సూర్య కిరణం.. ఆరోగ్య తేజం

మాఘ శుద్ధ సప్తమి తిథి.. సూర్య జయంతి తిథి. మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈనాడు చేయాల్సి ఉంటుంది. ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు ఈ దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది.
రథ సప్తమా? సూర్య జయంతా?
రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగ ణిస్తారు. దీనిని రాజపురాణాలలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, కొన్ని తావులోల జయంతి సప్తమి అనీ, మరికొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.
సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు. అయితే, జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చనేది పెద్దల అభిప్రాయం. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు వచ్చిందని అంటారు.
రథ సప్తమి.. నాడు ఉగాది పర్వం?
తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి.
నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు. వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి పైన చెప్పుకున్న అన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనే వ్రతాలను గురించి పేర్కొంది. ప్రాయకంగా అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి అయి ఉన్నాయి. ప్రాచీక కాలంలో ఇది మనకు ఉగాదిగా ఉండినా, ఉండకపోయినా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి.
జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు..
ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు.
జిల్లేడు మూలిక.. ఔషధ గుళిక
జిల్లేడు ఆకుల్ని రథ సప్తమి నాడు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఉంది. సూర్యుడు తన కాంతితో, వేడితో, విద్యుత్తుతో, ఆకర్షణ శక్తితో పదార్థాన్ని కాల్చివేస్తాడు. గ్రహాలను బట్టి జీవులకు కామ క్రోధాది గుణాలు కలుగుతుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలు జీవులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు ఉత్తరాయణ గతుడైనపుడు గ్రహాల పలుకుబడి మనుషులపై అంతగా ఉండదు. రథ సప్తమి సూర్యుని ఉత్తరగతిని సూచించే పండుగ. ఈ పర్వం సందర్భంలో జిల్లేడులను తలపై ఉంచుకుని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని అనుకోవచ్చు.
జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక. ఈ ఆకులు పైన నునుపుగా, కింద నూగుగా ఉంటాయి. ఇది సంవత్సరంలోని అన్ని రోజుల్లో పుష్పిస్తుంది. జిల్లేడు ఆకులు తుంచినా, కొమ్మలు విరిచినా తెల్లని పాలు కారతాయి. ఆ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు ఇట్టే పోతుంది. జిల్లేడు చిగుళ్ల రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. జిల్లేడు ఆకులు వెచ్చబెట్టి ఆముదం రాసి కడుపు పైన వేస్తే కడుపునొప్పి, ••డుపు ఉబ్బరం తగ్గుతాయి. ఎరుపు, నీలి వర్ణాలు కలిసిన జిల్లేడు పువ్వుల కంటే తెల్ల జిల్లేడు పూలు శ్రేష్ఠమైనవి. పక్షవాతం, కుష్ఠు, మూర్ఛ, విష జంతువుల కాట్లు మున్నగు దుష్ట సాధ్యాలైన రోగాలలో కూడా జిల్లేడు బాగా పని చేస్తుంది. జిల్లేడు ఆకులు తీక్షణమైనవి. దీనికి సంస్క•తంలో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లున్నాయి. ఈ నామాలు దీనికి సూర్యునితో గల సంబంధాన్ని తెలియ చేస్తున్నాయి. రథ సప్తమి సూర్యునికి సంబంధించిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యం వచ్చి ఉండవచ్చు.
రేగు పండు చేసే మేలు..
రథ సప్తమి నాడు రేగుపండ్లు నెత్తిమీద పెట్టుకోవడంలో కూడా ఆంతర్యం ఉంది. భవిష్యోత్తర పురాణంలోరథ సప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులు కానీ, రెండు రకాల ఆకులు కానీ తలపై పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కానీ, ఆంధ్ర దేశంలో జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేయడమే ఆచారం. శిశిర రుతువైన మాఘ ఫాల్గుణ మాసాల్లో రేగుపండ్లు విస్తా రంగా దొరుకుతాయి. ‘ఫలశైశిర’ అని రేగుకు సంస్క•త నామం ఉంది. రథ సప్తమికి ఇంచుమించు ఒక నెల ముందు వచ్చే సంక్రాంతికి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోసి దిగబారేలా చేస్తారు. అలా పోయడం వల్ల పీడ (దిష్టి) వదిలిపోతుందని మనవాళ్ల నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే మంచి.. రథసప్తమి నాడు అందరికీ జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది.
చిక్కుడు.. ఆరోగ్యం బోలెడు
ఇక, చిక్కుడు కాయల విషయానికి వస్తే.. రథసప్తమి నాడు వాడే పూజలో చిక్కుడు కాయలతో పాటు ఆకులనూ వాడతారు. చిక్కుడు కార్తిక మాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘ మాసం నాటికి నా మహిమ చూపుతానన్నట్టు విస్తరిస్తుందని పెద్దలు అంటారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి, కాచే చిక్కుడును కూడా మాఘ మాసపు పర్వాలలో చేర్చి రథ సప్తమి నాటి ఆరాధన ద్రవ్యాలలో ఒకటిగా చేర్చారు. ఈనాడు చిక్కుడు కాయలతో, వెదురు పుల్లలతో రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకుల్ని పరిచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం ఉంది. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ధ్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య ప్రదాయమవుతుంది.

Review సూర్య కిరణం.. ఆరోగ్య తేజం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top