చైత్ర వైశాఖల వసంత వికాసాలు

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో నాలుగో మాసం- ఏప్రిల్‍. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర – వైశాఖ మాసాల కలయిక. తెలుగు సంవత్సరాలలో చైత్రం మొదటిది. చైత్ర మాసం గడిచిన మార్చి 30న ప్రారంభమైంది. ఆనాడే ఉగాది. ఇక, ఏప్రిల్‍ మాసం విషయానికి వస్తే ఏప్రిల్‍ 1, చైత్ర శుద్ధ చవితి, మంగళవారం నుంచి ఏప్రిల్‍ 30, బుధవారం, వైశాఖ శుద్ధ తదియ వరకు చైత్ర, వైశాఖ మాసాల తిథులు ఉంటాయి. శ్రీరామ నవమి, కామద ఏకాదశి, అనంగ త్రయోదశి, హనుమజ్జయంతి, వరూధినీ ఏకాదశి, బసవ జయంతి, పరశురామ జయంతి, సింహాచల నృసింహస్వామి చందనోత్సవం వంటివి ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు, పండుగలు..

2025- ఏప్రిల్‍ 1, మంగళవారం, చైత్ర శుద్ధ చవితి నుంచి
2025- ఏప్రిల్‍ 30, బుధవారం, వైశాఖ శుద్ధ తదియ వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-చైత్రం/వైశాఖం-
వసంత రుతువు- ఉత్తరాయణం

చైత్ర, వైశాఖ మాసాలు వసంత కాలం. ఒకపక్క చెట్లు ఆకులు రాల్చే కాలమిది. మరోపక్క కొత్త చివుళ్లు తొడుగుతాయి. పచ్చనాకులు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. చిత్తా నక్షత్రంలో పూర్ణ చంద్రుడు ఉండే మాసం కాబట్టి ఇది చైత్ర మాసం అయ్యింది. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో కలిగే మార్పులను బట్టి మన పెద్దలు ఆయా మాసాలకు ఆయా పేర్లను నిర్ణయించారు. అంటే, చంద్రుని గతి ఆధారంగా నక్షత్ర మండలాలకు ఆయా పేర్లు పెట్టారు. ఆ మండలాలలో చంద్రుడు ప్రవేశించినపుడు ఆ నెలకు ఆయా నక్షత్రాల పేర్లు వస్తాయి. ఈ కోవలో, చిత్త నక్షత్రంలో పూర్ణ చంద్రుడున్న మాసం చైత్రమవుతుంది.
చైత్ర మాసంలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని అంటారు. చెట్లు ఆకులు రాల్చే కాలమిది. పూలు మాత్రం విరబూస్తాయి. ఎటుచూసినా వసంత పరిమళాలు వెదజల్లుతుంటాయి. పచ్చనాకులు.. లేత చివుళ్లు.. రంగు రంగుల పూలు ప్రకృతిని, మన మనసులను కూడా శోభాయమానం చేస్తాయి. అందుకే చైత్రాన్ని వసంత మాసమనీ అంటారు. ఈ నెలలో ప్రాధాన్యం వహించే పండుగ ఉగాది. రమణీయమైన సీతారామ కల్యాణానికి ఈ మాసమే వేదిక..
చిత్తా నక్షత్రంలో చంద్రుడున్న మాసం చైత్రమైతే.. విశాఖ నక్షత్రాన పూర్ణ చంద్రుడున్న మాసం వైశాఖ మాసం అవుతుంది. అలా చంద్రుడు విశాఖ నక్షత్రంలో ప్రవేశించినపుడు పుట్టినదే వైశాఖ

మాసం. ఇది ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. శ్రీ మహా విష్ణువు లీలా విలాసాలకు వైశాఖ మాసం చిరునామా. ఆయన దశావతారాల్లోని విశిష్టమైన మూడు అవతారాల జయంతులు వైశాఖ మాసంలోనే వస్తాయి. ఇంకా శంకర జయంతి, రామానుజ జయంతి తిథులు ఈ మాసంలోనే వస్తాయి. ఈ నెలలో గృహ నిర్మాణం సర్వ శుభప్రాప్తి అని ప్రతీతి. ఇంకా అక్షయ తృతీయ వంటి సర్వ శుభకారక తిథి ఈ మాసంలోనిదే. మరెన్నో తిథులకు, పర్వాలకు నెలవైన వైశాఖ మాసం నుంచే ఎండలు ముదురుతాయి. క్రమంగా వాతావరణం వేడెక్కుతుంది.
ఇక ఏప్రిల్‍ నెలలోని సగానికి పైగా రోజులు తెలుగుమానం ప్రకారం చైత్రమాసంలోనివి. చివరి మూడు రోజులు వైశాఖ మాసంలోనివి. ఆ రోజుల్లో వచ్చే తిథులు.. ఆ తిథుల్లో వచ్చే పర్వాల విశేషాలు..

చైత్ర శుద్ధ చవితి
ఏప్రిల్‍ 1, మంగళవారం

చైత్ర శుద్ధ చతుర్థి తిథి గణపతి పూజకు ఉద్ధిష్టమైనది. ఈనాడు గణపతిని దమనములతో పూజించాలని నియమం. ఈనాడు ఆశ్రమ, చతుర్మూర్తి వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. సాధారణ పంచాంగాలలో ఈనాడు చతుర్థి వ్రతం, రోహిణి వ్రతం ఆచరించాలని ఉంది. అలాగే, ఈనాడు చాలా తావుల్లో సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. ఏటా చైత్ర మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే, అది ఆచరించాల్సిన తిథి చైత్ర శుద్ధ చవితినాడేనని అంటారు.
ఈనాడు ఆల్‍ ఫూల్స్ డే కూడా. దీనినే ఏప్రిల్‍ ఫూల్‍ అని కూడా వ్యవహరిస్తారు.

చైత్ర శుద్ధ పంచమి
ఏప్రిల్‍ 2, బుధవారం

చైత్ర శుద్ధ పంచమి తిథి శాలి హోత్రయ పంచమి దినం. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలలో ఉన్నాయి. ఈనాడు హయపూజ చేయాలని నియమం. శాలిహోత్రుడు అశ్వశాస్త్రం రాసిన రుషి. మన రాజులు ఆశ్విక దళాన్ని బాగా పోషించే రోజుల్లో ఈ శాలిహోత్రహయ పంచమి వ్రతం బాగా ఆచారంలో ఉండేదని తెలుస్తోంది. ఈనాటి వివరణలో మన పంచాంగకర్తలు శ్రీపంచమి, శ్రీ వ్రతం అని రాస్తారు. మాఘ మాసంలో ఒక శ్రీ పంచమి ఉంది. ఈ పంచమి కంటే అది బాగా ప్రచారంలో ఉన్న పండుగగా కనిపిస్తుంది. ఆనాడు చదువుల తల్లి సరస్వతీదేవిని విశేషంగా ఆరాధిస్తారు. ఇక ఈనాటి శ్రీ పంచమి నాడు లక్ష్మీపూజ చేయాలని, ఈ పక్రియనే ‘శ్రీ వ్రతం’గా వ్యవహరిస్తారని అంటారు. కొన్ని ప్రాంతాలలో ఇది లక్ష్మీ పంచమిగానూ పరిగణనలో ఉంది. కొత్త సంవత్సరం ఆరంభమైన తొలి దినాల్లో వచ్చే ఈ పంచమిని విజయాలను, ఐశ్వర్యాన్ని కోరుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే పర్వం. దీనినే ఉత్తరాదిన నవ సంపత్‍ అని వ్యవహరిస్తారు. ఈనాడు లక్ష్మీదేవి ఆశీస్సులు కోరుతూ భక్తులు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండి లక్ష్మిని పూజించిన వారికి సంపద, శ్రేయస్సు లభిస్తాయని అంటారు. లక్ష్మి- కీర్తి, గౌరవాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని, బలాన్ని, విజయాలను, మంచి సంతానాన్ని, శౌర్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, తృప్తిని, తెలివితేటలను, సౌందర్యాన్ని, ఉన్నత లక్ష్యాలను చేరే మార్గాలను, ఉన్నత ఆలోచనా శక్తిని, నైతికతను, మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదిస్తుందని, ఆమె అదృష్ట దేవత అని నమ్ముతారు. ఈనాటి లక్ష్మీపూజలో చందనం, అరటి ఆకులు, పూలమాల, బియ్యం, దుర్వ పత్రాలు, ఎర్ర దారం, సుపారి, కొబ్బరి, ఇతర పూజా ద్రవ్యాలను వినియోగిస్తారు. పూజానంతరం బ్రాహ్మణులకు భోజనం పెట్టాలని అంటారు. దక్షిణగా కొంత డబ్బును ఇవ్వాలి. ఉపవాస సమయంలో పండ్లు, పాలు తప్ప మరే ఇతర ఆహార పదార్థాలనూ తీసుకోకూడదు.

చైత్ర శుద్ధ షష్ఠి
ఏప్రిల్‍ 3, గురువారం

చైత్ర శుద్ధ షష్ఠి నాడు స్కంద షష్ఠి వ్రతం ఆచరిస్తారు. ఇది కుమారస్వామి సంబంధమైన పర్వం. ఈనాడు ఆచరించే పూజను స్కంద పూజ అంటారు. అర్క, కుమారషష్ఠి వ్రతాలు కూడా ఈనాడు చేస్తారని చతుర్వర్గ చింతామణి, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథాలలో ఉంది.

చైత్ర శుద్ధ సప్తమి
ఏప్రిల్‍ 4, శుక్రవారం

చైత్ర శుద్ధ సప్తమి నాడు సూర్యుడిని దమనాలతో పూజించాలి. సప్తమి తిథి నాడు ఇంకా గోమయాది సప్తమి, నామ సప్తమి, సూర్య, మరుత్‍, తురగ సప్తమీ తదితర వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు వాసంతీ పూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీలో రాశారు. అలాగే, ఈనాడు అర్క వ్రతం ఆచరించే వారు రాత్రి భోజనం చేయకూడదు. పైన పేర్కొన్న వ్రతాలన్నీ సూర్య సంబంధమైనవే.

చైత్ర శుద్ధ అష్టమి
ఏప్రిల్‍ 5, శనివారం

చైత్ర శుద్ధ అష్టమి నాడు భవానీ యాత్ర, అశోకాష్టమి, అశోక రుద్రపూజ, అశోకకలికా ప్రాశనం అనే వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. దీనిని బట్టి ఇది భవానీ అష్టమిగా, అశోకాష్టమిగా పరిగణనలో ఉందని భావించాలి. భవానీ అనేది పార్వతీదేవికి గల మరో పేరు. ఆమె శివుని భార్య. శివుని మొదటి భార్య సతీదేవి. ఆమె దక్షుని పెద్ద కుమార్తె. శివుడు ఒకసారి దక్షుడిని నిరాదరించాడు. ఆ కోపంతో దక్షుడు కూతురిని పుట్టింటికి తీసుకురావడం మానేశాడు. ఆమె చెల్లెళ్లను మాత్రం తరచూ పుట్టింటికి పిలుస్తూ చీరలు, సారెలు పెట్టి పంపించే వాడు. ఈ క్రమంలోనే దక్షుడు ఒకసారి మహా క్రతువు తలపెట్టాడు. దీనికి పార్వతి (సతీదేవి)ని తప్ప అందరినీ పిలిచాడు. కానీ తనను పిలవకున్నా పుట్టింటిపై మమకారంతో పార్వతి వెళ్లింది. అక్కడ ఆమెను తండ్రితో సహా ఎవరూ పలకరించలేదు. ఈ అవమానం భరించలేక కాలి బొటనవేలితో పార్వతి నేలను రాచింది. దాంతో యోగాగ్ని పుట్టింది. అందులో ఆమె భస్మమైపోయింది. సతీదేవి భస్మమైన విషయం తెలుసుకున్న శివుడు తన •టాఝూటం నుంచి వీరభద్రుడిని పుట్టించి దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయించాడు. యోగాగ్నిలో దేహాన్ని త్యజించిన సతీదేవి మరుజన్మలో హిమవంతుని భార్య అయిన మేనకాదేవి గర్భంలో చైత్ర శుద్ధ అష్టమి నాడు పుట్టింది. కాబట్టి చైత్ర శుద్ధ అష్టమి పార్వతి జన్మతిథి అయ్యింది. పర్వతరాజుకు పుట్టడం చేత ఆమెను పార్వతి అని పిలవసాగారు. భవానీ ఆమె పర్యాయ పదం.
అలాగే ఏప్రిల్‍ 5 బాబూ జగ్జీవన్‍రాం జయంతి దినం. బాబూజీగా ప్రసిద్ధుడైన ఈయన స్వాతంత్య్ర సమరయోధుడు. ఉప ప్రధానిగా పనిచేశారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల నుంచి 1986లో మరణించే వరకు నలభై సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్‍గా వ్యవహరించారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశాన్ని తన్మయి స్మారక చిహ్నంగా మార్చారు. ఆయన జయంతిని దేశంలో తన్మయి (సమానత్వ దినోత్సవం)గా నిర్వహిస్తారు. బిహార్‍లో జన్మించిన ఈయనను దళితుల హక్కుల కోసం చివరి వరకు పోరాడిన యోధుడిగా స్మరించుకుంటారు.

చైత్ర శుద్ధ నవమి
ఏప్రిల్‍ 6, ఆదివారం

చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి పర్వదినం. ధర్మ సంస్థాపకుడైన శ్రీరామచంద్రుడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి నాడే. చై•త్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్ర యుక్తాన రాముడు జన్మించాడు. అందుకే ఇది శ్రీరాముని జన్మతిథి. శ్రీ మహా విష్ణువు దశావతారాల్లో రామావతారం ఏడవది. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథుడికి కౌసల్య గర్భంలో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రం, నాలుగో పాదాన కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ పుట్టాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి శ్రీరామ జయంతి దినమైంది. విష్ణువు పది అవతారాల్లో మూడు అవతారాల జయంతులు చైత్ర మాసంలోనే రావడం విశేషం. ఇందులో ఇంకో విశేషం ఉంది. ఏటేటా వచ్చే ఈ పది జయంతులలోనూ ఉగాది తరువాత మొదట వచ్చే జయంతి పర్వం శ్రీరామ నవమే. శ్రీరామ నవమి పండుగ తొమ్మిది రోజులు చేస్తారు. ఆ తొమ్మిది రోజులలో ఉగాది పాడ్యమి మొదటి రోజు. ఈ తొలి రోజున ప్రారంభించి శ్రీరామ నవమి వరకు రామాయణ పారాయణం మొదలైనవి ఆచరిస్తారు. ఈ తొమ్మిది రోజులను గర్భ నవరాత్రులు అంటారు. ఈనాడు తెలుగు రాష్ట్రాల్లోని భద్రాచలం, ఒంటిమిట్ట తదితర రామాలయాలతో పాటు ఊరూవాడా గల అన్ని చిన్నా పెద్దా ఆలయాల్లోనూ రామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

చైత్ర శుద్ధ దశమి
ఏప్రిల్‍ 7, సోమవారం

చైత్ర శుద్ధ దశమి రెండు విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఒకటి- శాలివాహన జయంతి తిథి ఈనాడు. రెండు- ధర్మరాజ దశమి. చైత్ర శుద్ధ దశమి శాలివాహన జయంతి తిథి. శాలివాహనుడు శాతవాహన వంశానికి ఆద్యుడు. ఆంధ్రభూమి ప్రసవించిన మహా పురుషులలో ఈయన ఒకరు. ఈయన విక్రమార్కుడిని సంహరించాడని అంటారు. కుమ్మరి కన్యకు జన్మించాడు. ఉగాది పర్వం ఈయనకు సంబంధించిన కథతో కూడా ముడి పడి ఉంది. మానవజాతి చరిత్రలో కాలమానాలను చరిత్ర ప్రసిద్ధులైన వారి పేరుతో వాడటం పరిపాటి. వీటిలో ప్రముఖంగా వాడే పేరు- క్రీస్తు శకం ఒకటి కాగా, భారతదేశంలో ప్రామాణికమైనది- శాలివాహన శకం. ఇది హిందూ కాలమానం. భారత జాతీయ కాలమానం. కంబోడియా బౌద్ధ కాలమానంగా కూడా శాలివాహన శకాన్ని వాడతారు. ఇది శాతవాహనులలో ప్రముఖుడైన హాల శాతవాహనుని రాజ్య కాలంలో శకనులపై విజయం సాధించిన సంవత్సరం నుంచి ప్రారంభమైంది. శాలివాహన శకం 78 ఏ.డి.లో ప్రారంభమైంది. దీనికి ముందు విక్రమ శకం 56 నుంచి వాడుకలో ఉండేది.
అలాగే, చైత్ర శుద్ధ దశమి నాడు పాండవ అగ్రజుడైన ధర్మరాజును దమనముతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. రెండు ప్రధాన పర్వాలతో కూడిన చైత్ర శుద్ధ దశమి కాబట్టే ఈనాడు మన పంచాంగకర్తలు ధర్మరాజు దశమి, శాలివాహన జయంతి అని రాస్తారు. ఇంకా, రామ నవమి ప్రతాంగ హోమం ఈనాడే నిర్వహించాలని అంటారు.

చైత్ర శుద్ధ ఏకాదశి
ఏప్రిల్‍ 8, మంగళవారం

ఏకాదశి అనేది సాధారణంగా ఉపవాసాల రోజు. అందుకే తిథులన్నిటిలోకీ ఏకాదశి చాలా పవిత్రమైనది. చైత్ర శుద్ధ ఏకాదశిని పంచాంగకర్తలు కామద ఏకాదశిగా వ్యవహరిస్తున్నారు. ఏకాదశి పర్వం విశేషాల్లోకి వెళ్తే.. ఏకాదశి తిథి నెలలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వస్తుంది. పక్షానికి ఒకటి, మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు. ఈ ఇరవై నాలుగు ఏకాదశులూ ఇరవై నాలుగు పర్వాలుగా ఉన్నాయి. ‘ఏకాదశి’ అనేది పౌరాణిక గాథల్లో ఒక దేవత పేరు. మురాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి విష్ణువు వైకుంఠం నుంచి గరుడ వాహనం మీద భూమికి దిగి వచ్చాడు. అసురుడితో ఆయన బాగా యుద్ధం చేశాడు. యుద్ధం మధ్యలో అతను అలసిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక సౌందర్యవతి ఆవిర్భవించి అసురుడితో యుద్ధం చేసి అతనిని సంహరించింది. ఆ సౌందర్యవతికి దేవతలు ‘ఏకాదశి’ అనే పేరు పెట్టారు. ఏకాదశి పొందిన విజయాన్ని స్మరించడం కోసం ఈ పర్వం ఏర్పడిందని అంటారు. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించే వారిని ఆ దేవత రక్షిస్తుందని అంటారు. ఈనాడు ఏ కోరికలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఆ కోరికలు తీరుతాయి కాబట్టి ఈ ఏకాదశి పర్వాన్ని కామద ఏకాదశి అన్నారు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. లలిత అనే గంధర్వ స్త్రీ ఈ తిథి నాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, తన కోరికలను తీర్చుకుందట. ఆమె మనసులోని కామితం (కోరిక) నెరవేరింది కాబట్టి ఇది కామదౌకాదశి (కామద ఏకాదశి) అయ్యింది. గోదావరి తీర ప్రాంతంలో ఈ ఏకాదశిని వాడపల్లి ఏకాదశి పేరుతో జరుపుకుంటారు. ఈనాడు అక్కడి వేంకటేశ్వరస్వామికి కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈనాడు లక్ష్మీనారాయణులను దమనములతో పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.

చైత్ర శుద్ధ ద్వాదశి
ఏప్రిల్‍ 9, బుధవారం
చైత్ర శుద్ధ ద్వాదశి విశిష్టత గురించి పద్మ పురాణంలో కొంత ప్రస్తావన ఉంది. ఏకాదశి నాడే క్షీరసాగర మథనం ప్రారంభమైంది. ఏకాదశి మర్నాడు ద్వాదశి నాడు ఈ పక్రియలో భాగంగా దేవతలు పాల సముద్రాన్ని మథించగా లక్ష్మీదేవి నాలుగు చేతులలో రెండు చేతులతో బంగారు పద్మాలను, మిగతా రెండు చేతులతో ఒక సువర్ణ పాత్రను, మాదీ ఫలాన్ని పట్టుకుని ఆవిర్భవించింది. అనంతరం చంద్రుడు పుట్టాడు. ఆ సందర్భంలో నారాయణుడు దేవతలను ఉద్దేశించి ఇలా అన్నాడు- ‘ద్వాదశి నాడు లక్ష్మీసహితుడనైన నన్ను తులసీ దళాలతో విశేషంగా పూజించారు. కాబట్టి ద్వాదశి తిథి నాకు మిక్కిలి ప్రియమైనది. ఇది మొదలు జనులు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాటి ప్రాత:కాలాన శ్రద్ధాభక్తులతో లక్ష్మీసహితుడనైన నన్ను తులసితో పూజిస్తారో వారు స్వర్గలోకాన్ని పొందుతారు. ద్వాదశి ధర్మార్థ కామ మోక్షాలను నాలుగింటిని ఇచ్చేది’ అని పలికాడు. అందుకే చైత్ర శుద్ధ ద్వాదశి నాడు విష్ణు దమనోత్సవం నిర్వహించాలని వివిధ వ్రత గ్రంథాల్లో ఉంది. దీనినే వాసుదేవార్చనగా వ్యవహరిస్తారు. మన పంచాంగకర్తలు మాత్రం ఈనాటి వివరణలో వామన ద్వాదశి అని రాస్తారు. వామనుడిని లేదా విష్ణువును లేదా వాసుదేవుడిని
ఈనాడు దమనంతో పూజించాలని నియమం. దమనం అంటే పరిమళ పత్రం.

చైత్ర శుద్ధ త్రయోదశి
ఏప్రిల్‍ 10, గురువారం

చైత్ర శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశి అనీ లేదా మదన త్రయోదశి అనీ అంటారు. అనంగుడన్నా, మదనుడన్నా మన్మథుడని అర్థం. దీనిని బట్టి ఇది మదనుడికి సంబంధించిన పర్వమని అర్థమవుతోంది. మన్మథుడు శివాగ్రహానికి గురై అనంగుడిగా మారాడు. అనంగుడు అంటే దేహం లేని వాడు. దీనికి సంబంధించి పురాణాలలో రెండు కథలు ఉన్నాయి. చైత్ర మాసంలో అనంగ్‍ ఉత్సవ్‍ పేరుతో ఉత్తరాదిన గొప్ప ఉత్సవ వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో చైత్ర మాసపు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈనాడు ప్రజలు తమ ఇళ్ల వెలుపల రంగోలీలను తీర్చిదిద్దుతారు. త్రయోదశి తిథి నాడు ప్రదోష యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు చాలా పవిత్రమైనవి. అనంగ్‍ త్రయోదశి నాడు ఉపవాసం పాటిస్తే వైవాహిక జీవితంలో దంపతుల మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయని అంటారు. వారి సంతానానికి మంచి కుటుంబం ఏర్పడుతుందని చెబుతారు. సాక్షాత్తూ తన చేతిలో దహనమైన కామదేవ్‍ (మన్మథుడు) కోసం శివుడు ఏర్పరిచిన పర్వమిది. ఈనాడు శివపార్వతులకు తెల్లటి రంగు వస్తువులు, వస్త్రాలు, తీపి పదార్థాలను నివేదించాలి. శివుడిని దమనాలతో పూజించాలని వ్రత గ్రంథాలలో ఉంది. ఈనాడు చేసే శివపూజ మిక్కిలి ఫలప్రదమైనదని అంటారు. ఈ ఒక్కనాటి పూజ వలన సంవత్సరం మొత్తం శివుడిని పూజించిన ఫలం కలుగుతుంది.
భగవాన్‍ వర్థమాన మహావీర్‍ జయంతి దినం కూడా ఈనాడే. జైన మతస్తులకు ఈయన ఆరాధనీయుడు. జైన మతంలోని 24వ, చివరి తీర్థంకరుడు కూడా ఈయన.

చైత్ర శుద్ధ చతుర్దశి
ఏప్రిల్‍ 11, శుక్రవారం

చైత్ర శుద్ధ చతుర్దశి.. శైవ చతుర్దశి, కర్దమ క్రీడ, రౌచ్యమన్వాదిగానూ ప్రసిద్ధి. రౌచ్యుడు రుచి కుమారుడు. రుచి భార్య మాలిని. రుచికి పితృ దేవతలు అతని కొడుకు మనువు కాగలడని చెప్పారు. అలాగే, రౌచ్యుడు మనువు అయ్యాడు. ఈయన మన్వంతరంలో బృహస్పతి ఇంద్రుడు అయ్యాడు. అతని కుమారులైన చిత్రసేనుడు, దృఢుడు, సురధుడు మొదలైన వారు రాజులై పాలించారు. ఈనాడు కూడా శివపూజ చేయగదగినది. ఈనాడు ఇంకా నృసింహ డోలోత్సవం చేస్తారని స్మ•తి కౌస్తుభం, మహోత్సవ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలలో ఉంది.

చైత్ర శుద్ధ పౌర్ణమి
ఏప్రిల్‍ 12, శనివారం

చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వరాహ పురాణాన్ని దానం ఇస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈనాడు పశుపతవ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామని అనే వ్రత గ్రంథంలో రాశారు. చైత్ర పూర్ణిమను మహాచైత్రి అని కూడా ఉంటారు. ఈనాడు చిత్ర వస్త్ర దానం, దమన పూజ విహితకృత్యాలుగా ధర్మశాస్త్ర గ్రంథాలు నిర్దేశించాయి. చిత్ర వస్త్రదానం అంటే రంగురంగుల బట్టలను దానం చేయడం. ఈ పర్వ సందర్భంలో ఇంద్రాది సమస్త దేవతలకు దమన పూజ చేయడం మహా ఫలాన్నిస్తుంది. అలాగే చిత్రా పూర్ణిమ నాడు చిత్రగుప్త వ్రతం చేసే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. పూర్ణిమలు రెండు రకాలు. ఒక కళ చేత తక్కువైన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ ఒకటి. ఈ పూర్ణిమను ‘అనుమతి’ అంటారు. పదహారు కళలతో కూడిన వాడుగా చంద్రుడు ఉండే పూర్ణిమ మరొకటి. ఇది రాకా పూర్ణిమ. సూర్యేందు సంగమ కాలం అమావాస్య. అమావాస్య నుంచి పూర్ణిమకు పదహారు రోజులు. అమావాస్య నుంచి పున్నమికి, పున్నమి నుంచి అమావాస్యకు గల కాలాన్ని పర్వసంధి అంటారు. అమావాస్య నుంచి పూర్ణిమాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కొక్క దినానికి చంద్రుడికి ఒక్కో కళ హెచ్చుతూ ఉంటుంది. పూర్ణిమాస్య నుంచి అమావాస్య వరకు గల పదహారు దినాలలో ఒక్కో దినానికి చంద్రునికి ఒక్కో కళ తగ్గుతూ ఉంటుంది. పదహారు కళలలో ఒదుగుతూ పూర్ణిమ నాడు చంద్రుడు కాంతివంతుడై ఉంటాడు. ఇలా చంద్రుడు కాంతివంతంగా ప్రకాశించే దినాలు ఏడాదికి పన్నెండు ఉంటాయి. అనగా, ఏడాదికి పన్నెండు పూర్ణిమలన్న మాట. ఈ పన్నెండు పూర్ణిమలలోనూ చంద్రుడు ఒక్కో నక్షత్రంతో కూడి ఉంటాడు. ఆ నక్షత్రాన్ని బట్టి ఆ పూర్ణిమకు పేరు వస్తుంది. మనకున్న ఇరవై ఏడు నక్షత్రాలలో చిత్ర ఒకటి. అటువంటి చిత్తా నక్షత్రంతో కూడిన పూర్ణిమకు ‘చైత్రీ’ అని పేరు. ఈనాడు మధుర కవి ఆళ్వారు తిరు నక్షత్రం కూడా. అలాగే ఒక ఏడాదిలోని పన్నెండు పూర్ణిమలు పన్నెండు పర్వాలుగా కూడా ఉన్నాయి.
చైత్ర పూర్ణిమ తిథి హనుమజ్జయంతి (శ్రీ హనుమ ద్విజయోత్సవం) పర్వంగా కూడా ప్రసిద్ధి. ఆంధ్రులలో మధ్వ మతస్తులకు ఇది మరీ ముఖ్యమైన పండుగ. హనుమంతుడు అంజనాదేవి పుత్రుడు. అంజన కేసరి అనే వానరుని భార్య. సంసారంలో విసుగుపుట్టి కేసరి తపస్సు చేసుకోవడానికి వెళ్లాడు. తపస్సుకు వెళ్తూ అతను తన భార్యను వాయుదేవునికి అప్పగించాడు. ఆమె శ్రద్ధాభక్తులకు మెచ్చి, వాయువు తన గర్భమందున్న శివుని వీర్యాన్ని ఆమెకు ఇచ్చాడు. దాంతో ఆమె గర్భం ధరించి కుమారుడిని ప్రసవించింది. అతనే ఆంజనేయుడు. వాయు ప్రసాదితం కావడం చేత అతనికి వాయుపుత్రుడు అనే పేరు కూడా వచ్చింది. అలాగే, ఈనాడు ఆంధప్రదేశ్‍లోని ఒంటిమిట్టలో గల శ్రీరామాలయంలో సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 13, ఆదివారం

చైత్ర బహుళ పాడ్యమి నాడు పాతాళ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు జ్ఞానావాప్తి వ్రతం కూడా చేస్తారని తెలుస్తోంది. అయితే, ఈ వ్రతాచరణలకు సంబంధించి వివరాలు అందుబాటులో లేవు. ఈ తిథి నాడు ప్రపాదానం చేయాలని, ధర్మఘటాది దినమని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఈనాడు సూర్యుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఈనాడు మేష సంక్రమణ పర్వం.

చైత్ర బహుళ పాడ్యమి
ఏప్రిల్‍ 14, సోమవారం

చైత్ర బహుళ పాడ్యమి తిథి సుదీర్ఘంగా ఉండటం వలన ఇది ఆదివారంతో పాటు సోమవారం కూడా కొనసాగుతోంది. ఈనాటి నుంచి అశ్విని కార్తె ఆరంభమవుతుంది. అలాగే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‍ బీఆర్‍ అంబేడ్కర్‍ జయంతి దినం కూడా ఈనాడే.

చైత్ర బహుళ చతుర్థి
ఏప్రిల్‍ 17, గురువారం

చైత్ర బహుళ చతుర్థి తిథి సంకష్ట హర చతుర్థి. సాధారణంగా చతుర్థి తిథి గణపతి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. జనులు తమ సంకటాలన్నీ హరించిపోవడానికి వరుసగా కొన్ని వారాల పాటు ప్రతి నెలలోనూ వచ్చే చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరిస్తుంటారు. తెలుగు నాట సంకష్టహర చతుర్థి వ్రతం బాగా ఆచరణలో ఉన్న వ్రత పర్వం.

చైత్ర బహుళ పంచమి
ఏప్రిల్‍ 18, శుక్రవారం

చైత్ర బహుళ పంచమి మత్స్య జయంతి దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. అయితే ఈ జయంతి దినంపై కొంత వివాదం కూడా ఉంది. ఎందుకంటే, చైత్ర శుద్ధ పంచమి నాడే మత్స్య జయంతి దినమని మన తెలుగు క్యాలెండర్‍, పంచాంగాలలో ఉంది. అయితే, అయితే విష్ణువు దశావతారాల్లో మూడు ముఖ్యమైన అవతారాలు చైత్ర మాసంలోనే వస్తాయని, వాటిలో శ్రీరామ నవమి మొదటిది కాగా, ఆ తరువాత వచ్చే రెండో అవతార జయంతి తిథి బహుళ పంచమి అనే వాదన ఉంది. ఇదిలా ఉండగా, విష్ణువు పది అవతారాల్లో మత్స్యావతారం మొదటిది. సోమకుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకునిపోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. దీంతో బ్రహ్మ సృష్టికార్యం ఆగిపోయింది. ఆపై బ్రహ్మ విజ్ఞప్తితో విష్ణువు మత్స్యావతారం దాల్చి రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించాడు. అలా విష్ణువు చేప అవతారమెత్తిన దినం చైత్ర బహుళ పంచమి నాడేనని విశ్వాసం. ఇక, మత్స్యం (చేప) హిందువులలోనే కాక ఇతర మతాల్లోనూ దైవం రూపంలో ఆరాధనలు అందుకుంటోందని తెలుస్తోంది. క్రైస్తవులలో మత్స్యం శాంతి దేవతగా, మహమ్మదీయులలో చేప భగవానుడిగా పేర్కొని ఉంది. బౌద్ధ జాతక కథలలో బుద్ధుడు చేపగా పుట్టినట్టు ఉంది.
ఇక, మత్స్య జయంతికి సంబంధించి మరో కథ కూడా వ్యాప్తిలో ఉంది. ఒకనాడు వైవస్వత మనువు పితృ తర్పణం చేస్తూ ఉన్నాడు. అతని దోసిట్లో ఒక చిన్న చేప పడింది. కరుణించి ఆయన దానిని తన కమండలంలో వేశాడు. అందులో అది ఒక పగలు, ఒక రాత్రి ఉండి పదహారు అంగుళాలు పెరిగింది. తను ఉండటానికి ఆ కమండలం చాలకుండా ఉందని అది గోల పెట్టింది. అప్పుడు మనువు దానిని ఎత్తి ఒక నీళ్ల కాలువలో ఉంచాడు. అందులో అది ఒక రాత్రి ఉంది. ఆ రాత్రికి రాత్రి అది మూడు మూరల పొడవు పెరిగింది. నాకీ చోటు చాలక చచ్చిపోతున్నాను.. నన్ను రక్షింపవలసింది అని ఆ చేప మనువుకు మొర పెట్టుకుంది. అప్పుడు మనువు దానిని ఒక నూతిలో వేశాడు. అది ఆ నుయ్యి కూడా సరిపోనంత పెద్దగా పెరిగింది. అందుమీద మనువు దానిని ఒక చెరువులో వదిలాడు. అది ఆ చెరువు పట్టనంతటి పెద్ద చేపగా మారింది. అంతట ఆయన దానిని ఒక నదిలో వదిలాడు. పెరుగుతూ వచ్చిన చేపకు ఆ నది కూడా సరిగా సరిపోలేదు. ఆ పిమ్మట మనువు దానిని సముద్రంలో ఉంచాడు. అది సముద్రంలోకి చేరడంతోనే కడలి అంతా అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలంలో ఆ మీనం మేను రెండు లక్షల యోజనాల ప్రమాణానికి పెరిగింది. అంత బ్రహ్మాండంగా పెరిగి కూడా అది ‘నన్ను రక్షించు.. నన్ను రక్షించు’ అని మొర పెట్టుకోవడం మానలేదు.
మనువుకి ఇదంతా చూసి ఆశ్చర్యం వేసింది. ‘ఓ మత్స్యమా! నీ లీలలు లోగడ చూసీ ఉండనివిగా ఉన్నాయి. కనీసం విని అయినా ఉండనివి ఉన్నాయి. నీవు నిజానికి వాసుదేవుడవో, కాకపోతే అసురుడవో అయి ఉండాలి’ అన్నాడు.
అప్పుడు ఆ చేప ‘ఓ వైవస్వతా! నీవు నన్ను గుర్తించావు. కాబట్టి నీకు ఒక సంగతి చెబుతున్నాను. ఇదిగో ఈ నావను చూడు. ప్రళయ కాలం సమీపించింది. ఇప్పుడు చాక్షుష మన్వంతరం నడుస్తోంది. ఆ మన్వంతరం నూరేండ్లలో ముగుస్తుంది. ఆ ముగింపునకు ముందు అనావృష్టి దోషం కలుగుతుంది. ఆ కారణంగా కరువు ఏర్పడుతుంది. ఆ పిమ్మట సంవర్తం, భీమనాదం, ద్రోణము, ఇంద్రము, వలాహకము, విద్యుత్పతాకము, శోణము అనే ఏడు మేఘాలు విజృంభించి అధిక వ••ష్టిని కలిగిస్తాయి. ఆ వానకు సప్త సముద్రాలు ఏకమై జళ ప్రళయం కలుగుతుంది. భూమి వనపర్వత సహితంగా జలార్ణవంలో మునిగిపోతుంది. కాబట్టి ముందుగానే వేదములు, విద్యలు, బీజములు మున్నగునవి- నేను, బ్రహ్మ, దేవతలు మున్నగు వారు నీచే రక్షితులు కావాలి. ఆ జల ప్రళయంలో అనంతుడనే పాము నీటి మీద తేలుతూ ఉంటుంది. ఆ పామును తాడుగా చేసి ఈ నావను నా కొమ్ముకు కట్టివేయి. అప్పుడు ప్రళయ మారుతం వీచి ఈ ఓడను కుదుపి వేస్తుంది. ఆ అల్లకల్లోలానికి నీవు ఏమీ భయపడవద్దు’ అని చెప్పి ఆ చేప అంతర్థానమైంది.
ప్రళయ కాలంలో మనువు ఆ చేప చెప్పినట్టే చేశాడు. మత్స్యమూర్తి అయి ఆనాడు ఇట్లు వేదాలను తెచ్చి లోకానికి ఇచ్చి కాపాడాడు. ఇది జరిగిన చైత్ర బహుళ పంచమి నాడు మత్స్యమూర్తి ప్రతిమను పూజించాలనే నియమం ఏర్పడింది.

చైత్ర బహుళ నవమి
ఏప్రిల్‍ 22, మంగళవారం

చైత్ర బహుళ నవమి నాడు దుర్గాదేవిని పూజించాలి. అలాగే ఈనాడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ధరిత్రి అంటే భూమి. ఈ భూమిని పర్యావరణహితంగా కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. మనం నివసించే నేల బాగుంటే మనమూ బాగుంటాం. కాబట్టి దాని ప్రాధాన్యాన్ని గుర్తించి ఏటా అవగాహన కలిగించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు.

చైత్ర బహుళ ఏకాదశి
ఏప్రిల్‍ 24, గురువారం

చైత్ర బహుళ ఏకాదశి వరూధిని ఏకాదశిగా, వరూథిన్యేకాదశిగా ప్రతీతి. దీనినే మన పంచాంగకర్తలు వరూథిని వ్రతం అనీ అంటారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేసిన వారికి వేయి గోదానాలు చేసిన ఫలం కలుగుతుందని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో వివరాలు ఉన్నాయి. చైత్ర కృష్ణ (బహుళ) ఏకాదశి తిథి వల్లభాచార్యుల జన్మదినం కూడా.

చైత్ర బహుళ త్రయోదశి
ఏప్రిల్‍ 26, శనివారం

చైత్రంలో వచ్చే దశావతారాల్లో మూడు అవతార జయంతుల్లో వరాహావతారము మూడవది. ఇది విష్ణుమూర్తి పది అవతారాల్లో మూడవది. ఈ అవతారం శ్రీరామావతారం జరిగిన చైత్ర శుద్ధ నవమి నాడే అని కూడా అంటారు. కానీ, ఈ జయంతి తిథి కూడా వివాదగ్రస్తమై ఉంది. వరాహావతారం చైత్ర బహుళ త్రయోదశి నాడు ప్రాదుర్భవించిందని తెలుగు పంచాంగాలు చెబుతున్నాయి. కాగా, ఆనాడే వరాహ జయంతి జరపవలసి ఉంది.
ఈ అవతారంలో విష్ణుమూర్తి లోకకంటకుడైన హిరణ్యాక్షుని సంహరించాడు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బలగర్వితుడై భూమిని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకునిపోయి పాతాళ లోకంలో దాక్కున్నాడు. అప్పుడు భూదేవి తన బాధలు విష్ణుమూర్తితో చెప్పుకుంది. ఆ మొర విని విష్ణువు ఒక పెద్ద పంది రూపాన్ని ధరించి వెలిశాడు. దాని శరీరం నల్లని పర్వతంలా ఉంది. దాని కోరలు తెల్లగా వాడిగా ఉన్నాయి. దాని గింజలు ఇనుపదిమ్మెలుగా ఉన్నాయి. దాని కన్నులు పెద్ద జ్యోతుల్లా ఉన్నాయి. అది ఘీంకరిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఇటువంటి రూపంతో గల ఆ వరాహం వచ్చి హిరణ్యాక్షుడిని ఎదుర్కొంది. ఇద్దరి మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో హిరణ్యాక్షుడు చనిపోయాడు. అప్పుడు ఆ వరాహమూర్తి పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు. తనను ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి నమస్కరించి స్తుతించింది. ఇక, ఇది వరాహవతారానికి సంబంధించిన మరో కథ..
కల్పాంతంలో ఒకసారి సమస్తమూ జలమయమై పోయింది. బ్రహ్మాండమంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలార్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. నిత్యులైన మహర్లోక నివాసులు కొందరు స్తుతింపగా ఆయన మేల్కొన్నాడు. తిరిగి జగత్‍ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండానికి ఊర్థ్వ, అథోముఖాలు అయ్యేటట్టు రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు.
అథోభాగాండ ఛిద్రం నుంచి యుల్బము భూమి మీద పడింది. అది మేరు పర్వతమైంది. పిదప నానావిధములైన పర్వతము, చెట్లు, చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు స్థితి వలే ఉంది. భూదేవి తన బాధను విష్ణువుకు చెప్పుకుంది. అప్పుడు విష్ణుమూర్తి భూదేవితో, ‘నీవు భయపడకు. నిన్ను ఉద్ధరిస్తాను’ అన్నాడు. భూమిని తేల్చడం కోసం ఆయన వరాహావతారాన్ని పొందాడు. నూరు ఆమడల వెడల్పు, ఇన్నూరామడల పొడవు గల పంది రూపం ధరించాడు. అది నల్లని మబ్బులా ఉంది. యజ్ఞ స్వరూపాన్ని పోలిఉండడం వల్ల దానికి యజ్ఞ వరాహమూర్తి అనే పేరు వచ్చింది. ఆ యజ్ఞ వరాహ మూర్తి పాతాళ లోకానికి వెళ్లి భూమిని పైకి ఎత్తాడు. దీంతో భూమి స్వస్థానాన్ని చేరింది. అప్పుడు భూదేవి విష్ణుమూర్తిని పలువిధాల స్తుతించింది.

చైత్ర బహుళ చతుర్దశి
ఏప్రిల్‍ 26, శనివారం

చైత్ర బహుళ చతుర్దశి ఘడియలు కూడా త్రయోదశి తిథి సమయంలోనే కూడి ఉన్నాయి. కాబట్టి చతుర్దశి కూడా ఏప్రిల్‍ 26 నాడే. చైత్ర బహుళ చతుర్దశి తిథి నాడు గంగాస్నానం చేస్తే పిశాచత్వం రాకుండా పోతుందని అంటారు. చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమవారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనదని అంటారు.

చైత్ర బహుళ అమావాస్య
ఏప్రిల్‍ 27, ఆదివారం

చైత్ర బహుళ అమావాస్య నాడు వహ్ని వ్రతం ఆచరిస్తారు. పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఇది అమావాస్య తిథి. అమావాస్య కూడా పర్వదినమే అని ఒక నానుడి వాడుకలో ఉంది. కానీ చిరకాలంగా అమావాస్య పర్వదినంగానే పరిగణనలో ఉంది. బహుళ చతుర్దశి తిథికి అమావాస్య అనే పేరు ఎందుకు వచ్చిందో తెలిపే కథ ఇది.
అచ్ఛోదము అని ఒక కొలను ఉంది. సోమవులనే పితరుల మానస పుత్రిక ఆ కొలను ఒడ్డున ఉండి తపం చేయసాగింది. ఈ కారణంగా ఆమె అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు కోరిక పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనం ఇచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా వాడు దివ్యాలంకార భూషితునిగా కూడా ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ మావసుడు మాత్రం చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఆ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఆనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాలు ఇవ్వడం ఆచారంగా వస్తోంది.
ఈనాటి నుంచి భరణి కార్తె ఆరంభమవుతుంది.

వైశాఖ శుద్ధ పాడ్యమి
ఏప్రిల్‍ 28, సోమవారం

ఈనాటి నుంచి వైశాఖ మాస తిథులు ఆరంభం అవుతాయి. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా అంటారు. మాధవుడు అంటే విష్ణువే. అంటే ఇది విష్ణువుకు ప్రీతికరమైన మాసం. మాధవ మాసంగా పేరొందిన వైశాఖ మాసానికి వైశాఖ శుద్ధ పాడ్యమి ఆరంభ దినం. వైశాఖ స్నాన వ్రతాలు ఈ తిథి నుంచే మొదలవుతాయి. వాజ్ఞనః కాయజాశేష పాపాలు వైశాఖ స్నానంతో పోతాయని ప్రతీతి. ప్రాతఃకాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవునికి ప్రీతి కలుగుతుంది. స్నానాంతరం రావి చెట్టుకు నీరుపోసి ప్రదక్షిణాలు చేయడం ఆరోగ్యకరం. ఈ మాసంలో తులసి దళాలలో మాధవుడికి పూజ చేస్తే పుణ్యం కలుగుతుంది.

వైశాఖ శుద్ధ విదియ
ఏప్రిల్‍ 29, మంగళవారం

దశావతారాల్లో ఆరవది పరశురామావతారం. ఇది ఏటా అక్షయ తృతీయ నాడు జరుపుకోవాలని అంటారు. కానీ, పంచాంగాలలో మాత్రం ఏప్రిల్‍ 29నే సూచిస్తోంది. అక్షయ తృతీయ ఏప్రిల్‍ 30న ఉంది. తేదీ వాదోపవాదాల్లోకి వెళ్లే కంటే, ఈ జయంతి ప్రాధాన్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం. పరశురాముడు జమదగ్ని, రేణుక దంపతుల కుమారుడు. ఈయన ఆయుధం గొడ్డలి (పరశువు). గొప్ప శివభక్తుడు. మహిష్మతి వంటి పెద్ద సామ్రాజ్యాన్ని జయించిన మహావీరుడు. లక్ష్మీదేవి అవతారమైన ధనవిని వివాహం చేసుకున్నాడు. కొన్ని గ్రంథాల ప్రకారం ఈయన చిరంజీవి. అంటే అమరుడు. ఇప్పటికీ ఆయన ఈ భూమిపై ఉన్నట్టు నమ్ముతారు. ఈయన భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడులకు గురువని అంటారు. హరివంశ పురాణం ప్రకారం కార్తవీర్యార్జునుడు మహిష్మతి రాజ్యానికి రాజు. ఆనాడు క్షత్రియ రాజుల పాలనలో ప్రజలు అనేక బాధలు పడేవారని, ఆ బాధలు పడలేక తమ భూమిని, తమను క్షత్రియుల క్రూరత్వం నుంచి కాపాడాలని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు విష్ణువు పరశురాముని పేరుతో రేణుక, జమదగ్ని మహర్షి దంపతులకు జన్మించాడు. ఆయన క్షత్రియులను సంహరించి భూమిని, ప్రజలను కాపాడాడు. ఈ వివరాలన్నీ స్కంద పురాణం, విష్ణు పురాణం, హరివంశ, భశివ పురాణాల్లో ఉన్నాయి. పరశురాముడిని శివుడు, విష్ణువు.. ఇద్దరికీ ప్రతిరూపమని భావిస్తారు. తండ్రి ఆదేశం మేరకు కన్నతల్లినే సంహరించి, తిరిగి బతికించుకున్నాడు. ఈయన తన గొడ్డలితో క్షత్రియులను, వారి సామ్రాజ్యాలను ఇరవై ఒక్కసార్లు నాశనం చేశాడు.

వైశాఖ శుద్ధ తదియ
ఏప్రిల్‍ 30, బుధవారం

వైశాఖ శుక్ల తృతీయ అక్షయ తృతీయ అనీ, ఈ పర్వం పూర్వాహ్ణ వ్యాపినీ అని వ్రతరాజం చెబుతోంది. ఇది గొప్ప పుణ్యదినం.
వైశాఖే మాసి రాజేంద్రశుక్ల పక్షే తృతీయకా
అక్షయాసాతిథిః ప్రోక్తా కృత్తికా రోహిణీయుతా
అని శాస్త్ర ప్రమాణం. ఈనాడు చేసే దానాలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని ప్రతీతి. దానాలే కాదు ఈనాడు దేవతలను గురించి, పితృ దేవతలను గురించి చేసే పూజలు కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి. అందుచేతనే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది. ఈ పర్వాన్ని గురించి శ్రీకృష్ణుడు యుధిష్ఠరున (ధర్మరాజు)కు చెప్పినట్టు భవిష్య పురాణంలో ఉంది.
‘‘పూర్వ కాలంలో దరిద్రుడు, ప్రియవాది, సత్యవంతుడు, దేవగురు జనభక్తుడు అయిన ఒక కోమటి ఉండేవాడు. అతను ఒకసారి వైశాఖ మాస శుక్ల పక్ష మహాత్స్యం గురించి పెద్దల ద్వారా విని అక్షయ తృతీయ నాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లు, విసినకర్రలు దానం చేశాడు. ఆ కోమటి ఉత్తర జన్మలో కుశవతి నగరంలో ధనవంతుడైన ఒక క్షత్రియుడి ఇంట పుట్టాడు. ఆ జన్మలోనూ అతని సంపద క్షయం కాకుండా అక్షయమవుతూ ఉండేది. ఇదంతా అక్షయ తృతీయ వ్రతాచరణ ప్రభావం’’. ఇదీ ధర్మరాజుకు కృష్ణుడు చెప్పిన కథ.
అలాగే వ్రతోత్సవ చంద్రికాకారుడు ఈ వ్రత విధానాన్ని వివరిస్తూ విశేషాలు ఇలా చెబుతున్నారు-
‘‘ఈ రోజున గంగాస్నానం చేసే వారు సకల పాప విముక్తులు అవుతారు. పితృదేవతలకు తర్పణాదులు విడవాలి. లక్ష్మీసహితమైన నారాయణుని, గౌరీసహితుడైన త్రిలోచనుడిని పూజించాలి. ఆ పూజా సమయంలో విసనకర్రలు, లడ్లు పంచి పెట్టిన వారు వైకుంఠాన్ని, శివలోకాన్ని పొందుతారు. యవలతో అన్నం వండి దేవుడికి ఆరగింపు చేయాలి. గురువులకు నవధాన్యాలు, గ్రీష్మ రుతువులో లభ్యమయ్యే ఇతర వస్తువులతో కలిపి దానం చేయాలి. ఈనాటి దానాల్లో జలపూరిత కుంభం ముఖ్యమైనది. ఈనాడు ఒంటిపూటే భోజనం చేయాలి.
అక్షయ తృతీయ వ్రతం కేవలం ధార్మిక గుణ సంపన్నమైనది. అందువల్ల ఈ పండుగ అట్టే ఆర్భాటంతో జరిగేది కాదు. ఈ పర్వం హిందూ దేశం అంతటా ఆచరణలో ఉంది. దేవాలయాల్లో ఈనాడు విగ్రహాలకు ధవళ వస్త్రాలు కడతారు’’.
పై వివరణ వల్ల ఈ రోజున తీర్థ స్నానం, తిలలతో పితృ తర్పణం, ఘటదాన ధర్మాలు, దైవపూజ విధాయక కృత్యాలని తెలుస్తోంది.

ఇక, పంచాంగకర్తలు వైశాఖ శుక్ల తదియ తిథి ఎన్ని విధాలుగా ప్రశస్తమైనదో చెబుతున్నారు. ఈ తిథి నాడు అక్షయ తృతీయతో పాటు వచ్చే ఇతర పర్వాలు ఇవి అని పంచాంగంలో రాశారు.
1. దధ్యన్న వ్యజన ఛత్ర పాదుకోపానహదానాని ఉదకకుంభ దానం
2. లక్ష్మీనారాయణ పూజ
3. గౌరీ పూజ, త్రిలోచన గౌరీ వ్రతం
4. త్రేతాయుగాది
5. బలరామ జయంతి
6. సింహాచల క్షేత్ర చందన మహోత్సవం
అక్షయ తృతీయ నాడు పెరుగు అన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మున్నగునవి దానం చేయాలని నిర్దేశించారు. గతంలో వైశాఖ మాసంలో ‘వైశాఖ పూజ’ అనే పేరుతో సంపన్న గృహస్థులు ఒక వ్రతం చేస్తుండే వారట. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మున్నగునవి కూడా పంచి పెట్టేవారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా ఈనాడు దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం యొక్క ప్రధానోద్ధేశమని దీనిని బట్టి అర్థమవుతోంది.
అక్షయ తృతీయ నాడు చేసే దానాలలో ముఖ్యమైనది- ఉదకకుంభ దానం ఒకటి. వైశాఖ మాసం నుంచి ఎండలు మెండుగా ఉంటాయి. ఎండల రోజుల్లో కుండల్లో జాగ్రత్తపెట్టిన నీరు పుచ్చుకుంటే బాగా దాహశాంతికరంగా, ఆప్యాయంగా ఉంటుంది. కావునే నీటితో నిండిన చల్లని కుండల్ని ఈ కాలంలో దానం చేయడం మత విధుల్లో ఒకటిగా మన పెద్దలు నిర్ణయించారు.
అయితే, ప్రస్తుతం అక్షయ తృతీయ ఆచరణ విధి తీరుతెన్నులు మారాయనే చెప్పాలి. ఈనాడు ఎంతోకొంత బంగారం లేదా విలువైన వస్తువులు కొనడమే ఎక్కువ ఆచారంగా మారింది.

సింహాచలేశుని చందనోత్సవం
వైశాఖ శుద్ధ తదియ (ఏప్రిల్‍ 30) ఎన్నో పర్వాలకు నెలవు. ఈ తిథి నాడే వచ్చే మరో ముఖ్య పర్వం సింహాచల నృసింహ స్వామి చందనోత్సవం.
తెలుగుదేశంలోని గొప్ప క్షేత్రాలలో సింహాచలం ఒకటి. శ్రీవరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈనాడు చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తృతీయ నాడు సాధారణంగా కృత్రికా నక్షత్రం అవుతూ ఉంటుంది. గణిత భేదం చేత ఒకప్పుడు రోహిణీ మృగశీర్షా నక్షత్రాలలో ఏదో ఒకటి రావచ్చు. సాధారణంగా కృత్రిక నక్షత్రం అగ్ని సంబంధం కలది. రోహిణి కూడా కొంచెం ఇంచుమించు అటువంటిదే అని చెప్పవచ్చు. అగ్ని సంబంధం వలన తీక్షణత కలుగుతుంది. అ తీక్షణత తగ్గడానికి చందన సేవ ఒక విధమైన శైత్యోపచారం. సింహాచల స్వామికి విదియ నాటి రాత్రి గంథమును ఒలిచి వేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్ర ఘటాభిషేకం చేస్తారు. ఆ పిమ్మట స్వామి నిజరూప దర్శనం. స్వామి రూపం లింగాకృతంలో కనిపిస్తుంది. పంది ముట్టి తరువాత విగ్రహ రూపం కనిపిస్తుంది. నిజ రూప దర్శనం అయ్యాక తిరిగి స్వామికి చందనచర్చిత సేవ జరుగుతుంది. ఈ గంథం ఒలుపు సహస్ర ఘటాభిషేకం, చందనసేవ తదితర వాటితో కూడి ఉంటుంది.
తెలుగునాట అతి ప్రాచీన క్షేత్రాలలో ఒకటి సింహాచలం. ఈ కొండ సింహం రూపంలో ఉండటం చేత ఆ పేరొచ్చిందని కొందరు అంటారు. ఇక, నరసింహ స్వామి క్షేత్రం కావడం వల్ల ఆ పేరు వచ్చిందని మరికొందరు చెబుతారు. ఎనిమిది వందల అడుగుల ఎత్తు గల ఈ కొండ వేసవిలో కూడా చల్లగా ఉండటం విశేషం. నీటి ధారలు ఎక్కువగా పారుతుంటాయి. హనుమద్దార, ఆకాశధార, పంచపాండవుల ధార మున్నగు నీటిధారలు ఈ కొండపై మిక్కిలిగా ఉన్నాయి. వీటన్నిటికి ఆధారమైన ధార పుట్టధార.
ఇక, సింహాచలేశుడికి జరిగే చందన సేవ గురించి చెప్పుకుందాం. చందనాను లేపనం మంగళప్రదమైనది. ఆరోగ్యప్రదమైంది. చందనం అమూల్యమైన మూలిక. ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్తదోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విషాహారంగానూ, క్రిమిహారంగానూ ఉంటుంది. అంతస్తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలువ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో చందనాన్ని విరివిగా వాడతారు. చందానాసవం, చందనాదివంటి వంటివి ఈ ద్రవ్యంతోనే తయారు చేస్తారు. చందనం నుంచి చాందినీ అత్తరువు తయారు చేస్తారు. సబ్బుల తయారీలో కూడా దీనిని వినియోగిస్తారు. మన మత విధులలో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. నిష్టాపరులు దీనిని పగటి భోజనానికి ముందు నుదుటికి, చాతీకి, పై జబ్బలకు రాసుకుంటారు. నుదుటికి రాసుకోవడం వలన తలలో వేడి చేరకుండా, తలనొప్పి రాకుండా కాపుదలగా ఉంటుంది. ఛాతీకి రాసుకోవడం వల్ల హృదయానికి మేలు చేసి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. జ్వర సంబంధమైన వేడి తగ్గడానికి రోగి కణతలకు ఉడుకులోనుకు బదులుగా మంచి గంధం రాస్తారు. వేసవిలో ఒళ్లు పేలకుండా ఉండడానికి గంధంపూత మంచి మందు. అనేక చర్మవ్యాధులకు, కీళ్లవాతాలకు, జట్టురాలకుండా ఉండటానికి అది మంచి అను లేపనం. చందనచర్చ చెమటను, దుర్గంధాన్ని పోగొట్టి మనసుకు ఉల్లాసం పుట్టిస్తుంది. భ్రమను పోగొట్టి స్మ•తిని కలిగిస్తుంది.
శుభకార్యాల సందర్భంలో గంధాలు పూసుకోవడం సహజం. పేరంటపు వేళల్లో స్త్రీలు మెడలకు, బుగ్గలకు గంధం పూసుకుంటారు. గంధం పొడి చల్లుకుంటారు. గంధం సమర్పించడం పూజించడానికి గుర్తు. శవాన్ని దహనం చేసేటప్పుడు మంటలో గంధపు చెక్కవేయడం ఆనవాయితీ. గంధం కొంచెం కొబ్బరినీళ్లలో కానీ, మంచినీళ్లలో కానీ కలుపుకొని తాగితే దాహం శాంతికరంగా ఉంటుంది. ఆరోగ్యకాములు వేసవిలో ముఖ్యంగానూ, విరివిగానూ వాడతగినది చందనమని సింహాచల చందనోత్సవం ఎలుగెత్తి చాటుతుంది.

హనుమజ్జయంతి..
ఏటా రెండుసార్లు

హనుమజ్జయంతి మంగళవారం కానీ, శనివారం కానీ వస్తే ఈ రోజును మహా పర్వదినంగా పండితులు చెబుతారు. ఏడాదికి రెండుసార్లు జరుపుకునే హనుమజ్జయంతి పర్వదినాన్ని ఏడాది చైత్ర మాసం (ఏప్రిల్‍ 12, శనివారం, చైత్ర శుద్ధ పూర్ణిమ)లో శనివారం నాడు జరుపుకోవటం ద్వారా, శనివారం కావడం వల్లా ఇది మరీ ప్రత్యేకమని చెబుతున్నారు.
రామాయణంలోని సుందరకాండలో చెప్పిన ప్రకారం సీతను రావణుడు అపహరించినపుడు సీతాన్వేషణ నిమిత్తం లంకకు బయల్దేరతాడు హనుమంతుడు. సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకిని కనుగొంటాడు. ఆరోజు చైత్ర మాసం, చిత్తా నక్షత్రం, పౌర్ణమి రోజు. సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి, రావణ సైనికులను హతమారుస్తాడు. అనంతరం రావణుడి సైనికులు హనుమంతుడి తోకకు నిప్పంటించగా, ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుని విజయోత్సవం జరుపుకోవాలి. కానీ, ఈ సందర్భాన్ని హనుమాన్‍ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్‍లో వస్తుంది.
కానీ, అసలైన హనుమజ్జయంతి మాత్రం వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి, పూర్వాభాద్ర నక్షత్రం రోజున ఆచరించాలని అంటారు. ఈ పండుగ సాధారణంగా ప్రతి సంవత్సరం మే చివరిలో కానీ, జూన్‍ తొలి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం శనివారమే అసలైన హనుమజ్జయంతి. హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ పుస్తకం ప్రకారం ప్రతి ఏటా ఒకసారి మాత్రమే, అది కూడా మే చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి.
ఆ రోజే అసలైన హనుమజ్జయంతి దినం
(మే 22, 2025).
మొత్తానికి ఒకే పర్వాన్ని రెండుసార్లు జరుపుకోవడం వల్ల పుణ్యమే కానీ, నష్టమేమీ లేదు. హనుమాన్‍ జయంతి రోజున ఆయనకు తమలపాకుల దండను సమర్పించాలి. తమలపాకులతో హనుమంతుడికి అష్టోత్తర శత నామ పూజ జరిపించాలి. ఆయనకు అరటిపండ్లు ప్రీతికరం. అందుకే జయంతి నాడు ఆయనకు వీటిని సమర్పించాలి. అలాగే వడపప్పు, పానకం కూడా నివేదించాలి. ఇంకా ఆయనకు ఎంతో ఇష్టమైన వడమాల, అప్పాల మాల సమర్పిస్తే కార్యసిద్ధి, జయం లభిస్తాయని శాస్త్ర వచనం. బెల్లం, శనగలు, బూందీ లడ్డూ కూడా హనుమంతుడికి ప్రీతికరమైన ప్రసాదాలు. అలాగే ఈ రోజున ఎరుపు రంగు పండ్లను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.
హనుమజ్జయంతి నాడు సామూహిక హనుమాన్‍ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణం విశేషంగా జరుగుతాయి. హనుమంతుడిని సింధూరంతో అభిషేకిస్తే కోరినవన్నీ అనుగ్రహిస్తాడని అంటారు. హనుమజ్జయంతి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఐదు రోజుల పాటు జాపాలి తీర్థంలో విశేష వేడుకలు నిర్వహిస్తారు. ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో ఈ ఉత్సవాలు కన్నులపండువలా జరుగుతాయి.

Review చైత్ర వైశాఖల వసంత వికాసాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top