక పున్నమి, రంభా వ్రతం, నిర్జల ఏకాదశి వంటి పర్వాలు, వ్రతాలు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథులు.
2022- జూన్ 1, బుధవారం, జ్యేష్ఠ శుద్ధ విదియ నుంచి 2022- జూన్ 30, గురువారం, ఆషాఢ శుద్ధ పాడ్యమి వరకు..
శ్రీశుభకృతు నామ సంవత్సరం- జ్యేష్ఠ మాసం- గ్రీష్మ రుతువు- ఉత్తరాయణం
జ్యేష్ఠ మాసం అంతగా శుభ ముహూర్తాల కాలం కాదని అంటారు. ఈ మాసంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించకూడదని మత్స్య పురాణం చెబుతోంది. కానీ జ్యేష్ఠ మాసపు విశిష్టత జ్యేష్ఠ మాసానికి ఉంది. ముఖ్యంగా పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను హరించుకోవడానికి, దైవసేవలో తరించడానికి ఉద్దేశించిన కొన్ని పుణ్య తిథులు ఈ మాసంలో ఉన్నాయి. అలాగే, స్త్రీలకు సౌభాగ్యాన్నిచ్చే వ్రతాలకు జ్యేష్ఠ మాసం పెట్టింది పేరు. రంభా వ్రతం, రంభా తృతీయా, సావిత్రీ వ్రతం, వట సావిత్రీ వ్రతం వంటివన్నీ మహిళకు మంగళకరమైన ఫలితాలనిచ్చే వ్రతాలే. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో తనను ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని జ్యేష్ఠ మాసం పొడవునా పూజించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. పార్వతీదేవి ఆచరించిన ‘రంభా వ్రతం’, వివాహితలు ఆచరించే ‘అరణ్యగౌరీ వ్రతం’, గంగానది స్నానంతో పది రకాల పాపాలను హరించే ‘దశపాప హర దశమి’, ‘త్రివిక్రమ ఏకాదశి’ పేరుతో పిలిచే ‘నిర్జల ఏకాదశి’ ఈ మాసంలో వచ్చే ప్రత్యేక తిథులు. అలాగే సూర్యుడిని ఆరాధించే ‘మిథున సంక్రమణం’, వ్యవసాయ సంబంధ పర్వమైన ‘ఏరువాక పౌర్ణమి’ కూడా ఈ నెలలోని విశేషాలే. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు. వృషభ పూజలు ఈ మాసంలో
విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉంటే పశువులకు కృతజ్ఞతా సూచనకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్ సీజన్కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. అత్యంత విశిష్టమైనదిగా చెప్పే ‘యమునా నది పుష్కరాలు’ ఈ మాసంలోనే ఆరంభమవుతాయి. ఇక, జూన్ నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతాయి. అయితే, నెల చివరి నాటికి వాతావరణం కొంత చల్లబడుతుంది. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వాల పరిచయం..
జ్యేష్ఠ శుద్ధ విదియ/
జూన్ 1, బుధవారం
జ్యేష్ఠ శుద్ధ విదియ నుంచి జూన్ నెల ప్రారంభమవుతుంది. ఈ తిథి నాడు ఆచరించాల్సిన పూజాధికాలు, వ్రతాలు ప్రత్యేకించి ఏమీ లేవు.
ఇది భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి వర్ధంతి దినం.
జ్యేష్ఠ శుద్ధ తదియ/రంభా వ్రతం
జూన్ 2, గురువారం
జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ‘రంభా వ్రతం’ ఆచరిస్తారు. దీనినే ‘రంభా తృతీయ’గా స్మ•తి కౌస్తుభం, తిథితత్త్వం, పురుషార్థ చింతామణి, చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా రాజ్య వ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని తెలుస్తోంది. అయితే, వీటన్నిటిలో ‘రంభా వ్రతం’ కొంత వరకు ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ రంభా వ్రత కథ..
