ఆధ్యాతిక ‘మార్గ’దర్శి

డిసెంబరు 1, శనివారం, కార్తిక బహుళ అష్టమి నుంచి-డిసెంబరు 31, సోమవారం మార్గశిర బహుళ దశమి వరకు
విలంబి నామ సంవత్సరం-కార్తీకం-మార్గశిరం-హేమంత రుతువు-దక్షిణాయన

ఆంగ్లమానం ప్రకారం పన్నెండవ మాసం డిసెంబరు. తెలుగు మానం ప్రకారం ఇది తొమ్మిదవ మాసం. ఇది తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక – మార్గశిర మాసాల కలయిక. కార్తీక మాసంలోని కొన్ని రోజులు, మార్గశిరంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. కార్తికంలో వచ్చే పర్వాలలో చెప్పుకోదగిన విశేష పర్వాలు పెద్దగా లేవు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు డిసెంబరు 4న ప్రారంభమై 12వ తేదీతో ముగుస్తాయి. డిసెంబరు 7వ తేదీతో కార్తిక తిథులు ముగుస్తాయి. ఇక, మార్గశిరంలో వచ్చే ముఖ్యమైన దినాలలో సుబ్రహ్మణ్య షష్ఠి, ముక్కోటి (వైకుంఠ) ఉకాదశి, దత్తాత్రేయ జయంతి, క్రిస్టమస్‍, కాలభైరవాష్టమి, రమణ మహర్షి జయంతి ఉన్నాయి. డిసెంబరు 1, కార్తిక బహుళ నవమి, శనివారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం డిసెంబరు 31, మార్గశిర మాసం, బహుళ దశమి, సోమవారంతో ముగుస్తుంది. మార్గశిరంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఇంకా మత్స ్య ద్వాదశి, శ్రీ హనుమద్వ్రతం వంటి పర్వాలు కూడా ఈ నెలలోనే వస్తాయి.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే డిసెంబరు నెల.. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక – మార్గశిర మాసాల కలయిక.
వికటకవి ఒకరు మార్గశిర మాసానికి ‘దారి తల’ మాసం అని తెలుగు అర్థం చెప్పారట. ఇది కోణంగి అనువాద విధానం. ఒకప్పుడు సంవత్సరారంభం మార్గశిర మాసంలో అవుతుండేదట. ఈ మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో, ‘మాసానాం మార్గశీర్షోహ:’ అని నుడివారు. ఈ వాక్యం ఈ మాసపు ఉత్క•ష్టతను చెబుతోంది. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మార్గశిరం.. దీని తరువాత వచ్చే పుష్యం.. ఈ రెండూ కలిసి హేమంత రుతువు. ఈ రుతువును భాగవత దశమ స్కంధంలో వర్షిస్తూ పోతన గారు- ‘గోపమారికలు రేపకడ లేచి, చని, కాళిందీ జలంబులం దోగిజలతీరంబున నిసుమునం గాత్యాయనీ రూపంబు చేసి.. మాస వ్రతంబు సలిపిరి’ అని వర్ణించారు. ఈ మాసంలో నిర్వహించాల్సిన వ్రతాల గురించి మన పూర్వులు జరుపుతుండిన వ్రతాలను కొన్నిటిని ఆయా వ్రత గ్రంథాలు వివరిస్తున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం.. మార్గశీర్షం. కార్తిక మాసంలోని నాగుల చవితి నాడు ప్రవేశించే చలి ఇప్పటికి బాగా ప్రబలుతుంది. మార్గశిర మాసంలో ప్రవేశించే చలి మంటలో పడినా పోదని సామెత.

మార్గశిర మాసం విష్ణు సంబంధమే కాక, మరెన్నో విధాలుగా కూడా మహత్తరమైనది. ఈ మాసంలో శ్రీమహా విష్ణువు విశేష రీతిలో పూజలు అందుకుంటాడు. అదే విధంగా శివపార్వతుల కుమారుడైన కుమారస్వామిని మార్గశిర మాసంలో శుద్ధ స్కంద షష్ఠి నాడు విశేషంగా ఆరాధిస్తారు. ఇక, దత్తాత్రేయుని జయంతి దినం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే, ధనుర్మాసం ప్రారంభయ్యేది కూడా ఈ మాసంతోనే. ఆధ్యాత్మికంగా మార్గశిరం ఇంతలా పవిత్రమై ఉంటే, ఇక ఆరోగ్యపరంగానూ ఈ మాసంలో మన శాస్త్రకారులు పెద్దపీట వేశారు. చలి గజగజ వణికించే మాసమిది. అందుకు తగినట్టే ఆహార నియమాలను, వ్రత నిబంధనలను విధించారు. ఈ మాసంలో వచ్చే విశేష తిథుల గురించి, ఆయా తిథి పక్షాలలో పాటించాల్సిన వ్రత నియమాల గురించి తెలుసుకుందాం.

కార్తీక బహుళ ఏకాదశి, డిసెంబరు 3, సోమవారం

ఏకాదశి దేవి ఈ తిథి నాడే ఆవిర్భవించిందని ప్రతీతి. కాబట్టే కార్తీక బహుళ ఏకాదశి తిథిని ఉత్పత్యైకాదశి అనీ అంటారు. కృతయుగంలో తాళజంఘుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ సముద్భవుడు. అతని కొడుకు మురాసురుడు. మురాసురుడు పోటుకు ఇంద్రాది దేవతలను, శివుడిని, బ్రహ్మను ఓడించాడు. వారంతా పరుగెత్తుకుపోయి విష్ణువు శరణజొచ్చారు. అప్పుడు విష్ణువు వెయ్యి సంవత్సరాల పాటు మురాసురునితో ద్వంద్వ యుద్ధం చేశాడు. ఇక మీదట అతనితో పోరాడలేక అలసిపోయిన విష్ణువు.. సింహవతి అనే పేరు గల గుహలో దాక్కున్నాడు. అలసట తీర్చుకుని ఈసారి మురాసురుడిని చంపడానికి గట్టిగా సంకల్పించుకున్నాడు. ఆ సంకల్ప బలం చేత విష్ణువు శరీరం నుంచి ఒక కన్యక పుట్టింది. అంతలో అక్కడికి మురాసురుడు వచ్చాడు. వాడితో ఆ కన్య యుద్ధం చేసి వాడిని సంహరించింది. అందుకు విష్ణువు ఆమె పేరు అడిగి, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దీంతో ఆ కన్య ఇలా చెప్పింది-
1. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి.
2. అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఇవ్వాలి.
3. నా తిథి నాడు ఉపవసించి మిమ్మల్ని ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి.

ఈ మూడు వరాలను ఆమెకు విష్ణువు ఇచ్చాడు. ఏకాదశి వ్రతానికి ఇదే ఆరంభం.
ఇంకా, ఐదు రోజుల కార్యకలాపం గల కామధేను వ్రతాన్ని ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్తిక కృష్ణ దశమి నాడు పంచగవ్య భక్షణం చేసి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు.

కార్తిక బహుళ ద్వాదశి, డిసెంబరు 4, మంగళవారం

కార్తీక బహుళ ద్వాదశిని యోగీశ్వర ద్వాదశిగా చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం పేర్కొంది. ఈనాడు గోపూజ చేయాలని అంటారు. అలాగే గోవత్స ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు దూడతో కూడిన ఆవును పూజిస్తే పుణ్యం కలుగుతుందని అంటారు.

కార్తిక బహుళ త్రయోదశి, డిసెంబరు 5, బుధవారం

కార్తిక బహుళ త్రయోదశి నాడు యమదీప దానం చేయాలని, గోత్రిరాత్రి వ్రతం చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. కార్తిక బహుళ చతుర్దశి, మాస శివరాత్రి నాడు ఏ నదిలో స్నానం తర్పణం విడిస్తే మహా పుణ్యం కలుగుతుంది. ఈనాడు చతుర్దశా భక్షణ, బ్రహ్మకూర్చ, యమ, జలకృచ్ఛ, కృచ్ఛ మున్నగు వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

భౌమ వారంతో కూడిన ఈ చతుర్దశిని చిత్రా చతుర్దశి అని కూడా అంటారు. అట్టి చిత్రా చతుర్దశి నాడు శివపూజ చేయాలని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది.
విధూదయమప్పుడు తిల తైలంతో స్నానం చేయాలి. అంటే చంద్రోదయ సమయంలో అని అర్థం. చంద్రుడు అస్తమించే సమయంలో ఉల్కాదానం చేయాలి. దినోదయ వేళ స్నానం చేస్తూ అపా మార్గం (ఉత్తరేణి) తల చుట్టూ తిప్పుకోవాలి. స్నానం చేసి యమతర్పణం విడవాలి. ఈనాడు సాయంత్ర కాలం దీపదానం చేయాలి.

కార్తిక బహుళ చతుర్దశి, డిసెంబరు 7, శుక్రవారం

కార్తిక బహుళ అమావాస్య.. భగవద్గీత పుట్టిన దినంగా గుర్తించాల్సి ఉంది. అంటే, గీతా జయంతి ఈనాడే జరపాలని కొందరు అంటారు. ఉత్తరాదిన కొన్ని తావుల్లో మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతాజయంతి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. మార్గశిర శుద్ధ త్రయోదశి నుంచి పుష్య శుద్ధ పాడ్యమి వరకు గల పద్దెనిమిది రోజులు భారత యుద్ధం జరిగిందని, ఆ యుద్ధ ప్రారంభ దినమైన మార్గశిర శుద్ధ త్రయోదశికి రెండు రోజుల ముందుగా మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు భగవద్గీతను శ్రీకృష్ణుడు బోధించాడని అందుచేత ఈనాడు గీతా జయంతి నిర్వహించడం సముచితమని అంటారు.
కానీ, మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జనన దినంగా నిర్ధారించి చెప్పడానికి వీలు కుదరరు.

భారతాన్ని బట్టి మాఘ శుద్ధ అష్టమి భీష్మ నిర్యాణ దినం. భీష్ముడు అంపశయ్య మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నట్టు భారతంలో స్పష్టంగా ఉంది. భీష్ముడు యుద్ధం చేసింది పది రోజులు. భీష్ముడు మరణించిన మాఘ శుద్ధ అష్టమి నుంచి మొత్తం అరవై ఎనిమిది దినాలు రెండు మాసాల ఎనిమిది రోజులు. వెనక్కి లెక్తిస్తే.. భారత యుద్ధ దినం తేలుతుంది. ఈ గణన ప్రకారం భారత యుద్ధ ప్రారంభ దినం కార్తిక బహుళ అమావాస్య అవుతుంది.

కార్తిక మాసంలో రేవతి నక్షత్రం నాడు శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి పయనమై వెళ్లినట్టు భారతంలో ఉంది. కార్తిక పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం అవుతుంది. కృత్తికా నక్షత్రానికి మూడో పూర్వపు నక్షత్రం రేవతి. రేవతి నక్షత్రం నాడనగా శుద్ధ త్రయోదశి అవుతుంది. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొద్ది రోజులు ఉన్నాడు. వస్తూ కర్ణుడితో మాట్లాడాడు. ఆ సంభాషణలో శ్రీకృష్ణుడు కర్ణుడితో జ్యేష్టా నక్షత్రంతో కూడిన అమావాస్య నాడు యుద్ధం ఆరంభమవుతుందని తెలిపాడు. కాగా, కార్తిక బహళ అమావాస్యే భారత యుద్ధ ప్రారంభ దినమని నిర్ధారించి చెప్పవచ్చు.

భారత యుద్ధ సమయంలో అర్జునుడు కాగల బంధువధకు శంకించాడు. ఆ సందర్భంలో కృష్ణుడు అతనికి తత్త్వోపదేశం చేశాడు. ఆ ఉపదేశమే భగవద్గీత. ఈ ఉపదేశం, యుద్ధ ప్రారంభ దినం నాటి ఉదయం జరిగింది.

మార్గశిర శుద్ధ పాడ్యమి, డిసెంబరు 8, శనివారం

ఈనాడు గంగా స్నానం చేస్తే కోటి సూర్య గ్రహణ స్నాన ఫలంకలుగుతుందని తిథి తత్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు ధన్య, భద్ర చతుష్టయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

మార్గశిర శుద్ధ విదియ, డిసెంబరు 9, ఆదివారం
మార్గశిర శుద్ధ విదియ గురునానక్‍ జన్మదినం.

మార్గశిర శుద్ధ తదియ, డిసెంబరు 10, సోమవారం

ఉమా మహేశ్వర, అనంత తృతీయ, అవియోగ తృతీయ, నామ తృతీయ, ఫలత్యాగ మున్నగు వ్రతాలను ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు రంభా తృతీయ వ్రతం చేస్తారని పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉంది.

మార్గశిర శుద్ధ చతుర్ధి, డిసెంబరు 11, మంగళవారం

ఈనాడు పాపదాన కృచ్ఛ చతుర్థి, వరద చతుర్థి, నక్త చతుర్థి నామాంతరం గల వినాయక చతుర్థీ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు ఢుంఢి రాజ పూజ చేయాలనీ, ఆ పూజా కార్యంలో శుక్ల తిలలు ఉపయోగించాలని ఉంది.

మార్గశిర శుద్ధ పంచమి, డిసెంబరు 12, బుధవారం

ఇది నాగపంచమిగా దక్షిణాది ప్రాంతంలో ప్రసిద్ధమై ఉంది. ఈనాడు నాగపూజ చేయాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు శ్రీ పంచమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది.

మార్గశిర శుద్ధ షష్ఠి, డిసెంబరు 13, గురువారం

మార్గశిర శుద్ధ షష్ఠిని మన పంచాంగకర్తలు సుబ్రహ్మణ్య షష్ఠి అని పేర్కొంటారు. ఆంధ్ర జన సామాన్యంలో ఇది సుబ్బారాయుడి షష్ఠి అనే వ్యావహరికంలో ఉంది. తమిళులు దీనిని స్కంద షష్ఠి అంటారు. శివుని రెండో కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కొలవడానికి ఉద్ధిష్టమైనదీ పండుగ. సుబ్రహ్మణ్య స్వామికే కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు తదితర పర్యాయ నామాలు ఉన్నాయి. వీటిని బట్టి ఈ పర్వానికి కుమారషష్ఠి, కార్తికేయ షష్ఠి, గుహ ప్రియావ్రతం అనే పేర్లు ఏర్పడ్డాయి.

సుబ్రహ్మణ్యషష్ఠికే కాక ఈనాడు చంపాషష్ఠి, ఫలషష్ఠి, ప్రావారణ షష్ఠి వ్రతాలు కూడా ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలు చెబుతున్నాయి.
ఇక, సుబ్బారాయుడి షష్ఠి విశేషాల్లోకి వెళ్తే.. తారకుడు అనే రాక్షసుడు ప్రబలుడై దేవతలను పీడిస్తుండే వాడు. అతనితో యుద్ధం చేసి దేవతలు ఓడిపోయారు. దేవతల రాజైన ఇంద్రుడు అప్పుడు బ్రహ్మ సలహా కోరాడు. యోగనిష్ఠలో ఉన్న శివునికి పార్వతితో పెళ్లి చేస్తే వారికి పుట్టే బిడ్డ దేవసేనాని అయి తారకాసురుడిని సంహరిస్తాడని బ్రహ్మ సలహానిచ్చాడు. అప్పుడు దేవతలు మన్మథుని సహాయంతో శివపార్వతులకు సంధానం చేస్తారు. దీంతో కుమారస్వామి పుడతాడు. ఇది మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరిగింది.

తెలుగు వారు సుబ్రహ్మణ్య లేదా సుబ్బారాయుడి షష్ఠికి ఉదయాన్నే స్నానం చేసి పరగడుపునే పట్టుబట్టలతో కానీ, తడిబట్టలతో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి పువ్వులు, పండ్లు, పుట్టలు, పడగలు అర్పించడం ఆచారమై ఉంది. పుట్టలు, పడగలు అర్పించడం నాగపూజా చిహ్నం. గోదావరి ప్రాంత రైతులకు సుబ్బారాయుడి షష్ఠి పెద్ద పండుగ. షష్ఠి వెళ్తే వానలు వెనకపడతాయని వారి నమ్మిక. ఈ రోజుల్లో మబ్బులు పడతాయి. కానీ వర్షించవు. కావునే వానలు కురవని మబ్బులకు షష్ఠి మబ్బులని పేరు.

మార్గశిర శుద్ధ సప్తమి, డిసెంబరు 14, శుక్రవారం

నీలమత పురాణంలో ఈనాడు సూర్య పూజ చెయ్యాలని ఉంది. స్మ•తి కౌస్తుభం ఈ తిథిని మిత్ర సప్తమిగా పేర్కొంది. నయనప్రద సప్తమి, సిత సప్తమి, ఉభయ సప్తమి, పుత్రీయ సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలు ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. హేమాద్రి వ్రత ఖండంలో ఈనాడు నందా సప్తమి వ్రతం చేస్తారని ఉంది. ఈ వ్రతానికి నందా జయంతి అనే నామాంతరం ఉన్నట్టు తెలుస్తోంది.

మార్గశిర శుద్ధ అష్టమి, డిసెంబరు 15, శనివారం

తెలుగు నాట ఇది కాలభైరవాష్టమిగా ప్రసిద్ధమై ఉంది. దీనినే కాలాష్టమి అని కూడా అంటారు. ఇంకా మహేశ్వరాష్టమి, సౌమ్యాష్టమి, ప్రథమాష్టమి, భద్రాష్టమి, భీష్మాష్టమి, దుర్గాష్టమి, అన్నపూర్ణాష్టమి తదితర పేర్లు కాలాష్టమికి ఉన్నాయి.

ఒకసారి బ్రహ్మకు, ఈశ్వరుడికి తమ మహిమాన్వితమైన విషయంలో తగవు వచ్చింది. ఆ సందర్భంలో బ్రహ్మదేవుని మధ్యమ ముఖం శివుడిని తూలనాడింది. శివుడికి పట్టరాని కోపం వచ్చింది. అప్పుడాయన కాలభైరవుడిని పుట్టించాడు. ఆనాడు మార్గశిర శుద్ధ అష్టమి. అలా పుట్టిన కాలభైరవుడు తాను చేయాల్సిన పని ఏమిటని శివుడిని అడిగాడు. బ్రహ్మ తల నరికివేయాలని శివుడు ఆజ్ఞాపించాడు. కాలభైరవు చేయాలని శివుడు సూచించాడు. కాలభైరవుడు ఆ విధంగా చేశాడు. చివరకు కాశికాపురిలో కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం పోయింది. అందుచేత కాలభైరవుడు కాశీ నగరంలో స్థిరపడిపోయాడు. అప్పుడు శివుడు అతనితో ఇలా అన్నాడు- ‘నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు. ఇక నీవు ఇక్కడే ఉండిపో. కాశీకి వచ్చిన ప్రతి వారు ముందు నిన్ను సేవించిన తరువాతే నన్ను అర్చించాలి’.
ఇప్పటికీ ఆ సంప్రదాయం నిలిచి ఉంది. కాశీలో ముందుగా కాలభైరవ పూజ చేయడమే కాకుండా ఇంటికి వచ్చాక కాశీ సంతర్పణకు ముందుగా కాలభైరవ సంతర్పణ కూడా చేస్తారు. నీలకంఠ యీప్సితార్థదాయకుడైన ఈ కాలభైరవుడిని ‘కాశికా పురాధినాథ కాలభైరవం భజే’ అనే మకుటంతో ఎనిమిది శ్లోకాలతో శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యులు (ఆది శంకరాచార్యులు) స్తోత్రం చేసి ఉన్నారు.

మార్గశిర శుద్ధ నవమి, డిసెంబరు 16/17, ఆదివారం

త్రివిక్రమ త్రిరాత్ర వ్రతం ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో రాశారు. దేవీపూజ చేయాలని పురుషార్థ చింతామణిలో ఉంది.

మార్గశిర శుద్ధ దశమి, డిసెంబరు 18, మంగళవారం

పదార్థ వ్రతం, ధర్మ వ్రతం ఈనాడు చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు. ఆరోగ్య వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆరోగ్య వ్రతం ఆచరించే వారు ఒంటిపూట భోజనం చేయాలి. ఈ వ్రతం చేసిన వారు ఈ లోకంలోనే ఆరోగ్యం పొందుతారని ప్రతీతి.

మార్గశిర శుద్ధ ఏకాదశి, డిసెంబరు 19, బుధవారం

మార్గశిర శుద్ధ ఏకాదశి తిథి ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనీ అంటారు. సౌఖ్యదైకాదశీ అనే నామం కూడా ఉంది.
వైఖానసుడు అనె ఒకరాజు. ఆయనకు ఒకనాడు తన తండ్రి నరకంలోనే ఉండిపోయి యమ యాతనలు పడుతున్నట్టు కల వచ్చింది. దీంతో ఆయన మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసాది నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి నరక లోకం నుంచి స్వర్గలోకానికి వెళ్లాడు. ఇట్లు తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనిని మోక్షదైకాదశి అనే పేరు కూడా ఉంది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి.

మార్గశిర శుద్ధ ద్వాదశి, డిసెంబరు 19, గురువారం

ఏకాదశి గడియల్లోనే ద్వాదశి కూడా ప్రవేశిస్తోంది. ఈనాడు మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారకా ద్వాదశి, అపరా ద్వాదశి, నామ ద్వాదశి, శుభ ద్వాదశి, అఖండ ద్వాదశి, దశావతార వ్రతం, సాధ్య వ్రతం, ద్వాదశాదిత్య వ్రతం మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. హనుమద్వ్రతం చేస్తారని మరో వ్రత గ్రంథంలో ఉంది. వీ•న్నిటిని బట్టి ఇది ఒక గొప్ప పర్వదినంగా భావించాలి. తెలుగు వారి ఇలవేల్పు అయిన ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి పుష్కరిణికి ఈనాడు తీర్థ దినం.

భూలోకంలో మూడు కోట్ల తీర్థ రాజాలు ఉన్నాయి. ఆ తీర్థాలన్నీ మార్గశిర శుద్ధ ద్వాదశి నాడు అరుణోదయ కాలాన తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాడని పురాణ వచనం. ఆనాడు అక్కడ స్నానం చేయడం వల్ల గొప్ప ఫలితం ఉంటుంది.

మార్గశిర శుద్ధ త్రయోదశి, డిసెంబరు 20, గురువారం

అనంగ త్రయోదశీ వ్రతం ఈ తిథి నాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు గోదావరి తీర ప్రాంతాలలో హనుమజ్జయంతిని జరుపుతారు.

మార్గశిర శుద్ధ చతుర్దశి, డిసెంబరు 21, శుక్రవారం

చతుర్వర్గ చింతామణి తెలిపిన ప్రకారం.. ఈనాడు చాంద్రాయణ వ్రతం చేయాలి. ఈనాడు రాత్రి వరకు భోజనం చేయకుండా ఉండి తరువాత గౌరిని ఆరాధించాలి. పాషాణాకార పిష్ట భోజనం. దీనిని పాషాణ చతుర్దశీ వ్రతం అనీ అంటారు. శివ చతుర్దశీ శ్రావణికా మున్నగు వ్రతాలు కూడా ఈనాడు ఆచరిస్తారని ఆ వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా ఈనాడు శివ వ్రతం కూడా ఆచరిస్తారు. దీనికి ముందు రోజు రాత్రి భోజనం మాని చతుర్దశి నిరాహారి అయి ఆంబోతును పూజించాలి. మర్నాడు కమలములతో ఉమాసహితుడైన శివుడిని పూజించాలి.

మార్గశిర శుద్ధ పూర్ణిమ, డిసెంబరు 22, శనివారం

మార్గశిర శుద్ధ పూర్ణిమ నాడు చంద్రపూజ చేయాలని నీలమత పురాణం, చంద్ర వ్రతం చేయాలని హేమాద్రి పండితుడు చెబుతున్నారు. నాడు ఆగ్నేయ పురాణాన్ని దానం చేస్తే సర్వ క్రతు ఫలం కలుగుతుందని పురాణోక్తి. ఇటువంటి ప్రసిద్ధి గల ఈ మార్గశిర పూర్ణిమను తెలుగు దేశంలో కోరల పూర్ణిమ అంటారు. కోరల పున్నమి అంటే, కోరల అమ్మవారి పున్నమి. ఈ కోరల అమ్మవారు యముని వద్ద ప్రధాన లేఖకుడైన చిత్రగుప్తుని సోదరి. ఆమె కోటి పుర్రెల నోము పడుతుందట. కానీ, ఏటా ఒక పుర్రె లోటు వస్తుందట. అందుచేత మళ్లీ సంవత్సరం మళ్లీ ఆ నోము పడుతుందట. అప్పుడు ఇట్లాగే నోము అసంపూర్తి. ఏటేటా ఇదే వరస. ఇది పురాణ కథనం. కానీ, నిష్టతో 33 పున్నాల నోము పట్టే వారు కూడా ఈ పున్నమి నాడు ఏమీ చేయరు. అది ఒక కట్టుబాటు.

మహా మార్గశీర్ష అనే పేరు గల ఈ పున్నమి నాడు నరక పూర్ణిమ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. నరక అనే పదం యమ సంబంధమైనది.
వైద్య శాస్త్రంలో కార్తీక పూర్ణిమ మొదలు మార్గశిర పూర్ణిమ వరకు గల 30 దినాలను యమదంష్ట్రలు అంటారు. అంటే ఈ రోజులలో యముడు కోరలు తెరుచుకుని ఉంటాడని భావం. ఈ రోజులు చాలా అనారోగ్యకరాలైనవి. ఈ దినాలలో మరణిస్తే జాస్తీ. మార్గశిర పూర్ణిమతో యమదంష్ట్ర దినాలు తుదముట్టుతాయి.

మార్గశిర పూర్ణిమ రోజున ఆంధ్ర ప్రాంతాలలో అతి ప్రాచీన కాలం నుంచి ‘రొట్టెలు కొరికి కుక్కలకు వేయుట’ అనే ఆచారం ఒకటి పరంపరగా వస్తోంది. ఇలా రొట్టెలు కొరికి వేయడం ద్వారా యముని కోరల్లో ఉండే విషం పోతుందని విశ్వాసం.

మార్గశిర పూర్ణిమను వ్రత గ్రంథాలు నరకపూర్ణిమ అనీ, తెలుగు వారు కోరల పూర్ణిమ అని భీతి గొలిపే నామాలతో వ్యవహరిస్తుంటే, మహారాష్ట్రులు ఈనాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటున్నారు.

దత్తాత్రేయుల వారు మార్గశిర శుక్ల చతుర్దశి నాడు అవతరించినా, ఆయన జయంతిని మాత్రం మార్గశిర పూర్ణిమ నాడే జరుపుకోవడం విశేషం.
దత్తాత్రేయుని కథ వినదగినది.

కలహ కారకుడైన నారద ముని తన భక్తి ప్రపత్తుల చేత విష్ణుమూర్తిని ప్రసన్నుడిని చేసుకున్నాడు. విష్ణువు ఏదైనా వరం కోరుకొమ్మన్నాడు. ‘నీ సత్వ (నిజ) రూపం చూడాలని ఉంది’ అని నారదుడు కోరాడు. అందుకు విష్ణువు- బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఒకటిగా చేయగలిగితే నీవు కోరింది చూడగలుగుతావని చెప్పాడు.

దీంతో నారదుడు భూలోకానికి వచ్చాడు. ఎలా అయినా త్రిమూర్తులను ఒకటిగా చేయాలని సంకల్పించాడు. ఈ క్రమంలో నారదుడు అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అత్రి మహర్షి ఆశ్రమంలో లేడు. ఆయన భార్య అనసూయ ప్రాతివత్యానికి పేరుమోసిన స్త్రీ రత్నం. నారదుడికి ఆమె ఆతిథ్యం ఇచ్చింది. అంతట నారదుడు వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ అతను లక్ష్మితో। ముల్లోకాల్లోనూ అనసూయ వంటి పతివ్రత లేదని చెప్పాడు.

తన భర్తను భూలోకానికి పంపి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షింప చేస్తానని లక్ష్మీదేవి నారదుడితో అంది. ఆపై నారదుడు కైలాసాని, సత్యలోకానికి వెళ్లి పార్వతి, సరస్వతిలతో కూడా అనసూయ పాతివ్రత్యం గురించి చెబితే.. తమ భర్తలను పంపి పరీక్షిస్తామని చెప్పింది.

భార్యల ఆలోచనల ఫలితంగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి అత్రి ఆశ్రమానికి వచ్చారు. తమకు ఆకలిగా ఉందని, అనసూయ విగత వస్త్రయై తమకు అన్నం పెట్టాలని కోరారు. ఈ వింత కోరికకు అనసూయకు ఆశ్చర్యం వేసింది. తన భర్తతో ఆలోచన చేసింది. అత్రి గొప్ప ఆత్మజ్ఞాని. యోగి. కాగా, అతనికి అంతా తెలిసిపోయింది. వచ్చిన బ్రాహ్మణ పిల్లలు పరీక్షార్థం వచ్చిన త్రిమూర్తులనే సంగతి గ్రహించాడు.

అప్పుడు ఆయన భార్యకు మంత్రోదకం ఇచ్చాడు. ఆ ఉదకాన్ని వచ్చిన వారి మీద చల్లి ఆ మీద వారికి అన్నం వడ్డించాలని చెప్పాడు. మగని ఆజ్ఞ ప్రకారం అనసూయ వారిపై మంత్రోదకం చల్లింది. తోడనే ఆ బ్రాహ్మలు ముగ్గురూ పసిపిల్లలు అయిపోయారు. అప్పుడు అనసూయ వారికి తన స్తన్యం ఇచ్చి వారి ఆకలి తీర్చింది.

ఇంతలో హఠాత్తుగా నారదుడు అక్కడికి వచ్చాడు. త్రిమూర్తులు చిన్నారి శిశువులై అక్కడ ఆడుతూ ఉండగా చూసి ఆనందించాడు. ఆ ఆనందంతో అక్కడి నుంచి వెళ్లి విషయాన్ని త్రిమూర్తుల భార్యలకు చెప్పాడు. అత్రి ఆశ్రమానికి తమను తీసుకువెళ్లాలని వారు కోరారు. దీంతో వారిని వెంటబెట్టుకుని వచ్చిన నారదుడు అల్లంత దూరంలో దాగి, అత్రి ఆశ్రమానికి వారికి దారి చూపించాడు. అక్కడ తమ భర్తలు బాలురై ఆడుతూ ఉండటం త్రిమూర్తుల భార్యలు చూశారు.

దీంతో వారికి గర్వభంగమైపోయింది. కాగా, వారు అనసూయ పాదాల మీద సాష్టాంగపడి అక్కడ శిశువులై ఆడుతూ ఉన్న ముగ్గురూ తమ భర్తలైన బ్రహ్మవిష్ణుమహేశ్వరులని, దయచేసి తమ పతుల్ని తమకు ఈయవలసిందని కోరారు.

అప్పుడు అనసూయ భర్త ఆజ్ఞ మీదట ఆ శిశువుల మీద తిరిగి మంత్రోదకాన్ని చల్లింది. తిరిగి ఆ శిశువులు విధి, నీలకంఠ, నీలవర్ణ రూపాలు ధరించారు. నిజరూపధారులైన త్రిమూర్తులు అప్పుడు అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఏదైనా వరం కోరుకొమ్మన్నారు. అందుమీద ఆమె, ఆమె భర్త అత్రి త్రిమూర్తులు తమకు పుత్రుడిగా పుట్టాలని కోరారు. వారి కోరిక మీదనే ముని దంపతులకు కుమారుడు పుట్టాడు.

అతనే దత్తాత్రేయుడు. అతనికి ఆరు చేతులు, మూడు తలలు. నడిమి శిరస్సు విష్ణువుది. దానికి కుడిది శివుడిది. దానికి ఎడమది బ్రహ్మ శిరము.
స్థలాంతరంలో దత్తాత్రేయుని ఉత్పత్తి విధానం మరోలా ఉంది.

శిశువులు తిరిగి త్రిమూర్తులుగా మారే తరుణంలో నారదుడు హఠాత్తుగా అక్కడికి వచ్చి, త్రిమూర్తుల్ని దర్శించి, ‘మీరు ముగ్గురూ ఒక్కచోట ఉన్నారు. కాబట్టి మీ నిజరూపం నాకు చూపాలని’ కోరాడు. నారదుని కోరికపై త్రిమూర్తులు ముగ్గురూ కలిసి దత్తాత్రేయ రూపాన్ని పొందారు. దత్తాత్రేయుడు గొప్ప సన్యాసి. అతను పుట్టిన వారం బుధవారం. తిథి మార్గశిర శుక్ల చతుర్దశి. నక్షత్రం కృత్తిక. దత్తాత్రేయ దేవాలయాల్లో ఈనాడు కీర్తనలు సాగుతాయి. ఈ దేవత పట్ల మహారాష్ట్రులు అతిశయోక్తమైన భక్తి కలిగి ఉంటారు. దత్తాత్రయుడు ఉగ్ర దేవత అని గర్గ సంహిత అని చెబుతోంది. కాబట్టే దేశంలో దత్తాత్రేయ ఆలయాలు తక్కువగా ఉన్నాయి.

మార్గశిర బహుళ పాడ్యమి, డిసెంబరు 23, ఆదివారం

ఈనాడు నీలమత పురాణంలో నవ సంవత్సరోత్సవ మహోత్సవమని చెబుతోంది. ఈనాడు చంద్రార్ఘ్య దానం చేయాలని గదాధర పద్ధతిలో ఉంది. శీలావాప్తి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.

మార్గశిర బహుళ సప్తమి, డిసెంబరు 28, శుక్రవారం

ఈనాడు ఫల సప్తమీ వ్రతం, తమశ్చరణ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

మార్గశిర బహుళ అష్టమి, డిసెంబరు 29, శనివారం

ఈనాడే కాలభైరవాష్టమి అని కూడా అంటారు. భైరవ జయంతీ వ్రతం నిర్వహించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు అనఘాష్టమీ వ్రతం అనీ, కృష్ణాష్టమీ వ్రతమని, రుక్మిణ్యష్టమీ అని, కాలాష్టమీ అని పేర్కొన్నారు.

మార్గశిర బహుళ నవమి, డిసెంబరు 30, ఆదివారం

ఈనాడు రూప నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.

Review ఆధ్యాతిక ‘మార్గ’దర్శి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top