Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

ఆత్మ‘విశ్వా(వ)స’ నామ సంవత్సరం
రుతువుల్లో మొదటిది- వసంతం.
మాసాల్లో మొదటిది- చైత్రం.
పక్షాల్లో మొదటిది- శుక్ల పక్షం.
తిథుల్లో మొదటిది- పాడ్యమి.
మొదలు అంటే ఆది.
ఇన్ని ఆదులు కలిసే రోజు ఉగాది.
కాలగతిలో కొన్ని ఆలోచనలు ఆగిపోతాయి..
కొన్ని నడకలు అలసిపోతాయి..
కొన్ని ప్రయత్నాలు మధ్యలోనే విరమించుకుంటాయి..
ఇవన్నీ అందరి జీవితంలో ఉండేవే..
అలాంటి వాటన్నింటినీ మళ్లీ కదిలించాలి.
ఆగిపోయిన ఆలోచనలు, తీరని కలలు, నెరవేరని సంకల్పాలను మళ్లీ అరంభించడానికి అసలు సిసలు తరుణమిదే.
కలల బూజును దులిపేయాలి.
బద్ధకాన్ని గోడుకున్న కొక్కేనికి తగిలించాలి.
నిర్లక్ష్యాన్ని వీడాలి.
గమ్యం చేరని లక్ష్యాలపై మళ్లీ గురిపెట్టాలి.
నీరసపడిపోయిన నిర్ణయాలకు కొత్త ఉత్సాహాన్నివ్వాలి.
కలంలో కాలాన్ని నింపి పాత తీర్మానాలను తిరగరాయాలి.
ఒట్టి చేతులనే గట్టి ఆయుధాలుగా మలుచుకోవాలి.
మన లక్ష్యం మంచిదైనపుడు.. మన సంకల్పం గట్టిదైనపుడు కాలం ఓ చేయి వేసి సాయం చేయడానికి సదా సిద్ధంగానే
ఉంటుంది.
‘రాగల కాలం మేలు.. గతించిన కాలం కంటే’ అనే భావనతో ముందడుగు వేయాలి.
మనం సాధించబోయే విజయాలకు ఈ ఉగాది ఒక వేదిక కావాలి.
మరిచిపోలేని వేడుక కావాలి. అందుకు ఈ ఉగాదే నాంది పలకాలి.
మధురమైన కోయిల పాట.. లేతచిగుళ్లు.. రంగుల పూలు.. ఇవన్నీ కలిస్తే వసంతరాగం.
ప్రకృతిని శోభాయమానం చేసే వసంతం.. ఒక శుభ సందర్భం.
ఒక శుభ కామన.
అటువంటి వసంతం ప్రారంభమయ్యేది చైత్ర
శుద్ధ పాడ్యమి నాటి నుంచే.
అటువంటి వసంతానికి ప్రారంభ దినం కాబట్టే ఈ తొలి రోజు ఉగాది అయ్యింది.
కొత్త జీవితానికి, కొత్త ఆశలకు, కొత్త ఆలోచనలకు, కొత్త శుభ సంకల్పాలకు ఉగాది ఒక శుభ సూచిక.
మంచి ప్రారంభ వేదిక.
కాలగతిలో కొత్త విషయాలపై మోజు పెరుగుతుంది.
పాత వాటితో అనుబంధం పూర్తిగా తెగిపోదు.
ఈ పాత - కొత్తల కలయికే జీవితం.
అలాంటి పాత-కొత్త ఆశలకు ఉగాది కావాలి పునాది.
బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ..
ప్రజానురకంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ..
వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ..
శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినదీ..
కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిరోహించినదీ..
ఇవన్నీ ఉగాది నాడే జరిగాయని చారిత్రక, పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి.
కొత్త కార్యాలను ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభ తరుణం లేదు.
ఉగాది అంటే నక్షత్రపు నడక అనే అర్థం కూడా ఉంది.
ఇది పూర్తిగా ప్రకృతి పండుగ.
నేలంతా పులకరించి, కొత్త చిగుళ్లు, పూలతో కళకళలాడే పండుగ.
భవిష్యత్తుపై ఆశలు పెంచి, కొత్త జీవితానికి ఊపిరిలూదే పండుగ.
ఈ పండుగను ‘సంవత్సరేష్ఠి’ అని కూడా అంటారు.
ఇష్ఠి అంటే క్రతువు అని అర్థం.
అన్ని లోకాలూ సుఖశాంతులతో ఉండాలనే శుభ సంకల్పంతో విశ్వవ్యాప్తమైన శుభకామన కలిగి ఉండటమే మన భారతీయ పర్వాల్లోని అంతరార్థం.
అదే ఉగాది ఈ లోకానికి ఇచ్చే సందేశం.
పండుగల ఆవిర్భావానికి ప్రధాన కారణం.. మనిషి సంఘజీవి కావడమే.
ఆ సంఘం సంతోషంగా ఉండాలనీ, ఆ సంతోషాలలో తానూ భాగస్వామి కావాలని కోరుకోవడం మనిషి నైజం కావాలి.
అలా సహృదయ భావంతో జరుపుకునే ఒక్కో పండుగకూ ఒక్కో ఆచారం ఉంటుంది.
వాటి వెనుక దైవారాధనతో పాటు అంతర్లీనంగా ఆరోగ్య సంరక్షణ కూడా ఉంటుంది.
అలాంటి పండుగల్లో మనకు అత్యంత ముఖ్యమైనది ఉగాది.
ఉగాది సంపూర్ణ వికాసానికి గుర్తు.
భూమిపై వసంతం వికసించిన తొలిరోజు ఉగాది.
వసంత మాసంలో ప్రకృతి అంతా కొత్త సంకేతాలను ఇస్తుంది.
మనిషి ఆశలు కూడా చిగురుల వంటివి.
అవి ఫలించాలి.. ఫలితాలనివ్వాలి.
అదే ఉగాది పర్వం చాటే శుభకామన.
మిగిలిన పండుగల కన్నా ఉగాది ఎంతో ప్రత్యేకమైనది.
సాధారణంగా పర్వదినాలన్నీ ఏదో ఒక దేవత లేదా దేవుడికి సంబంధించి ఉంటాయి.
ఉగాది ఇందుకు పూర్తి భిన్నం.
ఏ దేవుడి పేరూ ఈ పండుగ నాడు ప్రత్యేకంగా వినిపించదు.
ఎవరి ఇష్టదైవాన్ని వారు పూజించుకోవడమే.
ఉగాది కాలానికి సంకేతం.
మానవ జీవనానికి, కాలానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకునే ఆనంద వేళ ఉగాది.
కాలాన్ని గుణిస్తూ, మార్పులకు అనుగుణంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలనే సందేశాన్ని ఉగాది పండుగ అందిస్తుంది.
సహనానికి, వ్యక్తిత్వ వికాసానికి, మనో వికాసానికి, ఆత్మవిశ్వాసానికి ఇది ఆలవాలంగా నిలుస్తుంది.
ఎల్లప్పుడూ మంగళ ధ్వనులు వినాలనే తపనకు ప్రతిరూపమే కోకిల కూత.
ఈ విధంగా ఉగాది మనిషి జీవనంలో కీలకంగా, మూలకంగా ఆవిర్భవించింది.
ఉగాది పర్వదినం పునరుజ్జీవనానికి సంకేతం.
అప్పటి వరకు మోడుబారిన చెట్లు, తీగెలు ఉగాది రాకతో మళ్లీ చిగురించి పూలు, కాయలతో కళకళలాడినట్టు కష్టనష్టాలతో కుంగిపోతున్న మనిషి జీవితం ధైర్యంతో, ఆశతో ముందుకు సాగాలనే సందేశాన్ని అందిస్తుంది.
కాలం, విష్ణువు.. ఈ రెండూ వ్యాపించే గుణం గలవే.
సర్వం కాలాధీనమే.
ఆ కాలం విష్ణువు ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తుంది.
కనుక సంవత్సరాది నాడు విష్ణువును కాలస్వరూపుడిగా భావించి పూజించాలి.
మనం ఉగాది నాడు పఠించే పంచాంగానికి అధిష్ఠాన దేవత శ్రీమన్నారాయణుడేనని అంటారు.
ఉగాది యుగయుగాలుగా వస్తున్న యుగాల వేడుక.
తరతరాలుగా వస్తున్న తరాల పండుగ.
సృష్టి ఆదిలోనే ఆరంభమైంది.
త్రేతాయుగ వాసులూ, ద్వాపర పౌరులూ ఈ ఉగాదిని ఘనంగా జరుపుకున్నారు.
ఇక, మన ప్రస్తుత కలియుగం విషయానికి వస్తే.. స్వార్థం ఆకలిగొన్న పులిలా గాండ్రిస్తోంది.
క్రోధం, విరోధం జనుల నరనరానా పేరుకుపోయాయి.
ఈ కలి ప్రభావాన్ని తట్టుకుని నిలిచేందుకు అవసరమైన మనోబలాన్ని అందించి.. విశ్వావసు నామ సంవత్సరంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుని మనల్ని మనం యోధులుగా తీర్చిదిద్దుకోవడానికి ఒక గొప్ప అవకాశం- ఈ విశ్వావసు నామ సంవత్సరాది.
ఆణిమాది సిద్ధులు సాధించిన మహా మేధావి ఉదంకుడు. ఒకసారి సందర్భవశాత్తూ ఉదంకుడు వ్యాస భగవాడుని ఆదేశం మేరకు ఒక ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఇద్దరు వ్యక్తులు నలుపు - తెలుపు దారాలను వడుకుతూ కనిపిస్తారు. వారిని దాటి కొంచెం ముందకు వెళ్లగా.. ఆరో ఆరుగురు వ్యక్తులు పన్నెండు ఆకులు గల చక్రాన్ని తిప్పుతుంటారు. వారంతా ఎవరు? ఏం చేస్తున్నారనేది ఉదంకుడు గ్రహించలేకపోతాడు. అంతలోనే ఆయనకు ఒక వేదమంత్రం గుర్తుకువస్తుంది. విరాట్ పురుషుని కాల వర్ణన మదిలో మెదులుతుంది. దానికి బట్టి తాను చూసిన ఆ వ్యక్తులు, వారు చేస్తున్న పనిని గురించి ఇలా గ్రహిస్తాడు. అదెలాగంటే..
మొదటి ఇద్దరూ విధి, విధాత.
వారు వడుకుతున్న నలుపు - తెలుపు దారాలు చీకటి వెలుగులకు ప్రతీకలు.
అలాగే, మరో ఆరుగురు వ్యక్తులు ఆరు రుతువులను ఉదంకుడు గ్రహిస్తాడు.
వారు తిప్పుతున్న ద్వాదశ పత్రాల చక్రమే పన్నెండు మాసాల కాలం.
ఇది మహాభారతంలోని ఒక కథ.
మార్పు కాల స్వభావం. ఆ మార్పును కాల పురుషుడి తీర్పుగా జనంలోకి తీసుకుని వెళ్లడమే యుగధర్మం.