తపోనిష్టలో ఉన్న శివుడికి ఉపచారాలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని అప్పగించాడు. పార్వతిపై శివుడికి ప్రేమ కలగడానికి ఆ సమయంలో మన్మథుడు బాణాలు ప్రయోగించాడు. దీంతో శివుడికి చిత్తం చెదిరింది. పిమ్మట ఆగ్రహించిన శివుడు తన మూడో కన్ను తెరిచి చూశాడు. మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
జరిగిన ఉదంతంతో పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లిని పట్టుకుని జరిగింది చెప్పి బావురుమంది. తల్లి ఓదార్చి, ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకు వెళ్లింది. అంతలో అక్కడికి సప్త మహా మునులూ వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు.
అప్పుడు ఆ మునులలో ఒకరైన భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దానిని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అని అన్నాడు.
పార్వతి- ‘మహాభాగా! ఆ వ్రతం ఎలా చేయాలి?’ అని అడిగింది.
భృగువు- ‘బిడ్డా! ఆ వ్రతాన్ని పెద్దలు ‘రంభా వ్రతం’ అని అంటారు. రంభ అంటే అరటి చెట్టు. ఆ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ఆచరించాలి. నాటి ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి, పంచవన్నెల ముగ్గులు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీ దేవిని పూజించాలి’ అని వివరించాడు.
‘మహాశయా! అరటిచెట్టుకు, సావిత్రీదేవి అధిష్టాన దేవత ఎలా అయ్యింది?’ అని పార్వతి ప్రశ్నించింది.
‘బిడ్డా! సావిత్రి, గాయిత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వంతో ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయిత్రి ఆమెకు నచ్చ చెప్పింది. అయినా సావిత్రి తన మంకుపట్టు వీడలేదు. దీంతో బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని సావిత్రిని శపించాడు. దీంతో సావిత్రికి పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మ కాళ్ల మీద పడి మన్నించాలని ప్రాథేయపడింది. గత్యంతరం లేక భూలోకాన అరటిచెట్టుగా పుట్టింది. ఆ చెట్టు రూపంలోనే ఐదేళ్లు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. మనసు కరిగిన బ్రహ్మ ఆమెకు జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు ప్రత్యక్షమయ్యాడు.
‘నువ్వు ఒక అంశతో అరటిచెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారి కోరికలు ఈడేరుతాయి. ఇక నువ్వు నాతో సత్యలోకానికి వచ్చెయ్’ అని బ్రహ్మ ఆమెను తీసుకుని వెళ్లిపోయాడు. ఆ విధంగా సావిత్రికి శాప విమోచన అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ పర్వదినమైంది’ అని భృగువు పార్వతికి వివరించాడు.
‘స్వామీ! ఈ వ్రతాచరణ విధం వివరించండి’ అని పార్వతి భృగువును కోరింది.
అప్పుడు భృగువు రంభా వ్రత నియమాల గురించి ఇలా వివరించాడు.
‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటిచెట్ల నీడలో పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి, పగలు సావిత్రిని స్తుతిస్తూ, రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆపై సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఇంతకు మునుపు లోపాముద్ర చేసి భర్తను పొందింది’.
భృగువు చెప్పిన విధంగా పార్వతి రంభా వ్రతాన్ని ఆచరించింది. ఈ దీక్షకు శివుడు మెచ్చి ఆమెను పెళ్లాడాడు.
పద్మాసనం వేసుకుని కూర్చుని తపస్సు చేయాలనే చోట ‘కృత్యసార సముచ్ఛయం’ అనే గ్రంథంలో పంచాగ్ని సాధన చేయాలని ఉంది. పంచాగ్ని సాధన అనగా, నాలుగు పక్కలా నిప్పుల గుండాలు ఉంచుకుని తాను సూర్యుని వైపు రెప్పవేయకుండా చూస్తుండాలి. ఇది కఠోర దీక్ష.
రంభా వ్రతం ఆవిర్భావాన్ని బట్టి ఇది స్త్రీలకు ఉద్ధిష్టమైనదని తెలుస్తోంది. అరటిచెట్ల నీడన జ్యేష్ఠ శుద్ధ తదియ మొదలు ఆషాఢ శుద్ధ తదియ వరకు నెల రోజుల పాటు నివసించడం ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. వేసవిలో పగటి పూట చెట్ల నీడ దాహ తాపాన్ని తగ్గిస్తుంది. చల్లగా ఉంటుంది.
