Clemson University was founded in 1889 as a public, co-education and research university. It has 1,1400-acre campus at
- Cover Story
- Editorial
- Uttarayanam
- Masam Vishesham
- Kids Page
కన్నీరు – చిరునవ్వు
కన్నీరు..
మనసును కలత పెడుతుంది.
చిరునవ్వు..
మనిషిని సంతోషభరితం చేస్తుంది.
ఈ రెండూ పరస్పర ఆధారితాలు. ఒకదానితో మరొకటి సంబంధం గలవి. ఈ రెండింటి మధ్యా ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి అనాదిగా, అవిశ్రాంతంగా మనిషి చేయని ప్రయత్నం లేదు.
అలాగే, ఏళ్లుగా ఈ కన్నీళ్లు, చిరునవ్వుల గురించిన ప్రశ్నలు మానవ మస్తిష్కాలను తొలుస్తూనే ఉన్నాయి.
ఏమిటీ కన్నీరు?
అదొక శాపం. భగవంతుడి పరోక్షానికి సాక్ష్యం.
ఏమిటీ చిరునవ్వు?
ఇదొక వరం. భగవంతుడి ప్రత్యక్షానికి సాక్ష్యం.
ఈ ప్రశ్నలూ, సమాధానాలు రెండూ మనల్ని తికమక పెడుతుంటాయి. ఆశ్చర్యపరుస్తుంటాయి.
ఈ ప్రశ్నలకు సమాధానాలేంటనే దానికి కొందరు ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. కొందరు సమాధానం చెప్పలేక, సముదాయించుకోలేక కన్నీరు పెట్టుకుంటారు. వీచే గాలిని బట్టి తమ ఆకృతులను మార్చుకునే మేఘాల్లా ఇంకొందరు తమకెదురైన వివిధ అనుభవాలను బట్టి పై సమాధానాలను తరచుగా సవరించుకుంటుంటారు. నిజం చెప్పాలంటే కన్నీటికి, చిరునవ్వుకీ మధ్య ఉన్నది మోసపూరిత సంబంధం. ఈ బంధం చిక్కుముడిని విప్పడానికి ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ, ఎవరి అంచనాలకూ, ప్రయత్నాలకు అందని మేరు శిఖరంలా అదలా ఉండిపోతూనే ఉంది. మోనాలిసా చిరునవ్వును గురించి ఎందరో ఎన్నో రకాలుగా ఈనాటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. కానీ, ఏదీ సరైన విశ్లేషణ కాదని ఎప్పటికప్పుడు నిగ్గుతేలుతోంది. సమాధానం లేని ఈ ప్రశ్నలు నాపై పదేపదే దాడి చేస్తూ, అంత:కరణాల లోతుల్లోకి ఇంకిపోతు న్నాయి. ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నించినప్పుడల్లా కన్నీరు-చిరునవ్వు మధ్య గల మోసపూరిత మాయ నా తెలివిని అధిగమిస్తోంది. దీంతో నా ఆలోచనా స్రవంతి దారితప్పి.. నన్ను ఏవేవో నిర్ధారణల వైపు నడిపిస్తూ వచ్చింది.
నిజానికి ఒక్కోసారి ప్రశ్నలకు ఎలాంటి సమాధానం కనుగొనక పోవడమే పెద్ద ఉపశమనం కలిగిస్తుంది. ప్రశ్నల పిడికిలిలో నిస్సహాయంగా చిక్కుకుపోయినపుడు ప్రశ్నించడమే మానుకోవాలి. అప్పుడు హృదయాంతరాళలోని అలజడీ, ఆత్రుత క్రమంగా సద్దుమణుగుతాయి. కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రయత్నం చేయకపోవడం కూడా చాలా ఓదార్పునిస్తుంది.
అసలు తెలివైన వాడంటే ఎవరు?
మన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవాడు కాదు.. తగిన ప్రశ్నలు వేసేవాడే తెలివిపరుడు.
కాబట్టి అంతుబట్టని ప్రశ్నలకు సమాధానం కనుక్కునే ప్రయత్నం మానేసి, నావైన కొన్ని ప్రశ్నలతో వాటిని ఎదుర్కోవాలని నిశ్చయించుకున్నాను.
ముందుగా, అతి ముఖ్యంగా నేను వేసుకున్న ప్రశ్న-
భగవంతుడు వివేకవంతుడు కాడా?
పోనీ తగినంత వివేకవంతుడు కాడా?
నన్ను మించిన వివేకవంతుడు కాడా?
మనందరి కన్నా కూడా వివేకవంతుడు కాడా?
భవిష్యత్తులో వివేకవంతులు కాగలిగిన వారందరి కన్నా కూడా వివేకవంతుడు కాడా?
ఆపైన, భగవంతుడు నిజంగా నన్ను ప్రేమిస్తాడా?
అందరికన్నా కూడా ఎక్కువగా నన్ను ప్రేమిస్తాడా?
నా తల్లిదండ్రుల కన్నా కూడా ప్రేమిస్తాడా?
.. ఈ ప్రశ్నల క్రమం నా హృదయాన్ని ఆక్రమించింది. ఫలితమే ‘హసిత బాష్పా’లనే ఈ పద్దెనిమిది కవితల కవితాత్మక ఆవిష్కరణ.
అశ్రుకణం.. కన్నీటి చుక్క..
ఆ మాట పలికితే పెదవులు పరిశుద్ధమవుతాయి. కన్నీరు అనుభవంలోకి వస్తే మనసు తేలికపడుతుంది. హృదయంలో శాంతిని నింపుతుంది. వడగట్టిన జ్ఞానాన్ని మెదడులో రంగరిస్తుంది. కన్నీటి కొలను కఠోరమైన జీవనపాఠాలను బోధించి.. నిశ్చలంగా ఎలా ఉండాలో నేర్పుతుంది. అంతుబట్టని రహస్యాలను అంత:కర్ణాల దరిచేరుస్తుంది. కన్నీటి స్పర్శ మృదువుగా ఉంటుంది. ఎంతో ఉపశాంతినిస్తుంది. విషాదాన్ని పలికించే కన్నీటి గీతికలు శ్రవణపేయంగా ఉంటాయి. అవి పెదవులపై వాడిపోని చిరునవ్వులను పూయిస్తాయి. హృదయపు చీకటి గుహల్లోకి అంతులేని కాంతిని ప్రసరిస్తాయి.
ఏమిటీ.. కన్నీటి గురించి ఈ కబుర్లు చదువుతుంటే నాకేమైనా పిచ్చిపట్టిందా? అని అనుకుంటున్నారా? అనుకునే ఉంటారు! అలా అనుకోకపోతే పై పంక్తులు మీరు చదవలేదని అర్థం.
ఇన్నాళ్లూ నేను భగవంతుడు పిచ్చివాడనే భ్రమలో ఉన్నాను. కానీ, ఇప్పుడిప్పుడే నాకు తెలిసిన నిజమేమిటంటే, భగవంతుడు కాదు.. నేనే పిచ్చివాడినని!. మధ్య మధ్యలో మన జీవితంలోకి లోతుగా తొంగి చూసుకున్నా, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పైపైన చూసినా భగవంతుని ఉనికికి నిక్కమైన సాక్ష్యం దొరుకుతుంది. ఇన్ని రోజులూ ఆయన నా సమీపంలోనే ఉన్నా, ఆయనను దర్శించడానికి నాకు దూరపు చూపు లోపించిన చక్షువులు కరువయ్యాయి. ఇన్ని రోజులూ ఆయన అవ్యాజ ప్రేమ అనే దివ్య వర్షంలో స్నానమాడుతూనే ఉన్నాను. కానీ, అలసిపోయిన నా నరాలు నిరవధికమైన ఆయ కృపా వైభవాలను అందుకోలేకపోయాయి. విస్తుగొలిపే ఆయన వివేకమూ, సంభ్రమాశ్చర్యాలు కలిగించే ఆయన అనంత ప్రేమా నన్ను నిర్మలమైన నిశ్శబ్దంలోకి నెట్టి, ఏకాంతమనే ఆనందధామంలోకి విసిరేశాయి.
జనన మరణాలు, మంచిచెడులు, ఉదయాస్తమయాలు, రాత్రీ పగలూ.. ఇవన్నీ పరస్పర వ్యతిరేకాలు కావు. ఆకలీ అన్నమూ పరస్పర వ్యతిరేకాలు కావు. ఆకలి వేయనిదే మనం అన్నం రుచి చూడలేం. పూర్తిగా నిండిన కడుపు విందు భోజనాన్ని ఆస్వాదించలేదు. ఆరోగ్యమూ రోగమూ పరస్పర వ్యతిరేకాలు కావు. ఇవీ పరస్పర పూరకాలే. మనం ఆరోగ్యాన్ని కోల్పోతాం. జబ్బుపడతాం. తిరిగి ఆరోగ్యాన్ని పొందుతాం. ఆరోగ్యంగా ఉంటే ఆనందం కలుగుతుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉండలేం. అంటే పోగొట్టుకుంటే కానీ అదెంతటి భాగ్యమో తెలుసుకోలేం. ఒక నాటకంలోని నాయకుడూ, ప్రతినాయకుడూ భిన్న ధ్రువాలు కారు. ఇద్దరూ ద్వంద్వాత్మక దివ్య నాటకంలో అనివార్య భాగాలు. ప్రతినాయకుడు లేని సినిమా విసుగు పుట్టిస్తుంది. నాటకం పూర్తికాగానే నాయకుడూ, ప్రతినాయకుడూ దర్శకుడితో కలిసి కాఫీ తాగుతారు. అలాగే కన్నీళ్లు - చిరునవ్వులు కూడా. ఇవి మనం అపార్థం చేసుకునే పరస్పర పర్యాయపదాలు. పైకి వ్యతిరేకార్థ పదాలుగా కనిపించే ఇవి పరస్పర విరుద్ధార్థకాలు కావు. పరస్పర పూరకాలు. నిజానికవి ఒకదానినొకటి పరిపోషించుకుంటాయి. ఒకదాని సమక్షాన్ని మరొకటి ఆనందిస్తాయి. ఒకదానితో మరొకటి కరచాలనం చేసుకుంటాయి. ఆలింగనం చేసుకుంటాయి. అంతిమంగా ఆనందభరిత జీవన నృత్యంలో సంతోషభరితంగా ఒకదానితో మరొకటి కలిసిపోయి కరిగిపోతాయి. కన్నీళ్లు - చిరునవ్వులు ఒకదానిని విడిచి మరొకటి ఉండలేవు. మనం ఎప్పుడైతే కన్నీళ్లను తిరస్కరిస్తామో, చిరునవ్వులను కూడా తిరస్కరించినట్టే. ద్వంద్వాత్మకమైన వాటి పరస్పర ఆధారాన్ని ఎవరూ విడదీయలేరు.
ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే- కమ్మరి ఒక ఇనుపగడ్డను రెండు ముక్కలు చేస్తాడు. ఒక ముక్కతో కత్తిని, ఇంకో ముక్కతో ఆ కత్తి వేటు నుంచి కాచుకునే డాలును తయారు చేస్తాడు. యుద్ధం జరిగినంతసేపూ కత్తి గాయపరచడానికీ, డాలు కాపడటానికీ ప్రయత్నిస్తాయి. కత్తి, డాలు పైకి పరస్పర విరుద్ధాలుగా కనిపిస్తాయి కానీ, అవి పుట్టింది ఒకే మూలం నుంచి. కాకపోతే తమ లక్షణాలకు తగిన పాత్రలను పోషిస్తుంటాయి. యుద్ధం ముగియగానే రెండింటినీ ఒక మూలకు విసిరేస్తారు. అవి పరస్పరాలింగనంలో ఆనందంగా అక్కడే పడుంటాయి. అలాగే ఒక నాయకుడూ, ప్రతినాయకుడూ, ఒక మిత్రుడూ, ఒక శత్రువూ కూడా. జీవన్నాటకం ఎప్పుడైతే ముగిసిందో, అప్పుడందరూ భగవంతుడి దివ్యధామానికి చేరి విశ్వదర్శకుడి సన్నిధిలో సంతోషంగా ఉండిపోతారు.
తల్లి పురిటి నొప్పుల నుంచి పుట్టే శిశువు.. మరోచోట, మరో సమయంలో మృత్యుహింసతో సమాధిగతమవుతున్న మరో శిశువుకు పర్యవసానమే. జన్మనిచ్చిన తల్లికి కలిగేది అనిర్వచనీయానందం. శిశువును పోగొట్టుకున్న తల్లికి మిగిలేది కడుపుకోత. ఒక తల్లి వేడుక మరో తల్లికి వేదన. అందుకే జననం-మరణం పరస్పరాధారితాలు. రేపటి చితిమంటలు నేటి పుట్టిన రోజు వెలుగులకు సూచికలు. ఒక చెట్టు పుట్టాలంటే ఒక బీజం మట్టిలో కలిసిపోక తప్పదు. వేసవి మహోగ్రతాపం లేనిదే భూమాత కడుపు పండించే వర్షరుతువు పుట్టదు. వేసవిలో సూర్యకిరణాలు వేడిని సంతరించుకోకుంటే, సముద్రపు నీటి బిందువులు ఆవిరిగా నింగికెగసి వర్షరుతువులో మనపై జలధారలు కురిపించవు. ఇదంతా అర్థం చేసుకోని ఫలితమే.. కన్నీటి పట్ల మనకు కలిగే విద్వేషం, వేదన.
కన్నీటి చుక్క మూలాలేమిటి?
కన్నీటికి ప్రారంభమూ, ముగింపూ ఎక్కడ?
ఇవి మనకు తెలియవు. విశ్వసంబంధమైన స్ప•హ లోపించడం వల్లే కన్నీటి పట్ల మనకు ఏవగింపు పుడుతోంది. ‘కన్నీటి’ అంతర్నిర్మాణం తెలుసుకోలేని అంధత్వం మనది. ఆ గుడ్డితనం నుంచే ద్వేషం పుడుతుంది. కన్నీటికే కన్నీరు పట్టేంత దుర్గతి కన్నీటిది. కన్నీరొచ్చినపుడు అన్ని తలుపులూ మూసుకుని పోయినట్టవుతుంది. అందరూ, అన్నివేళలా దానిని అసహ్యించుకుంటారు. ఏ ఒక్కరి ప్రేమకూ అది నోచుకోదు. అందుకే బహుశా కన్నీటి చుక్క అంతగా ఎవరూ కన్నీరు కార్చి ఉండరు. కన్నీరే గనుక తన ఆత్మకథ తనే రాసుకుంటే అది మనచే కంటతడి పెట్టిస్తుంది. ‘అన్ని సముద్రాలనూ ఇంకిపోయేలా చేయండి. వాటిని తిరిగి నా కన్నీటితో నింపుతా’నని అది రోదిస్తుండొచ్చు.
కన్నీరు ప్రతిరోజూ ఎందరెందరి తలుపులో తడుతుంది. కానీ, ఒక్కరూ తలుపు తీయరు. ఆహ్వానించరు. అలాంటి తిరస్క•త, పరాజిత అశ్రుబిందువు నిజానికి భగవంతుడికి అత్యంత ప్రేమబంధువు. చిరునవ్వూ, కన్నీరూ.. ఈ రెండూ భగవంతుని ప్రీతిపాత్రమైన సంతానం. కానీ, మనం ఆయన సంతానంలోని ఒకరిని ప్రేమిస్తాం. ఇంకొకరిని ఏవగించుకుంటాం. అది న్యాయమేనా? తన సంతానంలోని ఒకరిని ద్వేషించడం భగవంతుడు హర్షించేలా చేస్తుందా? అందరికన్నా వివేకవంతుడూ, మనల్ని అమితంగా ప్రేమించేవాడూ, అందరికన్నా మనకు అత్యంత ప్రేమాస్పదుడూ అయిన భగవంతుడు మనకు చిరునవ్వులూ పంచుతున్నాడు. కన్నీళ్లూ ప్రసాదిస్తున్నాడు. తల్లీ, తండ్రీ కూడా తనేగా రూపెత్తిన, అంతకన్నా ఇంకా లక్షల రెట్లు ఎక్కువైన భగవంతుడు తను అమితంగా ప్రేమించే తన సంతానానికి కన్నీటిని ప్రసాదిస్తే ఎందుకు విచారించాలి? దానికి మనమెందుకు భయపడాలి? మన సుఖదు:ఖాల ద్వంద్వాత్మక అస్తిత్వంలో మనకు అర్థం కాని మన శ్రేయస్సు ఏదో ఇమిడి ఉంటే తప్ప కరుణా సముద్రుడైన భగవంతుకు మనకు కన్నీళ్లు ఎందుకు ఇస్తాడు? తరచూ ఇవే ప్రశ్నలు నన్ను తొలుస్తూ ఉంటాయి. ఇలా నన్ను నేను ప్రశ్నించుకునే కొద్దీ కన్నీటికీ, చిరునవ్వుకీ మధ్య ఉన్న సంబంధం మరింత తేటపడుతుంటుంది. భగవంతుడు మనల్ని కన్నీటితో శిక్షిస్తున్నాడా? లేక కన్నీటితో చికిత్స చేస్తున్నాడా? ఇది వివేచించుకోగలిగితే సమాధానం సులభంగా బోధపడుతుంది.
కన్నీటి చుక్క మన పాపాలకు శిక్ష కాదు. మన జీవితాన్ని పీడించే అదృశ్య రోగాలకు రహస్య చికిత్స. శిక్షలా అనిపించే సూదిమందు. అది భగవంతుడు మనకందించే చికిత్స. అనారోగ్యానికి గురైతే మనమెంత ఇష్టంగా, సంతోషంగా చికిత్సను స్వీకరిస్తామో అంత త్వరగానూ రోగవిముక్తులం అవుతాం. నొప్పి కలిగించే సూదిమందు ఇచ్చి, మన రోగాన్ని నయం చేసిన డాక్టరుకు ఫీజు చెల్లించి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటామో, అలాగే, మనకు కన్నీళ్లు ఇచ్చినందుకు భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుని వాటిని ఆనందంగా స్వీకరించాలి. మనం కష్టం కలిగిన ప్రతిసారీ భగవంతుడు మనల్ని ద్వేషిస్తున్నాడనీ, మనల్ని శిక్షిస్తున్నాడనీ, మన పాపాలకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడనీ, మనం కష్టాలు పడుతుంటే ఆనందిస్తున్నాడనీ అనుకుంటాం. కానీ, ఆయన ప్రేమ ఎంత గాఢమైనదీ, భేషరతైనదీ అంటే, ఆయనను మనమెంతగా ద్వేషిస్తామో, అంతకు వందరెట్లు మనపై అవ్యాజమైన ప్రేమను వర్షిస్తాడు.
మనం అడగకుండానే అమ్మ ప్రేమ అనే అద్భుతస్పర్శతో మనల్ని అనుగ్రహించే భగవంతుడు.. మనం కోరకుండానే నులివెచ్చని, తీయతీయని, పుష్టికరమైన పాలనూ.. మనం నేర్చుకోకుండానే వాటిని గ్రోలే కళనూ మనకు ప్రసాదించిన భగవంతుడు.. మన ఊపిరితిత్తులను నింపుకోవడానికి సమృద్ధిగా ప్రాణవాయువును సిద్ధం చేసి ఉంచిన భగవంతుడు.. ఎంత అనివార్యం కాకపోతే మనకు కన్నీళ్లు ఇస్తాడు?!. ఏమడగాలో కూడా మనకు తెలియని దశలోనే ఈ అమూల్య వరాలను అనుగ్రహించాడాయన. భగవంతుని కారుణ్యమూ, వివేకమూ అలాంటివి. నిజానికి పెద్దగా చదువు సంధ్యలు లేని సామాన్యులు సైతం నిర్వహించుకునేదీ, భావించుకునేదీ ఎట్టి షరతులూ లేని ప్రేమైకమూర్తిగానే!. తన ప్రేమను మనకు పంచడానికి ఆయన ఎలాంటి షరతులూ పెట్టడు. ఒక సాధారణ గృహిణి తను కన్న పసిపాప తన ముఖాన్ని కాళ్లతో తన్నినా ఆ కాళ్లను ప్రేమతో ముద్దాడుతుందే తప్ప కోపగించదు. అలాంటిది తల్లి కంటే లక్షల రెట్ల మాతృత్వం మూర్తీభవించిన భగవంతుడు మన హృదయాల్లో కన్నీటినెందుకు కుమ్మరిస్తాడు. భగవంతుడూ, కన్నీరు.. రెండూ అనాదిగా మన అవగాహనకు అతీతమవుతూనే ఉన్నాయి. మనం జీవించి ఉన్నంత వరకూ మన దైహిక అవసరాలను, అది కూడా సాధ్యమైన మేరకు మాత్రమే తీర్చుకోవడానికి ఉద్దేశించిన మన అల్ప మేధస్సు దివ్య వివేకపు లోతులను ఎప్పటికీ కొలవలేదు. భగవంతుని చర్యా, ప్రతిచర్యల లోలోతులు తెలియని మనం చిన్న కష్టం కలగగానే ఆయనను అపార్థం చేసుకోవడం ప్రారంభిస్తాం. నిజంగా కన్నీటిని ద్వేషించడమంటే ఏమిటో కూడా మనలో చాలామందికి తెలియదు. కన్నీటిని ద్వేషించడం అంటే స్వయంగా భగవంతుడిని ద్వేషించడమే. ఎందుకంటే కన్నీరు ఆయన ప్రియాతిప్రియమైన సంతానం.
కన్నీరు మన జీవితంలో పోషించే సానుకూల పాత్రను గురించి మనమెరుగం. దాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో, కన్నీరు భగవంతుడి ప్రేమ, వివేకాల నుంచి పుట్టిన అనర్ఘ శిశువన్న సంగతిని మనమెప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు దానిపై మన ద్వేషం మాయమవు తుంది. దానిని ప్రేమించడం ప్రారంభిస్తాం. కన్నీరు అనేది మారువేషం ధరించిన చిరునవ్వు. మనం దానిని ద్వేషించడం అంటే చిరునవ్వును ద్వేషించడమే. కన్నీటిని చిరునవ్వుగా మార్చుకోవడానికి ఏకైక మార్గం.. కన్నీటిని చూసి చిరునవ్వు చిందించడమే. ప్రేమ, ఆమోదాల మధ్య నలిగిన కన్నీరే చిరునవ్వుగా రూపాంతరం చెందుతుంది. భగవంతుడు ఇచ్చిన కన్నీటిని స్వీకరించి ఆనందించడమే అత్యుత్తమ ఆరాధన. కన్నీటిని సంతోషంగా ఆమోదించే వాడే భగవంతుడిని సంతోష పెడతాడు. కన్నీరు మారు రూపంలో ఉన్న భగవంతుని మహోన్నత ఆశీస్సు. చిరునవ్వులో కన్నా కన్నీటిలో భగవంతుని వివేకాన్ని దర్శించగలిగిన వాడే నిజమైన ఆధ్యాత్మిక ద్రష్ట. కన్నీటి చుక్క మనకు సంతోషం కలిగించకపోవచ్చు. కానీ, మనల్ని వివేకవంతులను చేస్తుంది. చిరునవ్వు మనకు సంతోషం కలిగించవచ్చు. కానీ, వివేకవంతులను చేయలేదు. కనుక మనం అసంతుష్టి- జ్ఞానం, సంతుష్టి- అజ్ఞానాలలో ఒక జంటనే ఎంచుకోవాలి. భగవంతుడు మన చిరునవ్వును హరించేది దానికి రెట్టింపూ, మూడురెట్లూ చేసి తిరిగి మనకివ్వడానికే. ఆధ్యాత్మిక దృష్టి కలిగిన ఏ వ్యక్తికైనా ఈ విషయం తెలుస్తుంది. అందుకే అలాంటి వ్యక్తి మొదటి జంటనే ఎంచుకుంటాడు.
కన్నీటి చుక్క చిరునవ్వును వీడని నీడ. కనుక కన్నీటి గురించి మనకు భయం అక్కర్లేదు. దగ్గరలోనే ఎక్కడో చిరునవ్వుల వెలుగుల జడి మన కోసం ఎదురుచూస్తోందని దానర్థం. బాహ్యంగా కనిపించే ముళ్లకంచెను దాటి, కన్నీటి చుక్క అంతరిక్ష, ప్రకృతి దృశ్యంలోకి మనం మానసిక యాత్ర చేసినప్పుడు అక్కడంతటా దారి పొడవునా అంతులేని చిరునవ్వులు వికసిస్తూ కనిపిస్తాయి. కన్నీటి చుక్క తనను ప్రేమించే ఏ ఒక్కరి హృదయాన్నీ ఎప్పటికీ ముక్కలు చేయదు. మన పెదవులపై నిర్భీతీ, నిత్య సంతోషమూ వెల్లివిరిసే చిరునవ్వే భగవంతుని పట్ల మన హృదయంలోని అదృశ్య విశ్వాసానికి దృశ్యమాన సాక్ష్యం. చాలామంది కన్నీటిని ఎందుకు తప్పించుకోలేరంటే తప్పించు కోవాలని అనుకుంటారు కనుక!. వివేకవంతుడు ఎప్పుడూ ఆ పని చేయకూడదు. కన్నీరే మనకు పెన్నిధి. కన్నీరే కళ్లు చేసుకున్న అదృష్టం. కన్నీరు మన హృదయాలలో ఇంద్రధనువులను సృష్టిస్తుంది. చీకటి మబ్బుల మధ్య సూర్యుడు చిందించే చిరునవ్వే ఇంద్రధనువులను ఆవిష్కరిస్తుంది. వర్షం లేనిదే ఇంద్రధనువు లేదు. అందుకే కన్నీటి చుక్క కంటికి ఆభరణం. వింతగొలిపే వైరుధ్యం ఏమిటంటే, కన్నీటిని విజయవంతంగా తప్పించుకునే అది దగ్గరి దారి.. దాని ప్రేమలో పడటమే. కన్నీటికి దూరంగా పారిపోవాలనుకుంటే మనం చేయాల్సింది.. దానికి దగ్గరగా పరుగెత్తడమే. నాకు తెలిసినంత వరకూ, కన్నీటి పొందులో పారవశ్యంతో కరిగిపోయిన ఏ కొందరో తప్ప దాని నుంచి విజయవంతంగా తప్పించుకున్న వారు మానవ చరిత్రలోనే లేరు. కన్నీటిని ఎప్పుడైతే ఆమోదించి సహనంతో అక్కున చేర్చు కుంటామో అప్పుడు వాటిని తొలగించాలని భగవంతుడిని ప్రార్థించే సమయం కన్నా కూడా త్వరగా అవి అదృశ్యమవుతాయి.
కృష్ణుడి చిరునవ్వుల వెలుగుల మూలాలు రాముడి విషాదాశ్రువులలో దాగున్నాయి. రాముడు దు:ఖించినంతగానూ కృష్ణుడు చిరునవ్వులు చిందించాడు. బహుశా రాముడి కన్నీళ్లే కృష్ణుడి చిరునవ్వులకు కారణమై ఉంటాయి. చిరునవ్వులకూ, కన్నీళ్లకూ మధ్య ఎప్పటికీ తెగని అంతస్సంబంధం అలాంటిది. మనం జయప్రదంగా, సహజగతిలో కన్నీటిని తప్పించుకోగల మార్గాలు మూడే.
మొదటిది- కన్నీటిని స్వాగతించడం. కన్నీటి చుక్క మన తలుపు తట్టినపుడు దానిని తిరస్కరించకుండా ఉండటం. మనకు చిరునవ్వులు వర్షించే మన ప్రియ భగవానుడే కన్నీటినీ పంపించాడని భావించి సంతోషంగా ఆహ్వానించడం!. ఆయన ఇచ్చేది ఏదైనా అక్కున చేర్చుకోగదగినదే. మనమలా చేసినప్పుడు దాని ప్రభావం సగానికి సగం మాయమైపోతుంది.
రెండవది- కన్నీరు ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడం. మనల్ని అపారంగా ప్రేమించే అమిత వివేకవంతుడైన తండ్రి మనకు ఏదిచ్చినా కృతజ్ఞతలకు అర్హమే. కనుక దానిని స్వాగతించడమే కాదు, భగవంతుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అప్పుడు కన్నీరు మూడొంతులు బలహీనమైపోతుంది.
- శ్రీరామ్

పుణ్యం.. ధన్యం
ఇళ్లు దీపకాంతులతో వెలుగొందుతూ పండుగ వాతావరణం సంతరించుకునేదీ, హరివిల్లు సాక్షాత్కరించేలా లోగిళ్లు రంగురంగుల ముగ్గులతో కళకళలాడేదీ ధనుర్మాసంలోనే.
ఈ మాసంలో గోదాదేవి చేపట్టిన వ్రతానికి సాక్షాత్తూ రంగనాథుడే దిగి వచ్చాడని చెబుతారు.
విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజూ ప్రస్తుతించే శ్రీవేంకటేశ్వర సుప్రభాతానికి బదులు తిరుప్పావై సంకీర్తనలు వినిపిస్తాయి.
తులసికి బదులు బిల్వ పత్రాలతో శ్రీవేంకటేశ్వరుడిని అర్చిస్తారు.
ధనుర్మాసంలో చేసే పూజలు కోరికలను నెరవేరుస్తాయని విశ్వసిస్తారు.
ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువు మధుసూదనుడిగా పూజలందుకుంటాడు.
గోధుమపిండి, బియ్యప్పిండి, మట్టితో విష్ణు ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహిస్తారు.
వైష్ణవాలయాల్లో అర్చనలు చేసి చక్కెర పొంగలితో తయారుచేసిన ప్రసాదాన్ని నివేదిస్తారు.
అనంతరం దాన్ని పిల్లలకు పంచుతారు. దీనినే ‘బాలభోగం’ అని వ్యవహరిస్తారు.
ఈ మాసమంతా ఆలయాలు గీతా ప్రవచనాలు, విష్ణు సహస్రనామ పారాయణాలూ, తిరుప్పావై సంకీర్తనలతో మార్మోగుతాయి.
కార్తీక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసం మదిరిగానే ధనుర్మాసమూ విశేషమైనది.
ఈ మాసంలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీనారాయణులను పూజిస్తారు.
సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది.
అప్పటి నుంచి భోగి, సంక్రాంతి పండుగ వరకూ నెల రోజుల కాలాన్ని తెలుగువారు నెలగంటగా పరిగణిస్తూ పూజలు చేపడతారు.
‘ధను’ అంటే ప్రార్థించేది సిద్ధిస్తుందనే అర్థాన్ని పురాణాలు చెబుతున్నాయి.
ఆండాళ్ రచించిన దివ్యప్రబంధమే ‘తిరుప్పావై’. ద్రవిడ భాషలో ‘తిరు’ అంటే పవిత్రమనీ, ‘పావై’ అంటే వ్రతమనీ అర్థం.
అందుకోసమే ధనుర్మాసం దివ్య ప్రార్థనలకు వేదికని, ఈ నెలలో ఆచరించే వ్రతాలతో లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందనీ అంటారు.
ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై సంకీర్తనలు ఆలపించిన వారికి ముక్తి మార్గం లభిస్తుందని గోదాదేవి చరిత్ర చాటుతోంది.
గోపికలు రేపల్లెలో కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుడిని భర్తగా పొందినట్టే, గోదాదేవి తన పాశురాలతో శ్రీరంగనాథుడిని కొలిచి ఆయననే పెళ్లాడినట్టు పురాణాలు చెబుతున్నాయి.
అంతటి పావనమైన పాశురాలను ఆలపిస్తూ ఈ ధనుర్మాసంలో మోక్షాన్ని, పుణ్యాన్ని పొందుదాం!.
- డాక్టర్ కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

ఉత్తరాయణం
పిల్లల చదువులు
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు పత్రిక నవంబరు సంచికలో అందించిన ప్రత్యేక కథనం బాగుంది. అక్కడి విద్యా విధానం చాలా బాగుంది. పిల్లలను స్కూలుకు పంపే తల్లిదండ్రులు, పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, వ్యవస్థను నడిపిస్తున్న ప్రభుత్వాలు నిజంగా ఇలాంటి విద్యా విధానాల గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వాలు అలాంటి విధానాలను అమలు చేయాలి. అలాంటి అత్యుత్తమమైన, అద్భుతమైన విద్యావ్యవస్థను రూపొందించాలి.
- పి.రవిశంకర్, సీహెచ్.అమర్నాథ్, టి.బిక్షపతి, ఆర్.కవిత, తాండూరు రమేశ్ మరికొందరు ఆన్లైన్ పాఠకులు
పిల్లల ఆరోగ్యం
చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆరోగ్య భాగ్యం శీర్షిక కింద పిల్లల ఆరోగ్యం గురించి అందించిన వివరాలు చదివించాయి. ఇలాగే ప్రతి సంచికలో పిల్లల చదువులు, వికాసం, ఆరోగ్యాలకు సంబంధించిన రెగ్యులర్గా ఏవైనా శీర్షికలు అందించండి.