త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వరకైనా.. ద్వాపర నుంచి కలియుగం వరకైనా.. యుగానికి ఒకసారి పెనుమార్పు వస్తుంది.
ప్రభవ నుంచి అరవై సంవత్సరాల కాలచక్రం తిరిగి మళ్లీ ప్రభవ వరకు వచ్చే వరకు అరవై సంవత్సరాల కాలం.
ఈ అరవై ఏళ్లలోనూ వ్యవస్థలోనూ, వ్యక్తుల జీవితాల్లోనూ ఎన్నో పరిణామాలు, మరెన్నో మార్పులు సంభవిస్తాయి.
అందులో కొన్ని మార్పులు, కొన్ని పరిణామాలు సకారాత్మకమూ, కొన్ని నకారాత్మకమూ.
ఆ మంచిచెడులను ఆకళింపు చేసుకుని అడుగు ముందుకు వేయాల్సిన సమయంలో హెచ్చరికతో కూడిన శుభకామనలు అందిస్తుంది ఉగాది.
కృతయుగంలో ఉగాది..
ఒకసారి విధాత యోగనిద్రలో ఉన్నపుడు సోమకుడనే రాక్షసుడు నాలుగు వేదాలనూ దొంగిలించుకునిపోయాడట. వేదం అంటేనే జ్ఞానకాంతి. అటువంటి అమూల్య సంపద పడకూడని వాడి చేతిలో పడింది. ఇంకేముంది? జ్ఞానకాంతి లోపించడంతో లోకమంతటా అసురసంధ్య (చీకట్లు) వ్యాపించింది. దైవీశక్తులు తేజస్సును కోల్పోయాయి. మహర్షుల యజ్ఞయాగాదులకు విఘాతం ఏర్పడింది. అంతా కలసి విష్ణుమూర్తిని శరణువేడారు. సోమకుడి మత్సరం అణచేందుకు స్వామి మత్స్యావతారం ధరించాడు. రాక్షస సంహారం జరిగిపోయింది. నాలుగు కట్టల (వేదాలు నాలుగు: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)నూ బ్రహ్మదేవుడికి భద్రంగా అప్పగించాడు వేదనారాయణుడు. ఇక లోకానికి సంభవించిన విఘ్నాలన్నీ తొలగిపోయాయి. కార్తిక శుద్ధ నవమి నాడు చతుర్ముఖుడు ప్రళయానంతర సృష్టిని ఆరంభించాడు. అలా సత్యయుగానికి శ్రీకారం చుట్టాడు. చివరి వరకూ కార్తిక శుద్ధ నవమి తిథి రోజునే ఉగాదిని జరుపుకున్నారు కృతయుగ వాసులు.
త్రేతాయుగంలో రెండు ఉగాదులు..?
రామాయణ కాలం నాటికే ఉత్తరాయణం ఉత్తమ ఫలితాలను మోసుకుని వస్తుందనే నమ్మకం ప్రజలలో ఉండేది. కాబట్టే సూర్యుడు మకరరాశాలో ప్రవేశించే శుభ సమయాన్నే ఆ కాలంలో ఉగాదిగా నిర్ణయించారనే ఒక వాదన ఉంది. అంటే రామాయణ కాలంలో సంక్రాంతి సమయంలో ఉగాది వచ్చేదన్న మాట. అలాగే, మనం ప్రస్తుతం అక్షయ తృతీయగా చెప్పుకుంటున్న వైశాఖ శుద్ధ తదియ నాడు కూడా రామాయణ కాలంలో ఉగాది వేడుకలు జరిగేవనే అభిప్రాయమూ ఉంది. సందర్భం ఏదైనా పండుగ మాత్రం ఘనంగా చేసుకునే వారు త్రేతాయుగ కాలంలో.
ద్వాపరయుగంలో ఇలా..
ద్వాపర యుగ ప్రజలు మాఘ కృష్ణ అమావాస్య తిథిని యుగాదిగా భావించే వారని పండితులు అంటారు. సాక్షాత్తూ దేవదేవుడే ద్వారకాధీశుడై పాలన సాగించిన సమయం అది. మహాభారత యుద్ధం పూర్తయిన వెంటనే కలి ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. కానీ, కృష్ణ భగవానుడు ఉన్నంత కాలం భూమీ మీద కాలు మోపే ధైర్యం చేయలేదు కల్కి.
ప్రస్తుత కలియుగంలో..
కృష్ణావతారం పరిసమాప్తి కావడంతో ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయింది. దాంతో ద్వాపరయుగం ముగిసింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కలియుగం ప్రారంభమైంది. ఒక వంతు ధర్మం, మూడొంతుల అధర్మం.. కలియుగ నియమం. భౌతిక కాలుష్యాన్ని మించిన భావ కాలుష్యం రాజ్యమేలుతున్న సమయమిది. అహం నెత్తికెక్కుతోంది. ఇహం పట్ల వ్యామోహం మితిమీరుతోంది. ఇది పతనానికి ఆది. అంతానికి ఆరంభం. ఈ ఉత్పాతం నుంచి రక్షించగలిగేది ఉగాదే.
పంచాంగమే ప్రమాణంగా కలిని గెలిచే, ఘోరకలిని తట్టుకుని నిలిచే మార్గాన్ని ప్రబోధించే మార్గదర్శి- ఉగాది. ఇది దానధర్మాలను, ధార్మిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది. అంతరంగ శుద్ధికి జపతపాలను సూచిస్తుంది. ఉగాది రోజున పాటించాల్సిన మూడు ముఖ్య నియమాల ఉద్దేశం కూడా అదే. అవేమిటంటే..
అభ్యంగన స్నానం: ఒంటికి పట్టిన మురికితో పాటు మనోకల్మషాన్నీ వదిలించుకోవడం.
నింబకుసుమ భక్షణం: వేప పువ్వులో కించిత్ చేదు ఉంటుంది. జీవితంలో తారసపడే అవరోధాలకు ఇది సూచన.
పంచాంగ శ్రవణం: పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని. ఏడాది కాలానికి దిక్సూచి. మరో ఉగాది వరకూ మనిషిని నిటారుగా నిలబెట్టే పునాది. ఆ మనోబలమే.. కలిపురుషుడి పరుషత్వాన్ని నిలువరించే ధైర్యం ఇస్తుంది. మనం మనలా బతికేందుకు భరోసా అందిస్తుంది.
ఒక్కో ఉగాదికి ఒక్కో స్వభావం
కలియుగం ఆరంభం నాటికి మనిషి ఆయుర్ధాయం నిండుగా నూట ఇరవై (120) సంవత్సరాలు. అంటే ప్రభవ నామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తి మరో ప్రభవ నాటికి షష్టిపూర్తి చేసుకుంటాడు. అప్పటికే అన్ని బాధ్యతలూ తీరిపోయి ఉంటాయి. మిగిలిన అరవై సంవత్సరాలూ ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. ఇది నియమం. మన సంవత్సరాల పేర్లు సైతం కాల స్వభావాన్ని తెలిపేవే.
ప్రభవ అంటే పుట్టుక. ఆరంభం.
విభవ అంటే వైభవం.
శుక్ల అంటే నిర్మలం.
ప్రమోదూత అంటే ఆనందానికి ప్రతీక.
అంగీరస అంటే వివిధ శరీర భాగాల్లోని ప్రాణశక్తి.
ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో స్వభావాన్ని తెలియచెబుతుంది.
ఇప్పుడు మనం క్రోధి నామ సంవత్సరం నుంచి విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.
గడిచిన సంవత్సరంలో క్రోధాన్ని జయించామో లేదో కానీ.. అందరికీ ప్రయోజనం కలిగించే, అందరికీ శుభాలు కలగాలని ఆశీర్వదించే ‘విశ్వావసు’ నామ సంవత్సరంలోకి అడుగిడుతున్నాం.
క్రోధాన్ని గెలిస్తేనే శాంతి.
శాంతి కలిగి ఉంటేనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాం.
అలాంటి ఆత్మవిశ్వాసాన్ని అందించేది- ఈ విశ్వావసు నామ సంవత్సరం.
ఉగాది నాడు ఎవరిని
పూజించాలి?
సంవత్సరాది నాడు ఉమామహేశ్వర గౌరీ వ్రతం ఆచరించాలనే సంప్రదాయం ఉంది.
మూడు కాలాలూ లోకాలనేలే మహేశ్వరుడికి త్రినేత్రాలు.
శివుడి ఇల్లాలు గౌరీదేవి సౌభాగ్య ప్రదాత.
ఉగాది వేళ ఆ ఆది దంపతులను పూజిస్తే దోషరాశి తొలగిపోతుందని విశ్వాసం. ఉమా మహేశ్వరులకు ఉగాది పచ్చడితో పాటు పంచభక్ష్య పరమాన్నాలనూ నైవేద్యంగా సమర్పిస్తారు. షోడశోపచారాలు చేస్తారు. ఆ తరువాత పంచాంగ శ్రవణం చేయాలి.
అన్ని వ్రతాల మాదిరిగానే ఈ ఉమా మహేశ్వర వ్రతం కూడా గణపతి పూజతో ప్రారంభమై, ఉద్వాసనతో పరిసమాప్తి అవుతుంది.
ఉమా మహేశ్వర పూజ సకల శుభ కారకమని పండితులు చెబుతారు.
ఎవరీ విశ్వావసు?
తెలుగు సంవత్సరాల వరుసలో 39వది విశ్వావసు (విశ్వవసు) నామ సంవత్సరం. 1905, 1965 తరువాత మళ్లీ అరవై ఏళ్లకు వచ్చిన సంవత్సరమిది. ‘విశ్వావసు’ నామ సంవత్సరంలో ధనం సమృద్ధిగా ఉంటుందని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఇంతకీ ఈ సంవత్సరానికి ఈ పేరెలా వచ్చింది? ఈ విశ్వావసుడెవరు? తెలుసుకుందాం.
వేదాలు, పురాణాల్లో దాదాపు 23 చోట్ల విశ్వావసుడనే పేరు, ఆ పేరు గల వ్యక్తి ప్రస్తావనలు ఉన్నాయి.
• పురాణాల ప్రకారం విశ్వావసుడు ఒక గంధర్వరాజు. స్వర్గలోక గాయకుడు. ఇంద్రుడి రాజభవనంలో ఉంటూ.. ఆయనను గురించి కీర్తిస్తూ ఉంటాడు.
• మహా భారతంలోని ఆదిపర్వంలో విశ్వావసుడి ప్రస్తావన పలుమార్లు ఉంది. దాని ప్రకారం.. ఈయన తండ్రి కశ్యపుడు. తల్లి ప్రభ. స్వర్గలోక కన్య, అప్సరస అయిన మేనకతో సన్నిహితంగా ఉండేవాడు. ఫలితంగా వీరికో కుమారుడు (ప్రమద్వరుడు) కలిగాడు.