మన దేశం మీదికి దండెత్తి వచ్చిన అలెగ్జాండర్.. ఇక్కడి మునులు కొందరు ఈ చెట్ల ఫలాలు మాత్రమే తింటూ, ఈ చెట్లనే నివాసంగా చేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాడట. అందుచేతనే అరటికి గ్రీకు భాషలో ‘సాపియంటమ్’ అనే పేరు పెట్టారు. దీనికి ‘జ్ఞానం కలది’ అని అర్థం. దీనిని బట్టి అరటి చెట్టు నీడ జ్ఞానదాయిని అని గ్రీకులు కూడా భావించినట్టు తెలుస్తోంది.
ఇక, రంభా వ్రతమే కాక, అరటి చెట్టుతో ముడిపడిన వ్రతం మరొకటి ఉంది. దీనిని ‘కదళీ వ్రతం’ అంటారు. అయితే, దీనిని భాద్రపద శుక్ల చతుర్దశి నాడు కానీ, నాడు వీలు కాకపోతే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు కానీ చేస్తారు. ఈ వ్రతం చేస్తే స్త్రీలు సౌభాగ్యవంతులై చిరకాలం జీవిస్తారని ప్రతీతి. అలాగే, ఈనాడు మహారాజా ప్రతాప్ జయంతి తిథి కూడా.
ఇంకా, జూన్ 2, ఉమ్మడి ఆంధప్రదేశ్ పునర్విభజన దినం. 2014లో ఉమ్మడి ఏపీ- ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా ఏర్పడింది. అలాగే, ఇదే రోజు తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం.
జ్యేష్ఠ శుద్ధ చతుర్థి/ఉమా చతుర్థి
జూన్ 3, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో వివరించారు. అందుకే దీనిని ఉమా చతుర్థి అని కూడా అంటారు. ఈనాడు శుక్లా దేవిని పూజించాలని కూడా అంటారు. అలాగే, ఈ తిథిని గణేశ చతుర్థి తిథిగానూ భావిస్తారు. సాధారణంగా చవితి తిథి గణపతి సంబంధమైనదిగా భావిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ పంచమి
జూన్ 4, శనివారం
జ్యేష్ఠ శుద్ధ పంచమి తిథి పితృ దేవతలను విధిగా పూజించాలని ఆయా గ్రంథాలలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి/స్కంద షష్ఠి
జూన్ 5, ఆదివారం
జ్యేష్ఠ శుద్ధ షష్ఠి నాడు అరణ్య గౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. అరణ్యాల్లో, కొండల్లో గౌరిని పూజించే వారికి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. అలాగే, ఈనాడు కుమారస్వామిని పూజించడం కూడా పుణ్యప్రదం. ఈ షష్ఠి తిథికి స్కంద షష్ఠి అని పేరు. స్కందుడు అంటే కుమారస్వామి.
జ్యేష్ఠ శుద్ధ సప్తమి
జూన్ 7, మంగళవారం
జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. అలాగే, ఈనాడు వరుణ పూజ చేయాలని మరికొన్ని గ్రంథాలలో ఉంది.
జ్యేష్ఠ శుద్ధ అష్టమి
జూన్ 8, బుధవారం
జ్యేష్ఠ శుద్ధ అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైన తిథి. అందుకే దీనిని దుర్గాష్టమి అనీ అంటారు. ఈ తిథినే త్రిలోచనాష్టమిగా ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో వర్ణించారు. ఈ తిథి నాటి నుంచి మృగశిర కార్తె ప్రారంభమవుతుంది.
జ్యేష్ఠ శుద్ధ నవమి
జూన్ 9, గురువారం
జ్యేష్ఠ శుద్ధ నవమి నాడు శుక్లాదేవిని పూజించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు శుక్లాదేవిని ‘బ్రహ్మణీ నామ్యా ఉమాయా: పూజా శుక్లాదేవి’ అని స్తుతించాలి.

పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
ఏమి చేయుచుంటివి?
ఏమి చేయుచుంటివి?
పాట పాడుచుంటిని.
ఏమి పాట?
మంచి పాట
ఏమి మంచి?
మాట మంచి
ఏమి మాట?
నీతి మాట
ఏమి నీతి?
నడక నీతి
ఏమి నడక?
గొప్ప నడక
ఏమి గొప్ప?
సేవ గొప్ప
ఏమి సేవ?
దేశ సేవ.
సెలవులు వస్తే..
సెలవులు వచ్చాయంటే చాలుస
చలపతి ఎప్పుడు ఆ•లాడును
సోమరిపోతై తిరుగుచుండును
చదువుసంధ్యలను మరచిపోవును
పాఠశాలలు తెరిచే వరకు
పాఠాలన్నీ మరచిపోవును
మొద్దబ్బాయిగ మిగిలిపోవును
అందరిలోన చులకన పొందును
అందుకని మరి అందుకనీ
సెలవు రోజులలో పాఠాలన్నీ
శ్రద్ధతో చదువుచు ఉండాలి
సాయంత్రము తగిన వేళలో
ఆటలు మంచివి ఆడాలి
బొర్ర బావ
బావా! బావా! ఓ బావా!!
బొర్రను గలిగిన మా బావా!
ఎత్తుగ ఉన్న నీ బొజ్జ
ఎంతో ముద్దుగ ఉంటుంది
కాగుల ఉన్న నీ బొర్ర
కనులకు విందు కలిగిస్తుంది
నీవు నవ్వితే ఓ బావా
బొర్ర ముద్దుగా ఊగేను
నీవు నడిచితే ఓ బావా
బొర్ర ముద్దుగా కదిలేను
నీ బొర్ర కింద ఓ బావా
చక్కగ గుడిసె వేయొచ్చు
నీ బొర్ర కింద ఓ బావా
హాయిగ కాపురముండచ్చు
బావా బావా ఓ బావా!
బొర్రను గలిగిన మా బావా!
ఎండలు బాగా కాస్తున్నాయి
నా తల మాడిపోయెను బావా
బొర్ర బావా బొర్ర బావా
బొర్ర బావా
రావా రావా ఇటురావా
నీ బొర్ర కింద నిల్చుని ఉంటే
ఎండ నుంచి రక్షణ కలిగేను
ఎంతో చల్లగ ఉండేను
బొర్ర బావా బొర్ర బావా
బొర్ర బావా
రావా రావా ఇటురావా
జీవన గీతం.. సంగీతం
జూన్ 21, మంగళవారం, 2022
ప్రపంచ సంగీత దినోత్సవం
భారతీయ సంగీతంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి.. కర్ణాటక, హిందుస్తానీ సంగీత సంప్రదాయాలు.
కర్ణాటక సంగీతం: చెవులకు ఇంపైనది ఏదైనా కర్ణాటక సంగీతమే. ఇది దక్షిణ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన సంగీత బాణి. దీనినే దాక్షిణాత్య సంగీతమనీ అంటారు. ఇందులో శాస్త్రీయ సంగీతం పండితరంజకంగా ఉంటే, ఇతర రకాలైన సంగీత రూపాలు దేశకాల పరిస్థితులకు అనుగుణంగా, పామర రంజకంగా ఉంటాయి.
హిందుస్తానీ సంగీతం: సామవేద జనితమైన సంగీతం ఉత్తరాదిన మొగలుల ప్రభావంతో మార్పులు చెంది నేడు వ్యాప్తిలో ఉన్న హిందుస్తానీ సంగీతమైంది. ఇది ముఖ్యంగా రాజాస్థానాలలో వినిపించే సంగీత పక్రియ. దీనిలో అనేక బాణీలు ఉన్నాయి.
భక్తి సంగీతం: ఇందులో భక్తిరసం ప్రధానం. వివిధ వాగ్గేయకారుల పద్యాలు, భజనలు, కీర్తనలు ఇందులో ఉంటాయి.
కాలక్షేప సంగీతం: శ్లోకాలు, కీర్తనలను మేళవించి పాడే పాటలను కాలక్షేప సంగీత పక్రియ అంటారు.
నాట్య సంగీతం: శాస్త్రీయ నృత్యాలలో తెర వెనుక వినిపించే సంగీతమిది.
జానపద సంగీతం: జనం నాలుకల నుంచి పుట్టినదే జానపద సంగీతం. సినిమా సంగీతం ఈ కోవలోనిదే.
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! [email protected]
US Universities
Temple in US
Telugu Velugulu
June 25, 2022
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia