దేదీప్యం..కార్తీకదీపం

2022- నవంబరు 1, మంగళవారం, కార్తీక శుద్ధ అష్టమి నుంచి
2022- నవంబరు 30, బుధవారం, మార్గశిర శుద్ధ సప్తమి వరకు..

నవంబరు మాసం కార్తీక – మార్గశిర మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది పదకొండవ నెల.
తెలుగు పంచాంగం ప్రకారం చైత్రాది మాస పరిగణనలో కార్తీక మాసం ఎనిమిదవది.
ఈ మాసంలోని నవంబరు 23వ తేదీ వరకు కార్తీక మాస తిథులు. తదుపరి నవంబరు 24 నుంచి మార్గశిర మాసం ఆరంభమవుతుంది.
కార్తీక దీప సొబగులతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది.
తిరుమల శ్రీవారి పుష్ప యాగ మహోత్సవం, శివ-కేశవుల పూజలు, సుబ్రహ్మణ్య షష్ఠి, క్షీరాబ్ది ద్వాదశి వంటివి ఈ మాసం ప్రత్యేకం..

శ్రీశుభకృతు నామ సంవత్సరం-కార్తీకం-మార్గశిరం-శరదృతువు- దక్షిణాయణం

ఆశ్వయుజం ముగియడంతోనే వానలకు తెరపడుతుంది. కార్తీక మాసం ప్రవేశిస్తూనే శీతల గాలులు పలకరిస్తాయి.
శీతాకాలానికి ఇది ఆరంభ మాసం. ఈ కాలంలో చలి వణికిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యం తడి-పొడి వాతావరణంతో అంతా నజ్జు నజ్జుగా ఉంటుంది.
అందుకే ఈ మాసం పొడవునా మనం ఆచరించాల్సిన పద్ధతులకు సంబంధించి మన పెద్దలు వివిధ వ్రతాలు, పూజా నియమాలను ఏర్పరిచారు.
ఇవన్నీ ఆరోగ్యదాయకమైనవి. వణికించే చలిలో ఇక్కలాక్కుపోయే శరీరానికి ఉత్తేజాన్ని, వేడిని కలిగించే విధంగా ఆయా వ్రత నియమాలు విధించారు.
వాటిని ఆచరించడం ద్వారా, ఆ వ్రత, పూజా విధుల్లో భాగంగా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించి.. తిరిగి వాటిని మహా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది.
కార్తీక మాసాన్నే కౌముదీ మాసం అనీ అంటారు. కౌముది అంటే వెన్నెల. పిండారబోసినట్టు ఈ నెలంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి.
భువిలో జ్యోతులుగా వెలిగే దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను చేకూరుస్తాయి.
ఒకపక్క ఇల కార్తీక దీపాలు.. మరోపక్క అల ఆకాశంలో వెన్నెల కాంతులు.. ప్రకృతి శోభాయమానాన్ని వర్ణించడానికి ఇంతకంటే అందమైన దృశ్యం మరేదైనా ఉంటుందా?.
కార్తీక స్నానాలు ఈ మాసపు ప్రధాన విధాయకృత్యం. తెల్లవారుజామునే సముద్ర, నదీ స్నానాలు ఆచరించాలి.
ఇలా చేయడం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు ఒంటికి బాగా పడతాయని, తద్వారా శీతాకాలానికి అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలు మారతాయని అంటారు.
కార్తీకం శివారాధన మాసం. మాధవుడికీ ప్రీతికరమైన నెల ఇది. పూర్తిగా ఈ నెలంతా శివ, వైష్ణవారాధనకు అనువైనది.
కార్తీక మాసం పొడవునా వ్రతాలే. ఆధ్యాత్మికంగానే కాక.. ఆరోగ్యపరంగానూ ఇవెంతో మేలు చేస్తాయి. ఒక కాయ, ఒక మొక్క కార్తీక మాసంలో విశేషంగా పూజలందుకుంటాయి.
అవే- ఉసిరి, తులసి. తులసిని ఈ మాసమంతా ఉదయాన్నే పూజించడంతో పాటు ఉసిరిని ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని అంటారు.
ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండ పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు.
తెలుగు మాసం ప్రకారం కార్తీక మాసం సంవత్సరంలో ఎనిమిదివ మాసం. మత్స్య పురాణంలో కార్తీక మాస విశేషాల గురించి విపులంగా వివరించారు.
ఈ పురాణ కథనం ప్రకారం ఈ నెలలో ఇంటి నిర్మాణం శుభకరం. ఈ మాసంలో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ఇంకా ఈ మాసం విశేషాల్లోకి వెళ్తే..•

కార్తీక శుద్ధ అష్టమి
నవంబరు 1, మంగళవారం

నవంబరు మాసం ఆరంభ తిథి ఇది. కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయాలని, ఇది మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే, ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు.
కాగా, నవంబరు 1.. ఆంధప్రదేశ్‍ అవతరణ దినోత్సవం. ఇంకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగ మహోత్సవం కూడా ఈనాడే.

కార్తీక శుద్ధ నవమి
నవంబరు 2, బుధవారం

కార్తీక శుద్ధ నవమి.. మన పంచాంగాల ప్రకారం ‘కృత యుగాది’ దినం.
యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల మానవ సంవత్సరాలు.
అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం.
ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం- ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది.
తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం- ఈనాడు చండీపూజ చేయాలని ఉంది.
ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం.
మొత్తానికి మన పంచాంగ కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృత యుగాదిగానే ఆచరించాలి.
తెలుగు క్యాలెండర్లలో కార్తీక శుద్ధ నవమిని అక్షయ నవమిగా పేర్కొన్నారు.

కార్తీక శుద్ధ దశమి
నవంబరు 3, గురువారం

కార్తీక శుద్ధ దశమి నాడు కొన్ని వ్రతాలు ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో నిర్దేశించారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని ఉంది.

కార్తీక శుద్ధ ఏకాదశి
నవంబరు 4, శుక్రవారం

కార్తీక శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి, దేవుత్తన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశిగానూ పిలుస్తారు.
ఇది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన తిథి. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది.
మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు.
అంటే, ఆనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు.
అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు.. అంటే ఈనాడు నిద్ర లేస్తాడు.
అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని కూడా అంటారు.
ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి.
మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు.
ఇంకా స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి.

కార్తీక శుద్ధ ద్వాదశి
నవంబరు 5, శనివారం

కార్తీక శుద్ధ ద్వాదశి అనేక వ్రతాలకు ఆరంభ, ముగింపు దినం. ఈ తిథి నాడు అనేక వ్రతాలను ఆచరించాలనే నియమం ఉండటాన్ని బట్టి ఇది విశిష్టమైన దినంగా భావించాలి.
కాగా, కార్తీక శుద్ధ ద్వాదశి తిథి చిల్కు ద్వాదశిగా ప్రసిద్ధి. తులసీ వ్రతాన్ని ఈనాటి నుంచే ఆరంభించాలి. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు.
క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని (చిలకడం), అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు.
దీనినే మన తెలుగు నాట ‘చిల్కు (చిలుకు) ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు.
అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కా•ట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు.
కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటాడు.
కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. ఈ కారణంగానే ఈనాడు ఆచరించే పూజను తులసీ వ్రతం అంటారు.
అలాగే తులసీ కల్యాణం నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు.
ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వ్రతాలు ఆచరించే సంప్రదాయం వివిధ ప్రాంతాలలో ఉంది.
ఈ వ్రతాల నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. కాగా, ఈనాటితో చాతుర్మాస వ్రతం పరిసమాప్తి అవుతుంది. ఈనాడు ప్రదోష వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.

కార్తీక శుద్ధ త్రయోదశి
నవంబరు 6, ఆదివారం

కార్తీక శుద్ధ త్రయోదశి శని త్రయోదశి తిథి. శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైన తిథి ఇది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు.
శనిదేవుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

కార్తీక శుద్ధ చతుర్దశి
నవంబరు 7, సోమవారం

కార్తీక శుద్ధ చతుర్దశి వైకుంఠ చతుర్దశిగా ప్రసిద్ధి. శివ కేశవుల మధ్య భేదం లేదని చాటడానికి ఈ తిథి ఒక నిదర్శనం.
కార్తీక మాసం సహజంగానే శివకేశవులకు ఇష్టమైన మాసం. ఈనాడు విష్ణుమూర్తి శంకరుడిని పూజించాడని అంటారు.
విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈనాడు పూజించాడని ఆయా వ్రత గ్రంథాలలో, పురాణాలలో ఉంది.
కాబట్టి ఇది శైవులకు, వైష్ణవులకు కూడా పవిత్రమైన పర్వదినం.

కార్తీక శుద్ధ పౌర్ణమి
నవంబరు 8, మంగళవారం

కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు.
కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.
కార్తీక శుద్ధ పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగింది.
కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశలు వెలుగొందుతుంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 720 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్‍ హిందూ హాలీడేస్‍ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంతో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుడిని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.
కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డిని ఆ మూడింటి చుట్టూ దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం.
పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిందని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ.
ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
గురునానక్‍ జయంతి దినం కూడా ఈనాడే. అలాగే, తెలుగు వారి ఆరాధ్య దైవం పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి పుణ్యతిథి కూడా ఈనాడే.

కార్తీక బహుళ పాడ్యమి
నవంబరు 9, బుధవారం

ఈనాటి నుంచి కార్తీక మాస బహుళ (కృష్ణ) పక్ష తిథులు ఆరంభమవుతాయి. కార్తీక బహుళ పాడ్యమి నాడు అన్నదానం మహా ఫలప్రదం.
అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని ఒక నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది.

కార్తీక బహుళ విదియ
నవంబరు 10, గురువారం

చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్న ప్రకారం కార్తీక బహుళ విదియ నాడు భద్ర వ్రతం ఆచరించాలని ఉంది.
ఇది దేవి (అమ్మవారు)కి సంబంధించిన వ్రతంగా తెలియవస్తుంది. ఇదే తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలని కూడా అంటారు.
దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

కార్తీక బహుళ చతుర్ధి
నవంబరు 12, శనివారం

కార్తీక బహుళ చతుర్ధి (చవితి) స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాలను అందిస్తోంది. వాటిలో కరక చతుర్థి వ్రతం ఒకటి.
ఇది పన్నెండు సంవత్సరాలు, లేదా పదహారు సంవత్సరాలు లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం.
స్త్రీలకు ఉద్ధిష్టమైన వ్రతమిది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి.
గణపతికి పది రకాల పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి.
ఈ తిథిని దశరథ చతుర్థిగానూ వ్యవహరిస్తారు. అలాగే, సంకష్ట హర గణపతిని విశేషంగా పూజిస్తారు.

కార్తీక బహుళ షష్ఠి
నవంబరు 14, సోమవారం

కార్తీక బహుళ షష్ఠి నాడు ప్రత్యేకించి ఆచరించాల్సిన పూజలు, వ్రతాల గురించి వ్రత గ్రంథాలలోనూ, పంచాంగాలలోనూ విశేషంగా ఏమీ ప్రస్తావించలేదు.
కాగా, నవంబరు 14 మన భారత తొలి ప్రధాని జవహర్‍లాల్‍ నెహ్రూ జయంతి దినం. ఆయనకు పిల్లలంటే ఎంతో ఇష్టం. చిన్నారులు ఆయనను ‘చాచా నెహ్రూ’గా పిలుచుకుంటారు.
అందుకే నవంబరు 14న ఏటా చిన్నారుల దినోత్సవం నిర్వహిస్తారు.

కార్తీక బహుళ సప్తమి
నవంబరు 15, మంగళవారం

మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి.
కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో వివరంగా రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది.
ఈ వ్రతాచరణ ప్రకారం- సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.

కార్తీక బహుళ అష్టమి
నవంబరు 16, బుధవారం

కార్తీక బహుళ అష్టమి వృశ్చిక సంక్రమణ దినం. ఈనాడు కాలాష్టమి వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రధానంగా ఈ తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి.
సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు.
ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా భావిస్తారు. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం.
అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి.
ఈ తిథి కాలం నవంబరు 16, 17 తేదీలలో కూడా కొనసాగుతుంది.

కార్తీక బహుళ నవమి
నవంబరు 18, శుక్రవారం

కార్తీక బహుళ నవమి నాడు తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్లకు లక్ష కుంకుమార్చన పూజ వైభవోపేతంగా జరుగుతుంది. ఈనాడే ఆమె బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు.

కార్తీక బహుళ దశమి
నవంబరు 19, శనివారం

కార్తీక బహుళ దశమి నాడు తిరుచానూరు శ్రీ పద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవం ప్రారంభమవుతంది. అలాగే, భారత స్వాతంత్య్ర సమరాంగణంలో తొలినాటి వీర వనిత ఝూన్సీ లక్ష్మీభాయి జయంతి దినం కూడా ఈనాడే. ఈమెనే మణికర్ణిక అనే పేరుతోనూ పిలుస్తారు.
ఇంకా భారత తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ జయంతి దినం కూడా నవంబరు 19 నాడే. భారతదేశానికి వరుసగా మూడుసార్లు ఆమె ప్రధానమంత్రిగా పనిచేశారు.

కార్తీక బహుళ ఏకాదశి
నవంబరు 20, ఆదివారం

కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె- ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు.
కాగా, కార్తీక బహుళ ఏకాదశి నాటి నుంచే ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కార్తీక బహుళ దశమి నాడు పంచగవ్య భక్షనం చేసి కార్తీక బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు.
ఈనాటి నుంచే అనురాధ కార్తె ప్రారంభం అవుతుంది.

కార్తీక బహుళ ద్వాదశి
నవంబరు 21, సోమవారం

కార్తీక బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ఇంకా ఈనాడు యోగీశ్వర ద్వాదశి తిథి అని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అందుకే దీనిని గోవత్స ద్వాదశిగానూ పిలుస్తారు. దూడతో కూడిన ఆవును పూజించాలని వ్రత నియమం.

కార్తీక బహుళ త్రయోదశి
నవంబరు 22, మంగళవారం

కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని నియమం. యమునా నదిలో స్నానం చేసి యమునికి తర్పణం విడిస్తే విశేష ఫలాన్నిస్తుందని అంటారు.
అలాగే, ఈనాడు (నవంబరు 22) జగత్ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడు, కర్ణాటక సంగీత గాయకుడు, వాగ్గేయకారుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి వర్ధంతి దినం.
ఆయన ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. భక్తప్రహ్లాద అనే తెలుగు సినిమాలో ఆయన నారదునిగా నటించారు.
ఆంధప్రదేశ్‍లోని ప్రస్తుత కోనసీమ జిల్లా శంకరగుప్తంలో 1930, జూలై 6న జన్మించిన ఆయన 2016, నవంబర్‍ 22న చెన్నైలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు.

కార్తీక బహుళ చతుర్దశి
నవంబరు 23, బుధవారం

కార్తీక బహుళ చతుర్దశి తిథి సాధారణంగా భౌమవారం (బుధవారం)తో కూడి వస్తే కనుక ఆనాడు చిత్రా చతుర్దశి అంటారు.
అది ఈనాడే. అటువంటి చిత్రా చతుర్దశి నాడు శివుడిని పూజించాలి. చంద్రోదయ సమయంలో తిల తైలంతో స్నానం చేయాలి.
చంద్రాస్తమయ వేళ ఉల్కాదానం చేయాలి. సాయంకాలం వేళ దీపదానం చేయాలి.
ఇది అమావాస్య దినం. కార్తీక మాసంలో ఇది చివరి తిథి.
ఇంకా, ఈనాడు పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి దినం కూడా.
ఇది అమావాస్య దినం. కార్తీక బహుళ అమావాస్యను భగవద్గీత పుట్టిన దినంగాకొందరు కొన్నిచోట్ల భావిస్తారు.
ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతిగా జరుపుకుంటారు.
కానీ, కాల గణన ప్రకారం మహా భారత యుద్ధ ప్రారంభ దినం కార్తీక బహుళ అమావాస్య. కార్తీక మాసం, రేవతీ నక్షత్రం నాడు కృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వెళ్లాడు.
కర్ణుడితో కృష్ణుడు మాట్లాడుతూ జ్యేష్ఠా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని అంటాడు. ఆ సమయంలో అర్జునుడికి జరిగిన గీతా బోధే భగవద్గీత జయంతి దినం.
కృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమే భగవద్గీత. అది కార్తీక బహుళ అమావాస్య నాటి ఉదయం జరిగింది.

మార్గశిర శుద్ధ పాడ్యమి
నవంబరు 24, గురువారం

మార్గశిర మాసం ఈనాటి నుంచి ఆరంభం. తొలి తిథి మార్గశిర శుద్ధ పాడ్యమి. ఈనాడు తిరుచానూరు శ్రీపద్మావతి తాయారు అమ్మవారి గజవాహనోత్సవం నిర్వహిస్తారు.
ఇక, ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన తుల్య ఫలం కలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

మార్గశిర శుద్ధ తదియ
నవంబరు 26, శనివారం

మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ మున్నగు వ్రతాలను ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
ఈనాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

మార్గశిర శుద్ధ చతుర్థి
నవంబరు 27, ఆదివారం

మార్గశిర శుద్ధ చతుర్థి నాడు పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరం గల వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు ఢుంఢి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది.

మార్గశిర శుద్ధ పంచమి
నవంబరు 28, సోమవారం

మార్గశిర శుద్ధ పంచమి నాగపంచమిగా దక్షిణాది ప్రాంతంలో ప్రసిద్ధమై ఉంది. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.
అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.

మార్గశిర శుద్ధ షష్ఠి
నవంబరు 29, మంగళవారం

మార్గశిర శుద్ధ షష్ఠిని మన పంచాంగకర్తలు సుబ్రహ్మణ్య షష్ఠి అని పేర్కొంటారు. ఆంధ్ర జన సామాన్యంలో ఇది సుబ్బారాయుడి షష్ఠి అనే వ్యావహరికంలో ఉంది. తమిళులు దీనిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి.
సుబ్రహ్మణ్యషష్ఠికే కాక ఈనాడు చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలు కూడా ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
ఇక, సుబ్బారాయుడి షష్ఠి విశేషాల్లోకి వెళ్తే.. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగింది.
తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారమై ఉంది. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని వారి నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు పడతాయి. కానీ వర్షించవు. కావునే వానలు కురవని మబ్బులకు షష్ఠి మబ్బులని పేరు.

మార్గశిర శుద్ధ సప్తమి
నవంబరు 30, బుధవారం

మార్గశిర శుద్ధ సప్తమి నాడు సూర్య పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది.
నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు.
హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.

Review దేదీప్యం..కార్తీకదీపం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top