• ద్రౌపది స్వయంవరం, అర్జునుడి జన్మదిన సందర్భాల్లో కూడా విశ్వావసు పేరు వినిపిస్తుంది.
• ఈయన సోముడు (చంద్రుడు) నుంచి చాక్షుపివిద్య (అన్నింటినీ చూసే కళ) నేర్చుకున్నాడు. అదే విద్యను గంధర్వుడైన చిత్రరథుడికి నేర్పించాడని మహాభారతం ఆదిపర్వంలో ఉంది.
• ఇక, రామాయణంలోనూ విశ్వావసు అనే పాత్ర ఉంది. రామలక్ష్మణులను కబంధుడనే అసురుడు రామలక్ష్మణులను అడ్డగిస్తాడు. ఈ సందర్భంలో రాముడి ద్వారా శాపవిమోచనమై కబంధుడే విశ్వావసుగా రూపాంతరం చెందాడని అంటారు.
• ఇక, దిలీపు చక్రవర్తి ఒకసారి యాగం తలపెడితే ఆ సందర్భంగా విశ్వావసు అనే పాత్రధారి వీణ వాయించినట్టు చెబుతారు.
• యాజ్ఞవల్క్యుడిని విశ్వావసు ఓ సందర్భంగా ఇరవై నాలుగు ప్రశ్నలు అడిగినట్టు, వాటికి సంతృప్తికరమైన సమాధానాలు లభించిన మీదట తిరిగి స్వర్గానికి తిరిగి వెళ్లినట్టు మహాభారతం శాంతిపర్వంలో ఉంది.
• స్వర్గంలో ఉండే గంధర్వులకు ఈ విశ్వావసు అధిపతి అని శివపురాణం చెబుతోంది.
బృహత్సంహిత ప్రకారం విశ్వదేవుడికి పవిత్రమైన యుగం (ఐదు సంవత్సరాలు ఈయన యుగకాలంగా చెప్పబడింది)లో వచ్చే మొదటి సంవత్సరం- శోభకృత్. దీని తరువాత సంవత్సరం- శుభకృత్. మూడవది- క్రోధి. మిగిలిన రెండు సంవత్సరాలు- విశ్వావసు, పరాభవ. శోభకృత్, శుభకృత్ నామ సంవత్సరాల్లో మానవాళి సంతోషంగా ఉంటుంది. క్రోధి నామ సంవత్సరం (2024)లో ప్రజలు కోపిష్టులై, దు:ఖితులై ఉంటారు. విశ్వావసు నామ సంవత్సరం (ప్రస్తుత సంవత్సరం 2025)లో ప్రజలు సంతోషంగా కానీ, దు:ఖితులై కానీ ఉండరు. కానీ పరాభవ సంవత్సరం (వచ్చే ఏడాది, 2026)లో అగ్ని భయం, ఆయుధాలు, వ్యాధుల బాధ ఉంటుంది.
• వేద జ్యోతిష శాస్త్రంల విశ్వావసు ముప్పై తొమ్మిదవ సంవత్సరానికి అధిపతి. మన తెలుగు పంచాంగాల ప్రకారం కూడా తెలుగు నామ సంవత్సరాల్లో 39 సంవత్సరం విశ్వావసు పేరు మీదనే ఉంది.
• విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టే పిల్లలు సద్గుణవంతుడవుతాడని, వీరికి మంచి భార్య, సంతానం కలుగుతారని వేద జ్యోతిషంలో ఉంది. ఉదారంగా ఉంటారనీ, అద్భుతమైన ప్రవర్తన కలిగి ఉంటారనీ, సహనం, ఓర్పు తదితర సుగుణాలతో ఉంటారనీ ఉంది.
• జాతక పారిజాతం అనే గ్రంథంలో పేర్కొన్న ప్రకారం విశ్వావసు నామ సంవత్సరంలో పుట్టిన వ్యక్తికి గౌరవం ఎక్కువగా లభిస్తుంది. హాస్యాన్ని ఇష్టపడతారు. నైతిక విలువలు కలిగి ఉంటారు.
అందరి ప్రయోజనాన్ని కోరేవాడు
అందరినీ ఆశీర్వదించే వాడు..
గుణాఢ్యుడి కథా సరిత్సాగరం 90వ అధ్యాయంలోని వేతాళ పాంచవింశతిలోని పదహారవ కథ ప్రకారం.. మలయ పర్వతం (మలయాద్రి) వద్ద నివసించే సిద్ధుల రాజు పేరు విశ్వావసుగా చెప్పబడింది. గంధపు చెట్లతో కూడిన ఒక లోయలో ఆశ్రయం ఏర్పాటు చేసుకున్న ఈయన అక్కడే తన తల్లిదండ్రుల కోసం వేచి ఉంటూ సమయాన్నంతా గడిపాడని రాశారు.
• హిందూ సంప్రదాయంలో విశ్వావసు గంధర్వుల రాజు. మేనక ద్వారా బిడ్డను కన్నాడు. అయితే వీరు ఆ శిశువును పెంచకుండా వదిలేశారు. స్థూల కేశ అనే రుషి ఆ శిశువును చేరదీసి, తన సొంత కుమార్తెగా పెంచి, చ్యవన మహర్షి మనవడు రురుకు ఇచ్చి వివాహం చేశాడని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తోంది.
• జైన సంప్రదాయంలో కూడా విశ్వావసు పేరు వినిపిస్తుంది. జైనుల్లో శ్వేతాంబర, దిగంబర సంప్రదాయాలు ఉన్నాయి. శ్వేతాంబర సంప్రదాయవాదులు విశ్వావసు అనే పేరును విశ్వానికి ప్రతీకగా భావిస్తారు.
• జైన రామాయణం ప్రకారం వసువు యొక్క పది మంది కుమారులలో విశ్వావసు ఒకడు.
• బృహస్పతి 60 సంవత్సరాల చక్రంలో కూడా 39వ సంవత్సరంగా విశ్వావసును పేర్కొన్నారు.
• రుగ్వేదం, అధర్వణ వేదం, జ్యోతిషం తదితర భారతీయ ప్రాచీన సాహిత్యంలో విశ్వావసు అనే పాత్రధారి ప్రస్తావన చాలాచోట్ల వస్తుంది.
• మహాభారతం భీష్మపర్వంలో భగవానుడు భీష్ముడికి విష్ణు సహస్ర నామ శ్లోకాలను, ఆ శ్లోకంలోని పదాలకు అర్థాలను వివరించే సందర్భం ఉంటుంది. అలాంటి పదాల్లో ‘విశ్వావసు’ అనే పదం కూడా వస్తుంది. ఇక్కడ ఈ పదానికి అందరికీ ప్రయోజనం కలిగించేదనే అర్థమిచ్చారు. అలాగే, అందరినీ ఆశీర్వదించే వాడనే అర్థం కూడా ఉంది.
• రుగ్వేదంలోని ఒక శ్లోకాన్ని విశ్వావసు అనే ఆయన రచించినట్టు చెబుతారు.
• మోనియర్-విలియమ్స్ సంస్క•త - ఆంగ్ల నిఘంటువులో విశ్వావసు అనే పదానికి ‘అందరి సంపద’ అనే అర్థాన్ని చూపారు.
• అమరసింహ, హలాయుధ, హేమచంద్ర తదితర గ్రంథాలలో ‘విశ్వావసు’ అనే పదాన్ని ‘రాత్రి’కి సంకేతంగా వాడారని తెలుస్తోంది.
కాల పట్టిక
సంవత్సరం:
పన్నెండు నెలల కాలాన్ని సంవత్సరం అంటారు. మనకు మొత్తం అరవై సంవత్సరాలు. మొదటిది ప్రభవ. చివరిది అక్షయ నామ సంవత్సరం. ఈ వరుసలో ప్రస్తుతం సంవత్సరవం విశ్వావసు నామసంవత్సరం. ఇది తెలుగు సంవత్సరాల కాలచక్రంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరం.
ఆయనం:
ఆరు నెలల కాలాన్ని ఆయనం అంటారు. మనకు సంవత్సరంలో మొత్తం రెండు ఆయనాలు వస్తాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం. జనవరి నుంచి జూన్ వరకు ఉత్తరాయణ కాలం. దేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పే ఈ ఆయనాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు. జూలై నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనం. దీనినే ఖగోళ శాస్త్రం ప్రకారం- ప్రతి సంవత్సరం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణంగానూ, జూలై 16 నుంచి జనవరి 14 వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అనీ లెక్కగడతారు.
మాసం (నెల):
ముప్పై రోజుల కాలాన్ని నెల (మాసం) అంటారు. మనకు సంవత్సరంలో మొత్తం పన్నెండు (12) నెలలు. అవి- చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
రుతువు:
ప్రతి రెండు నెలల కాలానికి ‘రుతువు’ అని పేరు. మనకు సంవత్సరంలో మొత్తం ఆరు రుతువులు వస్తాయి. అవి- వసంతం (చైత్రం, వైశాఖం. ఈ కాలంలో చెట్లు చిగురించి పూలు పూస్తాయి), గ్రీష్మం (జ్యేష్ఠం, ఆషాఢ మాసాలు కలిపి గ్రీష్మ రుతువు. ఎండలు మెండుగా ఉంటాయి), వర్ష రుతువు (శ్రావణం, భాద్రపదం: వర్షాలు పుష్కలంగా కురుస్తాయి), శరదృతువు (ఆశ్వయుజం, కార్తీకం: వెన్నెల పిండారబోసినట్టు కాంతివంతంగా ఉంటుంది) , హేమంతం (మార్గశిర, పుష్య మాసాలు: మంచు బాగా కురుస్తుంది. చలిగా ఉంటుంది), శిశిరం (మాఘ, ఫాల్గుణ మాసాలు: చెట్లు ఆకులు రాలుస్తాయి).
పక్షం:
ప్రతి పదిహేను రోజుల కాలాన్ని పక్షం అంటారు. నెలకు రెండు పక్షాలు. అవి- శుక్ల (శుద్ధ) పక్షం, కృష్ణ (బహుళ) పక్షం.
తిథి:
ఇరవై నాలుగు గంటల సమయాన్ని తిథి అంటారు. పక్షానికి పదిహేను తిథులు. పాడ్యమి నుంచి పౌర్ణమి లేదా అమావాస్య వరకు..
ఆరు రుచులూ..
ఆరు అనుభవాలూ..
షడ్రుచుల సమాహారంగా ఉగాది నాడు తయారు చేసే నైవేద్యపు వంటకాన్నే ఉగాది పచ్చడి అనీ అంటారు. దీనికి ఆరంటే ఆరే దినుసులు వాడాలి. రుచి కోసమో, అలంకరణ కోసమో అదనపు పదార్థాలు జోడించడం సరికాదు. అదీ, పరమాత్మకు నివేదించిన తరువాతే స్వీకరించాలి. పచ్చడిలోని ప్రతి దినుసులో ఆరోగ్య ఫలమూ, వికాస సూత్రమూ ఇమిడి ఉన్నాయి.
