మాఘ సందేశం

ఫిబ్రవరి 1, శుక్రవారం, పుష్య బహుళ ద్వాదశి నుంచి – ఫిబ్రవరి 28, గురువారం మాఘ బహుళ నవమి వరకు

విలంబి నామ సంవత్సరం-పుష్యం-మాఘం- శిశిర రుతువు-ఉత్తరాయన

ఆంగ్లమానం ప్రకారం రెండవ మాసం ఫిబ్రవరి. ఇది తెలుగు పంచాంగం ప్రకారం పుష్య – మాఘ మాసాల కలయిక. పుష్య మాసంలోని కొన్ని రోజులు, మాఘ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. పుష్య మాసంలో వచ్చే పర్వాలలో మహాఫల ద్వాదశి, కాళీపూజ, బకులామావాస్య ముఖ్యమైనవి. ఫిబ్రవరి 4వ తేదీతో పుష్య మాసపు తిథులు ముగుస్తాయి. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మాఘ మాస తిథులు ప్రారంభమవుతాయి. మాఘ శుద్ధ పాడ్యమితో మొదలయ్యే ఈ మాసపు తిథులు త్యాగరాజ స్వామి ఆరాధన, లలితా వ్రతం, ఉమాపూజ, శ్రీపంచమి, మందార షష్ఠి, రథ సప్తమి (సూర్య జయంతి), భీష్మాష్టమి, మహానంద నవమి, జయైకాదశి, షట్‍తిలా ద్వాదశి, విశ్వకర్మ జయంతి, మాఘ పూర్ణిమ వంటి పుణ్య తిథులు, పర్వాలు, పండుగలతో ముగుస్తాయి. ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి 1, పుష్య బహుళ ద్వాదశి, శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మాసం ఫిబ్రవరి 28, మాఘ బహుళ నవమి, గురువారంతో ముగుస్తుంది.

ఆంగ్లమానం ప్రకారం వచ్చే ఫిబ్రవరి నెల.. తెలుగు పంచాంగం ప్రకారం పుష్య – మాఘ మాసాల కలయిక. యజ్ఞ యాగాదులకు శ్రేష్ఠమైనది మాఘ మాసం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అని కూడా అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఈ మాసం ‘మాఘం’ అయ్యింది. అలాగే, చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కనుక ఇది ‘మాఘం’ అయ్యింది. ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్త•తంగా కాచే మాసం. శూన్య మాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే ఇది కల్యాణకారక మాసం. పవిత్ర స్నానాలకు, భగవచ్ఛింతనకు నెలవైన ఉత్క•ష్టమాసం మాఘ మాసం.

వైశాఖ – కార్తీక మాసాల మాదిరిగా మాఘ స్నానాలు పవిత్రమైనవనే భావన ఉంది. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ చెబుతారు.

మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని అంటారు. మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం తెలియచెబుతోంది. మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు గృహ స్నానంతో ఆరు సంవత్సరాల యజ్ఞ స్నాన ఫలం లభిస్తుందని ప్రతీతి. బావినీటి స్నానం పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం శత గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలం ఇస్తాయని పురాణ వచనం.

మృకండ ముని, మనస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అప మృత్యువును తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే ఈ మాసం ఎన్నో పవిత్ర పర్వాలకు నెలవు. మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనద్యాగమం అని మత్స్య పురాణంలో ఉంది. ఇక, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు, వాటి విశేషాల గురించి తెలుసుకుందాం.

పుష్య బహుళ (కృష్ణ) ద్వాదశి, ఫిబ్రవరి 1, శుక్రవారం

చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో నీ రోజున.. సంప్రాప్తి ద్వాదశి, మహా ఫల ద్వాదశి, సురూప ద్వాదశి తదితర వ్రతాలను ఆచరించా లని వివరించారు.

పుష్య బహుళ (కృష్ణ) చతుర్దశి, ఫిబ్రవరి 3, ఆదివారం

నీలమత పురాణం అనే వ్రత గ్రంథంలో ఈనాడు యమతర్పణ పూజాదులు చేయాలని వివరించారు. భారతదేశం లోని కొన్ని ప్రాంతాల్లో ఈనాడు కాళీపూజ చేస్తారని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో ఉంది. ఇంకా ఈ తిథి విద్యాధీశ తీర్థానం పుణ్యదినమని అంటారు. మాస శివరాత్రి పర్వం.

పుష్య బహుళ (కృష్ణ) అమావాస్య, ఫిబ్రవరి 4, సోమవారం

గదాధర పద్ధతి అనే గ్రంథంలో ఈ తిథిని బకులామాస్యగా వర్ణించారు. తిథి తత్వం అనే మరో గ్రంథంలో అర్థోదయామావాస్యగా పేర్కొన్నారు. ఇది మహోదయ కాలం. ఈ పుణ్య కాలంలో అన్ని నదుల జలాలు గంగానది జలంతో సమానమైన పావిత్య్రాన్ని సంతరించు కుంటాయని అంటారు. ఈ తిథి నాడు సముద్ర స్నానం చేస్తే సమస్త దోషాలూ తొలగిపోతాయని శాస్త్ర వచనం. సముద్రంలో కలిసే ఏదైనా జీవనదిలో ఈనాడు స్నానం చేసి పితృ తర్పణం విడిస్తే వారి పితరులు ఇరవై ఒక్క తరముల వారు నరకలోక యాతనల నుంచి బయటపడి స్వర్గలోకానికి వెళ్తారని పురాణ వచనం.

గోదావరి తీర ప్రాంతాన బకులామావాస్యనే చొల్లంగి అమావాస్య అంటారు. చొల్లంగి అనేది గ్రామ నామం. తూర్పుగోదావరి జిల్లా కాకి నాడకు దక్షిణంగా యానాం రోడ్డు మీద మూడు మైళ్ల దూరంలో ఈ గ్రామం ఉంది. చొల్లంగి, వేళంగి, కోరంగి, తొమ్మంగి, తొండంగి, ఆండ్రంగి తదితర గ్రామ నామాలు సాదృశ్య నిబంధన కలవని అంటారు. ఇక, చొల్లంగి విషయానికి వస్తే, ఇది సముద్ర తీర గ్రామం. గోదావరి ఏడుపాయల్లోనూ ఒకటైన తుల్యభాగ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. జీవనది అయిన గోదావరి పాయల్లో ఒకటి సముద్రంలో కలిసే చోటు కావడం చేత ఇక్కడ స్నానం చేస్తే నదిలోనూ, సముద్రంలోనూ కూడా ఏకకాలంలో స్నానం చేసిన ఫలం కలిగి విశేష ఫలం సిద్ధిస్తుం దని ప్రతీతి. చొల్లంగిలో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది.

మాఘ శుద్ధ విదియ, ఫిబ్రవరి 6-7, బుధ/గురువారాలు

ఈ తిథి మంగళవారం ప్రవేశించి బుధవారం ఉదయం వరకు కొనసాగుతుంది. మాఘ శుద్ధ విదియ త్యాగరాజ స్వామి ఆరాధన తిథి. ఈనాడు త్యాగరాజ కృతులను ఆలయాల్లో ఆలపించడం ఆనవాయితీ. దక్షిణాది రాష్ట్రాలలో త్యాగరాజ స్వామి ఈనాడు విశేష ఆరాధనలు అందుకుంటారు.

మాఘ శుద్ధ తదియ, ఫిబ్రవరి 8, శుక్రవారం

ఈ తిథి నాడు గుడలవణ దానం చేయాలని అంటారు. ఇంకా ఈనాడు ఉమా పూజ, లలితా వ్రతం, హర తృతీయా వ్రతం, దేవ్యా ఆందో ళన వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.

మాఘ శుద్ధ చతుర్థి, ఫిబ్రవరి 9, శనివారం

ఈనాడు ఉమా పూజ చేయాలని నీల మత పురాణంలో ఉంది. చతుర్వర్గ చింతా మణిలో పేర్కొన్న ప్రకారం.. ఈనాడు వరద గౌరీపూజ, శాంతా చతుర్థి వ్రతం ఆచరించాలి. ఈనాడు గణేశ పూజ చేయాలని, ముఖ్యంగా డుంఠి గణపతిని పూజించాలని కూడా వివిధ గ్రంథాలలో ఉంది. మాఘ శుద్ధ చవితికి కుంద చతుర్థని కూడా పేరు. ఈనాడు శివపూజ చేయాలని, శివుడిని మొల్ల పువ్వులతో పూజించాలని అంటారు. అలాగే, ఈ తిథిని తిల చతుర్థి అని కూడా అంటారు. ఈనాడు తిల దానం చేస్తే కోటిరెట్లు ఫలం ఇస్తుందని అంటారు.

మాఘ శుద్ధ పంచమి, ఫిబ్రవరి 10, ఆదివారం

మాఘ శుద్ధ పంచమి తిథి శ్రీ పంచమి పర్వదినం. పంచాంగకర్తలు ఈనాటి వివరణలో శ్రీపంచమి, మదన పంచమి, వసంతోత్సవారంభం, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని రాస్తారు. వసంత పంచమి నామాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాల్సి ఉంటుంది. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించనికి గల కారణం ఏమో తెలియదు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత సన్నాహాంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. మాఘ మాస శుక్ల పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతోపాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి అనే పండితుడు చెప్పారు. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. దక్షిణాదిన వసంత పంచమికి అంతగా ప్రాముఖ్యత లేదు. రాజపుటానాలో దీని ప్రాభవం ఎక్కువ. ఈనాడు వారు రంగుబట్టలు ధరించి బుక్కా, వసంతం చల్లుకుంటారు.

పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిలిచి ఉంది.
వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి పూజిస్తారు. రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు.

వసంత పంచమి విద్యారంభ దినం. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది.

మాఘ శుద్ధ షష్ఠి, ఫిబ్రవరి 11, సోమవారం

ఈ తిథి నాటి పర్వానికి వరుణ షష్ఠి అని పేరు. విష్ణు స్వరూపుడైన వరుణ దేవుడిని ఈనాడు ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపంతో పూజించాలి.

మాఘ శుద్ధ సప్తమి, ఫిబ్రవరి 12, మంగళవారం

ఇది సూర్య జయంతి తిథి. మన్వాది దినంగానూ ప్రసిద్ధి. సూర్యునికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. వైవస్వతుడు ఏడవ మనువు. అతని మన్వంతరానికి రథ సప్తమి మొదటి తిథి. వైవస్వత మన్వాది దినం కనుక ఇది పితృ దేవతలకు ప్రియకరమైనది. ప్రస్తుతం జరుగుతూ ఉన్నది వైవస్వత మన్వంతరమే. మన్వాది నాడు చేయాల్సిన తర్పణాదులను ఈనాడు చేయాల్సి ఉంటుంది.

ఈ వైవస్వత మన్వాది తిథి భాగవతంలో సంవత్సరాదిగా చెప్పబడింది. దీనిని బట్టి ఈ తిథి ఒకప్పుడు ఈ దేశంలో ఉగాది పండుగగా ఉండేదని తెలుస్తోంది. తెలుగుదేశంలో కూడా రథసప్తమి ఒకప్పుడు ఉగాది పండుగ అయి ఉండేదనడానికి ఆనాడు ప్రారంభమయ్యే అనేక వ్రతాలు ఆధారంగా ఉంటున్నాయి. నిత్య శృంగారం, నిత్య అన్నదానం, ఫల తాంబూలం, దంపతి తాంబూలం, పుష్ప తాంబూలం, పొడపువ్వుల వ్రతం, చద్దికూటి మంగళ వారాలు, చద్దికూటి ఆదివారాలు, చద్దికూటి శుక్రవారాలు, మాఘగౌరి, కాటుకగౌరి, గండాల గౌరి, ఉదయ కుంకుమ, చిట్టి బొట్టు, సౌభాగ్య తదియ, కందవ్రతం, చిత్రగుప్తుని వ్రతం మొదలైన నోములన్నీ రథ సప్తమి నాడే పడతారు.

వ్రతాలన్నీ సాధారణంగా ఉగాది నాడే ప్రారంభం కావడం ఆచారం. కాబట్టి ఇన్ని వ్రతాల ప్రారంభ దినమైన రథ సప్తమి కూడా ఒకప్పుడు ఉగాది తిథేనని భావించవచ్చు.

చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈనాడు ఆచరించదగిన మంత్ర సహితమైన అనేక వ్రతాలను గురించి పేర్కొంది. ప్రాయకంగా అవన్నీ సూర్యునికి, తద్వారా ఆరోగ్యానికి సంబంధించినవి అయి ఉన్నాయి. ప్రాచీక కాలంలో ఇది మనకు ఉగాదిగా ఉండినా, ఉండకపోయినా మిక్కిలి ప్రాచీనమైన మన పండుగలలో రథ సప్తమి ఒకటి.

ప్రతి ఏటా మాఘ శుక్ల సప్తమి మనకు రథ సప్తమి పర్వం. ఈనాటి ఉద యాన్నే జిల్లేడు ఆకుల్లో రేగి పండ్లు పెట్టి అవి నెత్తి మీద పెట్టుకుని స్నానం చేస్తారు. కొంచెం పొద్దెక్కిన తరువాత పాలు పొంగిస్తారు. చిక్కుడు కాయల్ని రెంటిని వెదురుపుల్లతో చతురం అయ్యేలా గుచ్చి దాని మీద చిక్కుడు ఆకు పరిచి ఆ చిక్కుడు ఆకుల్లో పొంగలి పెట్టి సూర్యుడికి నివేదిస్తారు. చిక్కుడు కాయలతో చేసిన దానిని సూర్య రథం అంటారు.

జిల్లేడు ఆకుల్ని రథ సప్తమి నాడు నెత్తి మీద పెట్టుకోవడంలో ఆంతర్యం ఉంది. సూర్యుడు తన కాంతితో, వేడితో, విద్యుత్తుతో, ఆకర్షణ శక్తితో పదార్థాన్ని కాల్చివేస్తాడు. గ్రహాలను బట్టి జీవులకు కామ క్రోధాది గుణాలు కలుగుతుంటాయి. సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నప్పుడు ఇతర గ్రహాలు జీవులపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. సూర్యుడు ఉత్తరాయణ గతుడైనపుడు గ్రహాల పలుకుబడి మనుషులపై అంతగా ఉండదు. రథ సప్తమి సూర్యుని ఉత్తరగతిని సూచించే పండుగ. ఈ పర్వం సందర్భంలో జిల్లేడులను తలపై ఉంచుకుని స్నానం చేస్తూ వాటిని జారవిడవడం కామ క్రోధాది గుణాల విసర్జనకు సూచన అని అనుకోవచ్చు.
జిల్లేడు మంచి వీర్యవంతమైన మూలిక. ఈ ఆకులు పైన నునుపుగా, కింద నూగుగా ఉంటాయి. ఇది సంవత్సరంలోని అన్ని రోజుల్లో పుష్పి స్తుంది. జిల్లేడు ఆకులు తుంచినా కొమ్మలు విరిచినా తెల్లని పాలు కారతాయి. ఆ పాలల్లో ఉప్పు కలిపి పట్టిస్తే పంటిపోటు ఇట్టే పోతుంది. జిల్లేడు చిగుళ్ల రసం చెవిలో పోస్తే చెవిపోటు తగ్గుతుంది. జిల్లేడు ఆకులు వెచ్చబెట్టి ఆముదం రాసి పైన వేస్తే కడుపునొప్పి, ••డుపు ఉబ్బరం తగ్గుతాయి. ఎరుపు, నీలి వర్ణాలు కలిసిన జిల్లేడు పువ్వుల కంటే తెల్ల జిల్లేడు పూలు శ్రేష్ఠమైనవి. పక్షవాతం, కుష్ఠు, మూర్ఛ, విష జంతువుల కాట్లు మున్నగు దుష్ట సాధ్యాలైన రోగాలలో కూడా జిల్లేడు బాగా పని చేస్తుంది. జిల్లేడు బొగ్గు తీక్షణమైనది. దీనికి సంస్క•తంలో సూర్యాహ్వాయ, అర్క, రవి అనే పేర్లు న్నాయి. ఈ నామాలు దీనికి సూర్యు నితో గల సంబంధాన్ని తెలియ చేస్తు న్నాయి. రథ సప్తమి సూర్యునికి సంబం ధించిన పండుగ కాబట్టి ఆనాడు జిల్లేడు ఆకులకు ప్రాధాన్యం వచ్చి ఉండవచ్చు.

ఇక, రథ సప్తమి నాడు రేగుపండ్లు నెత్తి మీద పెట్టుకోవడంలో కూడా ఆంతర్యం ఉంది. భవిష్యోత్తర పురాణంలో రథ సప్తమి నాడు ఏడు జిల్లేడు ఆకులు కానీ, ఏడు రేగు ఆకులు కానీ, రెండు రకాల ఆకులు కానీ తలపై పెట్టుకుని స్నానం చేయాలని ఉంది. కానీ, ఆంధ్ర దేశంలో జిల్లేడు ఆకుల దొంతర మీద రేగుపండ్లు ఉంచుకుని స్నానం చేయడమే ఆచారం. శిశిర రుతువైన మాఘ ఫాల్గుణ మాసాల్లో రేగుపండ్లు విస్తారంగా దొరుకుతాయి. ‘ఫలశైశిర’ అని రేగుకు సంస్క•త నామంఉంది. రథ సప్తమికి ఇంచుమించు ఒక నెల ముందు వచ్చే సంక్రాంతి భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు రేగుపండ్లు తలపై పోసి దిగబారేలా చేస్తారు. అలా పోయడం వల్ల పీడ వదిలిపోతుందని మనవాళ్ల నమ్మకం. ఆనాడు రేగుపండ్ల మూలకంగా ఒక్క చిన్నపిల్లలకే జరిగే మంచి.. రథసప్తమి నాడు అందరికీ జరుగుతుందని అనుకోవాల్సి ఉంటుంది.

ఇక, చిక్కుడు కాయల విషయానికి వస్తే.. రథసప్తమి నాడు చేసే పూజలో చిక్కుడు కాయలతో పాటు ఆకులనూ వాడతారు. చిక్కుడు కార్తిక మాసం నాటికి కదురంత మొక్క ఉంటే మాఘ మాసం నాటికి నా మహిమ చూపుతానన్నట్టు విస్తరిస్తుందని పెద్దలు అంటారు. ప్రకృతిని ఆరాధించే మన పెద్దలు మాఘ మాసంలో బాగా పూచి, కాచే చిక్కుడును కూడా మాఘ మాసపు పర్వాలలో చేర్చి రథ సప్తమి నాటి ఆరాధన ద్రవ్యాలలో ఒకటిగా చేర్చారు. ఈనాడు చిక్కుడు కాయలతో, వెదురు పుల్లలతో రథాన్ని చేసి దాని మీద చిక్కుడు ఆకుల్ని పరిచి నైవేద్యానికి ఆధారపాత్రగా ఉపయోగించే ఆచారం ఉంది. నైవేద్యం పెట్టడానికి వేడి పొంగలి చిక్కుడు ఆకు మీదనే వేసి చల్లార్చడం చేత ఆకులో ఉండే పసరు, ఆర్ధ్రత పొంగలికి ఎక్కి ఒక విధమైన రసాయనిక మార్పు వస్తుంది. ఆ పదార్థ సేవనం ఆరోగ్య వర్థకం అవుతుంది.

రథ సప్తమిని పంచాంగకర్తలు సూర్య జయంతిగా కూడా పరిగణిస్తు న్నారు. దీనిని రాజపుటానాలో సౌర సప్తమి అనీ, వంగ దేశంలో భాస్కర సప్తమి అనీ, మరికొన్నిచోట్ల జయంతి సప్తమి అనీ, ఇంకొన్ని ప్రాంతాల్లో మహా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఈ నామాలను బట్టి మొత్తానికి ఇది సూర్య సంబంధ పర్వమనే విషయం రూఢి అవుతుంది. ఈశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడే సూర్యుడిని సృష్టించాడు. అందుచేత ఈ దినం సూర్య జయంతి దినం అయ్యింది.

సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు సూర్య జయంతికి పర్యాయపదాలు. అయితే, జయంతి సప్తమి, మహా సప్తమి అనే పేర్లు మాత్రం సూర్య సంబంధమైనవి కాకపోవచ్చనేది పెద్దల అభిప్రాయం. జయంతి సప్తమి అంటే విజయవంతమైన సప్తమి అని అర్థం. ఈనాడు ప్రారంభించిన పనులన్నీ జయప్రదంగా జరుగుతాయనే నమ్మకం ఉండటం వల్ల దీనికి జయంతి సప్తమి అనే పేరు వచ్చి ఉంటుంది. ఇక, మహా సప్తమి విషయానికి వస్తే- సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి కావడం వల్ల మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు వచ్చిందని అంటారు.

మాఘ శుద్ధ అష్టమి, ఫిబ్రవరి 13, బుధవారం

మాఘ శుక్ల అష్టమి భీష్మాష్టమి. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ దీని గురించి వివరణ ఉంది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్యపై పరుండి.. ఈనాటి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా చెప్పారు. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో రాశారు. భీష్మాష్టమి ఒక్క వంగ దేశంలోనే చేస్తారు. ఇంకా పంచాంగకర్తలు ఈనాటి వివరణలో నందినీ దేవిపూజ చేయాలని కూడా రాస్తారు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని అంటారు.

మాఘ శుద్ధ నవమి, ఫిబ్రవరి 14, గురువారం

మాఘ శుక్ల నవమి నాడు మహానంద నవమి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది. దీనినే మధ్వ నవమి అని కూడా వ్యవహరిస్తారు.

మాఘ శుద్ధ ఏకాదశి, ఫిబ్రవరి 16, శనివారం

ఈ ఏకాదశిని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథం జయైకాదశిగా పేర్కొంది. ఈనాడు భీమైకాదశీ వ్రతం ఆచరించాలని తిథి తత్వంలో రాశారు. ఇంద్రసభలో పుష్పవంతుడు అనే గంధర్వుడు నాట్యం చేస్తు న్నాడు. అతడు తన భార్యను చూస్తూ నాట్యం తప్పుగా చేశాడు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాల్సిందిగా శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు అనివార్యంగా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారు శాప విముక్తులయ్యారు. గోదావరి సంగమ క్షేత్రమైన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో గల శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ఈనాడు కల్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది.

మాఘ శుద్ధ ద్వాదశి/త్రయోదశి, ఫిబ్రవరి 17/18, ఆది/సోమవారాలు

మాఘ శుద్ధ ద్వాదశినే షట్‍ తిలా ద్వాదశి అని అంటారు. ఈనాడు ఇంకా వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని వివిధ వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ద్వాదశి గడియల్లోనే త్రయోదశి తిథి కూడా వస్తుంది. మాఘ శుక్ల త్రయోదశిని కల్పాదిగా పేర్కొంటారు. అయితే, ఇది విశ్వకర్మ జయంతి దినంగా కూడా ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని రకాలైన వృత్తులకు ఆద్యబ్రహ్మ. కాబట్టి విద్యారణ్య జయంతి, యాజ్ఞవల్క్య జయంతి దినాల వలే విశ్వకర్మ జయంతినీ వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసిచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు.

విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి చీఫ్‍ ఇంజనీర్‍ ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు.

విశ్వకర్మ జయంతి నాడు కార్మికులు తమ పనికి విశ్రాంతినిస్తారు. విందు వినోదాలతో ఆనందంగా గడుపుతారు.
మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం కనిపిస్తాయి. ఈయనది హంస వాహనం.

మాఘ శుద్ధ పూర్ణిమ, ఫిబ్రవరి 19, మంగళవారం

నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో లెక్కపెట్టలేనన్ని నక్షత్రాలు ఉంటాయి. ఆ మార్గాన్ని మన పెద్దలు ఇరవై ఏడు భాగాలుగా విభజించారు. ఆ భాగాలు ఇంచుమించుగా సమానంగా ఉంటాయి. ఒక్కో భాగానికి ఒక్కో పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువ కాంతివంతంగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ భాగానికి ఆ నక్షత్రంతో కూడిన పేరు పెట్టారు. అటువంటి ఇరవై ఏడు భాగాలలో మఘ ఒకటి. మఘతో పాటుగా మరో నాలుగు నక్షత్రాలు పల్లకి ఆకారంలో చెదిరి ఉంటాయి. మాసానికి ఒకసారి చంద్రుడు ఆ నక్షత్రంలో ప్రవేశిస్తుంటాడు. కానీ ఏడాదిలో ఒకసారి మాత్రమే అతను పదహారు కళలలో వెలుగొందుతూ మఘ నక్షత్రంలో ప్రవేశిస్తాడు. అదే మాఘ పూర్ణిమ. మన పంచాంగకర్తలు దీనిని మహా మాఘీ అన్నారు. ఈ రోజున తిల పాత్ర కంచుక కంబళాది దానాలు చేయాలని పెద్దలంటారు.

మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో చలిమెరి హెచ్చిన నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు. మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక, మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు. రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే. ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశిని అని అంటారు. అలాగే, మాఘ పూర్ణిమ సతీదేవి ప్రాదుర్భవించిన దినమని పురాణ కథ.

ఈశ్వరి (పార్వతి) ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు. అతని హస్త స్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారిగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.

మఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు. గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణంలో మహామాఘి ఉత్సవం మహా వైభవంగా జరుగుతుంది.

మాఘ పూర్ణిమ నాడు బ్రహ్మవైవర్త పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం.

మాఘ కృష్ణ పాడ్యమి, ఫిబ్రవరి 20, బుధవారం

ఈ తిథి నాడు సౌభాగ్యవ్రతం ఆచ రించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.

మాఘ మాసం- మహత్తు కలిగిన ఆదివారం
మాఘ ఫాల్గుణాలు కలిపి శిశిర రుతువు. ఈ కాలంలో వీచే శీతల గాలుల ప్రభావంతో శరీరం బిగిసినట్లుగా ఉంటుంది. అంటే శరీరంలో ఉండే ఊబ తగ్గిపోతుంది.

సంవత్సరంలోని పదో మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్య మాసం తెలుగు వారికి శూన్య మాసం. సంవత్సరంలోని నాలుగో మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండో మాసమూ అయిన ఆషాఢ మాసం కూడా తెలుగు వారికి శూన్య మాసం. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరావు.
ఒక సంవత్సరం చివరి పాదంలో వచ్చే పుష్య మాసానికి మరు సంవత్సరం రెండో పాదం ఆదిలో వచ్చే ఆషాఢ మాసానికి మధ్య ఐదు మాసాలు. అందుకే ఆ ఐదు మాసాలకు మాఘాది పంచకం అని పేరు. కార్యకరామత్తులకు అనుకూల మాసం మాఘం. వాన బాధ అంతగా ఉండదు. చలి కూడా తగ్గుతుంది. వస్త్ర సమస్య, గృహ సమస్య ఇబ్బందిని కలిగించేవిగా ఉండవు. మాఘ మాసంలో ధాన్యలక్ష్మి ఆరు బయల విరివిగా మసులుతుందని అంటారు. శాకలక్ష్మి విషయంలో సమృద్ధి సంతృప్తి కరం. అటువంటి అనుకూలమైన మాస పంచకానికి తొలి మాసం మాఘం. ఇంతగా వినుతికెక్కిన ఈ మాసం తెలుగుమానం ప్రకారం పదకొండో మాసం.
మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు మహత్తు కలిగినవి. ఈ రోజుల్లో సూర్యపూజ చేసిన వారికి ఆరోగ్యం కలుగుతుంది. ప్రాత: స్నానం అతి ముఖ్యం. సూర్యుడు మకరరాశి గతుడు ఎప్పుడు అవుతాడో అప్పటి నుంచి ప్రాత: స్నానం తప్పక చేయాలి. మాఘ మాసంలో నదులలో కానీ, చెరువుల్లోకానీ, మడుగుల్లోకానీ, కొలనులో కానీ, బావిలో కానీ తుదకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం అబ్బుతుంది.
అశక్తత చేత ఈ కాలంలో స్నానం చేయడానికి సమర్థత లేనివారు పొద్దు పొడిచిన జాము లోపల స్నానం చేయాలి.
నదీ జలాల్లో స్నానం మంచిది. మాఘ మాసంలో అరుణోదయాన దీపారాధనం, తిలహోమ తిలదానం, తిలభక్షణం, మాఘ స్నానం ముఖ్య మైనవని అంటారు.

Review మాఘ సందేశం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top