Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page

పరమపద సోపాన ‘పాఠం’
పరమపద సోపాన పథము లేదా వైకుంఠపాళీ లేదా పాము-నిచ్చెన ఆట.. లేదా మోక్షపథం..
మోక్షపటం..లేదా పాము పటం..
పేరేదైనా ఇదో ప్రాచీన భారతీయ ఆట.
మన తెలుగు నాట ఇది మరీ సుప్రసిద్ధం.
ఇది మానవ జీవితాల్లోని ఆధ్యాత్మిక కోణాన్ని వెలికితీస్తుంది. జీవితంలో మనిషి ఎదుర్కొనే కష్టనష్టాలకు, చివరకు చేరుకోవలసిన గమ్యానికి ప్రతీకగా నిలిచే ఆట ఇది.
పాశ్చాత్యులు దీనిని ‘క్లాసిక్ ఆట’గా పరిగణిస్తారు. జీవితంలో ఒక్కసారైనా ఆడాల్సిన ఆటగా మన పెద్దలు చెబుతుంటారు. మన పురాణాలు, ఇతిహాసాలు.. వాటిలోని పద్యాలు, మంచి మాటలు, పాటలు కలిపి మొత్తంగా అందించగలిగే వికాసాన్ని ఈ ఒక్క ఆట అందిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇంతటి గొప్ప ఆట కాబట్టే దీనిని ‘పరమపద సోపాన పటం’ అన్నారు. జీవన సారాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ, క్రీడాస్ఫూర్తినీ, నైతిక విలువలనూ రంగరించే అపురూప వ్యక్తిత్వ వికాస క్రీడ- వైకుంఠపాళి.
ఇంతకూ వైకుంఠపాళిని ఎవరు కనిపెట్టారు?
అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. 13వ శతాబ్దానికి చెందిన జ్ఞానేశ్వర్ లేదా జ్ఞానదేవ్ అనే ఆధ్యాత్మిక గురువు ఈ ఆటను భారతదేశానికి పరిచయం చేశారని చెబుతారు. అయితే క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది నాటికే ఈ ఆట వ్యావహారికంలో ఉందని కొందరు అంటారు. ఈ భారతీయ ఆటను 1892 ప్రాంతంలో బ్రిటిష్ పాలకులు ప్రపంచానికి పరిచయం చేశారు.
ఇంతకీ ఈ ఆటలో ఏముంది.
ఈ ఆట ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు? ఏం నేర్చుకోవచ్చు?
ఆధ్యాత్మిక జీవనంలో ఈ ‘పరమపథం’ పాత్ర ఏమిటి?
‘‘తద్విష్ణో పరమం పదం’’ అని వేదోక్తి.
అంటే- విష్ణుమూర్తి నివాసం ఉండే ప్రదేశమే పరమపదం. అంటే, అదే వైకుంఠం లేదా సద్గతి. అక్కడికి చేరుకోవడానికి మనిషి చేసే ప్రయత్నమే పరమ పథం. పరమ పథం అనేది మానవ జీవిత లక్ష్యాన్ని నిర్దేశించే వేద ప్రమాణం. మనిషి ఆధ్యాత్మిక సాధనతో మోక్షం పొందిన తరువాత సద్గతిని పొందుతాడు. అటువంటి సద్గతి పొందిన మనిషికి మళ్లీ జన్మంటూ ఉండదు. అలాంటి మరుజన్మ లేని, జన్మరాహిత్యాన్ని పొందడమే ఈ ఆట మనకు నేర్పే ముఖ్య పాఠం.
మనం జీవితంలో మంచి పనులు చేస్తే మంచి స్థానానికి చేరుకుంటాం. ఆ మంచితనానికి ప్రతీకలు నిచ్చెనలు.
మనం చెడు పనులు చేస్తే చెడ్డ ఫలితాలనే పొందుతాం. అంటే పాపం చేస్తే పాము నోట్లో పడినట్టే. చెడు చేస్తూ, పాపం పనులు చేస్తూ జీవితంలో ఎదగాలనుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదోలా పైకి వెళ్లినా ఏదోరోజు నేరుగా కిందికి దిగజారిపోక తప్పదు.
వైకుంఠపాళీ ఇద్దరు లేదా ముగ్గురు నలుగురు కూడా ఆడవచ్చు. ఇంకా ఆపైన ఎందరైనా కూడా ఆడవచ్చు.
కాకపోతే ఆడేవాళ్లు ఒక్కో రకం ఆటకాయలను ఎంచుకోవాలి.
ఇక, పాచికలుగా గవ్వలను కానీ, చింతపిక్కలను కానీ వాడుతుంటారు.
చదరంగా ఉండే ఈ పఠంలో సాధారణంగా పది అడ్డ వరుసలు, పది నిలువు వరుసలతో మొత్తం వంద గడులు ఉంటాయి.
కొన్ని పటాలలో 8 అడ్డ నిలువు వరుసలు, 12 అడ్డ నిలువు వరుసలు కూడా ఉంటాయి.
మరికొన్ని పటాలలో 132 గళ్లు కూడా ఉంటాయి.
132 గడులు ఉన్న పటమే వైకుంఠపాళీ ఆటకు ప్రామాణికంగా భావిస్తారు.
ఈ గళ్లు కూడా వివిధ బొమ్మలతో నిండి ఉంటాయి. అయితే, ఈ విషయంలో ఏ ఒక్క పటం మధ్య సారూప్యత కనిపించదు. అంటే- ఒక్కో పటం ఒక్కో విధంగా ఉంటాయి. గడుల సంఖ్య కూడా వేర్వేరుగా ఉంటుంటుంది.
మొత్తానికి ఒకటో గడి నుంచి తుది గమ్యానికి చేరేలా ఆట సాగుతుంది.
ముందుకు సాగే కొద్దీ చిన్న పాములు, పెద్ద పాములు, చిన్న నిచ్చెనలు, పెద్ద నిచ్చెనలు ఉంటుంటాయి.
మనం ఆడే ఆటకాయలు వీటిలో నిచ్చెన వద్ద పడితే కొంచెం ముందుకు వెళ్తాం.
పాము నోట్లో పడితే సరాసరి కిందకు దిగిపోతాం.
దీనినే పాప-పుణ్యాలతో పోల్చి చెబుతారు.
చివరకు ఈ అడ్డంకులను దాటుకుంటూ ఎవరు ముందుగా చివరి గడి (మోక్షపథం)కి చేరుకుంటారో వారు విజేత అయినట్టు ప్రకటిస్తారు.
పరమపథ సోపాన పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గడులలో నిచ్చెనలు ఉంటాయి.
మన ఆటకాయ ఈ గడుల్లో పడితే కనుక మనం ఆ స్థానం నుంచి పై స్థానానికి చేరుకుంటాం.
అలాగే, 3, 10, 26, 55, 75, 106, 121 తదితర గడుల్లో (ఈ సంఖ్యలు వైకుంఠపాళి పటంలో ఉన్న గడుల సంఖ్యను బట్టి మారుతుండవచ్చు) పాములు ఉంటాయి. ముఖ్యంగా 106వ గడిలో ఉన్న పాము మన ఆటకాయను మింగిదంటే ఆట మొదలెట్టిన చోటికే వచ్చేస్తాం.
అంటే 1వ గడిలో పడిపోతాం.
చివరకు 121వ గడిలో ఉన్న పామును తప్పించుకుని 122వ గడికి ఆటకాయ చేరుకుంటే మనం పుణ్యపథంలో పడినట్టే. అంటే, ఇక ఆపైన పాములు తగలవు.
ఇంతకీ ఆధ్యాత్మికతతో ముడిపడిన ఈ ఆటలోని మర్మం ఏమిటి?
మొదటి గడి నుంచి మొదలయ్యే ఈ ఆట ఎంతో ఆసక్తి, ఉత్సుకత కలిగిస్తూ ముందుకు తీసుకువెళ్తుంది.
ఒక్కోసారి నిచ్చెనలు ఎక్కి పైకి ఎగబాకడం.. మరోసారి పాముల బారిన పడి కిందకు జారిపోవడం ఈ ఆటలో భాగం.
ఆట అయినా, జీవితం అయినా.. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగితేనే ఎవరైనా విజేతలుగా నిలుస్తారు.
సుదీర్ఘమైన ఈ జీవితాన్ని కూడా క్రీడాస్ఫూర్తితో ఆడాలి.
పోరాడి గెలవాలి.
అదే జీవిత వైకుంఠపాళీ.
ఈ ఆటలో ఒకసారి నిచ్చెన ఎక్కగానే సరిపోదు.
అలాంటివి మరెన్నో అధిరోహించాల్సి ఉంటుంది.
అంటే దీనర్థం- ఒక్క విజయంతోనే సంతృప్తిపడకూడదు. చివరి వరకు ఆడి విజయం సాధించాలి.
జీవితంలో మనల్ని ఒక్కోసారి పరాజయాలు, ఇంకొన్నిసార్లు విజయాలు పలకరిస్తాయి.
అవి ఆశ-నిరాశలకు గురిచేస్తుంటాయి.
అపజయం కలిగినపుడు ఇక పోరాడలేను అనిపిస్తుంది.
నేను సాధించలేననే భయం కలుగుతుంది.