- కె.కిశోర్, హైదరాబాద్
మానసిక స్వస్తత
నవంబరు సంచికలో మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, అదెలా దెబ్బతింటుందో, దానికంత ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాలో వివరించిన తీరు బాగుంది. వైద్యుల సలహా సూచనలు కూడా ఇవ్వండి.
- పి.రాజేశ్, తిరుపతి

కొత్త ఉషస్సుకు స్వాగతం
2025- డిసెంబరు 1, సోమవారం, మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి
2025- డిసెంబరు 31, బుధవారం, పుష్య శుద్ధ ద్వాదశి వరకు..
ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో చివరిదైన పన్నెండవ మాసం- డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర - పుష్య మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో మార్గశిర మాసం తొమ్మిదవది. డిసెంబరు 19, 2025- శుక్రవారం వరకు మార్గశిర మాస తిథులు, ఆపై డిసెంబర్ 20, 2025- శనివారం నుంచి పుష్య మాస తిథులు ఆరంభమవుతాయి. గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి, హనుమద్వ్రతం, శ్రీ దత్తాత్రేయ జయంతి, కూర్మ ద్వాదశి వంటి పర్వాలు ఈ నెలలో వస్తాయి. అలాగే, సంక్రాంతికి శ్రీకారం చుట్టే ధనుస్సంక్రమణం కూడా ఈ నెలలోనే. దక్షిణాయనంలో ఇది చివరి మాసం.
మార్గశిరం - పుష్యం.. ఈ రెండు మాసాలు కలిసి హేమంత రుతువు కాలం. ఈ రుతువును భాగవంత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. మార్గశిర మాసంలో విష్ణువు విశేష రీతిలో పూజలు అందుకుంటాడు. ఈ మాసంలో ఈయనకు అందే పూజల్లో వైకుంఠ ఏకాదశి ప్రధానమైనది. అలాగే గీతా జయంతి సందర్భం కూడా ఈ నెలలోనిదే. ఈ మాసం విష్ణు సంబంధమైనదే కాక, మరెన్నో విధాలుగా కూడా మహత్తరమయినది. ధనుర్మాసం ప్రారంభయ్యేది కూడా ఈ మాసంతోనే. ఆధ్యాత్మికంగా మార్గశిరం ఇంతలా పవిత్రమై ఉంటే, ఇక డిసెంబరులోనే మొదలయ్యే పుష్యమి మరింత ప్రశస్తమైనది. చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య ం. ఈ నిండార శీతాకాలంలో మంచు ఉధృతంగా కురుస్తుంది. చలి జివ్వుమనిపిస్తుంది. మంచు తెరల దుప్పటి ప్రకృతిని పరదాలా చుట్టుకుంటుంది. ఈ మాసంలో వేకువ వేళ ఆకుపచ్చని సస్యం (పంటలు/ప్రకృతి) శ్వేతవర్ణపు మంచు బిందువులతో స్నానమాడుతున్నట్టు గోచరిస్తుంది. ‘పుష్య’ అనే పదానికి ‘పోషణ శక్తి కలిగినది’ అని అర్థం. పాడిపంటలు సమృద్ధిగా పండి.. జనులకు కావాల్సిన ఆహారాన్ని నిండుగా సమకూర్చే మాసమిది. హేమంత రుతువు కాలంలో వచ్చే పుష్య మాసం పూర్తి శీతాకాలం. చలి గజగజ వణికిస్తుంది. పుష్య మాసంలో పూసగుచ్చే పొద్దుండదని నానుడి. అంటే, పగటి సమయం తక్కువగా ఉంటుంది. తొందరగా చీకటి పడిపోతుంది. ఆధ్యాత్మికంగా జపతపాలకు, ధ్యాన పారాయణాదులకు మేలైనది. వేదాధ్యయనానికి ఉద్ధిష్టమైన మాసమిది. ఆశ్వయుజం అమ్మవారికి, భాద్రపదం వినాయకుడికి, మార్గశిరం శ్రీమహా విష్ణువుకు, సుబ్రహ్మణ్యేశ్వరుడికి, కార్తీకం పరమశివుడికి ప్రీతికరమైన మాసాలైతే.. పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. అందుకే ఈ మాసానికి శని అధిపతి. నక్షత్రాధిపతి గురువు (బృహస్పతి). వీరిద్దరిని పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. నెల పొడవునా తనను పూజించే వారి పట్ల శనైశ్చరుడు ప్రసన్నుడై శుభాలను ప్రసాదిస్తాడని పురాణ ప్రవచనం. పుష్య మాసంలో అమావాస్య రోజు శని గ్రహానికి తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నుంచి నివృత్తి పొందవచ్చు. ఆ రోజు ఇంకా వస్త్రదానం, తిలదానం, అన్నదానం చేయడం వల్ల శని యొక్క దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. మార్గశిర - పుష్య మాసాల తిథులతో కూడిన డిసెంబరులో వచ్చే ప్రధాన పర్వాలు, ముఖ్య తిథుల వివరాలు..
మార్గశిర శుద్ధ ఏకాదశి
డిసెంబరు 1, సోమవారం
మార్గశిర శుద్ధ ఏకాదశికి సౌఖ్యదైకాదశీ అనే నామం కూడా ఉంది. వైఖానసుడు అని ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఈ విధంగా తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కలుగుతుందని చెబుతారు.
ఇక, భారత సారస్వతంలో తలమానికమైన భగవద్గీత పుట్టిన రోజు కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడేనని పంచాంగ కర్తలు అంటారు. అయితే ఈ తిథి నిర్ణయం విషయంలో అనేక సందేహాలు, భిన్న వాదనలు ఉన్నాయి. కాబట్టి గీతా జయంతి ఎప్పుడనే విషయం పక్కనపెడితే, ప్రస్తావన వచ్చింది కాబట్టి గీతా జయంతి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.
కార్తీక బహుళ అమావాస్య నాడే భగవద్గీత పుట్టిన దినంగా గుర్తించాల్సి ఉందని కొందరు అంటారు. అంటే, గీతా జయంతి ఈనాడే జరపాలనేది వారి మాట. అయితే, ఉత్తరాదిన మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
ఇక, భారత కాలమానాలను బట్టి చూస్తే, మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్వాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య అవుతుంది.
కార్తీక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. ఆనాడు శుద్ధ త్రయోదశి తిథి. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. ఈ లెక్కలను బట్టి కార్తీక బహుళ అమావాస్యే భారత యుద్ధ
ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చని కొందరు అంటారు. కాగా, భారత యుద్ధ ప్రారంభ సమయంలో అర్జునుడు కాగల బంధువధకు శంకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, కార్తీక బహుళ అమావాస్య నాడు జరిగిందని.. కాదు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అని రెండు రకాలుగా వ్యాప్తిలో ఉంది. ఏరోజైతేనేం.. రెండు తిథుల్లోనూ గీత ప్రాశస్త్యాన్ని గౌరవించుకుంటే మరీ మంచిది.
మార్గశిర శుద్ధ ద్వాదశి
డిసెంబరు 2, మంగళవారం
మార్గశిర శుద్ధ ద్వాదశి గొప్ప పర్వదినం. ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు అనేకం ఉన్నాయి. ఈ రోజు ఏ వ్రతం ఆచరించినా పుణ్యమేనని ప్రతీతి. ముఖ్యంగా ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం.
భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశీర్ష శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.
మార్గశిర శుద్ధ త్రయోదశి
డిసెంబరు 3, బుధవారం
మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు అనంగ త్రయోదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని వైభవంగా జరిపే ఆచారం కూడా ఉంది. ఇది ప్రత్యేకంగా గోదావరి జిల్లాలలో మాత్రమే కనిపిస్తుంది. ఈనాడు ఊరూవాడా హనుమద్ ఆలయాలలో పచ్చని కొబ్బరాకులు, తాటాకులతో పందిళ్లు వేసి అత్యంత వైభవోపేతంగా హనుమజ్జయంతి వేడుకలు నిర్వహిస్తారు. దీనినే హనుమద్వ్రతం అని కొన్ని ప్రాంతాలలో వ్యవహరిస్తారు. ఈనాటి నుంచి జ్యేష్ఠ కార్తె ప్రారంభం అవుతుంది.
మార్గశిర శుద్ధ చతుర్దశి
డిసెంబరు 4, గురువారం
మార్గశిర శుద్ధ చతుర్దశి నాటి నుంచి చాంద్రాయణ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి, తరువాత గౌరీదేవిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం చేయాలి. కాబట్టే దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అని కూడా అంటారు. శివ చతుర్దశీ శావ్రణికా తదితర వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. చతుర్దశికి ముందురోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నాడు నిరాహారిగా ఉండి ఆంబోతును పూజించాలి. మరునాడు కమలాలతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.
కాగా, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతిని కొన్ని ప్రాంతాల్లో ఈనాడే నిర్వహిస్తారు. మరికొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు ఆయన జయంతిని జరుపుతారు.
మార్గశిర శుద్ధ పూర్ణిమ
డిసెంబరు 4, గురువారం
మార్గశిర శుద్ధ చతుర్దశి ఘడియల్లోనూ పూర్ణిమ తిథి కూడా కూడి ఉంది. కాబట్టి ఈనాడే పూర్ణిమ సంబంధ పూజాధికాలను నిర్వహించుకోవాలి. మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. నాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇంకా అన్నపూర్ణ జయంతి, భైరవ జయంతి పర్వాలను కూడా ఈనాడే నిర్వహించే ఆచారం ఉంది. ఇటువంటి ప్రసిద్ధి గల ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడూ ఇట్లాగే నోము అసంపూర్తిగా మిగిలిపోతుంది. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు.
మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది.
వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణాలు జాస్తీ. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు తుదముట్టుతాయి. మార్గశిర పూర్ణిమ రోజున ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం.
మార్గశిర పూర్ణిమను వ్రత గ్రంథాలు నరకపూర్ణిమ అనీ, తెలుగు వారు కోరల పూర్ణిమ అని భీతి గొలిపే నామాలతో వ్యవహరిస్తుంటే, మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల (శుద్ధ) చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని
మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం.
ఉపవాసాలకు ఉద్ధిష్టమైన పర్వదినమిది. ఈ పర్వానికి ఉత్సవ శోభ కల్పించే ఘట్టాలూ ఉన్నాయి. గద్వాల (తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కేంద్రం) మొదలికల్లు అనే ఊరు సుప్రసిద్ధమైన శ్రీవేంకటేశ్వర క్షేత్రం. మొదలికల్లు అంటే సంస్క•తంలో శిలా క్షేత్రమని అర్థం. మార్గశిర పున్నమి నుంచి ఇక్కడ గొప్ప జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. కర్నూలు, నెల్లూరు వంటి దూర ప్రాంతాల నుంచి మేలు జాతి పశువులను ఇక్కడకు తీసుకువచ్చి ఈ ఉత్సవాలలో ప్రదర్శిస్తుంటారు. సంవత్సరంలోని మూడు వందల అరవై అయిదు రోజులు ఏదో ఒక ఉత్సవంతో అలరారడమే తెలుగు సంస్క•తి గొప్పదనం.
మార్గశిర బహుళ పాడ్యమి
డిసెంబరు 5, శుక్రవారం
మార్గశిర బహుళ పాడ్యమి నాడు కశ్మీరులో ఈనాడు కొత్త సంవత్సర మహోత్సవం జరుపుకుంటారని తెలుస్తోంది. నీలమత పురాణం కశ్మీరు దేశ ప్రధాన రచన. అందులో నవ సంవత్సరోత్సవ మహోత్సవం ఈనాడు జరుపుకుంటారని ఉంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
మార్గశిర బహుళ చతుర్థి
డిసెంబరు 8, సోమవారం
మార్గశిర బహుళ చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. ఇది గణపతి సంబంధమైనది. ప్రతి మాసంలో వచ్చే రెండు చతుర్థులు గణపతి పూజకు ఉద్ధిష్టమైనవి.
మార్గశిర బహుళ సప్తమి
డిసెంబరు 11, గురువారం
మార్గశిర బహుళ సప్తమి తిథి నాడు ఫల
సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం
ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఉంది. అయితే, ఆయా వ్రతాలను ఎలా ఆచరించాలనే వివరాలేవీ పెద్దగా
అందుబాటులో లేవు.
మార్గశిర బహుళ అష్టమి
డిసెంబరు 12, శుక్రవారం
మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమీ వ్రతం, కృష్ణాష్టమీ వ్రతం, రుక్మిణ్యష్టమీ వ్రతం, కాలాష్టమీ వ్రతం మొదలైనవి చేస్తారని ఉంది. కాలభైరవాష్టమిగా భావించి ఈ రోజున భైరవ జయంతి వ్రతం ఆచరించే ఆచారం కూడా ఉందని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.
మార్గశిర బహుళ నవమి
డిసెంబరు 13, శనివారం
మార్గశిర బహుళ నవమి నాడు రూప నవమి వ్రతం ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
మార్గశిర బహుళ ఏకాదశి
డిసెంబరు 15, సోమవారం
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి పర్వం. లుంపకుడు అనే వాడు మహిష్మంతుని కుమారుడు. అతను దేశం నుంచి బహిష్కరణకు గురయ్యాడు. దేశాలు పట్టి తిరుగుతుండగా, ఒక ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. దీంతో అతను బలవంతాన ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అజ్ఞాతంగానే అతను ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నాడు. అయినా ఆ వ్రతం యొక్క ఫలాన్ని అతను పొందాడు. కాబట్టే ఈ ఏకాదశికి సఫలైకాదశి అనే పేరు వచ్చింది. వైతరణి, ధనద సర్వకామ తదితర వ్రతాలు ఈ రోజు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాటి నుంచి మూలకార్తె ప్రారంభమవుతుంది.
మార్గశిర బహుళ ద్వాదశి
డిసెంబరు 16, మంగళవారం
మార్గశిర బహుళ ద్వాదశి నాడు మల్ల ద్వాదశి, కృష్ణ ద్వాదశీ వ్రతాలు ఆచరిస్తారని తెలుస్తోంది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ రెండు వ్రతాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈనాటి నుంచే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇది సంక్రాంతికి ఆరంభ సూచిక. ఈనాటి నుంచి మొదలుకుని సంక్రాంతి వరకు తెలుగు నాట మహిళలు ఉదయాన్నే లేస్తారు. ముంగిళ్లు తుడిచి కళ్లాపి చల్లి, ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల మీద గోమయంతో ముద్దలు చేసి ఉంచుతారు. వాటికి వరిపిండితో, కుంకుమతో బొట్లు పెట్టి పైన పువ్వులు గుచ్చుతారు. వాటిని పూజిస్తారు. ధనుస్సంక్రమణం నాటి నుంచి సంక్రాంతి వరకు నెల రోజుల పాటు ఇళ్ల ముందు ముగ్గులు పెట్టి పెద్ద పండుగ నాడు రథం ముగ్గుతో సాగనంపుతారు. ధనుర్మాసమంతా ముఖ్యంగా అమ్మాయిలకు ఉత్సాహాన్నిస్తుంది. వేకువనే లేచి, ఇంటి ముందు కళ్లాపి చల్లి, రంగవల్లులపై గొబ్బెమ్మల్ని అలంకరించి గొబ్బి పాటలు పాడతారు. ఇళ్ల ముందు పోటీపడి ముగ్గుల్ని అలంకరిస్తారు. అవెంత అందంగా వచ్చాయో చూసుకుని మురిసిపోతారు. ధనుస్సంక్రమణం నాటి నుంచే హరిదాసులు తెల్లవారుజామునే ఇంటింటికీ హరికీర్తనలు ఆలపిస్తూ తిరుగుతారు. ఈ మాసమంతా ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు సంబంధించిన వివరాలు శ్రీమద్భాగవతంలో విపులంగా ఉన్నాయి.
ఇక, ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం. వారంతా ఆ సమయంలో విష్ణుమూర్తిని దర్శిస్తారు. ముక్కోటి దేవతలు ఆయనను ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారు.
మార్గశిర బహుళ త్రయోదశి
డిసెంబరు 17, బుధవారం
మార్గశిర బహుళ త్రయోదశి యమ దర్శన త్రయోదశి పర్వమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
మార్గశిర బహుళ చతుర్దశి
డిసెంబరు 18, గురువారం
మార్గశిర బహుళ చతుర్దశి తిథికే మహోదధ్యమావాస్య అని పేరు. బకులామావాస్య అని మరికొందరు అంటారు. దీనికే ‘బకులక్షీరేణపాయసంకృత్యా’ అని నానుడి. అంటే, పాలతో పాయసం వండి ఇష్టదైవాలకు నివేదించే రోజు ఇదని అర్థం. ఇది మాస శివరాత్రి పర్వం.
మార్గశిర బహుళ అమావాస్య
డిసెంబరు 19, శుక్రవారం
మార్గశిర బహుళ అమావాస్య.. అమావాస్య తిథి. ఈ తిథి నాడు పితృ దేవతలకు తర్పణాలు విడుస్తారు. శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు.
పుష్య శుద్ధ పాడ్యమి
డిసెంబరు 20, శనివారం
ఈనాటి నుంచి పుష్య మాసం ఆరంభమవుతుంది. ఈ మాసపు ఆరంభ తిథి పుష్య శుద్ధ పాడ్యమి. తెలుగు నెలల వరుసలో పుష్య మాసం సంవత్సరంలో పదో మాసం. పుష్యంలో ఆవు ఈనితే ఆడపడుచుకు ఇచ్చివేయాలనే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. పుష్యమాసంలో పూస గుచ్చ పొద్దుండదని నానుడి. డిసెంబరు 21న కూడా పాడ్యమి తిథి ఘడియలే కొనసాగుతున్నాయి.
పుష్య శుద్ధ విదియ
డిసెంబరు 22, సోమవారం
పుష్య శుద్ధ విదియ తిథి నాడు ఆరోగ్య ద్వితీయ వ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి నాలుగు రోజులు విష్ణు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాచరణకు మొదటి రోజు పుష్య శుద్ధ విదియ. అంటే ఈనాడే. దీనినే మహా విష్ణు పూజ అని కూడా అంటారు. ఈ వ్రతంలో విష్ణువు విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఉంచి పువ్వులు, పండ్లు, దీపధూపాలు సమర్పించి మంత్రాలు జపిస్తారు. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుద్ధి చేసి పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రంపై విష్ణువు విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచాలి. పువ్వులు, తులసి దళాలు, పండ్లు, నైవేద్యం, దీపం, ధూపం వంటివి సిద్ధం చేసుకోవాలి. విష్ణువు విగ్రహాన్ని శుభ్రంగా అలంకరించిన బలిపీఠంపై ఉంచాలి. విష్ణు నామాలను జపిస్తూ ఆయన కోసం సిద్ధం చేసిన వాటిని ఆయనకు సమర్పించాలి. ఈ పూజను సంరక్షణ, ఆధ్యాత్మిక వృద్ధిని కోరుతూ చేస్తారు.
పుష్య శుద్ధ పంచమి
డిసెంబరు 25, గురువారం
పుష్య శుద్ధ పంచమి నాడు మధుసూదన భగవానుడిని పూజించాలి. ప్రతి మాసంలోని శుక్ల, కృష్ణ పక్షములలోని తిథులలో నాగుల పూజ యోగ్యమై ఉంది. ఇక, డిసెంబరు 25 క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్ డే.
పుష్య శుద్ధ షష్టి
డిసెంబరు 26, శుక్రవారం
పుష్య శుద్ధ షష్ఠిని కుమారషష్ఠి అని కూడా అంటారు. కుమార షష్ఠి అంటే కుమారస్వామిని పూజించడానికి ఉద్ధిష్టమైన షష్ఠి. ఈ పర్వం మనకంటే తమిళుల్లో ఎక్కువగా ఆచరణలో ఉంది. తమిళవాసులకు కుమారస్వామి ఇలవేల్పు. చాళుక్యుల కాలంలో తెలుగునాట కుమారస్వామి పూజ ఎక్కువగా ఉండేది. అయితే, ప్రస్తుతం తెలుగునాట కుమారస్వామికి పర్యాయ నామమైన సుబ్రహ్మణ్యుడిగానే కుమారస్వామి ప్రసిద్ధుడై ఉన్నాడు. కుమారస్వామి సుబ్రహ్మణ్య నామంతో తెలుగునాట విశేషంగా పూజలు అందుకుంటున్నాడు. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు వచ్చే సుబ్బారాయుడి షష్ఠి గోదావరి తీర ప్రాంతాలలో పెద్ద ఉత్సవం.
పుష్య శుద్ధ సప్తమి
డిసెంబరు 27, శనివారం
పుష్య శుద్ధ సప్తమి తిథి నాడు మార్తాండ సప్తమి, ద్వాదశ సప్తమి వ్రతాలను విశేషంగా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
పుష్య శుద్ధ అష్టమి
డిసెంబరు 28, ఆదివారం
పుష్య శుద్ధ అష్టమిని వివిధ వ్రత గ్రంథాలు మహా భద్రాష్టమి, జయంత్యష్టమి, దుర్గాష్టమి తదితర నామాలతో పేర్కొంటున్నాయి. ఈనాడు అష్టకా సంజ్ఞకమమైన శ్రాద్ధం చేస్తే పితృ దేవతలకు సంతుష్టి కలుగుతుందని, కులాభివృద్ధి జరుగుతుందని అంటారు.
పుష్య శుద్ధ నవమి
డిసెంబరు 28, ఆదివారం
పుష్య శుద్ధ అష్టమి తిథి ఘడియల్లోనే నవమి కూడా కూడి ఉంది. కాబట్టి ఈనాడే పుష్య శుద్ధ నవమి. ఈనాడు ధ్వజ నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు ఒంటిపూట భోజనం చేయాలి. మహా మాయను పూజిస్తూ వ్రత నియమం పాటించాలి.
పుష్య శుద్ధ దశమి
డిసెంబరు 29, సోమవారం
పుష్య శుద్ధ దశమి నాడు ద్వార పూజ (గడపకు పూజ) చేయడం ఆచారం. అయితే ఈ పూజ చేయడం ఉత్కళ దేశంలో ఎక్కువ ఆచారంలో ఉంది. ఈనాడు ద్వార ధర్మ దేవతలను పిండి మొదలైన వాటితో పూజిస్తారు. తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు. కాగా, వివిధ వ్రత గ్రంథాలు ఈ దశమిని శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి.
పుష్య శుద్ధ ఏకాదశి
డిసెంబరు 30, మంగళవారం
పుష్య శుద్ధ ఈ ఏకాదశి ముక్కోటి/వైకుంఠ ఏకాదశి పర్వం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ తొలి పర్వం నాడు ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారని ప్రతీతి. అందుకే పుష్య మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనది. అలాగే ఈ ఏకాదశికి రైవత మన్వాది దినమని పేరు. ఇది పుత్రదైకాదశిగా కూడా ప్రసిద్ధమై ఉంది. సుకేతువు అనే రాజు పుష్య శుద్ధ ఏకాదశి నాడు విద్యుక్తంగా వ్రతాన్ని ఆచరించి పుత్రుడిని వరంగా పొందాడు. కాబట్టి దీనికి పుత్రదైకాదశి అనే పేరు వచ్చింది.
ఇక, పుష్య శుద్ధ ఏకాదశికి రైవత మన్వాది దినమనే పేరు రావడానికి కారణమైన రైవతుడి కథ మిక్కిలి ఆసక్తికరమైనది. రుతువాక్కు అని ఒక ముని ఉండేవాడు. రేవతి నక్షత్రం నాలుగో పాదంలో ఆయనకు ఒక కుమారుడు జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడైన కొద్దీ మిక్కిలి దుర్మార్గంగా వ్యవహరించసాగాడు. అతనిలోని ఈ దుష్టత్వానికి కారణం అతని రేవతీ నక్షత్ర చతుర్థ పాద జాతక ఫలితమే అని తెలుసుకుని అతని తండ్రి రుతువాక్కు.. రేవతీ నక్షత్రాన్ని కిందపడిపోవాలని శపించాడు.
ఆ శాపం చేత రేవతి నక్షత్రం ద్వారకకు దగ్గరలో ఉన్న కుముదం అనే కొండ మీద పడింది. రేవతి నక్షత్రం అక్కడ పడటం చేత ఆ కొండకు అప్పటి నుంచి రైవతకము అనే పేరు వచ్చింది. రేవతి నక్షత్రం పడిన తాకిడికి ఆ కొండ మీద ఒక కొలను కూడా ఏర్పడింది. ఆ రైవత పర్వతం మీద ఆ తామర కొలను నుంచి ఒక కన్యక పుట్టింది. ఆమెను ఆ కొలను చెంత ఉండిన ప్రముచుడు అనే ముని పెంచి పోషించాడు. ఆమెకు ఆయన రేవతి అనే పేరు పెట్టాడు.
రేవతి పెళ్లీడుకు వచ్చింది. ప్రముచుడు ఆమెకు యోగ్యుడైన వరుడి కోసం వెతికి, దుర్దముడు అనే రాజునకు ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించాడు. పెళ్లి పనులు చేయసాగాడు.
అప్పుడు రేవతి, తన వివాహం రేవతీ
నక్షత్ర యుక్త లగ్నంలో చేయాలని ప్రముచుడిని కోరింది.
అప్పుడు ప్రముచుడు- ‘ఇప్పుడు నక్షత్ర మండలంలో రేవతీ నక్షత్రమే లేదు. అది కిందపడిపోయింది. నక్షత్రమే లేనపుడు దానికి చంద్ర సంయోగం ఎలా కలుగుతుంది? చంద్ర సంయోగం లేని నక్షత్రం వివాహానికి యోగ్యం కాదు. కాబట్టి వివాహానికి అర్హమైన శుభ నక్షత్రములు చాలా ఉన్నాయి. వాటిలో ఒక శుభ నక్షత్ర యుక్త సమయంలో నీకు వివాహం చేస్తాను’ అని బదులిచ్చాడు.
అప్పుడు రేవతి ప్రముచునితో- ‘నేనే రేవతి నక్షత్రాన్ని. మీ తపో మహిమ చేత రేవతీ నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలపండి. ఆ నక్షత్రమే నా వివాహానికి అనుకూలమైనది. మరొక నక్షత్రంలో చేసే వివాహం నాకు అవసరం లేదు’ అంది.
దీంతో ప్రముచుడు తన తపోధనాన్ని ధారపోసి రేవతి నక్షత్రాన్ని తిరిగి నక్షత్ర మండలంలో నిలిపాడు. దానికి చంద్ర సంయోగం కలిగించాడు. ఆ మీదట రేవతి నక్షత్రయుక్తమైన ఒక లగ్నంలో ఆమెను దుర్దముడికి ఇచ్చి వివాహం చేశాడు.
రేవతీ దుర్దముల కుమారుడు రైవతుడు. అతడు కాలక్రమాన సకల ధర్మవేది అయి మనువుగా ఆవిర్భవించాడు. మనువుల్లో అతను ఐదవవాడు.
రైవతుని మన్వంతరంలో విభుడు అనే వాడు ఇంద్రుడు. హిరణ్యరోముడు, వేదశ్రీ, ఊర్ద్వబాహుడు, వశిష్ఠుడు మున్నగు వారు సప్త రుషులు.
పుష్య శుద్ధ ద్వాదశి
డిసెంబరు 31, బుధవారం
పుష్య శుద్ధ ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి పర్వాన్ని జరుపుకుంటారు. ఇంకా ఈ తిథి నాడు సుజన్మ ద్వాదశీ వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.
ముక్కోటి దేవతలు ఒక్కటై వచ్చి..
శ్రీ మహా విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని భక్తులకు దర్శనమిచ్చే అపూర్వ సందర్భం వైకుంఠ ఏకాదశి పర్వం.
మార్గశిర మాసంలో వచ్చే విశిష్ట రోజుల్లో ఇదే పరమ విశిష్టమైనది. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఇంకా దీనినే మోక్షదైకాదశి, వైకుంఠ ఏకాదశి, పుత్రదైకాదశి, సౌఖ్యదైకాదశి అనే పేర్లతోనూ వ్యవహరిస్తారు. ఆధ్యాత్మికత, శాస్త్రీయతల కలయికకు ప్రతీకగా నిలిచే పర్వదినమిది. దక్షిణాయన పుణ్యకాలం పూర్తవుతూ, ఉత్తరాయణం సమీపించే సంధికాలంలో వచ్చే ఏకాదశి ఇది. మనకు గల ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇది అత్యంత పవిత్రమైనది.
నెలకు రెండు ఏకాదశులు
మన పూర్వీకులు ఏడాదిని రెండు ఆయనాలుగా, పన్నెండు మాసాలుగా విభజించారు. ప్రతి మాసంలో రెండు పక్షాలు వస్తాయి. అంటే ప్రతి నెల రెండుసార్లు ఏకాదశి తిథి వస్తుంది. ఇలా ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు.. ఒక్కో దానికి ఒక్కో విశిష్టత. కానీ, వీటన్నిటిలో అత్యంత పవిత్రంగా భావించేది వైకుంఠ ఏకాదశి. ధనుర్మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. తెలుగు వారు అన్ని పండుగలను చాంద్రమానంలో ఆచరించినప్పటికీ ఈ ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకోవడం విశేషం.
శయన ఏకాదశికి నిద్రించి..
ముక్కోటి నాడు మేల్కొని..
ఆషాఢ శుద్ధ ఏకాదశి మనకు తొలి ఏకాదశి. ఈనాడు మహా విష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు. ఈ ఏకాదశి నాడు పీఠాధిపతులు, సన్యాసాశ్రమంలో ఉన్న వారు చాతుర్మాస్య వ్రతదీక్ష చేపడతారు. తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు ఈనాటి నుంచి యోగనిద్రలోకి వెళ్తాడు కాబట్టే దీనికి శయన ఏకాదశి అనే పేరు వచ్చింది. దీనికి నాలుగు నెలల తరువాత విష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. అలా పుష్య శుద్ధ ఏకాదశి నాడు నిద్ర మేల్కొన్న విష్ణువును ఉత్తర ద్వారం నుంచి ముక్కోటి దేవతలు దర్శించుకుని తరిస్తారు. అదే వైకుంఠ లేదా ముక్కోటి లేదా మోక్షద ఏకాదశి. ఇది ధనుర్మాసంలో వస్తుంది. సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనూ రాశిలోకి ప్రవేశించే సమయం వరకూ ధనుర్మాసంగా పరిగణిస్తారు. ధనుర్మాసం 30 రోజులు. ఇది మార్గశిర, పుష్య మాసాల్లో విస్తరించి ఉంటుంది. ధనుర్మాస కాలం ఎంతో పుణ్యప్రదమైనదనీ, విష్ణువును ఈ మాసంలో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశి నాడు పూజించడం విశేషమైందని అంటారు. శ్రీ మహా విష్ణువుకు సూర్యచంద్రులు దక్షిణ, వామ నేత్రాలు. ఒకటి తేజస్సు, మరొకటి ఆహ్లాదం అందిస్తాయి. నేత్రాలు వేరైనా స్వామి కాంతితత్వ్తం ఒక్కటేనన్న మహా తత్త్వాన్ని ఈ పర్వం విశదపరుస్తుంది.
ఏ కొరతా లేనిది ‘వైకుంఠం’
‘కుంఠ’ అంటే కొరత కలది అని అర్థం. వైకుంఠ అంటే ఏ కొరతా లేనిదని భావం. అటువంటి వైకుంఠం శ్రీ మహా విష్ణువు లక్ష్మీదేవితో కూడి ఉండే నివాసం. విష్ణువు ఆ నివాసంలో లక్ష్మీదేవితో శేషశయ్యపై నివసిస్తాడు. త్రేతాయుగంలో రావణుని బాధలకు తాళలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠానికి వచ్చి హరి దర్శనం చేసుకున్నారు. వారికి ఏకాదశియే ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం కల్పించి మార్గదర్శి

ఆరోగ్యానికి ‘చిట్కా’!
