కాంతిరేఖ..వైశాఖ

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఐదో మాసం- మే. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది రెండో మాసం. ఇది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. కాబట్టే దీనిని ‘మాధవ మాసం’ అని కూడా అంటారు. తెలుగు మానం ప్రకారం ఇది చైత్ర – వైశాఖ మాసాల కలయిక. మే 11వ తేదీ వరకు చైత్ర మాస తిథులు.. ఆపై మే 12వ తేదీ నుంచి వైశాఖ మాస తిథులు కొనసాగుతాయి. అక్షర తృతీయ, పరశురామ జయంతి, బుద్ధ పూర్ణిమ వంటి పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకమైనవి.

చాంద్ర మానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమనే పేరు వచ్చింది. ‘వైశాఖ’ అంటే మిక్కిలి కాంతిని ప్రసరించేదని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి, భగవంతుని అనుగ్రహం పొందడానికి కొన్ని మాసాలను మన పెద్దలు ప్రత్యేకంగా నిర్దేశించారు. అటువంటి వాటిలో మాఘ మాసం, కార్తీక మాసం ముఖ్యమైనవైతే ఆ వరుసలో నిలిచే మరో మాసం.. వైశాఖం. ఆధ్యాత్మిక సాధనకు అన్ని రకాలుగా అనువైన మాసం కావడం వల్లే వైశాఖానికి ‘సాధన మాసం’గానూ పేరు. అలాగే, వైశాఖ మాసానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. మాఘ, కార్తీక మాసాల పేరిట మాఘ పురాణం, కార్తీక పురాణం ఉన్నట్టే వైశాఖ పురాణం కూడా ఒకప్పుడు మిక్కిలి ప్రాచుర్యంలో ఉండేది. దీనిని వ్యాసదేవుడు రచించాడు. వసంత రుతువులో వైశాఖం రెండో మాసమైన వైశాఖంలో చెట్లు చిగురించి, పూలు విరబూస్తాయి. ఇక, వైదికంగా ఇది శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే దీనిని ‘మాధవ మాసం’ అనీ పిలుస్తారు. చైత్ర మాసానికి ‘మధు మాస’మని పేరైతే.. వైశాఖానికి ‘మాధవ మాస’మనీ పేరు. ఈ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకు ఉద్ధిష్టమైనది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్ఠమని ధర్మశాస్త్ర ఉవాచ. అలాగే, విష్ణు సహస్ర నామ పారాయణకు వైశాఖ మాసం మిక్కిలి అనువైనది. ఈ మాసం పొడవునా అశ్వత్థ వృక్షానికి నిండుగా నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయడం వలన అభీష్టసిద్ధి కలుగుతుందని, పితృదేవతలు సంతృప్తి చెందుతారని పెద్దలు చెబుతారు.

నారాయణుడికి ప్రియుడైన శివుడికి ఈ నెలంతా అభిషేకాలు చేయడం వలన శివకేశవులకు ప్రీతి కలుగుతుందని అంటారు. వైశాఖ మాసంలో ఆచరించే అభిషేకాలు ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని కలిగిస్తాయని ప్రతీతి. శివాలయాల్లో లింగానికి పైన ధారాపాత్ర ఏర్పాటు చేయాలి. దీని నుంచి ధారగా నీరు శివలింగంపై పడేలా చేయాలి. దీనివల్ల సృష్టిలో ఉన్న వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని అంటారు. అందుకే ఈ నెలంతా శివారాధన శ్రేష్ఠం. వైశాఖ మాసంలో ఎండలు మండిపోతుంటాయి. . అందుకే ఈ నెలలో చేయాల్సిన కొన్ని దానాల గురించి కూడా మన పెద్దలు నియమాలు విధించారు. నీటితో నింపిన పాత్రలను ఈ మాసంలో దానం చేయాలని అంటారు. ఈ కారణంగానే వైశాఖాన్ని ఉదకుంభ మాసంగానూ పిలుస్తారు. ఉదకుంభం అంటే నీటితో నింపిన పాత్ర అని అర్థం. చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహార్తులకు నీటిని దానం చేయడం వైశాఖంలో ముఖ్యమైన విద్యుక్త ధర్మం. మన పండుగలు, తిథులు, వాటిని అనుసరించి వచ్చే మాసాలు ఆధ్యాత్మికంగానే కాదు సామాజికంగానూ మనం నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి ఉద్బోధిస్తాయి. ఈ క్రమంలోనే వైశాఖంలో కలిగే వేసవితాపం నుంచి మనుషులను, పశుపక్ష్యాదులను రక్షించేందుకు నీటిని దానం చేయాలనే నియమం ఏర్పడింది.

వైశాఖ దాన ఫలితాలు
మామిడిపండ్ల దానం: పితృదేవతలు సంతోషిస్తారు. పుణ్యలోకప్రాప్తి.
పానకం కుండ దానం: పితృ దేవతలకు వందసార్లు గయలో శ్రాద్ధం పెట్టిన ఫలం.
దోస, బెల్లం, చెరుకు దానాలు: సర్వ పాపాలు నశిస్తాయి.
మంచం దానం: సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి.
వస్త్ర దానం: ఆయుష్షు వృద్ధి.
తెల్లని వస్త్ర దానం: పూర్ణాయుష్షు.
కుంకుమ దానం: స్త్రీలకు సంపూర్ణ ఆయుష్షు కలిగిన భర్త లభిస్తాడు.
గంధం దానం: ప్రమాదాల బారినపడరు.

చైత్ర బహుళ పంచమి
మే 1, శనివారం

చైత్ర బహుళ పంచమి తిథి మత్స్య జయంతి పర్వం. ఈనాడు మత్స్య జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకునిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దీంతో బ్రహ్మ సృష్టికార్యం ఆగిపోయింది. ఆపై బ్రహ్మ విజ్ఞప్తితో విష్ణువు మత్స్యావతారం దాల్చి రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అలా విష్ణువు చేప అవతారమెత్తిన దినం ఇదేనని విశ్వాసం.
విష్ణువు పది అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. అలాగే, ఏటా మే 1న ప్రపంచ శ్రామిక దినోత్సవం (మే డే) నిర్వహిస్తారు.

చైత్ర బహుళ షష్ఠి
మే 2, ఆదివారం

షష్ఠి తిథి నాడు కుమారస్వామిని ఆరాధిస్తారు. షష్ఠి తిథి ఆయనకు ప్రీతిపాత్రమైనది.

చైత్ర బహుళ సప్తమి
మే 3, సోమవారం

చైత్ర బహుళ సప్తమి తిథి సూర్యారాధనకు ఉద్ధిష్టమైనది. సప్తమి తిథి నాడు ఆయన ప్రీత్యర్థం తిలస్నానం చేసి తిలలు దానం చేయాలని నియమం.

చైత్ర బహుళ సప్తమి
మే 4, మంగళవారం

చైత్ర బహుళ అష్టమి నాడు దుర్గాదేవిని పూజించాలని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే, ఈ తిథిని శుక్ర మౌడ్యమి త్యాగంగానూ వ్యవహరిస్తారు.

చైత్ర బహుళ నవమి
మే 5, బుధవారం

చైత్ర బహుళ నవమి శక్తి ఆరాధన తిథి.

వైశాఖ మాస విశేషాలు, ప్రత్యేకతలు, నియమాలు
• వైశాఖ మాసంలో స్నాన, పూజ, దాన ధర్మాల వంటి ఉత్తమ కార్యాలను విధిగా ఆచరించాలని నియమం. ఈ ధర్మాచరణ వల్ల ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి.
• వైశాఖంలో స్నానం చేసే నీటిలో సకల దేవతలు కొలువుదీరి ఉంటారట. అందుకే ఈ మాసంలో నదీ స్నానం.. కుదరకుంటే అందుబాటులో ఉన్న కాలువలు, బావులు, జలాశయాల్లో పవిత్ర నదులను స్మరించుకుంటూ స్నానం చేయాలి.
• వైశాఖంలో ఒంటిపూట భోజనం, నక్తం ఆయాచితంగా భుజించడం, సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం మంచిది.
• నారాయణుడి ఆదేశం మేరకు వైశాఖ మాసంలో దేవతలంతా తెల్లవారుజాము వేళ నీటిలో ఉంటారట. అందువల్ల ఆ సమయంలో స్నానం చేయడం ఉత్తమమని పురాణాలు చెబుతున్నాయి.
• విష్ణువు వైశాఖ మాసం మొదులుకుని మూడు నెలల పాటు ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. ఆయనకు అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని ప్రతీతి.
• ఉదయమే నిద్రలేచి స్నానాదులు ముగించి, రావిచెట్టు (అశ్వత్థ వృక్షం)కు నీరుపోసి ప్రదక్షిణలు చేసి శ్రీమహావిష్ణువును తులసీ దళాలతో పూజించడం వైశాఖ మాస విధుల్లో ప్రత్యేకమైనది.
• వైశాఖ మాసంలో సంధ్యా వందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహా విష్ణువును తులసీ దళాలలతో పూజించాలి.
• వైశాఖ మాసంలో సూర్యుడు మేష రాశిలో సంచరిస్తుంటాడు. ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వస్తువులను ఈ మాసంలో విరివిగా దానం చేయాలి.
• నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు వంటివి దానం చేయడం, దాహంతో ఉన్న వారికి మంచినీటిని ఇవ్వడం, చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వంటి దానధర్మాలను ఆచరించాలి. ఈ దాన పక్రియనే ‘ఉదకుంభ దానం’ అంటారు.

చైత్ర బహుళ ఏకాదశి
మే 7, శుక్రవారం

చైత్ర బహుళ ఏకాదశి వరూథిన్యేకాదశిగా ప్రతీతి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈ పర్వం గురించిన వివరాలు ఉన్నాయి. దీనినే మన పంచాంగకర్తలు వరూథిని వ్రతం అనీ అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసాదులు ఉండి వ్రతం చేసిన వారికి వేయి గోదానములు చేసిన ఫలం కలుగుతుందని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. చైత్ర కృష్ణ ఏకాదశి తిథి వల్లభాచార్యుల వారి జన్మదినం కూడా. అలాగే, ఈనాడు విశ్వకవి రవీంద్రనాథ్‍ ఠాగూర్‍ జయంతి దినం.

చైత్ర బహుళ ద్వాదశి
మే 8, శనివారం

చైత్ర బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని అంటారు.

చైత్ర బహుళ త్రయోదశి
మే 9, ఆదివారం

హిరణ్యాక్షుడు రాక్షసుడు. బలగర్వితుడై భూమిని చాపగా చుట్ట చుట్టి పట్టుకుపోయి పాతాళంలో దాక్కున్నాడు. భూదేవి తన బాధను శ్రీహరికి చెప్పుకుంది. దీంతో విష్ణువు ఒక పెద్ద పంది రూపాన్ని దాల్చి అవతరించాడు. ఆ పంది (వరాహం) శరీరం నల్లని పర్వతంలా ఉంది. కోరలు తెల్లగా, వాడిగా ఉన్నాయి. కళ్లు పెద్ద జ్యోతులుగా వెలుగొందుతున్నాయి. అది గర్జిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఈ రూపంతో విష్ణువు హిరణ్యాక్షుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుడిని చివరకు సంహరించిన వరాహమూర్తి.. పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు. ఈ అవతారం ప్రాదుర్భవించింది చైత్ర బహుళ త్రయోదశి తిథినాడే. అందుకే ఈనాడు వరాహ జయంతి దినం అయ్యింది. వరాహావతారం విష్ణువు దశావతారాల్లో మూడవది. వరాహ జయంతి తిథిపై కొంత వివాదం ఉన్నా.. తెలుగు పంచాంగాల ప్రకారం వరాహ అవతారం చైత్ర బహుళ త్రయోదశి నాడే ఆవిర్భవించిందని తెలుస్తోంది. ఈ అవతారానికి సంబంధించి ఇంకో కథ కూడా ప్రచారంలో ఉంది.
కల్పాంతంలో ఒకసారి సమస్తం జలమయమైపోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలాశయంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. మహర్లోక వాసుల వేడుకోలుతో విష్ణు మేల్కొన్నాడు. తిరిగి జగత్‍ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండాన్ని రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు. అధోభాగాంఢ ఛిద్రం నుంచి యుల్బము భూమిపై పడింది. అది మేరు పర్వతమైంది. అనంతరం నానా విధాలైన పర్వతాలు, చెట్టు చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు మాదిరి ఉంది. ఆమె తన బాధను విష్ణువుకు చెప్పుకోవడంతో విష్ణువు వరాహావతారం దాల్చాడు. యజ్ఞ స్వరూపంలో ఉన్న ఆ వరాహం పాతాళ లోకానికి వెళ్లి తన కోరలతో భూమిని పైకి ఎత్తాడు. తిరిగి భూమి స్వస్థలానికి చేరింది. కాగా, త్రయోదశి తిథి నాడు శనికి విశేషాభిషేకాలు కూడా చేస్తారు. ఇంకా, మే 9 అంతర్జాతీయ మాతృ దినోత్సవం. మాతృమూర్తులను గౌరవించి, వారి త్యాగాలను మననం చేసుకునే సందర్భమిది.

చైత్ర బహుళ చతుర్దశి
మే 10, సోమవారం

చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమ వారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనది. కానీ, ఇది సోమవారం వచ్చింది. ఈ తిథి నాడు గంగా స్నానం చేస్తే పిశాచత్వం పోతుందని అంటారు.

చైత్ర బహుళ అమావాస్య
మే 11, మంగళవారం

పూర్వం అచ్ఛోదం అనే కొలను ఉండేది. సోమవులనే పితరుల మానస పుత్రిక దాని ఒడ్డున తపస్సు చేస్తుండేది. దీంతో ఆమె పేరు అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు మనసు పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనమిచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా అతను దివ్యాలంకార భూషితుడై ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ అతను చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఈ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఈనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాదులను ఇవ్వడం ఆచారంగా వస్తోంది. ‘అమావాస్య’ వెనుక ఉన్న నేపథ్యమిది.
చైత్ర బహుళ అమవాస్య నాడు వహ్ని వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

వైశాఖ శుద్ధ పాడ్యమి
మే 12, బుధవారం

వైశాఖ శుద్ధ పాడ్యమితో వైశాఖ మాసం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచే వైశాఖ స్నాన వ్రతం ఆరంభమవుతుంది. వైశాఖ స్నానంతో సర్వ పాపాలు హరిస్తాయని ప్రతీతి. ప్రాత కాలంలో నియమంగా స్నానం చేస్తే విష్ణువుకి ప్రీతి కలుగుతుంది. స్నానానంతరం రావిచెట్టుకుని నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. ఈ మాసంలో తులసి దళాలతో విష్ణువును పూజించాలి.

వైశాఖ శుద్ధ విదియ
మే 13, గురువారం

వైశాఖ శుద్ధ విదియ రోహిణి వ్రతాచరణ దినం. ఈనాటి నుంచి చంద్ర దర్శనం. అలాగే, మే 13 రంజాన్‍ పర్వదినం.

వైశాఖ శుద్ధ విదియ/తదియ
మే 14, శుక్రవారం

అక్షయ తృతీయ నాడే కృత యుగం ఆరంభమైందని, కాబట్టి ఈ కృత యుగాదినే అక్షయ తృతీయ పర్వంగా నిర్వహించుకుంటారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిష్యోత్తర పురాణంలో వివరంగా ఉంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయ నాడు బదరీ నారాయణుడిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా చాలాచోట్ల కనిపిస్తోంది. ఈ తిథి మొదలుకుని అన్నీ పర్వదినాలే. అక్షయ తృతీయ ఒకప్పుడు ఉగాది తిథి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనే నాలుగు యుగాల్లోనూ త్రేతాయుగానికి ఇది మొదటి రోజు. శ్రీరామావతారం త్రేతా యుగానికి చెందినది. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములనే త్రేతాగ్నులను పూజించిన కాలం కావడం చేత అది త్రేతాయుగం అయ్యింది.
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా ప్రసిద్ధి. ఇది గొప్ప పుణ్య దినం. అక్షయ తదియ సోమవారం కానీ, బుధవారం కానీ వస్తే మరీ మంచిది. కృత్తిక రోహిణీ నక్షత్రంతో కూడిన ఈ పర్వం అతి ప్రశస్తమైనదిగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తిథి నాడు చేసే దానాలు, దేవతలకు, పితరులకు చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని అంటారు. అందుకే ఈ పర్వానికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. అక్షయ తృతీయ నాడు పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మొదలైనవి దానం చేయాలని నియమం. వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో సంపన్నులు ఒక వ్రతం చేస్తుంటారట. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మొదలైనవి కూడా వ్రతం చివరిలో పంచి పెట్టే వారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం విధాయ కృత్యాలలో ఒకటి.
స్మ•తి కౌస్తుభంలో, తిథి తత్వంలో, పురుషార్థ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఈనాడు విష్ణువును పూజించాలని ఉంది. చైత్ర శుక్ల తృతీయ నాడు ప్రారంభించిన గౌరీ పూజ వ్రతాన్ని కొన్ని ప్రాంతాలలో నెల రోజులు కొనసాగి ఈనాడు ముగుస్తుంది. కాబట్టే పంచాంగాలలో ఈనాడు గౌరీపూజ, త్రిలోచన గౌరీ వ్రతం అని పేర్కొన్నారు.
వైశాఖ శుద్ధ తదియ పరశురామ జయంతి దినంగానూ ప్రసిద్ధి. ఇది దశావతారాల్లో ఆరవ అవతారం.
ఇంకా ఈనాడు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షయ తృతీయ నాడు సాధారణంగా కృత్తికా నక్షత్రం కూడి ఉంటుంది. కృత్తిక అగ్ని సంబంధమైనది. అగ్ని వల్ల తీక్షణత పుడుతుంది. ఆ తీక్షణం తగ్గించడానికి చందన చర్చ ఒక శైత్యోపచారం. సింహాచల స్వామికి విదియ నాటి రాత్రి గంధమును ఒలిచి వేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్ర ఘటాభిషేకము చేస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనం. స్వామి రూపం లింగాకృతిలో కనిపిస్తుంది. అనంతరం తిరిగి స్వామికి చందన చర్చ. ఈ గంధం ఒలుపు సహస్ర ఘటాభిషేకం, చందన సేవతో కూడి ఉంటుంది.
చందనాను లేపనం మంగళ ప్రదమైనది. ఆరోగ్యప్రదమైనది. చందనం అమూల్యమైన మూలిక. ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విషాహారంగా, క్రిమిహరంగానూ పని చేస్తుంది. అంత:తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలవ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు.

వైశాఖ శుద్ధ తదియ
మే 15, శనివారం

తదియ ఘడియలు 15వ తేదీన కూడా కొనసాగుతాయి.

వైశాఖ శుద్ధ చతుర్థి
మే 16, ఆదివారం

వైశాఖ శుద్ధ చతుర్థి నాడు చతుర్థి వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ఇది ప్రధానంగా గణపతి సంబంధిత పూజ.

వైశాఖ శుద్ధ పంచమి
మే 17, సోమవారం

వైశాఖ శుద్ధ పంచమి.. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి తిథిగా ప్రసిద్ధి. అద్వైతాన్ని ఈ లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరుల వారు మన హైందవ ధర్మానికి పట్టుగొమ్మ. ఆదిశంకరులు చిన్ననాడే దరిద్ర నారాయణులను చూసి.. వారి కోసం కరుణా సముద్రుడై లక్ష్మీదేవిని స్తుతించి పేదల ఇళ్లను సౌభాగ్యాలకు నెలవు చేశాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. కాశ్మీర దేశంలో శారదా దేవి పీఠం ఒకటి ఉందనీ, దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయనీ, తూర్పు, పడమటి, ఉత్తర ద్వారాలను ఆయా దిక్కుల నుంచి వచ్చిన సర్వజ్ఞులైన పండితులు తెరిచారనీ, దక్షిణ ద్వారం తెరవగల పండితుడు లేనందున ఆ ద్వారం అలాగే మూసి ఉందని జనం చెప్పుకోవడం శంకరులు విన్నారు. దీంతో ఆయన కాశ్మీరానికి వెళ్లి, అక్కడి పండితులతో వాదించి దక్షిణ ద్వారం తెరుచుకునేలా చేసి విశేష కీర్తిని పొందారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించిన శంకరులు సన్యాసి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు నిర్వహించారు. తన పండిత శక్తితో డెబ్బయి రెండు మతాల వారిని జయించారు. అనేక ఉద్గ్రంథాలను రచించారు. శంకరాచార్యులు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైత మతం మన వేదాలలో, ఉపనిషత్తులతో, భగవద్గీతలో ఉన్నదే. ప్రజలు దానిని మరిచిపోగా భారతాన ఆ కొస నుంచి ఈ కొస వరకు తిరిగి దానిని వెలుగులోకి తెచ్చారు. ఆయన జయంతి తిథి నాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. అలాగే, వైశాఖ శుద్ధ పంచమి నాడే సూరదాస్‍ జయంతి కూడా నిర్వహిస్తారు. అంధుడైన ఈయన 16వ శతాబ్దానికి చెందిన గొప్ప ఆధ్యాత్మిక కవి. సంకీర్తనాకారుడు. తన కృతులన్నీ కృష్ణుడిపై రచించి పాడిన ఈయన కృష్ణుడికి గొప్ప భక్తుడు. కృష్ణుడు.. సూరదాస్‍ అంధుడైనప్పటికీ తన దర్శనంతో ఆయనకు నేత్రపర్వం చేశాడని అంటారు.

వైశాఖ శుద్ధ షష్ఠి
మే 18,మంగళవారం

వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి తిథి కాగా, వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి తిథి కావడం.. ఈ రెండూ వెంటవెంటనే రావడం విశేషం. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాచార్యులలో రామానుజాచార్య రెండవ వారు. ఈయన విశిష్టాద్వైత మతోద్ధారకుడు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పిన ఈయన షష్ఠి నాడు జన్మించిన కారణంగా ఈ తిథి నాడు విశేష పూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షప్రాప్తి కోసం తీసుకున్న రహస్య మంత్ర రాజాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దానిని బహిరంగపరిచాడనే గురువు ఆగ్రహాన్ని కూడా లోకుల కోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పదనం అందరూ తెలుసుకోదగినది. ఇంకా వైశాఖ శుద్ధ షష్ఠి నాడు పుత్ర ప్రాప్తి వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

వైశాఖ శుద్ధ సప్తమి
మే 19, బుధవారం

గంగా నది జహ్నుముని చెవి నుంచి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. అందుకే ఈ తిథి గంగా సప్తమిగా ప్రసిద్ధి. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద కావడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తపస్సు చేసి కైలాసనాథుని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకుని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖ మాస సప్తమి నాడే జరిగింది. దీనిని పురస్కరించుకుని ఈనాడు గంగా స్నానం, గంగాస్తుతి చేసిన వారికి పతితపావన గంగ సకల పాపపు రాశిని హరిస్తుందని పండితులు చెబుతారు. ఇంకా ఈ తిథి నాడు శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలను కూడా ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

వైశాఖ శుద్ధ అష్టమి
మే 20, గురువారం

సాధారణంగా ప్రతి నెలలో వచ్చే శుద్ధ అష్టమి, బహుళ అష్టమి తిథులలో దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. దేవిని పూజించడం ఈనాటి విధాయకృత్యం. ఈనాడు దుర్గాష్టమి వ్రతం ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది.

వైశాఖ శుద్ధ నవమి
మే 21, శుక్రవారం

ప్రతి నెలలో వచ్చే శుద్ధ, బహుళ నవమి తిథులు కూడా శక్త్యారాధనకు అనువైనది. వైశాఖ శుద్ధ నవమి ద్వాపర యుగాంతం. అలాగే, వృషభ సంక్రమణ పుణ్యకాలం.

వైశాఖ శుద్ధ ఏకాదశి
మే 22/23, శని/ఆదివారం

వైశాఖ శుద్ధ ఏకాదశి తిథి మే 22న ప్రారంభమై మే 23న ముగుస్తుంది. ఈ ఏకాదశిని మోహినీ ఏకాదశిగా వ్యవహరిస్తారు. మోహినీ ఏకాదశికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ధనవంతుడైన ఒక వైశ్యుడు తన ధనాన్ని అంతా దుర్వినియోగం చేశాడు. దీంతో అతనిని బంధువులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతను ఒక అడవికి వెళ్లి తిరుగుతుండగా, ఒక ముని కనిపించాడు. ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించి ఆచరించాలని చెప్పాడు. ఆ వైశ్యుడు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుణ్యం సంపాదించి, తిరిగి ధనవంతుడు అయ్యాడు. ఈ ఏకాదశి మిక్కిలి ఫలకారి. అందుకే ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మహా విష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం కూడా ఈనాడే.

వైశాఖ శుద్ధ ద్వాదశి
మే 23, ఆదివారం

ఏకాదశి తిథి ఉన్న మే 23 నాడే ద్వాదశి తిథి కూడా ప్రవేశిస్తుంది. వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ ద్వాదశి తిథి. వైశాఖ మాసంలో పరశురాముడికి సంబంధించి రెండు పర్వాలు వస్తాయి. పరశురామ జయంతి దినం కూడా ఈ నెలలోనే ఉంటుంది. రత్నగిరిలో పరశురామ మందిరం ఉంది. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంటుంది. వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రు నాశనమవుతుంది. తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్న జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువు (గొడ్డలి)ని పట్టుకుని ఇరవై ఒక్క సార్లు రాజులపై దండయాత్ర చేశాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు, రాముడు శివచాపాన్ని విరిచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకుందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నిటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోతాడు. ఈ ప్రాంతం ప్రస్తుత ఒరిస్సాలో ఉంది. అక్కడి నుంచి ఆయన మలబారు ప్రాంతానికి వలస వెళ్లాడని అంటారు. అస్సాంలోని కామాక్షి దేవి ఆలయం ఉంది. అదే జమదగ్ని ఆశ్రమం అని అంటారు. ఈ ప్రాంతంలో పరశురామాలయం కూడా ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మలబారు భూమి ఉన్న చోట కరువు ఉండదట.

వైశాఖ శుద్ధ త్రయోదశి
మే 24, సోమవారం

వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.

వైశాఖ శుద్ధ చతుర్దశి
మే 25, మంగళవారం

హిరణ్య కశిపుడిని అంతమొందించడానికి శ్రీ మహా విష్ణువు అవతరించింది వైశాఖ శుద్ధ చతుర్దశి నాడే. అందుకే ఈ తిథి నాడు నృసింహ జయంతి నిర్వహిస్తారు. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వల్ల లేదా స్వామి వారి వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈనాడు స్వామి వారు ఉద్భవించిన స్తంభం, ఇంటి గడపలను పూజించడం కూడా ఆచారం. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహా విష్ణువు నృసింహుడై స్తంభం నుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విధంగా లోకాలను కాపాడిన రోజు శుద్ధ చతుర్దశిగా భావించి నృసింహ జయంతిని నిర్వహిస్తారు.

వైశాఖ శుద్ధ పౌర్ణమి/బుద్ధ
పూర్ణిమ/కూర్మ జయంతి
మే 26, బుధవారం

ఇరవై ఏడు నక్షత్రాలలో విశాఖ నక్షత్రం పదహారవది. ఇది ఐదు నక్షత్రాల కూటమి. ఇది కుమ్మరి సారెలా ఉంటుంది. ‘విశాఖ’ అంటే కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అనీ అంటారు. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలి. ఈ తిథి ఎన్నో విధాలుగా ప్రసిద్ధమైనది. ధర్మరాజు ప్రీత్యర్థం ఈ తిథి నాడు నానావిధ దానాలు చేయాలి.
• ఈనాడు బుద్ధుని జన్మ మహోత్సవమని నీలమత పురాణంలో ఉంది. వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బౌద్ధ మత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు. కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలను చాలా శాంతంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగురవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు.
• సుబ్రహ్మణ్య స్వామి విశాఖ పూర్ణిమ నాడే అవతారమెత్తినట్టు చెబుతారు.
• పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి తిథి కూడా ఈనాడే.
• దశావతారాలలో ఒకటైన కూర్మావతారం కూడా వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే ఆవిర్భవించింది. పుష్య శుక్ల ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండవది. పాల సముద్రాన్ని మథించిన సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా దేవతలు, రాక్షసులు (అమృతం కోసం) చేసుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోయడానికి విష్ణువు పెద్ద తాబేలు ఆకారాన్ని ధరించాడు. కూర్మావతారం ఆంధ్ర దేశమంతటా పూజితం.

వైశాఖ శుద్ధ పాడ్యమి
మే 27, గురువారం

వైశాఖ బహుళ పాడ్యమి నారద మహర్షి జయంతి తిథి. ఆయన గొప్ప హరి భక్తుడు. ‘నారాయణ.. నారాయణ’ అంటూ ముల్లోకాలు తిరుగుతూ హరిభక్తిని జనులకు చాటేవాడు. ఇంకా ఈనాడు భూత మాత్రుత్సవం’ ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలుకుని జ్యేష్ఠ పూర్ణిమ చివరి వరకు శ్రీ ప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా నియమం.

వైశాఖ శుద్ధ విదియ
మే 28, శుక్రవారం

నారద జయంతి గురించి రెండు విధాలుగా ఉంది. తెలుగు క్యాలెండర్‍ ప్రకారం నారద జయంతి తిథి మే 27 అని పేర్కొనగా, తిథులను అనుసరించి అయితే, వైశాఖ బహుళ విదియ నారద జయంతి దినంగా ఉంది. ఈనాడు వీణ దానం చేయాలని అంటారు. నారదుడు గొప్ప గాన విద్యా కుశలుడు. ఆయన చేతిలో ఉండే వీణకు ‘మహతి’ అని పేరు. ఈ వీణ ఆధారంగానే ఆయన నిత్యం విష్ణుగానం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాడు. నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడునే గంధర్వుడిగా పుట్టాడట. అతను ఆ కాలంలో నారాయణ కథలు గానం చేసేవాడు. తరువాత కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడైనాడు.

వైశాఖ శుద్ధ తదియ/చతుర్థి
మే 29, శనివారం

తదియ, చతుర్థి తిథులు కలగలసిన దినమిది. వైశాఖ శుద్ధ చతుర్థి నాడు సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించాలని వివిధవ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఇది గణపతి సంబంధమైన వ్రతాచరణ పర్వం.

Review కాంతిరేఖ..వైశాఖ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top