ఆనందాల ఆశ్వయుజం

అక్టోబరు 1, సోమవారం, భాద్రపద బహుళ సప్తమి నుంచి-అక్టోబరు 31, బుధవారం ఆశ్వయుజ బహుళ సప్తమి వరకు
విలంబి నామ సంవత్సరం-భాద్రపదం-ఆశ్వయుజం-శరదృతువు-దక్షిణాయన

ఆంగ్లమానం ప్రకారం పదకొండవ మాసం అక్టోబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద – ఆశ్వయుజ మాసాల కలయిక. భాద్రపద మాసంలోని కొన్ని రోజులు, ఆశ్వయుజ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. భాద్రపదంలో వచ్చే పర్వాలలో మహాత్మాగాంధీ జయంతి, మహాలయ అమావాస్య ముఖ్యమైనవి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు మహాలయ అమావాస్య నాటి నుంచి ఆరంభమవుతాయి. అక్టోబరు 9వ తేదీతో భాద్రపద మాసపు తిథులు ముగుస్తాయి. 10వ తేదీ నుంచి ఆశ్వయుజ మాస తిథులు ప్రారంభమవుతాయి. దేవీ నవరాత్రులు, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవం, దుర్గాష్టమి, మహర్నవమి, దసరా వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఆశ్వయుజ మాసపు ప్రత్యేకం, అక్టోబరు 1, భాద్రపద బహుళ (కృష్ణ) సప్తమి, సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం అక్టోబరు 31, ఆశ్వయుజ బహుళ సప్తమి, బుధవారంతో ముగుస్తుంది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే అక్టోబరు నెల.. తెలుగు పంచాంగం ప్రకారం భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక. ఆశ్వయుజం అతివల పర్వం. మహిళలు నోచే నోములు, వ్రతాలు, మరీ ముఖ్యంగా అమ్మవారి వేడుకకు ఆటపట్టయిన నెల ఆశ్వయుజం. కాలం స్త్రీ పురుష రూపాత్మకం అంటారు. సంవత్సరంలోని చైత్రం మొదలు భాద్రపదం వరకు తొలి అర్ధ భాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజం నుంచి ఫాల్గుణం వరకు గల ఆరు నెలల కాలం స్త్రీ రూపాత్మకం. ప్రత్యేకించి రెండో అర్ధ భాగంలోని తొలి మాసం ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ నెలలో వచ్చే అట్లతద్ది, దసరా తదితర పర్వాలన్నీ స్త్రీలకు సంబంధించినవే.

అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు. సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి.

సమస్త జగత్తును పాలించేది ఆది పరాశక్తి. ఈ పరాశక్తి. త్రివిధాలుగా రూపుదాల్చి లక్ష్మి, పార్వతి, సరస్వతి అయి లోకాలకు సకల సౌభాగ్యాలను, విద్య, శక్తిలను ప్రసాదిస్తున్నాయి. మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి నాడు వాగ్దేవి సరస్వతీ పూజ చేయాలి. జ్ఞానభూమికగా సరస్వతిని దర్శించడం భారతీయ సంప్రదాయం. ఆశ్వయుజ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రులు. శైలిపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కాత్యాయనిగా, కాళరాత్రి దేవిగా, మహాగౌరిగా, చంద్రఘంటా దేవిగా, కూష్మాండదేవిగా, స్కందమాతగా, సిద్ధిధాత్రిగా ఈ తొమ్మిది రోజులూ దేవిని అర్చించడం ఒక సంప్రదాయం. పదో రోజు విజయ దశమి. ఆ రోజునే శ్రీరాముడు రావణ సంహారం చేశాడని అంటారు. అర్జునుడు జమ్మిచెట్టుపై నుంచి ఆయుధాలను తీసి కౌరవ వీరులను జయించినదీ విజయదశమి నాడేనని పురాణోక్తి. ఇక, ఈ మాసంలో వచ్చే పండుగలు, పర్వాల విశేషాలు..

భాద్రపద బహుళ అష్టమి
అక్టోబరు 2, మంగళవారం</strong>

ఈనాడు జీమూత వాహనుడిని పూజించాలని అంటారు. అశోకాష్టమీ వ్రతం ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడు దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఈనాటి ప్రధాన దైవనమైన జీమూత వాహనుడి గురించి వివరణ..

జీమూత వాహనుడు విద్యాధర యువకుడు. ఆయన ఆత్మత్యాగులలో అతిలోకుడు. అతనికి పట్టము కట్టి తల్లిదండ్రుదు వానప్రస్థానికి వెళ్లారు. రాజ్యం చేస్తూనే తరచూ తల్లిదండ్రులకు పరిచర్యలు చేయడానికి జీమూతవాహనుడు వనాలకు వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్లిన క్రమంలో ఒకసారి మలయవతి అనే కన్యను చూసి మోహించాడు. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలం తరువాత ఓనాడు జీమూత వాహనుడు విహారం చేస్తూ ఒకచోట పాముల ఎముకలు గుట్టలుగా పడి ఉండటం చూశాడు. విచారించగా, అవి గరుడినికి ఆహారమవుతున్న పాముల ఎముకలని తెలిసింది. అలా గరుడుడు రోజూ ఎన్నో పాములను చంపసాగాడు. దీంతో రోజూ ఒక పామును తామే అతనికి ఆహారంగా ఇచ్చేలా నాగరాజైన వాసుకి గరుడునితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా గరుడుడు చాలా పాములను చంపకుండా వాసుకి నియమం చేశాడు.

జీమూత వాహనుడు అక్కడ ఉండగానే ఆనాడు గరుత్మంతునికి ఆహారం కావాల్సిన వంతు వచ్చిన శంఖచూడుడనే నాగ కుమారుడు వచ్చాడు. అతని వెంట ఏడుస్తూ అతని తల్లి వచ్చింది. గరుడినికి ఆహారం కావడానికి పూర్వం పన్నగ కుమారుడు ధరించాల్సిన ఎర్రని బట్టలు నాగరాజు తెచ్చాడు. ఆహారబలికి అంతా సిద్ధమంతోంది. ఇదంతా చూసి జీమూత వాహనుని హృదయం ద్రవించింది. శంఖచూడునికి బదులుగా తానే గరుడికి ఆహారం కావాలని అతను నిశ్చయించుకున్నాడు. నాగరాజు తెచ్చిన ఎర్రబట్టలు తనకివ్వాలని కోరగా, శంఖచూడుడు తానే బలికి వెళ్తానని ఇవ్వడానికి నిరాకరించాడు. అంతలో విద్యాధరుల్లో ఉన్న ఆచారాన్ని బట్టి కొత్త పెళ్లికొడుక్కి ఇవ్వాల్సిన కొత్త ఎర్రబట్టలను జీమూత వాహనుడికి అత్తగారు పంపుతుంది. వాటిని ధరించిన జీమూత వాహనుడు వధ్యశిల ఎక్కుతాడు. అంతలో గరుత్మంతుడు వస్తాడు. తనకై వచ్చిన నాగ కుమారుడే అతను అనుకుని తినడానికి సిద్ధమవుతాడు. ఈలోగా శంఖచూడుడు వధ్యశిలపైకి వచ్చిన తనను తినాలని కోరతాడు. తననే తనివి తీరా ఆరగించాలని జీమూత వాహనుడు అడుగుతాడు. గరుడుడు తానప్పుడు తింటున్నది పన్నగ కుమారుడిని కాదని తెలుసుకుంటాడు. జీమూత వాహనుడి త్యాగబుద్ధికి వెరగొందుతాడు.

ఈలోగా జీమూత వాహనుడిని వెతుక్కుంటూ కాబోయే భార్య మలయవతి, ముసలి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అమృతం తెచ్చి ఇచ్చి అయినా తమ కుమారుడిని బతికించాలని వారు గరుత్మంతుడిని కోరతారు. గరుడుడు చలించి.. అమృతం తెచ్చి జీమూత వాహనుడిని బతికిస్తాడు. అనంతరం తనతో పాటు అప్పటి వరకు చచ్చిన పాములన్నిటినీ జీమూత వాహనుడు బతికిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై జీమూత వాహనుడిని విద్యాధర చక్రవర్తిని కమ్మని ఆశీర్వదిస్తుంది. ఇకపై పాములను చంపపని గరుత్మంతుడు చెబుతాడు. జీమూత వాహనుడి ఆత్మత్యాగం గరుడునిలో ఈ పరివర్తన తెచ్చింది. అనంతరం జీమూత వాహనుడు మలయవతితో కూడి సుఖంగా రాజ్యపాలన చేస్తూ విద్యాధరి చక్రవర్తి అయ్యాడు. ఇదెంతో కదిలించే కథ. ఒకప్పుడు ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాలలో ఈ గాథ ఉపవాచకంగా ఉండేది. ఇటువంటి కథలే చిన్నారులకు త్యాగం, దయ, కరుణ బుద్ధులను నేర్పుతాయి. పెద్దలు కూడా తప్పక చదవాల్సిన త్యాగగాథ ఇది.

భాద్రపద బహుళ నవమి
అక్టోబరు 3, బుధవారం

ఈ తిథి నాడు నీరాజన నవమి పర్వమని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీపూజకాలు చేయాలని అందులో వివరించారు.

భాద్రపద బహుళ ఏకాదశి
అక్టోబరు 5, శుక్రవారం

ఈ ఏకాదశిని ఇందిరైకాదశి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలో దీనిని ‘ఇంద్రైకాదశి’గా పేర్కొన్నారు. ఇంద్రసేనుడనే వాడు ఈనాడు యమ లోకంలో యాతనలు పడసాగాడు. అదే సమయానికి భూలోకంలో అతని కొడుకు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా యమలోకం నుంచి ఇంద్రసేనుడు స్వర్గలోకానికి వెళ్లాడని పురాణకథ.

భాద్రపద బహుళ త్రయోదశి
అక్టోబరు 7, ఆదివారం

ఈనాడు కలియుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. ద్వాపర యుగాది అని తిథి తత్వంలోనూ, చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది. భాద్రపద కృష్ణ త్రయోదశి కలియుగాది దినం. ఈ యుగమున ఒక పాలు మాత్రమే ధర్మం నడుస్తుంది. కొంతకాలానికి అది కూడా నశిస్తుంది. అధర్మమే ప్రవర్తిస్తుంది. భగవంతుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులై ఉంటారు. దీనిని అయోమయ యుగమని కూడా అంటారు. ఈ యుగమున ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 మానవ సంవత్సరాలు.

భాద్రపద బహుళ చతుర్దశి
అక్టోబరు 8, సోమవారం

ఈనాడు మాసశివరాత్రి. ఈనాటి ఉపవాసం వలన శివలోకప్రాప్తి అని తితి తత్వం చెబుతోంది. స్మ•తి కౌస్తుభంలో ‘శస్త్రాదిహితన్యైకోది ఇష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు.

భాద్రపద బహుళ అమావాస్య
అక్టోబరు 9, మంగళవారం

ఈనాడు పితృకామావాస్యగా ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. పితృ దేవతల సంతృప్తి కోసం తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు.

శ్వయుజ శుద్ధ పాడ్యమి
అక్టోబరు 10, బుధవారం

ఈ తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల పూజలు ఈ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించిందని, ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ.

ఆశ్వయుజ శుద్ధ తదియ
అక్టోబరు 11, గురువారం

ఈ తిథి నాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు.

ఆశ్వయుజ శుద్ధ చవితి
అక్టోబరు 12, శుక్రవారం
ఈనాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ పంచమి
అక్టోబరు 13, శనివారం

ఈ తిథి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలి. శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

ఆశ్వయుజ శుద్ధ సప్తమి
అక్టోబరు 16, మంగళవారం

ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, ఆనాడు పంచగవ్యములను మాత్రమే సేవించి మరునాడు భోజనం చేయాలి.

ఆశ్వయుజ శుద్ధ అష్టమి
అక్టోబరు 17, బుధవారం

ఆశ్వయుజ మాస శుక్లపక్ష అష్టమి దుర్గాష్టమీ తిథి. ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు ఈనాడు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు. ఇది మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి.

మన తెలుగు రాష్ట్రాల్లో ఇది శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమీగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు.

ఆశ్వయుజ శుద్ధ నవమి
అక్టోబరు 18, గురువారం

ఇది శరన్నవరాత్రుల్లో మహర్నవమిగా ప్రతీతి. మాతృ వ్రతమని చతుర్వర్గ చింతామణి అంటోంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని అంటారు.

ఆశ్వయుజ శుద్ధ దశమి
అక్టోబరు 19, శుక్రవారం

ఈ తిథి విజయదశమి పర్వదినం. ప్రాచీన కాలం నుంచి విజయదశమి (దసరా) ఆచరణలో ఉంది. ఈ తిథినాడు శక్తిపూజ మహోత్క•ష్టమైనది. గదాధర పద్ధతి, ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథాలలో ఇది అపరాజితా దశమిగా చెప్పబడింది. అపరాజితా దేవి పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ విసర్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మున్నగునవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరింపబడే దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి. మొత్తానికి ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయాభిదానాలతో ప్రజలచే పూజలను పొందే శుభవాసరాలివి.

లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను ఆలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన పిదపే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు.

ఇక, నవరాత్రి వేడుకలు పశ్చిమబెంగాల్‍ ప్రసిద్ధి. తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గావతారాలుగా బెంగాల్‍ ప్రజలు భావించి కొలుస్తారు. మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి ప్రజల పూజలు అందుకుంటుంది.

ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం ఈ వృక్ష దర్శనం చేసుకుంటారు.

ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడు మధ్వాచార్య జయంతి దినం కూడా. విళంబి, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. మత త్రయాచార్యులలో శ్రీమధ్వాచార్యులు ఒకరు. వైష్ణవ మత బోధకులలో వీరు అగ్రగణ్యులు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ఆయన తాను వాయుదేవుని మూడవ అవతారమని చెప్పుకునే వారు. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోజ్జీవాన్ని కలిగించారు.

ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
అక్టోబరు 20, శనివారం

ఆమాదేర్‍ జ్యోతిషీ- ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాశాంకుశైకాదశిగా పేర్కొంది. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాపాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు.
కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మాలు పెట్టాలి. అయిదు దీపాలు పెట్టాలి. అయిదు విధాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.

ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 21, ఆదివారం
విశోక ద్వాదశి, గోవత్స ద్వాదశి వంటి వ్రతాలు ఈ తిథి నాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. అలాగే, ఈనాడు వాసుదేవ పూజ చేయాలని, ఉపవాసం ఉండాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది.

ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
అక్టోబరు 24, బుధవారం

ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాటి వివరణలో మన పంచాంగకర్తలు కౌముద్యుత్సవం, అక్షక్రీడ, కోజాగర్తి వ్రతం, లక్ష్మీంద్ర కుబేరాది పూజ అని పేర్కొంటారు. ఈనాడు ముఖ్యంగా కౌముదీ వ్రతం ఆచరించాలని, లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రి జాగరణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ రాత్రి అంతా మేల్కొని ఉండటానికి అక్షక్రీడ (జూదం) అనే వినోదాన్ని కూడా ఈ వేడుకలో జోడించారు. ఇక, ఆంధప్రదేశ్‍లో ఈనాడు గొంతెమ్మ పండుగ జరుపుతారు. మాలలు ఈ దేవతను ఎక్కువగా పూజిస్తారని అంటారు. ఇందుకో కారణం కూడా ఉంది.

కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుద్ధంలో మరణించిన వారికి తిలోదకాలు, తర్పణాలను ధర్మరాజు విడుస్తుండగా మధ్యలో కర్ణుని చెయ్యి వచ్చింది. ఇదేమిటని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. ‘అతను మీ అన్న. తర్పణం విడువు’ అని వ్యాసుడు చెప్పాడు. అలాగే చేసి ధర్మరాజు ఇంటికి వచ్చి తల్లి కుంతిని నిజం చెప్పాలని బలవంతం చేశాడు. ఆమె చిన్నప్పటి తన గాథను విచారంతో చెప్పింది. ‘ఇదే విషయం ముందు చెప్పి ఉంటే కర్ణుడిని చంపకుండా ఉండేవాళ్లం కదా! ఈ తప్పునకు కారణం నువ్వే. కాబట్టి నువ్వు మాలలకు దేవతవు కమ్ము’ అని శపించాడు. ఇంకా- ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు’ అని కూడా శపించాడు. ఈ కారణంగానే గొంతెమ్మ (కుంతి) మాలలకు ఇలవేల్పు అయ్యింది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు ఈ వ్రతం చేయదగినది.

ఇంకా ఈనాడు కోజాగౌరీ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైన వ్రతమిది. ఈనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. ఆహ్వానించిన అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచిపెడతారు. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో విశేష భాగ్యప్రదమైన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించారట. అందుకు బదులుగా వాలఖిల్యుడు ‘కోజాగౌరీ’ వ్రతాన్ని గురించి చెప్పాడు.

ఆశ్వయుజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ దిరుగుతూ ప్రతి ఇంటి వద్దా నిలిచి పిలుస్తుందట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి అయ్యే వరకైనా మేలుకుని ఉంటారు. అర్థరాత్రి వేళ లక్ష్మి వచ్చి ప్రతి ఇంటి వద్ద ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే చల్లగా వెళ్లిపోతుందట. అందుమీద ఈ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేకుండా పోతుందట.

అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి సమీపంగా ఉండే రోజుల కోజాగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. కాబట్టి ఇది శుక్ల పక్ష చతుర్దశిని కానీ, పౌర్ణమిని కానీ కృష్ణ పక్ష పాడ్యమిని కానీ పడవచ్చు. ఈ పండుగను సాయంత్రం చేయాలి. తన తొలి చూలు బిడ్డకు ఈనాడు తల్లి కొత్త బట్టలు ఇస్తుంది. ఆ తల చుట్టూ ఒక దీపం తిప్పుతుంది. ఆపై అక్షింతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవిస్తుంది. ఇది దేవవైద్యులైన అశ్వనీ కుమారుల రక్షణంలో తన బిడ్డను ఉంచడానికి తల్లులు చేసే పర్వంలా దీనిని బట్టి తోస్తుంది. ఆశ్వయుజ పూర్ణిమ నాడు నారదీయ పురాణాన్ని దానం చేస్తే ఇష్టలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు.

ఆశ్వయుజ బహుళ పాడ్యమి
అక్టోబరు 25, గురువారం

ఈ తిథి నాడు జయావాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

ఆశ్వయుజ బహుళ విదియ
అక్టోబరు 26, శుక్రవారం

ఈనాడు అశూన్య వ్రతం ఆచరించాలని అంటారు. అలాగే ఇది అట్లతద్ది భోగి. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు పూర్వపు రోజును భోగి అని వ్యవహరించడం తెలుగు నాట రివాజు. ఉండ్రాళ్ల తద్ది భోగి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా తలంటి పోసుకుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు అలంకరించుకుంటారు. తెల్లవారగానే ఉట్టి కింద ముద్ద తింటారు. తాంబూలం వేసుకుని ఆడుకుంటారు.

ఆశ్వయుజ బహుళ తదియ
అక్టోబరు 27, శనివారం

ఈనాడు కనక గణేశ వ్రతం, లలితా గౌరీ వ్రతం, చంద్రోదయోమా వ్రతం మున్నగు వ్రతాలు చేస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. వీటిలో చంద్రోదయోమా వ్రతం అట్లతద్ది పేరుతో తెలుగునాట వ్యావహారికంలో ఉంది. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజిస్తారు. భోగి నాడు మొదలుకుని తెల్లవారి తద్ది నాడు పగటి పూజ భోజనం చేయరు. తాంబూలం మాత్రం తరచూ సేవిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. పగటి వేళలో వీలైనంత వరకు ఉయ్యాలలూగుతారు. ఈ ఉయ్యాలలను ఇళ్లలో కాక తోటల్లో, దొడ్లలో పెద్దచెట్లకు వేస్తారు. సాయంత్రం ఉమాదేవిని పూజించి, చంద్రుడిని చూసిన తరువాత అట్లు మున్నగు పిండి వంటలతో భోజనం చేస్తారు. ఇదీ అట్లతద్ది నాటి తెలుగు మహిళల కార్యకలాపం. ఇది అతివల పండుగ. నగర స్త్రీల కంటే పల్లెటూరి పడుచులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు. అట్లతద్ది నోము నోస్తే కన్యలకు ముసలి మొగుడు రాడని, వివాహమైన వారికి నిండు ఐదవతనం కలుగుతుందని అంటారు.

Review ఆనందాల ఆశ్వయుజం.

Your email address will not be published. Required fields are marked *

Related posts