తీపి:
తీపి ఆనందానికి ప్రతీక. ఆశావాదానికి సంకేతం. ఆయుర్వేదం ప్రకారం.. వాత, పిత్త, కఫం అనే త్రిదోషాలను సవరించే శక్తి బెల్లానికి ఉంది.
పులుపు:
చిత పులుసులోని పులుపు రాబోయే అవరోధాలకు ప్రతీక. వాటిని లౌక్యంతో ఎదుర్కోవాలనే ధైర్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య శాస్త్రం ప్రకారం పులుపు జీర్ణశక్తిని పెంచుతుంది. ఆ మోతాదు పెరిగితే వికటిస్తుంది కూడా.
ఉప్పు-కారం:
మనలోని అతర్లీన శక్తిని గుర్తు చేసే రెండు రుచులివి. ఉపూ• కారం తగ్గితే వంటలో రుచి పోతుంది. పొరపాటున పెరిగితే నాలుక మండుతుంది. మధ్యస్థమైన ఆహారాన్నే మన పొట్ట హరాయించుకోగలదు. జీవితంలోనూ ఇలాంటి సమతౌల్యం అవసరం.
చేదు:
భోజనంలో అయినా, జీవితంలో అయినా అనివార్యమైనది- చేదు. అయిష్టంగానైనా దీనిని ఆమోదించాల్సిందే. గుండెదిటవు చేసుకుని స్వీకరించాల్సిందే. చేదు అనుభవంలో ఓ పాఠం ఉంటుంది. వేప పూవులోని చేదులో అపారమైన ఔషధ గుణం ఉంది.
వగరు:
వసంతం అందించే పసందైన పంట- మామిడి. వగరు ఆశ్చర్యానికి బండగుర్తు. జీవితం నిబిడాశ్చర్యాల సమాహారమని గుర్తు చేస్తుందీ రుచి. వగరు ఎంతో కొంత ఆరోగ్యకరం కూడా. దీనికి గాయాలను మాన్పే గుణం ఉందని కూడా అంటారు.

వసంత వికాసం మనసంతా సంతోషం
యుగ యుగాల యుగాది..
మదిలో మొలిచే కొత్త ఆశలకు పునాది..
మంచిని పెంచే ఆలోచనలకు శుభాది..
మానవ జీవన వసంత గీతిక ఉగాది..
ఉగాది అంటే ప్రకృతి పాడే వసంత గీతం.
శీతగాలులతో ఇక్కలాక్కునిపోయి.. జీవనసారం ఇగిరిపోయి..
పచ్చనాకులు ఎండుటాకులుగా మారి రాలిపోయి..
చెట్టు బోసిపోయినపుడు ఆ కొమ్మ సందుల్లోంచి లేలేత చివుళ్లు చిందులేస్తూ కనిపించాయా?
అదే వసంతాగమన సూచిక. అదే ప్రకృతి పరవశం.
ఉగాది సంరంభానికి అదే స్వాగత సన్నాహం.
ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా.. ప్రతిఘటించి ముందుకు సాగాలన్నదే ప్రకృతి మనకు నేర్పే అతిపెద్ద పాఠం.
ఎదురుగాలులెన్ని వీచినా.. మోడుగా మారిపోయినా.. మళ్లీ మళ్లీ మొలకెత్తి తలెత్తుకోవాలనేదే ఉగాది పర్వం మనకిచ్చే సందేశం.
మావిచిగురు.. గండుకోయిల పాట.. వేప పూత.. ప్రకృతి వసంతానికి స్వాగతం పలికే వేళ నేలంతా పచ్చదనంతో ఒక కొత్త కళను సంతరించుకుంటుంది.
ఆ వాతావరణం, ఆ సస్యశ్యామలత మనసును కొంగొత్త ఆశలతో , మంచి బుద్ధులతో నింపుతుంది.
అలా శుభ తరుణాలకు నాంది పలికే అచ్చ తెలుగు పండుగే ఉగాది.
దీనినే తెలుగు సంవత్సరాది అనీ అంటారు.
ప్రతి ఏటా చైత్ర మాసంలో వచ్చే ఈ పర్వాన్ని.. ఆ సంవత్సరాన్ని ఒక పేరుతో పిలవడం రివాజు.
ఈ ఏడాది తెలుగు సంవత్సరం పేరు ‘విశ్వావసు’ నామ సంవత్సరం.
చైత్ర మాసపు తొలి రోజునే సృష్టి ప్రారంభమైందని అంటారు. కాబట్టి ఏటా ఆ రోజున ఉగాది జరుపుకోవడం ఆచారంగా మారింది.
ఈ సృష్టిలో ప్రకృతిని మించిన పరమగురువు లేదంటారు.
ప్రకృతితో ఎలా మమేకమై జీవించాలో తెలియచెప్పే పర్వం ఉగాది.
మనిషికి, ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ పర్వం చాటుతుంది. అందుకే ప్రకృతిలో లభించే ఆరు ప్రధాన రుచులను ప్రతి ఒక్కరు ఈ పర్వపు వేళ రుచి చూస్తారు.
ఈ ఆరు రుచుల సమ్మేళనంలో అద్భుతమైన అర్థముంది.
అర్థం చేసుకుని ఆచరిస్తే అనంతమైన పరమార్థం ఉంది.
జీవితంలో అన్నీ సుఖాలే ఉండవు. అలాగని అన్నీ దు:ఖాలే కలగవు.
సుఖదు:ఖాలు, కలిమిలేములు, కష్టనష్టాల కలబోతే జీవితం.
అందమైన అనుభవాలూ ఉంటాయి.
విషాదకరమైన జ్ఞాపకాలూ ఉంటాయి.
అన్నిటినీ సమాదరించుకుంటూ.. అంతటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే జీవితానికి అర్థం.. పరమార్థం.
తెలుగుపత్రిక పాఠకులకు, అభిమానులకు
విశ్వావసు నామ సంవత్సర
శుభాకాంక్షలు
- డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
శివ వైభవం
శివుడి గురించి ఇప్పటి వరకు అవీ ఇవీ విన్నవే కానీ.. ఆయనకు దశావతారాలు ఉన్నాయని, ఆయన నర్తించిన క్షేత్రాలు ఐదు ఉన్నాయని ఇదే తెలుసుకోవడం. తెలుగు పత్రిక 2025, ఫిబ్రవరి సంచికలో మహా శివరాత్రి సందర్భంగా శివ వైభవాన్ని భలే వివరించారు. అలాగే శ్రీశైలం క్షేత్రం గురించి తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోగలిగాం.
- సీహెచ్.శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, రచన, కమలేశ్, డి.వీ.కృష్ణ, రవివర్మ, కే.ఆర్.సత్యప్రసాద్, కె.రఘురామ్, మరికొందరు ఆన్లైన్ పాఠకులు
మహమ్మారిపై..
వ్యాధి కంటే అవగాహన రాహిత్యం మనిషిని మరింత ముందుగానే చంపేస్తుందంటూ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యభాగ్యం శీర్షికన అందించిన అవగాహన కథనం చాలా బాగుంది. ఏ వ్యాధి అయినా ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో తెలుసుకుంటే దాని బారినపడకుండా ఉండగలమని బాగా వివరించారు.
- కె.వేణుగోపాల్, హైదరాబాద్
క్లుప్తంగానైనా..
తెలుగు పత్రికలో ఫిబ్రవరి సంచిక సంపాదకీయంలో శివరాత్రి, భీష్మ ఏకాదశి, శ్రీపంచమి, రథ సప్తమి పర్వాలను వర్ణిస్తూ అందించిన వివరాలు క్లుప్తంగా ఉన్నా.. చదివించాయి.
- ఆర్.సీ.రవిచందర్, తిరుపతి

ఉగాది..సకల శుభాది
ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో మూడో మాసం- మార్చి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం. పన్నెండవది. అంటే తెలుగు సంవత్సరాల్లో చివరిది. కేవలం రెండు రోజులు మాత్రమే ఛైత్ర మాస తిథులు ఈ మాసంలో ఉన్నాయి. అందులో మొదటి తిథే చైత్ర శుద్ధ పాడ్యమి. ఆనాడే ఉగాది. మార్చి 1, శనివారం, ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి మార్చి 29, ఫాల్గుణ బహుళ అమావాస్య, శనివారం వరకు ఫాల్గుణ మాస తిథులు, మార్చి 30, చైత్ర శుద్ధ పాడ్యమి, సోమవారం నుంచి చైత్ర మాస తిథులు. చైత్ర మాస తిథులు కేవలం రెండు మాత్రమే ఈ నెలలో ఉంటాయి. హోలీ, ఆమలిక ఏకాదశి, ఉగాది, వంటివి మార్చిలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.
2025- మార్చి 1, శనివారం, ఫాల్గుణ శుద్ధ విదియ నుంచి
2025- మార్చి 31, సోమవారం, చైత్ర శుద్ధ విదియ వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-ఫాల్గుణం/చైత్రం- శిశిరం/వసంతం- ఉత్తరాయణం
ఉత్తర ఫల్గుని నక్షత్రంతో కూడిన పున్నమి కలది ఫాల్గుణం. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని నింపే ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఫాల్గుణ మాస తిథులు ముగియడంతోనే శిశిర రుతువుకు తెరపడుతుంది. నువ్వులు, ఉసిరిక, చూత కుసుమం (మామిడిపూత) విరివిగా వాడటానికి కొన్ని నెలలు ప్రత్యేకమైనవి. అందులో ఫాల్గుణం ఒకటి. ఫాల్గుణ మాసం శిశిర రుతువు కాలం. చెట్లన్నీ ఆకులు రాలుస్తాయి. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది (పన్నెండవది). మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. ఫాల్గుణ మాసంలో చేసే గోదానం, ధన దానం, వస్త్ర దానం శ్రీమహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తాయని అంటారు. తెలుగు సంవత్సరాల వరుసలో చివరిదైన ఫాల్గుణ మాసంలో.. అంతకుముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు చివరిదైన ఈ మాసంలో మళ్లీ కనిపిస్తాయనేది పండితుల ఉవాచ. అందుకే ఫాల్గుణం సర్వదేవతా వ్రత సమాహారంగా, సర్వ వ్రత సింహావలోకనంగా ఉంటుందని చెబుతారు. ఈ కారణంగానే ఫాల్గుణంలో చేసే దైవ కార్యక్రమాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని అంటారు. ఇక దశావతారాల్లో అతి ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశి ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ఉసిరికాయతో ముడిపడి ఉన్న ఓ తిథి కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ మాసం తరువాత నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభ దినమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంతకాలం ఆరంభమవుతుంది. వసంత రుతువుకు స్వాగతం పలికేది, తెలుగు సంవత్సరాలలో తొలిది చైత్ర మాసమే. చైత్ర శుద్ధ పాడ్యమితో మొదలయ్యే వసంత నవరాత్రులు చైత్ర శుద్ధ నవమితో ముగుస్తాయి. ప్రకృతి కొత్త చిగుళ్లు తొడుగుతూ వాతావరణం మహా ఆహ్లాదభరితంగా ఉంటుందీ మాసంలో. జీవితాల్లో శుభాలను కలిగించేది.. జీవితాలకు శోభను చేకూర్చేది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. ఇది మనకు కొత్త తెలుగు సంవత్సరాది. ఉగాది. ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాల గురించి తెలుసుకుందాం.
ఫాల్గుణ శుద్ధ విదియ
మార్చి 1, శనివారం
ఫాల్గుణ శుద్ధ విదియ తిథి రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిన గురువు- రామకృష్ణ పరమహంస. ఈయన పుట్టినప్పటి పేరు గదాధర్ చటోపాధ్యాయ. పశ్చిమబెంగాల్ సాంస్క•తిక పునరుజ్జీవనంలో ఈయన పాత్ర, ప్రభావం చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద ఈయన శిష్యులలో ప్రథముడు. సృష్టిని ఏకత్వంతో చూడాలని, అన్ని జీవుల్లోనూ దైవత్వాన్ని దర్శించాలని, అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కామం, స్వార్థం, కామకాంచనాల నుంచి విడివడితేనే భగవంతుడిని దర్శించుకోగలమని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో దారులున్నట్టే.. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయని.. రామకృష్ణ పరమహంస బోధించారు.
ఫాల్గుణ శుద్ధ తదియ
మార్చి 2, ఆదివారం
ఫాల్గుణ శుద్ధ తదియ నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.
ఫాల్గుణ శుద్ధ చవితి
మార్చి 3, సోమవారం
ఫాల్గుణ శుద్ధ చవితి నాడు పుత్ర గణపతి వ్రతాన్ని ఆచరిస్తారు. పుత్ర సంతానం కోసం గణపతిని పూజిస్తూ ఆచరించే వ్రతమిది. ఈ వ్రతం కూడా దాదాపుగా వినాయక చవితి వ్రత విధానంలోనే ఉంటుంది. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి, గణపతిని షోడశోపచారాలతో పూజించాలి. ఆయనకు ప్రీతికరమైన పండ్లను, పిండివంటలను నైవేద్యంగా పెట్టాలి. ఉదయంతో పాటు సాయంత్రం గణపతిని పూజించిన అనంతరం దీక్షను విరమించాలి. పూర్వం మహారాజులు, చక్రవర్తులు వారసత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. అందుకే ఎక్కువగా పుత్ర సంతానాన్ని కోరుకునే వారు. తమ తరువాత రాజ్యభారాన్ని కుమారులే స్వీకరించాలని భావించే వారు. ఇక, పున్నామ నరకం నుంచి తప్పించే వాడు కూడా కుమారుడే అని శాస్త్ర వచనం. ఈ కారణంగా పుత్ర సంతానాన్ని కోరుకునే వారు ఫాల్గుణ శుద్ధ చవితి నాడే ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వారు. ఈ రోజున ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో గణపతిని పూజిస్తారో వారి కోరిక తప్పక నెరవేరుతుందని సాక్షాత్తూ పరమశివుడు పార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో ఉంది.
ఈనాటి ఉదయమే దంపతులు తలస్నానం చేసి, శుభ్రమైన పట్టువస్త్రాలు ధరించాలి. పూజా మందిరంలో కలశ స్థానపన చేసి శక్తి గణపతి ప్రతిమను అలంకరించాలి. పుత్ర గణపతి వ్రత కథను చదువుతూ దంపతులు అక్షితలను తలపై వేసుకోవాలి. గణపతికి ఇష్టమైన వంటకాలను, ఫలాలు, పత్రిని నైవేద్యంగా సమర్పించాలి.
ఫాల్గుణ శుద్ధ చతుర్థి ఇంకా పలు విధాలుగా ప్రశస్తమై ఉంది. ఇది మంగళకరమైన తిథి. ఈనాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డుంఢి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు చేసే నువ్వుల దానం కారణంగానే ఈ చతుర్థికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది.
ఫాల్గుణ శుద్ధ పంచమి
మార్చి 4, మంగళవారం
పంచమి తిథి సాధారణంగా అనంత పంచమీ వ్రతాచరణకు అనువైనదని అంటారు. కాబట్టి ఈనాడు అనంత పంచమీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఫాల్గుణ శుద్ధ పంచమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈనాడు శ్రీకంఠ జయంతి దినమని అంటారు. అయితే, ఇది ఏ దేవీ దేవతకు సంబంధించిన పర్వమో వివరాలు లేవు. అలాగే, ఈనాటి నుంచి పూర్వాభాద్ర కార్తె ప్రారంభం అవుతుంది.
ఫాల్గుణ శుద్ధ షష్ఠి
మార్చి 5, బుధవారం
ఫాల్గుణ శుద్ధ షష్ఠి తిథి.. స్కంద షష్ఠి పర్వం. కుమారస్వామిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. ఫాల్గుణ శుద్ధ షష్ఠి నాడు అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఆచరించాలి.
ఫాల్గుణ శుద్ధ సప్తమి
మార్చి 6, గురువారం
ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు సూర్య భగవానుడిని ఆరాధించాలి. సప్తమి తిథి సూర్యారాధన సంబంధమైనది. చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం.. అర్క సంపుట సప్తమీ, కామదా సప్తమీ, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమీ తదితర వ్రతాలను ఈనాడు ఆచరించాలి. ఇవన్నీ సూర్యుడికి సంబంధించిన పర్వాలే.
ఫాల్గుణ శుద్ధ అష్టమి
మార్చి 7, శుక్రవారం
ఫాల్గుణ శుద్ధ అష్టమి.. మాసిక దుర్గాష్టమి తిథి. మాసానికి రెండుసార్లు (శుద్ధ/బహుళ) వచ్చే అష్టమిలు దేవీ ఆరాధనకు ఉద్ధిష్టమైనవి. ఇక, ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు దుర్గాష్టమి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు.
ఫాల్గుణ శుద్ధ నవమి
మార్చి 8, శనివారం
ఫాల్గుణ శుద్ధ అష్టమి మాదిరిగానే నవమి తిథి కూడా దుర్గా సంబంధమైనదే. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అలాగే, ఈనాడు దుర్గాపూజ చేయాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
అలాగే, మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విజయం సాధించిన, ఆదర్శంగా, స్ఫూర్తిమంతంగా నిలుస్తున్న నారీమణుల విజయానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తున్నారు. అలాగే, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం.
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
మార్చి 10, సోమవారం
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనేక విధాలుగా ప్రసిద్ధమై ఉంది. వీటిలో మొదట చెప్పుకోవాల్సింది ‘అమలిక ఏకాదశి’ గురించి.
అమలికం అంటే ఉసిరికాయ. అంటే ఇది ఉసిరికాయతో ముడిపడిన ఏకాదశి. అందుకే దీనిని అమలైక్యాదశిగా వినుతికెక్కింది. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు. అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు వివిధ నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే అమలకిలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించి ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక. ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత నియమాల్లో దానికో స్థానాన్ని కలిగించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మన వంటకాల్లో ఏదో విధంగా ఉసిరి వాడాలనేది ఈ పర్వం ఉద్దేశం. బహుశా ఉసురు (ప్రాణం) నిలిపేది కాబట్టి తెలుగులో ఇది ఉసురుకాయ.. కాల క్రమంలో ఉసిరి కాయ అనే పేరు స్థిరపడి ఉంటుంది. అరవం, కన్నడం, మలయాళంలో దీనిని నెల్లికాయ అని పిలుస్తారు. సంస్క•తంలో ఉసిరికాయకు ఐదారు పేర్లు వరకు ఉన్నాయి. ఆమలకం (గుణమును ధరించునది), ధాత్రి (దాది వంటిది), వయస్థ (వయస్సున నిలుపునది), ఫలరవ (సారవంతమైనది), అమృత (అమృతము వంటిది), శీతఫలి ( శీతవీర్యము కలది) అనే అర్థాలు కలిగిన పేర్లు ఉసిరికాయకు ఉన్నాయి.
అలాగే, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మరో విధంగా కూడా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని పురాణగాథ. దీనినే ఆంధప్రదేశ్లోని గోదావరి జిల్లాల వారు ‘కోరుకొండ ఏకాదశి’ అనీ అంటారు. కోరుకొండలో నరసింహస్వామి కోవెలలో ఈనాడు గొప్ప తిరునాళ్లు జరుగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉండిన మామిడికాయలు ఇప్పటికి కోడిగుడ్డు పరిమాణానికి ఎదుగుతాయి. ఇది చెప్పడానికే పై సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు.
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
మార్చి 11, మంగళవారం
ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రతీతి. ఈ ద్వాదశి తిథి పుష్యమితో కూడి వస్తే ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైన పర్వమే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజలు కూడా చేసే ఆచారం ఉంది.
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
మార్చి 12, బుధవారం
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
మార్చి 13, గురువారం
ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు కూడా హోలికా దహన్ నిర్వహిస్తారు. దీనిని ‘చోటీ హోళీ’గా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి
మార్చి 14, శుక్రవారం
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు. దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని హోలీ పూర్ణిమ వృత్తాంతం (దీనికి సంబంధించిన కథ కోసం ఆధ్యాత్మి‘కథ’ శీర్షిక చూడవచ్చు) తెలియ చెబుతుంది.
ఇంకా ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ పలు విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.
భగవద్గీత, కృష్ణతత్వాన్ని విస్త•తంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు వారి జయంతి తిథి కూడా ఈనాడే.
ఫాల్గుణ బహుళ పాడ్యమి
మార్చి 15, శనివారం
ఫాల్గుణ బహుళ పాడ్యమినే హోలీ పర్వదినంగానూ భావిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ తరువాత దినమే కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్లీల ఆరంభమవుతుంది.
హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు తెరగుల రంగులతో పువ్వులు పొటమరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు.
ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంభోత్సవ సమయం. అయితే, మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం.. పౌర్ణమి నాడే హోలీ పర్వమని పేర్కొన్నారు.
ఫాల్గుణ బహుళ విదియ
మార్చి 16, ఆదివారం
ఫాల్గుణ బహుళ విదియ కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చే తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.
ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.
అలాగే, ఈనాడు ఆంధప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం ఈయన జీవితాంతం పాటుబడ్డారు. ఈయన 1901, మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరి జిల్లాలోని పడమటిపాలెం. 25 ఏళ్ల వయసులో భార్యను, బిడ్డను కోల్పోయిన ఈయన వైరాగ్యంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనంతరం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952, అక్టోబర్ 19న బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952, డిసెంబర్ 15న దీక్షలోనే పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. తదనంతర పరిణామాలతో అదే ఏడాది డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.
ఫాల్గుణ బహుళ తదియ
మార్చి 17, సోమవారం
ఫాల్గుణ బహుళ తదియ తిథిని కల్పాది దినంగా ఆయా వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఈనాటి నుంచి ఉత్తరాభాద్ర కార్తె ప్రారంభం అవుతుంది.
ఫాల్గుణ బహుళ చతుర్థి
మార్చి 18, మంగళవారం
ఫాల్గుణ బహుళ చతుర్థి వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి. దీనినే సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు. చతుర్థి తిథి ఘడియల్లోనే పంచమి తిథి కూడా ప్రవేశిస్తోంది. ఈ కారణంగా ఇదేరోజు రంగ పంచమి వ్రతాలను ఆచరించాలి.
ఫాల్గుణ బహుళ పంచమి
మార్చి 19, బుధవారం
ఫాల్గుణ బహుళ పంచమి తిథిని రంగ పంచమి అని కూడా అంటారు. అయితే, ఈనాడు ఈ పంచమి నాడు ఆచరించాల్సిన విధాయకృత్యాలేమిటో పంచాంగాలలో వివరణ లేదు. అలాగే ఈనాటి నుంచి శుక్ర మౌడ్యమి దినాలు ఆరంభం అవుతాయి.
ఫాల్గుణ బహుళ షష్ఠి
మార్చి 20, గురువారం
ఫాల్గుణ బహుళ షష్ఠి దేవసేనకు అధిపతి అయిన కుమారస్వామిని పూజించడానికి అనువైన తిథి. ప్రత్యేకించి తమిళనాట షష్ఠి నాడు ఈయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుమారస్వామి.. వివిధ ప్రాంతాల్లో స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధమై ఉన్నాడు.
ఫాల్గుణ బహుళ సప్తమి
మార్చి 21, శుక్రవారం
ఫాల్గుణ బహుళ సప్తమి తిథి శీతల సప్తమి దినం. ఈనాడు శీతలా మాత అనుగ్రహం కోసం ఆమెను విశేషంగా పూజిస్తారు. శీతలా దేవిని పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశపు పండుగ. మశూచి, స్ఫోటకం తదితర పిల్లలకు సోకే వ్యాధుల నుంచి రక్షించే దేవతగా ఈమెను పరిగణిస్తారు. అలాగే మంచి భర్తను పొందడానికి, ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందడానికి ఆమెను పూజిస్తారు. భక్తుల జీవనోపాధి వనరులను కాపాడే దేవతగానూ ఈమెను పూజిస్తారు. కరువు, వర్షాభావం, పశువుల వ్యాధుల నివారణకు కూడా ఈ దేవతను ప్రార్థిస్తారు. ఈమె ఒక చేతిలో చీపురును, మరో చేతిలో నీటికుండను ధరించి దర్శనమిస్తుంది. ఆ నీటి కుండలో ఔషధాలు ఉంటాయని అంటారు. స్కాంద పురాణంలోని కాశీఖండ విభాగంలో శీతల దేవి మశూచి, స్ఫోటకపు మచ్చలను పోగొట్టే దేవతగా వివరిస్తూ, ఆ వ్యాధులను నయం చేసే విధానాల గురించి వివరణ ఉంటుంది. ఈమె వేపచెట్టుపై నివాసం ఉంటుందని అంటారు. ఉత్తర భారతదేశంలో ఈ దేవత ఆలయాలు చాలా ఉన్నాయి.
ఫాల్గుణ బహుళ అష్టమి
మార్చి 22, శనివారం
ఫాల్గుణ బహుళ అష్టమి తిథి.. సీతాదేవి పుట్టిన రోజు. ఈమె జనక మహారాజు కుమార్తె. రాముడి భార్య. ఈమె పూర్వం వేదవతి అనే కన్యక. కుశధ్వజుడు, మాలావతి అనే ముని దంపతులకు జన్మించింది. పుట్టిన వెంటనే పురిటింటి నుంచి వేదఘోష వెలువడటంతో వేదవతి అనే పేరు పెట్టారు. ఒక సందర్భంలో తల్లిదండ్రులను పోగొట్టుకున్న వేదవతి తపోదీక్షలోకి వెళ్లిపోయింది. విష్ణును తప్ప వేరెవరినీ పెళ్లాడనని ప్రతినబూనింది. తపోదీక్షలో ఉన్న ఆమెను రావణుడు తాకుతాడు. దీంతో ఆగ్రహోదగ్రురాలైన ఆమె అయోజనిగా ఈ భూమిపై తాను తిరిగి పుట్టి నిన్ను పుత్రమిత్ర కళత్రంగా సర్వనాశనం చేస్తానని శపిస్తుంది. అన్నట్టే యోగాన్ని సృష్టించుకుని ఆహుతైపోతుంది. పిమ్మట భూమిలో జనకుడికి పసిబిడ్డగా దొరకగా, సీతగా నామకరణం చేసి పెంచుకుంటాడు. రాముడిని పెళ్లాడి.. తదనంతరం చోటుచేసుకున్న పరిణామాల రీత్యా రావణ సంహారానికి కారకురాలవుతుంది. ఇంకా ఈనాడు కాలాష్టమి, శీతలాష్టమి అనే పర్వాలు కూడా జరుపుకుంటారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. అయితే కొన్ని తెలుగు క్యాలెండర్లలో సీతా జయంతి మే 5, 2025గా సూచిస్తున్నారు. ఫాల్గుణ బహుళ అష్టమి తిథి నాడే నూతన శక సంవత్సరారంభమని కూడా అంటారు.
ఫాల్గుణ బహుళ నవమి
మార్చి 23, ఆదివారం
ఫాల్గుణ బహుళ నవమి నాడు ప్రత్యేకించి ఆచరించదగిన పూజలు, వ్రతాలు ఏమీ లేదు. కానీ, సాధారణంగా నవమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమై ఉంది. ఈనాడు దుర్గాపూజలు చేస్తారు.
ఫాల్గుణ బహుళ దశమి
మార్చి 24, సోమవారం
ఫాల్గుణ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజావిధులేమీ లేవు. దశమి తిథిని కూడా దుర్గాదేవి ఆరాధనలు విశేషంగా జరుపుతారు.
ఫాల్గుణ బహుళ ఏకాదశి
మార్చి 25, మంగళవారం
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాప విమోచన ఏకాదశిగా ప్రసిద్ధి. ఇంకా స్మార్త ఏకాదశి అనీ అంటారు. నీలమత పురాణంలో తెలిపిన ప్రకారం ఈనాడు కాశ్మీర్లో ఛందో దేవపూజ చేస్తారు. అలాగే, ఈనాడు కృష్ణైకాదశి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ ఏకాదశినే కామద ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. తెలుగు సంవత్సరంలో ఇది చివరి ఏకాదశి. ఈ ఏకాదశి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది.
పూర్వం కుబేరుని పుష్ప వాటికలో అప్సరసలు విహరిస్తుండే వారు. ఎంతో అందమైన ఆ ఉద్యానవనంలో దేవతలతో పాటు మునీశ్వరులు తపస్సు చేసుకుంటుండే వారు. ఆ పుష్ప వనానికి ఒకనాడు ఇంద్రుడు తన పరివారంతో వస్తాడు. ఆ వనంలో మేధావి అనే పేరు గల మునీశ్వరుడు ఉన్నాడు. ఇంద్రుని పరివారంలో ఉన్న మంజుఘోష అనే అప్సరస.. మేధావి ముని తపస్సుకు భంగం కలిగించాలని ఎత్తులు వేస్తుండేది. ఈ క్రమంలో ఒకనాడు ఆమె పట్ల మోహావేశుడైన ముని.. తన తపస్సును వదిలి ఆమెతో గడుపుతుంటాడు. కొన్నాళ్లకు తన లోకానికి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని ఆ మునిని మంజుఘోష అడుగుతుంది. అయితే మేధావి ముని ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తాడు. అలా యాభై ఏడు సంవత్సరాల తొమ్మిది నెలల మూడు రోజులు గడిచిపోయాయి. చివరకు ఆమె తనతో గడిపిన కాలాన్ని లెక్క వేసుకోవాలని మునికి చెబుతుంది. ఆమెతో గడిపిన రోజుల్ని లెక్కబెట్టుకున్న మేధావి ముని.. అన్ని రోజులు వ్యర్థమైపోయినందుకు చింతిస్తాడు. ఆ కోపావేశంలో మంజుఘోషను దారుణంగా శపిస్తాడు. తనకు శాపవిమోచనం ఇవ్వాలని ఆమె అభ్యర్థిస్తుంది. శాంతించిన ముని.. ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు పాప విమోచన వ్రతాన్ని ఆచరించాలని తరుణోపాయం చెబుతాడు. ఆయన సలహాను అనుసరించి మంజుఘోష ఈ ఏకాదశి నాడు పాప విమోచన వ్రతాన్ని ఆచరిస్తుంది. ఫలితంగా ఆమె శాప విమోచనాన్ని పొందుతుంది. ఆమెకు శాప విముక్తి కలిగించిన ఏకాదశి కాబట్టి ఇది శాప విమోచన ఏకాదశి అయ్యింది.
ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి, ఆ రోజు ఉపవాసం ఉండి, ఏదైనా ఆలయాన్ని దర్శించుకోవాలి. విష్ణు సహస్ర నామాన్ని పారాయణం చేయాలి.
ఫాల్గుణ బహుళ ద్వాదశి
మార్చి 26, బుధవారం
ఫాల్గుణ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం ఆచరించాలి. నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు ఫాల్గుణ శ్రవణ ద్వాదశి వ్రతం ఆచరించాలని ఉంది. ఈశ్వర సంబంధమైన యోగేశ్వర భగవానుడిని పూజించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
ఫాల్గుణ బహుళ చతుర్దశి
మార్చి 28, శుక్రవారం
ఫాల్గుణ బహుళ చతుర్దశినే పిశాచ చతుర్దశి అని కూడా అంటారు. ఈ తిథి నాడు శివపూజ చేసి పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని నీలమత పురాణంలో ఉంది.
ఫాల్గుణ బహుళ అమావాస్య
మార్చి 29, శనివారం
ఫాల్గుణ బహుళ అమావాస్య నాడు ఈనాడు గోదావరి తీరవాసులు ఏరువాక సాగుతారు. అమావాస్యను సాధారణంగా అశుభంగా భావిస్తారు. కానీ, శుభాశుభాలతో నిమిత్తం లేకుండా ఈనాడు ఆంధప్రదేశ్లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారు ఈ పర్వాన్ని వైభవంగా జరుపుకొంటారు. ఈ పర్వాన్ని దొంగ ఏరువాకగా కూడా పేర్కొంటారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని గ్రామ గ్రామాన ఈనాడు దేవతల ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి. అలాగే, ఈ తిథి నాడు మీన సంక్రమణం కనుక అయితే, అందుకు సంకేతంగా ఈనాడు మత్స్యవాసులదేవులను పూజించాలని హేమాద్రి అనే పండితుడి అభిప్రాయం.
చైత్ర శుద్ధ పాడ్యమి/ఉగాది
మార్చి 30, ఆదివారం
చైత్ర శుద్ధ పాడ్యమి చైత్ర మాస ఆరంభ దినం. అంతేకాదు తెలుగు సంవత్సరాది ఆరంభ దినం కూడా. ఈనాటి నుంచే తెలుగు కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచి చైత్ర మాస తిథులు ప్రారంభమవుతాయి. దీనినే వసంత మాసమని కూడా అంటారు. ఈ మాసపు తొలి తిథే ఉగాది. దీనినే సంవత్సరాది అనీ అంటారు. వరాహమిహిరాచార్యుడు వసంత విషువత్తు కొన్ని శతాబ్దాలాకు ముందే అశ్వినీ నక్షత్రాదికి చలించడాన్ని గుర్తించాడు. వేదాంగ జ్యోతిష కాలం కంటే ప్రాచీనమైన బ్రాహ్మణముల కాలంలో వసంత విషువత్కాలమూ కృత్తికా నక్షత్రంలో సంభవించడాన్ని పరిశీలించాడు. వసంత విషువత్తు తన కాలంలో అశ్విన్యాదిలో సంభవించడాన్ని గ్రహించి అది ప్రాచీనమైన దేవమాన దిన ప్రారంభమైన ఉత్తరాయణ పుణ్యకాలమనీ, సంప్రదాయానుసారంగా అదే వసంత కాలమనీ, వసంత విషువత్కాలమే ఉగాది అని నిర్ణయించి మాసరుతు సమతుల్యం సాధించాడు. వరాహమిహిరాచార్యుని నిర్ణయానుసారమే మనం చైత్ర మాసం పాడ్యమి తిథినే సంవత్సరారంభ దినంగా భావించి ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. కానీ, ధర్మసింధు, నిర్ణయ సింధుకారులు అన్నట్టు శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్నే నెలగా పరిగణిస్తున్నాం. కనుక చైత్ర శుద్ధ పాడ్యమినే ఉగాదిగా పాటించే ఆచారం ఏర్పడింది. అలా ఉగాదికి బీజం పడింది.
ఉగాది అనే సంస్క•త పదానికి యుగానికి ఆది లేక ప్రారంభం అని అర్థం. యుగమునకు వికృత రూపమే ఉగము. ఈ ఉగము నుంచి పుట్టినదే ఉగాది. ప్రాచీన కాలంలో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి, ఆ తరువాత చైత్ర శుద్ధ పాడ్యమి.. ఈ మూడింటినీ ఉగాదిగా జరుపుకునే వారని పురాతన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. తెలుగు వారిది, కన్నడిగులది చాంద్రమానం. కేరళ, తమిళనాడు ప్రాంతాల వారిది సౌరమానం. మనం జరుపుకునే పండుగలు, చేసే శుభకార్యాలు, చెప్పుకునే సంకల్పాలన్నీ చాంద్రమానం ప్రకారం ఏర్పడినవే. మనకు జ్యోతిష శాస్త్రరీత్యా శుభాశుభ ఫలితాలను తెలిపే పండుగ ఉడాది. దీనినే సంవత్సరాది అని కూడా అంటారు. ఉగాది నుంచి తెలుగు వారికి కొత్త పంచాంగం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన ఉదయమే ఇల్లు అలికి, ముగ్గు పెట్టి, అటకలతో సహా అన్ని గదులలోనూ బూజు దులిపి, ఊడ్చి, శుభ్రంగా కడుక్కుని, మామిడి ఆకులతో లేదంటే వివిధ రకాల పుష్పాలతో తోరణాలు కట్టాలి. గడపలకు పసుపు, కుంకుమలు అలంకరించాలి. ఇంటిలో మనం పూజించే ఇష్ట దేవతల విగ్రహాలను షోడశోపచారాలతో పూజించి, శుచిగా చేసిన పిండివంటలనూ, ఉగాది పచ్చడినీ నివేదించాలి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినదీ, ప్రజానురంజకంగా పాలించిన శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినదీ, వెయ్యేళ్ల పాటు రాజ్యపాలన చేసిన విక్రమార్క చక్రవర్తి రాజ్యాన్ని చేపట్టినదీ, శకకారుడైన శాలివాహనుడు కిరీటధారణ చేసినదీ, కౌరవ సంహారం అనంతరం ధర్మరాజు హస్తిన పీఠాన్ని అధిరోహించినదీ ఉగాది నాడేనని చారిత్రక పౌరాణిక గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి కొత్త కార్యాలను ప్రారంభించడానికి ఉగాదిని మించిన శుభ తరుణం మరొకటి లేనే లేదు. మంచి పనులకు, సంకల్పాలకు ఈనాడే శ్రీకారం చుట్టాలి.
ఉగాది పర్వం ఆచరణ ఆర్యుల కాలం నుంచీ ఉందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. శాలివాహనుడి శక స్థాపన దినము చైత్ర శుద్ధ పాడ్యమే. ఇక, శాస్త్రాలను తిరగేస్తే ఈనాడే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించాడని అంటారు. ఉగాది నాడు ప్రధానంగా ఆచరించాల్సిన పది విధాయ కృత్యాలను మన శాస్త్రకారులు విస్పష్టంగా పేర్కొన్నారు. అవి-
1) ప్రతిగృహ ధ్వజారోహణం: అంటే ప్రతి ఇంటా ధ్వజారోహణ చేయడం. అంటే, ఇంటి గుమ్మం ఎదుట విజయచిహ్నంగా ధ్వజాన్ని ప్రతిష్ఠించడం.
2) తైలాభ్యంగం: నువ్వుల నూనెతో తల స్నానం చేయాలి.
3) నవ వస్త్రభరణధారణం- ఛత్రచామరాది స్వీకారం: శుచిగా స్నానం చేసిన అనంతరం కొత్త బట్టలు, కొత్త నగలు ధరించడం, కొత్త గొడుగు, కొత్త విసనకర్ర స్వీకరించడం మూడవ విధి కిందకు వస్తుంది.
4) దమనేన బ్రహ్మ పూజనము: బ్రహ్మదేవుడిని దమనములతో పూజించడం నాల్గవ విధి.
5) సర్వాకచ్ఛాంతకర మహాశాంతి - పౌరుషప్రతిపద్వ్రతము: విఘ్నేశ్వరుడిని, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజిస్తూ శాంతిపూజ చేయడం ఐదవ కృత్యం.
6) నింబకుసుమ భక్షణం: వేపపువ్వును లేదా వేపపువ్వుతో చేసిన పచ్చడిని స్వీకరించడం.
7) పంచాంగ పూజ - పంచాంగ శ్రవణం: పంచాంగ శ్రవణం, ఆ ఏడాది కలిగే శుభాశుభ ఫలితాల గురించి తెలుసుకోవడం ఏడవ విధి.
8) ప్రపాదాన ప్రారంభం: చలివేంద్రాలు ఏర్పాటు చేసి జనుల దాహార్తి తీర్చడం ఎనిమిదవ కృత్యం.
9) రాజదర్శనం: మన శ్రేయస్సుకు కారకులైన వారిని, పెద్దలను దర్శించుకోవడం తొమ్మిదవ విధి.
10) వాసంత నవరాత్రి ప్రారంభం: పై తొమ్మిది కృత్యాలు చేయగా వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్టు.
ఉగాది నాడు ఈ పది విధాయ కృత్యాలను విధిగా ఆచరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉగాది పర్వం నాడు ఆనందోత్సాహాలతో గడపాలనే వారంతా ఈ పది విధాయ కృత్యాలను విధిగా పాటించాలని శాస్త్ర నియమం.
చైత్ర శుద్ధ విదియ
మార్చి 31, సోమవారం
చైత్ర శుద్ధ విదియ నాడు ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలను దమనములతో పూజించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. బ్రహ్మ పురాణంలో ఈ మేరకు వీరికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పార్వతి తన భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అగ్ని అక్కడకు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా జరిగాడు. అప్పుడు శివుడికి వీర్యపతనం అయ్యింది. క్రీడా భంగానికి ఆగ్రహించిన పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాలని ఆజ్ఞాపించింది. అగ్ని ఆ వీర్యాన్ని భరించి కుమారస్వామి జననానికి కారణభూతుడయ్యాడు. ఇక, స్కంధ పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఆ వ్రతం చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు తృతీయ వరకు చేయాలని అంటారు. ఇది స్త్రీల సుమంగళత్వాన్ని కాపాడ్డానికి ఉద్దేశించిన వ్రతం. అయితే, ప్రస్తుతం ఎక్కడా అరుంధతీ వ్రతం ఆచరిస్తున్న దాఖలాలు లేవు. అయితే, వివాహ సందర్బాలలో అరుంధతీ దర్శనం చేయించే ఆచారం మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి నాటి రాత్రి ఔపోసనానంతరం నక్షత్ర రూపంలో ఉండే అరుంధతిని ప్రాతివత్య నిష్టకు ప్రతీకగా పెళ్లి కుమార్తెకు చూపిస్తారు. అరుంధతి అంటే- ఏ కారణం చేత కానీ ధర్మాన్ని అతిక్రమించనిది అని అర్థం.
అర్జునుడు పుట్టిన మాసం
ఫాల్గుణ మాసం విష్ణు భగవానుడికి ప్రీతికరమైన మాసం. భాగవతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.
• ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు (12) రోజుల పాటు పయో వ్రతం ఆచరించి, శ్రీమహా విష్ణువుకు క్షీరాన్నం (పరమాన్నం) నివేదిస్తే అభీష్టసిద్ధి కలుగుతుందని అంటారు.
• దితి, అదితిలలో అదితి ఫాల్గుణ మాసంలో పయో వ్రతం ఆరచించే వామనుడిని పుత్రుడిగా పొందినట్టు పురాణాలు చెబుతున్నాయి.
• శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన ఈ మాసంలో గోదానం, వస్త్రదానం, పేదలకు అన్నదానం లాంటివి చేయడం మంచిది. దీనివల్ల గోవిందుడికి ప్రీతి కలుగుతుంది.
• ఫాల్గుణ బహుళ పాడ్యమి నాడు రావణుడితో యుద్ధం కోసం శ్రీరాముడు లంకకు బయల్దేరాడని రామాయణంలో ఉంది.
• ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడి మధ్య యుద్ధం ప్రారంభమైంది.
• హరిహర సుతుడైన అయ్యప్పస్వామి పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఫాల్గుణ మాసంలోనే జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.
• అర్జునుడి జన్మ నక్షత్రంలో ఫల్గుణి అనే పేరు ఉండటం ఈ మాసం విశిష్టతకు ప్రతీక.