అటువంటి సందర్భాలలోనే ఆత్మవిశ్వాసం, ధైర్యం అవసరం. ఆశాభావంతో ప్రయత్నం చేస్తే ఏనాటికైనా విజయం సిద్ధిస్తుంది.
క్రీడా మైదానం కావచ్చు.. జీవన విధానం కావచ్చు.. మనం నిర్దేశించుకున్న లక్ష్యం మంచిదై ఉంటే, దానిని సాధించే వరకు అలుపెరగని పోరాటం, ప్రయత్నం చేయాల్సిందే.
గెలవాలని, గెలిచి నిలవాలనే పట్టుదల, తెగింపు ఉండాలి.
మనలో తెగువ, ధైర్యం ఎప్పుడైతే తగ్గిపోతాయో, మనల్ని భయం ఎప్పుడైతే ఆవహిస్తోందో ఆటలోని పాముల్లా అవి ఉన్న స్థితి నుంచి ఇంకా కిందకు దిగజార్చేస్తాయి.
ఆటలోనైనా, జీవితంలోనైనా శ్రద్ధ, ఓర్పు, సహనం.. ఇవే విజయతీరాలకు చేర్చే మార్గదర్శులు.
పడిన చోటు నుంచే మళ్లీ మొదలుపెట్టాలి.
ఓడిన చోటు నుంచే మళ్లీ గెలుపు జెండా ఎగురవేయాలి.
మానవ జీవితంలో ఉత్థాన పతనాలు సహజాతి సహజం. వాటిని శ్రద్ధ, సహనంతో అధిగమించే నేర్పును, నైపుణ్యాన్ని పిల్లలకు బాల్యంలోనే నేర్పే క్రీడ- ఈ వైకుంఠపాళీ.
నాలుగు గవ్వలతో, ఆడేవారి సంఖ్యను బట్టి తగిన ఆటకాయలతో జీవితాన్ని ఆస్వాదించవచ్చంటే నమ్ముతారా? వైకుంఠపాళి ఆ పని చేస్తుంది. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని, అడ్డంకులను ఎదుర్కోగల నేర్పును, ధైర్యాన్ని, అందుకు తగిన స్థైర్యాన్ని ఇచ్చే ఆట ఇది.
ప్రామాణికంగా చెప్పాలంటే, ఈ పటంలో పదకొండు వరుసలు ఉంటాయి. ఒక్కో వరుసలో 11 గడులు ఉంటాయి. మొత్తం 121 గడులు పూర్తయ్యాక, పై భాగాన పదకొండు గడులలో ‘పరమపద సోపాన పటము’ అని పెద్ద అక్షరాలు ఒక్కో గడిలో ఒక్కోటి రాసి ఉంటాయి. ఈ పదకొండు (11) గడుల్లోని పది గడుల్లో పది మంది దివ్య పురుషులు లేదా వేర్వేరు దేవతలు కొలువుదీరి ఉంటారు. వారి మధ్యలో శ్రీమహావిష్ణువు కొలువై ఉంటాడు. ఆయన ఉన్న చోటుకు చేరుకోవడమే ఈ ఆటలోని అంతిమ కర్తవ్యం. మనం చివరకు చేరుకోవాల్సిన స్థానం అది. అక్కడకు చేరుకునే వరకు ఈ ఆట ఆడుతూనే ఉండాలి.
జీవితం కూడా అంతే! కష్టనష్టాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే మన పని. ఈ ఆటలో ఒకటి నుంచి 121వ గడి వరకు ఎకాఎకీన వెళ్లిపోతామని చెప్పలేం. అక్కడకు చేరే వరకు వివిధ గడుల నుంచి అదృష్టవశాత్తూ పైకి ఇంకొంచెం పైకి చేరుకోగలం. దురదృష్టవశాత్తూ కిందికి జారిపోగలం. అయినా పడుతూ లేస్తూ మళ్లీ ఆట మొదలుపెట్టాల్సిందే. అంటే పరమపదాన్ని చేరుకునే వరకు ఈ జనన మరణ సంసార చక్రంలో పడుతూ లేస్తూ ఉండటం తప్పదని ఇది సూచిస్తుంది.
పదకొండు (11) సంఖ్యను సంస్క•తంలో ‘ఏకాదశి’ అంటారు. ఏకాదశీ వ్రతం, ఏకాదశి ప్రాశస్త్యం భారతీయులందరికీ తెలిసిందే. ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తుంటాయి. ఈ రెండూ వివిధ పర్వాలతో ఉంటాయి. వీటిని భారతీయులు శ్రద్ధాభక్తులతో ఆచరిస్తుంటారు. దీనినే ఏకాదశి వ్రతమని అంటారు. అందుకే మనకు ఏకాదశి మహా పర్వదినం. ఆ రోజు వ్రతాచరణతో పాటు ఉపవాసం, జాగరణం ఉండటం, దైవనామ స్మరణతో గడపడం తప్పనిసరి. ఈ ఏకాదశీ వ్రతాన్ని వరుసగా పదకొండేళ్ల పాటు ఆచరిస్తే పరమపదం చేరుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఇదంతా ఆధ్యాత్మిక సంబంధం.
ఈ వైకుంఠపాళిలోని పరమపదాన్ని చేరుకోవడం మాత్రం ఆధ్యాత్మిక వికాసం.
జయాపజయాలు అనేవి మానసిక అనుభూతులు. ఈ అనుభూతుల మధ్య సమన్వయాన్ని సాధించి పరమపదాన్ని చేరుకోవడమే ఆధ్యాత్మిక పరమావధి. ఈ ఆటలో గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రం ఉంది. అదేమిటంటే- ‘‘మన విజయం లేదా మన ఉన్నతి మన చేతిలోనే ఉంది’’.
మన చేతిలోని గవ్వలు ఎలా పడతాయో.. అలా మన ఎదుగుదల ఉంటుంది. ఆటలో గవ్వలు కావచ్చు.. జీవితంలో ఉన్నత లక్ష్యాలు కావచ్చు.. వాటిని నేర్పుగా వాడుతూ ముందుకు వెళ్లడం అనేది ఒక కళ.
వైకుంఠపాళి పటంలోని ప్రతి గడిలో ఒక్కో బొమ్మ.. దానికో పేరు ఉంటాయి.
కొన్ని గళ్లు మనల్ని ఉన్నట్టుండి నిచ్చెనలు ఎక్కించి పైకి తీసుకువెళ్తాయి.
మరికొన్ని గళ్లలో కాచుకుని కూర్చున్న పాములు అమాంతం మింగేస్తూ కిందకు పడదోస్తాయి.
అంతలోనే ఉత్సాహం.. అంతలోనే నిరుత్సాహం.. అంతిమంగా ద్వంద్వాతీతమైన పరమశాంతి.
ఇదీ వైకుంఠపాళి ఆట నడిచే తీరు.
ఆ ఆటలోని పాములు, నిచ్చెనలు ఉన్న గడుల్లోని పేర్లను జాగ్రత్తగా పరిశీలిస్తే, అద్వితీయమైన ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసివస్తాయి.
ఉదాహరణకు 75వ గడిలో ఒక పాము తల వద్ద ‘కర్కోటకుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక పదవ గడిలోకి పాకి ఉంటుంది. అక్కడ వరాహం బొమ్మ ఉంటుంది. పాము కరవడం వల్ల కిందికి పడిపోయామనేది పైకి కనిపించే విషయం. కానీ, జీవితంలో కర్కోటకంగా వ్యవహరిస్తే వచ్చే జన్మలో పందిగా పుడతామనేది ఆధ్యాత్మిక హెచ్చరిక. పంది జన్మ బారిన పడకూడదంటే మనం జీవితంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఆటలోనూ, ఆ గడిలోకి పడకుండా నేర్పుగా గవ్వలను విసరాలి.
55వ గడిలో ఒక పాము తల ఉంటుంది. దాని వద్ద ‘దుర్యోధనుడు’ అని రాసి ఉంటుంది. దాని తోక 12వ గడిలోకి పాకి ఉంటుంది. అంటే పొరపాటున మన ఆటకాయ 55వ గడిలో పడిదంటే కనుక, ఏకంగా 43 గడుల కిందకు.. 12 గడిలోకి పడిపోతాం. ఇదంతా ఆటలో కనిపించేది. కానీ, దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక వికాసం మాత్రం చాలా గొప్పది. దుర్యోధనుడు అహంకారి. తన అహంకారంతో, మూర్ఖత్వంతో మొత్తం కురు వంశం వినాశనానికి కారకుడయ్యాడు. పైగా, అతడు కరడుగట్టిన అసూయకు ప్రతిరూపం. అందువల్లే అతనితో పాటు అతని వంశమూ సర్వనాశనమయ్యాయి. మనం కూడా జీవితంలో అసూయను దరిచేరనివ్వకూడదు. లేదంటే జీవితం నరకప్రాయమవుతుంది. సుఖం, శాంతి.. రెండూ ఉండవు. ఆ విషయాన్నే ఈ 55 నుంచి కిందికి 12వ గడి వరకు వ్యాపించి ఉన్న పాము చెబుతుంది.
పాముల అమరిక ఇంత అర్థవంతంగా ఉంటే, ఇక నిచ్చెనల ఏర్పాటు మరింత పరమార్థ బోధకంగా ఉంటుంది.
ఉదాహరణకు 63వ గడిలో ఒక నిచ్చెన అడుగు భాగం ఉంటుంది. అక్కడ ‘భక్తి’ అని రాసి ఉంటుంది. అక్కడ ఒక భక్తుడి బొమ్మ ఉంటుంది. దాని కొస 83వ గడి వరకూ సాగి ఉంటుంది. అక్కడ ‘బ్రహ్మలోకం’ అని ఉంటుంది. బ్రహ్మదేవుడి బొమ్మ చిత్రించి ఉంటుంది. అంటే, భక్తిగా ఉండటమే బ్రహ్మలోకానికి చేరే ఉపాయం అన్నది పరం అయితే, ఏ పనినైనా భక్తితో చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయనేది ఇహం.
65వ గడిలో ఉండే నిచ్చెన నేర్పే పాఠం మరొకటి. ఈ గడిలో నిచ్చెన మొదలు ఉంటుంది. అక్కడ ‘చిత్తశుద్ధి’ అని ఉంటుంది. ఆ నిచ్చెన పై భాగం 105వ గడికి వ్యాపించి ఉంటుంది. అక్కడ ‘మహాలోకం’ అని రాసి ఉంటుంది. మొత్తం వైకుంఠపాళి ఆటలో ఇదే పెద్ద నిచ్చెన. 65వ గడిలో ఉండగా, మన చేతిలోని గవ్వలు నేర్పుగా పడ్డాయా.. నేరుగా 40 గడులను అధిగమించేసి.. 105వ గడికి ఎగబాకవచ్చు. ఇంతకీ దీనర్థం ఏమిటంటే.. చిత్తశుద్ధి ఉంటే మహాలోకాలు మనకు ఎదురేగి స్వాగతం పలుకుతాయని. ఈ నిచ్చెన చెప్పే అంతరార్థం ఇదే. చేసే పనిని చిత్తశుద్ధితో, శ్రద్ధతో చేస్తే మహాలోకాలు మన కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. మహాలోకానికి చేరుకున్నాక మనం మహా పురుషుడి కీర్తిని పొందుతాం అనే విశేషార్థం ఈ నిచ్చెనను అధిగమించడం వెనుక ఉంది.
గొప్ప గొప్ప జీవిత పాఠాలు నేర్పుతూనే, చెంతనే పొంచి ఉండే ప్రమాదాలనూ గుర్తించి జాగ్రత్తపడాలని హెచ్చరించడం ఆ ఆటలోని మరో ప్రత్యేకత.
సాధారణంగా 105వ గడి వరకు రాగానే, ఆటగాడిలో కొంచెం గర్వం తలెత్తుతుంది. ఇంకో పదహారు గడులు దాటేస్తే పరమపదం చేరిపోయినట్టేనని అనుకుంటాడు. సరిగ్గా అక్కడే ఎదురవుతుంది పెద్ద ప్రమాదం. 106వ గడిలో ‘అరుకాషుడు’ అనే అతి పెద్ద సర్పం ఉంటుంది. దాని నోట్లో పడితే అమాంతం కిందకు జారి, మొదటి గడిలోకి వచ్చి పడతాం. ఆ గడి పేరు ‘కోతి’. మహాలోకం చేరాను కదా.. నాకిక ఎదురు లేదు అని అనుకునేలోపే.. ఈ ప్రమాదం పొంచి ఉండటాన్ని బట్టి.. మనం జీవితంలో ఏ దశలోనూ గర్వాన్ని పొందకూడదని ఈ ఆట చెబుతుంది. ఇక్కడ చేసే పొరపాటు ఆటను మళ్లీ మొదటికి తెస్తుంది. వైకుంఠపాళి పరిభాషలో ఒకటిని ‘గుడ్డి’ అంటారు. అంటే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా గర్వించి ఒక్క గుడ్డి పని చేసినా మళ్లీ పాతాళానికి దిగజారిపోవడం ఖాయం అని 106వ గడి చెబుతుంది.
ఎంత పైకి వెళ్లినా.. ఎంత కిందికి జారినా.. ఆటను ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదనేది, ఆపకూడదనేది ఒక నియమం. ఒకడు పెద్దపాము నోట్లో పడినా, ఇంకొకడు ఇంకా పడలేదు కాబట్టి అతను ఇతడిని ఆడాలని ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్థిని సైతం బాగా ఆడాలని ప్రోత్సహించే ఏకైక ఆట బహుశా వైకుంఠపాళీయేనేమో!.
ఇక, చివరిదైనా.. చిన్నది కాదు మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే విషయం. చివరిలో 121వ గడిలో కూడా ఒక పాము ఉంటుంది. దాని పేరు ‘అహంకారం’. దాని తోక 99వ గడిలో ఉంటుంది. అక్కడ రాక్షసుడి బొమ్మ ఉంటుంది. అంటే 106లో ఆరుకాషుడిని దాటినా, 115లో వైకుంఠంలో ప్రవేశించినా, 117లో కైలాసంలో దివ్యానుభూతి పొందినా చివరిలో 121లో అహంకారానికి లోనైతే తిరిగి రాక్షస జన్మ తప్పదనేది ఇక్కడ నేర్పుకోవాల్సిన పాఠం. త్రిమూర్తులను తమ తపస్సులతో ప్రసన్నం చేసుకుని, మహాభోగాలు అనుభవించి లోకాలను జయించిన హిరణ్యకశిపుడు, రావణాసురుడు తదాది రాక్షసులు చివరకు రాక్షసులై దుర్మరణం పాలు కావడానికి ఈ అహంకారమే కారణం.
అంతిమంగా అహంకారం, మమకారం అనే రెండింటినీ జయించిన వాడే పరమపదం చేరుకోగలడు. అదే ఈ ఆట నేర్పే పాఠం.

కృష్ణుడి అల్లరి.. గణపతి ఆకలి
అప్పుడప్పుడే అడుగులు వేయడం మొదలుపెట్టిన బుల్లి కృష్ణుడు.. నడుస్తూ నడుస్తూ దబ్బున పడతాడు. శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి విబూది పూతలా మారింది. ఉంగరాల జుత్తును పైకి దువ్వి, ముత్యాలహారంతో వేసిన ముడి చంద్రవంకలా ఉందట. నుదుట నిలువుగా పెట్టిన ఎర్రటి తిలకం ఫాలనేత్రంతా, రత్నాలహారంలో నాయకమణిలా ఉన్న నీలమణి శివుడి కంఠాన ఉన్న నల్లటి మచ్చలా, మెడలోని ముత్యాలహారాలు సర్పహారాల్లా అనిపించి.. బాలకృష్ణుడు అచ్చు శివుడే అనిపించాడట!.
ఒకసారి పాలు తాగడానికి చిన్ని కృష్ణుడు పేచీ పెట్టాడు. యశోద నచ్చచెప్పి తాగించాలని చూసింది. కన్నయ్య వింటేనా! చివరకు, ‘పాలు తాగితే జుట్టు బాగా పెరుగుతుంది’ అందట యశోద. అంతే.. వెంటనే గుటుక్కున పాలు తాగేసిన కృష్ణయ్య, తన జులపాలు తడిమి చూసుకుని ఇంకా పెరగలేదేమిటని బుంగమూతి పెట్టాడట.
ఇంకోసారి, బాలకృష్ణుడు కథలు చెప్పాలని తల్లిని ఒకటే వేధించసాగాడు. కథలు పగలు చెప్పకూడదు. రాత్రికి చెబుతానని యశోద సముదాయించింది. ‘రాత్రి అంటే ఏమిటి?’ అని అడిగాడు బాలకృష్ణుడు.
‘చీకటిగా ఉంటుంది. ఏమీ కనిపించదు’ అని తల్లి బదులిచ్చింది. వెంటనే కన్నయ్య కళ్లు మూసుకుని, ‘ఇప్పుడు నాకేం కనిపించడం లేదు. కథ చెప్పు’ అన్నాడట. తల్లి యశోద కన్నయ్య తర్కశాస్త్ర ప్రావీణ్యానికి మురిసిపోయి ముద్దాడటం మినహా ఇంకేం చేస్తుంది?
ఒకసారి కుబేరుడు ఈశ్వరుడిని విందుకు ఆహ్వానించాడు. తాను రాలేనని, తన కుమారుడైన బుల్లి గణేశుడిని తీసుకువెళ్లాలని శివుడు చెప్పాడు. అలాగే, ‘అతడు మిక్కిలి ఆకలి గలవాడు. జాగ్త్రత సుమా!’ అని కూడా శివుడు హెచ్చరించాడు. తనకున్న ధనసంపదలతో వినాయకుడి ఆకలి తీర్చడం సమస్య కాదనుకున్నాడు కుబేరుడు. గణపయ్య విందుకు రానే వచ్చాడు. కుబేరుని సేవకులు రకరకాల పదార్థాలు తెస్తున్నారు. అవన్నీ క్షణంలో గణపయ్య బొజ్జలోకి చేరిపోతున్నాయి. చివరకు అతిథుల కోసం చేసిన వంటకాలూ గణపతికే అర్పణమైపోయాయి. అయినా ఆకలి తీరలేదు. ఆ భవనంలో ఉన్న వస్తువులనూ గణపతి మింగేయడం ప్రారంభించాడు. కుబేరుడు రెండు చేతులూ జోడించి ఇక ఆపాలని కోరాడు. ‘నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఇవ్వకపోతే నిన్నూ తినేస్తాను’ అన్నాడట గణపతి. కుబేరుడు కైలాసానికి పరుగెత్తాడు. అప్పుడు శివుడు ఒక పిడికెడు కాల్చిన బియ్యాన్ని ఇచ్చి.. ఇది గణపతికి నివేదించు అని చెప్పాడు. కుబేరుడు ఆ బియ్యాన్ని వినయంతో, ప్రేమతో గణపతికి నివేదించాడు. గణేశుడు సంతృప్తి చెంది శాంతించాడు.
చిన్నపిల్లల ఆటలే అంత. వారి అల్లరుల వెనుక ఉండే మర్మాలెన్నో!. ముద్దు ముద్దు మాటలు.. మురిపాల చేష్టలు.. అంతులేని ఆటలు.. మాయ తెలీని అమాయకత్వం.. అబ్బురమనిపించే ఆలోచనలు.. పందడి చేసే అల్లరులు.. ఇవన్నీ పిల్లలు పంచే వినోదాలే కాదు.. మన దేవుళ్లూ అనుభవించిన మనకు మిగిల్చిన అనుభూతులు.
సెప్టెంబరు 6: కృష్ణాష్టమి,
సెస్టెంబరు 19: వినాయక చవితి
- కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
జీవిత ధన్యత
తెలుగు పత్రిక ఆగస్టు 2023 సంచికలో ముఖచిత్రం కింద అందించిన ‘సిరి దేవత’ కథనం డిఫరెంట్గా ఉంది. లక్ష్మీదేవి గురించి మంచి విషయాలు తెలియపరిచారు.
అలాగే, జీవితానికి ధన్యత కలిగించేది సంపద కాదు.. ఆధ్యాత్మిక సాధన అనే విషయాన్ని భక్త తుకారాం కథ ద్వారా చాలా గొప్పగా, స్పష్టంగా, సరళంగా చెప్పారు.
- ఎన్.బాలచంద్ర, రాజశేఖర్, రాజేశ్, ఈశ్వరప్రసాద్, కె.రామచందర్రావు హైదరాబాద్, ఉమాశంకరప్రసాద్, రాజ్యలక్ష్మి, సురేశ్ మరికొందరు పాఠకులు
భారత కథలు
భారతంలో నీతి కథలు పిల్లలనే కాదు.. పెద్దలనూ అందరినీ చదివిస్తున్నాయి. ఇవి చాలా సరళంగా ఉంటున్నాయి. ఇలాంటి నీతి కథలను మరిన్ని మన తెలుగు పత్రిక ద్వారా పరిచయం చేయగలరని ప్రార్థన.
- పి.మనోహర్, తిరుపతి
వంటలు
మన ఆహారం శీర్షికన పురాతన వంటకాల గురించి వివరించడం బాగుంది. అలాగే, వాటిలోని పోషకాలు, వాటిని తినడం వలన కలిగే ఆరోగ్య రహస్యాల గురించి బాగా వివరిస్తున్నారు.
- రామ్.కె., అట్లాంటా
మంత్రపుష్పం
ఆగస్టు సంచికలో మంత్రపుష్పం శీర్షికన లక్ష్మీదేవి ముఖ్య నామాల గురించి విశ్లేషించడం బాగుంది.
- కావేరి, విజయవాడ

కృష్ణగారడి.. గణపతి సందడి
2023- సెప్టెంబరు 1,
శుక్రవారం, శ్రావణ బహుళ విదియ నుంచి
2023- సెప్టెంబరు 30, శనివారం,
భాద్రపద బహుళ పాడ్యమి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం-శ్రావణం -
భాద్రపదం - వర్షరుతువు-దక్షిణాయణం
ఆంగ్లమానం ప్రకారం తొమ్మిదవ మాసం సెప్టెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద మాసం. శ్రావణ మాసంలోకి కొన్ని రోజులు, భాద్రపదంలోని మరికొన్ని రోజుల కలయిక.. ఈ మాసం. సెప్టెంబరు 1, శ్రావణ బహుళ విదియ నుంచి సెప్టెంబరు 15 శ్రావణ బహుళ అమావాస్య వరకు శ్రావణ మాస తిథులు, ఆపై సెప్టెంబరు 18 భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి సెప్టెంబరు 30 భాద్రపద బహుళ పాడ్యమి వరకు భాద్రపద మాస తిథులు కొనసాగుతాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉపాధ్యాయ దినోత్సవం, అజ ఏకాదశి, వినాయక చవితి, పరివర్తన ఏకాదశి వంటివి సెప్టెంబరు మాసంలో వచ్చే ప్రధాన పండుగలు, పర్వాలు.
అటు శ్రావణ శోభ.. ఇటు వినాయక చవితి, ఇంకోపక్క ఆబాల గోపాలానికి ఇష్టమైన కృష్ణాష్టమి.. శ్రావణ, భాద్రపదాల కలయికలోకి సెప్టెంబరులో ఆధ్యాత్మికత వెల్లివిరిస్తుంది. భాద్రపద మాసం విశేషాల్లోకి వెళ్తే... అసలు ఆదిలో కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందనే వాదనలు కూడా ఉన్నాయి. మన తెలుగు మాసాలలో ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ఆ వరుసలో ఆరోగ్యానికి భద్రత కల్పించేది- భాద్రపదం. ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ఆయా మాసాల ప్రత్యేకత. ఈ క్రమంలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు చంద్రుడు ఆయా నక్షత్రాల్లో ఉంటే అది భాద్రపద మాసం అవుతుంది. తెలుగు నెలల వరుసలో ఇది ఆరవది. పూర్తి వర్ష రుతువు. వానలు మెండుగా పడతాయి. ఈ మాసంలో గృహ నిర్మాణం ఆరంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢం తరువాత మళ్లీ భాద్రపద మాసంలోనే ఆడపిల్లలు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోయేది. భాద్రపదంలో వచ్చే పర్వాల్లో ఆయా దేవతలకు నివేదించే ప్రధాన నైవేద్యం ఉండ్రాళ్లు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. సెప్టెంబరు నెలలో ఉండే వాతావరణం రీత్యా ఉండ్రాళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక వినాయకుడికీ ఇవంటే ఎంతో ప్రీతి. మన పెద్దలకు, పితరులకు ప్రత్యేక పూజలు చేయడానికి అవకాశం కల్పించే మహాలయ పక్షం ఈ నెలలోనే వస్తుంది. ఈనాడు విరివిగా దానాలు చేయడం రివాజు. ఇక, ఈ నెలలో వచ్చే పర్వాలు, పర్వదినాల గురించి తెలుసుకుందాం.
మన ఆరోగ్యాలకు పూర్తి భద్రత కల్పించే మాసం కాబట్టి దీనిని భాద్రపద మాసం అన్నారు. ఈ మాసంలో ఏకాన్న ఆహార వ్రతాన్ని ఆచరిస్తారు. దీనివల్ల ధనం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయని అంటారు. భాద్రపదంలో వచ్చే రుషి పంచమి నాడు స్త్రీలంతా రుషులను పూజించి ఉపవాసం ఉండాలి. అలా చేస్తే రుషుల అనుగ్రహంతో తమలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని అంటారు. పరివర్తన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే.. గృహస్తు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని అంటారు. భాద్రపద మాసంలో మరో ప్రత్యేకత.. మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తలుచుకోవడం, వారికి వైదిక కర్మలు నిర్వహించడం వంటివి ఈ పదిహేను రోజుల కాలంలో చేయాలని చెబుతారు. దీని తరువాత వచ్చే భాద్రపద అమావాస్య హిందువులకు చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే స్నానం చేసి, ఇష్టదైవాన్ని పూజించి దానధర్మాలు చేసిన అనంతరం పూర్వీకులకు (తల్లిదండ్రులు, ఇతర పెద్దలు) నైవేద్యం సమర్పిస్తారు. ఈనాడు నదిలో కాకుంటే చెరువులో స్నానం చేయడం ముఖ్యం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఆచరించాలి. అనంతరం నది తీరాన పూర్వీకులకు పిండ ప్రదానం సమర్పించాలి. అలాగే పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితురులకు శాంతి, విముక్తి లభిస్తాయని చెబుతారు. అలాగే, భాద్రపద అమావాస్య నాడు శనిదేవుడిని పూజించే ఆచారం కూడా ఉంది. రావి చెట్టు కింద ఆవగింజల నూనెతో దీపం వెలిగింది, పూర్వీకులను తలచుకుని, ఆ చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి. ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథుల సమయంలో విరివిగా దానధర్మాలు చేయాలని అంటారు.
శ్రావణ బహుళ విదియ
సెప్టెంబరు 1, శుక్రవారం
సెప్టెంబరు మాసపు తొలి తిథి.. శ్రావణ బహుళ విదియ. ఈనాడు అశూన్య వ్రతం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. ఈ రోజు మొదలు నాలుగు నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా కూడా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు విష్ణువు వాకుడు చెట్టును పరుపుగా చేసుకుని లక్ష్మీదేవితో కూడి శయనిస్తాడని ప్రతీతి. కాబట్టి ఈనాడు వీరిద్దరినీ పూజించడం శుభం.
శ్రావణ బహుళ తదియ
సెప్టెంబరు 2, శనివారం
శ్రావణ బహుళ తదియ తిథి నాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో కబ్జలీ తృతీయా వ్రతం చేయాలని ఉంది.
శ్రావణ బహుళ చవితి
సెప్టెంబరు 3, ఆదివారం
శ్రావణ బహుళ చవితి నాడు సంకష్ట చతుర్థీ వ్రతం ఆచరించాలి. దీనికే ‘బహుళా చతుర్థి’ అనే పేరు కూడా ఉంది. ఇది గణపతి సంబంధ పూజ. అలాగే, ఈనాడు గోపూజ చేయాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించే సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. శివుడు, రావణుడు, రాముడు, ధర్మరాజు, పార్వతి, దమయంతి, అహల్య తదితరులు గణపతిని ఉద్దేశించి సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించినట్టు వ్రత కల్పంలో ఉంది.
శ్రావణ బహుళ పంచమి
సెప్టెంబరు 4, సోమవారం
శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమిగా వ్యవహరిస్తారు. ఈనాడు రక్షా పంచమి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈనాడు నాగపూజ ఆచరిస్తారు.
శ్రావణ బహుళ షష్ఠి
సెప్టెంబరు 5, మంగళవారం
శ్రావణ బహుళ షష్ఠి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో రాశారు. హలం అంటే నాగలి. ఇది శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడి ఆయుధ చిహ్నం. ఇది వ్యవసాయ పనిముట్టు. అందుకే బలరాముడిని వ్యవసాయానికి ఆద్యుడిగా కొలుస్తారు. అందుకే ఈనాడు బలరామ జయంతిగా కూడా ప్రసిద్ధి. కర్షకులకు నాగలే దైవం. దానిని పూజించడానికి శ్రావణ బహుళ షష్ఠి ఒక అనువైన పర్వదినం.
అలాగే, సెప్టెంబరు 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. దీనినే గురుపూజోత్సవం అనీ అంటారు. తమకు చదువుసంధ్యలు చెప్పిన ఉపాధ్యాయులను గౌరవభావంతో సన్మానించడం, సత్కరించడం ఈనాటి ప్రధాన విధి.
శ్రావణ బహుళ సప్తమి
సెప్టెంబరు 6, బుధవారం
శ్రావణ బహుళ సప్తమి నాడు శీతలా సప్తమి వ్రతం ఆచరించాలి. ఇక, సప్తమి ఘడియల్లోనే కృష్ణాష్టమి పండుగను జరుపుకోవాలని మన తెలుగు క్యాలెండర్, పంచాంగాలలో ఉంది. కాబట్టి ఈనాటి ప్రధాన పర్వం- శ్రీకృష్ణ జన్మాష్టమి.
శ్రావణ బహుళ అష్టమి కృష్ణుని జన్మతిథి. కాబట్టి ఇది జన్మాష్టమిగానూ ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కాలాష్టమి, కృష్ణ జయంతి, శ్రీ జయంతి అనే పేర్లూ వ్యావహారికంలో ఉన్నాయి. కృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలంలో శుక్ల సంవత్సరం, శ్రావణ మాసం బహుళ పక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు రెండు యాయముల రాత్రి వేళ కారాగారంలో మేనమామ గండాన పుట్టాడు. కాబట్టి ఈ అష్టమి నాడు పగలంతా ఉపవసించి, సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. కృష్ణాష్టమి నాడు తిలామలక పిష్టం ఒంటికి పట్టించుకుని స్నానం చేయాలి. తులసీ దళాలు వేసిన నీటితో ఆచమించాలి. ఆనాడు ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఇంటి మధ్యలో గోమయంతో అలికి రంగవల్లి తీర్చిదిద్దాలి. దాని మీద బియ్యం పోసి మంటపం ఏర్పరిచి నూత్న కుంభం ఉంచాలి.
ఈ కొత్త కుండను గంధపుష్పాక్షలతో అలంకరించాలి. దానికి వస్త్రం చుట్టాలి. ఆ కలశం మీద బాలకృష్ణ ప్రతిమను ప్రతిష్ఠించాలి. తొలుత దేవకీదేవిని ప్రార్థించి, ఆపై కృష్ణ ప్రార్థన చేయాలి. అర్ధరాత్రి వరకు పూజ నిర్వహించాలి. పాలు, పెరుగు, వెన్న నైవేద్యంగా ఉంచాలి. చంద్రోదయ సమయాన బయటకు వెళ్లి అక్కడ అలంకృతమైన భూమిలో ఫలపుష్స చందన ంయుతమైన శంఖం చేత ఉదకం గ్రహించి చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి. తరువాత శంఖంతో నారికేళోదకం గ్రహించి కృష్ణుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ రాత్రి భగవత్కథలు వింటూ జాగరణం చేసి మర్నాడు భోజనం చేయాలి. ఇది కృష్ణాష్టమి నాటి విధాయ కృత్యం. ఈనాడు చాలాచోట్ల ఉట్టి కొట్టే పండుగను సరదా సంతోషాల మధ్య నిర్వహించడం ఆచారంగా వస్తోంది. వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ఉట్ల పండుగగానూ ప్రసిద్ధి. కృష్ణ జయంతి నాడు ఉపవసించి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడిని పూజిస్తే ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, మహా జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలతో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది. కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహా బల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధిరాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలన సాగించేవారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజును పట్టాభిషిక్తుడిని చేశాడు. కృష్ణాష్టమిని మహారాష్ట్రలో బుద్ధాష్టమిగా వ్యవహరిస్తారు. ఈనాడు మంగళగౌరీ వ్రతం జరుపుతారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
శ్రావణ బహుళ అష్టమి
సెప్టెంబరు 7, గురువారం
శ్రావణ బహుళ అష్టమి.. ఇస్కాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి. ఈనాడు ఇస్కాన్ వారు కృష్ణ జయంతిని నిర్వహిస్తారు. కృష్ణ + అష్టమి= కృష్ణాష్టమి. ఇది కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. శ్రావణ కృష్ణ పక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణ జన్మకు పూర్వమే ఈ రాత్రి ఉపాసకులను ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే. కృష్ణుడు జన్మించిన తిథి ఘడియలు కృష్ణాష్టమి అయితే, మహాశక్తి యోగమాయ జన్మించిన అదే తిథి కాలాష్టమి తిథి అయ్యింది. దైవీ గుణ సంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింప చేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది. అనంతమైనది. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్ రహస్యాలను తల లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంతాధి భావాలను ప్రకటించిన గోవిందుడి గాథ- వివిధ కోణాల్లో దివ్యత్వాన్ని ఆవిష్కరించింది. అవతార కాలంలోనే కాక, ఆ తరువాత కూడా తనను స్మరించి, ఆరాధించిన, కీర్తించిన యోగుల్ని తరింప చేసిన భగవానుడు కృష్ణుడు.
శ్రావణ బహుళ నవమి
సెప్టెంబరు 8, శుక్రవారం
శ్రావణ బహుళ నవమి తిథి నాడు చండికా పూజ నిర్వహించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. అలాగే, ఈ తిథి అరవింద యోగి జనన తిథి కూడా. భారతీయ యోగి పరంపరలో అరవింద యోగి ప్రముఖులు. ఈ తిథి నాడు కౌమార పూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.
శ్రావణ బహుళ ఏకాదశి
సెప్టెంబరు 10, ఆదివారం
శ్రావణ బహుళ ఏకాదశి తిథి అజైకాదశి. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథం ఈ ఏకాదశి తిథిని అజైకాదశిగా పేర్కొంది. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయిన హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ (బహుళ) ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. తత్ఫలితంగా ఆయన తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడని అంటారు.
ఇంకా, ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం చేయబడే దినం కావడం చేత ఈ తిథిని ‘కామికా ఏకాదశి’ అని కూడా అంటారు.
శావణ బహుళ ద్వాదశి
సెప్టెంబరు 11, సోమవారం
శ్రావణ బహుళ ద్వాదశి తిథి రోహిణీ ద్వాదశీ తిథి అని వ్రత గ్రంథాలలో ఉంది. అంతకుమించి ఇతర వివరాలేవీ లేవు.
శ్రావణ బహుళ త్రయోదశి
సెప్టెంబరు 12, మంగళవారం
శ్రావణ బహుళ త్రయోదశి ద్వాపర యుగాదిగా ప్రసిద్ధి. ఈ మేరకు ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ తిథి వివరాలను పేర్కొన్నారు.
శ్రావణ బహుళ చతుర్దశి
సెప్టెంబరు 13, బుధవారం
శ్రావణ బహుళ చతుర్దశి నాడు అఘోర చతుర్దశి వ్రతం ఆచరించాలని ఆమాదేర్ జ్యోతిషీలో పేర్కొన్నారు.
శ్రావణ బహుళ అమావాస్య
సెప్టెంబరు 14/15, గురు,శుక్రవారాలు
శ్రావణ కృష్ణ అమావాస్య పోలామావాస్యగా ప్రసిద్ధి. ఈనాడు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు. మహారాష్ట్రలో దీనిని పిఠోరి అమావాస్య అని, ఆమాదేర్ జ్యోతిషీలో కౌశ్యమావాస్య అని, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య అని వ్యవహరిస్తారు. ఇక, శ్రావణ బహుళ అమావాస్యను మన పంచాంగకర్తలు పోలాలమావాస్యగా పేర్కొంటున్నారు. తెలుగు నాట ఇది పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి. కాబట్టి ఈనాడు పోలాంబ వ్రతం ఆచరించాలని అంటారు. పోలేరమ్మ అనే గ్రామ దేవత ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది. కాగా, పోలి పేరుతో మరో అమావాస్య పర్వం కూడా అమల్లో ఉంది. అది కార్తీక బహుళ అమావాస్య నాడు వస్తుంది. అది పోలి స్వర్గానికి వెళ్లిన అమావాస్యంగా భావిస్తారు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు వచ్చే ఈ అమావాస్యను తెలుగునాట పోలాలమావాస్యగా వ్యవహరిస్తారు. గోదావరి జిల్లాల్లో పోలాల అమావాస్య అంటారు. ఈనాడు గోదావరి పొర్లి పొర్లి ప్రవహిస్తుందని నానుడి. మహారాష్ట్రలో పిఠోరి అమావాస్యగా దీనిని వ్యవహరిస్తారు. ఆమాదేర్ జ్యోతిషీ వ్రత గ్రంథంలో కౌశ్యమావాస్యగానూ, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య గానూ, ఉత్కల దేశంలో సప్తపూరికామావాస్య అనీ పిలుస్తారు.
పోలాలమావాస్యను ‘పోలామా’ అనీ అంటారు. పోల అంటే కడుపు నిండా మేత మేసి, నీరు తాగి పనిపాటు లేకుండిన ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. ‘పోలామా’ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. దీనిని బట్టి ఈ పర్వం వృషభ పూజకు ఉద్ధిష్టమైనదిగా భావించాలి. సాధారణంగా అమావాస్య నాడు రైతులు ఎద్దుల చేత ఏ పనీ చేయించరు. నాగలి కట్టరు. దుక్కి దున్నరు. ఏరువాక పున్నమ వచ్చే జ్యేష్ఠ పూర్ణిమ (జూన్) నాటి నుంచి వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరిక ఉండదు. శ్రావణ మాసానికి వచ్చే సరికి వ్యవసాయ పనులు తీరుతాయి. దీంతో ఎద్దులకు విశ్రాంతి ఇవ్వాలనే నియమంతో ఈ పర్వాన్ని ఏర్పరిచి ఉండవచ్చు.
శ్రావణ బహుళ అమావాస్య నాడు పిఠోరి వ్రతం చేయదగినది. ఈనాడు పొద్దుటే లేచి స్నానం చేసి శివుడిని ఉద్దేశించి బొమ్మల పూజ చేయాలి. గోడపై, కాగితంపై, నేలపై దేవతల బొమ్మలు, ఇంట్లో ఉన్న వస్తువుల బొమ్మలు, మంచం, బల్ల, పాత్రలు, ఇల్లు, ఆవులు, గేదెలు, గుర్రాలు.. వీటి బొమ్మలు గీయాలి. వాటికి ఐదు సంవత్సరాల పాటు పూజా నియమాలు చేసి ఉద్వాపన చేయాలి. ఇలా చేస్తే సమస్త వస్తు సమృద్ధి కలుగుతుందని అంటారు. ఇది దసరా, దీపావళి, సంక్రాంతి పర్వదినాల సందర్భంలో చేసే బొమ్మల కొలువు వంటిదన్న మాట.
భాద్రపద శుద్ధ పాడ్యమి
సెప్టెంబరు 16, శనివారం
భాద్రపద శుద్ధ పాడ్యమి భాద్రపద మాసపు తొలి తిథి. ఈనాడు ప్రత్యేకించి ఏ దేవుడి పూజాకృత్యం లేదని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. కానీ, ఈనాడు ఆడపడుచులు ఆడిపాడే సంప్రదాయం ఉంది. ఈనాడు పడుచులు పెందరాళే లేస్తారు. తలంటి పోసుకుంటారు. అనేక పిండివంటలు వండుతారు. భోజనానంతరం స్త్రీలు విలాసంగా పొద్దుబుచ్చుతారు. సాయంకాలం తిరిగి పిండి వంటలతో భోజనం చేస్తారు. పడకకు చేరే లోపుగా ప్రతి వారు జొన్న కంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలని నియమం. అయితే, ఈ పర్వం పేరేమిటో, దానికి సంబంధించిన నేపథ్యమేమిటో ఇదమిత్థముగా తెలియరాదు. అయితే, భద్రచతుష్టయ వ్రతం, మృగశీర్షా వ్రతం వంటివి ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద శుద్ధ విదియ
సెప్టెంబరు 17, ఆదివారం
భాద్రపద శుద్ధ విదియ కల్కి జయంతి దినంగా ప్రసిద్ధి.
భాద్రపద శుద్ధ తదియ
సెప్టెంబరు 18, సోమవారం
భాద్రపద శుద్ధ తదియ హరితాళిక వ్రతానికి ప్రసిద్ధి. తెలుగు నాట పదహారు కుడుముల తద్దిగా ఇది ప్రాచుర్యంలో ఉంది. సౌభాగ్యవంతమైన స్త్రీలు, కన్యలు ఆచరించే వ్రత పర్వమిది. ఈ వ్రతం ఆచరించే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందిందని పురాణగాథ. ఈనాటి పూజకు అరటి స్తంభాలతో మండపం నిర్మించి, వివిధ వర్ణాల పట్టుబట్టలతో, తోరణాలతో దానిని అలంకరించాలి. పూజ తరువాత ఉపవాసం ఉండాలి. ఉత్తర భారతదేశంలోనే ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉనికిలో ఉంది. ఇదే నాడు మన తెలుగు నాట పదహారు (16) కుడుముల తద్ది పర్వాన్ని జరుపుకుంటారు. ఇది నోము. పూర్వం ఓ రాజ కుమార్తె ఈ నోము సరిగా పరిసమాప్తి చేయలేదు. దీంతో మరుసటి జన్మలో ఆమె పేదరాలుగా పుట్టింది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడానికి అడవికి వెళ్లగా, పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై గతజన్మలో పదహారు కుడుముల తద్ది సరిగా ఆచరించని ఫలితంగానే ఈ కష్టాలు కలిగాయని చెబుతారు. అప్పుడు ఆ యువతికి పార్వతి స్వయంగా ఈ వ్రతాచరణ గురించి చెప్పింది.
రాకుమార్తె ఇంటికి వచ్చి పార్వతీదేవి చెప్పిన విధంగా భాద్రపద శుద్ద తదియ గడియల్లో తలంటి పోసుకుని పదహారు కుడుములు వండుకుని మూతపెట్టి చల్ల తెచ్చేందుకు తలుపు దగ్గరగా వేసి పొరుగింటికి వెళ్లింది. ఆమె వచ్చేలోపు కుక్క లోనికి ప్రవేశించి కుడుములు తినివేసింది. అయితే, ఈశ్వరార్పణంగా భావించి ఆ చల్ల కూడా కుక్కకే ఆమె పోసింది. ఆమె జంతుప్రేమకు పార్వతీదేవి మెచ్చి ప్రత్యక్షమైంది. ‘రాచబిడ్డా! కుక్క కుడుములు తినేసిందని విచారించకు. నీ భూత హితార్థబుద్ధికి మెచ్చుకున్నాను. నీకు నేను కావాల్సినంత సంపద ఇస్తున్నాను’ అని చెప్పింది.
ఆ ప్రకారమే ఆమెకు సంపద కలిగింది. దీంతో ఆమె ఏటేటా భాద్రపద శుద్ధ తదియ నాడు పదహారు కుడుములు వండి నైవేద్యం పెట్టి నోము ఆచరిస్తూ వచ్చింది. అప్పటి నుంచీ అది పదహారు కుడుముల తద్దిగా ప్రఖ్యాతి చెందింది.
భాద్రపదంలో ఇది చాలా విశేషమైన తిథి అని చెప్పాలి. ఈనాడు పదహారు కుడుముల తద్దితో పాటుగా, హరితాళికా వ్రతాన్ని ఆచరిస్తారు. ఉత్కల దేశంలో గౌరీ తృతీయ పేరిట నోము ఆచరిస్తారు. ఇంకా ఈనాడు కాంచన గౌరీ పూజ, ఉమా పూజ, కోటీశ్వరీ వ్రతం, అనంత తృతీయా వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి నాడే వరాహ జయంతి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద శుద్ధ చతుర్థి
సెప్టెంబరు 19, మంగళవారం
భాద్రపద శుద్ధ చతుర్థి (చవితి) వినాయక చవితిగా ప్రసిద్ధి. గణపతి మొత్తం దేవతల్లోనే విశిష్ట దైవం. విశేష రూపం, వాక్కులు, మనసు చేత ఏర్పడే దృశ్యాదృశ్య ప్రపంచం ‘గ’కారం. వాక్కులకు, మనసుకు అతీతమైన రూపాన్ని ‘ణ’కారం చేత సూచిస్తారు. ‘గం’ గణపతి బీజాక్షరం. గణపతి పృథ్వీతత్వానికి అధి దేవత. గణపతి చేతిలోని పాశం రాగాన్ని, అంకుశం తాళాన్ని సూచిస్తాయి. ఏకదంతం ఏకాగ్రతను, మోదకం ఆనందానికి ప్రతీకలు.