ఎండా, వానా, చలి.. అప్పుడూ
ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ప్రతి ఇంట్లో బామ్మ ఉండేది. ఇప్పుడు లేదు. అప్పట్లో ఒంట్లో నలత చేసినా.. కలత చెందినా బామ్మ చిట్కా వైద్యంతో క్షణంలో నయమయ్యేది. ఇప్పుడు మెడికల్ షాపుకో, హాస్పటల్కో పరుగెడుతున్నాం. చిన్నదానికీ, పెద్దదానికీ, అయిన దానికీ, కాని దానికీ పరీక్షలు.. వైద్యుల ఎదుట నిరీక్షణలు.. అయినా నయమవుతుందా అంటే అదీ లేదు. ఒకపక్క ఆరోగ్యంతో ఒళ్లు గుల్ల.. ఇంకోపక్క వైద్యఖర్చులతో జేబు గుల్ల.. చిన్నా చితకా సమస్యలకు డాక్టర్లు, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. నాటి బామ్మలు ఇప్పుడు లేకున్నా.. ఆ బామ్మలు వదిలివెళ్లిన వైద్యపు చిట్కాలు పదిలంగా ఉన్నాయి. వాటినోసారి గుర్తు చేసుకుందాం. వీలైనంత వరకు పాటిద్దాం.
తలనొప్పి చిటికెలో
మాయం ఇలా..!
చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ వేధించే సమస్య- తలనొప్పి. దీనికి రకరకాల కారణాలు. తలనొప్పి మొదలవగానే మెడికల్ షాపునకు పరుగెత్తే వారెందరో! ఈసారి తలనొప్పి వస్తే ఆ పని చేయకండి. ఇలా చేసి చూడండి..
శొంఠికొమ్మును నీటితో తడిపి సానరాయి మీద బాగా అరగదీసి, ఆ గంధాన్ని తలనొప్పి ఉన్నచోట పట్టిస్తే చాలు.. ఆ గంధం గాలికి ఆరిపోయే లోగా తలనొప్పి మాయమవుతుంది.
తలనొప్పి నివారణ కోసం శొంఠికొమ్ము కషాయాన్ని లోనికి కూడా తీసుకోవచ్చు. రెండు కప్పుల నీటిలో రెండు గ్రాముల శొంఠికొమ్మును బాగా నలగ్గొట్టి వేసి, ఆ నీరు సగమయ్యే వరకు మరిగించాలి. అలా తయారు చేసిన కషాయాన్ని వడగట్టి, అందులో పటికబెల్లం కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
కొందరు పార్శ్యపు తలనొప్పి (మైగ్రేన్)తో బాధపడుతుంటారు. ఇది పట్టుకుందంటే ఒక పట్టాన వదలదు. దీర్ఘకాలం వేధించే మైగ్రేన్కూ శొంఠికొమ్ములతోనే చక్కని విరుగుడు ఉంది. వంద గ్రాముల శొంఠికొమ్ములను తీసుకుని నేతిలో దోరగా వేయించాలి. వేగిన శొంఠికొమ్ములను బాగా దంచి, వస్త్రఘాళితం పట్టాలి. మెత్తగా తయారైన ఈ శొంఠిపొడిలో 200 గ్రాముల పాత బెల్లం కలిపి బాగా దంచాలి. దీనికి ఒక గాజుసీసా లేదా పింగాణీ జాడీలో నిల్వ చేసుకుని రోజూ రెండుపూటలా భోజనానికి ముందు ఐదు గ్రాముల చొప్పున తీసుకుని కాసేపు చప్పరిస్తే చాలు ఎలాంటి దోషం వల్ల తలెత్తిన తలనొప్పి అయినా మటుమాయం కావాల్సిందే. అంతేకాదు, శొంఠి, బెల్లం కలిపి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తినడం వల్ల అరుచి పోయి బాగా ఆకలి కూడా పుడుతుంది.
తలనొప్పికి విరుగుడుగా తలనూనెల కోసం దుకాణాలపైన ఆధారపడాల్సిన పనిలేదు.
ఇంట్లోనే చక్కని తలనొప్పి తైలాన్ని తయారుచేసుకోవచ్చు. పావు కిలో నువ్వుల నూనెను మూకుడులో వేసి, పొయ్యి మీద సన్నని మంటపై వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత అందులో సన్నగా తరిగిన శొంఠిముక్కలు, వస వేరు ముక్కలు, అతిమధురం వేరు ముక్కలు.. ఒక్కొక్కటి పాతిక గ్రాముల చొప్పున వేసి, గరిటెతో కలియదిప్పుతూ వేయించుకోవాలి. ఇవి నల్లగా మారగానే పాత్రను దించేయాలి. చల్లారిన తరువాత ఈ నూనెను వడగట్టి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజూ తలకు రాసుకుంటే ఎలాంటి తలనొప్పులైనా నమయవుతాయి.
జలుబు, దగ్గు.. ఇదిగో మందు!
అందరినీ వేధించే సమస్యలు- జలుబు, దగ్గు. సాధారణంగా రుతువులు మారే సమయంలో జలుబు, ముక్కుదిబ్బడ పట్టి పీడిస్తాయి. జలుబు చేసిన వెంటనే మెడికల్ షాపుల్లో దొరికే మందులు వేసుకుంటారు చాలామంది. కానీ, ఇవి తక్షణమే జలుబును తగ్గించలేవు. జలుబు పూర్తిగా తగ్గడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. మందు మాకులు వాడినా, వాడకున్నా వారం పాటు వేధించే సమస్య జలుబు. అలాంటి దానికి ఇంగ్లిష్ మందుల బదులు ఇంట్లోనే తయారు చేసుకునే ఔషధం నుంచి ఉపశమనం పొందడం మేలు.
పసుపుకొమ్మును కాల్చి, ఆ పొగను పీలిస్తే జలుబు వల్ల కలిగే ముక్కుదిబ్బడ కొంతవరకు తగ్గుతుంది.
ఉల్లిరసం, అల్లం రసం, తేనె సమపాళ్లలో కలిపి మూడు పూటలా రెండేసి చెంచాల చొప్పున సేవిస్తే జలుబు, రొంప నుంచి ఉపశమనం దొరుకుతుంది.
ధనియాల చూర్ణం, మెత్తగా దంచిపెట్టుకున్న పటికబెల్లం సమపాళ్లలో కలిపి తీసుకుంటే జలుబు, గొంతునొప్పి, ముక్కుదిబ్బడ లక్షణాలు త్వరగా నయం అవుతాయి.
జలుబు ఎక్కువై గొంతులో కఫం చేరితే చెంచాడు తేనెలో అరచెంచా కరక్కాయ పొడి కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
శొంఠి, మిరియాలు, పసుపుకొమ్ములు సమపాళ్లలో తీసుకుని, వీటిని మెత్తని పొడిగా చేసుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలుపుకుని మూడు పూటలా తీసుకుంటే జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది
•• జలుబుతో పాటు దగ్గు, గొంతునొప్పి కూడా బాధిస్తే తులసిపాకంతో ఊరట పొందవచ్చు. తాజా తులసి ఆకులను బాగా నూరి, ఆ ముద్దను శుభ్రమైన వస్త్రంలో మూటలా ఉంచి రసం పిండాలి. వంద గ్రాముల తులసి రసంలో వంద గ్రాముల పటికబెల్లం, పాతిక గ్రాముల అల్లం రసం, పది గ్రాముల మిరియాల పొడి చేర్చి ఒక పాత్రలో వేసుకుని సన్నని మంటపై నీరంతా ఇగిరిపోయే వరకు మరిగించాలి. పూర్తిగా నీరింకిన తరువాత పాత్రను దించేసి, చల్లారిన తరువాత పాకాన్ని గాజుసీసాలో నిల్వ చేయాలి. ఈ పాకాన్ని చెంచా లేదా రెండు చెంచాల వరకు కప్పు గోరువెచ్చని నీటిలో వేసి కలిపి తాగితే త్వరగా జలుబు, దగ్గు నుంచి బయటపడవచ్చు. తులసిపాకం సేవిస్తే అలర్జీ వల్ల కలిగే దద్దుర్లు, ఆకలి మందగించడం వంటి సమస్యలు కూడా తీరిపోతాయి.
జీర్ణ సమస్యలా.. ఇదిగో చిట్కా!
ఫాస్ట్ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ సంస్క•తి పెరిగాక అందరిలోనూ అజీర్ణం, కడుపుబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. కడుపులో ఏకాస్త ఇబ్బంది తలెత్తినా ఎడాపెడా యాంటాసిడ్ సిరప్లు, పౌడర్లు వాడేస్తుంటారు. ఇలాంటి సమస్యలు తలెత్తినపుడు మన వంటింట్లోనే దొరికే దినుసులను, సామగ్రిని సరిగా వినియోగించుకుంటే యాంటాసిడ్లతో పనే ఉండదు.
శొంఠికొమ్ములను, మిరియాలను శుభ్రం చేసుకుని, ఆరబెట్టుకున్న వేపచెట్టు బెరడును సమపాళ్లలో దోరగా వేయించుకుని మెత్తని పొడిగా చేసి పెట్టుకోవాలి. అరకప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకుని పరగడుపున తీసుకుంటే ఎసిడిటీ, పులితేన్పులు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కరక్కాయ, పిప్పిళ్లు, శొంఠి, వాము, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి యాభై గ్రాముల పరిమాణం చొప్పున తీసుకోవాలి. వీటిలో వాము, శొంఠి, పిప్పళ్లను దోరగా వేయించుకోవాలి. వీటికి సైంధవ లవణాన్ని, కరక్కాయలను చేర్చి మెత్తని పొడి చేసుకోవాలి. భోజనానికి అరగంట ముందు ఈ పొడిని అరచెంచా చొప్పున గోరువెచ్చని నీటితో తీసుకున్నట్టయితే మందగించిన ఆకలి మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది. జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది.
నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి ఆ మిశ్రమంలో సన్నగా తరిగిన అల్లం ముక్కలను వారం రోజుల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన అల్లం ముక్కలను ఎండబెట్టాలి. ఈ అల్లాన్నే ‘భావన అల్లం’ అంటారు. దీన్ని ఒక అర చెంచాడు నోట్లో వేసుకుని నమిలితే అరుచి తగ్గి ఆకలి పుడుతుంది.
భావన అల్లం తయారు చేసుకున్నట్టే నిమ్మరసం, సైంధవ లవణాలతో జీలకర్రను కలిపి వారం రోజులు నానబెట్టి, ఆ తర్వాత ఎండబెట్టిన జీలకర్రను ‘భావనజీర’గా తయారు చేసుకోవచ్చు. ఇది కూడా జీర్ణకోశ సమస్యలకు మంచి విరుగుడుగా పని చేస్తుంది.
రెండు చిటికెల ఇంగువ, పావుచెంచా వాము దోరగా వేయించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది.
దానిమ్మ గింజలను ఎండబెట్టి, వంద గ్రాముల పొడి తయారు చేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను ఎండబెట్టి యాభై గ్రాముల పొడిని తయారు చేసుకోవాలి. వీటికి పాతిక గ్రాముల సైంధవ లవణం పొడిని జతచేసి మూడింటినీ వస్త్రఘాళితం చేయాలి. ఈ పొడిని గాజుసీసాలో నిల్వ చేయాలి.
మూడుపూటలా భోజనం తరువాత ఈ పొడిని అరచెంచాడు చొప్పున కప్పు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక అజీర్ణ సమస్యల నుంచి, కడుపునొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే భోజనం చేసిన తరువాత కలిగే ఇబ్బందులు వంటివి సమసిపోతాయి.
చిన్ని కరక్కాయలు యాభై గ్రాములు, సోంపు గింజలు పది గ్రాములు, జీలకర్ర పది గ్రాములు, సైంధవ లవణం పది గ్రాములు ఒక వెడల్పాటి పాత్రలోకి తీసుకోవాలి. వీటికి ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లం రసం కలిపి ఎండబెట్టాలి. ఇవన్నీ బాగా ఎండిన తర్వాత మెత్తగా పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వ చేయాలి. చెంచాడు తేనెలో ఈ చూర్ణాన్ని అరచెంచాడు కలిపి రెండుపూటలా తీసుకుంటున్నట్టయితే అజీర్తి, కడుపుబ్బరం, కడుపునొప్పి మాత్రమే కాకుండా నోటి దుర్వాసన, నిద్రలేమి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
తాజా కరివేపాకును మెత్తగా రుబ్బుకుని, ఆ ముద్దను వస్త్రంలో వేసి రసం తీసుకోవాలి. ఇలా తీసుకున్న కరివేపాకు రసం రోజూ రెండు చెంచాల చొప్పున తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. రక్తహీనత తగ్గుతుంది.
దంతసిరి ఇలా..!
ఆధునిక జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో చాలామంది దంత సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా శీతల పానీయాలు తీసుకుంటూ ఐస్క్రీమ్లు తింటూ దంత సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. అలాగే, దంతాలకు అంటుకుపోయే పిజ్జా, బర్గర్ వంటి జంక్ఫుడ్ పదార్థాలను తరచూ తీసుకోవడం వంటి కారణాల వల్ల చిగుళ్ల వాపు, దంతాలు వదులు కావడం, పిప్పి పళ్లు ఏర్పడటం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడటానికి తగిన ఔషధాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
తుమ్మకట్టెలను కాల్చి తయారుచేసిన బొగ్గులు వంద గ్రాములు, సన్నని మంటపై పొంగించిన పటిక వంద గ్రాములు, సైంధవ లవణం వంద గ్రాములు.. ఈ మూడింటినీ మెత్తని పొడిగా తయారు చేసుకుని నిల్వ చేసుకోవాలి. దీనినే పళ్లపొడిగా వాడుతున్నట్టయితే దంతాలకు దృఢత్వం కలుగుతుంది. చిగుళ్ల నుంచి రక్తం కారడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి.
వంద గ్రాముల సుద్దపొడిలో నలభై గ్రాముల ఏలక గింజల పొడి, అరవై గ్రాముల సైంధవ లవణం పొడి కలిపి వస్త్రఘాళితం చేసుకుని నిల్వ ఉంచుకోవాలి. రోజూ ఈ పొడితో పళ్లు తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా తయారవుతాయి. నోటి దుర్వాసన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి.
పటికను పొంగించి పొడి చేసుకోవాలి. సైంధవ లవణాన్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. తుమ్మ బొగ్గులను కూడా పొడిగా చేసుకోవాలి. ఈ మూడింటినీ సమపాళ్లలో తీసుకుని వస్త్రఘాళితం చేసుకోవాలి. ఈ పొడితో పళ్లు తోముకుంటే దంత సమస్యలు, నోటి దుర్వాసన రాకుండా ఉంటాయి.
నయనానందానికి..
టీవీలు, స్మార్ట్ఫోన్లు వచ్చాక చిన్నారులు సైతం కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంటిచూపు మందగించకుండా ఉంటానికి, చిన్నా చితకా కంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లోనే చక్కని ఔషధాలను తయారు చేసుకోవచ్చు.
పిప్పళ్లు, వాయు విడంగాలు, అతి మధురం, శొంఠి, సైంధవ లవణం.. వీటిని ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచుకుని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరునాటి ఉదయం వీటిని గుజ్జులా నూరుకోవాలి. ఒక మూకుడులో అర లీటరు నువ్వులనూనె, అరలీటరు మేకపాలు వేసి అందులో ఈ గుజ్జును వేసి సన్నని మంటపై వేడి చేయాలి. బాగా ఉడికిన తరువాత మూకుడును దించేసి చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. వడగట్టిన తైలాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ తైలాన్ని ముక్కులో నాలుగు చుక్కల చొప్పున వేసుకుని నశ్యంలా పీలుస్తుంటే కంటికైన గాయాలు, కంటిలో ఏర్పడిన పుండ్లు తగ్గుతాయి.
కంటిచూపు క్షీణించకుండా ఉండటానికి త్రిఫలాఘృతం అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు. కరక్కాయల బెరడు, గింజలు తీసేసిన ఉసిరికాయ ముక్కలు, తానికాయ ముక్కలు.. వీటిని ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున తీసుకుని వీటిని కచ్చాపచ్చాగా నూరుకోవాలి. ఒక పాత్రలో మూడు లీటర్ల నీళ్లు తీసుకుని నూరుకున్న త్రిఫలాల పొడిని నీట్లో వేసి లీటరు కషాయం మిగిలేంత వరకు సన్నని మంట మీద మరిగించుకోవాలి. ఈ కషాయాన్ని వడగట్టుకుని అందులో అర లీటరు ఆవుపాలు, పావు లీటరు ఆవునెయ్యి వేసి నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు సన్నని మంట మీద మరిగించాలి. ఇలా తయారైన త్రిఫలాఘృతాన్ని గాజుసీసాలో నిల్వ చేసుకుని, ప్రతి రోజూ పది గ్రాముల చొప్పున భోజనానికి ముందు సేవిస్తున్నట్టయితే కంటిచూపు క్రమంగా మెరుగుపడుతుంది.
కీళ్లనొప్పులా..?!
కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు ఇప్పుడు లేనిదెవరికి? ఇలాంటి నొప్పులకు పెయిన్బామ్లు, పెయిన్ కిల్లర్స్పై ఆధారపడొద్దు. ఇంట్లోనే తగిన ఔషధాలను తయారు చేసుకోవచ్చు.
ఆముదపు గింజలను చితగ్గొట్టి, పై పెంకును తీసేసి లోపలి పప్పును వంద గ్రాముల వరకు తీసుకోవాలి. దీనికి వంద గ్రాముల శొంఠి, వంద గ్రాముల పటికబెల్లం చేర్చి మెత్తగా దంచాలి. రెండుపూటలా కప్పు గోరువెచ్చని నీటిలో ఈ పొడిని చెంచాడు కలిపి తీసుకుంటే కీళ్లనొప్పులు క్రమంగా నయమవుతాయి.
దోరగా వేయించిన శొంఠిపొడి, అశ్వగంధ పొడి, నల్లనువ్వుల పొడి, పటికబెల్లం పొడి సమపాళ్లలో తీసుకుని నాలుగింటినీ కలిపి వస్త్రఘాళితం చేసుకోవాలి. మూడు పూటలా భోజనం చేసేటపుడు ఈ పొడిని రెండు చెంచాల ఆవునేతితో కలిపి తీసుకుంటే నడుము నొప్పి, ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తి పెరిగి ఒంటికి బలం వస్తుంది.
శొంఠి పది గ్రాములు, వాయు విడంగాలు (మిరియాల్లాగే ఉంటాయి) పది గ్రాములు పొడిగా దంచుకుని, ఈ పొడిని ఒక పాత్రలో వేసి రెండు కప్పుల నీటిలో సన్నని మంటపై మరిగించాలి. నీరు సగానికి సగం ఇగిరిపోయి కషాయం తయారయ్యాక అందులో ముప్పై గ్రాముల పాతబెల్లం కలిపి రోజుకు ఒకసారి తీసుకుంటే మహిళలకు వచ్చే నడుము, నెలసరి నొప్పులు తగ్గుతాయి.
నిమ్మరసం పావు లీటరు, నువ్వులనూనె పావు లీటరు, వెల్లుల్లి గుజ్జు పావు కిలో తీసుకుని, ఈ మూడింటినీ కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించాలి. చల్లారిన తరువాత నూనెను వడగట్టి అందులో యాభై గ్రాముల ముద్ద కర్పూరం కలిపి గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. నొప్పులు ఉన్నచోట ఈ నూనెతో మర్దన చేస్తే త్వరలోనే ఒంటి నొప్పుల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

Pathbreaking journalism and unwavering selfless
service to the society for the past 37 years.
37 years of authenticity and leadership
in the field of universal journalism.
Revolutionising authentic universal
journalism from the past 37 years.
Telugu was described by Englishmen as the Italian of
the east for its sweetness. Researchers say only in
Telugu can a single phrase be sung in 64 different ways.
In the chronology of languages, Telugu is a much older
language than many of the western languages of the
world, deriving a part of the roots from Sanskrit, owing
its geographical proximity to the northern India.
Videos
The University of Houston-Downtown is a comprehensive four-year university offering bachelor's and master's degree programs aimed at career
The Christian Brothers’ University is one of the ancient and best universities in the country. The university run
Florida State University was founded in 1851 as a public, co-educational research university. The university, headquartered in Tallahassee,
ఇది మన పత్రిక ఆదరించండి! ఆశీర్వదించండి!! అభిప్రాయాలు తెలపండి!!! info@telugupatrika.net
US Universities
Temple in US
Telugu Velugulu
Other Programs
February 15, 2026
సూర్యోదయం: 05:56:12 సూర్యాస్తమయం: 18:48:28
చంద్రోదయం: 05:51:38తిథి: పాద్యమి 29:11:29+
నక్షత్రం: పుష్య 12:11:48యోగం: సిద్ధ 15:16:17
సూర్యరాశి: కర్క చంద్రరాశి: కర్క
రాహుకాలం: 13:58:52-15:35:24యమగండం: 05:56:12-07:32:44
దుర్ముహుర్తం: 15:22:32-16:14:01వర్జ్యం: 23:33:11-24:58:22
అమృతకాలం: 06:27:37-07:53:40
Testimonials
-
He (Mr. Blair) has asked that your letter be forwarded to the Department so that they may reply to you direct on his behalf. Mr. Blair has asked that your letter be passed to the Department for Education and Skills which has particular responsibility for the matter you raise so that they are also aware of your views.
Tony Blair, Prime Minister London -
As in the past, I am determined to face any challenge and overcome them in discharging my responsibilities towards my country and my people. In that journey forward, your views on public matters, your support and your blessings will be a constant source of strength and inspiration to me.
Mr. Mahinda Rajapaksa, President of Sri Lanka -
I was pleased with the excellent professionalism of your entire team, and thank for your strong effort to make this project a success. I hope your film will positively affect many generations of students.
David W. Hahn, Professor & Department Chairm , University Of Florida -
Apparently you have travelled over 86,000 miles, visiting more than 60 universities across the United States. A project like this is huge, both in terms of cost and energy required to accomplish what you have to date.
J. N. Reddy , Professor, Texas A&M University -
For 60 more American universities for a total of 100 universities and colleges, which is expected to be a world record. In doing so, the students have potential access to a much richer resource than what is currently available on the web and social media.
Beheruz N. Sethna, Ph.D., C.C.P.,President Emeritus, University Of West Georgia




















