శివరాత్రి.. విష్ణుధాతి

2024- మార్చి 1, శుక్రవారం, మాఘ బహుళ షష్టి నుంచి 2024- మార్చి 31, ఆదివారం, ఫాల్గుణ బహుళ షష్టి వరకు..
శ్రీశోభకృతు నామ సంవత్సరం- మాఘం- ఫాల్గుణ మాసం -శిశిర రుతువు-ఉత్తరాయణం

ఆంగ్లమానం ప్రకారం మార్చి నెల సంవత్సరంలో మూడో నెల. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మాఘ-ఫాల్గుణ మాసాల తిథుల కలయిక. మాఘ మాసంలోని కొన్ని రోజులు, ఫాల్గుణ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. మార్చి 1, మాఘ బహుళ షష్ఠి నుంచి నుంచి మార్చి 10, మాఘ బహుళ అమావాస్య వరకు మాఘ మాస తిథులు, ఆపై మార్చి 11, ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి మార్చి 31, ఫాల్గుణ బహుళ షష్టి వరకు ఫాల్గుణ మాస తిథులు కొనసాగుతాయి. మాఘ-ఫాల్గుణ మాసాల కలయిక అయిన ఈ నెలలో విజయ ఏకాదశి, మహా శివరాత్రి, ఆమలిక ఏకాదశి, హోలీ వంటివి ప్రధాన పర్వాలు, పండుగలు.

మాఘ – ఫాల్గుణ మాసాలు శిశిర రుతువు కాలం. చెట్లన్నీ ఆకులు రాల్చే కాలం. చలి తీవ్రత తగ్గుతుంది. వానలు కూడా అంతగా ఉండవు. శిశిరం వసంతపు అందాలను అలంకరించుకుని ఉండే ఈ మాసం మహా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఫాల్గుణ మాసంతో శిశిర రుతువు ముగిసి వసంత రుతువు ఆరంభమవుతుంది. తెలుగు పంచాంగం ప్రకారం.. ఫాల్గుణ మాసం సంవత్సరంలో చివరిది (పన్నెండవది). ఉత్తర ఫల్గుణి నక్షత్రంతో కూడిన పున్నమి కలది కావడం వల్ల ఈ మాసానికి ఫాల్గుణమనే పేరు వచ్చింది. మాఘ మాసం మహా జ్ఞాన మాసమైతే.. ఫాల్గుణం మనసంతా ఆనందాన్ని నింపే ఆహ్లాదాన్ని మోసుకొచ్చే మాసం. ఇక, మాఘ మాసంలో వచ్చే మహా శివరాత్రి మహా విశిష్టమైనదనే విషయం తెలిసిందే. మార్చి 8న నిర్వహించే ఈ మహా పర్వం నాడు దేశమంతా హరహర మహాదేవ శంభో అనే మహాదేవుని నినాదం మారుమోగుతుంది. ఫాల్గుణ మాసంలో ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. అందుకే కాబోలు ఉసిరికాయతో ముడిపడి ఉండే ఒక ఏకాదశి తిథి (అమలక ఏకాదశి) ఫాల్గుణ మాసంలో వస్తుంది. అలాగే, నువ్వులు, మామిడిపూత (చూత కుసుమం) వంటివి ఈ నెలలో విరివిగా వినియోగిస్తారు. దశావతారాలలో ముఖ్యమైనదైన నృసింహస్వామి ద్వాదశిని ఈ మాసంలోనే నిర్వహిస్తారు. మత్స్య పురాణంలో పేర్కొన్న పక్రారం.. ఫాల్గుణ మాసం గృహ నిర్మాణానికి అత్యంత అనువైనది. ఈ నెలలో గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తే కనుక, పుత్ర లాభం కలుగుతుందని అంటారు. మాఘ, ఫాల్గుణ మాసాలలో వచ్చే ముఖ్యమైన పర్వాలు, పండుగలు, ముఖ్య తిథుల గురించి తెలుసుకుందాం.

మాఘ బహుళ షష్ఠి
మార్చి 1, శుక్రవారం

మాఘ బహుళ షష్ఠి తిథి మార్చి 1న ఆరంభమై 2వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ తిథి కుమారస్వామి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఈ తిథి నాడు సు్ర•హ్మణ్యేశ్వరుడికి తమిళనాట విశేష పూజలు జరుగుతాయి. ఇక, ఈ తిథి.. యశోద జయంతి తిథిగానూ ప్రసిద్ధి. యశోద శ్రీకృష్ణుడి తల్లి.

మాఘ బహుళ సప్తమి
మార్చి 3, ఆదివారం

మాఘ బహుళ సప్తమి నాడు విక్షుభార్క సప్తమి, సర్వాప్తి సప్తమి వంటి వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాశారు.

మాఘ బహుళ అష్టమి
మార్చి 4, సోమవారం

మాఘ బహుళ అష్టమి- సీతా అష్టమి. ఈనాడే కాలాష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. చతుర్వర్గ చింతామణి అనే మరో వ్రత గ్రంథంలో మాత్రం.. ఈనాడు మంగలా వ్రతం ఆచరించాలని ఉంది. ఇక, సీతాష్టమి అని పేర్కొనడం వల్ల ఇది సీతాదేవికి సంబంధించిన పర్వమై అయి ఉండొచ్చునని, ఇది దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరభారత దేశంలో ఈనాడు సీతాదేవికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

మాఘ బహుళ నవమి/దశమి
మార్చి 5, మంగళవారం

మాఘ బహుళ నవమి/దశమి.. ఈ రెండు తిథులూ మార్చి 5నే కూడి ఉన్నాయి. నవమి తిథి సాధారణంగా దుర్గారాధనకు ఉద్దేశించినది. ఇక, మార్చి 5 స్వామి దయానంద సరస్వతి జయంతి తిథి. ఈయన గుజరాత్‍కు చెందిన వర్తక కుటుంబంలో జన్మించారు. ఈయన ఆర్యసమాజ్‍ వ్యవస్థాపకుడు. అజ్ఞానం, దారిద్య్రం, అన్యాయాలను ఎదురించి పోరాడిన యోధుడు. హిందూ ధర్మస్థాపనకు నడుం బిగించి దేశమంతటా పర్యటించి హిందూ సమాజాన్ని సంఘటితం చేసిన రుషి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని కీలకపాత్రను పోషించారు. తదనంతర కాలంలో ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు ప్రేరణగా నిలిచారు. పద్నాలుగేళ్ల వయసులోనే భగవంతుడిని వెతకడానికంటూ ఇల్లు వదిలివెళ్లాడు. ఎందరెందరో యోగులను కలిసి ‘దయానంద’ అనే పేరొందారు. అనంతరం మథురలోని స్వామి విరజానంద సరస్వతి వద్ద వేదవేదాంగాలను ఔపోసన పట్టాడు. దయానంద సరస్వతి పేరుతో గురువు ఆదేశానుసారం దేశమంతటా పర్యటించి ధర్మస్థాపనకు యత్నించాడు.

మాఘ బహుళ ఏకాదశి
మార్చి 6, బుధవారం

మాఘ బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అనీ, విజయైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి నాడే శ్రీరాముడు రావణుడి లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని అంటారు. అందుకే ఈ తిథి నాడు వివిధ పనుల విజయవంతానికి శ్రీకారం చుట్టే ఆచారం తమిళనాడు తదితర దక్షిణాది రాష్ట్రాలలో ఆచరణలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొన్నారు.

మాఘ బహుళ ద్వాదశి
మార్చి 7, గురువారం

మాఘ బహుళ ద్వాదశి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో రాసిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి నాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలి. ఇదిలా ఉండగా, మూల, ఆషాఢ నక్షత్రాలతో కూడిన మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణం చెబుతోంది. అందులో వివరించిన ప్రకారం.. మాఘ బహుళ ద్వాదశి తిథికి ముందురోజు (మాఘ బహుళ ఏకాదశి)న ఉపవాసం ఉండి ద్వాదశి నాడు నువ్వులు దానం చేయాలి. మాఘ మాసంలో ఎక్కువగా నువ్వులతో ముడిపడిన పర్వాలు ఉంటాయి. ఈ తిథి కూడా అందులో భాగమై ఉండి ఉండొచ్చు.

మాఘ బహుళ త్రయోదశి
మార్చి 8, శుక్రవారం

మాఘ బహుళ త్రయోదశి తిథి నాడు మహా శివరాత్రి పర్వం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని ‘శివరాత్రి మహాత్మ్యం’ అనే గ్రంథం చెబుతోంది. ప్రతిరోజూ రాత్రి శివుడిని పదకొండు సార్లు తలుచుకుని నిద్రపోవాలని, అలా శివుడిని తలుస్తూ రాత్రులు నిద్రపోవడం వల్లన ప్రతిరాత్రి శివరాత్రి అవుతుందని అంటారు. అలా కనీసం ఏడాదికి ఒక్కసారైనా రోజంతా శివుడిని తలచుకుని ఆధ్యాత్మికతను ఆస్వాదించే అలాగే, మార్చి 8- అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలలో విజయం సాధించిన, ఆదర్శంగా, స్ఫూర్తిమంతంగా నిలుస్తున్న నారీమణుల విజయానికి ప్రతీకగా ఈ దినోత్సవాన్ని ఏటా మార్చి 8న నిర్వహిస్తున్నారు. అలాగే, మహిళలు అన్ని రంగాల్లో సాధికారత సాధించడం కూడా ఈ దినోత్సవం లక్ష్యం.

మాఘ బహుళ చతుర్దశి
మార్చి 9, శనివారం

మాఘ బహుళ చతుర్దశి తిథి నాడు రతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ తిథి నాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది. ఇంకా ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోద యానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మిన పూలతో పూజించాలి.

మాఘ బహుళ అమావాస్య
మార్చి 10, ఆదివారం

ఇది మాఘ మాసపు చివరి తిథి. మాఘ బహుళ అమావాస్య తిథి పితృకర్మలు నిర్వహించడానికి ఉద్ధిష్టమైనది. అలాగే, ఈ తిథి మన్వాది దినమని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది. ఈనాడు నవనీతధేను దానం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాము డిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజన్యావాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
మార్చి 11, సోమవారం

ఈనాటి నుంచి ఫాల్గుణ మాస తిథులు ఆరంభమవుతున్నాయి. తొలి తిథి- ఫాల్గుణ శుద్ధ పాడ్యమి. ఈనాడు చంద్ర దర్శనం. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నాడు భద్ర చతుష్టయ, గుణావాప్తి, పయో తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ విదియ/తదియ
మార్చి 12, మంగళవారం

ఫాల్గుణ శుద్ధ విదియ తిథి రామకృష్ణ పరమహంస జయంతి తిథి. ఈనాడు పశ్చిమబెంగాల్‍తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో గల రామకృష్ణ మఠాలలో, కాళీ మందిరాలలో విశేష ఆరాధనలు జరుగుతాయి. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా ప్రపంచానికి మొట్టమొదటిసారిగా చాటిన గురువు- రామకృష్ణ పరమహంస. ఈయన పుట్టినప్పటి పేరు గదాధర్‍ చటోపాధ్యాయ. పశ్చిమబెంగాల్‍ సాంస్క•తిక పునరుజ్జీవనంలో ఈయన పాత్ర, ప్రభావం చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద ఈయన శిష్యులలో ప్రథముడు. సృష్టిని ఏకత్వంతో చూడాలని, అన్ని జీవుల్లోనూ దైవత్వాన్ని దర్శించాలని, అన్ని మతాల సారాంశము ఒక్కటేనని, కామం, స్వార్థం, కోరికల నుంచి విడివడితేనే భగవంతుడిని దర్శించుకోగలమని, మానవ సేవే మాధవ సేవ అని, ఒక గమ్యానికి ఎన్నో దారులున్నట్టే.. భగవంతుని చేరడానికి అనేక మార్గాలున్నాయని.. రామకృష్ణ పరమహంస బోధించారు.
ఇక, విదియ తిథి ఘడియల్లోనే తదియ ఘడియలు కూడా కూడి ఉన్నాయి. ఫాల్గుణ శుద్ధ తదియ నాడు మధూక వ్రతం, సౌభాగ్య తృతీయా వ్రతం వంటివి చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో పేర్కొన్నారు.

ఫాల్గుణ శుద్ధ చవితి
మార్చి 13, బుధవారం

ఫాల్గుణ శుద్ధ చతుర్థి.. మంగళకరమైన తిథి. ఈనాడు అవిఘ్న గణపతి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు వినాయకుడిని డూండి గణపతిగా పూజించాలి. రాజవ్రతం చేయాలి. ఈ పూజా ఫలం వలన పోయిన అధికారం తిరిగి సిద్ధిస్తుందని అంటారు. అలాగే, సంతానాన్ని కోరే వారు ఈనాడు పుత్ర గణపతి వ్రతం ఆచరించాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఈరోజు నువ్వు బిళ్లలతో భోజనం, నువ్వుల దానం, హోమం పూజ, అగ్ని వ్రతం వంటివి కూడా చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈ తిథి నాడు చేసే నువ్వుల దానం కారణంగానే ఈ చతుర్థికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది.

ఫాల్గుణ శుద్ధ పంచమి
మార్చి 14, గురువారం

ఫాల్గుణ శుద్ధ పంచమి తిథి నాడు అనంత పంచమీ వ్రతం ఆచరిస్తారు. అనంత పద్మనాభస్వామిని ఈనాడు పూజించాలి. ఈ మేరకు చతుర్వర్గ చింతామణిలో వివరాలు ఉన్నాయి.

ఫాల్గుణ శుద్ధ షష్టి
మార్చి 15, శుక్రవారం

ఫాల్గుణ శుద్ధ షష్ఠి తిథి.. స్కంద షష్ఠి పర్వం. కుమారస్వామిని ఈనాడు విశేషంగా పూజిస్తారు.

ఫాల్గుణ శుద్ధ సప్తమి
మార్చి 16, శనివారం

ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్న ప్రకారం.. అర్క సంపుట సప్తమి, కామదా సప్తమి, త్రిగతి సప్తమీ, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలను ఆచరించాలి. ఇవన్నీ సూర్య
సంబంధమైన వ్రతాలు.
కాగా, ఈనాడు ఆంధప్రదేశ్‍ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి, అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గారి జయంతి. ఈయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడు. జాతిపిత మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం ఈయన జీవితాంతం పాటుబడ్డారు. ఈయన 1901, మార్చి 16న మద్రాసులో జన్మించారు. వీరి పూర్వీకులది నెల్లూరి జిల్లాలోని పడమటిపాలెం. 25 ఏళ్ల వయసులో భార్యను, బిడ్డను కోల్పోయిన ఈయన వైరాగ్యంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అనంతరం స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1952, అక్టోబర్‍ 19న బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఈయన నిరాహార దీక్ష ప్రారంభించారు. 1952, డిసెంబర్‍ 15న దీక్షలోనే పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారు. తదనంతర పరిణామాలతో అదే ఏడాది డిసెంబర్‍ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది.

ఫాల్గుణ శుద్ధ అష్టమి
మార్చి 17, ఆదివారం

ఫాల్గుణ శుద్ధ అష్టమి మాసిక దుర్గాష్టమి తిథి. మాసానికి రెండుసార్లు (శుద్ధ/బహుళ) వచ్చే అష్టమి నాడు సాధారణంగా దేవీ ఆరాధనకు ప్రతీతి. ఇంకా ఫాల్గుణ శుద్ధ అష్టమి తిథి నాడు లలిత కాంతీదేవి వ్రతం చేస్తారని తిథి తత్వం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు దుర్గాష్టమి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే మరో గ్రంథంలో పేర్కొన్నారు.

ఫాల్గుణ శుద్ధ నవమి
మార్చి 18, సోమవారం

సాధారణంగా అష్టమి తిథి మాదిరిగానే నవమి తిథి కూడా దుర్గాదేవి పూజకు, ఆరాధనకు ఉద్ధిష్టమైనది. ఫాల్గుణ శుద్ధ నవమి నాడు ఆనంద నవమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు దుర్గాపూజ చేయాలని పలు వ్రత గ్రంథాలలో ఉంది.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
మార్చి 20, బుధవారం

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అనేక విధాలుగా ప్రసిద్ధి. వీటిలో మొదట చెప్పుకోవాల్సింది ‘అమలిక ఏకాదశి’ గురించి.
అమలికం అంటే ఉసిరికాయ. అంటే ఇది ఉసిరికాయతో ముడిపడిన ఏకాదశి. అందుకే ఇది అమలైక్యాదశిగా వినుతికెక్కింది. కార్తీక మాసంలో మాదిరిగానే ఫాల్గుణ మాసంలో మళ్లీ ఉసిరిక ఉపయోగానికి రెండు రోజులను మన పెద్దలు ప్రత్యేకించారు. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి వివరణలో ‘ఆమలకే వృక్షే జనార్థనః’ అని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆమలక వృక్షం జనార్ధన స్వరూపమనీ, దాని కింద ఆమలైకాదశి వ్రతాన్ని నిర్వహించాలని శాస్త్ర వచనం. ఫాల్గుణ శుక్ల ద్వాదశి నాడు ఆమలకి వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. చైత్ర మాసంలో ఆమలక ఫలాలు వైద్యానికి మంచివని అనుభవజ్ఞుల మాట. దీనిని బట్టి కార్తీక మాసం నుంచి చైత్ర మాసం వరకు గల ఆరు మాసాల్లోనూ ఉసిరిని ఏదో విధంగా వాడాలని మన పెద్దలు నియమం విధించారు. అధిక మాసం లేని సాధారణ సంవత్సరాల్లో మనకు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి. ఆ ఇరవై నాలుగు ఏకాదశులకు ఇరవై నాలుగు నామాలు ఉన్నాయి. విష్ణువు చర్యలను బట్టి శయనైకాదశి, పరివర్తనైకాదశి, ప్రబోధిన్యేకాదశి, వ్రత నియమాన్ని బట్టి నిర్జలైకాదశి, ఫలైకాదశి, వీర పూజనాన్ని బట్టి భీష్మైకాదశి, ఇంద్రైకాదశి మొదలైనవి ఏర్పడ్డాయి. కానీ, అన్నింటిలోకి ఒక పండుతో సంబంధించిన ఏకాదశి ఆమలైకాదశి ఒక్కటే. ఏకాదశి వంటి గొప్ప తిథిలో ఉసిరిని జత చేయడం వల్లనే అమలికలో ఏదో విశిష్టత ఉందని భావించవచ్చు. మన తెలుగు సంప్రదాయంలో కొన్ని పండుగలు వచ్చే నెలలో కొన్ని ఫలాలు పూజనీయం, వరణీయమై భాసిల్లుతున్నాయి. వాటిని ఆయా తిథుల్లో భుజించాలని మన పెద్దలు ఆరోగ్యరీత్యా నియమం విధించారు. ఆయా తిథి నియమాలను అనుసరించి ఆహారాన్ని, ఫలాలను తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం చేకూరుతుంది. ఈ క్రమంలోనే చైత్ర మాసంలో అశోక కలికా ప్రాశనం, ఫాల్గుణ మాసంలో ఆమ్రపుష్ప భక్షణం, కార్తీకంలో బిల్వపత్ర పూజ, ఆశ్వయుజంలో శమీ వృక్ష పూజ వంటి వాటి వల్ల మనుషులకు ఆరోగ్యం చేకూరుతుంది. షడ్రసాల్లో ఉప్పు తప్ప మిగతా అన్ని రసాలు ఉసిరికలో ఉన్నాయి అని మన వైద్య గ్రంథాలన్నీ ఎలుగెత్తి చెబుతున్నాయి. ఇది మహత్తరమైన ఔషధీ గుణాలు గల ఫలం. అమృతాఫలం అనే గ్రంథంలో నలభై పేజీల్లో కేవలం ఉసిరిక ఔషధీ గుణాల గురించి ఉందంటే దీని ప్రశస్తిని అర్థం చేసుకోవచ్చు. అలాగే, ఫలజాతులు అనే గ్రంథంలోని యాభై పేజీల్లో దీని సర్వాంగాల గురించి వర్ణనలు ఉన్నాయి. వైద్యం, పారిశ్రామికంగా దీని ఉపయోగాల గురించి, వాగ్భటంలో పుంజీల కొద్దీ శ్లోకాలలో దీని రసాయనిక, కాయకల్పాది చికిత్సోపయోగాలను విపులీకరించారు. తెల్ల ప్లేగు అనే క్షయ వ్యాధి రాకుండా మానవుని రోగనిరోధక శక్తిని పెంపొందించే మహా ఔషధి ఉసిరిక. ఇంత ప్రాధాన్యం కలది కాబట్టే మన వ్రత నియమాల్లో దానికో స్థానాన్ని కల్పించి, దాని కోసం ఏకంగా ఏకాదశినే ప్రత్యేకించిన మన పెద్దల లోకహితం ఎంత విశిష్టమైనదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఫాల్గుణంలో ఉసిరికను ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు.
మన వంటకాల్లో ఏదో విధంగా ఉసిరి వాడాలనేది ఈ పర్వం ఉద్దేశం. బహుశా ఉసురు (ప్రాణం) నిలిపేది కాబట్టి తెలుగులో ఇది ఉసురుకాయ.. కాల క్రమంలో ఉసిరి కాయ అనే పేరు స్థిరపడి ఉంటుంది. అరవం, కన్నడం, మలయాళంలో దీనిని నెల్లికాయ అని పిలుస్తారు. సంస్క•తంలో ఉసిరికాయకు ఐదారు పేర్లు వరకు ఉన్నాయి. ఆమలకం (గుణమును ధరించునది), ధాత్రి (దాది వంటిది), వయస్థ (వయస్సున నిలుపునది), ఫలరవ (సారవంతమైనది), అమృత (అమృతము వంటిది), శీతఫలి ( శీతవీర్యము కలది) అనే అర్థాలు కలిగిన పేర్లు ఉసిరికాయకు ఉన్నాయి.
అలాగే, ఫాల్గుణ శుద్ధ ఏకాదశి మరో విధంగా కూడా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు చిత్రరథుడు పరశురాముడిని పూజించాడని పురాణగాథ. దీనినే ఆంధప్రదేశ్‍లోని గోదావరి జిల్లాల వారు ‘కోరుకొండ ఏకాదశి’ అనీ అంటారు. కోరుకొండలో నరసింహస్వామి కోవెలలో ఈనాడు గొప్ప తిరునాళ్లు జరుగుతాయి. కాకతీయుల అనంతరం ప్రసిద్ధికెక్కిన కాపయ నాయకుని కాలం నుంచి ప్రసిద్ధమైన క్షేత్రం ఇది. ఈనాడు వేలకొద్దీ జనం అక్కడికి వస్తారు. గోదావరి తీరంలో ఈ తీర్థకాలాన్ని పురస్కరించుకుని ‘కోరుకొండ ఏకాదశికి కోడి గుడ్డులంత’ అనే సామెత ఒకటి ఉంది. ఈ సామెత మామిడి కాయలకు సంబంధించి వాడతారు. మకర సంక్రాంతికి మంచి పూత మీద ఉండిన మామిడికాయలు ఇప్పటికి కోడిగుడ్డు పరిమాణానికి ఎదుగుతాయి. ఇది చెప్పడానికే పై సామెతను గోదావరి తీర ప్రాంతవాసులు తమ సంభాషణల్లో ప్రయోగిస్తుంటారు.

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి
మార్చి 21, గురువారం

ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరించాలని చెబుతారు. ఈ ద్వాదశిని నృసింహ ద్వాదశిగానూ వ్యవహరిస్తారు. కాగా, పుష్యమితో కూడిన ద్వాదశి గోవింద ద్వాదశి అనీ, ఆనాడు గంగా స్నానం మహా పాతక నాశనంగా ఉంటుందని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. ఈనాడు మనోరథద్వాదశీ, సుకృత ద్వాదశీ, సుగతి ద్వాదశీ, విజయా ద్వాదశీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు. ఈనాడు ఆమలకీ వ్రతం చేస్తారని కూడా పేర్కొన్నారు. ఇది కూడా ఉసిరికాయ సంబంధమైన పర్వమే కావడం విశేషం. ఇంకా, ఈ తిథి నాడు పుండరీకాక్ష పూజలు కూడా చేసే ఆచారం ఉంది.

ఫాల్గుణ శుద్ధ త్రయోదశి
మార్చి 22/23, శుక్ర/శనివారాలు

ఫాల్గుణ శుద్ధ త్రయోదశి.. హోలీ పర్వానికి రెండ్రోజుల ముందు వచ్చే పర్వం. ఈనాడు కామదహనం నిర్వహిస్తారు. వీధుల కూడళ్లలో మంటలు వేస్తారు.

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి
మార్చి 24, ఆదివారం

ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు కూడా హోలికా దహన్‍ నిర్వహిస్తారు. దీనిని ‘చోటీ హోళీ’గా వ్యవహరిస్తారు. ఇంకా ఈనాడు లలితా కాంత్యాఖ్యదేవీ వ్రతం ఆచరించాలని తిథి తత్త్వం అనే గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు మహేశ్వర వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథం చెబుతోంది.

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ
మార్చి 25, సోమవారం

ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ వసంత పూర్ణిమ తిథి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిని మహా ఫాల్గుణీ అనీ వ్యవహరిస్తారు. దీనినే హోలికా పూర్ణిమా అనీ అంటారు. కొన్ని వ్రత గ్రంథాలు దీనిని డోలా పూర్ణిమగా వర్ణించాయి. ఈ పూర్ణిమ నాడు దక్షిణాది ప్రాంతాలలో కామ దహనం చేయడం ఆచారం. అందుకే ఈ పూర్ణిమను కాముని పున్నమి అంటారు. కాముడు ఈ రోజున దహనమయ్యాడని పురాణగాథ. అందుకే పంచాంగకర్తలు ఈ తిథిని కామదహన దినమని రాస్తారు. దక్షిణ భారతంలో కామదేవుని దహన దినంగానే కానీ, ఇది ఉత్తరాదిలో మాదిరిగా హోలికా దహన దినంగా అంత ప్రఖ్యాతం కాదు.
హోలిక అనే రాక్షసిని దగ్ధం చేసిన దానికి గుర్తుగా కామదహనం పేరిట మంటలు వేసే ఆచారం ఏర్పడిందని అంటారు. హోలిక అనే రాక్షసి పేరును బట్టే దీనిని హోలీ పర్వదినం అనే పేరు స్థిరపడింది. ఉత్తరాదిలో ఈ పర్వాన్ని చోటీ హోలీగా వ్యవహరిస్తారు.
హోలిక అనే రాక్షసి దహనమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని హేమాద్రికాండం, భవిష్యత్తు పురాణం, ధర్మసింధు, నిర్ణయసింధు అనే గ్రంథాలు చెబుతున్నాయి. వీటి ప్రకారం.. హిరణ్యకశిపుడి సోదరి హోలిక. కుమారుడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి పరాయణుడు కావడంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు అతడిని ఎలాగైనా సరే వధించాలని అనేక ప్రయత్నాలు చేస్తాడు. విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ప్రహ్లాదుడు అటువంటి ప్రయత్నాలన్నిటినీ అధిగమించి క్షేమంగా ఉంటాడు. చివరకు హిరణ్యకశిపుడు ఒక ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల అతడి సోదరి హోలికకు ఓ పై వస్త్రం లభిస్తుంది. ఎంతటి భయంకరమైన అగ్ని అయినా ఆ వస్త్రం ధరించిన వారిని ఏమీ చేయదు. హోలికను ఆ వస్త్రాన్ని ధరించాలని చెప్పి, ప్రహ్లాదుడిని ఆమె ఒడిలో కూర్చోబెట్టి, తన భటుల చేత నిప్పు అంటింపచేస్తాడు హిరణ్యకశిపుడు. విష్ణుమాయ చేత హోలిక కప్పుకున్న ఆ మాయా వస్త్రం గాలికి ఎగిరిపోయి, చివరికి ఆ మంటల్లో ఆమే దగ్ధమవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడతాడు. ఈ విధంగా హోలిక దగ్ధమైన వృత్తాంతానికి ప్రతీకగా హోలీ పండుగ వ్యాప్తిలోకి వచ్చిందని చెబుతారు.
దైవభక్తి ముందు ఎటువంటి మాయోపాయాలు పనిచేయవని, తన భక్తులను కష్టాల నుంచి కాపాడి, వారికి అన్నివేళలా భగవంతుడు రక్షగా ఉంటాడనే సందేశాన్ని ఈ వృత్తాంతం తెలియ చెబుతుంది.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే లక్ష్మీ జననమని అంటారు. అందుకే ఈ తిథిని లక్ష్మీ జయంతి తిథిగానూ వ్యవహరిస్తారు. ఈ తిథి నాడు నైమిశారణ్యంలో గడిపితే విశేష ఫలితాలు కలుగుతాయని గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
భగవద్గీత, కృష్ణతత్వాన్ని విస్త•తంగా ప్రచారం చేసిన చైతన్య మహాప్రభు వారి జయంతి తిథి కూడా ఈనాడే.

మధుర మీనాక్షి దేవి తపస్సు చేసి సుందరేశ్వరస్వామిని ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే వివాహం చేసుకుందని అంటారు. అందుకే దక్షిణాది రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో ఈ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది.

ఫాల్గుణ బహుళ పాడ్యమి
మార్చి 26, మంగళవారం

ఫాల్గుణ బహుళ పాడ్యమినే హోలీ పర్వదినంగా కొన్నిచోట్ల భావించి ఆచరిస్తారు. ఫాల్గుణ పూర్ణిమ తరువాత దినమే కొన్ని ప్రాంతాల వారికి కొత్త సంవత్సర ఆరంభ దినం కూడా. హోలీ వసంతాగమన సూచిక పర్వం. వసంతాన్ని ఆహ్వానిస్తూ పిల్లా, పెద్దా అందరూ ఆనందోత్సాహాలతో రంగునీళ్లు, పూలు ఒకరిపై ఒకరు చల్లుకుని ఆనందిస్తారు. ఇలా ఒకరినొకరు రంగునీళ్లతో తడుపుకోవడం అనే పక్రియ దాదాపు రోజంతా సాగుతుంది. ఎర్ర రంగు నీళ్లను వసంతాన్ని చల్లుకోవడాన్ని కొన్ని ప్రాంతాల్లో రంగ్‍లీల అంటారు. పూర్ణిమ నాడు మంటలు వేసే తతంగం పూర్తి కాగానే, ఈ రంగ్‍లీల ఆరంభమవుతుంది.
హోలీ పర్వం అతి ప్రాచీనమైనదే కాక.. ఆధునికమైనది కూడా. అంతేకాదు, వివిధ దేశాల్లో కూడా ఈ వసంత వేడుక ఆచరణలో ఉంది. హోలీ వసంత రుతు సంబంధ ప•ర్వం. ఈ సమయానికి రాగి రంగుతో చిగుళ్లు ఆకు పచ్చరంగుతో పత్రాలు పలు తెరగుల రంగులతో పువ్వులు పొటమరిస్తాయి. తొలకరి పంటలన్నీ ఇంటికి చేరతాయి. పునాస పంటలన్నీ పంట ముఖాల పసిమితో ఉంటాయి. ఈ రంగుల వాతావరణమే హోలీలో వాడే రంగులకు ప్రతీక అని అంటారు.
ఇంకా ఫాల్గుణ బహుళ పాడ్యమి తిథి నాడు ధూలి వందనం అనే పండుగ చేస్తారని కొందరు చెబుతారు. మొత్తానికి ఇది వసంతారంభోత్సవ సమయం. అయితే, మన తెలుగు క్యాలెండర్ల ప్రకారం.. పౌర్ణమి నాడే హోలీ పర్వమని పేర్కొన్నారు.

ఫాల్గుణ బహుళ విదియ
మార్చి 27, బుధవారం

ఫాల్గుణ బహుళ విదియ కూడా కామ మహోత్సవంగానే వ్యవహారికంలో ఉంది. అయితే, ఇది ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించదు. ఇక్కడ ‘కామ’ ప్రస్తావనను బట్టి ఇది కూడా హోలీ సంబంధ పర్వంగానే భావించాలి. హోలీ మర్నాడే వచ్చిన తిథి కాబట్టి, ఇది దానికి అనుబంధంగా వచ్చే తిథిపర్వమని భావించవచ్చు.

ఫాల్గుణ బహుళ తదియ
మార్చి 28, గురువారం

ఫాల్గుణ బహుళ తదియ తిథి కల్పాది దినం. ఈనాడు ఛత్రపతి శివాజీ జయంతి దినం.

ఫాల్గుణ బహుళ చతుర్థి
మార్చి 29, శుక్రవారం

ఫాల్గుణ బహుళ చతుర్థి వినాయక పూజకు ఉద్ధిష్టమైన తిథి. దీనినే సంకష్ట హర చతుర్థి అని కూడా అంటారు. ఇంకా ఈ తిథి వ్యాసరాజ స్మ•తి దినంగా కూడా ప్రసిద్ధి. వ్యాసరాయ స్వామి శ్రీకృష్ణదేవరాయలకు సమకాలికుడు. రాజ వ్యవహారాలు, యుద్ధ విషయాలలో రాయల వారు ఈయన సలహాలు సూచనలు పొందే వారని ప్రతీతి. రాయచూరు యుద్ధంలో రాయలు విజయానికి వ్యాసరాయల వారి వ్యూహమే కారణమని అంటారు. చతుర్థి తిథి ఘడియల్లోనే పంచమి తిథి కూడా ప్రవేశిస్తోంది. ఈ కారణంగా ఇదేరోజు రంగ పంచమి వ్రతాలను ఆచరించాలి.

ఫాల్గుణ బహుళ షష్టి
మార్చి 31, శనివారం

ఫాల్గుణ బహుళ షష్ఠి దేవసేనకు అధిపతి అయిన కుమారస్వామిని పూజించడానికి అనువైన తిథి. ప్రత్యేకించి తమిళనాట షష్ఠి నాడు ఈయనకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కుమారస్వామి.. వివిధ ప్రాంతాల్లో స్కందుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, షణ్ముఖుడు అనే పేర్లతోనూ ప్రసిద్ధమై

Review శివరాత్రి.. విష్ణుధాతి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top