గణపతి ఏకదంతుడు. ఏకదంతం అద్వైత ప్రతీక. ఆయన చేతిలోని దంతం భగ్నలేఖిని. సృష్టిలో జ్ఞానం, విజ్ఞానం ఉన్నాయి. ఈ రెండూ ఒకటి కావు. అన్నింటిలోని ఒకే తత్వాన్ని వివరించి అనుభూతి కలిగించేది జ్ఞానం. దాన్ని విశ్లేషించేది విజ్ఞానం. విశ్లేషణ విభిన్నత్వాన్ని నిరూపిస్తుంది. జ్ఞానం ఏకత్వానికి ప్రతీక. విజ్ఞానం ఒక్కోసారి వైషమ్యాలను, అహంకారాన్ని కలిగిస్తుంది. గజముఖుని ఏకదంతం ఏకత్వానికి సంకేతం. భగ్నదంతం విజ్ఞానానికి సూచిక అని పండితుల భావన.
వినాయక ‘చవితి’ అయినా కానీ, ఇది వేర్వేరు చోట్ల అంతకంటే ఎక్కువ రోజులే ఆచరిస్తారు. మహారాష్ట్రలో 11 రోజులు, ఆంధ్ర దేశంలో 3, 5, 7, 9, 11 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ఈ దేవుడికి 21 మోదకాలు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు దేవునికి సమర్పించే పత్రిలో అతి పవిత్రమైనవి దూర్వా పత్రాలు (గరిక పోచలు). గజాననుడు మంగళాదైవతం. కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ చేయడం ఆచారమైంది.
తెలుగు నాట నాలుగు చతుర్థులు గణేశపరంగా ప్రసిద్ధం. అవి-
1) సంకష్ట చతుర్థి,
2) దూర్వా గణపతి (శ్రావణం లేదా కార్తీకంలో శుద్ధ చతుర్ధి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు),
3) సిద్ధి వినాయక వ్రతం (భాద్రపద శుద్ధ చతుర్థి),
4) కపర్ధి వినాయక వ్రతం (శ్రావణ శుక్ల చతుర్థి).
వంగ దేశంలో గణేశ చతుర్థి లేదు. దక్షిణ భారతంలో ఇది మిక్కిలి ప్రసిద్ధిం. దీన్ని కొన్నిచోట్ల రాళ్ల పండుగ అనీ అంటారు. రాజస్థాన్లో ఇది వివాహ నిశ్చయాలకు మంచి రోజు. విద్యను కోరే వారు చవితి తిథిలో సరస్వతీ పూజ చేయాలని అంటారు. కొన్ని వ్రత గ్రంథాలలో భాద్రపద చతుర్ధిని శివ చతుర్థిగా వర్ణించారు. త్రిమూర్తులు కూడా గణపతిని పూజిస్తారని ప్రతీతి.
భాద్రపద శుద్ధ పంచమి
సెప్టెంబరు 20, బుధవారం
భాద్రపద శుద్ధ పంచమి తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. దీని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది కేవలం ఆడవాళ్ల వ్రతం. భాద్రపద శుక్ల పంచమి మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి.
ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతాన్ని గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట.
విదర్భ దేశంలో ఉత్తంగుడు అనే బ్రాహ్మణుడి భార్య సుశీల మిక్కిలి పతివ్రత. వీరికి ఒక కొడుకు, ఒక కుమార్తె. కొడుకు వేద పండితుడు. కూతురు దురదృష్టవశాత్తూ చిన్న వయసులోనే బాల వితంతువు అయ్యింది. ఈ కష్టంతో ఉత్తంగుడు గంగా తీరవాసి అయి బ్రహ్మచారులకు వేదం చెబుతుండే వాడు. కూతురు అతనికి సపర్యలు చేస్తుండేది. ఒకనాడు ఆ బాలిక శరీరం నుంచి పురుగులు పడ్డాయి. వాటిని చూసి భయంతో ఆమె స్ప•హ తప్పి పడిపోయింది. అప్పుడు తల్లి ఆమెను తండ్రికి చూపగా, అతను దివ్యదృష్టితో ఆమె పూర్వజన్మలో బ్రాహ్మణ బాలిక అయి ఉండి, రజస్వల అయిన నాడే ఇంట్లోని వస్తువులు ముట్టుకున్నట్టు గ్రహించాడు. అంతేకాక, నాడు ఆమె రుషి పంచమి వ్రతాన్ని ఆచరించే వారిని చూసి నవ్వింది. అందుకు ఆమె శరీరం క్రిమిగ్రస్తమైంది.
రుషి పంచమి వ్రతాన్ని ఆచరిస్తే ఈ దోషం పోతుంది. ఈ వ్రతాచరణ వల్ల రజస్వలగా ఉండి అజ్ఞాతంగా చేసే తప్పుల్ని పోగొట్టుకోవచ్చని అంటారు.
ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. ఈ వ్రతం గురించి చాలామందికి తెలుసు కానీ, ఆచరించే వారు తక్కువ.
భాద్రపద శుద్ధ షష్ఠి
సెప్టెంబరు 21, గురువారం
భాద్రపద శుద్ధ షష్ఠి నాడు సూర్యపూజ చేయాలని ప్రముఖ వ్రత గ్రంథమైన పురుషార్థ చింతామణిలో ఉంది. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది. ఈనాడు స్కంద (కుమారస్వామి) దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది.
భాద్రపద శుద్ధ సప్తమి
సెప్టెంబరు 22, శుక్రవారం
భాద్రపద శుద్ధ సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలని, దీనినే ఆముక్తాభరణ వ్రతం అని అంటారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వంలో రాశారు. ఇంకా చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్ జ్యోతిషీలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని రాశారు.
భాద్రపద శుద్ధ అష్టమి
సెప్టెంబరు 23, శనివారం
భాద్రపద శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిథి. ఈనాడు దుర్గాదేవిని విశేషంగా పూజించాలి. అలాగే, మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ ఈనాడు దేశంలోని కొన్ని ప్రాంతాలలో నిర్వహించుకునే పర్వం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
భాద్రపద శుద్ధ అష్టమి నాటి సాయంకాలం ప్రతి ఇంటి నుంచి ఒక యువతి బయల్దేరి బయటికి వచ్చి కొన్ని బొమ్మరాళ్లు ఏరుతుంది. వాటిని ఒక కుండలో వేస్తుంది. ఆ కుండకు తాడు పోసి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది. ఆపై బొమ్మరాళ్లను ఒక పళ్లెంలో పెడుతుంది. ఆ నూతి పక్కనే వాటికి పూజ చేస్తుంది. అనంతరం ఒక చిన్న గంట పుచ్చుకుని వాయిస్తూ బొమ్మరాళ్లతో కూడిన పళ్లాన్ని పట్టుకుని ఇంట్లోకి వస్తుంది. ఈలోగా ఇంటిలోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకాల్లో ముంచి నేల మీద అద్ది ఆనమాళ్లు వేస్తారు. సింహద్వారం వద్ద, ఇంటి నిండా ఇలాగే ఆనమాళ్లను వేస్తారు. బొమ్మరాళ్ల పళ్లాన్ని గొనివచ్చిన బాలిక ఈ ఆనమాళ్ల మీదనే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. అప్పుడు స్త్రీలు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెబుతారు. ఈ బొమ్మరాళ్లను మామూలుగా దేవతార్చన జరిగే చోట పెడతారు. మర్నాడు సాయంకాలం వరకు అవి అక్కడనే ఉంటాయి. అప్పుడు పేరంటాళ్లను పిలిచి వేడుక చేస్తారు. పసుపు, కుంకుమలు ఇస్తారు. కొద్దిగా కొబ్బరి, గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈనాటి ప్రధాన ప్రసాదం.
మర్నాడు మళ్లీ ఆ బొమ్మలను పూజిస్తారు. పెరుగు అన్నం నైవేద్యం పెడతారు. ఆ మీదట బొమ్మరాళ్లను తీసుకెళ్లి నూతిలో వేస్తారు. వేస్తూ వేస్తూ మీదటికి మళ్లీ వచ్చేటప్పుడు మీతో ఆనందాన్ని, సుఖాన్ని తీసుకురండి అంటారు.
భాద్రపద శుక్ల అష్టమికి రాధాష్టమి అని కూడా పేరు. శ్రీకృష్ణుడి యందు తన చిత్తాన్ని లయింపచేసిన రాధ కృతార్థత పొందిన శుభదినం ఇదేనని చెబుతారు. ఈనాడు రాధాకృష్ణులను పూజించిన వారికి సంసార సుఖం అగ్గలమవుతుంది.
భాద్రపద శుక్ల అష్టమి నాడు గౌరీపర్వం కూడా కొన్నిచోట్ల ఆచరిస్తారు. ఈ పండుగ వినాయక చవితి వెళ్లిన మూడు రోజులకు ఆరంభమై మూడు రోజులు ఉంటుంది. గణపతి తల్లి, శివుని భార్య అయిన పార్వతికి ఇది అత్యంత ప్రియకరమైన దినాలని అంటారు.