• మహాభారతంలో- ఫాల్గుణ బహుళ అష్టమి నాడు ధర్మరాజు, శుద్ధ త్రయోదశి రోజు భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు జన్మించారని వివిధ పురాణాల్లో ఉంది.
• ఫాల్గుణ మాసంలో గోవింద వ్రతాలు విరివిగా చేయాలి. విష్ణుపూజకు ప్రాధాన్యం ఇవ్వాలి.
• ఫాల్గుణ మాసంలో శుద్ధ తదియ, చవితి నాడు దుండి గణపతిని పూజిస్తారు. కాశీ ద్రాక్షారామంలో వెలిసిన దుండీ గణపతికి సంబంధించిన పూజ ఇది.
• ఫాల్గుణంలో వచ్చిన ఉత్తర నక్షత్రం రోజున ఫాల్గొణోత్తరిగా భావించి లక్ష్మీదేవిని పూజిస్తారు.
• ఫాల్గుణంలో ముఖ్యమైనవి ఫాల్గుణ పౌర్ణమి. ఈనాడు శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవిని పూజించాలి.
శ్రీవిశ్వావసు
నామ సంవత్సరం
తెలుగు మాసాలలో మొదటిది చైత్రం. ఈ మాసపు ఆరంభ దిన (చైత్ర శుద్ధ పాడ్యమి)మే ఉగాది. మార్చి 30 ఉగాది పర్వదినం. ఈ తెలుగు సంవత్సరానికి ‘శ్రీ విశ్వావసు నామ సంవత్సరం’ అని పేరు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల యుగమే ఉగాది. తిథి సంపదలను, వారం ఆయుష్షును ఇస్తుంది. నక్షత్రం పాపాలను హరిస్తుంది. యోగం రోగాలను నివారిస్తుంది. చివరిదైన కరణం విజయాన్ని సిద్ధింప చేస్తుంది. సంపదలను కోరుకునే వారు తిథిని, దీర్ఘాయుష్ణును కోరుకునే వారు వారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పాప పరిహారం కోసం నక్షత్రం విషయంలో, రోగ నివారణకు యోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విజయం కోసం కరణం విషయంలో శ్రద్ధ చూపాలి. ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు, అభివృద్ధి పనులు చేపట్టే ముందు ఇతర మంచి పనుల ప్రారంభానికి ముందు ఈ ఐదు అంగాలు బలంగా, అనుకూలంగా ఉండేలా చూసుకోవాలి. ఇష్టదేవతను పూజించి ఆనందంగా గడపడం ఉగాది ప్రధాన కృత్యమైతే ఆనాడు ఆచరించే విధుల్లో ప్రధానమైనది పంచాంగ శ్రవణం. వ్యక్తిగత జీవితంలో కలిగే మార్పులతో పాటు సమాజంలో చోటుచేసుకునే పరిణామాలు, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ స్థితిగతులన్నీ ఇందులో భాగమై ఉంటాయి. రాశుల వారీగా సంవత్సర ఫలితాలు, ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు వంటివి పండితులు చదివి వినిపిస్తారు. శాస్త్రోక్తమైన పంచాంగ శ్రవణం గ్రహదోషాల్ని నివారిస్తుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అపమృత్యు భయాలు తొలగుతాయి. ఆయుష్షు పెరుగుతుంది. సంపదలు కలుగుతాయి. శుభ ఫలితాలు లభిస్తాయి.
ఉగాది నాడు మధుర, తిక్త, లవణ, ఆమ్ల, కటు, కషాయం వంటి షడ్రుచులతో చేసిన పచ్చడిని తినడం సంప్రదాయం. జీవితం అంటేనే సుఖదుఃఖాల మిశ్రమం. వాటిని సమభావంతో స్వీకరించి, సమన్వయంతో నెగ్గుకురావాలనే అంతరార్థం ‘ఉగాది పచ్చడి’లో ఇమిడి ఉంది. జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా, అది మంచికానీ, చెడుకానీ దానిని సమర్థంగా ఎదుర్కొని నిలవాలని సందేశాన్ని ఇచ్చే పర్వం- ‘ఉగాది’. ఈ నూతన సంవత్సరం మనకు సుఖదుఃఖాలకు, రాగద్వేషాలకు, భయక్రోధాలకు అతీతమైన పరమోన్నతమైన స్థితిని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుందాం.
శ్రీలక్ష్మీ జయంతి
లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధంగా ప్రాదుర్భవించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వాయంభువ మన్వంతర కాలంలో భృగు మహర్షి, ఖ్యాతి దంపతుల కుమార్తెగా జన్మించింది. సార్వోచిష మన్వంతరంలో అగ్ని నుంచి ఆవిర్భవించిందని అంటారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుంచీ, తామస మన్వంతరంలో భూమి నుంచీ, రైవత మన్వంతరంలో బిల్వవృక్షం నుంచీ, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుంచీ, వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరం నుంచీ శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భవించినట్టు ఆయా పురాణ కథనాలను బట్టి తెలుస్తోంది. వీటిలో క్షీరసాగర మథనం నుంచి లక్ష్మి ఆవిర్భవించిన దినమే ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ అని, కాబట్టి ఆనాడే లక్ష్మీ జయంతి అనీ అంటారు.
ప్రతి ఒక్కరూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఎందుకంటే ఆ తల్లి దయతోనే మనకు కావాల్సిన ధనధాన్యాలు, సిరిసంపదలు కలుగుతాయి. సుఖవంతమైన జీవనం గడపడానికి అవసరమైనవన్నీ లక్ష్మీకృపతోనే సాధ్యమని అంటారు. అందుకే నిత్యం లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక, ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ (మార్చి 14, 2025) నాడు తాము నివసించే ప్రాంతాన్ని, ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సంప్రదాయానుసారం ఆ తల్లిని ఆహ్వానిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయాల్సిన పూజలు, చదవవలసిన మంత్రాలు అనేక పురాణాల్లో ఉన్నాయి. జగద్గురు ఆదిశంకరుల వారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధార స్తవం పఠించారని, అప్పుడు లక్ష్మి కరుణించి ఒక పేదరాలి ఇంట్లో కనక (బంగారు) వర్షం కురిపించారనే కథ లోక ప్రాచుర్యం పొందింది. లక్ష్మీ జయంతి నాడు భక్తులు తమకు ఐశ్వర్యానందాలను ప్రసాదించాలంటూ తల్లిని పూజిస్తారు. లక్ష్మీ సహస్ర నామావళి (వెయ్యి లక్ష్మీదేవి నామాలు), శ్రీ సూక్తం కూడా పఠిస్తారు. దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెలో ముంచిన తామర పువ్వులను నైవేద్యంగా ఉపయోగిస్తారు.
లక్ష్మీదేవి జయంతి నాడు పాటించే ఒక చిత్రమైన ఆచారం కూడా ఉంది. అదేమిటంటే.. హోలికా దహనం చేసిన తరువాత కొంత బూడిదను తీసుకుని ఇంట్లో ఉంచి, దాన్ని ఎర్రటి వస్త్రంలో కట్టి ఇంట్లో ప్రతిష్ఠించుకున్న లక్ష్మీదేవి విగ్రహం పాదాల చెంత ఉంచాలి. అనంతరం ఆ బూడిదను తీసి ఇంట్లోని ఏదైనా ప్రదేశంలో భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థికలాభం కలుగుతుందని అంటారు. లక్ష్మీ జయంతి నాడు తులసి మొక్కను నాటడం, పూజించడం శుభప్రదంగా భావిస్తారు. క్షీరసాగర మథన సమయంలోనే లక్ష్మీదేవి జనించింది కాబట్టి ఆమెను జగద్వితమైన ‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం..’ అనే శ్లోకంతో ప్రస్తుతిస్తారు.

పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
సీనూ-భానూ
సీనూ భానూ చక్కని
స్నేహితులని చెప్పాలి
కలిసి బడికి పోతారు
కలిసి యిళ్లకొస్తారు
సీనూ భానూ ఎంతో
స్నేహంగా ఉంటారు
కలిసి చదువుకొంటారు
కలిసి ఆడుకొంటారు
కొత్త కొత్త పుస్తకాలు
కొనడం వాళ్లకి సరదా
కొత్త కొత్త ఆటల్లో
కూడా వాళ్లకి సరదా
ఆటలలో ఒకరోజున
మాట మీద మాట వచ్చి
సీనుడొచ్చి భానుగాణ్ణి
చెంప మీద వేశాడు
భాను మాత్రం మేం తక్కువ?
సీను మీద విరుచుకు పడి
వీసె గుద్దులొక నాలుగు
వీపున వడ్డించాడు
వీళ్లిట్టా పోట్లాడే
వేళ వాళ్ల నాన్నలు ఆ
చోటికొచ్చి చూశా రీ
చోద్యమైన గుద్దులాట
సీను నాన్న తప్పంతా
భాను దనీ, భాను నాన్న
సీనుదనీ తీవ్రంగా
వాదనలో పడ్డారు
వాదనతో ఆగలేదు
వాళ్లిద్దరి మధ్యా అది
పెరిగి పెరిగి చిట్టచివరకు
పెద్ద గుద్దులాటయింది
తండ్రుల యుద్ధం చూస్తే
తమ కెంతో వింత కలిగి
సీనూ భానూ ఎప్పటికీ
స్నేహితులై మిగిలినారు
మళ్లీ వాళ్లిద్దరు తమ
మామూలాటల్లో పడి
కొట్లాడే తమ తండ్రుల
మాటే మరిచారు
ఆ పిల్లలు వెనుకటి వలె
ఆటలాడుతున్నారు
తండ్రుల యుద్ధం మాత్రం
తగ్గే సూచన లేదు
పొడుపు పద్యములు
పైన పెచ్చుదీసి భక్షింప మధురంబు
కాయమెల్ల ముండ్లు కల్గియుండు
కాయపైని జూడ కనిపించు మొక్కలు
ఇందు భావమేమి, చందమామ?
(జవాబు: అనాస కాయ)
ఉన్నచోట నలిచి యొరుల దాటింతును
పరులనెక్కి యెపుడు బయనమగుదు
నాదు కాళ్లును రెండె, నరుని కాళ్లును రెండె
నన్ను దెలిసికొనుము చందమామ
(జవాబు: నిచ్చెన)
పచ్చన్ని పెట్టెలో విచ్చుకోనుంది
తెచ్చుకో బోతేను గుచ్చుకుంటుంది
ఎంత గుచ్చుకున్న ఏమైన గాని
తెచ్చుకొందు రదేమొ తెల్పు మామయ్య?
(జవాబు: మొగలి పొత్తి)
పొడల పొడల గువ్వ, పొంకమైన గువ్వ
గువ్వలోకి మొవ్వ, పురుగులు తినే అవ్వ
రాజుల పొడిచే రవ్వ, రాత్రి తెలిపే రవ్వ
నున్ననైన గువ్వ, నూకలు తినే తవ్వ
(జవాబు: కోడిపుంజు)
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
March 19, 2025
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia