Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page
ఊరికో క్రాంతి.. సంబరాల సంక్రాంతి
భారతీయ సంప్రదాయంలో సామూహికంగా నిర్వహించుకునే పండుగలు, పర్వాలు ఎన్ని ఉన్నా సంక్రాంతి సంబరాలకు మాత్రం మరేదీ సాటి రాదు. ‘జనమంతా మనవాళ్లే.. ఊరంతా మన ఇల్లే’ అన్నట్టుగా సంక్రాంతి వేడుకలను నిర్వహించుకుంటారు. ఎన్ని పనులున్నా ఎలాగైనా తీరిక చేసుకుని ఊరికి వెళ్లడం.. మూడు రోజుల పాటు బంధుమిత్రులతో సరదాగా గడపడం.. ఈ సందర్భంగా మమతానుబంధాలను పెంపొందించుకోవడం అనేది ఒక్క సంక్రాంతితోనే సాధ్యం. భోగిమంటలు, అందమైన ముగ్గులు, పిండివంటలు.. గంగిరెద్దుల ఆటలు.. హరిదాసు కీర్తనలు.. పగటి వేషగాళ్ల కోలాహలం.. ప్రభల తీర్థాలు.. ఇదే కదా సంక్రాంతి అంటే.. అంటారా?! అయితే, ఇదే కాదు.. ఇంతకుమించి కూడా అంటున్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పల్లెలు. అసలు సంక్రాంతి అంటేనే పల్లె పండుగ. ఆ పల్లెలు ఈ పండుగ స్వరూపాన్ని, పరమార్థాన్ని మార్చేసి ఆదర్శ ‘క్రాంతులు’ నింపుతున్నాయి. నిజానికి ఇప్పుడు పండగంటే అర్థం మారిపోయింది. సంక్రాంతి వచ్చిందంటే కోడిపందేలు, నంబర్ల ఆట, జూదం తప్ప మరేమీ కాదనేంతగా ఒక దురభిప్రాయం వేళ్లూనుకుపోయింది. ఇలాంటి దురభిప్రాయాలను పటాపంచలు చేస్తూ ‘పండగంటే కొత్తబట్టలు వేసుకుని, పిండివంటలు తిని.. కోడిపందేలు చూడ్డం కాదు.. పండగంటే నిన్నూ నన్నూ ఒక్కటి చేసే సందర్భం.. పండగంటే కొత్తకాంతులు నింపడం.. పండగంటే ఆదర్శంగా నిలపడం.. నిలవడం..’ అని నిరూపిస్తున్నాయి మన పల్లెలు. అందుకే సంక్రాంతి తీరు మార్చుకుంటోంది. పేరుకు తగ్గట్టే కొత్త కాంతులు, క్రాంతులు తెస్తోంది. సంక్రాంతి అంటే పండగ సంబరం.. సందడి. అంతేనా? ఆ పండగకి, ఆ సంబరానికి, ఆ సందడికి మించి ఇంకా చాలా ఉందంటోంది నేటి తరం. సొంతూరికి వెళ్లే తప్పనిసరి సందర్భం- సంక్రాంతి. సంవత్సరానికి ఒకసారైనా అయిన వాళ్లను, మిత్రులను, ఊరి వాళ్లను చూడాలి.. వాళ్లతో మాటలు కలపాలి. పండగ సందడిని, ఆనందాన్ని పంచుకోవాలి. మనం పుట్టి పెరిగిన పల్లెలోని మట్టివాసనను ఆస్వాదించాలి. కొత్త పరిచయాలు పెంచుకోవాలి. బంధుత్వాలను పటిష్టం చేసుకోవాలి. పల్లె భాషలో నోరారా అందరినీ పలకరించాలి. అలాంటి ఊరితో బంధాన్ని పెనవేసుకోవడానికి సంక్రాంతిని మించిన పెద్ద పండుగ మరేముంది? అందుకే రైల్లో టికెట్ కన్ఫామ్ కాకపోయినా, బస్సులో సీటు దొరక్కున్నా.. సంక్రాంతికి అందరూ పడుతూ లేస్తూ అయినా సరే ఎలాగోలా సొంతూరికి వెళ్లిపోతారు. కేవలం ఈ ఆనందం కోసమేనా? అంటే కాదని చాలా ఊళ్లు అంటున్నాయి. ఎందుకంటే, సంక్రాంతి సందర్భంగా తమకంటూ కొన్ని సంప్రదాయాలను ఏర్పర్చుకున్నాయి తెలుగునాట కొన్ని పల్లెలు. అందుకే పండక్కి మించిన ఆ ఆనందాన్ని ఆస్వాదించేందుకు, ఆ సంప్రదాయాలను నిలుపుకునేందుకు ఎక్కకున్నా సరే.. సొంతూరికి వెళ్లడం తప్పనిసరి. మరి, అలాంటి ఊళ్లేం ఉన్నాయి? ఆ ఊళ్లలో సంక్రాంతి సమయంలో ఆచరించే సంప్రదాయాలేమింటే..?! పాచలవలస.. సరికొత్త ‘రంగస్థలం’ ఆంధప్రదేశ్లోని విజయనగరం జిల్లా పాచలవలస మొత్తం రైల్వే ఉద్యోగులే. విజయవాడ నుంచి ఒడిశాలోని టిట్లాగడ్, భువనేశ్వర్ రైల్వేస్టేషన్ల వరకు ఈ ఊరికి చెందిన వారు వివిధ విభాగాల్లో పని చేస్తున్నారు. పాచలవలస వర్షాధార ప్రాంతం. కాబట్టి సొంతూరులో పని లేని వారంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లిపోతారు. వీరంతా సంక్రాంతికి కచ్చితంగా సొంతూరు వస్తారు. ఏదో మూడు రోజులు అందరూ కలుసుకోవడం.. కబుర్లు కలబోసుకోవడం.. మళ్లీ ఎవరి దారి వారు చూసుకోవడం.. ఇదేం నచ్చలేదు ఆ ఊరిలోని యువతరానికి. సంక్రాంతి సంబరానికి మించిన ఆనందాన్ని మరేదైనా సృష్టించాలనుకున్నారు. అంతే.. ఆరేళ్ల క్రితం మొదలైన ఆ కొత్త సంప్రదాయం ప్రతి ఏటా సంక్రాంతికి కొత్త క్రాంతులు, కాంతులు వెదజల్లుతూనే ఉంది. ఇంతకీ, ఈ ఊళ్లో ఏం చేస్తారంటే.. సంక్రాంతి నాడు సాయంత్రం సాంస్క•తిక కార్యక్రమాలకు రంగం సిద్ధం చేస్తారు. పిల్లాజెల్లా, పెద్దలు అంతా ఈ వేదిక వద్దకు చేరుకుంటారు. గ్రామ పెద్దలు తమ ఊరి చరిత్రను, ఆనాటి పరిస్థితులనూ, అనుభవాలనూ, నాటి జీవన విధానాలనూ కథలు చెబుతుంటే.. యువత చెవులప్పగించి ఆసక్తిగా ఆలకిస్తుంది. చదువులోనూ, ఉద్యోగంలోనూ ప్రతిభ చాటిన వారిని ఇదే వేదికపై సత్కరిస్తారు. ఇది పిల్లలకూ, పెద్దలకూ ప్రేరణగా నిలుస్తోంది. అలాగే వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందచేస్తారు. పాచలవలస కళాకారుల ఊరు కూడా. తమలోని కళాభిరుచిని చాటడానికి ఊళ్లోని కళాకారులంతా ఈ వేదికను ఉపయోగించుకుంటారు. శ్రీరామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాల్లోని పద్యాలు పాడుతుంటే ఊరి జనమంతా చప్పట్లతో ప్రోత్సహిస్తారు. ఈ ఊరికి చెందిన యువకులే తలా కొంత వేసుకుని సంక్రాంతి సందర్భంగా ఈ సంప్రదాయాన్ని ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఊరి దీపం.. కొవ్వలి సాధారణంగ సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడ ఉన్న వారో సొంతూరికి వస్తారు కదా! కానీ, అక్కడ జరిగే వేడుకను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో కూడా వస్తుంటారు. ఇంతకీ ఆ ఊరి విశేషం ఏమిటంటారా?! సంక్రాంతి అంటే ఒకప్పుడు భోగిమంటలు, ముగ్గులు, పిండివంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలూ.. ఇలా ఎటుచూసినా సందడే. కానీ, రాన్రాను సంక్రాంతి పండగంటే అర్థం మారిపోయింది. కోడిపందేలు, పేకాట, గుండాటలు ఆడుతూ ఎంజాయ్ చేయడం పరిపాటయింది. అయితే పండగంటే ఇది కాదని చెప్పే యత్నంలో సఫలీకృతమైది ‘గ్రామదీప్’ స్వచ్ఛంద సంస్థ. ఆంధప్రదేశ్లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని కొవ్వలి గ్రామ కథ ఇది. ఈ ఊళ్లోని వారు ఉపాధి, ఉద్యోగాల పేరుతో తరలిపోయారు. ఊళ్లోని ఇళ్లన్నీ ఖాళీ అయిపోయాయి. వలస వెళ్లిన వారు పండక్కి వచ్చినా.. ఫోన్లు, స్నేహితులతో షికార్లు వంటి వాటితో గడిపేవారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేసింది ఈ స్వచ్ఛంద సంస్థ. ఇప్పుడక్కడ పండుగంటే ఊరందరిదీ. గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ పండుగ సంబరాల్లో పాల్గొనాల్సిందే. గ్రామానికి చెందిన వైద్యురాలు గ్రామాభివృద్ధికి తలా ఒక చేయీ వేయాల్సిన అవసరాన్ని గుర్తించి ఆహ్వానపత్రికలు ప్రచురించి అందరికీ పంచుతారు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపేవారు. దీంతో తక్కువ సమయంలో గ్రామదీప్ సంస్థకు మంచి పేరు వచ్చింది. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా కనెక్ట్ అయ్యారు. సంస్థ కార్యకలాపాల్లో తామూ భాగస్వాములు కావడం ప్రారంభించారు. సంక్రాంతి మూడు రోజులూ ఊళ్లోని ఉన్నత పాఠశాలను వేదికగా చసుకుని కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. భోగిమంటలతో మొదలుపెట్టి చిన్నారులకు భోగిపండ్లు వేయడం, ముగ్గుల పోటీలూ, గాలిపటాలూ, పిండివంటలూ, భోజనాల వరకూ అన్నీ సామూహికంగా చేయాల్సిందే. తెల్లవారుజామున మొదలుపెడితే రాత్రి వరకూ ఒకదాని తరువాత ఒకటి ఉత్సాహంగా చేస్తూనే ఉంటారు. ఇక్కడ జరిగే సంక్రాంతి వేడుకలు చూసేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారంటే సంబరాలు ఎంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ సంస్థ గ్రామాభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోంది. ఖాళీ ప్రదేశాల్లో సంస్థ సభ్యులు మొక్కలు నాటతారు. ఇలా నాటగా పెరిగిన చెట్లతో కొవ్వలి ఐక్యతా వనాన్ని తీర్చిదిద్దుకున్నారు. రహదారులను బాగు చేసుకున్నారు. గోడలను అందమైన చిత్రాలతో అలంకరించారు. నలుగురు కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి వీలుగా వీధుల్లో అక్కడక్కడా సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. నేచర్ వాక్ పేరుతో మహిళలు, పిల్లలూ నడిచేందుకు వీలుగా బాట వేశారు. నిస్సహాయ, ఒంటరి మహిళలను దత్తత తీసుకుని వారికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అండగా నిలుస్తున్నారు. పండగంటే మనమొక్కరమే సంబరాలు చేసుకోవడం, ఆనందం పంచుకోవడం కాదు.. అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం, ఊరికి వెలుగులు పంచడం అనే భావనతో ఈ గ్రామదీప్ సంస్థ ఊరికి వెలుగులనిస్తోంది. కోరికలు తీరితే యాచన.. మన కోరికలు నెరవేరాలని దేవుడికి మొక్కుకోవడం సహజం. ఆ కోరికలు తీరితే.. ఇష్టదైవానికి ముడుపులూ, కానులకూ, నైవేద్యాలు సమర్పించడం కూడా సహజం. కానీ, ఆంధప్రదేశ్లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొప్పవరంలో జరిగే సత్తెమ్మతల్లి ఆలయంలో మాత్రం విచిత్రమైన వేషాల్లో బిచ్చమెత్తి మొక్కు తీర్చాలి ఉంటుంది. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా నిజం. ఈ ఊళ్లో రెండు సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి తరువాత సత్తెమ్మతల్లి జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా విచిత్ర వేషాల్లో పుట్ట దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం పూజారితో బెత్తం దెబ్బలు తింటే పాపాలు పోతాయనేది వీరి నమ్మకం. దాంతోపాటు కోరిన కో•ర్కెలు తీరిన భక్తులంతా ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేసి.. యాచించిన వాటిని అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీ. భక్తులను ఇలా రకరకాల వేషధారణల్లో అలంకరించడానికి ఎందరో మేకప్ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్ డిజైనర్లు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ జాతర భక్తులకు ఆధ్యాత్మికతను పంచుతుండగా, మరికొందరికి ఉపాధిని కల్పిస్తోంది. గోడెక్కిన ముగ్గు ధనుర్మాసం ప్రారంభంతోనే ముంగిళ్లకు పండుగ కళ వచ్చేస్తుంది. నెల రోజుల ముందు నుంచే గుమ్మాలను పెద్ద పెద్ద ముగ్గులతో అలంకరించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడం మన ఆనవాయితీ. త్రిపుర రాజధాని అగర్తలకు సమీపంలో ఉన్న లంకముర గ్రామంలోనూ సంక్రాంతిని పురస్కరించుకుని రంగురంగుల రంగవల్లులు కనువిందు చేస్తుంటాయి. అయితే, అక్కడ మనలా గుమ్మాల ముందు ముగ్గులు వేయరు. ఇంటి గోడలనే అందమైన రంగవల్లులతో తీర్చిదిద్దడం లంకముర వాసుల ప్రత్యేకత. నిజానికి గోడలపై రకరకాల బొమ్మలు వేసి అలంకరించుకోవడం పశ్చిమబెంగాలీయుల సంప్రదాయం. అందుకే బెంగాలీలు అధికంగా ఉండే లంకముర గ్రామంలోనూ అదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే గోడలపై శాశ్వతంగా ఉండిపోయే రంగులతో కాకుండా ముగ్గు చాక్పీస్లతో రంగవల్లులను తీర్చిదిద్దు తుంటారు. మనం ధనుర్మాసంగా పిలుచుకునే నెలని అక్కడ పోస్ పర్చన్ అంటారు. డిసెంబర్లో మొదలుపెట్టి సంక్రాంతి రోజు వరకూ గోడలపై ముగ్గులు వేస్తూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటారు. ముస్లింలకీ సంక్రాంతి.. సాధారణంగా సంక్రాంతి పండుగను హిందువులే చేసుకుంటారు కదా! కానీ ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో ఉన్న ఖాంటపాడా, బారునసింగ, బెగునియా, శ్రీజంగ్, ససంగ్, తుండ్ర గ్రామాల్లోని ముస్లింలు కూడా సంక్రాంతి సందర్భంగా తమ ఇంటి గుమ్మాలను రంగురంగుల రంగవల్లులతో తీర్చిదిద్దుకుంటారు. అంతేకాదు, సంక్రాంతి రోజు ఉదయాన్నే అందరూ కలసి ఆలయాల్లో పూజలు నిర్వహిస్తారు. దర్గాలో చాదర్ను సమర్పిస్తారు. ఖాంట్రాడాలోని గ్రామస్తులంతా ఒక్కచోట చేరి వంటలు చేసుకుని ఒకే కుంటుంబంలా కలసిమెలసి భోజనాలు చేస్తుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి తలో చేయి వేసి సాయం అందిస్తుంటారు. దాదాపు నూట యాభై సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సంక్రాంతి వేళ ఈ మత సామరస్యం వెల్లివిరుస్తోంది. ఈ సంబరాలు వైవిధ్యం.. విభిన్నం ఊరంతా కలిసి సంబరాలు చేసుకోవడం, ఊరి బాగు కోసం పండుగ పూట కంకణం కట్టుకోవడం ఇది ఒకపక్క కొత్త ధోరణిగా వేళ్లూనుకుంటుంటే.. మరోపక్క కుటుంబ అనుబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ఒకే ఇంటిపేరు గలవారు ఏకమవుతున్నారు. అలాంటి కొన్ని కుటుంబాల వివరాలివి.. - ఒక ఇంట్లో పుట్టి మరో ఇంట్లో మెట్టినపుడు రెండు ఇంటి పేర్లుతోనూ అనుబంధం ఏర్పడుతుంది. ఒక్కో తరం పెరుగుతున్న కొద్దీ ఆ అనుబంధాలు మరింత విస్తరిస్తాయి. తుమ్మల వారి విషయంలో జరిగిందీ అదే. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరులో ఉన్న తుమ్మల కుటుంబం ఎందరినో కలుపుకుని ఇంతింతై అన్నట్టుగా వ్యాపించింది. అందుకే ఇప్పుడా కుటుంబంలో సంక్రాంతి వచ్చిందంటే పూటకు రెండు వేల విస్తళ్లు లేవాల్సిందే. నా వారు అనుకునే వారు ఇంతమంది ఒకచోట చేరినపుడు ఉండే ఆనందానికి సాటి రాగలది ఇంకేముంటుంది? అందుకే దూరాభారాలనుకోకుండా ఎక్కడున్నా పండక్కి పులిమేరు వచ్చేస్తాం అని చెబుతారు వీరంతా. - కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలోని రాజుపాలెం అనే ఒక గ్రామం ఉంది. ఈ ఊరికి వెళ్తే క్షత్రియ కుటుంబాలకు చెందిన నాలుగైదు తరాల వారిని ఒకేచోట చూడవచ్చు. విదేశాల్లో ఉన్న వారు కూడా పండుగ కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చేస్తారు. దాదాపు 500 మంది ఒకేచోట వంటలు చేసుకుని ఒకే పంక్తిలో భోజనాలు చేస్తారు. పెద్దలను సత్కరిస్తారు. పిల్లలకు తమ వారసత్వాన్నీ, బంధువులనీ పరిచయం చేస్తారు. - కోనసీమ జిల్లా సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. పండగ నాడు ఈ జిల్లా వ్యాప్తంగా జరిగే ప్రభల తీర్థాలు మొత్తం సంక్రాంతి పండుగకే హైలైట్. అయితే ఈ జిల్లాలో పండుగ జరుపుకునే తీరులో ఇంకా ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. ఇదీ అలాంటిదే. కోనసీమ జిల్లాలోని పుల్లేటికుర్రు అనే గ్రామం ‘వక్కలంక’ అనే ఇంటిపేరు ఉన్న వారికి ప్రసిద్ధి. ఈ ఇంటిపేరుతో ఉన్న కుటుంబాలన్నీ దేశంలో ఎక్కడెక్కడ ఉన్నా సంక్రాంతి నాటికి ఇక్కడికి వచ్చేయాల్సిందే. ఇలా ఈ ఇంటిపేరున్న వారంతా కలుసుకోవడం కొన్ని దశాబ్దాలుగా జరుగుతోంది. సంక్రాంతి పండుగ మూడు రోజులూ వేడుకల్లో పాల్గొని చివరి రోజున తమ ఆధ్వర్యంలోనే స్థానికంగ ఉన్న అభినవ శ్రీ వ్యాఘ్రేశ్వరస్వామి వారి ప్రభల వేడుకలను ఘనంగా జరిపిస్తారు. - ఆడపడుచులు పుట్టింటికి రావడం సహజమే కదా! కానీ తొమ్మిది మంది తోబుట్టువులు తలా ఒకసారి వచ్చి వెళ్లేకంటే అందరూ ఒక్కసారే వస్తే.. వారందరి పిల్లలూ, మనవలూ ఇలా అంతా ఒక్కచోట చేరితే ఎలా ఉంటుంది? ఈ ప్రయత్నమే చేయాలని అనిపించింది బత్తుల వారి కుటుంబానికి. ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆలోచనను బత్తుల సోదరులు క్రమం తప్పకుండా ఆచరణలో పెడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన బత్తుల సోదరుల ఇంట సంక్రాంతి వేళ జరిగే సందడి అంతా ఇంతా కాదు. గ్రామంలో వీరి కుటుంబం ఒక్కటే కానీ, మొత్తం 90 మంది ఉన్నారు. అందరూ కలిసి ఉండటానికి ఒక కల్యాణమంటపాన్ని అద్దెకు తీసుకుంటారు. పనులతో సతమతం అవ్వకుండా అందరూ పండుగ సంబరాన్ని ఆస్వాదించేందుకు వీలుగా పనివాళ్లతో ఏర్పాట్లన్నీ చేయిస్తారు. అలాగని తమ సంతోషానికే పరిమితం కారు. ఊరి కోసం ఏటా ఏదో ఒక మంచి పని చేయిస్తాయి. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం, పేదలకు దుస్తులు పంచడం వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. సంక్రాంతికీ ఓ కథ ఉంది! పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవై వేల మంది కొడుకులు. వీరంతా ఒకసారి కపిల ముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుకి భంగం కలిగిస్తారు. దీంతో కోపించిన కపిల ముని వారందరినీ తన కంటి చూపు నుంచి వెలువడిన క్రోధాగ్ని జ్వాలలతో భస్మం చేశాడు. దాంతో వారికి మోక్షం లభించక అథోలోకంలో పడి ఉన్నారని, వారికి సద్గతులు కలగాలంటే వారి భస్మరాశుల మీద నుంచి గంగ ప్రవహించాలని తెలుసుకున్న సగర వంశీకులు చాలామంది భువికి గంగను రప్పించాలని పరిపరి విధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఎట్టకేలకు ఈ వంశానికి చెందిన భగీరథుడు తన కఠోర తపస్సు, ఎడతెగని ప్రయత్నాలతో ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగ నేల మీద అవతరించిందట. అందుకే సంక్రాంతి నాడు చేసే స్నానం గంగాజలంలో మునక వేసినంత ఫలాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతారు. కనుమనాడు కాకైనా కదలదు.. మనుషులు పొలిమేర దాటొద్దు సంక్రాంతి అయినా, మరే పండుగయినా.. సంప్రదాయాల కలబోత. పండుగ పరమార్థం.. మనిషి మంచి కోరడం. నలుగురికీ ఆనందాన్ని పంచడం.. మరి సంక్రాంతి సందర్భంగా ఏర్పడిన సంప్రదాయాలేమిటో తెలుసుకోండి.. • సంక్రాంతిలో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ, రెండో రోజైన సంక్రాంతిని పెద్దల పండుగగానూ, మూడో రోజైన కనుమను పశువుల పండుగగానూ చేసుకునే ప్రజలు.. నాలుగో రోజున గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగానూ పిలుస్తారు. • కనుమ నాడు పొలిమేర దాటకూడదని నియమం. • కనుమ మర్నాడు వచ్చే ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అనే పేరూ ఉంది. • సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. కాబట్టి భోగి మంటలు వేస్తారు. సూర్యుడు ఉత్తరాయణం (సంక్రాంతి)లోకి మళ్లింది మొదలు వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని, వాతావరణ మార్పును తట్టుకునేందుకే భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది. • పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నం ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్యం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు. అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టే భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తనకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకి ఎటూ కదలాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది. సంక్రాంతికి గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయం. అప్పుడప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు. •సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజులు చలికాలం. ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు. సంక్రాంతి సందర్భం.. పుట్టింట సంబురం తెలంగాణలో సంక్రాంతి సందడి వేరే. ఈ పండుగ సందర్భంలో చేతివృత్తుల వారికి చేతినిండా పనే. పిల్లా పీచు మొదలుకుని పండుటాకుల వరకూ అంతా పుట్టింటి బాటపడతారు. ఏడాదిలో బంధువులందరినీ పలకరించడానికి సంక్రాంతిని ఒక సందర్భంగా భావిస్తారు. అలాగే, పుట్టింటికి వచ్చే పడుచులు పలు నోములు నోచుకుంటారు. బంధువులనూ, ఇరుగుపొరుగునూ అందరినీ ఈ నోముల్లో భాగం చేస్తారు. ఈ సందర్భంగా పూజల కన్నా సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. రకరకాల చెట్లనూ, నీటి వనరులనూ గౌరవిస్తూ ఆచరించే ఈ నోములు పర్యావర్ణ స్ప•హకు అద్దం పడతాయి. గురుగులు, కుందెలు, గొల్లనోము, కుమ్మరివాము వంటి నోముల్లో మట్టికుండలూ, వెదురుబుట్టలూ వంటివి ఉపయోగిస్తారు. తద్వారా వీటిని తయారు చేసే చేతివృత్తుల వారికి రెండు చేతులా పని దొరుకుతుంది. సంక్రాంతి సందర్భంగా కొత్తగా పెళ్లయిన వారు నోచుకునే ‘పెళ్లి నోము’ను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నోము సందర్భంలో నవదంపతుల ఇరువైపుల బంధువులూ ఒక్కచోట కలుస్తారు. దీంతో అనుబంధాలు మరింతగా పెరుగుతాయి. నోము తరువాత ఊరందరికీ భోజనాలు పెడతారు. అందరినీ అందరూ బంధుత్వాల వరుసలు కలుపుకుని నోరారా పలకరించుకుంటారు. ‘సందె దీపాల నోము’ది మరో విశేషం. ఈ నోము నోచే మహిళలు సంధ్యవేళ ఊళ్లోని 75 ఇళ్లకు వెళ్లి తమ చేతులతో దీపాలు పెడతారు. తమ ఇంట్లో దీపం పెట్టిన ఆడపిల్లపై ఆ ఇంటి వారికి బాధ్యతతో కూడిన బంధం ఏర్పడుతుంది. ఏ నోము నోచుకున్నా ఇంటింటికీ వెళ్లి నోచుకున్న వస్తువులను పంచడం మరో చక్కని సంప్రదాయం. దీనివల్ల చుట్టుపక్కల వారందరితోనూ సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇక, సంక్రాంతి సమయంలో ఆడపిల్లల చేత నోములన్నీ చేయించే బాధ్యతను పుట్టింటి వారే తీసుకుంటారు. పెళ్లి చేసి పంపించడంతోనే బాధ్యత తీరిపోలేదని, తల్లిదండ్రులతో పాటు ఆమె నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామలూ ఎప్పుడూ అండగా నిలవాలనేది ఈ నోముల పరమార్థం. ఇలా తెలంగాణలో సంక్రాంతి సమయంలో ఆచరించే ఈ నోములు పండగకు అదనపు శోభనూ, సందడినీ తెస్తాయి. ఊరంతటినీ ఒక్కచోటకు చేరుస్తారు. పెద్దలకు తర్పణాలు విడవడం, వారి కోసం పూజలు చేయడం కూడా తెలంగాణలో సంక్రాంతి సంప్రదాయమే. కన్నడలో ‘ఎల్లు బిరోదు’.. గుజరాత్లో ‘ఉత్తరాయణ్’.. తమిళనాట ‘కరినాళ్’.. తెలుగు రాష్ట్రాల్లోని గోదావరీ తీర ప్రాంతాల్లో కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు. వీటిని వీరభద్రుడికి ప్రతీకగా భావిస్తారు. • మహారాష్ట్రలో సంక్రాంతిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. బంధుమిత్రులకు నువ్వుల లడ్డూలు పంచుతారు. • తమిళనాడులో ఇది నాలుగు రోజుల పర్వం. అక్కడ సంక్రాంతిని పొంగల్ అని పిలుస్తారు. నాలుగో రోజున ఘనంగా పండుగ జరుపుకుంటారు. ఈ నాలుగో రోజును కరినాళ్ అంటారు. ఈ రోజు చుట్టాలను కలుసుకోవడం తప్పనిసరి. కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లే సంప్రదాయం కూడా తమిళనాట ఉంది. • కర్ణాటకలో పిల్లలంతా కొత్త బట్టలు ధరిస్తారు. బాలికలు ఇతర కుటుంబసభ్యుల బాలికల ఇళ్లకు వెళ్లి ప్లేట్లు మార్పిడి చేసుకోవడం ఇక్కడి సంక్రాంతి ఆనవాయితీ. ఈ సంప్రదాయానికి ‘ఎల్లు బిరోదు’ అని పేరు. ఎల్లు అంటే నువ్వులు. పళ్లెంలో నువ్వులు, బెల్లం, వేరుశెనగలు, ఎండుకొబ్బరి పెట్టి ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ మిశ్రమాన్నే ఎల్లు బెల్లం అంటారు. • అసోంలో సంక్రాంతిని భొగాలి బిహు పేరుతో నిర్వహించుకుంటారు. • గుజరాత్లో ఉత్తరాయణ్ పేరుతో పండుగ జరుపుకుంటారు. గాలిపటాలు ఎగురవేసే పోటీలు ఇక్కడ బాగా జరుగుతాయి. • ఉత్తరప్రదేశ్లో ‘కిచెరి’ పేరుతో నిర్వహించుకునే పండుగ ఆకట్టుకుంటుంది. ఉదయాన్నే తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి నువ్వుల లడ్డూలు తింటారు. సంక్రాంతి సంప్రదాయాలు - రేగుపండ్లకు సంస్క•తంలో బదరీ ఫలమని పేరు. సూర్యుడి కాంతిని తనలో నిలుపుకునే శక్తి రేగుపండుకు ఉంది. ఈ పండ్లను పిల్లలపై పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగుపండ్లు, చెరుకుముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూతరేకులు తదితరాలను కలిపి భోగిపండ్లను పోస్తారు. - ఒకప్పుడు నరనారాయణులు బదరీవనంలో భోగినాడే తపస్సు ప్రారంభించారట. దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలను ఇవ్వడంతో దేవతలంతా వారి తలలపై బదరీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్ని నరనారాయణులుగా భావించి వారిపై భోగిపండ్లను వేస్తారని అంటారు. పిల్లలపై దసరా పండుగ సమయంలోనూ భోగిపండ్లు పోసి దిష్టితీసే ఆచారం ఉంది. - తెలంగాణలో భోగిపండుగ నాడు భోగినోము అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఈనాడు మట్టికుండల్లో నువ్వుల ఉండలు, చెరుకుముక్కలు, జీడిపండ్లు, చిల్లర డబ్బులు వేసి వాటిని వాయనాలుగా ఇచ్చిపుచ్చుకుంటారు. - భోగిపండుగ నాడు భోగిమంటలు వేసే సంప్రదాయం ఎలా ఏర్పడిందంటే.. సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందురోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకే తెల్లవారుజామున భోగిమంటలు వేస్తారు. - అలాగే, గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచీ తిరుప్పావై పాశురాలతో రంగనాథుడిని ఆరాధించి భోగినాడే స్వామిని వివాహం చేసుకుని ఆయనలో లీనమైందట. ఆ కారణంగానే భోగి పండుగ ఏర్పడిందనే కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగి పండుగతో ముగుస్తుంది. - సంక్రాంతి పండులో మూడో రోజైన కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. ఇది కోనసీమ జిల్లాలోని పల్లెల్లో ప్రత్యేకం. ప్రభలను వీరభద్రుడికి సంకేతంగా భావిస్తారు. వీటిని అందంగా అలంకరించే విషయంలో ఆయా గ్రామాల్లో పోటీ పడతారు. పండుగకు దాదాపు పది రోజుల ముందు నుంచే ప్రభల అలంకరణ మొదలవుతుంది. పుల్లేటికుర్రు, నాగుల్లంక, పెదపట్నం, జగ్గన్నపేట, జగ్గయ్యతోట తదితర గ్రామాల్లో జరిగే ప్రభల తీర్థాలు ప్రసిద్ధి. వీటిని మొదట ఊరంతా తిప్పి.. ఒకచోట చేరుస్తారు. అక్కడ తీర్థం జరుగుతుంది. తిరిగి సాయంత్రం మళ్లీ ఊరంతా ఇంటింటికీ తిప్పి తీర్థాన్ని ముగిస్తారు. ఇక, పెదపట్నం తదితర గ్రామాల్లో అయితే ప్రభలను పంట కాలువలు దాటించడం కనులపండువగా సాగుతుంది. పతంగుల పండుగ సంక్రాంతి అంటే పిల్లలకు, యువతకు పతంగుల పండగే. రకరకాల గాలిపటాలను పోటీపడి ఎగురవేస్తారు. మరి, ఈ పతంగుల సంబరం వెనుక కూడా కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని మన సంక్రాంతి నేపథ్యం గల సంప్రదాయాలైతే.. మరికొన్ని దేశవిదేశాల్లోని సంప్రదాయాలు. అవేమిటంటే.. - గాలిపటం ఎగరేయడం ఒక సరదానే కానీ, జపనీయులకు మాత్రం బిడ్డల ఆరోగ్యం కోసం ప్రార్థించే ఒక క్రతువు. గాలిపటం ఎంత పైకి ఎగిరితే బిడ్డ ఆరోగ్యం అంత చల్లగా ఉంటుందనే నమ్మకం వారిది. గాలిపటాల సంబరాన్ని ఆ దేశంలో ‘హిమమాత్సు’గా పిలుస్తారు. ఏటా మే 3 నుంచి 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలను జరుపుకుంటారు. దీనినే గోల్డెన్ వీక్గా కూడా పిలుస్తారు. క్రీస్తుశకం 1558లో హిమమత్సు రాజుకు కొడుకు పుట్టిన సందర్భంగా గాలిపటం మీద కొడుకు పేరు రాసి గాల్లో ఎగరేశాడట ఆ రాజు. ఆ సంబరం క్రమంగా రాజ్యమంతటా పాకింది. నేటికీ కొనసాగుతోంది. చంటిపిల్లలున్న ఇళ్లలో ఈ వేడుక తారస్థాయిలో జరుగుతుంది. హిమమాత్సులోని నకతైమా ఇసుక తిన్నెలు ఇందుకు వేదికవుతాయి. మే 3న ఉదయం 11 గంటలకు గంట కొట్టగానే ఒకేసారి ఆకాశంలోకి వంద పతంగులను ఎగురవేసి వేడుకలకు శ్రీకారం చుడతారు. అక్కడ జాతీయ సెలవు దినం.. సంక్రాంతి పండగలో భాగంగా గాలిపటాలను ఎగరవేయడం మన దగ్గర సంప్రదాయం. గుజరాత్, తెలంగాణ, రాజస్తాన్, కర్ణాటకలోని అనేక నగరాలు ఈ వేడుకకు సిద్ధం అవుతాయి. అయితే, అహ్మదాబాద్ అయితే కైట్ క్యాపిటల్గా పేరు తెచ్చుకుంది. ఇక్కడ పతంగుల పండుల జనవరి 13న మొదలై మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల ప్రధాన కాలక్షేపం గాలిపటాలే. జనవరి 13న అక్కడ జాతీయ సెలవు దినం కూడా. 2012లో అత్యధికంగా నలభై రెండు దేశాల నుంచి వచ్చిన సందర్శకులు పతంగుల పండుగలో పాల్గొన్ని రికార్డు నెలకొల్పారు. సబర్మతీ తీరంలో ఎన్నో వేల గాలిపటాలను గాలిలో ఎగురుతుండగా చూడటం ఒక అందమైన అనుభవం. ఎంత లేదన్నా ఐదు లక్షల మంది ప్రేక్షకులు ఈ పతంగుల పండుగను వీక్షించడానికి ఇక్కడకు వస్తుంటారు.
సంపాదకీయం కొత్త క్రాంతి
కాల చక్రానికి అధిపతి సూర్యుడు. కర్మసాక్షి అయిన ఆయన ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో సంవత్సరానికి రెండు ఆయనాలు వస్తాయి. అవి- దక్షిణాయనం, ఉత్తరాయణం. జనవరి తొలి పదిహేను రోజుల చివర్లో అంటే, సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అనీ అంటారు. ఈ సమయంలోనే పంట చేతికి వస్తుంది. అందుకే సంక్రాంతి వేళ సూర్యారాధన చేస్తూనే ఆహారాన్ని ప్రసాదించే నేలతల్లినీ అందమైన రంగవల్లులతో, పూజలతో పూజిస్తారు. భోగితో మొదలై ముక్కనుమతో ముగిసే సంక్రాంతి పండుగ మది నిండా సంబరాలు నింపి, మనసుల్లోనూ, జీవితాల్లోనూ సరికొత్త కాంతులు, క్రాంతులు వెలిగించే దివ్య సందర్భం. ముంగిట్లో కాంతులీనే రంగవల్లికలు, ఎక్కడున్నా తప్పకుండా వచ్చే బంధుజనం, పిల్లల పతంగుల సంబరం, హరిదాసు కీర్తనలు, కొమ్మదాసరుల కోలాహలం, గంగిరెద్దుల సందడి.. సంక్రాంతి అంటేనే ఓ సంబరం.. ఓ ఆనందం.. అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ పెద్ద పండుగ వెనుక ఎన్నో అంతరార్థాలున్నాయి. అవేమిటో లోపలి పేజీల్లో చదవండి. --- హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్! కొత్త సంవత్సరం కొత్తగా వినిపించే మాట- విష్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్... ‘కొత్త సంవత్సరం మీకు సకల సంతోషాలనూ, సంపదలనూ సమకూర్చాలని కోరుకుంటున్నా..’ అనే ఈ గ్రీటింగ్ వెనుక పెద్ద కథే ఉంది. చైనాలో ఎల్లో రివర్ వరదలకు పెట్టింది పేరు. శతాబ్దాలుగా ఈ నది వరదల వల్ల విపరీతమైన నష్టం జరిగేది. 1931లో వచ్చిన వరదలను గ్రేట్ ఫ్లడ్ ఆఫ్ చైనా అంటారు. లక్షలాది మంది ప్రాణాలను హరించే ఇలాంటి ప్రకృతి విపత్తుల గురించి భావితరాలకు చెప్పడం అవసరం అని భావించి దాన్ని పాఠ్యాంశంగా పెట్టిన అక్కడి ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తుంది. కానీ ప్రజలకు ఎలాంటి సామాజిక భద్రత కల్పించదు. దాంతో ప్రజలు తమ కష్టాలు తామే పడాలి. అందుకే చిన్నప్పటి నుంచి పిల్లలకు డబ్బు విలువ నేర్పిస్తారు. తమ కొత్త సంవత్సరం శుభాకాంక్షల్లోనూ డబ్బు కావాలనే కోరుకుంటారు. అలా మనం ఆంగ్లంలో చెప్పుకునే ‘హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్’ను పొరుగు దేశమైన చైనా నుంచే అందిపుచ్చుకున్నామన్న మాట. ఆంగ్లనామ కొత్త సంవత్సరం గురించి మరిన్ని విశేషాలు, కొత్త కొత్త కబుర్లు లోపలి పేజీల్లో బోలెడున్నాయి. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు - డాక్టర్ కుమార్ అన్నవరపు రాజేశ్వరి అన్నవరపు
ఉత్తరాయణం
కథా పారవశ్యం తెలుగు పత్రిక 2024, నవంబరు సంచికలో ‘పరవశింపచేసే కథలు.. పరమేశ్వరుని గాథలు’ శీర్షికన అందించిన విశేషాలు చదివించాయి. ఇంతకుముందు ఎప్పుడూ చదవని అంశాలను చదివి తెలుసుకున్నాం. - టీఎస్ రవిచంద్ర, ఆర్.రమేశ్, కె.శ్రీనివాస్, పరిమళ, వినోద్కుమార్, పి.రవి మరికొందరు ఆన్లైన్ పాఠకులు పూజావళి కార్తిక మాసంలో నెల రోజుల పాటు చేయాల్సిన పూజా విధుల గురించి అందించిన సమాచారం బాగుంది. ఏ రోజు ఎవరిని, ఎలా, ఏ మంత్రంతో పూజించాలి? ఏయే ఆహారం తీసుకోవాలనే వివరాలు చదివి భద్రపరుచుకున్నాం. ఇలాంటి విశేషాలు మరిన్ని అందించాలని కోరుతున్నాం. - ఎ.రామకృష్ణారావు (తిరుపతి), ఆర్.కృష్ణయ్య (హైదరాబాద్), పి.వెంకటేశ్ (విజయవాడ), రాజేశ్వరరావు (వరంగల్) శివతాండవం శివ తాండవ విశేషాలు ఎంతగానో చదివించాయి. చిదంబర నటరాజ స్వామి నృత్య విన్యాసంలో దాగి ఉన్న సృష్టి రహస్యం గురించి, దాని వెనుక గల శాస్త్రీయ కోణం గురించి అందించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. జెనీవాలోని శాస్త్ర పరిశోధన కేంద్రంలో నటరాజ స్వామి విగ్రహం ఉండటం ఆశ్చర్యకరం. - ఆర్.రాజు (విశాఖపట్నం)
ఆధ్యాత్మిక క్రాంతి
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం సంవత్సరారంభ మాసం- జనవరి. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం పుష్య మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది పదవ నెల. జవనరిలోని దాదాపు అన్నీ పుష్య మాస తిథులే. చివరి రెండు రోజులే మాఘ మాస తిథులు. జవనరి 1వ తేదీ, పుష్య శుద్ధ విదియ, బుధవారం నుంచి జనవరి 20, పుష్య బహుళ అమావాస్య, బుధవారం వరకు పుష్య మాస తిథులు. జనవరి 30 నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఈ నెలలో వచ్చే ప్రధాన పర్వాల్లో సంక్రాంతి ముఖ్యమైనది. అలాగే ఉత్తర ద్వార దర్శనాలకు ప్రతీక అయిన వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఈ నెలలోనే. 2025- జనవరి 1, బుధవారం, పుష్య శుద్ధ విదియ నుంచి 2025- జనవరి 31, శుక్రవారం, మాఘ శుద్ధ విదియ వరకు.. శ్రీ క్రోధి నామ సంవత్సరం - పుష్యం - మాఘం - హేమంత రుతువు - ఉత్తరాయణం పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ నిండార శీతాకాలంలో మంచు ఉధృతంగా కురుస్తుంది. చలి జివ్వుమనిపిస్తుంది. మంచు తెరల దుప్పటి ప్రకృతిని పరదాలా చుట్టుకుంటుంది. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని సస్యశ్యామలమైన (పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. హేమంత రుతువు కాలంలో వచ్చే పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. శ్రావణ పౌర్ణమి నుంచి పుష్య పౌర్ణమి వరకు గల కాలం వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైనదని చెబుతారు. ఇక, పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం కూడా పుష్యమే. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. ఈ మాసంలో గృహ ప్రవేశాలు, వివాహ ముహూర్తాలు, ఇతర శుభ కార్యాలు అంతగా ఉండవు. అయితే, సాధారణ పూజలు, పెద్దల స్మరణకు, ఇతర పుణ్యకార్యాలను ఆచరించడానికి మాత్రం ఇది విశేష మాసం. ఆశ్వయుజం అమ్మవారికి, భాద్రపదం వినాయకుడికి, మార్గశిరం శ్రీమహా విష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, కార్తీకం పరమశివుడికి ప్రీతికరమైన మాసాలైతే.. పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. అందుకే ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. నెల పొడవునా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం విశేష పుణ్యం. ఈ రోజు చేసే దానాలు కూడా మంచి ఫలితాలనిస్తాయి. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి సందడి చేసేది ఈ మాసంలోనే. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం పుష్యంలోనే జరుగుతుంది. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే పర్వమే సంక్రాంతి. సంక్రాంతి వేళ ఏ ఇల్లు చూసినా అందమైన రంగవల్లులు హరివిల్లుల్లా పరుచుకుని ఉంటాయి. పాడిపంటలు ఇళ్లకు చేరుతుంటాయి. పిల్లల భోగిమంటల సన్నాహాలు, పెద్దల పండుగ పిండివంటల హడావుడి.. ఇవన్నీ కొత్త క్రాంతిని చేకూరుస్తూ సంక్రాంతిని ముంగిటకు తెస్తాయి. పుష్య ంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే చోర భయమని మత్స్య పురాణం చెబుతోంది. ఈ మాసంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చేయాలనే సంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో పుష్య మాసంలో గేదె ఈనితే శాంతి చేసే ఆచారం కూడా ఉంది. పుష్యంలో వచ్చే ప్రధాన పర్వాలు, ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం. విశేషాల పుష్యం ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు శ్రేష్ఠమైనది పుష్య మాసం. పై లోకాలలో ఉండే పితృ దేవతలను పూజించి, అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. ఈ మాస సమయంలోనే పంటలు రైతుల చేతికి అందిన సంతోషంతో.. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణుసమేతంగా పూజిస్తారు. • పుష్య మాసం తొలి అర్థభాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. • పుష్య శుక్ల విదియ నుంచి పంచమి వరకు హరిని తులసీ దళాలలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని విశ్వాసం. • పుష్య మాస సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చించాలని శాస్త్ర వచనం. • శుక్ల పక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈ రోజు అంత పవిత్రమైనది. • శుక్ల పక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధించాలి. • పుష్య శుద్ధ ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. • ప్రత్యక్ష నారాయణుడైన సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించేది ఈ మాసంలోనే.. • పుష్య మాసంలో వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ సదాచారం వెనుక గల సదుద్దేశం. • పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. ఈ రోజు- తిలల్ని ఆరు విధాలుగా ఉపయోగించాలని అంటారు. • ఈ మాసంలో చివరిదైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడుపాయలలో ఒకటైన ‘తుల్యభాగ’ పాయ తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ స్నానం చేయడం విశేష పుణ్యం లభిస్తుంది. • ఏపీలోని గోదావరీ తీర ప్రాంతాల్లో కనుమ నాడు ప్రభల తీర్థం నిర్వహిస్తారు. • పుష్య శుక్ల అష్టమినాడు సంజ్ఞిక అనే శ్రాద్ధం చేస్తే పితృ దేవతల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. పుష్య శుద్ధ విదియ జనవరి 1, బుధవారం ఇది జనవరి మాసంలోని తొలి రోజు. తిథి.. పుష్య శుద్ధ విదియ. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం ఈరోజు నుంచి సమాప్తమవుతుంది. ఈనాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, నాలుగు రోజుల పాటు సాగే విష్ణు వ్రతాన్ని కూడా ఈనాడే మొదలుపెట్టాలని అంటారు. ఇక, జనవరి 1 ఆంగ్ల కొత్త సంవత్సర (న్యూ ఇయర్) దినం. ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను ఈనాడు అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. పుష్య శుద్ధ తదియ జనవరి 2, గురువారం పుష్య శుద్ధ తదియ నాడు ప్రత్యేకించి జరుపుకునే పర్వాలు కానీ, వ్రతాదులు కానీ ఏమీ లేవు. ఈనాడు వరల్డ్ నేచర్ డే నిర్వహిస్తారు. పుష్య శుద్ధ చవితి జనవరి 3, శుక్రవారం పుష్య శుద్ధ చవితి నాడు చతుర్ధీ వ్రతం ఆచరించాలని వ్రత నియమం. ఏ మాసపు చతుర్థి తిథి నాడైనా గణపతిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది. చతుర్థి తిథి గణపతికి ప్రీతికరమైనది. పుష్య శుద్ధ పంచమి జనవరి 4, శనివారం ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షాల్లోని పంచమి తిథులలో నాగపూజ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆచారమై ఉంది. ఇక, పుష్య శుద్ధ పంచమి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. పుష్య శుద్ధ షష్ఠి జనవరి 5, ఆదివారం పుష్య శుద్ధ షష్ఠి కుమారషష్ఠి. శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని పూజించడానికి ఇది ఉద్ధిష్టమైన రోజు. తమిళనాడులో ఈనాడు పెద్ద పర్వం నిర్వహిస్తారు. కుమారస్వామి తమిళుల ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో కుమారస్వామి పూజ తెలుగునాట ఎక్కువగా ఉండేది. ‘కుమారదేవం’ తదితర ఊళ్లు అందుకు నిదర్శనం. ఇక, మన ప్రాచీనాంధ్ర కవులు సైతం తమ కావ్యాలలో ఇష్టదేవతా స్తుతిలో కుమారస్వామి స్తుతిని కూడా చేర్చారు. అయితే, ప్రస్తుతం తెలుగు వారిలో కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యస్వామి పూజ విశేషమై ఉంది. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగు నాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. సుబ్బారాయుడి షష్ఠి అని పిలిచే మార్గశిర శుద్ధ షష్ఠి తెలుగు నాట పెద్ద పర్వమే. ఇదే పర్వాన్ని తమిళులు పుష్య శుద్ధ షష్ఠి నాడు ఘనంగా జరుపుకుంటారు. పుష్య శుద్ధ సప్తమి జనవరి 6, సోమవారం పుష్య శుద్ధ సప్తమి సూర్యారాధన తిథి. ఈనాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలు చేయాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. సాధారణంగా పుష్య మాసమే సూర్యారాధనకు ప్రతీతమైనది. అటువంటిది ఈ సప్తమి తిథి నాడు ఆయనను మరింతగా ఆరాధించాలి. పుష్య శుద్ధ అష్టమి జనవరి 7, మంగళవారం పుష్య శుద్ధ అష్టమి శక్తియుతమైనది. ఈనాడు శక్తికి మూలరూపమైన అమ్మవారిని విశేషంగా ఆరాధిస్తారు. పుష్య శుద్ధ అష్టమిని మన పంచాంగాలలో మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో వ్యవహరించారు. ఈనాడు అష్టకా సంజ్ఞకమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, వంశాభివృద్ధి జరుగుతుందని ప్రతీతి. పుష్య మాసం పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. కాబట్టి ఈనాడు పితృ దేవతల ప్రీత్యర్థం కార్యాలు తలపెట్టాలి. అందుకే దీనిని మాసిక దుర్గాష్టమిగానూ వ్యవహరిస్తారు. పుష్య శుద్ధ నవమి జనవరి 8, బుధవారం పుష్య శుద్ధ నవమి నాడు ధ్వజ నవమీ వ్రతం ఆచరిస్తారు. కేవలం ఒంటిపూట భోజనం చేసి మహామాయను పూజిస్తూ వ్రత నియమాన్ని పాటించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పుష్య శుద్ధ దశమి జనవరి 9, గురువారం పుష్య శుద్ధ దశమి నాడు ద్వార పూజ (గడపకు పూజ) చేయడం ఆచారం. అయితే ఈ పూజ చేయడం ఉత్కళ దేశంలో ఎక్కువ ఆచారంలో ఉంది. ఈనాడు ద్వార ధర్మ దేవతలను పిండి మొదలైన వాటితో పూజిస్తారు. తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, వివిధ వ్రత గ్రంథాలు ఈ దశమిని శాంభవి దశమి అని పేర్కొంటున్నాయి. పుష్య శుద్ధ ఏకాదశి జనవరి 10, శుక్రవారం పుష్య శుద్ధ ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. అలాగే ఈ తిథి పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది. ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది. రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు. ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు. రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు. అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది. అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు. అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. మీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది. దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు. రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమేణా సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు. ••వతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు. పుష్య శుద్ధ ద్వాదశి/త్రయోదశి జనవరి 11, శనివారం పుష్య శుద్ధ ద్వాదశి, త్రయోదశి ఘడియలు ఒకేరోజు ఉన్నాయి. మొదట ద్వాదశి ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు. పుష్య శుద్ధ చతుర్దశి జనవరి 12, ఆదివారం పుష్య శుద్ధ చతుర్దశి నాడు విరూపాక్ష వ్రతం ఆచరిస్తారు. ఈనాడు విరూపాక్షుడైన శివుడిని పూజించాలి. లోతు ఎక్కువగా గల నీటిలో స్నానం చేయాలి. గంధమాల్య నమస్కార ధూపదీప నైవేద్యాలతో ఈనాడు కపర్దీశ్వరుడు ప్రత్యేక పూజలను అందుకుంటాడు. అలాగే ఈ తిథి విద్యాధీశ తిరు నక్షత్రమని ప్రతీతి. పుష్య శుద్ధ పూర్ణిమ జనవరి 13, సోమవారం పుష్య నక్షత్రంతో కూడిన పున్నమిని ‘పౌషీ’ అంటారు. ఇక, పుష్య శుద్ధ పూర్ణిమనే మహా పౌషీ అని కూడా అంటారు. దీనికే హిమశోధన పూర్ణిమ అనే మరో పేరు కూడా ఉంది. పుష్య పూర్ణిమను తమిళులు ‘పూసమ్’గా వ్యవహరిస్తారు. తై పూసమ్ అనేది వారి పండుగలలో ఒకటి. తిరునల్వేణిలో పార్వతి తామ్రపర్ణి నదీ తీరాన ఒకసారి శివుని గురించి తపస్సు చేసింది. ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. కాగా, ఆనాడు తిరునల్వేణిలో తామ్రపర్ణి నదిలో స్నానం పాపక్షయకరమై ఉంటుంది. తమిళనాడులోని అంబ సముద్రం తాలూకాలో తిరుప్పుదైమారుతూరు అనే ఊరు ఉంది. అక్కడి దేవాలయంలో ఒకానొక పుష్య పూర్ణిమ నాడు ఇంద్రుడు తన పాపాలను పోగొట్టుకున్నాడని, అందుచేత ఈనాడు అక్కడి దైవతాన్ని పూజించడం విశేష పుణ్యప్రదమని అంటారు. పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో కూడా తైపూసమ్ నాడు గొప్ప ఉత్సవం సాగుతుంది. • శ్రావణ పూర్ణిమ నాడు అధ్యాయోపా కర్మ చేసుకుని వేద పఠనాన్ని ప్రారంభించి ఆరు మాసాలు వేదాధ్యయనం సాగించాలి. పుష్య పూర్ణిమ నాడు అధ్యాయోత్సర్జన కర్మ చేయాలి. మళ్లీ శ్రావణ మాసం వచ్చే వరకు ఇతర విద్యలు అభ్యసించాలి.• పౌష్య పూర్ణిమ నాడు భవిష్య పురాణం దానం చేస్తే అగ్నిష్టోమ ఫలం కలుగుతుంది. • పుష్య పూర్ణిమ నాటి స్నానం అలక్ష్మిని నాశనం చేస్తుందని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది. •మహాపౌషి నాడు అయోధ్యలో స్నానం చేస్తే విశిష్ట ఫలాన్నిస్తుంది. ఇక, జనవరి 12 స్వామీ వివేకానందుని జయంతి తిథి. ఏటా ఆయన జయంతి దినోత్సవాన్ని జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆయన చేసిన బోధనల నుంచి స్ఫూర్తి పొంది యువత అన్ని రంగాల్లోనూ రాణించాలనేది ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. పుష్య బహుళ పాడ్యమి/సంక్రాంతి భోగి జనవరి 14,మంగళవారం పుష్య బహుళ పాడ్యమి తిథి నాడే భోగి పర్వదినం. సాధారణంగా ఏదైనా ప్రధాన పర్వానికి ముందు రోజును భోగి అనడం కద్దు. అంటే అట్లతద్దికి ముందు వచ్చే తిథిని అట్లతద్ది భోగి అంటారు. అలాగే పెద్ద పండుగగా వ్యవహరించే సంక్రాంతికి ముందు వచ్చే తిథిని భోగి అంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వాల్లో తొలి రోజైన భోగిని కీడు పండుగగానూ వ్యవహరిస్తారు. ఈనాడు పిల్లలు భోగిమంటలు వేస్తారు. పిల్లలకు కలిగిన దిష్టి దోషాలు పోవడానికి వారికి తలంటి పోసిన తరువాత తలపై భోగిపళ్లను జారవిడుస్తారు. దీనివల్ల వారికున్న గ్రహ, దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మిక. సూర్యుడు దక్షిణాయణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది. అందుకే భోగి మంటలు వేసే సంప్రదాయం ఏర్పడింది. సూర్యుడు ఉత్తరాయణం (సంక్రాంతి)లోకి మళ్లింది మొదలు వాతావరణంలో వేడి పెరుగుతుంది. ఈ వేడిని, వాతావరణ మార్పును తట్టుకునేందుకే భోగి మంటలతో రాబోయే ఈ మార్పునకు శరీరాన్ని సన్నద్ధం చేసినట్టవుతుంది. ఈనాడు ప్రధానంగా ముగ్గురు దేవతలను పూజించాలని అంటారు. అందులో ఒకరు ఇంద్రుడు. మరో కథ ప్రకారం ఈనాడు బలి చక్రవర్తి పాతాళానికి తొక్కబడిన దినంగా కూడా భోగిని భావిస్తారు. భోగి నాడే విష్ణువు వామనడై బలి చక్రవర్తి నెత్తిన మూడో పాదాన్ని పెట్టి అతనిని పాతాళానికి తొక్కేశాడు. బలిని మూడు అడుగులతో అణచివేసిన దినం కాబట్టి, సంక్రాంతి పర్వం మూడు రోజులనే ఆచారం ఏర్పడిందని కూడా అంటారు. అందుకే, ఈనాడు వామన నామస్మరణ, బలిచక్రవర్తి ప్రస్తుతి చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. ఇక, ఈనాడు పూజలందుకునే మరో దేవత.. గోదాదేవి. గోదాదేవిని కూడా ఈనాడు విశేషంగా పూజిస్తారు. శ్రీవిల్లిబుత్తూర్ అనే గ్రామంలో విష్ణుచిత్తుడనే పరమ భాగవత శిఖామణి ఉండేవాడు. ఆయన కూతురు గోదాదేవి. ఆమె పెళ్లీడుకి వచ్చింది. శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథుడిని తప్ప మానవమాత్రులైన ఎవరినీ పెళ్లి చేసుకోనని గోదాదేవి తండ్రితో తెగేసి చెబుతుంది. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం ఆమె ధనుర్మాస వ్రతం పూనుతుంది. ఈ వ్రతం ఆచరించిన నెల రోజుల్లో ఒక్కో రోజు తనకు కలిగిన అనుభూతుల్ని వర్ణిస్తూ తమిళంలో కవిత చెప్పి, రోజుకు ఒక పాశురం (మన తెలుగులో సీస పద్యం వంటిది) చొప్పున ముప్ఫయి రోజులు ముప్ఫై పాశురాలను రచించి స్వామికి అంకితం ఇచ్చేది. ఆ నెల రోజులు ఆమె పొంగలి మాత్రమే తీసుకునేది. ఈ ముప్ఫయి పాశురాలతో కూడిన గ్రంథమే ‘తిరుప్పావై’. తిరుప్పావై పూర్తయిన ముప్ఫయ్యోనాడు స్వామి ప్రత్యక్షమై ఆమెను తప్పక వివాహం చేసుకుంటానని చెబుతాడు. ఆమెను శ్రీరంగం రావాలని ఆదేశిస్తాడు. ఆమెకు సమస్త భోగాలు సమకూరుస్తానని మాటిస్తాడు. గోదాదేవి ఈ విషయాన్ని తండ్రికి చెబుతుంది. తండ్రి ఆమెను శ్రీరంగం తీసుకువెళ్తాడు. ఆశేష ప్రజానీకం సమక్షంలో ఆమెకు శ్రీరంగనాథునితో వివాహం చేస్తారు. పెళ్లితంతు పూర్తి కాగానే ఆమె గర్భాలయంలోకి వెళ్లి స్వామి వారి శేషతల్పం ఎక్కివారి పాదాలు సమీపించి స్వామివారిలో ఐక్యమవుతుంది. మహిమోపేతమైన ఇంతటి కార్యం నడిచిన పుణ్య దినం, పర్వదినం భోగి. పుష్య బహుళ విదియ/మకర సంక్రమణం జనవరి 15, బుధవారం తత్ర మేషాదిషు ద్వాదశ రాశిషు క్రమేణ సంచరితః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరరాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః సంక్రాంతి ఆగమనాన్ని తెలిపే ఈ శ్లోకం జయసింహ కల్పద్రుమంలోనిది. ‘సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు సంచరిస్తూ క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాభిముఖంగా ప్రవేశించినప్పుడు సంక్రాంతి అవుతుంది’ అని పై శోక్లానికి అర్థం. పుష్య బహుళ విదియ నాడే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరగతుడవుతాడు. ఈనాటి నుంచి ఉత్తరాయణ దినాలు ఆరంభమవుతాయి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈనాడు మకర సంక్రాంతి పర్వాన్ని ఘనంగా జరుపుకుంటారు. మూడు రోజుల సంక్రాంతి పర్వంలో సంక్రాంతి రెండో రోజు. దీనినే పెద్దల పండుగ అనీ అంటారు. పెద్ద పండుగ (సంక్రాంతి)తో పాటు కనుమ నాడు కూడా పితృదేవతలకు తర్పణాలు విడిచే ఆచారం కొందరిలో ఉంది. పెద్దల పేరుతో ఈ రోజుల్లో ఆరుబయట అన్నాన్ని ముద్దలుగా చేసి ఉంచుతారు. పితృదేవతల ప్రీత్యర్థం వారికి ఇష్టమైనవి కూడా వండి బయట ఉంచి కాకులను ఆహ్వానిస్తారు. అవి వచ్చి తింటే పితృదేవతలు తిన్నట్టేనని భావిస్తారు. సంక్రాంతి మూడు రోజులు ఊళ్లో ఎటు చూసినా తమకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది కాబట్టి, కాకులు ఎటూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ కారణంగానే కాబోలు.. ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత ఏర్పడింది. సంక్రాంతికి నువ్వుల వాడకం పెంచాలని అంటారు. ఈ పండుగ రోజులు చలికాలం. ఈ కాలంలో నువ్వులు తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే నువ్వులతో చేసిన లడ్డూలను తప్పక తినాలని అంటారు. మకర సంక్రాంతి నిజానికి తిథి పర్వం కాదు. కానీ, మహా పండుగై ఆచారంలో ఉంది. ముఖ్యంగా ఇది తిలలతో (నువ్వులతో) ముడిపడి ఉన్న పర్వమని ఈ తిథి నాడు ఆచరించే వ్యవహారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. అందుకే ఈనాడు ఆచరించే వ్రతాన్ని తిల పర్వమనీ అంటారు. అయితే, దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. మకర సంక్రాంతి నాటి ఉదయం లేవగానే, నువ్వులు ముద్ద చేసి దానిని ఒంటికి రుద్దుకోవడం ఈనాటి ముఖ్య విషయాల్లో ఒకటి. నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకుని ఇంట్లో అందరూ తలంటి పోసుకున్న తరువాత పుణ్యస్త్రీలు చక్కగా అలంకరించుకుని ఐదు మట్టి ముంతలు తీసుకుని, తమకు తెలిసిన పేరంటాళ్ల ఇళ్లకు వెళ్తారు. ఒక్కొక్క ముంతలో బియ్యం, పప్పు దినుసులు, క్యాబేజి ముక్కలు, చెరుకు ముక్కలు ఉంచుతారు. ముంత మీది మూకుడు మూతలో బెల్లం పాకంలో నువ్వులు వేసి తయారు చేసిన ఉండలు ఉంచుతారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పిడత ఇచ్చి ఆ ఇంటిలో నుంచి మళ్లీ అటు వంటిదే ఒక్కొక్క పిడత తీసు కుంటారు. తెలిసి ఉన్నవాళ్ల అందరి ఇళ్లలోనూ ఇలా మార్చుకున్న పిమ్మట ఆ స్త్రీలు తమ ఇళ్లకు వచ్చేస్తారు. సంక్రాంతి నాడు స్నానం చేయనివాడు ఏడు జన్మల వరకు రోగిగా, దరిద్రుడిగా ఉంటాడట. దక్షిణాయన గత పాపం ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి. అందుకోసం ఈనాడు సూర్యుని ఆరాధించి తిలలు, కూష్మాండం, భాండం, కంబళ, ధాన్య, లోహ, వస్త్ర, తైల దీప దానాలు చేయాలని శాస్త్ర వచనం. సంక్రాంతి నాడు తిలలతో ముడిపడిన ‘దధిమంధన’ వ్రతం చేసే ఆచారమూ ఉంది. ఈ వ్రతాన్ని జాబాలి మహర్షి సునాగుడనే మునికి వివరించాడట. సంక్రాంతి నాడు శివుడి ప్రతిమకు నేతితో అభిషేకం చేయాలని, నువ్వుపూలతోను, మారేడాకులతోను పూజించాలని ఈ వ్రత విధానం చెబుతోంది. దధిమంధన వ్రతం వల్ల అఖండ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని దూర్వాస మహాముని చెప్పగా, ద్రోణాచార్యుడి పత్ని కృపి ఈ వ్రతం ఆచరించి దారిద్య్రం నుంచి విముక్తి పొందిందని, అశ్వత్థామను పుత్రుడిగా కన్నదని ఐతిహ్యం. అలాగే నందుని భార్య యశోద ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కుమారునిగా కన్నదని పురాణాల ద్వారా తెలుస్తోంది. సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానమాచరించి, బ్రాహ్మలకు పెరుగు, తిలపాత్రలు, రాగి పాత్రలు, ఇత్తడి కుందెలు, గొడుగులు, ఇతర వస్తువులు కూడా బహుమానాలుగా అందచేస్తారు. సంక్రాంతి నాడు బ్రాహ్మణుడిని ఇంటికి భోజనానికి పిలుస్తారు. నువ్వుల పప్పుతో చేసిన లడ్లు ఆనాటి ప్రధాన భక్ష్యాలు. భోజనం అయిన తరువాత బ్రాహ్మణుడికి దక్షిణ ఇస్తారు. కొత్త అల్లుడిని ఈ పండుగకు తప్పకుండా తీసుకువస్తారు. శబరిమలైలో స్వామి అయ్యప్ప మకర జ్యోతి దర్శనం అయ్యేది కూడా ఈనాడే. పుష్య బహుళ తదియ/కనుమ పండుగ జనవరి 16, గురువారం పుష్య బహుళ తదియ నాడు కనుమ పండుగ. సంక్రాంతి తొలి రెండు రోజులూ (భోగి, సంక్రాంతి) మన కోసం నిర్వహించుకునే పండుగలైతే, చివరి రోజైన కనుమ నాడు మాత్రం మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులనూ స్మరించుకోవడం, వాటికి వివిధ రూపాల్లో కృతజ్ఞత తెలుపుకోవడం ఆచారంగా వస్తోంది. అలాగే, ఈనాడు పితృదేవతలనూ స్మరించుకుంటారు. వ్యవసాయాధారితమైన మన దేశంలో రైతుకు చేదోడువాదోడుగా ఉండేవి ఎద్దులు. అవి మనకు చేసే సాయానికి ప్రతిగా వాటికి ఎంత చేసినా తక్కువే. అందుకే ఉన్నంతలో తమ కృతజ్ఞతను తెలుపుకునేందుకు కనుమ రోజు పశువులను ఇతోధికంగా పూజిస్తారు. సంక్రాంతి నాటికి పొలం పనులన్నీ పూర్తయి ఉంటాయి. కనుక, పశువులు కూడా అలసిపోయి ఉంటాయి. ఇలా నిస్త్రాణంగా ఉన్న పశువులకు కాస్త బలాన్ని చేకూర్చేందుకు ఉప్పు చెక్క పేరుతో వాటికి ఔషధులతో కూడిన పొట్టును తినిపిస్తారు. మరోవైపు పశువులనీ, వాటి కొట్టాలను శుభ్రపరుస్తారు. కొట్టాలను గోమయంతో, పూలదండలతో అలంకరిస్తారు. కనుమ నాడు పశువులను అలంకరించే తీరు అవర్ణం. కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకు చిరుగంటల గజ్జెలు, మెడలో దండలు.. ఇలా తనివితీరా రైతులు తమ పశువులను అలంకరిస్తారు. ఈ క్రమంలోనే సాయంత్రం వేళ వీటికి పందాలు నిర్వహించడం మొదలైంది. ఇంట్లో ఉండే జీవులనే కాదు మన పరిసరాల్లో ఉండే జీవుల కడుపు నింపాలనే ఉద్దేశంతో ఇంటి నిండా ధాన్యపు రాశులు నిండిన ఈ పుణ్య కాలంలో ఇంటి చూర్లకు ధాన్యపు కంకులను కుచ్చుగా కట్టి వేలాడదీస్తారు. పిచ్చుకలు, ఇతర చిన్న పక్షులు వీటిని తిని కడుపు నింపుకొంటాయి. అలా మనిషికి పశువులు, పక్షులతో ఉన్న అనుబంధాన్ని చాటుతుంది కనుమ పండుగ. తనతో పాటు ఉన్న మూగజీవాల ఆకలి తీర్చినపుడే మనిషి జీవితానికి సార్థకత అని చాటే పండుగ సంక్రాంతి. కనుమ నాడు రథం ముగ్గు వేసి ఆనాటితో సంక్రాంతి సంబరాలకు ముగింపు పలకడం రివాజు. సంకురుమయ్య (సూర్య దేవుడు/ సంక్రాంతి దేవుడు) ఉత్తరాయణం వైపుగా మరలే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను సాగనంపేందుకా అన్నట్టు ఇలా రథం ముగ్గును వేయడం ఆచారం. ఈ ముగ్గుకు ఉన్న కొసను మాత్రం ఇంటి బయటకు వెళ్లేలా దిద్దుతారు. కనుమ నాడు పొలిమేర దాటకూడదని నియమం. పశువులకే కాదు.. వాటి యజమాలకూ కనుమ రోజు పూర్తిగా ఆటవిడుపు. తమిళనాడులో కనుమ నాడు జరిగే పశువుల సందడిని ‘మట్టు పొంగల్’ అంటారు. ‘మట్టు’ అంటే ఎద్దు. ఒకసారి శివుడు తన నంది వాహనాన్ని పిలిచి, భూలోకంలో ఉన్న ప్రజలకు ఒక సందేశాన్ని అందించి రమ్మని చెప్పాడట. ‘రోజూ చక్కగా ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలనీ, నెలకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవాలన్న’దే ఆ సందేశం. కానీ పాపం నంది కంగారులో శివుడి సందేశాన్ని సరిగా వినలేదు. ఆ కంగారులో- ‘రోజూ చక్కగా తిని ఉండాలి. నెలకు ఒకసారి మాత్రమే ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని భూలోకంలో చెప్పాడట. నంది గారి నిర్వాకానికి నివ్వెరపోయిన శివుడు- ‘మానవులు రోజూ తినాలంటే బోలెడు ఆహారాన్ని పండించాలి. అందుకని ఆ ఆహారాన్ని పండించడంలో నువ్వే వెళ్లి సాయం చెయ్యి’ అని నందిని శపించాడు. అప్పటి నుంచి రైతులు ఆహార పంటలను పండించడంలో, వ్యవసాయ పనుల్లో ఎద్దులు సాయపడుతూ వస్తున్నాయట. తమిళనాట ప్రాచుర్యంలో ఉన్న కథ ఇది. పుష్య బహుళ చవితి/ముక్కనుమ జనవరి 17, శుక్రవారం పుష్య బహుళ చవితి నాడు ముక్కనుమ పండుగ. కనుమ మర్నాడు వచ్చే ముక్కనుమ రోజున కొత్త వధువులు ‘సావిత్రీ గౌరీ వ్రతం’ అనే వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది బొమ్మలతో చేసే వ్రతం కాబట్టి దీనికి బొమ్మల నోము అనే పేరూ ఉంది. సంక్రాంతితో పాటు కనుమ నాడు గాలిపటాలను ఎగరేయడం సంప్రదాయం. అప్పుడప్పుడే వేడెక్కే ఎండల్లో గాలిపటాలను ఎగరేయడం ద్వారా సూర్యరశ్మి