ఈ అష్టమి ఒకవేళ గురువారంతో కూడి వస్తే కనుక, ఈ తిథిని గుర్వష్టమి అనీ అంటారు. దీనినే నీలమత పురాణంలో అశోకికాష్టమిగా వర్ణించారు.
భాద్రపద శుద్ధ నవమి
సెప్టెంబరు 24, ఆదివారం
భాద్రపద శుద్ధ నవమి గురించి వివిధ గ్రంథాలలో వివిధ రకాలుగా ఉంది. పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా ఈ తిథిని ఎంచుతారని అంటారు. దీనిని వారి భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం చేస్తారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
భాద్రపద శుద్ధ దశమి
సెప్టెంబరు 25, సోమవారం
భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతారాలను పూజించాలని అంటారు. ఈ కారణంగానే దీనికి దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త అనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు.
దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు.
భాద్రపద శుద్ధ ఏకాదశి
సెప్టెంబరు 25, సోమవారం
భాద్రపద శుద్ధ దశమి తిథి ఘడియల్లోనే ఏకాదశి తిథి కూడా ఉంది. కాబట్టి ఏకాదశి కూడా సెప్టెంబరు 25గానే భావించాలి. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు పరివర్తన ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏకాదశినే వామన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలు అవుతుంది. ఆయన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి అని పేరు వచ్చింది.
ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సంధ్యాకాలంలో జరగడం కొన్నిచోట్ల ఆచారంగా ఉంది. అలాగే, ఈనాడు కటదానోత్సవం అనే వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
కటము అంటే చాప. కటకారుడు అంటే చాపలు అల్లేవాడు. అంటే ఈనాడు చాప దానం చేయాలి.
భాద్రపద శుద్ధ ద్వాదశి
సెప్టెంబరు 26, మంగళవారం
భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు వామన జయంతి పర్వమని అంటారు. అలాగే ఇది కల్కి ద్వాదశి దినం కూడా. విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ఇది ప్రియమైన దినమని అంటారు. వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని అయిన అదితికి, కశ్యప రుషి వల్ల పుట్టిన వాడు. విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులంలో పుట్టిన బలి గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువు అభిమానాన్ని చూరగొన్నాడు. దీంతో అతనికి గర్వం కలిగి దేవతలను బాధించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు శేష నారాయణుని సన్నిధికి వెళ్లి బలి బాధ పోగొట్టవలసిందిగా కోరారు. అయితే బలి తన ఇష్ట భక్తుడు కావడంతో అతని జోలికి వెళ్లడానికి విష్ణువుకు ఇష్టం లేదు. అయితే, దేవతల బలవంతంతో ఆయన వామనమూర్తి అయిన బ్రాహ్మణ యాచకుని వేషంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు. బలి సింహాసనంపై నుంచి లేచి దానిపై వామనుడిని కూర్చోబెట్టాడు. మిక్కిలి వినయంతో రాకకు కారణం అడిగాడు. తన వేద పఠనానికి తనకు ‘త్రిపద్భూమి’ కావాలని వామనుడు కోరాడు. త్రిపద్భూమి అంటే మూడు అడుగుల నేల. బలి అలాగే ఇస్తానన్నాడు. మంత్రయుక్తంగా ఆ దానం చేయడానికి బలి తన గురువైన శుక్రుడికి కబురంపాడు. శుక్రుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి బలికి అసలు విషయం చెబుతాడు. దానం ఇవ్వడంతోనే నిన్ను పాతాళానికి తొక్కివేస్తాడని కూడా అంటాడు. అయినా సరే, తాను ఆడిన మాట తప్పనని బలి అంటాడు. అంతట వామనుడు ్ర•హ్మాండాంత సంవర్థియై ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో పాదం బలి నెత్తి మీద ఉంచి అతనిని పాతాళంలోకి తొక్కివేశాడు.
హేమాద్రి, భవిష్య పురాణాలలోని కథ ఇది. భాద్రపద మాస శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రంలో వామనావతార జయంతి ఉత్సవం జరుపుతారు. దీనిని విజయ ద్వాదశి అనీ అంటారు. వామన ద్వాదశికి ముందు ఏకాదశి ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేసి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. విగ్రహానికి శిఖ, సూత్రం, యజ్ఞోపవీతం, కమండలువు ఉండాలి. శ్రవణ ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి బ్రహ్మహత్యా దోషాలు పోతాయి.
భాద్రపద శుద్ధ త్రయోదశి
సెప్టెంబరు 27, బుధవారం
భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఈనాడు మొదలుకుని మూడు రోజులు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద శుద్ధ చతుర్దశి
సెప్టెంబరు 28, గురువారం
భాద్రపద శుద్ధ చతుర్ధశి తిథి అనంతుని పూజకు విశేషమైనది. ఈనాడు చేసే పూజా కార్యకలాపాన్ని అనంత వ్రతమని అంటారు. అనంతుడు అనేది త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు పేర్లలో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనదని స్మ•తి దర్పణం అనే వ్రత గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు పాలీ చతుర్దశీ వ్రతం, కదలీ వ్రతం ఆచరించాలని ఉంది. ఉత్కళ దేశంలో దీనిని అఘోర చతుర్దశి అంటారని ఆమాదేర్ జ్యోతిషీ వ్రత గ్రంథంలో రాశారు. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యము. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది.
మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు.
భాద్రపద శుద్ధ పౌర్ణమి
సెప్టెంబరు 29, శుక్రవారం
భాద్రపద శుద్ధ పూర్ణిమ అనేక విధాలుగా ప్రతీతమై ఉంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు మంచిది కాకపోయినా, వీలులేక పోయినా ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు.
ఈనాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది.
భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది.
ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది.
నైష్కియులకు పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు.

పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక
దేవుడి పెండ్లి
దేవుని గుడిలో - దేవర పెండ్లి
చక్కగ తీర్థం - సాగించారు
పిన్నలు పెద్దలు - వేంచేశారు
బాజాలవిగో - వాయించారు
నిండా మెరసిన - జెండాకట్టి
తావుల నింపే - దండలు చుట్టి
గణగణ మ్రోగే - గంటలు గట్టి
స్వామిని రథమున - సాగించారు
బాలకురాలా! - పాటలు పాడుచు
బాలికరాలా! - భజనలు చేయుచు
రండీ వేంకట - రమణుని చూడగ
రండీ రండీ - రథమును లాగ
భజనలు
పొద్దు పొద్దున లేద్దామా!
అక్కల్లారా పోదామా!
పోయి పువ్వులు తెద్దామా!
తెచ్చి దండలు గుచ్చుదామా!
గుచ్చి రాముని మెడలో వేద్దామా!
అందరం రాముని భజనలు చేద్దామా!
ప్రార్థన
పొద్దున్నే పొద్దున్నే లేద్దామా?
అందుగల పూవులు కోద్దామా?
కోసినవి రాసులు పోద్దామా?
దేవుడి గుళ్లోకి పోదామా?
కిర కిర తలుపులు తీద్దామా?
దేవుడి మెళ్లో వేద్దామా?
జేజేలు
లాలను పోసీ
పాలను తాపీ
జోలను పాడే
అమ్మకు జేజేలు
నడువగ చూచీ
అడిగినవన్నీ
తడియక ఇచ్చే
నాన్నకు జేజేలు
మాటలు నేర్పే
ఆటలు నేర్పే
పాటలు నేర్పే
గురువుకు జేజేలు
గోవిందుడమ్మా
గోవిందుడమ్మ - గోపాలుడమ్మా!
కొబ్బరి బెల్లమూ కొని తెచ్చెనమ్మా!
ఏడు మేడలు మీద నన్నుంచెనమ్మ
ఏడాదికోసారి తావచ్చెనమ్మ
గజ్జెల్ల పాపణ్ణి నే గంటినమ్మ
ఎత్తుకుని ముద్దాడ తానెవ్వరమ్మ
చిక్కుడు చెట్టు కింద కొస్తే ఛీఛీ అనిపిస్తు
కాకరచెట్టు కిందకొస్తే కాదు కాదనిపిస్తు
పొట్ల చెట్టు కిందకొస్తే పోపో అనిపిస్తు
పల్లెటూరు గనక బతికిపోయాడు
పట్నవాసమైతే పట్టుకు తన్నిస్తు
మాతృపూజ
అరటిపళ్లు కొబ్బరికాయలు అమ్మవారికి
పూటుగా ధనమంత - పూజారికి
చెంగల్వ పూదండ - సీతామాలక్ష్మికి
చేతిల కాసులు - సన్యాసికి
భక్తితో మొక్కాలి - మా అమ్మకూ
చేతులు జోడించి - చెలువు మీర
తల్లి కంటే వేరు దైవం
ఇలను లేదు ఎంచి చూడ
తల్లిగాచు ఎపుడు మనల
పాలు ఇచ్చి పెంచుచుండు
ఎందుగానీ ఏమీరానీ
తల్లి మనకూ త్రోవ జూపు
మాతృ పూజా మనకు మేలు
మాతృ సేవా మనకు చాలు
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
September 24, 2023
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40

Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia