వసంతాగమనం

1, ఏప్రిల్‍, సోమవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి నుంచి – ఏప్రిల్‍ 30, మంగళవారం, చైత్ర బహుళ ఏకాదశి వరకు

ఆంగ్లమానం ప్రకారం నాలుగవ మాసం ఏప్రిల్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ – చైత్ర మాసాల కలయిక. ఫాల్గుణ మాసంలోని కొన్ని రోజులు, చైత్ర మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. చైత్రం తెలుగు మాసాలలో మొదటిది. ఇది సంవత్సరారంభ మాసం. ఈ మాసంలో తొలి రోజే (చైత్ర శుద్ధ పాడ్యమి) ఉగాది పర్వదినం. ఇది తెలుగు వారి అచ్చ తెనుగు పర్వం.
ఏప్రిల్‍ 6 ఉగాది పర్వదినం. వసంత మాసం ఆరంభం కూడా చైత్రంలోనే. ఇక, ఏప్రిల్‍ 14న శ్రీరామ నవమి పర్వం. ఇంకా చైత్రంలోని వచ్చే తిథులలో లోని ఫాల్గుణ మాస తిథులలో వచ్చే పర్వాలలో మత్స్య జయంతి, స్కంద షష్ఠి, కామద ఏకాదశి, వైష్ణవ కామద ఏకాదశి, మహావీర్‍ జయంతి, పౌర్ణమి వ్రతం, హనుమజ్జయంతి, వరూధునీ ఏకాదశి వంటివి ముఖ్యమైనవి. ఏప్రిల్‍ మాసం.. ఫాల్గుణ బహుళ ద్వాదశి, ఏప్రిల్‍ 1, సోమవారం నుంచి ప్రారంభమై చైత్ర బహుళ ఏకాదశి, ఏప్రిల్‍ 30, మంగళవారంతో ముగుస్తుంది.

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహారంలో ఉన్న సంవత్సరాది పర్వం ఏటా వచ్చే ఎన్నదగిన యాభై పైచిలుకు పండుగలలో మొదటిది. సంవత్సరాది అనగా సంవత్సరానికి ఆరంభదినమని అర్థం. ఆంధ్రుల సంవత్సరాది నాటి తిథి చైత్ర శుక్ల ప్రతిపత్తు అనగా పాడ్యమి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల, వివిధ జాతుల హిందూ మతస్తుల్లో సంవత్సరాది వివిధ దినాలతో ప్రారంభమవుతుంది. ఉగాదిని కొన్నిచోట్ల వైశాఖ మాసంలోనూ, మరి కొన్నిచోట్ల కార్తీక మాసంలోనూ, ఇంకొన్ని చోట్ల మార్గశిర మాసంలోనూ, ఇంకా కొన్ని చోట్ల ఫాల్గుణ మాసంలోనూ నిర్వహించుకుంటూ ఉంటారు. ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ మాసాలలో సంవత్సరాదులు రావడానికి కారణం.. సంవత్సర పరిగణనం వేరు వేరు మాసాలతో జరగడమే. ఆంధ్రులు తమ సంవత్సరాదిని చాంద్రమాన పరిగణనముననే నిర్ణయించుకుంటారు. చాంద్రమాన సంవత్సరం చైత్ర శుక్ల ప్రతిపత్తుతో ప్రారంభమవుతుంది. శాస్త్రీయ, లౌకిక ఆచారాలను బట్టి చైత్ర మాసాదే ఆర్యుల సంవత్సరాదిగా నిర్ణయం చేయదగి ఉంది. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మ పురాణం కంఠోక్తిగా చెబుతూ ఉంది.
వసంత కాలం ఆరంభ దినాల్లో చైత్ర శుక్ల పాడ్యమి నాడు సంవత్సరాది పర్వం జరిపే ఆచారం ఆర్యుల్లో అతి ప్రాచీన కాలం నుంచీ ఉన్నట్టు కనిపిస్తుంది. మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా ఏడాది పండుగ అయి ఉన్నది. అగ్ని పూజకులైన పార్శీలకు మన ఉగాదితో జతపరుచుతూ ఉండటం వల్ల ఒక విషయం ఊహించదగినది. ఆర్యులు, పార్శీలు కలిసి ఉండిన కాలంలోనే ఈ పర్వం ఏర్పడి ఉంటుందని భావించవచ్చు. పార్శీలు ఉగాదిని ‘నౌరోజ్‍’ అంటారు. నౌరోజ్‍ అంటే కొత్త దినం అని అర్థం.
ఇంకా చైత్ర మాసంలో వచ్చే వివిధ పర్వాలు, పండుగల గురించి తెలుసుకుందాం.

ఫాల్గుణ బహుళ ద్వాదశి, ఏప్రిల్‍ 1, సోమవారం

చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు నృసింహ ద్వాదశి వ్రతం చేయాలని ఉంది. నీలమత పురాణం అనే మరో వ్రత గ్రంథంలో దీనిని ఫాల్గుణ శ్రవణ ద్వాదశి అంటున్నది. యోగేశ్వర భగవాన్‍ పూజ ఈనాడు చేయాలని మరో వ్రత గ్రంథంలో ఉంది. కాగా, ఏప్రిల్‍ 1న ప్రవేశించే ద్వాదశి తిథి 2వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది.

ఫాల్గుణ బహుళ చతుర్దశి, ఏప్రిల్‍ 4, గురువారం

నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఈ చతుర్దశి తిథిని ‘పిశాచ చతుర్దశి’ అని వర్ణించారు. ఈనాడు శివపూజ చేయాలని, అనంతరం పిశాచాల శాంతి కోసం బలి ఇవ్వాలని ఉంది.

ఫాల్గుణ బహుళ అమావాస్య, ఏప్రిల్‍ 5, శుక్రవారం

గోదావరి జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో ఫాల్గుణ బహుళ అమావాస్య నాటి రాత్రి శుభాశుభాలను విచారించుకుండానే ‘ఏరువాక’ సాగుతారనీ, దీనికి దొంగ ఏరువాక అని పేరనీ అంటారు. పలుచోట్ల ఈనాడు గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈనాడు వత్సరాంత శ్రాద్ధం చేయాలని నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో రాశారు. ‘ఆరంభమనేదే ప్రాయకంగా అంతం కూడా’. ఒకటి అంతం చేయడం అంటే మరొకటి ఆరంభం చేయ డమే. ఒకదానిని మనం అంతం చేస్తే మరొక ఆరంభం చేస్తున్నామన్న మాట. ఈ తిథి మీన సంక్రాంతి. అనగా, మీన సంక్రమణం. మత్స్య, వాసుదేవులను పూజించాలని, ఉపవాసం ఉండాలని హేమాద్రి వ్రత ఖండం చెబుతోంది. ఈనాడు సుజన్మావాప్తి వ్రతం, సంక్రాంతి స్నాన వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ పాడ్యమి, ఏప్రిల్‍ 6, శనివారం

చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ఉగాది పర్వదినం. ఈ పర్వం విశేషాల గురించి ముఖచిత్ర కథనాన్ని చదవచ్చు.
విశేషాలు.

ఉగాది పర్వం విశేషాలు

చైత్ర శుద్ధ పాడ్యమి, ఏప్రిల్‍ 6 శనివారం- ఉగాది

ఉగాది పండుగ ఆర్యావర్తనం అని పిలిచే ఉత్తర హిందూస్థానంలో ప్రస్తుతం నామమాత్రమై పోయింది. వ్రతోత్సవ చంద్రికాకారుని రాతలను బట్టి ప్రస్తుతం వింధ్య పర్వతానికి ఉత్తరాన ఒక్క మాళవ దేశంలోనే చైత్రాది పర్వం ఆచరణలో కొద్దిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈనాడు గృహాలంకరణం, పంచాంగ శ్రవణం ఈనాడు అక్కడి విధాయ కృత్యాలు. ఉత్తర హిందూ దేశాన ఇతర ప్రాంతాలో ఈ మాత్రం పర్వం కూడా జరుపుకోరు. ఆర్యావర్తంలో ఈ ఆర్యాచారం ఎందుకు లుప్తమైపోయింది. కాలాంతరాన అమలులోకి వచ్చిన సౌరబార్హ్యస్పత్య మన్వాది కాల పరిగణనములో గల తేడాలు ఇందుకు ఒక కారణం కావచ్చు. వింధ్యకు దక్షిణాన శాలివాహన శకమున్నూ, ఉత్తరాన విక్రమార్క శకమున్నూ ప్రచారంలోకి రావడం ఇందుకు మరో కారణం కావచ్చు. ఈ రెండు శకాల సందర్భంలో మహారాష్ట్రలో ప్రచారంలో ఉన్న గాథ ఇక్కడ తెలుసుకోగదగినది.
పురంధరపురంలో ఒక వర్తకుడు. అతను చాలా ధనవంతుడు. అతనికి నలుగురు కొడుకులు. చనిపోయే ముందు అతను తన కొడుకులకు నాలుగు సీళ్లు వేసిన పాత్రలు ఇచ్చాడు. తాను చనిపోయిన పిమ్మట కాని సీళ్లు తెరవద్దని అతను కొడుకులను ఆదేశించాడు. అలాగే, ఆ కొడుకులు తండ్రి మరణానంతరం ఆ పాత్రల సీళ్లు తొలగించి చూపారు. మొదటి పాత్రలో మట్టి, రెండో దానిలో బొగ్గులు, మూడో దానిలో ఎముకలు, నాలుగో దానిలో తవుడు ఉన్నాయి. దీనికి అర్థం వారికి తెలిసింది కాదు.
ఆనాటి హైందవ చక్రవర్తి విక్రమార్కుడు. ఆ కుమారులు నలుగురూ దాని అర్థాన్ని బోధించాల్సిందిగా విక్రమార్కుడిని కోరారు. కానీ విక్రమార్కునికి దాని అంతరార్థం అవగాహన కాలేదు. అప్పుడు వారు ప్రతిష్ఠాన పురానికి వెళ్లారు. అక్కడ కూడా రాజు కానీ మరెవ్వరూ కానీ దాని అంతరార్థాన్ని తేల్చలేకపోయారు. కాని ఆ ఊరిలోని వింత బాలుడు ఒకడు ఆ సమస్యను విడమరిచి చెప్పాడు. ఆ వింత బాలుడు ఒక బ్రాహ్మణ వితంతువు కొడుకు. ఆ బ్రాహ్మణ స్త్రీ మిక్కిలి చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుంది. ఆమెకు ఇద్దరు సోదరులు. నాగ కుమారుడైన తక్షకుని వలన ఆమె గర్భం ధరించింది. ఇందుకు ఆమె సోదరులు చిన్నబుచ్చుకుని దేశాంతర్గతులై పోయారు. దిక్కులేని ఆ దీన వితంతువుకు అప్పుడు ఒక కుమ్మరి వాడు ఆశ్రయమిచ్చాడు. ఆ కుమ్మరి ఇంట్లోనే ఆమె ఒక కుమారుడిని ప్రసవించింది. ఆ బాలుడికి ఆమె శాలి వాహనుడు అని పేరు పెట్టింది. ఆ బాలుడు వర్తకుని నాలుగు పాత్రల సమస్యను విని దానిని తాను పరిష్కరిస్తానని రాజు వద్దకు వెళ్లి ఇట్లా చెప్పాడు. మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు భూమినీ, బొగ్గులతో నిండిన పాత్రను పొందిన కుమారుడు కలపనూ, ఎముకలతో నిండిన పాత్రను పొందిన కుమారుడు ఏనుగులు, గుర్రాలు, పశువులు మొదలైన జంతువుల్నీ, తవుడుతో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్నీ పంచుకోవాలని వర్తకుని తాత్పర్యమని శాలివాహనుడు చెప్పాడు. శాలివాహనుడు ఇంత సముచితంగా సమస్యను పరిష్కరించిన సంగతి విని విక్రమార్కుడు అతనిని చూడ్డానికి కుతూహలపడి కబురంపాడు. కానీ, శాలివాహనుడు రాజు వద్దకు వెళ్లలేదు. దీంతో ఆగ్రహించిన విక్రమార్కుడు శాలివాహనుడిని మట్టుబెట్టడానికి అపార బల సమేతుడై దండెత్తి వచ్చాడు. ఇది విని శాలివాహనుడు మట్టితో మనిషి బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి విక్రమార్కుని సేనలపైకి వదిలాడు. శాలివాహనుడు సమ్మోహ నాస్త్రం ప్రయోగించి విక్రముని సేనల్ని నిద్రపోయే టట్టు చేశాడు. అందుకు విక్రముడు వాసుకి అనే నాగరాజును ప్రార్థించి విరుగుడు మందు తెప్పించుకుని సేనల్ని తిరిగి తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఉభయ పక్షాలకూ మధ్య రాజీ కుదిరింది. ఆకాశవాణి.. నర్మదా నదికి ఉత్తర ప్రాంతాన్ని విక్రమార్కుడు, దక్షిణాన్ని శాలివాహను డిని రాజ్యం చేయాలని ఆదే శించింది. దీంతో మన ఆంధ్రులకు, దక్షిణాదులకు శాలివాహనుడు శక స్థాపకుడు అయ్యాడు. ఆ శకానికి మొదటి దినం చైత్ర శుక్ల పాడ్యమి. కాగా, ఈ పర్వం అతని శక స్థాపనతో సంబంధం కలది అయ్యింది. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకులకు చైత్రాది దినమే సంవత్సరాది. ఆదిలో ఈనాడే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు. ఈనాడే బ్రహ్మ దేవతల్ని ఆయా పనులకు నియోగించాడు. నాటి నుంచి ఇది సంవత్సరాది అయ్యింది. ఇట్లని బ్రహ్మాండ పురాణ వాక్యం. ఆదిలో ఈనాడు ఆరంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా, దిన క్రమాభివృద్ధిగా సాగుతూ ఉంది.
మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలోనూ మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకా దశి వివరణలో ‘అమలకే వృక్షే జనార్దన:’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ తదితర గ్రంథాలలో ఉంది. ఆమలక (ఉసిరి) వృక్షం జనార్దన స్వరూపమనీ, దాని కింద అమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా ఆహారంగా తీసుకోవాలని మన పెద్దల నియమం.
అధిక మాస ప్రశంస లేని సాధారణ సంవత్స రాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి. వీటిని మూడు రకాలుగా విభజించవచ్చు.
విష్ణువు చర్యలను బట్టి శయనై కాదశి, పరివర్తనైకాదశి, ప్రభోదిన్యేకాదశి,
వ్రత నియమాలను బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి,
వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి మాత్రం అమలైకాదశి మాత్రమే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే ఆమలికలో ఏదో విశిష్టత ఉందని భావించాలి.
మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు నియమం విధించారు. దీనివల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరేలా వారు నియమాలు రూపొందించారు. అటువంటి వృక్షాలు, ఫలాలతో ముడిపడిన ముఖ్యమైన కొన్ని తిథుల వివరాలు..
చైత్ర మాసం అశోక కలికాప్రాశనం
ఫాల్గుణ మాసం ఆమ్రపుష్ప భక్షణం
కార్తీకం బిల్వపత్ర పూజ
ఆశ్వయుజం శమీ వృక్ష పూజ

చైత్ర శుద్ధ విదియ, ఏప్రిల్‍ 7, ఆదివారం

చైత్ర శుద్ధ విదియ వేదవ్యాస తీర్థానాం పుణ్యదినం అని శ్రీమధ్వ పుణ్యతీర్థమనీ ప్రసిద్ధి. పెరియ పెరుమాల్‍ తిరు నక్షత్రం ఈనాడేనని ఆళ్వాచార్యుల చరిత్ర చెబుతోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు ‘ఉమా శివాగ్ని పూజ’ అని రాస్తారు. ఈనాడు బాలేందు వ్రతం చేస్తారని, ఉమ, శివుడు, అగ్ని- ఈ ముగ్గురు దేవతలకు దమనంతో పూజ జరగాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం చెబుతోంది. దీనికి సంబంధించిన బ్రహ్మ పురాణంలో ముగ్గురికి సంబంధించిన కథ ఒకటి ఉంది.
పార్వతి భర్తతో ఏకాంతంగా క్రీడిస్తూ ఉంది. ఆ సమయంలో అక్కడికి అగ్ని భట్టారకుడు వచ్చాడు. అగ్నిని చూసి శివుడు పార్వతిని విడిచి దూరంగా వెళ్లిపోయాడు. అప్పుడు శివుడికి వీర్య పతనమైంది. క్రీడాభంగానికి కనలి పార్వతి ఆ శివుని వీర్యాన్ని ధరించాల్సిందిగా అగ్నిని ఆజ్ఞాపించింది. అగ్ని ఈ వీర్యాన్ని ధరించి కుమారస్వామి జననానికి కారణభూతుడు అయ్యాడు.
కాగా, స్కంద పురాణంలో చైత్ర శుద్ధ విదియ నాడు అరుంధతీ వ్రతం చేయాలని ఉంది. ఇది స్త్రీల సౌభాగ్య వ్రతం.

చైత్ర శుద్ధ తదియ, ఏప్రిల్‍ 8, సోమవారం

ఈనాడు శివడోలోత్సవం, సౌభాగ్య గౌరీ వ్రతం చేస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమితో వసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. వసంత నవరాత్రుల తొమ్మిది రోజులలో తదియ మూడవ రోజు. శివ డోలోత్సవం నాడు ఉమా శివులను దమనములతో పూజించి డోలోత్సవం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మశాప్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ తదియను మహారాష్ట్ర పంచాంగాలు గౌరీ తృతీయ అని పేర్కొంటున్నాయి. వ్రత గ్రంథాలను బట్టి చూస్తే చైత్ర శుక్ల తృతీయ నాడు మహాదేవుడితో కూడిన గౌరిని పూజించాలి. ఆ పూజలో కుంకుమ, అగరు, కర్పూరం హెచ్చుగా వాడాలి. అలంకారానికి మణులు, మంచి వస్త్రాలు వాడాలి రాత్రి జాగరణం చేయాలి.
అలాగే, ఈనాడు సౌభాగ్య శయన వ్రతాన్ని కూడా ఆచరించాలని, ఈ వ్రతాన్ని గురించి మత్స్యుడు మనువుకు చెప్పినట్టు మత్స్య పురాణంలో ఉంది. చైత్ర శుద్ధ తృతీయ పూర్వాహ్న వేళ ఉమా మహేశ్వర ప్రతిమలకు వివాహం చేసి కల్పోక్త ప్రకారం పూజలు, దానాలు చేస్తే శివలోకప్రాప్తి కలుగుతుంది. ఈనాడు రామచంద్ర డోలోత్సవం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ చతుర్థి, ఏప్రిల్‍ 9, మంగళవారం

చైత్ర శుద్ధ చతుర్థి నాడు గణపతిని దమనములతో పూజించాలి. ఇంకా ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర శుద్ధ పంచమి, ఏప్రిల్‍ 10, బుధవారం

చైత్ర శుద్ధ పంచమి తిథిని శాలి హోత్రయ పంచమిగా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి వర్ణిస్తున్నాయి. ఈనాడు హయపూజ చేయాలని ఉంది. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండినట్టు కనిపిస్తుంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఈనాడు లక్ష్మీపూజ చేయలని ఉంది. అదే- ‘శ్రీ వ్రతం’.

చైత్ర శుద్ధ షష్ఠి, ఏప్రిల్‍ 11, గురువారం

చైత్ర శుద్ధ షష్ఠి నాడు స్కంద పూజ చేయాలి. ఈనాడు కుమారస్వామిని దమనములతో పూజించాలి. అర్క, కుమారషష్ఠి వ్రతాలు ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు.

చైత్ర శుద్ధ సప్తమి, ఏప్రిల్‍ 12, శుక్రవారం

చైత్ర శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని దమనాలతో పూజించాలి. ఈనాడు ఇంకా గోమయాది సప్తమి, నామ సప్తమి, సూర్య, మరుత్‍, తురగ సప్తమీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు వాసంతీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. అలాగే, ఈనాడు అర్క వ్రతం ఆచరించే వారు రాత్రి భోజనం చేయకూడదు.

చైత్ర శుద్ధ అష్టమి, ఏప్రిల్‍ 13, శనివారం

చైత్ర శుద్ధ అష్టమి నాటి వివరణలో మన పంచాంగకర్తలు భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని రాశారు. దీనిని బట్టి ఇది భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణింపబడుతూ ఉందని తెలుస్తోంది. భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుని నిరాదరించాడు. ఆ కోపాన దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు. ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు. దీనిని పార్వతిని తప్ప అందరినీ పిలిచాడు. కానీ పార్వతి పుట్టింటిపై మమకారంతో వెళ్లింది. అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు. ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో నేలరాచింది. యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. సతీదేవి భస్మమైన విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది. పర్వతరాజుకు పుట్టడం చేత ఆమెను పార్వతి అని పిలవసాగారు. భవానీ ఆమె పర్యాయ పదం.

చైత్ర శుద్ధ నవమి, ఏప్రిల్‍ 14, ఆదివారం

చైత్ర శుద్ధ నవమి శ్రీరాముని జన్మతిథి. శ్రీ మహా విష్ణువు పది అవతారాల్లో శ్రీరామావతారం ఏడవది. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునకు కౌసల్య గర్భంలో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ పుట్టాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. విష్ణువు పది అవతారాల్లో మూడు అవతారాల జయంతులు చైత్ర మాసంలోనే రావడం విశేషం. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఏటేటా వచ్చే ఈ పది జయంతుల లోనూ సంవత్సరాదికి పిమ్మట మొదట వచ్చే జయంతి పర్వం శ్రీరామ నవమే. శ్రీరామ నవమి పండుగ తొమ్మిది రోజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులలో ఉగాది పాడ్యమి మొదటి రోజు. ఈ తొలి రోజున ప్రారంభించి శ్రీరామ నవమి వరకు రామాయణ పారాయణ మొదలైన పనులు చేస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భ నవరాత్రులు అంటారు.

చైత్ర శుద్ధ దశమి, ఏప్రిల్‍ 15, సోమవారం

చైత్ర శుద్ధ దశమిని మన పంచాంగకర్తలు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని రాస్తారు. రామ నవమి ప్రతాంగ హోమం కాక ఈనాడు మరో రెండు పర్వాలు కూడా ఉన్నాయి. అవి- ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి.
ఈనాడు ధర్మరాజును దమనముతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఇక, శాలివాహనుడు శాతవాహన పర్యామాభిధానుడు. ఆంధ్రభూమి ప్రసవించిన మహా పురుషులలో ఈయన ఒకరు. విక్రమార్కుడిని సంహరించాడని అంటారు. కుమ్మరి కన్యకు జన్మించాడు.

చైత్ర శుద్ధ ఏకాదశి, ఏప్రిల్‍ 15, సోమవారం

తిథులన్నిటిలోకీ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఏకాదశి సాధారణంఆ ఉపవాసాల రోజు. ఏకాదశి తిథి పదిహేను రెజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద భూమికి దిగి వచ్చాడు. అసురుడితో ఆయన బాగా యుద్ధం చేశాడు. యుద్ధ మధ్యంలో అతను అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సౌందర్యవతి ఆవిర్భవించి అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు.

చైత్ర శుద్ధ ద్వాదశి, ఏప్రిల్‍ 16, మంగళవారం

చైత్ర శుద్ధ ద్వాదశి నాడు విష్ణు దమనోత్సవం నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. దీనిని వాసుదేవార్చనగా వ్యవహరిస్తారు. మన పంచాంగకర్తలు మాత్రం ఈనాటి వివరణలో వామన ద్వాదశి అని రాస్తారు. వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని ఈనాడు దమనంతో పూజించాలి. చైత్ర శుద్ధ ద్వాదశి గొప్పదనం గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు పుట్టాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు.

చైత్ర శుద్ధ త్రయోదశి, ఏప్రిల్‍ 17, బుధవారం

చైత్ర శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి.. దీనినే మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు బ్రహ్మ చేత, శివుడి చేత అనంగుడుగా చేయబడినట్టు పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. అలాగే, ఈనాడు శివుడిని దమనములతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.

చైత్ర శుద్ధ చతుర్దశి, ఏప్రిల్‍ 18, గురువారం

చైత్ర శుద్ధ చతుర్దశి.. శైవ చతుర్దశి, కర్దమ క్రీడ, రౌచ్యమన్వాదిగా ప్రసిద్ధి. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. అలాగే, రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతనికుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులు అయి పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయగదగినది. ఈనాడు ఇంకా నృసింమ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవం వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతున్నాయి.

చైత్ర శుద్ధ పూర్ణిమ, ఏప్రిల్‍ 19, శుక్రవారం

పున్నములు రెండు రకాలు. ఒకవేళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పున్నమ ఒకటి. ఈ పున్నమను ‘అనుమతి’ అంటారు. పదహారు కళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పున్నమ మరొకటి. ఈ పున్నమ రాకా పూర్ణిమ. సూర్యేందు సంగమ కాలం అమావాస్య. అమావాస్య నుంచి పూర్ణిమకు పదహారు రోజులు. అమావాస్య నుంచి పున్నముక, పున్నమ నుంచి అమావాస్యకు గల కాలాన్ని పర్వసంధి అంటారు. అమావాస్య నుంచి పూర్ణిమాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క దినానికి చంద్రుడికి ఒక్కో కళ హెచ్చుతూ ఉంటుంది. పూర్ణిమాస్య నుంచి అమావాస్యవరకు గల పదహారు దినాలలో ఒక్కో దినానికి చంద్రునికి ఒక్కో కళ తగ్గుతూ ఉంటుంది. పదహారు కళలలో ఒప్పుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతినిస్తంద్రుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతి నిస్తంద్రుడై ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అనగా, ఏడాదికి పన్నెండు పూర్ణిమలన్న మాట. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పున్నమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్ర ఒకటి. అటువంటి చిత్తా నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి. చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి పర్వం.
చైత్ర పూర్ణిమను మహాచైత్రి అని కూడా ఉంటారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.

అలాగే, ఈనాడు హనుమజ్జయంతి పర్వం. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది. చైత్ర పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు పశుపతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే వ్రత గ్రంథంలో ఉంది.

చైత్ర బహుళ పాడ్యమి, ఏప్రిల్‍ 20, శనివారం

చైత్ర బహుళ పాడ్యమి తిథి నాడు పాతాల వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు జ్ఞానావాప్తి వ్రతం కూడా చేస్తారని తెలుస్తోంది.

చైత్ర బహుళ పంచమి, ఏప్రిల్‍ 24, వారం

చైత్ర బహుళ పంచమి తిథి మత్స్య జయంతి పర్వం. విష్ణువు పది అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. ఈనాడు మత్స్య జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అయితే ఈ జయంతి దినంపై కొంత వివాదం కూడా ఉంది. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకునిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దీంతో బ్రహ్మ సృష్టికార్యం ఆగిపోయింది. ఆపై బ్రహ్మ విజ్ఞప్తితో విష్ణువు మత్స్యావతారం దాల్చి రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అలా విష్ణువు చేప అవతారమెత్తిన దినం ఇదేనని విశ్వాసం.

Review వసంతాగమనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top