దేదీప్య మాసం

మన తెలుగు మాసాల్లోని విశేషం ఎంత విచిత్రమైనదో! భాదప్రదం (సెప్టెంబరు) అబ్బాయి (గణపతి) పూజకు ఉద్ధిష్టమైనది. ఆశ్వయుజం (అక్టోబరు) అమ్మ (ఆదిశక్తి) పూజకు వేదికైతే కార్తీకం (నవంబరు) అయ్య వారి (పరమశివుడు) పూజకు శుభ సందర్భం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవ నెల. ఆంగ్లమానం ప్రకారం ఇది నవంబరు నెల. 11వది. శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసమంతా కార్తీక దీపం దేదీప్యమానంగా వెలుగొందుతుంది.

అమ్మ వారి పూజలకు ఆటపట్టయిన ఆశ్వయుజ మాసం ముగి యడంతోనే వానా కాలానికి కూడా తెరపడుతుంది. అక్టోబరు 28, కార్తీక శుద్ధ పాడ్యమి, సోమవారం నుంచి కార్తీక మాస తిథులు ప్రారంభమవుతాయి. కార్తీక మాసంలో చలి కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో చలి వణికిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యం తడి-పొడి వాతావరణంతో అంతా నజ్జు నజ్జుగా ఉంటాయి. అందుకే ఈ మాసం పొడవునా మనం ఆచరించాల్సిన పద్ధతులకు సంబంధించి మన పెద్దలు వివిధ వ్రతాలు, పూజా నియమాలను ఏర్పరిచారు. ఇవి ఆరోగ్యదాయకమైనవి. వణికించే చలిలో ఇక్కలాక్కుపోయే శరీరానికి ఉత్తేజాన్ని, వేడిని కలిగించే విధంగా ఆయా వ్రత నియమాలు విధించారు. వాటిని ఆచరించడం ద్వారా, ఆ వ్రత, పూజా విధుల్లో బాగంగా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించడం ద్వారా, తిరిగి వాటిని మహా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక, కార్తీక మాసం విశేషాల్లోకి వస్తే.. ఈ మాసం పరమశివునికి ప్రీతిపాత్రమైనది. శివారాధనకు ఉద్ధిష్టమైనది. ఈ మాసంలో ప్రాత:కాలంలోనే నిద్రలేచి సముద్ర, నదీ స్నానాలు చేయడం అత్యంత ఆవశ్యకం. ఇలా చేయడం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు మన ఒంటికి మేలు చేస్తాయని అంటారు. మత్స్య పురాణంలో కార్తీక మాస విశేషాల గురించి విపులంగా వివరించారు. ఈ పురాణ కథనం ప్రకారం ఈ నెలలో ఇంటి నిర్మాణం శుభకరం. ఈ మాసంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. అలాగే ప్రకృతిలో మేటైన ఔషధ వృక్షమైన ఉసిరిక దైవ సమానంగా పూజలందుకునేది ఈ మాసంలోనే. ఉసిరికను దైవికంగా కొలిచి, విశిష్ట ఆహారంగా ఈ మాసంలో తీసుకోవడాన్ని ముఖ్య నియమంగా పాటిస్తారు. కార్తీక మాసానికి కౌముదీ మాసం అని కూడా పేరు. కౌముది అంటే వెన్నెల. పిండారబోసినట్లు ఈ నెలంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి. ఇక, దీపారాధన కార్తీకంలో దేదీప్యమానం అవుతుంది. భువిలో జ్యోతులుగా వెలిగే ఈ దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను కలిగిస్తాయి. శివుడు – కేశవుడు.. ఇద్దరికీ ఈ నెలంతా విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ మాసంలో కూరలేమీ తినకుండా ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు, ఆయా తిథుల్లో వచ్చే వివిధ వ్రతాలు, వ్రతాచరణ విధానాల గురించి తెలుసుకుందాం.

కార్తీక శుద్ధ పాడ్యమి, అక్టోబరు 28, సోమవారం
అక్టోబరు 28, ఆశ్వయుజ బహుళ అమావాస్య తిథి నుంచే కార్తీక శుక్ల పాడ్యమి తిథి కూడా ప్రారంభమవుతుంది. కార్తీక స్నానారంభం ఈ తిథి నుంచే ప్రారంభమవుతుంది. దీనినే ఆకాశదీప ప్రారంభం అని కూడా అంటారు. కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని కూడా అంటారు. బలి చక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వయుజ మాసంలో వచ్చే నరక చతుర్దశి, అమావాస్యల మాదిరి గానే ఈనాడూ అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఇంకా, ఈనాడు ఏయే వ్రతాలు ఆచరించాలనే విషయమై ఆయా వ్రత గ్రంథాలలో వివరాలు ఉన్నాయి. స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు అన్నకూటము, గోవర్ధన ప్రతిపదం, అభ్యంగం, లక్ష్మీపూజ, ద్యూతం, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ అపరాహ్ణే మార్గపాలీ బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలని ఉంది. గదాధర పద్ధతి ప్రకారం.. ఈనాడు బలిరాజోత్సవం, ద్యూతమ్‍, బలిప్రతిపత్‍, ద్యూత ప్రతిపత్‍ వ్రతాలు చేయాలని ఉంది. పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరించాలి. అంటే మొదటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజులు పెరుగు అన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ఈ వ్రత విధి.

కార్తీక శుద్ధ విదియ, అక్టోబరు 29, మంగళవారం

స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఈ తిథిని యమ ద్వితీయగా పేర్కొన్నారు. ఈనాడు యముడిని పూజించాలి. సోదరి ఇంట భోజనం చేయాలి. ఈ పక్రియనే భగినీ హస్త భోజనం అంటారు. మన సంప్ర దాయంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పర్వాల్లో రెండు ముఖ్య మైనవి. ఒకటి- రాఖీ పూర్ణిమ. రెండవది- భగినీ హస్త భోజనం. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె సోదరుడికి పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అయ్యింది. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్లిన రెండవ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈనాడు అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి, బహుమానాలు ఇచ్చి, వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు.
పురాణ కథ ప్రకారం.. యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్లాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుంది. కానీ,యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. చివరకు ఒకసారి కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి యముడు వెళ్తాడు. సోదరుడు వచ్చిన సంతోషంతో యమున సంతోషంగా పిండివంటలు చేసి సోదరుడికి పెడుతుంది. చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో సోదరీ సోదరులు సంతోషిస్తారు. ఆ సంతోషంతో యముడు ఏదైనా కోరుకొమ్మని యమునతో చెబుతాడు. దీంతో ఆమె కార్తీక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని యమున కోరుతుంది. యముడు సంతోషించి, అలా వేడుక జరుపుకునే వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా ఉంటుందని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడు. అందు వల్లనే భగినీ హస్త భోజన విధి ఆచరణలోకి వచ్చింది.

ఇక, కార్తీక శుక్ల విదియ (ద్వితీయ) తిథి నాడు కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. ఈనాడు చంద్రార్ఘ ్య దానం తప్పక చేయాలని అంటారు. శుక్ల విదియ నాడు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. కాగా, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు పూజలు అందుకునే బలి చక్రవర్తి విదియ నాడు తిరిగి పాతాళానికి వెళ్లిపోతాడు. కాబట్టి ఈనాడు విధాయకంగా బలికి వీడ్కోలు పూజలు నిర్వహించాలి. అలాగే తాహతును బట్టి దాన ధర్మాలు నిర్వహించాలి.

కార్తీక శుద్ధ తదియ, అక్టోబరు 30, బుధవారం

కార్తీక శుక్ల తృతీయనే సోదరి తృతీయ అనీ అంటారు. ఈనాడు వివిధ వ్రత విధులను ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉన్నప్పటికీ, ఈ వ్రతాలన్నిటి కంటే సోదరి తృతీయ పర్వంగానే ఈ తిథి ప్రసిద్ధి. విదియ నాడు సోదరి ఇంటికి సోదరుడు భోజనానికి వెళ్తే.. ఈనాడు సోదరి సోదరుడిని, సోదరుడు సోదరిని పరస్పరం గౌరవించుకుంటారు. అందుకే దీనికి ‘సోదరి తృతీయ’ అనే పేరు వచ్చింది. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని ఉంది. అలాగే ఈనాడు విష్ణు గౌరీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. లక్ష్మీదేవిని యథాశక్తి పూజించి, ముత్తయిదువులను పిలిచి మంగళ ద్రవ్యాలతో వారిని గౌరవించి, వారికి భోజనం పెట్టాలి. అలాగే మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉన్న ప్రకారం- ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని నియమం విధించారు.

కార్తీక శుద్ధ చవితి, అక్టోబరు 31, గురువారం

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుక్ల చవితి నాగుల చవితి పర్వదినం. ఇది ఆంధప్రదేశ్‍లో ఎక్కువ ఆచరణలో ఉన్న తిథి పర్వం (కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు నాగుల చవితిని జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో). ఈనాడు గోదావరి తీర ప్రాంతాల్లో నాగ పూజలను చేస్తారు. నాగుల చవితిగా వ్యవహరించే ఈనాడు పాముల పుట్టలలో ఆవు పాలు పోస్తారు. చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేసే పదార్థం), అరటిపండ్లు, తాటి బుర్రగుజ్జు, తేగలు మొదలైనవి ఈనాటి నివేదన ప్రసాదాలు. ఈ సందర్భంగా పాముల పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు కాలుస్తారు. చిన్న పిల్లలు, యువతులకు ఆనందాన్ని పంచే పర్వమిది. భారతీయులలో చాలామంది ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయనే స్కంధుడు, కుమారస్వామిగానూ ప్రసిద్ధి. నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో పూజలందుకునేది ఈయనే. ఇంకా, ఈనాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. కార్తీక శుద్ధ పంచమి నాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని కూడా ఆ గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా ఏడు రోజులు క్రమం తప్పకుండా రోజూ ‘యవాగుయావక శాకదధి క్షీరఘృత జలనామాహార’ అనే వ్రతాన్ని ఆచరించాలని అంటారు. కార్తీక శుద్ధ పంచమినే నాగపంచమి అని కూడా అంటారు. జైనులు ఈనాడు తమ ఇళ్లలోని పాత పుస్తకాలను దులిపి, శుభ్రం చేసుకుని తిరిగి వాటిని యథా స్థానంలో ఉంచుతారు.

కార్తీక శుద్ధ పంచమి, నవంబరు 1, శుక్రవారం

ఈనాడు ఆంధప్రదేశ్‍ అవతరణ దినోత్సవం కూడా. 1956లో ఆంధప్రదేశ్‍ రాష్ట్రం అవతరించింది. కాగా, కార్తీక శుక్ల పంచమి తిథి నాటి నుంచి గురు మౌడ్యమి ప్రారంభమవుతుంది. ఈనాడు జయ పంచమి, జ్ఞాన పంచమి విధులు నిర్వర్తించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.

కార్తీక శుద్ధ షష్ఠి, నవంబరు 2, శనివారం

కుమారస్వామిని పూజించడానికి ఈ తిథి మిక్కిలి అనుకూలమైనది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు స్కంధ షష్ఠి వ్రతం ఆచరించాలని ఉంది. ఈ తిథి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడాన్ని మహేంద్ర కృచ్ఛ వ్రతమనీ అంటారు. అలాగే, ఈనాడు మనవాళ మహాముని తిరు నక్షత్ర తిథి కూడా. కార్తీక శుక్ల షష్ఠి.. మహా షష్ఠి పర్వంగా ప్రసిద్ధి. ఈనాడు వహ్ని పూజ చేయాలని అంటారు.

కార్తీక శుద్ధ సప్తమి, నవంబరు 3, ఆదివారం

కార్తీక శుక్ల సప్తమి తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు కల్పాదిగా కూడా వ్యవహరిస్తారు. అలాగే, శాక సప్తమీ వ్రతం కూడా ఆచరిస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతమని అర్థమవుతోంది.

కార్తీక శుద్ధ అష్టమి, నవంబరు 4, సోమవారం
కార్తీక శుక్ల అష్టమి నాడు గోపూజ చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఈనాడు గోపూజ చేయడం మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే, ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు.

కార్తీక శుద్ధ నవమి, నవంబరు 5, మంగళవారం
భారతదేశంలోని ప్రముఖమైన బ్రహ్మపుత్రా నదికి ఈ తిథి నాటి నుంచే పుష్కరాలు. కార్తీక శుద్ధ నవమి, ఉదయం 5.17 నిమిషాలకు ఈ పుష్కరాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మపుత్ర నదినే వాహినీ నదిగానూ వ్యవహరిస్తారు. కార్తీక శుక్ల నవమి.. మన పంచాంగాల ప్రకారం ‘కృత యుగాది’ దినం. యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి 17,28,000 మానవ సంవత్సరాలు. అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం- ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది. తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం- ఈనాడు చండీపూజ చేయాలని ఉంది. ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం. మొత్తానికి మన పంచాంగ కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృత యుగాదిగానే ఆచరించాలి.

కార్తీక శుద్ధ దశమి, నవంబరు 7, గురువారం
కార్తీక శుద్ధ దశమి నాడు కొన్ని వ్రతాలు ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని ఉంది.

కార్తీక శుద్ధ ఏకాదశి, నవంబరు 8, శుక్రవారం
విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి కార్తీక శుద్ధ ఏకాదశి. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశిల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి. భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి దినం కూడా ఈనాడే.

కార్తీక శుద్ధ ద్వాదశి, నవంబరు 9, శనివారం
కార్తీక శుద్ధ ద్వాదశి అనేక వ్రతాలకు ఆరంభ, ముగింపు దినం. ఈ తిథి నాడు మిక్కిలి వ్రతాలను ఆచరించాలనే నియమం ఉండటాన్ని బట్టి ఇది విశిష్టమైన దినంగా భావించాలి. కాగా, కార్తీక శుద్ధ ద్వాదశి తిథి చిలుక ద్వాదశిగా ప్రసిద్ధి. తులసీ వ్రతాన్ని ఈనాటి నుంచే ఆరంభించాలి. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని (చిలకడం), అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిల్కు ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటారు. కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వ్రతాలు ఆచరించే సంప్రదాయం వివిధ ప్రాంతాలలో ఉంది. ఈ వ్రతాల నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. కాగా, ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది.

కార్తీక శుద్ధ త్రయోదశి, నవంబరు 10, ఆదివారం
కార్తీక శుక్ల త్రయోదశి శని త్రయోదశి తిథి. శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైన తిథి ఇది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

కార్తీక శుద్ధ చతుర్దశి, నవంబరు 11, సోమవారం
కార్తీక శుక్ల చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం. కార్తీక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడని అంటారు. విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని ఆయా వ్రత గ్రంథాలలో, పురాణాలలో ఉంది. కాబట్టి ఇది శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన పర్వదినం. అలాగే ముస్లింలు పవిత్రంగా భావించే మిలాద్‍-ఉన్‍-నబి దినం కూడా ఈనాడే.

కార్తీక శుద్ధ పౌర్ణమి, నవంబరు 12, మంగళవారం
కార్తీక పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ము కుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.

కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగింది.

గురునానక్‍ జయంతి దినం కూడా ఈనాడే. అలాగే, తెలుగు వారి ఆరాధ్య దైవం పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి పుణ్యతిథి కూడా ఈనాడే.
కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశలుగా వెలుగొందుతుంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిది. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 720 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్‍ హిందూ హాలీడేస్‍ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.

కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి ఆ మూడు గుంజలకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం.

పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ.

ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.

కార్తీక బహుళ పాడ్యమి, నవంబరు 13, బుధవారం
కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం మహా ఫలప్రదం. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది.

కార్తీక బహుళ విదియ, నవంబరు 14, గురువారం
భారతదేశమంతటా దేవుళ్లకు ప్రతిరూపాలైన చిన్నారులు అత్యంత సంతోషంగా జరుపుకునే బాలల దినోత్సవం ఈనాడే. పిల్లలకు అత్యంత ఇష్టుడైన భారత ప్రథమ ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ జయంతి దినం నాడే బాలల దినోత్సవం నిర్వహిస్తారు.
ఇక, సంప్రదాయాల విషయానికి వస్తే- చతుర్వర్గ చింతామణిలో ఈనాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది. ఇది దేవి (అమ్మవారు)కి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది. కార్తీక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

కార్తీక బహుళ చతుర్థి, నవంబరు 16, శనివారం
కార్తీక బహుళ చవితి స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి. ఇది పన్నెండు సంవత్సరాలు, లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం. స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఈ తిథిని దశరథ చతుర్థిగానూ వ్యవహ రిస్తారు.
బ్రహ్మపుత్రా నది పుష్కర మహోత్సవాలు ఈనాటితో ముగుస్తాయి.

కార్తీక బహుళ సప్తమి, నవంబరు 19, మంగళవారం
మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్ర మైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న తొలినాటి వీర వనిత ఝూన్సీ లక్ష్మీబాయి జయంతి ఈనాడే.
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కూడా ఈనాడే.

కార్తీక బహుళ అష్టమి, నవంబరు 20, బుధవారం
కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి.

కార్తీక బహుళ ఏకాదశి, నవంబరు 22, శుక్రవారం

కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు.

కార్తీక బహుళ ద్వాదశి, నవంబరు 23, శనివారం
ఈనాడు యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.
కాగా, ప్రసిద్ధిపొందిన తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్స వాలు ఈనాటి నుంచే ఆరంభమవుతాయి.

కార్తీక బహుళ త్రయోదశి, నవంబరు 24, ఆదివారం
కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు. కాగా, ఈనాడు ధన్వంతరి జయంతి దినం కూడా.

కార్తీక బహుళ చతుర్దశి, నవంబరు 25, సోమవారం
ఈ తిథి భౌమవారంతో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు. అటువంటి చిత్రా చతుర్దశి నాడు శివుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలంతో స్నానం చేయాలి. చంద్రాస్తమయ వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి.

కార్తీక బహుళ అమావాస్య, నవంబరు 26, మంగళవారం
కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన దినంగా కొందరు కొన్నిచోట్ల భావిస్తారు. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా జరుపుకుంటారు. కానీ, కాల గణన ప్రకారం మహా భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య. కార్తీక మాసం, రేవతీ నక్షత్రం నాడు కృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లాడు. కర్ణుడితో కృష్ణుడు మాట్లాడుతూ జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని అంటాడు. ఆ సమయంలో అర్జునుడికి జరిగిన గీతా బోధే భగవద్గీత జయంతి దినం. కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. అది కార్తీక బహుళ అమావాస్య నాటి ఉదయం జరిగింది.

Review దేదీప్య మాసం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top