శరీరానికి తగినంత సోకి డి-వి•మిన్ లభిస్తుంది. దీనివల్ల చర్మవ్యాధులు దరిచేరవు. ఇక, ముక్కనుమ నాడు గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్ని వండుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకనే ముక్కనుమను ముక్కల పండుగగానూ పిలుస్తారు. పుష్య బహుళ పంచమి జనవరి 18, శనివారం ఈనాడు వేమన జయంతి. ఈనాడు దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. పంచమి తిథి జనవరి 19, ఆదివారం కూడా కొనసాగుతుంది. పుష్య బహుళ షష్ఠి జనవరి 20, సోమవారం కుమారస్వామిని పూజించాలి. షష్ఠి తిథి ఆయన పూజకు ఉద్ధిష్టమైనది. పుష్య బహుళ సప్తమి జనవరి 21, మంగళవారం పుష్య బహుళ సప్తమి తిథి నాడు సూర్యుడిని ఆరాధించాలి. సప్తమి తిథి ఆయనకు ఇష్టమైనది. పుష్య బహుళ అష్టమి జనవరి 22, బుధవారం పుష్య కృష్ణ (బహుళ) అష్టమి నాడు దుర్గాపూజలు చేస్తారు. పుష్య బహుళ అష్టమి నాడు కాలాష్టమి వ్రత దినమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. కాలభైరవుని పూజకు, శక్తిపూజకు అనువైన దినమిది. పుష్య బహుళ నవమి జనవరి 23, గురువారం పుష్య బహుళ నవమి తిథి నాడు అన్వష్టకా శ్రాద్ధమ్ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే గ్రంథంలో వివరించారు. పుష్య బహుళ దశమి జనవరి 24, శుక్రవారం పుష్య కృష్ణ (బహుళ) దశమి నాడు దశహరా దేవి.. అంటే దుర్గాదేవిని పూజించాలని నియమం. దశమి తిథి అమ్మవారి పూజకు ఉద్ధిష్టమైనది. పుష్య బహుళ ఏకాదశి జనవరి 25, శనివారం పుష్య బహుళ ఏకాదశిని షట్ తిలైకాదశి (షట్ + తిల + ఏకాదశి) అనే పేరుతో ‘ఆమాదేర్ జ్యోతిషీ’ అనే గ్రంథంలో పేర్కొన్నారు. చతుర్వర్గ చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో ఈనాడు తిలదాహీ వ్రతం చేస్తారని రాశారు. షట్ తిలైకాదశి అంటే.. ఆరు విధాలుగా తిలలను ఉపయోగించే ఏకాదశి. ఆ ఆరు విధాలు ఏమిటంటే.. 1. స్నానం చేసే నీటిలో నువ్వులను వేయాలి. 2. నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాచుకోవాలి. 3. ఆరు నువ్వుల గింజలను తినాలి. 4. తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవాలి. 5. గురుజనులకు తిలలు దానం చేయాలి. 6. తిల తర్పణం విడువడం ద్వారా దేవతలకు నువ్వులు సమర్పించాలి. నువ్వులను పై ఆరు విధాలుగా ఉపయోగించాలనే ఆచారం వల్ల దీనికి షట్ (ఆరు) తిలైకాదశి అని పేరు. పుష్య బహుళ ద్వాదశి జనవరి 26, ఆదివారం ద్వాదశి తిథి సంప్రాప్తి ద్వాదశి దినం. ఇంకా మహా ఫల ద్వాదశి, సురూప ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. కూర్మ ద్వాదశి ఆచరిస్తారని మరికొన్ని పంచాంగాలలో ఉంది. పుష్య బహుళ అమావాస్య జనవరి 29, బుధవారం పుష్య బహుళ అమావాస్యతో పుష్య మాస తిథులు ముగుస్తాయి. పుష్య కృష్ణ అమావాస్యనే ‘బకులామాస్య’ అనీ అంటారు. తిథి తత్త్వం దీన్ని ‘అర్థోదయామావాస్య’ అంటోంది. ఈనాడు సముద్ర స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని శాస్త్ర వచనం. అలాగే ఈనాడు పితృతర్పణం చేస్తే వారి పితరులు 21 తరాల వారు నరకలోక యాతనల నుంచి బయటపడి స్వర్గానికి వెళ్తారని పురాణగాథ. గోదావరి ప్రాంతంలో పుష్యకృష్ణ అమావాస్యను ‘చొల్లంగి అమావాస్య’ అంటారు. చొల్లంగి అనేది ఊరి పేరు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఇది ఉంది. ఇది సముద్రతీర గ్రామం. గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సముద్రంలో కలిసే చోటు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం కలుగుతుంది. చొల్లంగిలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. గోదావరి జిల్లాలలో ‘సప్తసాగర యాత్ర’ అని ఒకటి ప్రాచుర్యంలో ఉంది. అది చొల్లంగి అమావాస్యనాడే ఆరంభమవుతుంది. సాగర యాత్ర ప్రారంభం.. ముగింపు ఈ పర్వంతోనే ముడిపడి ఉన్నాయి. గౌతముడు, తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఏడుగురు రుషుల పేరుతో ఏడు గోదావరి శాఖలు సప్త గోదావరి శాఖలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఏడు ప్రదేశాలకు వెళ్లి స్నానం చేసి రావడాన్నే ఉభయ గోదావరి జిల్లాల్లో సప్తసాగరయాత్ర అంటారు. ఈ యాత్ర చొల్లంగి స్నానంతో అనగా, పుష్య బహుళ అమావాస్యతో ఆరంభమవుతుంది. ఏడు తావులు చూసుకుని ప్రాయకంగా మాఘశుద్ధ ఏకాదశి నాటికి వశిష్ఠా సాగరసంగమ స్థానమైన అంతర్వేది చేరతారు. ఆనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగు తుంది. ఆ ఏకాదశికి అంతర్వేది ఏకాదశి అని పేరు. సప్త సాగర యాత్రకు ఇలా ప్రారంభ, ముగింపు దినాలు పర్వదినాలయ్యాయి. మాఘ శుద్ధ పాడ్యమి జనవరి 30, గురువారం మాఘ శుద్ధ పాడ్యమి నాటి నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఇది సూర్యారాధనకు అనువైన మాసం. ఈ మాసం పొడవునా సూర్యుడిని విశేషంగా ఆరాధిస్తారు. మాఘ శుద్ధ విదియ జనవరి 31, శుక్రవారం మాఘ శుద్ధ విదియ త్యాగరాజ స్వామి ఆరాధన తిథి. ఈనాడు త్యాగరాజ కృతులను ఆలయాల్లో ఆలపించడం ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో త్యాగరాజ స్వామి ఈనాడు విశేష ఆరాధనలు అందుకుంటారు.
పిల్లల ఆటపాటలు
మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక చందమామ రావే చందమామ రావే జాబిల్లి రావే రైలెక్కి రావే రష్యా కథలు తేవే ఇంజనెక్కి రావే ఇంగ్లిషు కథలు తేవే బస్సెక్కి రావే బంగ్లా కథలు తేవే కారెక్కి రావే కాంమ్రేడ్ కథలు తేవే హారన్ కొడుతూ రావే ఆకలి కథలు తేవే కొండెక్కి రావే కోటివేలు తేవే ఒలిచిన చాకొలెట్లు ఒళ్లో పెట్టుకుని కరిగిన ఐస్క్రీమ్ చేత్తో పట్టుకుని అలా అలా అలా వచ్చి మా తెలుగు పిల్లల తీపి నోట్లో వేసి పోవే పిల్లికూన కుక్కపిల్ల: పిల్లికూనా పిల్లికూనా గళ్ల గళ్ల పిల్లికూనా కళ్ల నీళ్లు ఎందుకమ్మా? పిల్లికూన: కుక్కపిల్లా కుక్కపిల్లా! ఒక్క సంగతి చెప్పగలవా? ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావ్? కుక్క పిల్ల: భౌ భౌమని అరుస్తాను పసందైన కుక్క భాష పాలు నీకు కావాలా? భౌ భౌమని అరచి చూడు పిల్లి కూన: భౌ భౌమని అరవలేను బాగు లేదు కుక్క భాష మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు (అమ్మ భాష తెలియక పిల్లికూన ఏడవసాగింది. అంతలో ఓ పెద్దపిల్లి కనిపించింది. ఎందుకేడుస్తున్నావని అడిగింది) పిల్లి కూనా పిల్లి కూనపా ఎందుకమ్మా ఏడుస్తావ్? పిల్లి కూన: ఆకలేస్తే పాల కోసం అమ్మనేమని అడుగుతావ్? పెద్దపిల్లి: మ్యావ్ మ్యావ్ మ్యావ్ (వెంటనే పిల్లి కూన మ్యావు మ్యావంటూ ఇంట్లోకి వెళ్లింది. తల్లి పిల్లి దాని భాషను తెలుసుకుని పాలిచ్చింది) సీత - ఉడత సీత: ఏరోప్లేన్ తెచ్చావా ఉడతా, ఉడతా, నే యూరోపు వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉడత: హోరుగాలి కొట్టొచ్చు కారుమబ్బు పట్టొచ్చు ఏరోప్లేను తేలేను సీతా, సీతా నే యూరోపు రాలేను సీతా, సీతా! సీత: స్టీమరేనా తెచ్చావా ఉడతా, ఉడతా నే సీమకెళ్లి రావాలి ఉడతా, ఉడతా! ఉడత: ఏ తుపాను వస్తుందో! ఏ కెరటం లేస్తుందో! స్టీమరేనా తేలేను సీతా, సీతా! నే సీమకేనా రాలేను సీతా, సీతా! సీత: రైలుబండి తెచ్చావా ఉడతా, ఉడతా, నే రామేశ్వరం వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉడత: అడుగడుక్కి వంతెనలు నడుమ నడుమ సొరంగాలు రైలుంబడి తేలేను సీతా, సీతా, నే రామేశ్వరం రాలేను సీతా, సీతా! సీత: కారుగాని తెచ్చావా ఉడతా, ఉడతా, నే కాకినాడ వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉడత: పెద్దబస్సు లెదురొస్తయ్ ఎద్దుబళ్లు అడ్డొస్తయ్ కారేన తేలేను సీతా, సీతా, నే కాకినాడ రాలేను సీతా, సీతా! సీత: సైకిలేన తెచ్చావా ఉడతా, ఉడతా, నే సరదాగా వెళ్లాలి ఉడతా, ఉడతా! ఉడత: మలుపు గిలుపు తిరగాలి, మనిషొస్తే ఒరగాలి సైకిలేన తేలేను సీతా, సీతా, నే సరదాగా రాలేను సీతా, సీతా!
Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
January 17, 2025
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40
Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia