ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో పదో మాసం- అక్టోబరు. తెలుగు పంచాంగం ప్రకారం ఇది ఆశ్వయుజ – కార్తీక మాసాల కలయిక. ఈ మాసంలో అక్టోబరు 21, మంగళవారం వరకు ఆశ్వయుజ మాస తిథులు కొనసాగుతాయి. ఆ తదుపరి అక్టోబరు 22, బుధవారం నుంచి కార్తీక మాస తిథులు ఆరంభమవుతాయి. ఆశ్వయుజ, కార్తీక మాసాల కలయిక అయిన ఈ అక్టోబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో మహర్నవమి, దసరా, అట్లతద్ది, ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, కేదార వ్రతం, భగినీ హస్త భోజనం, నాగుల చవితి, నాగుల పంచమి వంటి ప్రధాన పర్వాలు ఉన్నాయి. ఇక, కార్తీక మాసారంభంతో కార్తీక స్నానాలు, దీపోత్సవాలతో ఈ నెలకు శోభ చేకూరనుంది.
2025- అక్టోబరు 1, బుధవారం, ఆశ్వయుజ శుద్ధ నవమి నుంచి
2025- అక్టోబరు 31, శుక్రవారం, కార్తీక శుద్ధ దశమి వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం – ఆశ్వయుజం/కార్తీకం – శరద్రుతువు – దక్షిణాయణం
ఆశ్వయుజ కార్తీక మాసాలు కలిపి శీతాకాలపు సంధి కాలం. ఆశ్వయుజం ముగియడంతోనే వానలకు తెరపడుతుంది. కార్తీక మాసం ప్రవేశిస్తూనే శీతల గాలులు పలకరిస్తాయి. కార్తీకం శీతాకాలానికి ఆరంభ మాసం. చంద్రుడు కృత్తిక నక్షత్రంలో ఉండగా వచ్చిన మాసం కాబట్టి ఇది కార్తీకం అయింది. ఈ కాలంలో చలి వణికిస్తుంది. మనిషి శారీరక ఆరోగ్యం తడి-పొడి వాతావరణంతో అంతా నజ్జు నజ్జుగా ఉంటుంది. అందుకే ఈ మాసం పొడవునా మనం ఆచరించాల్సిన పద్ధతులకు సంబంధించి మన పెద్దలు వివిధ వ్రతాలు, పూజా నియమాలను ఏర్పరిచారు. ఇవి ఆరోగ్యదాయకమైనవి. వణికించే చలిలో ఇక్కలాక్కుపోయే శరీరానికి ఉత్తేజాన్ని, వేడిని కలిగించే విధంగా ఆయా వ్రత నియమాలు విధించారు. వాటిని ఆచరించడం ద్వారా, ఆ వ్రత, పూజా విధుల్లో భాగంగా భగవంతునికి వివిధ నైవేద్యాలు నివేదించి.. తిరిగి వాటిని మహా ప్రసాదంగా స్వీకరించడం ద్వారా మనిషికి శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. ఇక కార్తీక విశేషాల్లోకి వెళ్తే.. దీనికే కౌముదీ మాసం అని కూడా పేరు. కౌముది అంటే వెన్నెల. పిండారబోసినట్టు ఈ నెలంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి. ఇక, దీపారాధనలతో కార్తీక మాసం దేదీప్యమానం అవుతుంది. భువిలో జ్యోతులుగా వెలిగే ఈ దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను కలిగిస్తాయి. మత్స్య పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఇంటి నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ముఖ్యంగా ఈ మాసంలో ప్రాత:కాల స్నానాలు విధాయక కృత్యం. అలాగే ఉసిరికను దైవికంగా కొలిచి, విశిష్ట ఆహారంగా తీసుకోవాల్సిన మాసం కూడా కార్తీక మాసమే. పూర్తిగా ఈ నెలంతా శివ, వైష్ణవారాధనలకు అనువైనది. శివ-కేశవులిద్దరికీ ప్రీతికరమైనది. ఈ మాసంలో కూరలేమీ తినకుండా ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. కార్తీకంలో నదీ స్నానాలు చాలా ముఖ్యమైనవి. తెల్లవారుజామునే సముద్ర, నదీ స్నానాలు ఆచరించాలి. ఇలా చేయడం ద్వారా ఆ నీటిలోని లవణాలు, పోషకాలు ఒంటికి భేషుగ్గా పడతాయని, తద్వారా శీతాకాలానికి అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలు మారతాయని అంటారు. ఈ మాసంలో వచ్చే ఆయా ముఖ్య తిథులు, ఆ తిథి కాలాల్లో వచ్చే వివిధ పర్వాలు, వ్రతాలు, పూజా నియమాల విశేషాలు..
ఆశ్వయుజ శుద్ధ నవమి
అక్టోబరు 1, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ నవిమి మహర్నవమి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈనాడు దుర్గాదేవిని మహిషాసురమర్దనిదేవిగా, సిద్ధిధాత్రిదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈనాటి అమ్మవారి ప్రధాన అలంకరణ- మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు ఈనాడే సంహరించారని అంటారు. ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. వివిధ కులవృత్తుల వారు తమ పనిముట్లను, విద్యార్థులు తమ విద్యాసామగ్రిని, వివిధ బతుకుదెరువును, జీవనోపాధులకు ఆధారమైన వస్తువులను ఈనాడు విశేషంగా పూజిస్తారు.ఇంకా ఈనాడు మాతృ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు.
ఈనాడు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది.
ఆశ్వయుజ శుద్ధ దశమి
అక్టోబరు 2, గురువారం
ఆశ్వయుజ శుద్ధ దశమి.. విజయదశమి/దసరా పర్వదిన తిథి. ఈనాడు జమ్మిచెట్టు వద్ద పూజలు చేస్తారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైసూరులో దసరా, ఆయుధపూజ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్లోనూ దసరా శరన్నవరాత్రులను గొప్ప ఉత్సవ సంరంభంతో నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న దుర్గాదేవిని ఈనాడు నిమజ్జనం చేస్తారు. అలాగే, విజయవాడ కనకదుర్గమ్మకు ఈనాడు వైభవంగా తెప్పోత్సవం నిర్వహిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో దసరా ఏనుగుల సంబరం జరుగుతుంది. తిరుమల శ్రీవారి చక్రస్నానం ఈనాడే. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు తిరుచానూరు పద్మావతి తాయార్ల అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు దశమి నాటితో ముగుస్తాయి. ఇక, విజయదశమి పర్వదిన విశేషాల్లోకి వెళ్తే.. ప్రాచీన కాలం నుంచి విజయదశమి (దసరా) ఆచరణలో ఉంది. ఈనాడు శమీ పూజలు విశేషంగా ఆచరిస్తారు. ఈ తిథి నాడు శక్తిపూజ మహోత్క•ష్టమైనది. రావణుడిపై రాముడి విజయాన్ని ఉత్సవంగా జరుపుకునేదీ, సర్వ విధాలా విజయాలకు కేంద్రంగా పేరొందినది విజయదశమి. చెడుపై మంచి గెలిచిన తీరును వర్ణించే, ఉత్సవ హేలగా జరుపుకునే దుర్గాపూజల ముగింపులో దేవి నిమజ్జనం జరుగుతుంది. దసరా నాడు సాయంత్రం శమీపూజ చేయడం ఆచారం. సాయంకాలం ఈ వృక్ష దర్శనం చేసుకుంటారు. దసరా అనేది తొమ్మిది రోజుల- తొమ్మిది రాత్రుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు మొదలు నవమి వరకు ఈ పండుగ రోజులు. వీటినే శారద నవరాత్రులనీ, శారదీయ నవరాత్రులనీ అంటారు. ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలలో దుర్గాదేవి పూజలందుకుంటుంది. ప్రాంతాలు, ఆచారాలను బట్టి ఆయా రోజులలో అవతారాలు మారుతుంటాయి. సాధారణంగా మొదటి రోజు శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణిగా, మూడో రోజు చంద్రఘంటగా, నాలుగో రోజు కూష్మాండగా, ఐదవ రోజు స్కంధమాతగా, ఆరో రోజు కాత్యాయనిగా, ఏడో రోజు కాళరాత్రిగా, ఎనిమిదో రోజున మహాగౌరిగా, తొమ్మిదో రోజున సిద్ధిధాత్రిగా దేవి ప్రజల పూజలు అందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు రూపానికి తగిన అలంకరణలో ఆయుధాలు ధరించి దేవి నవదుర్గలుగా భాసిస్తూ శరన్నవరాత్రులలో దివ్యతేజంతో భక్తులను కరుణిస్తుంది. భగవతి, పార్వతి ఇత్యాధి నామాలతో వ్యవహరింపబడే
దేవతా పూజకు ఈ దినాలు ప్రత్యేక పవిత్రతను ఆపాదిస్తున్నాయి.
గదాధర పద్ధతి, ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథాలలో ఈ తిథిని అపరాజితా దశమిగా పేర్కొన్నారు. ఇది యుద్ధ దేవత ఆరాధన దినం. అపరాజితా దేవి విజయానికి అధి దేవత. దేవీ పూజ రాజులకు మరీ ముఖ్యమైన పర్వం. దసరా నాడు శమీపూజ, దేవీ విసర్జనం, రాజ్ఞస్సీమోల్లంఘనం, అశక్తౌస్వాయుధాది నిర్గమనం, దశరథ లలితా వ్రతం, కూష్మాండ దశమీ వ్రతం మున్నగునవి కూడా ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆదిమ శక్తి, ఆదిమ కుటుంబిని అయిన పరమేశ్వరి దుర్గ, లక్ష్మి, సరస్వతి అనే పర్యాయపదాలతో ప్రజలచే పూజలను పొందే
శుభవాసరాలివి.
లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి దుర్గ మహిషాసుర మర్దిని అయి ప్రజలను ఆలించి, పాలించిన శుభ ఘడియలను స్మరించుకోవడానికి ఏర్పడిన శుభదినాలు- ఈ శరన్నవరాత్రులు. శ్రీరాముడు విజయదశమి నాడే దుర్గాపూజ చేసి రావణుడిని సంహరించి సీతను పొందాడు. పాండవులు విజయదశమీ పర్వ సంబంధ కార్యకలాపాన్ని నిర్వర్తించిన పిదపే కౌరవులను సంహరించి రాజ్యాన్ని పొందారు.
ఆశ్వయుజ శుద్ధ దశమి మధ్వాచార్య జయంతి దినం కూడా. విళంబి నామ సంవత్సరం, క్రీస్తు శకం 1238 సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ దశమి నాడే త్రిమతాచార్యులలో మూడవ వాడైన మధ్వాచార్యులు జన్మించారు. హిందూమత వికాసానికి ఈయన చేసిన ఉపకారం అమూల్యమైనది. ద్వైత సిద్ధాంతాన్ని లోకానికి ప్రసాదించిన ఈయన భక్తితత్త్వానికి నూతనోజ్జీవాన్ని కలిగించారు.
ఇక, అక్టోబరు 2 మహాత్మాగాంధీ జయంతి దినం. ఈ రోజునే అహింసా దినంగా కూడా పాటిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి
అక్టోబరు 3, శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి పాశాంకుశైకాదశిగా ప్రతీతి. దీనినే పరాంకుశ ఏకాదశి అనీ అంటారు. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇది అని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేటట్టు చేస్తుంది. అందుకే దీనిని ‘పాపాంకుశ’ ఏకాదశిగా కొన్ని వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. ఈ వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీ మహావిష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసీ కోట వద్ద పంచపద్మాలు పెట్టాలి. వాటిలో అయిదు దీపాలు ఉంచాలి. అయిదు విధాలైన నైవేద్యాలు ఉంచాలి. ఇట్లా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి కర్రరోటిలో పాలు పోసి చెరుకు కర్రలతో చిలకాలి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 4, శనివారం
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి తిథి పలు విధాలుగా ప్రసిద్ధి. ఈనాడు విశోక ద్వాదశి, గోవత్స ద్వాదశీ వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం చేయాలని, వాసుదేవ పూజ ఆచరించాలని ఆయా గ్రంథాలలో ఈనాడు ఉపవాసం ఉండాలని స్మ•తికౌస్తుభంలో ఉంది. ఈనాడు ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు. ఇక, తిథానుసారం ద్వాదశి అయినప్పటికీ శని త్రయోదశి ఈనాడేనని తెలుగు పంచాంగాలు, తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగాలలో పేర్కొన్నారు.
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి
అక్టోబరు 5, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి నాడు ఆచరించాల్సిన, నిర్వర్తించాల్సిన ప్రత్యేకమైన పూజావిధులేమీ లేవు. సెప్టెంబరు 5 మనకు గురుపూజోత్సవం.. ఉపాధ్యాయ దినోత్సవం అయితే, అక్టోబరు 5న ప్రపంచ ఉపాధ్యాయ దినంగా పాటిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి
అక్టోబరు 6, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి శివపూజలకు అనువైన దినం.
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
అక్టోబరు 7, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాడే వాల్మీకి జయంతి అని అంటారు. రామాయణ గ్రంథకర్త అయిన వాల్మీకిని ఈనాడు ఆరాధిస్తారు. ఇదిగాక, ఈనాడు కొన్ని వింతైన వ్రతాలు, పూజలు ఆచరణలో ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది కోజాగౌరీ వ్రతం. అశ్వనీ నక్షత్రానికి చంద్రుడు మిక్కిలి సమీపంగా
ఉండే రోజున కోజాగౌరీ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతాన్ని సాయంత్రం చేయాలి. తన తొలి చూలి బిడ్డకు ఈనాడు తల్లి కొత్త బట్టలు ఇస్తుంది. బిడ్డ తల చుట్టూ ఒక దీపం తిప్పుతుంది. ఆపై అక్షింతలు చల్లి దీర్ఘాయురస్తు అని దీవిస్తుంది. ఇది దేవవైద్యులైన అశ్వనీ కుమారుల రక్షణలో తన బిడ్డను ఉంచడానికి తల్లులు చేసే పర్వంలా దీనిని బట్టి తోస్తుంది.
ఆశ్వయుజ పూర్ణిమ నాడు నారదీయ పురాణాన్ని దానం చేస్తే ఇష్టలోక ప్రాప్తి కలుగుతుందని అంటారు.
కోజాగౌరీ పూర్ణిమ వ్రతం లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైనదని అంటారు. ఈనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. ఆహ్వానించిన అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచిపెడతారు. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో విశేష భాగ్యప్రదమైన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించారట. అందుకు బదులుగా వాలఖిల్యుడు ‘కోజాగౌరీ’ వ్రతాన్ని గురించి చెప్పాడు. ఆశ్వయుజ పౌర్ణమి నాటి రాత్రి లక్ష్మీదేవి భూమి అంతా కలియ దిరుగుతూ ప్రతి ఇంటి వద్దా నిలిచి పిలుస్తుందట. కాబట్టి ఈనాటి రాత్రి ప్రతి వారు కనీసం అర్ధరాత్రి అయ్యే వరకైనా మేలుకుని ఉంటారు.
అర్థరాత్రి వేళ లక్ష్మి వచ్చి ప్రతి ఇంటి వద్ద ఎవరు మేలుకుని ఉన్నారని అడుగుతుందట. ఎవరూ పలకకపోతే చల్లగా వెళ్లిపోతుందట. అందుమీద ఈ ఇంటికి లక్ష్మీ ప్రసన్నం లేకుండా పోతుందట. ఈనాడు కౌముద్యుత్సవం, అక్షక్రీడ, లక్ష్మీంద్ర కుబేరాది పూజ వంటివి చేయాలని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. ఆశ్వయుజ పూర్ణిమ తిథి నాడు ముఖ్యంగా కౌముదీ వ్రతం ఆచరించాలని, లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రి జాగరణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈ రాత్రి అంతా మేల్కొని ఉండటానికి అక్షక్రీడ (జూదం) అనే వినోదాన్ని కూడా ఈ వేడుకలో జోడించారు. ఇక, ఆంధప్రదేశ్లో ఈనాడు గొంతెమ్మ పండుగ జరుపుతారు. మాల కులస్థులు ఈ దేవతను ఎక్కువగా పూజిస్తారని అంటారు. ఇందుకో కారణం కూడా ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక యుద్ధంలో మరణించిన వారికి తిలోదకాలు, తర్పణాలను ధర్మరాజు విడుస్తుండగా మధ్యలో కర్ణుని చెయ్యి వచ్చింది. ఇదేమిటని ధర్మరాజు వ్యాసుడిని అడిగాడు. ‘అతను మీ అన్న. తర్పణం విడువు’ అని వ్యాసుడు చెప్పాడు. అలాగే చేసి ధర్మరాజు ఇంటికి వచ్చి తల్లి కుంతిని నిజం చెప్పాలని బలవంతం చేశాడు. ఆమె చిన్నప్పటి తన గాథను విచారంతో చెప్పింది. ‘ఇదే విషయం ముందు చెప్పి ఉంటే కర్ణుడిని చంపకుండా ఉండేవాళ్లం కదా! ఈ తప్పునకు కారణం నువ్వే. కాబట్టి నువ్వు మాలలకు దేవతవు కమ్ము’ అని శపించాడు. ఈ కారణంగానే గొంతెమ్మ (కుంతి) మాలలకు ఇలవేల్పు అయ్యింది. ఇంకా ఈ సందర్భంలోనే తల్లిని నిందిస్తూ- ‘ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు’ అని కూడా ధర్మరాజు శపించాడు. అలా ఈ సామెత ఆనాడు పుట్టిందే.
కృష్ణ భక్తురాలైన మీరాబాయి జయంతి తిథి కూడా ఈనాడే.
ఇక, సత్రవాడ కరివరదరాజస్వామి పవిత్రోత్సవాన్ని ఈనాడే నిర్వహిస్తారు.
ఆశ్వయుజ బహుళ పాడ్యమి
అక్టోబరు 8, బుధవారం
ఆశ్వయుజ బహుళ పాడ్యమి తిథి నాడు జయావాప్తి అనే వ్రతాన్ని ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అయితే, ఈ వ్రతాచరణ విధానం గురించి వివరాలు అంతగా అందుబాటులో లేవు.
ఇంకా, ఈనాడు అశూన్య శయన వ్రతాన్ని ఆచరించాలని తెలుగు పంచాంగాలలో ఉంది. ఇది దాంపత్య సౌఖ్యం కోసం, సంతాన భాగ్యం కోసం ఆచరించే వ్రతం. వైశాఖ పురాణంలో శ్రుతదేవ మహాముని శ్రుతకీర్తి మహారాజుకు ఈ వ్రతాన్ని గురించి వివరించాడట. ఈ వ్రతాన్ని ఆచరించే శ్రుతకీర్తి మహారాజు సంతాన భాగ్యాన్ని పొందాడని చెబుతారు. అలాగే, నారద మహర్షి అంబరీష మహారాజుకు కూడా ఈ వ్రతాన్ని గురించి చెప్పినట్టు పురాణగాథలు ఉన్నాయి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. నిజానికి ఈ వ్రతాన్ని వైశాఖ మాసంలో చేయాలని చెబుతారు. కానీ, తిథి రీత్యా ఆశ్వయుజ బహుళ పాడ్యమి నాడు కూడా ఆచరించవచ్చని అంటారు.
ఆశ్వయుజ బహుళ విదియ
అక్టోబరు 8, బుధవారం
ఆశ్వయుజ బహుళ పాడ్యమి ఘడియల్లోనే విదియ తిథి కూడా కూడి ఉంది. కాబట్టి ఆశ్వయుజ బహుళ విదియ తిథి విధులు కూడా అక్టోబరు 8నే ఆచరించాలి. ఆశ్వయుజ బహుళ విదియ నాడు అశూన్య శయన వ్రతం ఆచరించాలని చెప్పుకున్నాం కదా!. ఈ వ్రత వివరాలు పురుషార్థ చింతామణి అనే గ్రంథంలో ఉన్నాయి. దీని ప్రకారం.. అశూన్య శయన వ్రతాన్నే అట్లతద్ది భోగి అని కూడా అంటారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు ముందు వచ్చే రోజును ‘భోగి’ అని వ్యవహరిస్తారు. అంటే అట్లతదియకు ముందు వచ్చే రోజు (విదియ) ఇది. ఉండ్రాళ్ల తద్ది భోగి నాటి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా తెల్లవారుజామునే తలంటి పోసుకుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు, చేతులకు పెట్టుకుంటారు. తెల్లవారుజామునే ఉట్టి కింద ముద్ద తింటారు.
తాంబూలం వేసుకుని కన్యలు, మహిళలు సాయంత్రం వరకు ఆటపాటలతో గడుపుతారు. మర్నాడు (తదియ నాడు) అట్లతద్ది పండుగను జరుపుకుంటారు.అట్లతద్ది భోగి, అట్లతద్ది పర్వాలు పల్లెల్లో నాడు కమనీయంగా జరిగేవి.
ఆశ్వయుజ బహుళ తదియ
అక్టోబరు 9, గురువారం
ఆశ్వయుజ బహుళ తదియ తిథి అట్లతద్ది పర్వం. ఈనాడు కనక గణేశ వ్రతం, లలితా గౌరీ వ్రతం, చంద్రోదయోమా వ్రతం మొదలైన వ్రతాలు చేస్తారని వ్రత గ్రంథాలలో ఉంది. వీటిలో చంద్రోదయోమా వ్రతమే అట్లతద్ది పేరుతో తెలుగునాట వ్యావహారికంలో ఉంది. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజిస్తారు. భోగి నాడు (విదియ) మొదలుకుని తెల్లవారి తద్ది (తదియ) నాడు పగటి పూట భోజనం చేయరు. తాంబూలం మాత్రం తరచూ సేవిస్తూ రాత్రి వరకు ఉపవాసం ఉంటారు. పగటి వేళలో వీలైనంత వరకు ఉయ్యాలలూగుతారు. ఈ ఉయ్యాలలను ఇళ్లలో కాక తోటల్లో, దొడ్లలో పెద్దచెట్లకు వేస్తారు. సాయంత్రం ఉమాదేవిని పూజించి, చంద్రుడిని చూసిన తరువాత అట్లు తదితర పిండి వంటలతో భోజనం చేస్తారు. ఇదీ అట్లతద్ది నాటి తెలుగు మహిళల కార్యకలాపం. ఇది అతివల పండుగ. నగర స్త్రీల కంటే పల్లెటూరి పడుచులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా ఆస్వాదిస్తారు. అట్లతద్ది నోము నోస్తే కన్యలకు ముసలి మొగుడు రాడని, వివాహమైన వారికి నిండు ఐదవతనం కలుగుతుందని అంటారు. అట్లతద్ది నాడు పగటి పూట భోజనం చేయరు. పొద్దు పొడిచాక స్త్రీలు అందంగా ముస్తాబై తోటలు, దొడ్ల వెంట తిరిగి సాయంకాలం తాము చేయబోయే పూజకు అవసరమైన పువ్వులు, పత్రి సమకూర్చుకుంటారు. పగలంతా వీలైనప్పుడల్లా ఊయల ఊగుతారు. ఆ సాయంత్రం ఉమాదేవి (పార్వతి)ని పూజించి చంద్రుడిని చూసి అట్లు తదితర పిండివంటలతో భోజనం చేస్తారు. ఇది అతివల పర్వం. తోటలలో, దొడ్లలో విలాసంగా తిరుగుతూ పత్రి, పువ్వులు సేకరించడం, యథేచ్ఛా విహారం, ఊయలలూగడం, వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. నగరాలలో కంటే పల్లెల్లో ఈ పండుగను ఇప్పటికీ బాగా జరుపుకొంటారు. తెల్లవారుజామునే చద్ది అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల ఉండ, ఉల్లిపాయ పులుసు వంటివి తినకపోయినా, అట్లతద్ది నోము నోచకున్నా, గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలి మొగుడు వస్తాడని మరీ భయపెట్టి తమ ఆడపిల్లలు ఈ నోము ఆచరించేలా ఇంట్లోని పెద్దలు చేస్తారు. గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్లకు వరణీయం. ఆషాఢంలో ఒకసారి, భాద్రపదంలోని ఉండ్రాళ్ల తద్దికి, ఆశ్వయుజంలోని అట్లతద్దికి.. ఇలా ఏడాదిలో మూడుసార్లు అతివలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది ఎంత బాగా పండితే అంత శుభప్రదమని భావిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం, పెళ్లయిన వారు భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం చేయడం తెలుగు నాట ఆచారంగా కొనసాగుతోంది.
ఆశ్వయుజ బహుళ చవితి
అక్టోబరు 10, శుక్రవారం
ఆశ్వయుజ బహుళ చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. రోహిణీ వ్రతం కూడా ఆచరిస్తారు. చతుర్థి వ్రతం గణపతి సంబంధమైనది. తమ సంకటాలను తొలగించాలంటూ మహిళలు, పురుషులు ఈనాడు విఘ్నేశ్వరుడిని పూజించి, కటిక ఉపవాసం చేస్తారు.
ఆశ్వయుజ బహుళ పంచమి
అక్టోబరు 11, శనివారం
ఆశ్వయుజ బహుళ పంచమి నాటి ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి చిత్త కార్తె ప్రారంభం అవుతుంది. ఆశ్వయుజ బహుళ పంచమి నాడు ఘోటక పంచమి వ్రతాన్ని చేస్తారు.. గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఈ తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. అయితే, ఈ పంచమి వ్రతాన్ని ఎలా ఆచరించాలనే వివరాలేవీ అందుబాటులో లేవు.
ఆశ్వయుజ బహుళ షష్ఠి
అక్టోబరు 12, ఆదివారం
ఆశ్వయుజ బహుళ షష్ఠి నాడు షష్టి వ్రతం ఆచరించాలి. ఇది కుమారస్వామి సంబంధమైన పూజాధికం.
ఆశ్వయుజ బహుళ సప్తమి
అక్టోబరు 13, సోమవారం
సప్తమి తిథి సూర్యారాధన తిథి. కాబట్టి ఆశ్వయుజ బహుళ సప్తమి నాడు సూర్యుడిని ఆరాధించాలి.
ఆశ్వయుజ బహుళ అష్టమి
అక్టోబరు 14, మంగళవారం
ఆశ్వయుజ బహుళ అష్టమి తిథి జితాష్టమిగా ప్రతీతి. ఈనాడు జీమూతవాహన పూజ చేస్తారు. ఇది స్త్రీలకు పుతప్రదాన్ని కలిగించే వ్రతం. సౌభాగ్యప్రదమైనది. సాయంకాల ప్రదోష సమయాన ఈనాడు పూజలు ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతం మిక్కిలి ఆచారంలో ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు మంగళావ్రతం, కృత్సరా సముచ్ఛయంలో మహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. కృత్యసార సముచ్ఛయంలో ఈ అష్టమిని జీవత్పుత్రికాష్టమీ అని పేర్కొన్నారు. అంటే పుత్ర సంతానాన్ని కలిగించే వ్రతమని ప్రతీతి. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని కాలాష్టమిగా వ్యవహరించారు. ప్రతి నెలలో వచ్చే అష్టమి నాడు కాలభైరవుడిని పూజించాలని అంటారు. కాలభైరవుడు కాశీ విశ్వేశ్వర క్షేత్ర పాలకుడు. ఆయన పేరుతో ముడిపడినదే కాలాష్టమి.
ఆశ్వయుజ బహుళ నవమి
అక్టోబరు 15, బుధవారం
ఆశ్వయుజ బహుళ నవమి నుంచి తిరుమలనంబి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఇంకా ఈనాడు రథ నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాపూజ చేయాలని వ్రత విధానంలో ఉంది. వివిధ వ్రత గ్రంథాలలో ఈ పూజా విధానం గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు.
ఆశ్వయుజ బహుళ దశమి
అక్టోబరు 16, గురువారం
ఆశ్వయుజ బహుళ దశమి నాడు దుర్గాష్టమి వ్రతం ఆచరిస్తారు. ఇదే రోజు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది.
ఆశ్వయుజ బహుళ ఏకాదశి
అక్టోబరు 17, శుక్రవారం
ఆశ్వయుజ బహుళ ఏకాదశి నాడు తులా సంక్రమణం. ఆశ్వయుజ బహుళ ఏకాదశిని రమైకాదశి (రమా ఏకాదశి)గా ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తి పొందాడని ప్రతీతి. కొన్ని గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జన్మించిన రోజని ఉంది. బోయి కులస్తులు ఈనాడు వాల్మీకి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ, తెలుగు క్యాలెండర్లలో వాల్మీకి జయంతి దినం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి (అక్టోబరు 7, మంగళవారం) నాడు అని ఉంది.
ఆశ్వయుజ బహుళ ద్వాదశి
అక్టోబరు 18, శనివారం
ఆశ్వయుజ బహుళ ద్వాదశి తిథి ధన్వంతరి జయంతి దినం. ధన్వంతరి గొప్ప వైద్య విద్యావేత్త. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అది ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు జరిగిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. భరద్వాజుని వద్ద ధన్వంతరి శిష్యరికం చేసి ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాడని ప్రతీతి. దివోదాసు పేరుతో ఆయన కాశీకి రాజయ్యాడని కూడా పురాణ కథనం. ఒక చేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం వల్ల అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం. ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి పూజ చేసే వారికి రోగ భయం ఉండదని చెబుతారు. ఇక, ఇదే రోజును దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాఘ్ర ద్వాదశిగా కూడా జరుపుకొనే ఆచారం ఉంది. గుజరాతీలు దీనిని ‘వాగ్బరాస్’ అంటారు. అక్కడి వాగ్ బరాస్ నాటికి దీపావళి మూడు రోజులు ఉంటుంది. దీపావళి పండుగ గుజరాతీయులకు కొత్త సంవత్సరాది. మాళవ దేశ మహిళలు గోవత్స ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దూడతో కూడిన ఆవును పూజించడం వారి ఆచారం. ఈ పూజ
శిశువుల క్షేమం కోసం నిర్వహిస్తారని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి
అక్టోబరు 19, ఆదివారం
ఆశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన త్రయోదశిగా ప్రతీతి. ఈనాడు గోత్రిరాత్ర వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ రోజుకి దీపావళి రెండు రోజులు ఉంటుంది. దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది. ఇక, ఆమాదేర్ జ్యోతిషీ గ్రంథం ఈ రోజును ధన త్రయోదశిగా పేర్కొంటోంది. త్రయోదశి అనగా పదమూడో తిథి. పాశ్చాత్యుల్లో 13 అంకె మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ, భారతీయ సంప్రదాయంలో ఇది మంచి తిథి. గుజరాత్, మహారాష్ట్రలలో ఈ పర్వం కన్నులపండువగా జరుగుతుంది. ఈ రోజు పూజలు ఆచరిస్తే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ధన త్రయోదశి రోజు శుచిగా,
శుభ్రంగా ముస్తాబై ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాల్ని పాలతో కడుగుతారు. ఇక, మాళవ దేశంలో ఈ రోజున వర్తకులు తమ లెక్కలు సరి చూసుకుంటారు. ఇళ్లకు శుభ్రంగా వెల్ల కొట్టి అందంగా అలంకరించుకుంటారు. ఈనాడు యమలోకంలోని పితరులు తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ధన త్రయోదశి నాడు సాయంత్రం వారు తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పితరులకు అది దారి చూపుతుందని నమ్ముతారు. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు.
తెలుగు రాష్ట్రాల్లో ధన త్రయోదశిని మరో విధంగా జరుపుకుంటారు. ధన్తేరస్గా కూడా దీనిని వ్యవహరిస్తారు. ఈనాడు ఎంతో కొంత మొత్తంలో బంగారం కానీ, కనీసం వెండినైనా కానీ కొనాలనే ఆచారం ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. వర్తక, వ్యాపారాలు మంచి లాభసాటిగా కొనసాగుతాయి. ఇక, తెలుగు నాట ఇళ్లలో లక్ష్మీపూజ కూడా ఈనాడు ఆచరిస్తారు. మనకు కూడా దీపావళికి రెండు రోజుల ముందే ఈ పుణ్యతిథి వస్తుంది.
ఇక, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి పవిత్రోత్సవం ఈనాటితో పరిసమాప్తం అవుతుంది.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి
అక్టోబరు 20, సోమవారం
తెలుగు క్యాలెండర్లు, పంచాంగాల ప్రకారం నరక చతుర్దశి, దీపావళి ఈ ఏడాది ఒకే తేదీన చూపుతున్నారు. అలాగే కొన్ని పంచాంగాల్లో వేరే తేదీలు చూపుతున్నారు. ఇక ఈ తిథి విశేషాల్లోకి వెళ్తే ఏ చతుర్దశి నాడు అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి అని పేరు. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈనాడు నరకముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి – చతుర్దశి తిథుల మధ్య కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆచారం. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన దినం కావడం వల్లనే దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని చెబుతారు. కానీ, వ్రత గ్రంథాలను బట్టి చూస్తే నరకాసురునికి, నరక చతుర్దశికి సంబంధం లేదని తెలుస్తోంది. నరకం నుంచి ఉద్ధరించేదే నరక చతుర్దశి అని శాస్త్ర వచనం. ఈనాడు అభ్యంగన స్నానం చేసిన అనంతరం యముడికి తర్పణం చేయాలి. తర్పణం చేసేటప్పుడు ఉత్తరేణి ఆకుల్ని తలపై ఉంచుకోవాలి. ఇది పద్నాలుగవ (చతుర్దశి) తిథి. కాబట్టి యముడిని పద్నాలుగు నామాలతో అర్చించాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచారు.
ఇక, ఆశ్వయుజ కృష్ణ అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. దీపమాలికలతో లక్ష్మికి నీరాజనం ఇచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అనే పేరు వచ్చింది. నరకలోక వాసుల కోసం దీప + ఆవళి కల్పించే రోజు కాబట్టి దీపావళి అయ్యింది. హిందూమత సంస్క•తికి, హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నమని చెప్పాలి. ఈ తిథికి ఉన్న విశేషాలివీ..
రాక్షస రాజైన బలి చక్రవర్తి పాతాళానికి విష్ణువుచే అణగదొక్కబడిన దినం కావడం చేత ఇది ఒక మహోత్సవ దినంగా మారింది.
శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన దినం కాబట్టి మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ అయ్యింది. రాముడు రావణుడిని సంహరించి ఈనాడే అయోధ్యకు తిరిగి వచ్చాడట. ఆనాడు భరతుడితో సమావేశమై రాజ్యం గురించి చర్చించాడట. అందుకే ఇది ఉత్తరాదిలో ‘భరత్ మిలాప్’గా ప్రసిద్ధి చెందింది.
ఇక, విక్రమ శక స్థాపకుడైన విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం పొందిన దినం కూడా ఇదే.
పైన ఉదహరించిన వాటిలో బలి చక్రవర్తి కథ తప్ప మరేదీ దీపావళి వ్రత గ్రంథాలలో లేదు. నరకుని వథతో ఆనందపరవశులైన జనులు టపాసులు కాల్చి దీపావళిని జరుపుకున్నారని ప్రస్తుతం మిగుల ప్రచారంలో ఉన్నా.. ఆ వివరాలు దీపావళి వ్రత గ్రంథాలలో లేకపోవడం విశేషం.
దీపావళి నాటి రాత్రి చేసే లక్ష్మీపూజ పుణ్యప్రదమైనది. ఈనాడు లక్ష్మీదేవి భూలోకానికి దిగి వచ్చి ఇల్లిళ్లూ తిరుగుతుందని, శుభ్రంగా ఉన్న ఇంటిలో తన కళను ఉంచి వెళ్తుందని విశ్వాసం. అందుచే భారత స్త్రీలు ఈనాడు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, నగలు, నాణేలు ఉంచుతారు. లక్ష్మీపూజ అనంతరం ఆనాటి రాత్రి ఇక నిద్రపోకూడదు. జూదం మొదలైన క్రీడలతో రాత్రంతా జాగరణ చేయాలని శాస్త్ర వచనం. ఇలా పవిత్రంగా పూజ జరిగితే లక్ష్మి ప్రసన్నురాలై ఆ ఇంట ప్రవేశిస్తుందని నమ్ముతారు. లక్ష్మి ప్రవేశించిన ఇంటిలో అలక్ష్మికి స్థానం లేదు. కాబట్టి అక్కడి నుంచి అలక్ష్మి వెళ్లిపోతుంది.
మహారాష్ట్ర, గుజరాత్లలో దీపావళి ఐదు రోజుల పర్వం. దీపావళి అనగా దీపాల సమూహమని అర్థం.
ఈనాడు విష్ణుమూర్తి బలి చక్రవర్తిని పాతాళ లోకంలోకి అణచివేసి అతని కారాగారంలో ఉన్న దేవతలను విడుదల చేశాడు. అలా విడుదల చేసిన ఆ దేవతల్ని ఆయన లక్ష్మితో పాటు క్షీరసాగరానికి తీసుకువెళ్లాడు. ఆ దేవతలు చాలా కాలం అక్కడే ఉండిపోయారు. దేవతలు బలి ఖైదు నుంచి విడుదలై లక్ష్మితో క్షీరసాగరానికి చేరి పొందిన ఆనంద దినాలకు స్మారకంగా ఈ పండుగ ఏర్పడింది. ఈ పండుగ లక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. కావునే దీపావళి పర్వ సందర్భంలో లక్ష్మీపూజ ప్రధాన కార్యమై ఉంటుంది. మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం పుణ్యప్రదం. నెయ్యి లేక నూనె, పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగించాలి. దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే, చప్పుడు చేసే, బాణసంచా కాల్చడం సంప్రదాయం.
మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండే పితరులు ఈనాడు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళ్తారు. వారికి వెలుతురు చూపడం నిమిత్తం నరకలోక వాసులు చేతులతో కాగడాలు పట్టుకుని ఆకాశం వైపు చూపాలని శాస్త్ర వచనం. ఆ కాగడాలే నేడు దీపావళి పండుగలో మతాబులు, ఇతర టపాసులు కాల్చడంగా మారింది.
నరక చతుర్దశి నాడు కానీ, దీపావళి అమావాస్య నాడు కానీ స్వాతీ నక్షత్రం వస్తే ఉత్తమ యోగమని మన పెద్దలు అంటారు. దీపావళి అమావాస్య మొదలు నెల రోజులు అనగా, మళ్లీ అమావాస్య వరకు ఇంటి వెలుపల ఆకాశదీపం ఉంచే వారికి అనంత పుణ్యం కలుగుతుందని శాస్త్ర వచనం. మన పెద్దలు కొన్ని పండుగలకు కొన్ని కొన్ని ఆకులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆ రుతువుకు ఆ ఆకుల వాడకం ఆరోగ్యదాయినిగా ఉంటుంది. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వేప పువ్వు, చైత్ర శుద్ధ అష్టమి నాడు అశోక కలికా ప్రాశనం, మకర సంక్రాంతికి బూడిద గుమ్మడి ఆకులు, రథసప్తమికి చిక్కుడాకులు, దీపావళి నాడు మాష పత్రాలకు మన పెద్దలు పెద్దపీట వేశారు. మాష పత్రాలు అంటే మినప ఆకులు. ఈనాడు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దీపావళి ఐదు రోజుల పర్వంగా కొనసాగుతోంది. ఇక, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈనాడు ‘శ్రీవారి దీపావళి ఆస్థానం’ పేరుతో గొప్ప వేడుక నిర్వహిస్తారు.
ఆశ్వయుజ బహుళ అమావాస్య
అక్టోబరు 21, మంగళవారం
ఆశ్వయుజ శుక్ల (బహుళ) అమావాస్య నాడు కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆకాశదీపం ప్రారంభం. వేదాంత దేశికుల ఉత్సవారంభం ఈనాటి నుంచే..
అక్టోబరు 21న కొమురంభీమ్ జయంతి దినం. ఇదే నెల 8వ తేదీన ఆయన వర్ధంతి దినం.
కార్తిక శుద్ధ పాడ్యమి
అక్టోబరు 22, బుధవారం
ఈనాటి నుంచి కార్తీక మాసారంభం. నెల పొడవునా సాగే దీపోత్సవానికి ఈనాడే శ్రీకారం. అందుకే కార్తీక శుద్ధ పాడ్యమి అఖండ దీప ప్రారంభోత్సవ తిథి. కార్తీక పుణ్య స్నానాలు ఈనాటి నుంచే మొదలవుతాయి. కార్తీక పాడ్యమి తిథి నాడు గోవర్ధన పూజ చేయడం ఆనవాయితీ. స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు అన్నకూటము, గోవర్ధన ప్రతిపదము, అభ్యంగము, లక్ష్మీపూజ, ద్యూతము, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ అపరాహ్ణే మార్గపాలీ బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలని నిర్దేశించారు. అలాగే, గదాధర పద్ధతి ప్రకారం.. ఈనాడు బలిరాజోత్సవం, ద్యూతమ్, బలిప్రతిపత్, ద్యూత ప్రతిపత్ వ్రతాలు చేయాలని ఉంది. పురుషార్థ చింతామణి వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరించాలి. అంటే మొదటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజులు పెరుగు అన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వ్రత విధి. కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని కూడా అంటారు. బలి చక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులలో ఆచరించే పక్రియ మాదిరిగానే ఈనాడూ అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది.
కార్తిక శుద్ధ విదియ
అక్టోబరు 23, గురువారం
కార్తీక శుద్ధ విదియ తిథినే యమ ద్వితీయ, భ్రాతృ విదియ అనీ అంటారు. ఈనాడు భగినీ హస్త భోజనం, పుష్ప ద్వితీయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇది ముచ్చటైన పండుగ. ఈ రోజు యమపూజ, చిత్రగుప్తాది పూజ, భగినీ గృహే భోజనం నిర్వహించాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అయితే, ‘భగినీ హస్త భోజన’ పర్వంగానే ఈనాడు ప్రసిద్ధి. దీని వెనుకో ఆసక్తికరమైన కథ ఉంది.
యముని చెల్లెలు యమునా నది. తన అన్నను భోజనానికి రావాలని ఆమె ఎన్నోసార్లు కోరుతుంది. కానీ, తీరిక లేక యముడు వెళ్లలేకపోతాడు. ఎలాగో ఒకసారి వీలు చూసుకుని చెల్లెలు ఇంటికి విందుకు వెళ్తాడు. ఆనాడు సరిగ్గా కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన యముడికి చెల్లెలు యమున ఎన్నెన్నో మర్యాదలు చేస్తుంది. చిత్రగుప్తుడిని పూజిస్తుంది. స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. ఆ మర్యాదకు సంతుష్టుడైన యముడు ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. ‘ఈ రోజు చెల్లెలి ఇంట ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాస్తి లేకుండా మరియు అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించాలి’ అని కోరుతుంది. యముడు సరేనంటాడు. ఇదంతా జరిగిన రోజు- యముడికి, యమునకు మధ్య సౌహార్ధ్రం నడిచిన విదియ- కాబట్టి దీనికే యమ ద్వితీయ అనే పేరు కూడా వచ్చింది. భగినీహస్త భోజనంగా వ్యావహారికంలో స్థిరపడింది. భగిని అంటే సోదరి. ఆమె చేతి వంట తినే రోజు కాబట్టి ఆ పేరు వచ్చింది. దీనినే అన్నాచెల్లెళ్ల పండుగ అని కూడా అంటారు. ఇంకా, ఈనాడు కేరళ ప్రాంతంలో బలి చక్రవర్తికి వీడ్కోలు పూజ జరుపుతారు.
కార్తిక శుద్ధ తదియ
అక్టోబరు 24, శుక్రవారం
కార్తిక శుద్ధ తదియ నాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. గ్రంథాంతరంలో విష్ణు గౌరీ వ్రతం చేయాలని ఉంది. విష్ణుగౌరీ వ్రతంలో లక్ష్మీదేవిని పూజించి, ముత్తయిదువను మంగళ ద్రవ్యాలతో గౌరవించి భోజనం పెడతారు. అలాగే, ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే, ఈ తిథి సోదరి తృతీయ వ్రతంగానూ ప్రసిద్ధి. విదియ నాడు సోదరి నుంచి గౌరవ మర్యాదలు పొందే సోదరుడు.. తదియ నాడు ఆమెను యథాశక్తి సత్కరించాలని ఆచారం. తన స్థోమతకు తగినట్టుగా సారె, చీరలు ఇవ్వాలి. ఇవి ఉత్తర భారతాన బాగా ప్రాచుర్యంలో ఉన్న పర్వాలు.
ఈనాటి నుంచి స్వాతి కార్తె ప్రారంభం అవుతుంది.
కార్తీక శుద్ధ చవితి
అక్టోబరు 25, శనివారం
కార్తీక శుద్ధ చవితి తెలుగునాట కొన్ని ప్రాంతాలలో నాగుల చవితి పర్వమై ఉంది. భారతదేశంలో ఎక్కువ ప్రాంతాల్లో శ్రావణ
శుద్ధ పంచమి నాగపంచమిగా ప్రసిద్ధి. ఇక, కార్తీక శుద్ధ చవితి నాడు కూడా నాగులను పూజించే ఆచారం ఉంది. ముఖ్యంగా ఆంధప్రదేశ్లో ఈ తిథి నాడు నాగులను విశేషంగా పూజిస్తారు. ఈనాడు నాగ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. తెలుగు వారికి, ప్రత్యేకించి ఆంధ్రులకు నాగులతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రులు నాగజాతి వారని అంటారు. కృష్ణానది తీరాన నాగజాతి వారుండే వారని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తోంది. దీపావళి పండుగ వెళ్లిన నాలుగో నాడు నాగుల చవితి వస్తుంది. చవితి నాడు పుట్టలో పాలుపోసి ఆ పుట్టమట్టిని కొంచెం తీసుకుని చెవులకు పెట్టుకోవడం ఆచారం. ఆ మట్టిని పుట్ట బంగారం అనే గొప్ప పేరుతో పిలుస్తారు.
కార్తీక శుద్ధ పంచమి
అక్టోబరు 26, ఆదివారం
కార్తీక శుద్ధ చవితి మాదిరిగానే పంచమి నాడు కూడా నాగులను పూజించే ఆచారం ఉంది. ఈ తిథినే జయ పంచమిగానూ వ్యవహరిస్తారు. జ్ఞాన పంచమిగా కొన్నిచోట్ల ఆచారంలో ఉంది. ఈనాడు పాత పుస్తకాల భాండాగారాలన్నీ దులిపి కొత్తగా సున్నం వేసి మళ్లీ పుస్తకాలను యథా స్థానంలో ఉంచుతారు. ఇది జైనుల్లో మిక్కిలి ఆచారంలో ఉన్న విధి. ఇంకా ఈనాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ రోజు నుంచి వరుసగా ఏడు రోజులు సప్తర్షి కృచ్ఛ వ్రతం ఆచరిస్తారు.
కార్తీక శుద్ధ షష్ఠి
అక్టోబరు 27, సోమవారం
కార్తీక శుద్ధ షష్ఠి మహా షష్ఠి పర్వదినం. ఈనాడు వహ్ని పూజ చేయాని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి పేర్కొంటోంది. ఈ రోజు మొదలు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలని అంటారు. ఈ ఆచరణను మహేంద్ర కృచ్ఛ వ్రతం అంటారని మరో వ్రత గ్రంథంలో ఉంది.
కార్తీక శుద్ధ సప్తమి
అక్టోబరు 28, మంగళవారం
కార్తీక శుద్ధ సప్తమి తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు. ఇది సూర్య సంబంధమైన తిథి. కాబట్టి సూర్యనారాయణుడిని ఆరాధించడానికి ఇది విశేషమైన రోజు. ఇంకా ఈనాడు కల్పాదిగా కూడా వ్యవహరిస్తారు. అలాగే, శాక సప్తమీ వ్రతం కూడా ఆచరిస్తారు. లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఉంది. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతమని అర్థమవుతోంది.
కార్తీక శుద్ధ అష్టమి
అక్టోబరు 29, బుధవారం
కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా ఉంది. ఈనాడు గోపూజ చేయడం మిక్కిలి పుణ్యప్రదమని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. స్మ•తి కౌస్తుభంలో ఈ వ్రత నియమాల గురించి వివరించారు. అలాగే, ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు. అలాగే, తిరుమల
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ జరిగేది కూడా ఈనాడే.
కార్తీక శుద్ధ నవమి
అక్టోబరు 30, గురువారం
కార్తీక శుద్ధ నవమిని మన పంచాంగాల ప్రకారం ‘కృత యుగాది’ దినంగా పరిగణిస్తారు. యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల (17,28,000) మానవ సంవత్సరాలు. అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం- ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది. తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం- ఈనాడు చండీపూజ చేయాలని ఉంది. ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం. మొత్తానికి మన పంచాంగ కాలమే ప్రమాణం కాబట్టి ఈనాటి తిథిని కృత యుగాదిగానే ఆచరించాలి. కొన్ని తెలుగు క్యాలెండర్లలో కార్తిక శుద్ధ నవమిని ‘అక్షయ నవమి’గానూ పేర్కొన్నారు.
కార్తీక శుద్ధ దశమి
అక్టోబరు 31, శుక్రవారం
కార్తీక శుద్ధ దశమి నాడు సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. యాజ్ఞవల్క్య మహర్షి జయంతి తిథి కూడా ఈరోజే
ఉసిరికి పట్టం.. తులసికి కల్యాణం
ఉసిరి, తులసికి పట్టం కడుతుంది కార్తీక మాసం. అందుకే ఈ రెండూ ఈ మాసంలో పూజనీయమైనవిగా అవతరించాయి. ఈ రెండూ పరమ పవిత్రమైనవి. తులసి చెట్టు గాలి వలే ఉసిరిక చెట్టు నీడ, గాలి కూడా చాలా ఆరోగ్యకరమైనవి. కార్తీక మాసంలో వన భోజనాలు, వన సంతర్పణలు ఉసిరి చెట్టు నీడనే జరపడం ఈ చెట్టుకున్న ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. అదీగాక, ఈ రెండు చెట్ల ప్రాముఖ్యత తెలిపేలా ఉసిరి, తులసి ఒకేచోట పుట్టినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. ధాత్రి అనేది ఉసిరికి గల మరో పేరు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు కాయలతో కూడిన దీని కొమ్మను తులసితో కలిపి పూజించడం ఆచారం. ఈ నేపథ్యంలో ఉసిరి, తులసి గుణగణాలేమిటో తెలుసుకుందాం..
అరుచిని పోగొట్టే ఉసిరిక
కార్తీక మాసంలో తప్పక తీసుకోవాల్సిన పదార్థం- ఉసిరిక. దీనికి మంచి రసాయనిక గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు.
తులసీ ధాత్రి సహిత విష్ణువు
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతితో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు. ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది.



















































































Review కోటి కాంతుల కార్తీకం.