Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page
నిత్యానంద ‘కరివెన’!
‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।’’
అని ఆ కాశీ విశ్వనాథుని భార్య అన్నపూర్ణాదేవి గురించి వర్ణించారు ఆదిశంకరాచార్యులు.
అన్న= అన్నము, పూర్ణ= పూర్ణముగా (నిండుగా) ప్రసాదించే తల్లి- అన్నపూర్ణ. ఆ మాతాన్నపూర్ణేశ్వరి- నిత్యానందకరి. కృపావలంబనకరి. నిత్యమూ ఆనందాన్ని, ఆహారాన్ని, కృపను వర్షిస్తూ భక్తులకు వాటిని ప్రసాదించే తల్లి ఆమె.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా ‘నిత్యాన్నదాన నిత్యానందగా భాసిల్లుతోంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు నిత్యం అన్నదాన సమారాధన చేస్తూ.. వసతి సదుపాయాలు కల్పిస్తూ వందేళ్ల వారసత్వాన్ని ఓ మహాయజ్ఞంలా కొనసాగిస్తోంది.
‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’. మనం భుజించే ఆహారం సాక్షాత్తూ దైవంతో సమానమని మన పెద్దలు చెప్పారు. ఈ లోకంలో ప్రాణికోటి ఆకలి తీర్చడాన్ని మించిన దైవకార్యం మరేముంది?. ఈ ఆర్యోక్తి స్ఫూర్తితోనే 1889లో ఆంధప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల ప్రశాంతమైన కరివెన గ్రామంలో అన్నదాన మహా యజ్ఞ సంకల్పానికి బీజం పడింది. ఆ చుట్టుపక్కలకు వచ్చే యాత్రికులు, పరిసర ప్రాంతాల్లోని పేదలపై కరుణతో మొదట్లో చిన్న బ్రాహ్మణుల బృందం అన్నాదానానికి శ్రీకారం చుట్టింది. ఆ చిన్న అడుగుకు కొనసాగింపుగా శ్రీశైలంలో బ్రాహ్మణ యాత్రికులకు అన్నదానం చేసే ‘కరివెన సత్రం’గా రూపుదిద్దుకునేందుకు వడివడిగా మలి అడుగులు పడ్డాయి.
పరా (పరాశక్తి, పార్వతీదేవి).. భవ (అస్తిత్వానికి శాశ్వత మూలమైన శివుడు) అనే దివ్య సమ్మేళనమై రూపుదాల్చిన శ్రీపరాభవ నామ సంవత్సరంలోకి అడుగిడిన వేళ కరివెన నిత్యాన్నదాన సత్రం తన అర్ధవంతమైన సేవలను మరింతగా విస్తరించడానికి అడుగులు వేస్తోంది.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం ప్రస్తుత చైర్మన్ హెచ్.శ్రీనివాసరావు, కార్యదర్శి ఎన్. వేణుగోపాల్ సమర్థ నాయకత్వ సారథ్యంలో.. కార్యవర్గ సభ్యుల నిర్మాణాత్మక మద్దతుతో ఆదర్శవంతమైన సంప్రదాయాన్ని దేశం నలుదిశలా మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
అన్నాద్భవన్తి భూతాని పర్జన్యాదన్న సంభవ:।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ: కర్మసముద్భవ:।।
ప్రాణులు అన్నము వలనే కలుగుచున్నవి. అన్నము మేఘము (వర్షం) వలన కలుగుచున్నది. మేఘము యజ్ఞము వలన కలుగుచున్నది. ఇట్టి యజ్ఞము కర్మ వలన కలుగుచున్నది.
(భగవద్గీతలో అర్జునుడితో శ్రీకృష్ణుడు)
సుదేవుడి కుమారుడైన శ్వేతుడు విదర్భ రాజు. గొప్ప తపస్సంపన్నుడైన శ్వేతుడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించి, తన తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు. ఆయన ప్రాణం విడిచిన తరువాత విష్ణువు సేవకులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉండేవాడు. కానీ, అన్ని సౌఖ్యాలున్నా అతనికి ఆకలిబాధ మాత్రం తప్పింది కాదు. నిజానికి స్వర్గంలో ఉండేవారికి ఆకలి ఉండదు. ఆకలేస్తే తినడానికి కూడా ఏమీ ఉండదు. కానీ శ్వేతుడు స్వర్గంలో ఉన్నా క్షుద్బాధ తప్పలేదు. ఆకలికి ఓర్చుకోలేక ఒకనాడు బ్రహ్మ వద్దకు వెళ్లి, ‘నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కానీ, నాకు ఇక్కడ ఆకలి బాధ తప్పడం లేదు. స్వర్గంలో ఉన్న వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ నాకు తినడానికేమీ దొరకట్లేదు. ఈ బాధను తప్పించండి’ అని వేడుకున్నాడు.
‘రాజా! నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చావు. కానీ, నువ్వేనాడూ ఒక్కరి ఆకలి కూడా తీర్చలేదు. ఎవరికీ కనీసం పట్టెడన్నం పెట్టలేకపోయావు. దాహార్తులకు చుక్క నీరు ఇవ్వలేదు. దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. కానీ, నువ్వది చేయలేదు. స్వర్గంలో ఎవరికీ లేని ఆకలి బాధ నీకు కలగడానికి కారణం అదే. నాటి లోపమే నిన్నిప్పుడు బాధిస్తోంది’ అని బ్రహ్మ చెప్పాడు.
‘ఆ పాపం నుంచి ఎలా బయటపడాలో చెప్పండి’ అని శ్వేతుడు ప్రార్థించాడు.
‘నువ్వు భూలోకం వెళ్లి నీ పార్థివకాయం ఎక్కడుందో వెతికి దానిని రోజూ కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకో. నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్లీ పెరుగుతుంది. అది ఎప్పటికీ తరగదు’ అని తరుణోపాయం చెప్పాడు బ్రహ్మ.
‘అలా ఎంతకాలం చేయాలో సెలవియ్యండి’ అన్నాడు శ్వేతుడు.
‘అగస్త్య మహర్షి నీ వద్దకు వచ్చి పలకరించే వరకు అలా తింటూనే ఉండాలి’ అని బ్రహ్మ బదులిచ్చాడు.
బ్రహ్మ చెప్పినట్టుగానే శ్వేతుడు భూలోకానికి వెళ్లి తన శవాన్ని వెతికి.. ఆకలి తీరే వరకు తిని తిరిగి స్వర్గానికి రాసాగాడు. మర్నాడు వెళ్లేసరికి మళ్లీ ఆ భాగం అలాగే ఉంటోంది. ఆ భౌతికకాయం కుళ్లిపోకుండా మనిషి నిద్రపోతున్నట్టుగానే ఉండేది. యథా ప్రకారం ఒకనాడు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అటుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు. శ్వేతుడని ఏమిటని పలకరించాడు.
‘మహాత్మా! నా జన్మ ధన్యమైంది. నా క్షుద్బాధ తీరింది. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని చేసిన తప్పు గురించి తెలుసుకున్నాను’ అని శ్వేతుడు అగస్త్యునికి నమస్కరించి స్వర్గానికి వెళ్లిపోయాడు.
అన్నదానం చేయని వారికి స్వర్గప్రాప్తి కలిగినా ఆకలిబాధ తప్పదని చాటే కథ ఇది. అన్నార్తుల ఆకలి తీర్చడం, దాహార్తులకు నీళ్లివ్వడం అనేవి ప్రతి మనిషి కనీస ధర్మం.
వెయ్యేనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఒక వంశానికి సేవ చేయడం, కోటి మంది యువతులకు వివాహం చేయడం.. ఇవేవీ అన్నదానానికి సాటిరావు.
అటువంటి బృహత్కర మానవ ధర్మానికి ‘మానవ సేవే మాధవ సేవ’ అనే ధర్మవాక్యాన్ని మంత్రంగా చేసుకుని ముందుకు సాగుతోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. హిందూ సంప్రదాయంలో అత్యుత్తమైనది- అన్నదానం. మన ధర్మంలో ఆకలితో ఉన్న వారికి అన్నాన్ని దానం చేయడం కంటే మంచి పూజ లేదా సత్సంప్రదాయం మరొకటి లేదని భావిస్తారు.
మన పురాణాలు ఈ శరీరం ‘అన్నమయ కోశం లేదా ఆహార కోశం’ అని చెప్పాయి. అలాగే పొట్ట భాగాన్ని ‘అగ్నికుండ్’ అని చెప్పాయి. పంచభూతాలలో అగ్ని ఒకటి. మన శరీరం కలిగి ఉండే ఐదు మూలకాల్లో కూడా అగ్ని ఒకటి. దీనిని తృప్తి పరచాలంటే నిత్యం దానికి ఆహార నైవేద్యాలను సమర్పించాలి. ఎందుకంటే అది ఆహార పోషకాలతో కూడి ఉన్నది. అవి లోపిస్తే ఆ కోశం కొడిగడుతుంది. ప్రాణం నిలవదు. అందువల్ల అన్నానికి నోచుకోని వారి ఆకలి తీర్చడం, వారి ప్రాణాన్ని నిలబెట్టడం అనేది వేలాది యజ్ఞాలు చేసిన దాని కంటే గొప్ప కార్యం.
అన్నదానం చేయడమంటే ఆ శరీరాన్ని నిలుపుతున్నట్టే.
అన్నం పెట్టడమంటే ఎదుటి వారికి జీవితాన్నిస్తున్నట్టే.
ఒక ప్రాణానికి జీవం పోస్తున్నట్టే.
అందుకే ఆహారం అనేది కేవలం పదార్థం కాదు.
ఒక జీవితం, ఒక జీవం.
ఎంతమందికి అన్నదానం చేస్తే అన్ని జీవితాలనిచ్చే అవకాశాన్ని పొందుతున్నట్టే.
ఆహారం పరబ్రహ్మ స్వరూపం..
ఒక్కో మెతుకు బతుకును కోరుతుంది.
ఆ విలువ తెలిసిన బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వేనవేల జీవితాలను నిలబెడుతోంది. అన్నదానాన్ని పవిత్రమైన కార్యంగా భావించి.. ఆ యజ్ఞకార్యంలో అంకితభావంతో నిమగ్నమైందీ సత్రం. శ్రీశైలం, మహానంది, భద్రాచలం, అలంపూర్, షిర్డీ, వారణాసి, రామేశ్వరం, అరుణాచలం తదితర పదహారు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఈ సంస్థ అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి సాటి లేని మేటి వైదిక ఆదర్శానికి పునాదులు వేసింది. ఇటీవలే తిరుమల, మధురై, హరిద్వార్, అయోధ్య, ప్రయాగ్రాజ్ తదితర క్షేత్రాలకూ తన సేవలను విస్తరించే ప్రణాళికలను రూపొందించింది.
చిన్నగా ప్రారంభమై.. మిన్నగా మారి..
అవసరంలో ఉన్న వారికి ఏ సాయమైనా చేయండి. కానీ పుచ్చుకునే వారికి తృప్తి ఉండదు. మనిషి ఆశకు అంతూ, అదుపూ ఉండవు. అవసరార్థులకు డబ్బు, బంగారం, ఇంకా ఏది దానమిచ్చినా లేదా సాయం చేసినా ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. కానీ, అన్నదానం పొందిన వారు మాత్రం ‘ఇక చాలు’ అని సంతృప్తి చెందుతారు. అందుకే అన్నదానం స్వీకరించిన వారు ‘అన్నదాతా సుఖీభవ’ అని గుండెల నిండా తృప్తితో నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలే వెయ్యేనుగుల పెట్టు. జన్మజన్మల ఆస్తి. ఈ ఆలోచనే కరివెన నిత్యాన్నదాన సత్రం ఏర్పాటుకు పునాది వేసింది.
కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్ర మహారాజు ఏలుతున్న కాలంలో ఈ కరివెన అగ్రహారం ఏర్పడింది. అప్పట్లో ఈ గ్రామానికి వెళ్లాలంటే అటవీ మార్గంలో కాలినడకే శరణ్యం. నల్లమల అటవీ ప్రాంతం మీదుగా అప్పట్లో భక్తులు శ్రీశైల క్షేత్రానికి వెళ్తుండే వారు. భక్తులు ఎంతో దూరం నుంచి వస్తూ.. మార్గమధ్యంలో ఆహారాన్ని సమకూర్చుకోలేక ఎన్నో ఇబ్బందులు పడేవారు. ఇది గమనించిన కరివెన గ్రామానికి చెందిన నిడిచెనమెట్ల సుబ్రహ్మణ్య సోమయాజులు గారు 1889లో నల్లమల అటవీ మార్గంలోని పెద్దచెరువు వద్ద తొలిసారిగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆహారంతో పాటు అలసి సొలసిన భక్తులకు నీరు, ఔషధాలను అందించే వారు. ఆ తరువాత ఆయన కుమారుడు నిడిచెనమెట్ల సోమసుందర శాస్త్రి గారు ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించారు. 1889 నుంచి 1974 వరకు ‘శివరాత్రి సత్రం’ పేరుతో ఈ సేవ కొనసాగింది. జూన్ 28, 1974 సంవత్సరంలో ఒక కమిటీ (రిజిస్టర్డ్ నంబర్: 47-1974) ఏర్పడింది. కరివెనకు చెందిన బొందలపాటి రామయ్య, విజయవాడకు చెందిన మాగంటి సూర్యనారాయణ పంతులు, మార్కాపురం వాస్తవ్యులు అన్నంరాజు సుబ్బారావు సారథ్యంలో అన్నదాన సేవలు కొనసాగాయి. అనంతరం వివిధ కారణాల వల్ల 1999 నుంచి 2014 వరకు కొన్ని ఆటంకాలు ఏర్పడినా.. ఆగస్టు 27, 2015లో మహానంది క్షేత్రంలో ఒక కొత్త కమిటీ ఏర్పడిన తరువాత కరివెన నిత్యాన్నదాన సత్రం చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి తన అన్నదాన, వసతి సేవలను బహుముఖంగా విస్తరిస్తూ కొత్త కమిటీ ఆధ్యాత్మిక సేవలో పరుగులు తీస్తున్నది.
కేవలం అన్నదానానికి మాత్రమే పరిమితం కాకుండా పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులు భగవంతుని దర్శనాన్ని సులభతరం చేసుకునేలా ఆయా క్షేత్రాల్లో వసతి సౌకర్యాలు కల్పించడంపైనా కమిటీ దృష్టి పెట్టింది. ఫలితంగా దాదాపు పదహారు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఈ సత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయి. యాత్రికుల వసతి కోసం ఆధునిక హంగులతో భవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది. సత్రం సేవలు చిరస్థాయిగా నిలవాలనే సంకల్పంతో ఆయా క్షేత్రాల సమీపంలో స్థలాలు కొనుగోలు చేసి వసతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించింది. తన సేవలను పూర్తిగా కంప్యూటరీకరించిన ఈ సంస్థ.. నగదు లావాదేవీలు, ఆదాయ పన్ను వ్యవహారాలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. తన సత్రానికి విరాళాలు అందించే భక్తులకు ఆదాయ పన్ను మినహాయింపు సౌకర్యాన్ని కల్పించే అవకాశాన్ని సాధించింది.
భూదాన యజ్ఞం
బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం అనేక పుణ్యక్షేత్రాలలో వసతి గదుల భవంతులను నిర్మిస్తోంది. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇంకొన్ని భూసేకరణ దశలోనూ ఉన్నాయి. ఇందుకోసం భూమిని దానం చేయాలనుకునే భక్తుల కోసం ఉద్దేశించినదే ‘భూదాన యజ్ఞ’ పథకం. అరుణాచలం, రామేశ్వరం, వారణాసి తదితర చోట్ల భూసేకరణ జరుగుతోంది. వీటిలో అరుణాచలం వంటి చోట్ల ఇప్పటికే వసతి గదుల భవంతులు సిద్ధమయ్యాయి.
భూదాన యజ్ఞంలో భాగంగా చదరపు గజం ధర రూ.10,000గా నిర్ణయించారు.
పది చదరపు అడుగుల స్థలం కోసం లక్ష రూపాయలు చెల్లించిన వారికి ప్రతి సంవత్సరం మూడు ఉచిత గది కూపన్లను అందచేస్తారు.
శాశ్వత గది నిర్మాణం కింద స్టాండర్డ్ రూమ్ నిర్మాణం కోసం రూ.8,00,000, సూట్ రూమ్ కింద రూ.10,00,000 చెల్లించవచ్చు. ఇలా చెల్లించిన దాతలకు జీవిత పర్యంతం ఉచిత గది వసతిని ఏటా 30 సార్లు వినియోగించుకోవచ్చు.
సేవే పరమార్థం..
భగవంతునికి, భక్తునికి మధ్య వారధిలా, అనుసంధానకర్తలా పని చేస్తున్న ఈ సత్రం అనేక సేవా కార్యక్రమాలతో భక్తుడిని భగవంతుడికి దగ్గర చేస్తోంది.
పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారు మొదట ఆలోచించేది- దైవ దర్శనం ఎలా సులభంగా చేసుకోవాలా అని..
తరువాత వెంటనే ఆలోచించేది- సదరు పుణ్యక్షేత్రంలో భోజనం, వసతి సదుపాయాలెలా? అనేది.
దైవ దర్శనానికి వచ్చిన వారెవరూ ఆ క్షేత్రంలో లభించే అన్నప్రసాదాన్ని తీసుకోకుండా వెనక్కి వెళ్లకూడదని, తలదాచుకునేందుకు ఇబ్బందులు పడకూడదనే బృహత్ సంకల్పం ఆయా పుణ్యక్షేత్రాల్లో కరివెన ట్రస్ట్ నిత్యాన్నదాన సత్రాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తోంది.
నిత్యాన్నదానం, భక్తులకు వసతి సౌకర్యం వంటివి విజయవంతంగా కల్పిస్తూనే మరెన్నో ఆధ్యాత్మిక, వైదిక సేవలు, కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను కరివెన నిత్యాన్నదాన సత్రం సమర్థంగా నిర్వహిస్తోంది.
వేదవిద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతో వేద పాఠశాలలను నిర్వహిస్తోంది. తరచూ వేదసభలు నిర్వహిస్తూ సామాన్యులకూ వేదాలను చేరువ చేసే ప్రయత్నం సాగిస్తోంది.
త్వరలో తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, హరిద్వార్, వేములవాడ ప్రాంతాల్లో వేద పాఠశాలల నిర్వహణకు భవిష్యత్తు కార్యాచరణను నిర్దేశించుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆయా చోట్ల స్థల సేకరణపై దృష్టి పెట్టింది. కొత్త భవనాల నిర్మాణం కోసం దాతల సహాయ సహకారాలను కోరుతోంది.
ఇంకా గోసేవ, గోదానం, వృద్ధాశ్రమం, హోమ, జప, తప, ఆబ్దిక కార్యక్రమాలు, ఉపనయనాలు, నందికేశవ నోములు, కైలాసగౌరి నోములు, లక్ష వత్తుల నోములు, భజనలు వంటి ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లోనూ కరివెన నిత్యాన్నదాన సత్రం నిమగ్నమైంది.
కరివెన నిత్యాన్నదాన సత్రం ద్వారా గోసేవ, గోసంరక్షణ చేయదల్చుకున్న భక్తులు నెలకు రూ.6,000 చెల్లించాల్సి ఉంటుంది. ఆ నెలంతా వారి పేరుపై గోవులకు గ్రాసం అందిస్తారు. విజయవాడ వృద్ధాశ్రమం, శ్రీశైలంలో ఈ సేవ అందుబాటులో ఉంది.
పుష్కర సమయాల్లో కరివేన నిత్యాన్నదాన సత్రం నిర్వహించే సేవలు ఎంతో ప్రఖ్యాతి పొందాయి. ఆయా నదీ పుష్కరాల సమయంలో పూర్తి వైదిక సంప్రదాయంతో అన్నదానం, సంకల్ప స్నానం, అన్నశ్రాద్ధం, హిరణ్య శ్రాద్ధం, తిల తర్పణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
అన్నం.. అక్షరం.. ‘కరివెన’కు రెండు కళ్లు
‘వేదోఖిలో ధర్మమూలం’ అని వేదోక్తి.
అఖిలమైన ధర్మాలకు మూలము వేదాలేనని అర్థం.
భారతీయ సనాతన సంస్క•తికి, ధర్మానికి మూలభూతాలు వేదాలు. అలాగే సకల పురుషార్థాలకు మూలభూతాలు వేదాలేనని రుగ్వేద ప్రాతిశాఖ్య చాటుతోంది.
‘విద్యన్తే ధర్మాదయ: పురుషార్థా: యైస్తే వేదా’ అనే వాక్యాన్ని బట్టి అఖిల సృష్టికి మూలము కూడా వేదాలే. అలాంటి మహత్తరమైన వేదాల పరిరక్షణకు వేదికైంది- శ్రీ కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయం.
‘అన్నం.. అక్షరం’.. అనే రెండు సంకల్పాలను రెండు కళ్లుగా చేసుకున్న ‘కరివెన’ సంస్థ.. కర్నూలులోని ఖండేరి, చిదంబరరావు వీధి (కోట)లోని శ్రీ శంకర మందిరంలో శ్రీకంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. గత కొన్నేళ్లుగా రాయలసీమ ప్రాంతంలో ఈ విద్యాలయం చతుర్వేదాల (రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం)తో పాటు రుగ్వేద- యజుర్వేద స్మార్త విద్యలను అందిస్తోంది.
వేద రక్షణ కోసం అకుంఠిత దీక్షతో మొదట రుగ్వేద, కృష్ణ యజుర్వేదాలు, కృష్ణ యజుర్వేద స్మార్తముతో మొదలైన ఈ విద్యాలయం ప్రస్తుతం సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని కూడా బోధిస్తోంది. రుగ్వేద స్మార్తాన్ని కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 70 మంది విద్యార్థులు ఇక్కడ వేదవిద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థులకు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలను, గ్రంథాలయ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.
ఈ వేద విద్యాలయంలో బోధించే ఆయా వేదాల వివరాలు..
రుగ్వేదము (శాకల శాఖ): ఈ విభాగంలో 16 మంది విద్యార్థులు వేదవిద్యను అభ్యసిస్తున్నారు. దేవతాస్తుతి, పరక మంత్రాలు ప్రధానంగా గల వేదం- రుగ్వేదం. చతుర్వేదాలకు మూలమైన ఈ వేదాధ్యయనానికి ఎనిమిది సంవత్సరాల వ్యవధి పడుతుంది. కరణం శ్రీదత్త శర్మ (క్రమపాఠి) ఈ విభాగం ప్రధాన అధ్యాపకులు.
రుగ్వేద స్మార్తము: ఈ విభాగంలో ఐదుగురు విద్యార్థులున్నారు. ఈ విభాగం కింద గణపతి పూజ, పుణ్యహవాచనము, వివాహాది
శుభకర్మలకు పఠించే మంత్రాలను బోధిస్తారు. ఈ రుగ్వేద స్మార్త అధ్యయనానికి ఆరు సంవత్సరాలు పడుతుంది. మేడవరం శ్రీప్రణవ శర్మ అధ్యాపకులుగా ఉన్నారు.
కృష్ణ యజుర్వేదము (తైత్తిరీయ శాఖ): ఈ వేద శాఖను 17 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. యజ్ఞ యాగాది క్రతు సంబంధమైన విషయాలను, దేవతాస్తుతులు ప్రధానంగా గల ఈ కృష్ణ యజుర్వేద అధ్యయనానికి తొమ్మిది సంవత్సరాలు పడుతుంది. కళ్లే ప్రతాపశర్మ (క్రమపాఠి) ఈ యజుర్వేద అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారు.
కృష్ణ యజుర్వేద స్మార్తము: పాలపర్తి శివరామ శర్మ అధ్యాపకత్వం కింద నిర్వహిస్తున్న ఈ స్మార్త విభాగంలో గణపతి పూజ, పుణ్యహవాచనము, వివాహాది శుభకర్మలు, తైత్తిరీయ అరణ్యక భాగం వంటివి బోధిస్తారు. ఈ స్మార్త వేదాధ్యయనానికి ఆరు సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం పద్నాలుగు మంది విద్యార్థులు ఈ వేదవిద్యను అభ్యసిస్తున్నారు.
సామవేదం (రాణాయనీయ శాఖ): సప్త స్వరాలకు మూలమైనది సామవేదం. రుక్కులకు గానమే ప్రధానంగా గల ఈ వేదాధ్యయనానికి పది సంవత్సరాల సమయం పడుతుంది. శుభం భగవత్కర శర్మ అధ్యాపకత్వం కింద ఏడుగురు విద్యార్థులు సామవేదాన్ని అధ్యయనం చేస్తున్నారు.
అధర్వణ వేదం (శౌనక శాఖ): కాశీభట్ల పవనశర్మ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఈ విభాగంలో పద్నాలుగు మంది విద్యార్థులు అభ్యసనం సాగిస్తున్నారు. అధర్వణ వేద విభాగం కింద వైద్య చికిత్సాదుల వైద్య విజ్ఞానం, ప్రాయశ్చిత్తాదులను బోధిస్తారు. ఈ వేదాధ్యయనానికి కనీసం ఏడు సంవత్సరాలు పడుతుంది.
కరివెన సత్రాలు..
ఏ సంవత్సరంలో ఎక్కడ ఏర్పాటయ్యాయంటే..
శ్రీశైలం (ప్రధాన కార్యాలయం) 28.6.1974
వారణాసి 1992
రామేశ్వరం 17.4.1993
భద్రాచలం 17.8.1994
వృద్ధాశ్రమం (తాడేపల్లి) 13.12.1997
మహానంది 1.4.2000
షిర్డీ 3.6.2004
అలంపూర్ 1.1.2009
త్రిపురాంతకం 23.11.2016
శ్రీశంకర మందిరం (కర్నూలు) 15.10.2020
యాదగిరిగుట్ట 26.11.2021
అరుణాచలం 13.06.2022
బృందావనం
(మధుర, ఉత్తరప్రదేశ్) 13.8.2023
అన్నదానం చేస్తే...
అన్నదానం తోటి వారి ఆకలిని తీర్చడమే కాక, దాతకు కోటి గోవులను దానం చేసినంత ఫలాన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం ద్వారా అనంతమైన పుణ్యం, ఆశీస్సులు లభిస్తాయి.
అన్నదానాన్ని దానాలన్నింటిలోకెల్లా మిన్నగా భావిస్తారు. ఇది అనంతమైన పుణ్యాన్నిస్తుంది.
చేసిన పాపాలు, కర్మలు తొలగిపోయి మనశ్శాంతి, దైవానుగ్రహం కలుగుతాయి.
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ద్వారా లభించే ఆత్మానందం, వారి ఆశీస్సులు జీవితంలో సానుకూలతను తెస్తాయి.
అన్నదానం చేయడం వల్ల పూర్వీకులు (పితృ దేవతలు) సంతోషించి, మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.
నిరంతరం అన్నదానం చేసే వారి ఇంట లక్ష్మీదేవి కటాక్షం ఉండి దానధర్మాలు చేసే శక్తి పెరుగుతుంది.
ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం, అన్నపానీయాలను ఇవ్వడం వల్ల దాతలో మానసిక, ఆధ్యాత్మిక వృద్ధి పెరుగుతుంది
వేదవిద్యా సాయం చేయాలంటే..
కుక్షౌ తిష్ఠతి యస్యాన్నం వేదభ్యాసేన జీర్యతే ।
కులం తారయతే తేషాం దశపూర్వం దశాపరం ।।
ఎవరి ద్రవ్యం వేదాభ్యాసంచే జీర్ణింపబడునో వారి యొక్క వంశము తనతో సహా పది తరాల ముందు వారిని, పది తరాల తరువాత వారిని తరించును అని పై శ్లోకానికి భావం. బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్న ఈ వేదవిద్య విభాగానికి ఇతోధిక తోడ్పాటు అందించడానికి వివిధ అవకాశాలున్నాయి.
విద్యార్థుల ఒకరోజు భోజనం ఖర్చు భరించే వారు రూ.6,000 చెల్లించాలి. ఈ దాతలకు వేదాశీర్వచనం అందిస్తారు. ఒక విద్యార్థికి ఒక నెల పాటు అయ్యే ఖర్చు కింద రూ.10,000 అందించవచ్చు. ఒక నెల అధ్యాపకుల గౌరవ వేతనం కింద రూ.15,000 ఇవ్వవచ్చు. వేద విద్యార్థులకు విద్య, వైద్యం, క్రీడలు, సంక్షేమం, నిత్యావసరాల ఒక నెల ఖర్చు కింద ఇవ్వదల్చుకుంటే రూ.30,000 చెల్లించాలి. ఇక వేదనిధి కింద ఫిక్స్డ్ డిపాజిట్ చేయదల్చుకుంటే రూ.1,00,000 చెల్లించవచ్చు. ఇంకా దాతలు విద్యార్థులకు వస్త్రదానం, అన్నదానం, ఇతర వస్తువులు ఏవైనా అందించవచ్చు.
దాతలు తమ విరాళాలను ఏబీబీకేఎన్ సత్రం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కింగ్ మార్కెట్ బ్రాంచ్, కర్నూలు పేరిట పంపవచ్చు. ఖాతా నంబర్: 64014055346. అలాగే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా నంబర్ 520101198151175 ద్వారా కూడా తమ విరాళాలు పంపించి రశీదును పొందవచ్చు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన
ఫోన్ నంబర్లు:
833907808,
8333907813,
8333907783.
అన్నదానం చేశారా?
అన్నదానానికి సాయం చేశారా?
లక్ష్మీదేవి చూస్తుందట!
ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టలేకపోయినా.. కనీసం అన్నం పెట్టే ఇంటినైనా చూపించాలని పెద్దలు చెబుతారు.
లక్ష్మీదేవి ఒక వ్యక్తికి పరిపూర్ణమైన అదృష్టాన్ని ప్రసాదించేటపుడు.. ఆ వ్యక్తి పూర్వజన్మలో అన్నదానం చేశాడా లేదా అని చూస్తుందని ప్రతీతి. పూర్వజన్మలో అన్నదానం చేసిన వారికి, అన్నదానికి సహాయ సహకారాలు అందించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభించి, వారు మహా అద్వితీయమైన ఐశ్వర్యవంతులుగా పుట్టి సమస్త భోగాలు అనుభవించే వారిగా ఎదుగుతారని చెబుతారు.
అన్నదానం చేసిన.. లేదా అన్నదానం చేయడానికి అవసరమైన వనరులు సమకూర్చిన వారికి మోక్షం లభిస్తుంది. అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఐశ్వర్యవంతులుగా పునర్జన్మ పొందుతారని, గత జన్మ పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు.. నాలుగు భుజాలూ జతకూడితేనే ఇతోధిక సాయానికి తోడ్పాటు. భక్తులు, దాతల నుంచి అలాంటి తోడ్పాటును కోరుతోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం.
మనం ఏవైనా కారణాల వల్ల పట్టెడన్నం ఎవరికీ పెట్టలేకపోవచ్చు. సామూహికంగా అన్నదానాలు చేయలేకపోవచ్చు. కానీ, పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తుల అన్నార్తిని తీర్చే సత్రాలకు నేరుగా సాయం చేయడం ద్వారా అన్నదానం చేసిన ఫలాన్ని, ఫలితాన్నే పొందవచ్చు. మనం ఎవరికీ అన్నదానం చేయలేకపోయినా.. కనీసం అన్నదానం చేసే అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన సత్రాల వంటి వాటి వైపు చూపించడమే కాదు.. అటువంటి సంస్థలకు విరాళాలు ఇవ్వడం, వస్తు సామగ్రి సమకూర్చడం వంటి సాయాల ద్వారా అన్నదాన ఫలాన్ని, దైవాశీర్వచనాన్ని పొందుదాం.
శాశ్వత అన్నదాన పథకం ఇలా..
ఏడాదిలో ఒకరోజు శాశ్వత అన్నదానం : రూ.3,000
ఏడాదిలో 5 రోజులకు శాశ్వత అన్నదానం : రూ.15,000
శాశ్వత అన్నదానం ప్రతి రోజూ ఒక్కరికి వారి
పేరుతో అన్నదానం చేయాలంటే.. : రూ.30,000
రూ.1,00,000 చెల్లించిన దాతలను నిత్యాన్నదాన/భూదాన మహారాజ పోషకులుగా పరిగణిస్తారు. ఈ దాతలు జీవిత పర్యంతం ఉచిత గది వసతిని ఏటా మూడుసార్లు చొప్పున వినియోగించుకోవచ్చు.
దాతలు ఆయా పర్వదిన సందర్భాల్లోనూ, వివాహ, పుట్టిన రోజు వేడుకల సందర్భంగానూ, పుణ్యతిథి కాలాల్లోనూ విరాళాలు అందించి కరివెన నిత్యాన్నదాన సత్రం ద్వారా తమ పేరుపై ఆ రోజు అన్నదానం చేయించుకోవచ్చు
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కార్యనిర్వాహక వర్గం
హర్కర శ్రీనివాసరావు (హైదరాబాద్)
చైర్మన్, అడ్వైజరీ కౌన్సిల్
కామరాజు నరేంద్ర (హైదరాబాద్)
గౌరవ అధ్యక్షుడు
డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ (కరివేన)
అధ్యక్షుడు
కె.మాధవరావు (ఆళ్లగడ్డ)
ఉపాధ్యక్షుడు
సీహెచ్.మారుతీ ప్రసన్న (విజయవాడ)
ఉపాధ్యక్షుడు
డాక్టర్ ఎన్ వేణుగోపాల్ (కర్నూలు)
సెక్రటరీ
కె.చిదంబరరావు (బండి ఆత్మకూరు)
జాయింట్ సెక్రటరీ
కె.రామకృష్ణ (మార్కాపురం)
జాయింట్ సెక్రటరీ-2
జి.హరిహరరావు (మార్కాపురం)
కోశాధికారి
కేవీ ప్రదీప్ (హైదరాబాద్)
ఎగ్జిక్యూటివ్ మెంబర్
ఎస్వీ రావు (హైదరాబాద్)
ఎగ్జిక్యూటివ్ మెంబర్
డాక్టర్ పి.రఘు (హైదరాబాద్)
ఎగ్జిక్యూటివ్ మెంబర్
హెచ్కే మనోహరరావు (కర్నూలు)
ఎగ్జిక్యూటివ్ మెంబర్
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రాల ఫోన్ నంబర్లు
శ్రీశైలం 83339 07784, 83339 07787
కర్నూలు 83339 07783, 83339 07808
మహానంది 83339 07802, 83339 07803
త్రిపురాంతకం 83339 07794, 83339 07795
విజయవాడ
(వృద్ధాశ్రమం) 83339 07813, 83339 07807
కాణిపాకం 83339 07812, 83339 07813
భద్రాచలం 83339 07796, 83339 07797
యాదగిరిగుట్ట 83339 07815, 83339 07813
అలంపూర్ 83339 07805, 83339 07806
అరుణాచలం 83339 07816, 83339 07817
రామేశ్వరం 83339 07793, 83339 07813
షిర్డీ 83339 07798, 83339 07800
కాశీ 83339 07790, 83339 07791
బృందావనం
(మధుర) 83339 07789, 83339 07813
నైమిశారణ్యం 83339 07804, 83339 07813
తిరుపతి 83339 07809, 83339 07810

మహోన్నత దానం!
త్రేతా, ద్వాపర యుగాల్లో మనుషులు యజ్ఞయాగాదులు, తపస్సుల ద్వారా మోక్షం పొందారు. కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, దైవ నామ పారాయణ, స్మరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఎవరికున్నంతలో వారు చేయగలిగిన దానిని దానం చేయవచ్చు.
వాటిలో విశిష్టమైనది అన్నదానం.
ఇది మనిషిని పూర్తిగా సంతృప్తిపరిచే దానం.
ఆకలితో ఉన్న వారికి ఒక్కోసారి మనం అన్నం పెట్టలేకపోవచ్చు. కానీ.. అటువంటప్పుడు అన్నం పెట్టే ఇంటి వైపైనా చూపించాలనేది పెద్దల మాట.
కర్ణుడు అదే చేశాడు.
అడిగిన వారికీ, అడగని వారికీ.. ఎందరికో ఎన్నో దానాలు చేసిన కర్ణుడు ఒక్కరికి కూడా అన్నదానం చేయలేకపోయాడు. మరి ఆ దోషం నుంచి ఎలా బయటపడ్డాడు?
కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాక కర్ణుడు స్వర్గానికి వెళ్లాడు. అతడు బతికుండగా చేసిన వివిధ దానాల ఫలితంగా ఎన్నో స్వాగత సత్కారాలు పొందాడు. ఏది కావాలంటే ఆ సౌఖ్యాన్ని పొందేవాడు. ఇన్ని ఉన్నా.. కర్ణుడిని నిత్యం ఏదో అసంతృప్తి, వెలితి వేధించేవి. ఎంత తిన్నా కడుపు నిండినట్టనిపించేది కాదు. తృప్తి కలిగేది కాదు. ఒకసారి ఇదేమాట ఇంద్రుడికి చెప్పాడు.
‘నువ్వు అనేక దానాలు చేశావనీ, అడిగిన వారికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడవని అంటారు. అన్ని దానాలు చేశావు కదా.. ఎవరికైనా, ఎప్పుడైనా అన్నదానం చేశావా?’ అని అడిగాడు.
‘లేద’ని చెప్పాడు కర్ణుడు.
‘పోనీ ఎవరికైనా అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?’ అని అడిగాడు దేవేంద్రుడు.
కాస్త ఆలోచించి, ‘అవును ఒకసారి ఓ బీదవాడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. అప్పుడు నేనేదో ధ్యాసలో ఉండి, నేను పెట్టలేను గానీ, అదిగో.. కనిపించే ఆ ఇంటికి వెళ్లు. అక్కడ అన్నం పెడతారు అని చెప్పాను’ అని బదులిచ్చాడు కర్ణుడు.
‘అయితే, ఆ ఇంటిని ఏ వేలితో చూపించావో ఆ వేలిని నీ నోట్లో పెట్టుకో’ అన్నాడు ఇంద్రుడు.
కర్ణుడు అలాగే చేశాడు. ఆ క్షణంలో అతని కడుపు నిండిపోయింది. అంతవరకు ఉన్న అసంతృప్తి మాయమైపోయింది. ఎనలేని తృప్తి కలిగింది.
ఙ ఙ ఙ
దానం చేసే స్థానం, ప్రాంతం, దేశం, కాలం కూడా ముఖ్యమైనవే. దానం చేసే స్థానం చాలా ముఖ్యమైనది. అది స్వచ్ఛంగా ఉండాలి. పవిత్రమైనదై ఉంటే ఇంకా మంచిది. అందుకే చాలామంది అన్నదాతలు తమ కార్యానికి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఎంచుకుంటారు. అటువంటి పవిత్ర స్థలాలలో చేసే దానం వల్ల ఆ స్థలం యొక్క పవిత్రత కారణంగా దాత - గ్రహీత.. ఇద్దరూ గొప్ప ఫలితాలను పొందవచ్చు.
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా తన అన్నదాన మహత్కార్యానికి పవిత్ర పుణ్యక్షేత్రాలనే ఎంచుకుంది. అక్కడ వారందించే అన్నప్రసాదాలను స్వీకరించడమే కాదు.. ఇతోధిక సాయమూ చేయవచ్చు.
ఉరుకుల పరుగుల జీవితంలో సేవకు కాసింత తీరిక చేసుకోలేని వారు నేరుగా కరివెన నిత్యాన్నదాన సత్రానికి నగదు, వస్తురూపంలో సాయం చేయవచ్చు. దాతలు అన్నదాన ఫలాన్ని, ఫలితాన్నీ పొందవచ్చు.
- డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
చందనోత్సవం
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తృతీయ (వరాహ), చతుర్థ (నరసింహ) అవతారాల సమ్మిళితమై, వైవిధ్యభరితమైన రూపంలో సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారికి ఏటా వైశాఖ మాసంలో జరిగే చందనోత్సవం గురించి ఎంతో వివరంగా ఎన్నో వివేషాలతో అందించిన ముఖచిత్ర కథనం బాగుంది. ఇంతకుముందు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాం.
-ఆర్.నారాయణ, సీహెచ్.రవిప్రకాశ్, రాధాకృష్ణ, భాస్కరరావు, పి.చంద్రశేఖర్, కె.చరిత, పి.వైష్ణవి, రాజశేఖరరావు, కనిగిరి బాపూరావు మరికొందరు ఆన్లైన్ పాఠకులు
పురాణపాతల్రు
తెలుగుపత్రిక ఏప్రిల్ సంచికలో అందించిన పురాణపాత్రలు, మన మహర్షులు శీర్షికలు బాగున్నాయి. ధ్రువుడు, హరీత మహర్షుల విశేషాలు చదివించాయి. ధ్రువుడికి సంబంధించిన వివరాలు మరింత విపులంగా ఇచ్చి ఉండాల్సిందని అనిపించింది.
-బి.వెంకటేశ్వరరావు,గౌతమి, పి.నరహరి, మనోహర్
సత్యదేవుని పెళ్లి
ఏప్రిల్ సంచికలో తిథి ప్రత్యేకం శీర్షికన ఆంధప్రదేశ్లోని అన్నవరంలో కొలువైన సత్యనారా యణ స్వామి కల్యాణోత్సవం, ఆ క్షేత్రం గురించి అందించిన విశేషాలు చదివించాయి.
- వెంకటరావు, హైదరాబాద్

మాసం.. విశేషం
ఆంగ్లమానం ప్రకారం ఐదవ మాసం మే. ఇది తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ- జ్యేష్ఠ మాసాల కలయిక. వైశాఖ మాసంలోని కొన్ని రోజులు, జ్యేష్ఠ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. వైశాఖం తెలుగు మాసాలలో రెండవది. మాధవ మాసం, సాధన మాసంగా పేర్కొనే వైశాఖలో కూర్మ జయంతి, బుద్ధ జయంతి, అన్నమాచార్య జయంతి, మోహిని ఏకాదశి, నిర్జన ఏకాదశి వంటి పండుగలు, పర్వాలు పలకరిస్తాయి. ఇక, మే 17, ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాస తిథులు ప్రారంభమవుతాయి. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో మూడవది కాగా, ఆంగ్లమానం ప్రకారం ఐదవది. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది.
2026- మే 1, శుక్రవారం, వైశాఖ శుద్ధ పౌర్ణమి నుంచి
2026- మే 31, ఆదివారం, అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు....
శ్రీ పరాభవ నామ సంవత్సరం- వైశాఖం/జ్యేష్ఠం- వసంత/గ్రీష్మ రుతువులు- ఉత్తరాయణ
వైశాఖ - జ్యేష్ఠ మాసాలు వసంత, గ్రీష్మ రుతు కాలం. మే నెల ముగిసి జూన్ ప్రారంభమయ్యే నాటికి ఎండలు మరింత మండిపోతాయి. గ్రీష్మతాపంతో మానవాళే కాదు పశుపక్ష్యాదులు అల్లాడిపోతుంటాయి. నెల చివరి నాటికి వాతావరణం కొంత చల్లబడుతుంది. జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి ఇష్టమైన మాసమని పేరు. జ్యేష్ఠ మాసం నెలంతా బ్రహ్మను ఆరాధించాలని అంటారు. నెల పొడవునా ఆయన ప్రతిమను గోధుమపిండితో తయారు చేసుకుని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలను పొందవచ్చని అంటారు. ఇలా చేస్తూ జ్యేష్ఠ మాసంలో తనను ఆరాధించే వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి జ్యేష్ఠ మాసమనే పేరు వచ్చింది. పితృదేవతల ప్రీత్యర్థం చేయాల్సిన కర్మలకు, వారి రుణం తీర్చుకోవడానికి, చేసిన పాపాల నుంచి విమోచనం పొందడానికి ఉద్దేశించిన కొన్ని మంచి తిథులు జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. జ్యేష్ఠంలో గృహ నిర్మాణ పనులను ప్రారంభించడం మంచిది కాదని మత్స్య పురాణంలో ఉంది. అలాగే శుభ ముహూర్తాల పరంగా కూడా ఈ మాసం అంతగా అనుకూలం కాదని అంటారు. అయితే, ఈ మాసంలో కొన్ని విశేషమైన పర్వాలు, వ్రతాలు ఉన్నాయి. స్త్రీలకు సౌభాగ్యాన్ని కలిగించే సావిత్రి వ్రతం, పార్వతీదేవి ఆచరించిన రంభా వ్రతం, పచ్చి మంచినీళ్లయినా ముట్టకుండా ఆచరించే నిర్జల ఏకాదశి వంటివి జ్యేష్ఠ మాసంలో వచ్చే ముఖ్యమైన వ్రతాలు. ఈ తిథి నాడు విష్ణుమూర్తిని కూడా పూజించి నీరు, అన్నం, పండ్లు వంటివి దానం చేయాలని పెద్దలు చెబుతారు. దీనివల్ల 12 ఏకాదశి తిథుల్లో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుందట. ప్రధానంగా వ్యవసాయానికి జ్యేష్ఠ మాసమే శ్రేష్ఠమైనదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే ఫలసాయానికి బీజం పడేది ఈ మాసంలోనే. అందుకే రైతులు ఆనందంగా ‘ఏరువాక’ జరుపుకుంటారు. వృషభ పూజలు ఈ మాసంలో విశేషంగా జరుగుతాయి. తమకు వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతా సూచకంగా రైతులు జ్యేష్ఠంలో వృషభ పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే, వ్యవసాయంలో ప్రధానమైన ఖరీఫ్ సీజన్కు రైతులు శ్రీకారం చుట్టేది ఈ మాసంలోనే. ఇక, దాన ధర్మాలకు అవకాశమిస్తూ విశేష పుణ్య ఫలాలను ప్రసాదించే ‘జ్యేష్ఠ పౌర్ణమి’, శ్రీ మహా విష్ణువు ఆరాధనలో తరింప చేసే ‘అపర ఏకాదశి’ ఈ మాసంలో ఆధ్యాత్మిక సాధనాపరులకు ఉన్నతిని కలిగిస్తాయి. ఇక, మే నెల ప్రారంభం నుంచి 16వ తేదీ వరకు వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. ఈ కాలంలో వచ్చే ముఖ్యమైన పర్వాల్లో హనుమజ్జయంతి ఒకటి. వైశాఖంలో కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే హనుమజ్జయంతిని ఆచరించే ఆచారం ఉంది. శ్రీరాముడు జ్యేష్ఠ మాసంలోనే హనుమంతుడిని కలిశాడట!. ఇంకా వైశాఖ, జ్యేష్ఠ మాస తిథుల్లో వచ్చే ముఖ్యమైన పర్వాల విశేషాలు..
వైశాఖ శుద్ధ పూర్ణిమ/బుద్ధ పూర్ణిమ
మే 1, శుక్రవారం
వైశాఖ శుద్ధ పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రశస్తమై ఉంది. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అనీ అంటారు. ఇక, ఈ పూర్ణిమ నాటి పర్వాలు చాలా పవిత్రమై ఉన్నాయి. వాటిలో కొన్ని..
•వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి బుద్ధుని జన్మ మహోత్సవమని నీలమత పురాణంలో పేర్కొన్నారు.
•విష్ణువు దశావతారాల్లో ఒకటైన కూర్మావతారం కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి నాడే ఆవిర్భవించింది. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కూర్మావతార ప్రాదుర్భావ దినమైతే, పుష్య శుక్ల ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి వ్రతం ఆచరణ దినం. కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండవది. పాల సముద్రాన్ని మథించిన సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా దేవతలు, రాక్షసులు (అమృతం కోసం) చేసుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోయడానికి విష్ణువు పెద్ద తాబేలు ఆకారాన్ని ధరించాడు. అదే కూర్మావతారం.
• సుబ్రహ్మణ్య స్వామి వైశాఖ పూర్ణిమ నాడే అవతరించినట్టు చెబుతారు.
•వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసే ఆచారం కూడా ఉంది. ఈనాడు ధర్మరాజు ప్రీత్యర్థం నానావిధ దానాలు చేయాలి.
• పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి జయంతి దినం కూడా ఈనాడే. ఆంధప్రదేశ్లోని తాళ్లపాకలో జన్మించాడు. వాగ్గేయకారుడిగా వినుతికెక్కిన ఈయన దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి, పదకవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని, అహోబిలం నృసింహ స్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించాడు. ఈయన పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం మిళితమై ఉంటాయి. శ్రీమహావిష్ణువు ఖడ్గానికి ‘నందకం’ అని పేరు. ఆ నందకం అంశతోనే అన్నమాచార్యులు జన్మించారని అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు.
•వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు శివుడు శరభావతారాన్ని ఎత్తాడు. శరభం అంటే ఎనిమిది కాళ్ల జంతువు. అది సింహాన్ని చంపగలిగే శక్తి కలది. వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు నృసింహావతారం దాల్చిన విష్ణువు హిరణ్యకశిపుని సంహరించాడు. అయినా ఆయన ఉగ్రం చల్లారలేదు. దీంతో దేవతలు శివుడిని ప్రార్థించారు. దాంతో శివుడు శరభ అవతారం దాల్చి నృసింహావతారంలోని సింహాన్ని చంపి వేస్తాడు. అనంతరం దాని చర్మాన్ని ఒలిచి కప్పుకుంటాడు. ఈ విధంగా నృసింహావతారం ముగుస్తుంది. ఇక, ఈ మూలంగా శివుడు శరభావతారం దాల్చాడు కాబట్టి వైశాఖ పూర్ణిమ శరభ జయంతి దినంగా ప్రసిద్ధి చెందింది.
ఇక, బుద్ధులకు వైశాఖ పూర్ణిమ మహోత్సవ దినం. శాక్య వంశంలో పుట్టిన సిద్ధార్థుడు ఒకనాడు- వృద్ధుడు, రోగి, శవం (మరణం), సన్యాసిని చూసి చలించిపోయి అంతర్ముఖుడయ్యాడు. ఇల్లు, భార్యాబిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. బిహార్లోని బుద్ధగయలో బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమైంది. ఆయన ఆర్య సత్యాలు వెల్లడించాడు. అష్టాంగ యోగమార్గం బోధించాడు. బుద్ధుడిగా తన మొదటి జ్ఞానబోధను సారనాథ్లో ప్రారంభించాడు. బోధ్ గయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బోధ్ గయ తరువాత బౌద్ధ మతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సారనాథ్లోనూ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతాయి. బౌద్ధ మత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు. కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలను చాలా శాంతంగా జరుపుకుంటారు. ఉత్సవాలలో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగురవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు.
ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ధర్మ సూత్రాన్ని బౌద్ధం నొక్కి వక్కాణిస్తుంది. బౌద్ధ మతస్తులు ఈనాడు పూవులు, దీపాలు, అగరవత్తులు బుద్ధునికి సమర్పిస్తారు. అందమైన పూవులు కొద్దిసేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరవత్తులు కాసేపటికే ఆవిరైపోతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా బుద్ధునికి భక్తులు వీటిని సమర్పిస్తారు. గౌతముడు లేదా బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ఇల్లు వదిలి, కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ, దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరకు గయలో బోధి వృక్షం కింద ‘కోరికలే దు:ఖానికి మూల కారణం’ అని కనుగొన్నాడు. తాను కనుగొన్న సత్యాన్ని ఆయన ప్రచారం చేశాడు. ‘మనకు కష్టం కలిగిందీ, దుఖిస్తున్నామూ అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించాలి’ అని ఆయన బోధించాడు.
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతీదీ మార్పు చెందుతుంది. చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దానిని ఆమోదించాలి. మంచి, చెడు.. దేనికీ ప్రతిస్పందించవద్దు’ అనే బుద్ధుని బోధనలు ప్రపంచమంతటా విస్తరించాయి.
ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని పలు ప్రధాన క్షేత్రాల్లో ఈనాడు పలు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ కపిలేశ్వరస్వామి వార్ల పత్ర పుష్పయాగాన్ని ఈనాడే నిర్వహిస్తారు.
గోవిందరాజ స్వామి వారి పొన్న కాల్వ ఉత్సవాన్ని కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే జరుపుతారు.
అలాగే, తిరుచానూరు పద్మావతీ తాయార్ల వసంతోత్సవం ఈనాటితో ముగుస్తుంది.
నాగులాపురం శ్రీవేద నారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనాటి నుంచే ప్రారంభమవుతాయి.
దేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవం ఈనాటితో ముగుస్తుంది.
మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం.
వైశాఖ బహుళ పాడ్యమి
మే 2, శనివారం
వైశాఖ బహుళ పాడ్యమి నారద మహర్షి జయంతి తిథి. ఆయన గొప్ప హరి భక్తుడు. ‘నారాయణ.. నారాయణ’ అంటూ ముల్లోకాలు తిరుగుతూ హరిభక్తిని జనులకు చాటేవాడు. ఇంకా ఈనాడు భూత మాత్రుత్సవం’ ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలుకుని అధిక జ్యేష్ఠ పూర్ణిమ చివరి వరకు శ్రీ ప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా నియమం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి క్యాలెండర్ ప్రకారం అన్నమాచార్య జయంతి తిథి ఈనాడే. ఇతర తెలుగు క్యాలెండర్లలో మాత్రం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే అన్నమాచార్యుని జయంతిగా పేర్కొన్నారు.
వైశాఖ బహుళ విదియ
మే 3, ఆదివారం
వైశాఖ బహుళ పాడ్యమి తిథి నారద జయంతి దినమని కొన్ని పంచాంగాలలో ఉండగా, వైశాఖ బహుళ విదియ తిథే ఆయన జయంతి తిథి అని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. నారదుడు వీణాధారి. లోకసంచారి. ‘నారాయణ’ మంత్రాన్ని పఠిస్తూ ఆయన లోకాలు తిరుగుతుంటాడు. ఈనాడు ఆయన ప్రీత్యర్థం వీణ దానం చేయాలని అంటారు. నారదుడు గొప్ప గాన విద్యా కుశలుడు. ఆయన చేతిలో ఉండే వీణకు ‘మహతి’ అని పేరు. ఈ వీణ ఆధారంగానే ఆయన నిత్యం విష్ణుగానం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాడు.
నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడునే గంధర్వుడిగా పుట్టాడట. అతను ఆ కాలంలో నారాయణ కథలు గానం చేసేవాడు. తరువాత కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడయ్యాడు.
వైశాఖ బహుళ చవితి
మే 5, మంగళవారం
వైశాఖ బహుళ చవితి (చతుర్థి) తిథి గణపతి ఆరాధనకు అనువైనది. ఈనాడు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఇది గణపతి సంబంధమైన వ్రతాచరణ పర్వం. పంచాంగాలలో ఈనాడు భౌమ చతుర్థి దినమని పేర్కొన్నారు.
వైశాఖ బహుళ పంచమి
మే 7, గురువారం
ఈనాటి నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. అలాగే వైశాఖ బహుళ పంచమి తిథి నాడే శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వసంతోత్సవం ఆరంభమవుతుంది.
అలాగే, ఏటా మే 7వ తేదీన ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. జీవితంలో నవ్వు ప్రాధాన్యాన్ని, నవ్వు వలన కలిగే మానసిక ఆరోగ్య ప్రయోజనాలను తెలియచెప్పడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
వైశాఖ బహుళ షష్ఠి
మే 8, శుక్రవారం
సాధారణంగా షష్టి తిథి కుమార స్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈయననే మనం సుబ్రహ్మణ్యస్వామిగా పిలుస్తాం. తమిళనాట కార్తికేయుడని, కుమారస్వామి అని పిలుస్తారు. ఈనాటి నుంచి కృతిక కార్తె ఆరంభమవుతుంది. నిజ కర్తరి కూడా ఈనాటి నుంచే ఆరంభం. కుమారస్వామి కూడా కృతిక నక్షత్రంలోనే జన్మించాడని అంటారు.
వైశాఖ బహుళ దశమి/ హనుమజ్జయంతి
మే 12, మంగళవారం
వైశాఖ బహుళ దశమి నాడే హనుమంతుడి జన్మతిథి. ఈనాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుడి జయంతి వేడుకలు విశేషంగా జరుగుతాయి. కొండగట్టు హనుమంతుడి దీక్షలు ఈనాటితో ముగుస్తాయి. అలాగే, హైదరాబాద్ సమీపంలోని తాడ్బంద్కు భారీ శోభాయాత్ర జరుగుతుంది. ఇది నేత్రపర్వం చేసే వేడుక. కాగా, చైత్ర మాసంలోనే హనుమజ్జయంతి అనే వాదనలూ ఉన్నాయి. తెలుగు వారు మాత్రం రెండు తిథుల్లోనూ హనుమంతుడి జన్మతిథి వేడుకలు నిర్వహించుకుంటారు.
ఆంజనేయుడు సకల సుగుణాల నిధి. రాముడిది ఒకటే బాణం.. ఒకటే మాట. మరి హనుమంతుడు ఏమైనా తక్కువా? ఆయనదీ ఒకటే మంత్రం.. ఒకటే నామం.. అదే రామనామం. హనుమంతుడంటే ధైర్యానికి నిలువెత్తు చిరునామా.. ప్రభుభక్తికి అసలైన అర్థం. కఠోరమైన బ్రహ్మచర్యానికి నిజమైన ఉదాహరణ. ఇవన్నీ హనుమంతుడి గురించి పరిచయం చెయ్యాలంటే చెప్పాల్సిన గుణగణాలు. ఇన్ని సుగుణాలు కలిగినా కూడా ఏ డాంబికాలు పలకకుండా, తన గొప్పదనం ఏమీ లేదంటూ, అంతా ఆ ‘రామ మంత్ర మహిమ’ అని చెప్పడం ఎవరికి సాధ్యం?. రుద్రాంశ సంభూతుడు, అప్రమేయ శక్తిశాలి అయినా కూడా తన శక్తిని అంతా దాచుకుని వానర రాజైన సుగ్రీవుడికి మంత్రిగా సేవలు అందించడంలో ఎంత వినయం? కొద్దిపాటి అధికారానికే డాబూ దర్పం ఒలకబోసే మనబోటి వాళ్లం హనుమను చూసి చాలా నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా పాదాలు మాత్రం నేల మీదనే నిలపాలన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మనలోని శక్తిని ఎప్పుడు? ఎలా? ఉపయోగించాలో తెలియక అహంకారంతో ప్రవర్తించే వారెందరో? కానీ, అవసరమైనపుడు మాత్రమే, అది కూడా లోకకల్యాణం కోసమే తన శక్తిని ప్రదర్శించి, దానిని దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు వినియోగించడం అనేది ఎంత గొప్ప విషయం? ఇలాంటి నిరహంకారం (అహంకారం లేకపోవడం) అనే మంచి లక్షణాన్ని, మరెన్నో సుగుణాలను మనం హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి.
మొత్తానికి ఒకే పర్వాన్ని రెండుసార్లు జరుపుకోవడం వల్ల పుణ్యమే కానీ, నష్టమేమీ లేదు. హనుమాన్ జయంతి రోజున ఆయనకు తమలపాకుల దండను సమర్పించాలి. తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తర శత నామ పూజ జరిపించాలి. ఆయనకు అరటిపండ్లు ప్రీతికరం. అందుకే జయంతి నాడు ఆయనకు వీటిని సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించాలి. ఇంకా ఆయనకు ఎంతో ఇష్టమైన వడమాల, అప్పాల మాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయని శాస్త్ర వచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డూ కూడా హనుమంతుడికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
హనుమజ్జయంతి నాడు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి. హనుమంతుడిని సింధూరంతో అభిషేకిస్తే కోరినవన్నీ అనుగ్రహిస్తాడని అంటారు.
వైశాఖ బహుళ ఏకాదశి/అపరైకాదశి
మే 13, బుధవారం
వైశాఖ బహుళ ఏకాదశిని అపరైకాదశి అని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం చేసి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు రకాల దానఫలం కలుగుతుందని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
వైశాఖ బహుళ ద్వాదశి
మే 14, గురువారం
వైశాఖ బహుళ ద్వాదశి నాడే వృషభ సంక్రమణం. దీనినే వృషభ సంక్రాంతి అనీ అంటారు. ఇంకా ఈనాడు సుజన్మ వాప్తి వ్రతం. సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. కర్షకులు వృషభ సంక్రాంతి నిర్వహిస్తారు. ఇది, వైశాఖ బహుళ అమావాస్య గురువారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదం అంటారు.
ఇక, ఏటా మే 14న అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మాతృమూర్తులను స్మరించుకుని, గౌరవించుకోవాల్సిన ప్రత్యేక రోజు ఇది.
వైశాఖ బహుళ త్రయోదశి
మే 15, శుక్రవారం
వైశాఖ బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి. అలాగే, ఈనాడు మాస శివరాత్రి.
వైశాఖ బహుళ చతుర్దశి
మే 15, శుక్రవారం
వైశాఖ బహుళ చతుర్దశి తిథి కూడా మే 15నే వస్తుంది. ఈనాడు ఉపవాసం ఉండి, ప్రదోషకాలంలో స్నానం చేసి, తెల్లని వస్త్రాలు ధరించి, గంధం మొదలైన ఉపచారాలతో, మారేడు దళాలతో శివలింగాల్ని పూజించాలి. ఈనాడు శివరాత్రి, సావిత్రీ వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు పిండితో శివలింగాన్ని తయారు చేసి పంచామృతాలతో స్నానం చేయించి కుంకుమ పూసి ధూప, దీప నైవేద్యాలతో పూజ చేయాలి. దీనికే లింగ వ్రతమని పేరు.
వైశాఖ బహుళ అమావాస్య
మే 16, శనివారం
వైశాఖ బహుళ అమావాస్య తిథితో వైశాఖ మాస తిథులు ముగుస్తాయి. ఈనాడు కృష్ణ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుని ఉవాచ. ఈనాడు ప్రయాగలో స్నానం పాపహరమని ప్రతీతి. త్రయోదశి నాడు ఆరంభించి ఈనాటితో సావిత్రీ వ్రతం పూర్తి చేయాలని పురుషార్థ చింతామణి గ్రంథంలో రాశారు. పితృదేవతలను పూజించడం, పార్వణ విధిలో శ్రాద్ధం దానం చేయడం ఈనాడు చేయాల్సిన ప్రధాన విధులు.
అధిక జ్యేష్ట శుద్ధ పాడ్యమి
మే 17, ఆదివారం
అధిక జ్యేష్ట మాస తిథులు ఈనాటి నుంచి ఆరంభం అవుతాయి. (ఈనాటి నుంచి ప్రారంభమయ్యే జ్యేష్ఠ మాస తిథుల్లో జ్యేష్ఠానికి ముందు ‘అధిక’ అని వ్యవహరించాలి). ఈనాడు కరవీర వ్రతం ఆచరించాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే భద్రచతుష్టయ వ్రతం కూడా చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. వసంతం ముగిసి గ్రీష్మ రుతువు ఈనాటి నుంచే ప్రారంభమవుతుంది. ఈ రుతు సమయంలో ఎండలు మండిపోతాయి. సూర్యుడు భూమికి దగ్గరగా ఉండటం వల్ల తీవ్రమైన వడగాల్పులు, వేడిగాలులు వీస్తాయి. పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. ప్రకృతిలోని పచ్చదనం కనుమరుగవుతుంది. నీటి వనరులు ఆవిరైపోతాయి. భూమి వేడెక్కుతుంది. మనుషులు, పశుపక్ష్యాదులు చల్లదనం కోసం పరితపిస్తారు. ఆయుర్వేద వైద్య విజ్ఞానం ప్రకారం ఈ కాలంలో కుండలలో నిల్వ చేసిన చల్లని నీళ్లు అధికంగా తీసుకోవాలి. పండ్లు.. ముఖ్యంగా మామిడిపండ్లు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
అధిక జ్యేష్ట శుద్ధ తదియ/రంభా వ్రతం
మే 19, మంగళవారం
అధిక జ్యేష్ట శుద్ధ తదియ నాటి వివరణలో మన పంచాంగ కర్తలు ‘రంభావ్రతమ్’ అని రాశారు. మరికొన్ని వ్రత గ్రంథాలు దీనినే ‘రంభాతృతీయ’ అని పేర్కొన్నాయి. రాజ్యవ్రతం, త్రివిక్రమ తృతీయ వ్రతం తదితర ఇతర వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని ఉంది. వీటన్నిటిలో రంభావ్రతమే కొన్నిచోట్ల ఆచరణలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకసారి తపోనిష్టలో ఉన్న శివుడికి సపర్యలు చేసేందుకు హిమవంతుడు తన కుమార్తె పార్వతిని శివుడికి అప్పగించాడు. పార్వతిపై ప్రేమ కలగడానికి మన్మథుడు శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు. శివుడికి చిత్తం చెదిరింది. ఆపై కోపంతో తన మూడవ కన్ను తెరిచి చూశాడు. దీంతో మన్మథుడు భస్మమయ్యాడు. శివుడు అక్క• నుంచి వెళ్లిపోగా, పార్వతి చిన్నబుచ్చుకుని ఇంటికి వచ్చేసింది. తల్లి ఎదురుగా వచ్చి ఆమెను గుచ్చి కౌగిలించుకుంది. పార్వతి బావురుమంది. తల్లి ఓదార్చి ఆమెను తండ్రి అయిన హిమవంతుని వద్దకు తీసుకెళ్లింది. ఇంతలో అక్కడికి సప్త మహా మునులు వచ్చారు. వారికి హిమవంతుడు తన కుమార్తె సంగతి చెప్పాడు. అప్పుడు ఆ మునులలో భృగువు- ‘బిడ్డా! ఒక వ్రతం ఉంది. దాన్ని ఆచరిస్తే నీకు శివుడే భర్త అవుతాడు’ అన్నాడు. అప్పుడు పార్వతి కోరిక మేరకు ఆ వ్రతాచరణ గురించి భృగువు ఇలా చెప్పాడు.
‘రంభ అంటే అరటి చెట్టు. ఈ వ్రతాన్ని జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు చేయాలి. ఆనాడు ఉదయాన్నే స్నానం చేసి అరటి చెట్టు మొదట అలికి పంచవన్నెల ముగ్గు పెట్టాలి. రంభకు అధిష్ఠాన దేవత సావిత్రి. కాబట్టి అరటి చెట్టు కింద సావిత్రీదేవిని పూజించాలి’ అని వివరించాడు.
అందు మీదట పార్వతి- ‘మహర్షీ! అరటి చెట్టుకు సావిత్రి అధిష్ఠాన దేవత ఎలా అయ్యింది?’ అని ప్రశ్నించింది.
‘బిడ్డా! అడగదగిన ప్రశ్న వేశావు. సావిత్రి, గాయత్రి అని బ్రహ్మదేవుడికి ఇద్దరు భార్యలు. సావిత్రీదేవి సౌందర్య గర్వం చేత ఒకసారి బ్రహ్మ వద్దకు వెళ్లడం మానేసింది. గాయత్రి ఎంత చెప్పినా ఆమె వినలేదు. బ్రహ్మకు కోపం వచ్చింది. ఈ లోకాన్ని వదిలి మానవ లోకంలో బీజం లేని చెట్టువై పుట్టు అని ఆయన సావిత్రిని శపించాడు. అప్పుడు సావిత్రి పశ్చాత్తాప పడింది. అయినా బ్రహ్మ కరగలేదు. గత్యంతరం లేక సావిత్రి అరటి చెట్టుగా మారి ఐదేళ్ల పాటు బ్రహ్మ కోసం తపస్సు చేసింది. అప్పటికి బ్రహ్మ మనసు కరిగింది. ‘నీవు ఒక అంశతో అరటి చెట్టును ఆశ్రయించుకుని ఉండు. అరటి చెట్టు ద్వారా నిన్ను పూజించే వారికి కోరికలు ఈడేరుతాయి. ఇక నీవు నాతో సత్యలోకానికి వచ్చేయవచ్చు’ అంటూ బ్రహ్మ ఆమెను తనతో తీసుకెళ్లాడు. సావిత్రికి శాప విమోచనం అయిన దినం కాబట్టి జ్యేష్ఠ శుద్ధ తదియ ఒక పర్వదినం అయ్యింది’ అని భృగువు వివరించాడు.
ఈ కథంతా విన్న పార్వతి- ‘మహర్షీ! అయితే ఈ వ్రతం నియమాలేమిటో దయచేసి తెలపండి’ అని కోరింది.
‘ముగ్గులు పెట్టిన అరటి చెట్టు కింద మంటపం వేయాలి. దానిని సరస పదార్థ సంపన్నం చేయాలి. అరటి చెట్ల నీడన పద్మాసనం వేసుకుని సాయంకాలం వరకు కూర్చుని సావిత్రి స్తోత్రం చేయాలి. రాత్రి జాగరణ చేయాలి. మర్నాటి నుంచి రాత్రి జాగరణ అవసరం లేదు. పద్మాసనస్థ అయి పగలు సావిత్రి స్తోత్రం చేస్తూ రాత్రులు అరటి చెట్ల కిందనే విశ్రమిస్తూ ఉండాలి. ఇలా నెల రోజులు చేసి ఆ మీదట సరస పదార్థ సంపన్నమైన ఆ మంటపాన్ని పూజ్య దంపతులకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని గతంలో లోపాముద్ర చేసి భర్తను పొందింది’ అని భృగు మహర్షి వ్రత నియమాల గురించి వివరించాడు.
పార్వతి ఈ విధంగా రంభా వ్రతాన్ని దీక్షతో చేసింది. ఆ దీక్షకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఆమెను పెళ్లాడాడు. ఇదీ రంభా వ్రతకథ.
అధిక జ్యేష్ట శుద్ధ చవితి
మే 20, బుధవారం
అధిక జ్యేష్ట శుద్ధ చవితి తిథి నాడు ఉమా చతుర్థీ వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. అలాగే, ఈనాడు ఉమా పూజ చేయాలని కూడా అంటారు. ఇంకా ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథి గణేశ చతుర్థి అని, శుక్లాదేవి పూజ చేయాలని కూడా ఉంది.
అధిక జ్యేష్ట శుద్ధ పంచమి
మే 21, గురువారం
అధిక జ్యేష్ట శుద్ధ పంచమి తిథి పితృ దేవతలను పూజించడానికి మంచి ఉద్ధిష్టమైన దినమని పంచాంగకర్తల ఉవాచ. కాబట్టి ఈనాడు స్వర్గంలో ఉన్న పితృదేవతలను యథాశక్తి పూజించాలి.
అధిక జ్యేష్ట శుద్ధ షష్టి
మే 22, శుక్రవారం
అధిక జ్యేష్ట శుద్ధ షష్టి నాడు అరణ్యాల్లో, కొండల్లో గౌరీదేవిని పూజించే వారికి సౌభాగ్యం సిద్ధిస్తుందని ప్రతీతి. ఈనాడు ఇంకా ఆరణ్యక షష్ఠి, స్కంద షష్ఠి, వింధ్యేశ్వర పూజ, అరణ్యగౌరీ వ్రతం, వింధ్యవాసినీ పూజ వంటి వాటిని ఆచరించాలని వ్రత గ్రంథాల్లో ఉంది. అలాగే, షష్ఠి తిథి నాడు కుమారస్వామిని విశేషంగా ఆరాధిస్తారు.
అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి
మే 23, శనివారం
అధిక జ్యేష్ట శుద్ధ సప్తమి నాడు ద్వాదశ సప్తమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇంకా వరుణ పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
అధిక జ్యేష్ట శుద్ధ అష్టమి
మే 24, ఆదివారం
ఇది దుర్గాష్టమి తిథి. ఈనాడు త్రిలోచనాష్టమి కూడా ఆచరిస్తారు.
అధిక జ్యేష్ట శుద్ధ నవమి
మే 25, సోమవారం
జ్యేష్ఠ శుద్ధ నవమి తిథి నాడు బ్రహ్మణీ నామ్యా ఉమాయా పూజ, శుక్లాదేవి పూజ ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాటి నుంచే రోహిణి కార్తె ప్రారంభమవుతుంది. రోహిణీ కార్తె నాటికి ఎండలు మరింత ముదురుతాయి. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండ కాస్తుందని నానుడి.
అధిక జ్యేష్ట శుద్ధ దశమి/దశపాపహర దశమి
మే 26, మంగళవారం
దశమి తిథితో ముడిపడి మనకు రెండు పెద్ద పండుగలు ఉన్నాయి. ఒకటి- జ్యేష్ఠ శుద్ధ దశమి. రెండు- ఆశ్వయుజ శుద్ధ దశమి. మొదటిది దశపాపహర దశమి. రెండవది విజయదశమి. రెండూ కూడా పది రోజుల పర్వాలే. పాడ్యమితో మొదలై దశమితో ముగుస్తాయి.
దశపాపహర దశమి అనగా పది పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పది పాపాలను పోగొట్టడానికి సమర్థమైన ఈ వ్రతం జ్యేష్ఠ శుక్ల పాడ్యమి నుంచి దశమి వరకు చేస్తారు. ఈనాడు ఏ నదిలో స్నానం చేసినా విశేష ఫలాన్నిస్తుంది. గంగానదిలో స్నానం చేస్తే ఇంకా గొప్ప పుణ్యప్రదం. కాశీలోని దశాశ్వమేథ ఘాట్లోని గంగాస్నానం మరీ పుణ్యం. గంగావతరణ ఈనాడేనని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. జ్యేష్ఠ శుక్ల దశమి, బుధవారం హస్తా నక్షత్రం కాలంలో గంగావతరణ జరిగిందని వ్రతోత్సవ చంద్రికాకారుడు చెబుతున్నాడు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో కూడా ఉందని అంటారు. జ్యేష్ఠ శుక్ల దశమి సౌమ్యవారంతో హస్తా నక్షత్రంతో కలిసి వచ్చిన నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సర్వపాపాలు సమసిపోతాయని నమ్మిక. కాగా, వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు గంగావతరణ జరిగినట్టు గ్రంథాంతరాల్లో ఉంది. మొత్తానికి జ్యేష్ఠ శుక్ల దశమి గంగావతరణ దినమైనా కాకున్నా ఈ పర్వం గంగానదిని ఉద్దేశించి చేయబడేది కావడం మాత్రం విశేషం. జ్యేష్ఠ శుద్ధ దశమి వ్రత విధానం గురించి స్కంధ పురాణంలో ఉంది. జ్యేష్ఠ శుక్ల దశమి కొందరికి సంవత్సరాది దినం కూడా. ఈనాడు స్నానం, దానం ముఖ్యమైనవి. పాడ్యమి మొదలు దశమి వరకు స్నానం చేయడం కూడా ఈ పర్వం విధులలో భాగమే. ఈ ఉత్సవాన్ని గంగోత్సవమని కూడా అంటారు.
ఇక, గాయత్రి మాత జయంతి కూడా ఈ తిథి నాడేనని భావిస్తారు. సకల మంత్రాలకు మూలమూర్తి గాయత్రిదేవి. ఈనాడు ఆమెను విశేషంగా ఆరాధిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ దశమి కొందరికి సంవత్సరాది దినంగానూ పరిగణనలో ఉంది. ఈనాడు వారు స్నానం, దానం చేయడాన్ని ముఖ్యమైన విధులుగా భావిస్తారు.
అధిక జ్యేష్ట శుద్ధ ఏకాదశి/నిర్జన ఏకాదశి
మే 27, బుధవారం
అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు గంగోత్సవాలు జరుగుతాయి. జ్యేష్ఠ మాసంలో ఎండలు మెండుగా ఉంటాయి. భూమిలో నీటి మట్టం చాలా లోతుకు పోతుంది. అటువంటి గడ్డు వేసవిలో ఈ ఏకాదశి నాడు పచ్చి మంచినీళ్లయినా పుచ్చుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుచేతనే దీనికి నిర్జలైకాదశి అనే పేరు వచ్చింది. ఈ నిర్జలైకాదశి ఆదిలో భీముని వల్ల ఏర్పడినట్టు పురాణగాథ ఉంది. భీముడు తిండిపోతు. ఒక్కపూట కూడా తిండి లేకుండా ఉండలేడు. అందుచేత దశమి నాడు ఏకభుక్తం మాత్రం చేసి ఏకాదశి నాడు ఒకపూట అయినా భోజనం లేకుండా అతడు ఉండలేడు. దీంతో అతను వ్యాసుడిని సంప్రదించాడు. అప్పుడు వ్యాసుడు అతనితో ‘నీవు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నీళ్లు కానీ, అన్నం కానీ తినకుండా ఉండు. ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాలను చేసిన ఫలితం నీకు సమకూరుతుంది’ అని చెప్పాడు. భీముడు అలాగే చేశాడు. ఏడాదికి ఒక వ్రతాన్ని చేసి భీముడు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందాడు. ఈ ఏకాదశి అంత మహత్తయినది.
మే 27, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి దినం.
అధిక జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి
మే 28, గురువారం
జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి తిథి చంపక ద్వాదశి పర్వమని గదాధర పద్ధతి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు త్రివిక్రమ పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అంటే వామనుడిని ఈనాడు పూజించాలి. అలాగే, ఈ తిథి రామలక్ష్మణ ద్వాదశిగానూ ప్రసిద్ధి. ఈనాడు కూర్మ జయంతి ఆచరిస్తారు. శ్రీశంకరాచార్య కైలాస గమనం కూడా ఈనాడే జరిగింది. ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈనాటి తిథి కాలాన్ని కర్తరీ త్యాగమని వ్యవహరిస్తారు.
అధిక జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి
మే 29, శుక్రవారం
జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి వివిధ పూజల ఆచరణకు మంచి ముహూర్త సమయం. ఇది మూడు వ్రతాలు చేసే ముహూర్త తిథిగా చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.
వీటిలో ఒకటి- దౌర్భాగ్య నాశన త్రయోదశీ వ్రతం.
మిగతా రెండు వ్రతాలు ఈనాటి రాత్రి మొదలు మూడు రాత్రుల పర్యంతం పర్యాప్తమై సాగేవి. వాటి పేర్లు- జాతి త్రిరాత్రి వ్రతం, రంభా త్రిరాత్రి వ్రతం. రెండో వ్రతాన్ని రాత్రి ప్రారంభించి, అరటి చెట్టు కింద ఉమామహేశ్వరులను పూజించాలని వ్రత నియమం.
అలాగే, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి- విద్యారణ్యుల ఆరాధన దినం కూడా. విద్యారణ్యుల వారు ఈ తిథి నాడే సిద్ధి పొందారు. విద్యారణ్య స్వామి వేదత్రయ భాష్యకర్త. విద్యానగరమును, విద్యానగర సామ్రాజ్యాన్ని నిర్మించిన వాడు. లౌకికం, వైదికం.. రెండింటా అసమాన ప్రతిభ గలవారీయన. ఆయనకు వివేకం తెలిసే సరికి ఉత్తర హిందుస్థానమంతా మహ్మదీయుల వశమైంది. దక్షిణాదినా అన్య మతస్తులు అక్కడక్కడా అడుగుపెట్టారు. ఇవి విద్యారణ్యస్వామిని కలతపెట్టాయి. అప్పుడు ఆయన తుంగభద్ర నదీ తీరాన భువనేశ్వరి అమ్మవారిని గురించి తీవ్రమైన తపస్సును గాయత్రీ మంత్రంతో ప్రారంభించాడు. అమ్మవారు ప్రసన్నరాలై ప్రత్యక్షమైంది. వరం కోరుకొమ్మనగా, ఐశ్వర్యం కోరుకున్నాడు. అమ్మ వారు అది వీలు కాదంది. దీంతో అక్కడికక్కడే విద్యారణ్య పేరుతో సన్యసించి శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించాడు. విరూపాక్ష పీఠం నెలకొల్పినది ఈయనే. హరిహర రాయలు, బుక్కరాయలుకు కొంతకాలం ఈయన మంత్రిగానూ ఉన్నారు.
విద్యారణ్య స్వామి ఆంధ్రుడా, ద్రవిడుడా, కర్ణాటకుడా, మహారాష్ట్రుడా అనే సందేహం ఉంది. ఆయన జాతి విషయమై వివరణ ‘విద్యారణ్య చరిత్ర’లో ఉంది. ఆయన ఆంధ్రుడే అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి. ఆది శంకరుల తరువాత అంతటి వారు విద్యారణ్య స్వామి. ఆది శంకరుడు కశ్మీరం నుంచి శృంగేరికి తెచ్చిన శారదా విగ్రహం చందన ప్రతిమను విద్యారణ్య స్వామి తన హయాంలో పంచలోహాలతో తయారు చేయించి పూర్ణకుంభాలతో అభిషేచనం చేశారు. ఆ విగ్రహమే నేటికీ శృంగేరీ పీఠంలో పూజలందుకుంటోంది.
అధిక జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి
మే 30, శనివారం
జ్యేష్ఠ శుద్ధ చతుర్దశికి చంపక చతుర్దశి అని మరోపేరు కూడా ఉంది. ఈనాడు వాయు వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే రుద్ర వ్రతం కూడా ఆచరిస్తారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ/ ఏరువాక పూర్ణిమ
మే 31, ఆదివారం
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి తెలుగునాట ఏరువాక పున్నమిగా ప్రసిద్ధి. మన పంచాంగంలో జ్యేష్ఠ పూర్ణిమ నాటి వివరణలో ‘వృషభ పూజా, హల ప్రవాహ’ తదితర పదాలు ఉన్నాయి. ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని ఈ పదాలకు గల అర్థాలను బట్టి తెలుస్తోంది.
ఏరువాక అంటే వివిధ అర్థాలున్నాయి.
ఏరు= సర్వావయవములు గల నాగలికి ఎడ్లను కట్టినది, సర్వావయములు గల నాగలి.
ఏరువాక= దున్నుటకు ఆరంభం.
శబ్ద రత్నాకరం నిఘంటువులో పేర్కొన్న ప్రకారం..
ఏరు= ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధంచేసిన నాగలి.
ఏరువాక= దుక్కి యొక్క ప్రారంభం.
ఈ రెండు అర్థాలను విశదీకరించి చూస్తే ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పర్వమని స్పష్టంగా తెలుస్తోంది.
ఏరువాక పున్నమిని వర్ష రుతువు ఆరంభంలో ఆచరిస్తారు. ఈ సమయంలో వర్షాలు కురిసి భూమి పదునెక్కితే పునర్వసు కార్తెలో పునాస విత్తనాలను జల్లుతారు. ఈ పని పునర్వసు కార్తెలో జరుగుతుంది కాబట్టే ఈ కాలంలో పండే పంటను పునాస పంట అంటారు.
ఏరువాక పండుగ నాడు రైతులు ఎద్దులను
శుభ్రంగా కడుగుతారు. వాటి కొమ్ములకు రంగులను పూస్తారు. గజ్జెలు, గంటలు, అద్దం, కుచ్చులు తదితరాలను ఎద్దులకు అలంకరిస్తారు. ఉదయాన్నే ఇంట్లో పొంగలి (పులగం) వండి ఎద్దులకు పెడతారు. ఎద్దులను కట్టి ఉంచే కాడికి ధూపదీప నైవేద్యాలు ఇస్తారు. సాయంకాలం తప్పెట, మేళం తదితర మంగళవాద్యాలతో ఎద్దులను ఊరి బయటకు తోలుకుని వెళ్తారు. ఊరి పొలిమేరలో పుంటినారతో చేసి తోరణాన్ని కడతారు. ఈ తోరణాన్ని రైతులు తమ చర్నాకోలలతో కొట్టి పీచుపీచు చేసి ఎవరికి దొరికిన పీచు వారు తీసుకునిపోతారు. దానిని ఇంట్లో పెట్టుకుంటారు. ఇది పశువులకు మేలు కలిగిస్తుందనేది వారి నమ్మకం.
కన్నడనాట కూడా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు ఇదే మాదిరిగా ఎద్దులను పూజిస్తారు. ఈ పర్వాన్నే వారు ‘కారుణిపబ్బ’ అని పిలుస్తారు.
ఏరువాక పున్నమ పూర్వ కాలం నుంచి ఆచరణలో ఉన్న పర్వం. మనది వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో అనాదిగా ఇది ఆచారంగా వస్తోంది.
ఎద్దులతో మన రైతులది అవినాభావ సంబంధం.
‘ఎద్దులు లేని సేద్యం చద్దిలేని పయనం’
‘ఒంటి ఎద్దుసేద్యం వరిగాలు నొప్పి’
‘గొడ్లు, వడ్లు ఉన్న వాడిదే వ్యవసాయం’
‘ఎక్కువ వెల పెట్టి గుడ్డను తక్కువ వెల పెట్టి గొడ్డును కొనకూడదు’
తెలుగు నాట ప్రాచుర్యంలో గల ఈ సామెతలన్నీ ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేవే.
ఈ తిథి నాటికి బండలు పగిలే భరణి కార్తె ఎండలు, రోళ్లు పగిలే రోహిణి కార్తె ఎండలు తగ్గుతాయి. మృగశిర కార్తెతో ముంగిళ్లు చల్లబడతాయి. ఆపై ఆరుద్ర వాన అదును వాన. ఇది వ్యవసాయానికి అనువైన కాలం. రోహిణిలో విత్తనాలు చల్లితే రోళ్లు కూడా నిండని అల్ప పంట చేతికందుతుందని మన రైతుల నమ్మకం.
ఇక, జ్యేష్ఠ పూర్ణిమ.. సావిత్రీ వ్రతాచరణ దినం కూడా. ఈనాడు బంగారంతో కానీ, మట్టితో కానీ సావిత్రీ, సత్యవంతుల ప్రతిమలను చేసి యథాశక్తి పూజించాలి. ఆ రాత్రి సావిత్రి చరిత్ర వింటూ జాగారం చేయాలి. తెల్లవారిన తరువాత సావిత్రి ప్రతిమను దక్షిణసహితంగా దానం చేయాలి. ఇది స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతం. ఇంకా ఈనాడు తిలచ్ఛత్రాదిదానం, బిల్వత్రిరాత్రి, పుత్రకామ, అశోకత్రిరాత్ర తదితరమైన వ్రతాలు కూడా చేస్తారని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఆమాదేర్ జ్యోతిషి అనే గ్రంథంలో ఈ వ్రతాన్ని గురించి స్నాన పూర్ణిమ వ్రతంగా పేర్కొంది.
జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు వట పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనినే వట సావిత్రీ వ్రతం అనీ అంటారు. వివాహితలైన స్త్రీలు జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు ఈ పర్వాన్ని ఆచరిస్తారు. ఈరోజున ఉపవాసం ఉంటారు. స్త్రీలకు వైధవ్యం రాకుండా ఈ పర్వం చేస్తుందని అంటారు. ఇది మూడు రోజుల వ్రతం. త్రయోదశి నాడు మొదలుకుని పౌర్ణమి వరకు ఉపవసిస్తారు. కొందరు పౌర్ణమి నాడు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వట అంటే మర్రి చెట్టు. ఆ చెట్టుకు ఈనాడు పూజలు చేస్తారు. మర్రిచెట్టుకు దారం చుడుతూ పదకొండు ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందని అంటారు.
జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ రోజున చేసే వస్త్ర దానాలు విశేష ఫలాన్నిస్తాయి.
కాగా, కబీరుదాసు జయంతి తిథి కూడా జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడే.
జ్యేష్ఠం.. ఏ ఆహారం శ్రేష్ఠం?
జ్యేష్ఠ మాసంలో కొన్ని ఆహార నియమాలను పాటించాలి. మే 17, 2026 నుంచి అధిక జ్యేష్ఠ మాసం ఆరంభమవుతుంది. ఆయుర్వేద గ్రంథాలలోనూ, ఇతర భారతీయ సంప్రదాయ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ఈ మాసంలో ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? ఎటువంటి ఆహారం తీసుకోకూడదో వివరించారు. రుతువులను బట్టి తీసుకోవాల్సిన ఆ ఆహార నియాలను తెలుసుకుందాం.
తెలుగు పంచాంగాల ప్రకారం జ్యేష్ఠం నెలల వరుసలో మూడవది.
చైత్ర మాసంలో బెల్లం, వైశాఖ మాసంలో నూనె, జ్యేష్ఠ మాసంలో మిరపకాయలు, ఆషాఢ మాసంలో పప్పులు, శ్రావణ మాసంలో పచ్చిమిర్చి, భాద్రపద మాసంలో పెరుగు ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. ఇంకా కార్తీక మాసం, పుష్య మాసంలో ధనియాలు, మాఘ మాసంలో పంచదార, ఫాల్గుణ మాసంలో పప్పు దినుసులను ఆహారంలో భాగంగా ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాలానుగుణంగా తీసుకోవాల్సిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండటంతో పాటు ప్రమాదకరమైన వ్యాధులను నిరోధించవచ్చు.
జ్యేష్ఠ మాసంలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నూనెలు, మసాలాలతో తయారయ్యే ఆహారానికి ఈ కాలంలో దూరంగా ఉండాలి.
జ్యేష్ఠ మాసంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మహాభారతంలో కూడా కొన్ని వివరాలున్నాయి. దాని ప్రకారం..
జ్యేష్ఠ మూలం తు యో మస్మేకభక్తేన్ సంక్షిపేత్ ।
ఐశ్వర్యమతులం శ్రేష్ఠం పుమంస్త్రి వా ప్రపద్యతే ’’
అంటే- జ్యేష్ఠ మాసంలో రోజుకు ఒక్కసారే భోజనం చేయాలి. ఇది మనిషిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది అని పై శ్లోకానికి భావం.
జ్యేష్ఠ మాసంలో ఆ కాలంలో లభించే పండ్లు, ఆకుపచ్చని కూరగాయలను ఆహారంలో ఎక్కువ భాగం చేసుకోవాలి. ముఖ్యంగా మామిడిపండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, మాంసాహారానికి దూరంగా ఉండాలి.
ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలను చేర్చుకోవాలి. పెరుగు, మజ్జిగ, లస్సి, పండ్ల రసాల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు దట్టించిన ఆహారం వేసవిలో అధిక వేడిని కలిగించి ఒంట్లోని శక్తినంతా పీల్చేస్తుంది. అలాగే, స్పైసీ ఫుడ్ మైకం లేదా నరాల సమస్యలకు కారణమవుతుంది.
జ్యేష్ఠ మాసంలో వంకాయను అసలు ఆహారంలో భాగం చేసుకోకూడదని చెబుతారు. ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందట. ఆర్థరైటిస్ అవకాశాలను పెంచుతుంది. అలాగే బెండకాయ
కూడా ఈ కాలంలో ఎక్కువగా తినకూడదని అంటారు.
అధిక (పురుషోత్తమ) మాసం
మన కాల గణన జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్య, చంద్రుల ఆధారంగా జరుగుతుంది. సూర్యుడిని ఆధారంగా చేసుకుని లెక్కగట్టే కాలమానాన్ని సౌరమానం అనీ, చంద్రుడిని ఆధారంగా చేసుకుని లెక్కగట్టే కాలమానాన్ని చంద్రమానం అనీ వ్యవహరిస్తారు. చాంద్రమానంలో నెలకు 29.53 రోజులుగా లెక్కగడతారు. ఈ లెక్క ప్రకారం చాంద్రమానంలో వచ్చేవి సంవత్సరానికి 354 రోజులే. ఇక, సౌరమానంలో సంవత్సరానికి 365 రోజులు. అంటే చాంద్ర, సౌరమానాలకు మధ్య సంవత్సరంలో పదకొండు రోజుల తేడా ఏర్పడుతోంది. ఈ వ్యత్యాసాన్ని సరిచేయడం కోసం ప్రతి 32 నెలలకు ఒకసారి ఒక మాసాన్ని అధికంగా జోడిస్తారు. దీనినే అధికమాసం లేదా పురుషోత్తమ మాసం అనీ వ్యవహరిస్తారు.
అధిక మాసం సమయంలో పండుగలు, వ్రతాలు ఒక నెల ముందుకు జరుగుతాయి. ఈ ఏడాది 2026 సంవత్సరంలో ఈ అధికమాసం జ్యేష్ఠ మాసంలో వచ్చింది. దీంతో కొన్ని పండుగుల తేదీల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ అధిక మాసం మే 17, 2026న ప్రారంభమై, జూన్ 15, 2026 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో సూర్య సంక్రాంతి సరిగా ఉండదని అంటారు. అందువల్ల అధిక మాసాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. అధిక వ •సం సమయంలో వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు,
ఉపనయనాలు ఇతర శుభకార్యాలను నిర్వహించరు. ఈ కాలంలో వీటిని చేపట్టడం అంతగా మంచిది కాదని పండితులు చెబుతారు. పితృకార్యాలను సైతం అధిక మాసంలో కాకుండా నిజమాసంలోనే జరపాలని అంటారు. అయినా
కూడా అధిక మాసానికి ఒక ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ఈ మాసంలో శుభకార్యాలు చేయకున్నా ఆధ్యాత్మిక కార్యకలాపాలు, దానధర్మాలకు శ్రేష్ఠమైన కాలమని చెబుతారు. ఆయా తిథానుసారం ఆయా పర్వాలను జరుపుకోవచ్చు.
పురుషోత్తమ మాసమని ఎందుకు అంటారంటే..
అధిక మాసం శ్రీమహావిష్ణువు ఆరాధనకు ఉద్ధిష్టమైన మాసం. అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసమని కూడా పిలుస్తారు. ఈ మాసానికి పేరును మహావిష్ణువే ప్రసాదించాడనీ, అధిక మాసంలో చేపట్టే దైవకార్యాలకు అనంతమైన ఫలాలు లభించేలా వరమిచ్చాడని పురాణాల్లో ఉంది. ఒకసారి అధిక మాసం మహిమ గురించి లక్ష్మీదేవి అడిగినపుడు, పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు, జపం, హోమం, దానం వంటివి ఆచరిస్తారో వారికి మిగిలిన సాధారణ (నిజ) మాసాల కన్నా అనేక రెట్ల ఫలితం లభిస్తుందని విష్ణువు చెప్పాడట. అధిక మాసం అశుభమని భావించి పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో అనేక అవరోధాలు కలుగుతాయని కూడా చెప్పినట్టు పురాణ కథలు ఉన్నాయి.
పుణ్యకార్యాలకు ఈ తిథులు అనుకూలం..
అధికమాసంలో వచ్చే శుక్లపక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి తిథి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో పుణ్యకార్యాలు ఆచరించవచ్చని చెబుతారు. వీరికి అపార పుణ్యఫలం కలుగుతుంది. ముఖ్యంగా అధికమాసంలో శ్రీమహావిష్ణువు ఆరాధన, విష్ణు సహస్ర నామ పారాయణం, ఏకాదశి ఉపవాసాలు ఆచరించడం, వ్రతాలు, దీక్షలు చేపట్టడం వల్ల రెట్టింపు ఫలితాలను పొందవచ్చని పెద్దలు చెబుతారు.


పాఠలే.. పాఠమై..
పిల్లలకు పాటల ద్వారా నైతికత, మంచీచెడూ , జీవనశైలి నేర్పడం అనేది తెలుగు సంస్క•తీ సంప్రదాయాల్లో శిశుదశ నుంచే ప్రారంభం అయిపోతుంది. అందుకు నిదర్శనాలే మన ఉగ్గుపాటలు, జోలపాటలు, లాలిపాటలు..
బిడ్డలు కొంచెం ఎదిగాక గోరుముద్దలు, గొలుసు ముద్దలు తినిపిస్తూ చందమామ ముచ్చట్లు చెబుతూ తల్లులు చందమామ పాటలు పాడతారు.
చందమామ రావె జాబిల్లి రావె
కొండెక్కి రావె గోగుపూలు తేవె
అని పాడుతూ మారాము చేస్తున్న బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి. ఇలా చేయడం ఈనాటికీ తెలుగు తల్లికి సరదా. ఆ మాటకు వస్తే బిడ్డను పెంచడంలో తెలుగుతల్లికి ఒక ప్రత్యేకత ఉన్నదని అనిపిస్తుంది. తన కనుసన్నలలో పెరిగిన బిడ్డలో వ్యక్తిత్వం తనంత తానే రూపొందుతుంది. ఆలోచన పెరుగుతుంది. ఊహలు ఊగిసలాడతాయి. తానే ఒక కవి అవుతాడు. గాయకుడు అవుతాడు. పాటలు కడతాడు.
ఉడతా ఉడతా ఊచ్
ఎక్కడికెళ్లా వోచ్
నూకలు పెడతా మేకలు కాస్తావ్?
పెద్దపులొస్తే జడవవుగా?
ఊగూ.. ఊగూ బసవన్నా
ఉలవలు తినరా బసవన్నా
ఇలా కొల్లలుగా పిల్లలు కాస్త పెరిగాక పాటలు పాడతారు. ఇది తెలుగు పిల్లల ప్రత్యేక ప్రవృత్తి. తెలుగు జానపద గేయాల సంపద. జోలపాటలు ప్రస్తుతం తెలుగునాట అపారంగా నిరాదరణకు గురై చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలినవి చాలా తక్కువ. ఉన్నవాటిలో కొన్ని ఇవి..
జోఅచ్యుతానంద జోజో ముకుంద
రావె పరమానంద రామ గోవింద।।
నందు నింటను జేరి నయము మీఱంగ
చంద్రవదనలు నీకు సేవ చేయంగ
నందముగ వారిండ్ల నాడుచుండంగ
మందలకు దొంగ మా ముద్దురంగ ।।జో।।
పాలవారాశిలో పవళించినావు
బాలుగా మునుల కభయమిచ్చినావు
మేలుగా వసుదేవు కుదయించినావు
బాలుడై యుండి గోపాలుడైనావు ।।జో।।
అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే
పట్టి కోడలు మూతిపై రాసినాడే
అట్టె తినెనని యత్త యడుగ విన్నాడే
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ।।జో।।
గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి
కొల్లలుగా త్రావి కొండలనునేయి
చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ
చిల్లతనములు సేయ జెల్లునటవోయి ।।జో।।
రేపల్లె సతులెల్ల గోపంబుతోను
గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను
మాపుగానే వచ్చి మా మానములను
నా పాపడే చెరిచె నేమందుమమ్మ ।।జో।।
ఒకని యాలిని దెచ్చి నొకని కడబెట్టి
జగడములు గలిపించి పతిపతులబట్టి
పగలు నలు జాములను బాలుడై నట్టి
మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి ।।జో।।
అంగజుని గన్న మా యన్న యిటు రారా
బంగారు గిన్నెలో బాలు పోసేరా
దొంగ నీవని సతులు పొంగుచున్నారా
ముంగిట నాడరా మోహనాకార ।।జో।।
గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి
కావరమ్ముననున్న కంసుబడగొట్టి
నీవు మధురాపురము నేలజేపట్టి
రీవితో నేలిన దేవకీపట్టి ।।జో।।
అంగుగా దాళ్లపా కన్నయ్య చా
శృంగార రచనగా జెప్పెనీ జోల
సంగతిగ నకల సంపదల నీవేళ
మంగళము తిరుపట్ల మదన గోపాల ।।జో।।
పిల్లలకు విశేషంగా ఆసక్తిని కలిగించే సాహిత్య పక్రియలలో క్రమాలంకార సాధనాన్ని మించినది మరొకటి లేదు. ఒకే పదం పద్యంలో పదేపదే కానీ, పాటలో కానీ ఆమ్రేడితం కావడం వలన రచనకు సొబగు చేకూరుతుంది. అటువంటిది ఆకర్షణీయంగా ఉండటమే కాక అర్థంలో చమత్కారం మనసును ఆకట్టుకోవడం వంటి సత్ఫలితాలు లభిస్తాయి. అటువంటిది పోతన భాగవతంలోని ఒక పద్యం..
పలికెడిది భాగవతమట
పలికించెడి వాడు రామభద్రుండట నే
పలికిన భవహరమగునట
పలికెదవేరొండు గాధ పలుకగ నేలా?
ఈ పద్యంలో ‘పలుకు’ శబ్ద పలుగు గిలుకులు, కూర్చిన శోభ అంతా ఇంతా కాదు. ఇలాంటివే తెలుగునాట మరెన్నో పద్యాలు ఉన్నాయి.

Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
May 17, 2026
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40
Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia




















