సూర్యారాధన.. సరస్వతీ పూజ

సూర్యారాధన.. సరస్వతీ పూజ

ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి మాసం సంవత్సరంలో రెండో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పుష్య – మాఘ మాసాల కలయిక. పుష్య మాసంలోని కొన్ని రోజులు, మాఘ మాసంలోని మరికొన్ని రోజుల ఈ నెలలో కలుస్తాయి. ఫిబ్రవరి 1, పుష్య బహుళ షష్ఠి నుంచి నుంచి ఫిబ్రవరి 9 పుష్య బహుళ చతుర్దశి వరకు పుష్య మాస తిథులు, ఆపై ఫిబ్రవరి 10 మాఘ శుద్ధ పాడ్యమి నుంచి ఫిబ్రవరి 29 మాఘ బహుళ పంచమి వరకు మాఘ మాస తిథులు కొనసాగుతాయి. పుష్య మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో రథ సప్తమి ప్రధాన పర్వం. ఇది సూర్యారాధనకు సంబంధించిన పండుగ. ఇంకా భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, భీష్మ ద్వాదశి, వసంత పంచమి వంటివి పుష్య మాస ప్రధాన పర్వాలు, పండుగలు.

2024- ఫిబ్రవరి 1, గురువారం, పుష్య బహుళ షష్టి నుంచి
2024- ఫిబ్రవరి 29, గురువారం, మాఘ బహుళ పంచమి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం- పుష్యం- మాఘ మాసం-శిశిర రుతువు-ఉత్తరాయణం

పుష్య – మాఘ మాసాల కలయిక
ఫిబ్రవరి మాసం.

‘మఖ’ నక్షత్రంతో కూడిన పూర్ణిమ ఈ మాసంలో రావడం వల్ల ఇది మాఘ మాసమైంది.
ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి.
మాఘ మాసానికి వచ్చే సరికి చలి అంతగా ఉండదు. వానలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వాతావరణపరంగా కూడా మాఘ మాసం అమోఘమైనదని పెద్దలు చెబుతారు.
ఇది కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకూ, భగవచ్ఛింతనకూ నెలవైన మాసం.
ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో వచ్చే నాలుగు పూర్ణిమలు మహిమాన్వితమైనవి.
వాటిలో మాఘ పూర్ణిమ మరీ ఉద్ధిష్టమైనది. సాధారణంగా పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేయాలనేది నియమం.
ఈ నాలుగు పూర్ణిమ దినాల్లో చేసే సముద్ర స్నానాలు ఇంకా ఫలాన్నిస్తాయి. సముద్ర స్నానం వల్ల పాపాలు నశించిపోవడమే కాదు ఆరోగ్యం కూడా బాగుపడుతుందని అంటారు.
సముద్రపు నీటిలో లవణ శాతం ఎక్కువగా ఉంటుంది.
ఆ ఉప్పునీటిలో శరీరం మునగడం వల్ల ఆ ఉప్పదనం రోమకూపాల ద్వారా శరీరంలోకి ప్రవేశించి, శరీరంలోని మాలిన్యాలను, వ్యర్థాలను తొలగిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. అలాగే పూర్ణిమ నాడు చేసే సముద్ర స్నానాలు పవిత్రం కావడానికి ఇంకో కారణం కూడా ఉంది. చంద్రుడిలోని పదహారు కళల శక్తీ సముద్రంలో ఉండేది పూర్ణిమ నాడే. కాబట్టి ఆనాడు చేసే సముద్ర, నదీ స్నానాలు ఫలితాన్నిస్తాయి. మాఘంలో చేసే స్నానాలన్నిటికీ సూర్యుడే అధిపతి.
మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుడి అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం.

మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు (ఫిబ్రవరి 11, 18, 25, మార్చి 3, 10 తేదీలు, 2024) విశేషమైనవి.
ఈ కాలంలో ఉదయ స్నానం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి.
అరుణోదయాన దీపారాధన, తిలహోమ తిలదానం, తిలభక్షణం మాఘ స్నానాల సందర్భంగా ఆచరించాల్సిన ముఖ్య విధులు.
శివుడు,. సూర్యనారాయణుడులను మాఘ మాసంలో పూజించడం అమితమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
మన పురాణాలలో మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేదీ మాఘమని వేదాలు చెబుతున్నాయి. అందువల్లనే మాఘ మాసాన్ని వేద మాసమని కూడా అంటారు.

యజ్ఞ యాగాదులకూ శ్రేష్ఠమైనది మాఘం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అనీ అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది.

మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనద్యాగమం అని మత్స్య పురాణంలో ఉంది.

పుష్య బహుళ షష్ఠి
ఫిబ్రవరి 1, గురువారం

ఈ తిథి కుమారస్వామి పూజకు ఉద్ధిష్టమైనది. మనం సుబ్రహ్మణ్యేశ్వరుడిగా కొలిచే ఈ దైవాన్ని తమిళనాడులో కార్తికేయుడిగా ఆరాధిస్తారు. వారికి కుమారస్వామే ప్రధాన దైవం. ప్రతి షష్ఠి నాడు కుమారస్వామిని యథోరీతిన పూజించడం ఆనవాయితీగా వస్తోంది.

పుష్య బహుళ సప్తమి
ఫిబ్రవరి 2, శుక్రవారం

సాధారణంగా ప్రతి నెలలోని సప్తమి తిథి సూర్యారాధనకు సంబంధించినదై ఉంటుంది. పుష్య మాసం పూర్తిగా సూర్యుడికి సంబంధించినదే. కాబట్టి ఈ సప్తమి తిథి నాడు సూర్యుడిని పూజించాలి. ఇక, హిందూ తిథులను అనుసరించి స్వామీ వివేకానంద జయంతి పుష్య బహుళ సప్తమి నాడేనని అంటారు. కానీ, ఏటా జనవరి 12న ఆయన జయంతి పేరిట జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తున్నారు.

పుష్య బహుళ అష్టమి
ఫిబ్రవరి 3, శనివారం

అష్టమి తిథి కాలభైరవుని పూజకు, శక్తి ఆరాధనకు విశేషమైనది. పుష్య బహుళ అష్టమి కాలాష్టమి దినమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. పుష్య మాసం పితృ దేవతల పూజకు ఉద్ధిష్టమైనది. కాబట్టి ఈనాడు పితృ దేవతల ప్రీత్యర్థం కార్యాలు తలపెట్టాలని అంటారు.

పుష్య బహుళ నవమి
ఫిబ్రవరి 4, ఆదివారం

నవమి తిథి దుర్గారాధనకు ఉద్దేశించినది. పుష్య బహుళ నవమి నాడు అన్వష్టకా శ్రాద్ధమ్‍ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఏటా ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ క్యాన్సర్‍ దినోత్సవంగా పరిగణిస్తారు.

పుష్య బహుళ దశమి
ఫిబ్రవరి 5, సోమవారం

పుష్య బహుళ దశిమిని వివిధ వ్రత గ్రంథాలు శాంబరీ దశమి అని పేర్కొంటున్నాయి. ద్వార ధర్మ దేవతలకు పిండి మొదలైన వాటితో పూజ చేయడం ఉత్కళ దేశంలో ఆచారంలో ఉందని తెలుస్తోంది. ద్వార పూజ అంటే గడప పూజ. మన తెలుగు నాట కూడా చాలా ప్రాంతాల్లో గడప పూజకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అయితే, దానిని ఈ తిథి నాడే కచ్చితంగా జరుపుతారనేందుకు ఆధారాలు లేవు.

పుష్య బహుళ ఏకాదశి
ఫిబ్రవరి 6, మంగళవారం

ఆమాదేర్‍ జ్యోతిషి అనే గ్రంథంలో పేర్కొన్న ప్రకారం- పుష్య బహుళ ఏకాదశి షట్తిలైకాదశిగా ప్రసిద్ధి. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం ప్రకారం ఈనాడు- తిలదాహీ వ్రతం ఆచరిస్తారని ఉంది. షట్తిలైకాదశి అంటే, తిలల (నువ్వులు)ను ఆరు విధాలుగా ఉపయోగించే ఏకాదశి అని అర్థం. ఈ ఆరు విధాలుగా ఈనాడు నువ్వులను ఉపయోగించాలి- స్నానం చేసే నీటిలో నువ్వులను వేయడం, నువ్వులు నూరిన ముద్దను శరీరమంతా రాసుకోవడం, ఆరు నువ్వు గింజలను తినడం, తాగే నీటిలో కొద్దిగా నువ్వులను వేసుకోవడం, గురువులకు తిలలు దానం చేయడం, తిలతర్పణం విడవటం..దేవతలకు నువ్వులు సమర్పించడం.
ఈ ఆరు విధులను పుష్య బహుళ ఏకాదశి నాడు ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
ఈ ఏకాదశినే మతత్రయ ఏకాదశి పర్వమని కూడా అంటారు.

పుష్య బహుళ ద్వాదశి
ఫిబ్రవరి 7, బుధవారం

పుష్య బహుళ ద్వాదశిని సంప్రాప్తి ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ తిథి నాడు మహా ఫల ద్వాదశి, సురూప ద్వాదశి వంటి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. కాగా, ఈ ద్వాదశి నాడే వైష్ణవులు షట్తిల ఏకాదశిని ఆచరించే సంప్రదాయం ఉంది. కాబట్టి వారు ఈనాడు వైష్ణవ షట్తిల ఏకాదశిగా వ్యవహరిస్తారు. పుష్య బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలి.

పుష్య బహుళ త్రయోదశి
ఫిబ్రవరి 8, గురువారం

పుష్య బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వం.

పుష్య బహుళ చతుర్దశి
ఫిబ్రవరి 9, శుక్రవారం

పుష్య బహుళ చతుర్దశి అమావాస్య తిథి. ఈనాడు యమతర్పణ పూజలు ఆచరించాలని నీలమత పురాణం అనే గ్రంథంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కాళీ పూజ చేస్తారు. అలాగే, విద్యాధీశ తీర్థానాం పుణ్యదినమని కూడా అంటారు. సాధారణంగా చతుర్దశి తిథి నాడే మాస శివరాత్రి పర్వదినమని అంటారు.
ఇక, పుష్య బహుళ అమావాస్య తిథి గోదావరి జిల్లాల్లో మరో విధంగా ప్రసిద్ధమై ఉంది.
పుష్య బహుళ అమావాస్య తిథి నాడు సముద్ర స్నానం చేస్తే సమస్త దోషాలూ తొలగిపోతాయని అంటారు. సముద్రంలో కలిసే ఏదైనా జీవనదిలో ఈనాడు స్నానం చేసి పితృ తర్పణం విడిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరముల వారు నరకలోక యాతనల నుంచి బయటపడి స్వర్గలోకానికి వెళ్తారని పురాణ వచనం. గధాదర పద్ధతి అనే గ్రంథంలో ఈ తిథిని బకులామావాస్యగా పేర్కొన్నారు. ఇక, తిథి తత్త్వం అనే గ్రంథం దీన్ని ‘అర్థోదయామావాస్య’గా పేర్కొంది. మన తెలుగు వారు మాత్రం ఈ అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్యగా వ్యవహరిస్తారు.
గౌతముడు, తుల్యుడు, ఆత్రేయుడు, భరద్వాజుడు, కౌశికుడు, జమదగ్ని, వశిష్ఠుడు అనే ఏడుగురు రుషుల పేరుతో ఏడు గోదావరి శాఖలు సప్త గోదావరి శాఖలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ ఏడు ప్రదేశాలకు వెళ్లి స్నానం చేసి రావడాన్నే ఆంధప్రదేశ్‍లోని ఉభయ గోదావరి జిల్లాల్లో సప్తసాగరయాత్ర అంటారు. ఈ యాత్ర చొల్లంగి స్నానంతో అనగా, పుష్య బహుళ అమావాస్య నాడు ఆరంభమవుతుంది. ఏడు తావులు చూసుకుని ప్రాయకంగా మాఘశుద్ధ ఏకాదశి నాటికి వశిష్ఠా సాగర సంగమస్థానమైన అంతర్వేది చేరతారు. ఆనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. ఆ ఏకాదశికి అంతర్వేది ఏకాదశి అని పేరు. సప్త సాగరయాత్రకు ఇలా ప్రారంభ, ముగింపు దినాలు పర్వదినాలయ్యాయి.
ఇక, చొల్లంగి అమావాస్య అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. చొల్లంగి అనేది ఊరి పేరు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో ఈ గ్రామం ఉంది. ఇది సముద్రతీర గ్రామం. గోదావరి ఏడుపాయల్లో ఒకటైన తుల్యభాగ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సముద్రంలో కలిసే చోటు కాబట్టి ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ ఏకకాలంలో స్నానం చేసిన ఫలం కలుగుతుంది. చొల్లంగిలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
పుష్య బహుళ అమావాస్య.. మహోదయ కాలం. ఈ పుణ్య కాలంలో అన్ని నదుల జలాలు గంగానది జలంతో సమానమైన పవిత్రతను సంతరించుకుంటాయని అంటారు.
ఇక, భక్త పురందరదాసు ఆరాధనోత్సవాలు కూడా ఈనాడే నిర్వహిస్తారు.

మాఘ శుద్ధ పాడ్యమి
ఫిబ్రవరి 10, శనివారం

మాఘ శుద్ధ పాడ్యమి తిథి నాటి నుంచి మాఘ మాసం ఆరంభమవుతుంది. ఇది మాసపు ఆరంభ తిథి. ఈనాటి నుంచే ఆంధప్రదేశ్‍లో దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

మాఘ శుద్ధ విదియ
ఫిబ్రవరి 11, ఆదివారం

మాఘ శుద్ధ విదియ నాడు చంద్ర దర్శనం. ఈ తిథి త్యాగరాజ స్వామి ఆరాధన తిథిగానూ ప్రసిద్ధి. ప్రసిద్ధ ఆలయాల్లో ఈనాడు త్యాగరాజ కృతులను ఆలపించడం ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి.
ఇక, మాఘ మాసంలో వచ్చే తొలి ఆదివారం ఇది. మాఘమాసపు ఆదివారాలు చాలా మహిమాన్వితమైనవి. మాఘ మాసంలో వచ్చే ఆదివారాల్లో (ఫిబ్రవరి 11, 18, 25, మార్చి 3, 10 తేదీలు, 2024) విధిగా సముద్ర స్నానాలు చేయాలి.
మాఘ మాసం నుంచీ శిశిర రుతువు ప్రారంభమవుతుంది. ఈ కాలంలో వీచే శీతల గాలుల ప్రభావంతో శరీరం ఇక్కలాక్కుని పోతుంది. అంటే శరీరంలో ఉండే ఊబ తగ్గిపోతుంది.
వాన బాధ అంతగా ఉండదు. చలి కూడా తగ్గుతుంది. వస్త్ర సమస్య, గృహ సమస్య ఇబ్బందిని కలిగించేవిగా ఉండవు. మాఘ మాసంలో ధాన్యలక్ష్మి ఆరు బయల విరివిగా మసులుతుందని అంటారు. శాకలక్ష్మి విషయంలో సమృద్ధి సంతృప్తికరం. అటువంటి అనుకూలమైన మాస పంచకానికి తొలి మాసం మాఘం. అటువంటి మాఘ మాసంలోని ఆదివారాలు మరింత మహత్తు కలిగినవి. ఈ రోజుల్లో సూర్యపూజ చేసిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. ప్రాత: స్నానం అతి ముఖ్యం. సూర్యుడు మకరరాశి గతుడు ఎప్పుడు అవుతాడో అప్పటి నుంచి ప్రాత: స్నానం తప్పక చేయాలి. మాఘ మాసంలో నదులలో కానీ, చెరువుల్లోకానీ, మడుగుల్లోకానీ, కొలనులో కానీ, బావిలో కానీ తుదకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం అబ్బుతుంది.
అశక్తత చేత ఈ కాలంలో స్నానం చేయడానికి సమర్థత లేనివారు పొద్దు పొడిచిన జాము లోపల స్నానం చేయాలి.
చలికి వెరవక మంచు చేత జలిమిరి హెచ్చిన నదీ జలాల్లో స్నానం మంచిది. మాఘ మాసంలో అరుణోదయాన దీపారాధనం, తిలహోమ తిలదానం, తిలభక్షణం, మాఘ స్నానం ముఖ్యమైనవని అంటారు.

మాఘ శుద్ధ తదియ
ఫిబ్రవరి 12, సోమవారం

మాఘ శుద్ధ తదియ మార్కండేయ మహర్షి జయంతి తిథిగా ప్రసిద్ధి. మృకండుడు, మనస్విని దంపతుల కుమారుడు మార్కండేయుడు. గొప్ప శివభక్తుడు. ఆయువు తీరినా.. తన శివదీక్షతో యముడిని సైతం జయించిన బాలుడీ మార్కండేయుడు. ఇంకా మాఘ శుద్ధ తదియ నాడు గుడలవణ దానం చేయాలని అంటారు. ఇంకా ఈనాడు ఉమాపూజ, లలితా వ్రతం, హరతృతీయా వ్రతం, దేవ్యా ఆందోళన వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మాఘ శుద్ధ చవితి
ఫిబ్రవరి 13, మంగళవారం

మాఘ శుద్ధ చతుర్థి నాడు శాన్తా చతుర్థీ వ్రతం ఆచరించాలని అంటారు. చవితి తిథి కావడం వల్ల ఈనాడు గణేశ్‍ పూజ చేస్తారు. ఈ రోజున డుంఠి గణపతిని పూజించాలి. కుంద చతుర్థి నాడు శివుడిని మొల్ల పూవులతో పూజించాలి. అలాగే, పుష్య మాస తిథులు శనీశ్వర ప్రధానమైనవి కాబట్టి ఈ తిథిని తిల చతుర్థిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు తిల (నువ్వులు) దానం చేస్తే కోటిరెట్ల ఫలాన్ని ఇస్తుందని అంటారు. ఇంకా చవితి తిథి నాడు ఉమాపూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే వరద గౌరీపూజ కూడా చేస్తారు. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఈ పూజా విశేషాల వివరాలు ఉన్నాయి.

మాఘ శుద్ధ పంచమి
ఫిబ్రవరి 14, బుధవారం

మాఘ శుద్ధ పంచమి చదువుల తల్లి సరస్వతీ దేవికి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. అందుకే మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథిని మదన పంచమి అనీ, వసంతోత్సవారంభః, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని కూడా వ్యవహరిస్తారు. శిశిర రుతువు ప్రారంభంలో వచ్చే ఈ తిథిని వసంత పంచమి అనడాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించడానికి గల కారణం ఏమిటో ఇతమిద్ధంగా తెలియదు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత సన్నాహాంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. మాఘ మాస శుక్ల పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతో పాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి అనే పండితుడు చెప్పారు. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. దక్షిణాదిన వసంత పంచమి అంతగా ప్రాముఖ్యమై లేదు. రాజపుటానాలో దీని ప్రాబవం ఎక్కువ. ఈనాడు వారు రంగుబట్టలు ధరించి బుక్కా, వసంతం చల్లుకుంటారు.
పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉంది.
వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి, రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు.
ఏదైమైనా వసంత పంచమి విద్యారంభ దినం. మన తెలుగునాట బాసర, ఇతర సరస్వతీ క్షేత్రాల్లో చదువుల తల్లిని ఈనాడు విశేషంగా పూజిస్తారు. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది. రుతు రాజు అయిన వసంతుడికి, కామదేవుడికి మంచి స్నేహం. కాబట్టి ఈనాడు రతీదేవికి కామదేవుడికి వసంతుడికి పూజ చేయాలనే ఆచారం ఏర్పడింది. ఇది వసంతరుతువు ఆగమనాన్ని తెలిపే తిథి పర్వం.
అలాగే, ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని (వాలెంటైన్‍ డే) జరుపుకుంటారు.

మాఘ శుద్ధ షష్ఠి
ఫిబ్రవరి 15, గురువారం

మాఘ శుద్ధ షష్ఠి నాడు కుమార స్వామి (స్కందుడు)ని పూజిస్తారు. కాబట్టి ఇది స్కంద షష్ఠి తిథిగా ప్రసిద్ధి. ఇంకా ఈనాడు విశోకాష్టమీ, మందారషష్టి, కామషష్ఠి వ్రతాలను ఆచరించాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాడు వరుణ షష్ఠి. ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపాలతో విష్ణు స్వరూపుడైన వరుణదేవుడిని పూజించాలని నియమం.
మాఘ శుద్ధ సప్తమి/రథ సప్తమి/

సూర్య జయంతి
ఫిబ్రవరి 16, శుక్రవారం

మాఘ మాసపు తిథులలో ప్రశస్తమైనది మాఘ శుద్ధ సప్తమి. దీనినే తెలుగునాట రథ సప్తమిగా వ్యవహరిస్తారు. దీనినే సూర్య జయంతి పర్వమనీ అంటారు. ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమిని మహా సప్తమి అని కూడా వ్యవహరిస్తారు. ఇంకా మాఘ శుద్ధ సప్తమి అనేక పేర్లు ఉన్నాయి. అవేమిటంటే..
మన్వాది దినం: సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ఇదే మన్వాది దినం. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. పితృ దేవతల ప్రీత్యర్థం ఈనాడు తర్పణాదులను విడవాల్సి ఉంటుంది.
సంవత్సరాది: వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది.
తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళవారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు. వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.
రథసప్తమి: చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనే వ్రతాలను గురించి పేర్కొన్నారు. అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవే. ప్రాచీక కాలంలో ఇది మనకు ఉగాది అయినా, కాకున్నా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి. ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉదయాన్నే జిల్లేడు ఆకుల్లో రేగిపండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు. చిక్కుడు ఆకులపై వేడి వేడి పొంగళిని పరచడం, జిల్లేడు ఆకుల్ని నెత్తి మీద పెట్టుకుని సూర్యుడికి అభిముఖంగా నిలిచి స్నానం చేయడం, అంతకుముందు పెద్దవాళ్లు పిల్లల తల మీదుగా రేగుపండ్లు పోయడం ద్వారా వారికి కీడు పోయింది అంటారు. ఇంకా ఎన్నో ఆరోగ్య రహస్యాలూ ఇమిడి ఉన్నాయి.
సూర్య జయంతి: రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తున్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, కొన్ని తావులోల జయంతి సప్తమి అనీ, మరికొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.
సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు.
జయంతి/మహా సప్తమి: మాఘ శుద్ధ సప్తమికే జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పర్వాలు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చని అంటారు. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- ఏడాదికి వచ్చే ఇరవై నాలుగు సప్తమి తిథుల్లో మాఘ శుద్ధ సప్తమి ప్రశస్తమైనది. కాబట్టి ఈ సప్తమి తిథిని మహా సప్తమి అన్నారు.
నర్మద జయంతి: ఇక, మాఘ శుద్ధ సప్తమికి నర్మద జయంతి అనే మరో పేరు కూడా ఉంది.

మాఘ శుద్ధ అష్టమి/భీష్మాష్టమి
ఫిబ్రవరి 17, శనివారం

మాఘ శుద్ధ అష్టమి భీష్మాష్టమి పర్వదినం. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ భీష్మాష్టమి గురించి వివరణ ఉంది. ఈ తిథి నాడు భీష్మునికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుందని అంటారు. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులకు భీష్మ పంచకం అని పేరు. భీష్ముడు అంపశయ్యపై ఉండి, మాఘ శుద్ధ అష్టమి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా ఉంది. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో ఉంది. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని అంటారు.
ఇంకా మాఘ శుద్ధ అష్టమి నాడు నందినీ దేవిపూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆంధప్రదేశ్‍లోని కోనసీమ జిల్లాలో సముద్ర సంగమ స్థానమైన అంతర్వేదిలో.. ఈనాడు అంతర్వేది తీర్థం వైభవంగా జరుగుతుంది.

మాఘ శుద్ధ నవమి
ఫిబ్రవరి 18, ఆదివారం

మాఘ శుద్ధ నవమి తిథి మహానంద నవమి పర్వదినమని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు నందినీదేవిని పూజించాలని, ఈ ఆచారం వల్లనే ఈ తిథికి మధ్వ నవమి అనే పేరు కూడా ఉందని అంటారు.

మాఘ శుద్ధ దశమి
ఫిబ్రవరి 19, సోమవారం

మాఘ శుద్ధ దశమి నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్‍ జయంతి. దశమి తిథి సాధారణంగా దుర్గాపూజకు అనువైనది. మాఘ శుద్ధ దశమి నాడు ప్రత్యేకంగా ఆచరించాల్సిన ఇర పూజా విధులేమీ లేవు.

మాఘ శుద్ధ ఏకాదశి
ఫిబ్రవరి 20, మంగళవారం

మాఘ శుద్ధ ఏకాదశిని జయైకాదశిగా వ్యవహరిస్తారు. తిథి తత్వంలో భీష్మైకాదశీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. ఈ ఏకాదశికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంద్రసభలో పుష్పవంతుడు నాట్యం చేస్తున్నాడు. తన భార్యను చూస్తూ అతను నాట్యం తప్పుగా చేశాడు. దీంతో ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాలని శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారిద్దరు శాప విముక్తులయ్యారు. భీష్ముడు ఈ తిథి నాడే మరణించాడని, కాబట్టి ఇది భీష్మైకాదశి దినమని అంటారు. అలాగే, గోదావరి సంగమ ప్రాంతమైన ఆంధప్రదేశ్‍లోని అంతర్వేదిలో గల శ్రీ లక్ష్మీనర్సింహస్వామి కల్యాణోత్సవం ఈ తిథి నాడే ఘనంగా నిర్వహిస్తారు. ఈనాడు అక్కడ గొప్ప తీర్థం జరుగుతుంది. మాఘ శుద్ధ ఏకాదశినే జయైకాదశిగానూ వ్యవహరిస్తారు.

మాఘ శుద్ధ ద్వాదశి
ఫిబ్రవరి 21, బుధవారం

మాఘ శుద్ధ ద్వాదశినే షట్‍తిలా ద్వాదశి (ఆరు తిలల ద్వాదశి) అంటారు. ఇంకా ఈనాడు వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఇక, మాఘ శుద్ధ ద్వాదశి తథి భీష్మ ద్వాదశి పర్వమని పంచాంగకర్తలు పేర్కొంటుంటే.. వివిధ వ్రత గ్రంథాలలో దీనిని భీమ ద్వాదశిగా చెప్పారు. మొత్తానికి భీష్ముడికి సంబంధించిన మూడు పర్వాలు మాఘ మాసంలో వరుసగా వస్తుండటం విశేషం. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
మాఘ శుద్ధ ద్వాదశి నాటి నుంచే తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని మేడారంలో సమ్మక్క – సారలమ్మ జాతర ప్రారంభమవుతుంది. ఇది నాలుగు రోజుల పాటు నిర్వహించే పర్వం. దేశవ్యాప్తంగా గల ఆదివాసీలు, గిరిజనులు తరలివచ్చి ఇక్కడి వనదేవతలను పూజిస్తారు. ఫిబ్రవరి 21న జాతర ప్రారంభమై 24వ తేదీన ముగుస్తుంది.

మాఘ శుద్ధ త్రయోదశి
ఫిబ్రవరి 22, గురువారం

మాఘ శుద్ధ త్రయోదశి కల్పాదిగా ప్రతీతి. విశ్వకర్మ జయంతి దినంగానూ ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని వృత్తులకు ఆద్యబ్రహ్మ. కాబట్టి విద్యారణ్య జయంతి, యాజ్ఞవల్క్య జయంతి దినాల వలే విశ్వకర్మ జయంతినీ వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు. విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి ఇంజనీరింగ్‍ నైపుణ్యం చూపింది ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. విశ్వకర్మ జయంతి కార్మికులకు పూజా దినం. ఈనాడు తమ వృత్తులకు, పనులకు ఆటవిడుపునిస్తారు.
మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం ఉంటాయి. ఈయన వాహనం హంస.

మాఘ శుద్ధ పూర్ణిమ
ఫిబ్రవరి 24, శనివారం

మాఘ శుద్ధ పూర్ణిమకే మహా మాఘి, మాఘ పూర్ణిమ అని పేరు. ఈనాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు.
మాఘ పూర్ణిమ సతీదేవి అవతరించిన దినమని పురాణ కథ. పార్వతి ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు. అతని హస్తస్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారి కన్యగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.
• మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో చలిమెరి హెచ్చిన నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు.
• మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
• మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు.
• రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే.
• ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశినిగా ఉంటుందని అంటారు.
• గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణంలో మహామాఘి ఉత్సవం మరీ వైభవంగా జరుగుతుంది.
• మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.• మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కొన్నిచోట్ల లలితా జయంతి దినంగానూ జరుపుకుంటారు. అలాగే, ఈనాడు గురు రవిదాస్‍ జయంతి దినం.
మాఘ బహుళ పాడ్యమి
ఫిబ్రవరి 25, ఆదివారం
మాఘ మాసంలో ఈనాటి నుంచి బహుళ (కృష్ణ) తిథులు ఆరంభమవుతాయి. మాఘ కృష్ణ పాడ్యమి తిథి నాడు సౌభాగ్య వాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మాఘ స్నాన మంత్రం
మాఘస్నాయీ వరారోహు దుర్గతిం వైవ పశ్యతి
తన్నాస్తి పాతకం యత్తు మాఘస్నానం న శోధయేత్‍
అగ్ని ప్రవేశాదధికం మాఘస్నానంన శోధయేత్‍
జీవితా భుజ్యతే దు:ఖం మృతేన బహుళం సుఖమ్‍
ఏతస్మాత్కారణేద్భద్రే మాఘ స్నానం నం విశిష్యతే

మాఘ మాసం స్నానాలకు ప్రసిద్ధి. మాఘ స్నానం ఇహపర దాయకం. సూర్యుడు ఉదయించే సమయంలో స్నానం చేస్తే మహా పాతకాలు నశిస్తాయని కమలాకర భట్టు రచించిన ‘నిర్ణయసింధు’లో ఉంది. సకల జనులూ మాఘ స్నానాలను ఆచరించవచ్చు. సముద్రాలు, నదులు, కాలువలు, బావులు, ఇతర నీటి వనరులలో స్నానం చేయలేని వారు మాఘ మాసంలో సూర్యుడు మకరరాశిలో ఉండే సమయంలో సూర్యోదయానికి ముందు వేడి నీటితోనైనా ఇంట్లో స్నానం చేస్తే ఆరేళ్ల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అయితే మాఘ మాసంలో ఇంట్లోనే స్నానం చేసే వారు గంగాయమునాది దివ్య తీర్థాలను స్మరించి స్నానం చేయాలని నిర్ణయసింధులో రాశారు.

దు:ఖ దారిద్య్ర నాశయ శ్రీ విష్ణోస్త్రోషణాయచ
ప్రాత:స్నానం కరో మధ్యమాఘే పాప వినాశనం
మకరస్తే రవౌ మాఘే గోవిందాచ్యుత మాధవ
స్నానేనా నేన మేదేవ యధోక్త ఫలదోభవ

అనే పై శ్లోకం పఠిస్తూ మాఘ స్నానం ఆచరించాలి. మాఘ మాసం పొడవునా ఏదేని అశక్తుల వల్ల స్నానం చేయలేని వారు మాఘ మాసంలో వచ్చే పాడ్యమి, విదియ, తదియ తిథులలో స్నానం చేసి, మళ్లీ త్రయోదశి, చతుర్దశి, మాఘ పూర్ణిమ తిథులలో చేయవచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తరువాతే మాఘ మాసం రావడం వల్ల మాఘ మాస స్నానాలకు అంత వైశిష్ట్యం చేకూరింది.

Review సూర్యారాధన.. సరస్వతీ పూజ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top