లక్ష్మీ దీవెన..గణపతి పాలన

2025- ఆగస్టు 1, శుక్రవారం, శ్రావణ శుద్ధ అష్టమి నుంచి
2025- ఆగస్టు 31, ఆదివారం, భాద్రపద శుద్ధ అష్టమి వరకు..

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
-శ్రావణం/భాద్రపదం
– వర్ష రుతువు- దక్షిణాయణం

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో ఎనిమిదో మాసం- ఆగస్టు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం శ్రావణ మాసం.. భాద్రపద మాసంలో కొన్ని రోజులు కూడా కలుస్తున్నాయి. శ్రావణ, భాద్రపద తిథులతో కూడిన ఆగస్టు నెల పొడవునా పండుగలు, పర్వాలే. శ్రావణ, భాద్రపద మాసాలు పూర్తిగా వర్ష రుతు కాలం. ఈ మాసంలో ప్రతి రోజూ పండుగే.. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ పుత్రద ఏకాదశి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, బలరామ జయంతి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు, వ్రతాలకు ఆగస్టు ‘నెల’వు. ఇక, భాద్రపదంలో వచ్చే ప్రధాన పర్వం వినాయక చవితి ఈ నెలలోనే.

శ్రావణ మాసానికి శుభ మాసమనీ, నభో (ఆకాశ) మాసమనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా వర్ష రుతుకాలం. నిండైన వర్షాలతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం. సస్యశ్యామలమైన వాతావరణం.. ప్రకృతి పులకరింతలతో శోభిల్లే ఈ శుభ శ్రావణంలో ప్రతి రోజూ పండుగే. ఈ మాసంలో చేపట్టే ఎలాంటి పనికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అటు విష్ణుమూర్తి – లక్ష్మీదేవి దంపతులకు, ఇటు శివపార్వతులకు మిక్కిలి ప్రీతికరమైన మాసమిది. మహా విష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం. కాబట్టి ఈ మాసం విష్ణు, లక్ష్మీపూజకు ఉద్ధిష్టమైనది. సాధారణంగా అష్టమి, నవమి, అమావాస్య తిథులు శుభకార్యాలకు అంతగా అనువైనవి కాదంటారు. కానీ, శ్రావణ మాసంలో మాత్రం ఈ తిథులు కూడా పూజలు, శుభకార్యాలు తలపెట్టేందుకు అనువైనవి. అందుకే శ్రావణ మాసాన్ని శుభప్రదమైన మాసమనీ అంటారు. ఈ మాసంలో ఒక్కో రోజు ఒక్కో దేవతను విశేషంగా పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం మంగళగౌరీ వ్రతం, బుధవారం విఠలుడి, గణేశుడి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మి, తులసి పూజలు, శనివారం వేంకటేశ్వరస్వామి, హనుమంతుడి, శనీశ్వరుడి పూజలు, ఆదివారం సూర్యనారాయణస్వామి పూజలు నిర్వహిస్తారు. ఈ మాసంలో ఆచరించే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రధానంగా పూజలందుకునేది లక్ష్మీదేవి. కార్యసిద్ధి, విఘ్న నివారణ, విద్యాలబ్ధి, ఐశ్వర్యం, స్వచ్ఛత, జీవన సాఫల్యత.. ఈ ఆరు సుగుణాలు- ఆరు లక్ష్మీ రూపాలు. ఈ ఆరింటి సాధనకు శ్రావణ మాసంలో శ్రావణలక్ష్మిని త్రికరణ శుద్ధిగా ఆరాధించాలి. ఆమె- ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, ఉత్తమ గుణాలు, సిరిసంపదలు, శాంతం, శుభ్రత.. ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపం. ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుంది. తన గజ్జెల సవ్వడులతో ధనరాశుల్ని కురిపిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకొనే శుభ తరుణం శ్రావణమాసమే. ఇంకా, శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్‍ వంటి పర్వాలూ ఈ నెలలోనే పలకరిస్తాయి. ఆగస్టు మాసంలో ఎనిమిది రోజులు భాద్రపద మాస తిథులు కూడి ఉన్నాయి. భాద్రపదానికి భద్ర మాసమనే పేరు కూడా ఉంది. తొలి పూజలందుకునే గణనాథుడి వినాయక చవితి ఆగస్టు నెలలోనే. ఇంకా, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు.. ఆయా తిథుల్లో ఆచరించాల్సిన ముఖ్య విధుల గురించి..

శావణ శుద్ధ అష్టమి
ఆగస్టు 1, శుక్రవారం

శ్రావణ శుద్ధ అష్టమి తిథితో ఆగస్టు మాసం ఆరంభమవుతోంది. అష్టమి తిథి దుర్గాపూజకు ఉద్ధిష్టమైనది. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఈనాడు దుర్గాష్టమి అని ఉంది. ఈనాడు దుర్గాపూజను ఆరంభించి సంవత్సరం పొడవునా ప్రతి నెలా రకరకాల పూలతో శివుడిని, దుర్గాదేవిని పూజించాలని శాస్త్ర వచనం. అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు. శ్రావణ శుద్ధ అష్టమి ఆగస్టు 1, 2 తేదీలలో కూడా కొనసాగుతోంది. ఈ రెండు రోజుల్లోనూ శ్రావణ శుద్ధ అష్టమి నాడు ఆచరించే పూజలు, ఆచారాలను పాటించవచ్చు.

శ్రావణ శుద్ధ నవమి
ఆగస్టు 3, ఆదివారం

శ్రావణ శుద్ధ నవమి నాడు కౌమార (కుమారి) పూజలు చేస్తారు. కౌమార దశలో ఉన్న బాలికలకు ప్రత్యేక పూజలు చేయడానికి ఒక తిథిని ఉద్దేశించారు. అదే శ్రావణ శుద్ధ నవమి తిథి. ఈ తిథికి ‘కౌమారీ నామక పూజనమ్‍’ అని పేరు. ఈ పేరును బట్టి ఇది కౌమార దశలో ఉన్న బాలికలు ఆచరించే వ్రతంగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉన్నాయి.
శ్రావణ శుద్ధ నవమి నాడు కౌమారీ నామ పూజ చేయడం హిందూ సంప్రదాయం. ఈ రోజున కౌమారీ దేవతను పూజిస్తారు. కౌమారీ దేవి శక్తిస్వరూపిణి. దుర్గాదేవి అంశ. ఈ పూజ ద్వారా బాలికలు శక్తి, ధైర్యం, విజయం పొందుతారని అంటారు. కౌమారీ దేవి అనుగ్రహంతో ఆరోగ్యం, సంపద లభిస్తాయని భక్తులు నమ్ముతారు. శ్రావణ శుద్ధ నవమి రోజున ఉదయాన్నే స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజా మందిరాన్ని శుచి చేసి అందంగా అలంకరించాలి. కౌమారీదేవి విగ్రహాన్ని లేదా ఆమె చిత్రాన్ని ప్రతిష్ఠించాలి. దీపాలు వెలిగించి, ధూపం వేయాలి. పుష్పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. కౌమారీదేవి స్తోత్రాలు, మంత్రాలు పఠించాలి. పూజానంతరం ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయాలి. అలాగే, 2 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్న బాలికలను కౌమారీదేవి రూపంగా ఎంచి, పూజించడం కూడా ఒక ఆచారంగా ఉంది. దుర్గాదేవి తొమ్మిది రూపాలలో కౌమారి రూపం ఒకటి. ఈ పూజ శ్రావణ శుద్ధ నవమి నాడు ఆచరించడం ఆచారంలో ఉన్నా.. ఈ కౌమారీ పూజా ఆశ్వయుజంలో వచ్చే దుర్గానవరాత్రుల సందర్భాలలో ఈ పూజలు ఇంకా విశేషంగా జరుగుతాయి.

శ్రావణ శుద్ధ దశమి
ఆగస్టు 4, సోమవారం

శ్రావణ శుద్ధ దశమి శ్రావణ మాసపు పదవ రోజు. శ్రావణ శుద్ధ దశమి తిథి ఆశా దశమిగా కూడా ప్రసిద్ధి. మనసులో సంకల్పించే ఆశలన్నిటినీ తీర్చేది కాబట్టి ఇది ఆశా దశమి అయ్యింది. ఈనాడు చేసే వ్రతాచరణ వల్ల సమస్త ఆశలు నెరవేరుతాయని అంటారు. ఈనాటి పగలు ఉపవాసం ఉండాలి. రాత్రి ఆశాదేవిని నెలకొల్పి పూజించాలి. ఏడాది పాటు ఈ విధంగా వ్రతాన్ని ఆచరించాలని నియమం.
శ్రావణ శుద్ధ దశమి మరో విధంగా కూడా ప్రశస్తమై ఉంది. ఇది శ్రావణ మాసపు రెండో సోమవారం. కాబట్టి ఈనాడు శ్రావణ సోమవార వ్రతాలను ఆచరించాలి. ఇది శివుడికి ఎంతో ప్రీతికరమైన దినం. పార్వతీదేవి శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించే శివుడిని భర్తగా పొందిందని అంటారు. పూజా మందిరాన్ని అలంకరించి, శివపార్వతుల విగ్రహాలను ఉంచి దీపారాధన చేయాలి. శివలింగాన్ని అభిషేకించాలి. బిల్వ పత్రాలు, గంధం, అక్షతలు సమర్పించాలి. శివపార్వతులకు నైవేద్యం సమర్పించిన అనంతరం శ్రావణ సోమవార వ్రత కథను చదవాలి లేదా వినాలి. పగలు ఉపవాసం ఉండి, సాయంత్రం శివపూజ చేసిన అనంతరం సాత్వికాహారంతో కూడిన భోజనం చేయాలి.

శ్రావణం.. సకల శుభాల నెలవు
శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలది కావడం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడి జన్మతిథి కూడా ఈ మాసంలోనిదే. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రమే. హయగ్రీవోత్పత్తి కూడా ఈ మాసంలోనే. అరవింద యోగి శ్రావణ మాసంలోనే జన్మించారు. ఇంకా ఆధ్యాత్మిక పరమ పురుషులైన ఆళవందారు, బదరీనారాయణ పెరుమాళ్‍, చూడికుడుత్త నాంచార్‍ తదితరుల తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే. గరుడుడు అమృతభాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోని శుద్ధ పంచమి నాడేనని ప్రతీతి. దక్షిణాయనంలో శ్రావణ మాసం నుంచే వర్ష రుతువు ప్రారంభమవుతుంది. వర్షాకాలం అంటే, వివిధ జబ్బులు, వ్యాధులు ముసురుకునే సమయమిది. అందుకే ఆరోగ్య పరిరక్షణార్థం ఈ మాసం పొడవునా మన పెద్దలు వివిధ వ్రతాలను ఆచరించాలని నియమం విధించారు.
• మన చేత తెలకపిండి, అనప పప్పు, మునగాకు మొదలైనవి తినిపించిన ఆషాఢభూతి కాలం అంతమై.. భూమిని శ్యామల తృణశాలినిగా చేసే శ్రావణ మాసం వివిధ వ్రతాలకు నెలవు.
• శ్రావణ మాసం అనేక ఆధ్యాత్మిక విషయాల రీత్యా ఉత్క•ష్టమైనది,
శుభప్రదమైనది.
• శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేయాలి.
• శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని పూజించాలి.
• శ్రావణ మాసంలో మంగళవారాల్లో ఆచరించే వ్రతమే మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్టు పురాణాల్లో ఉంది. కొత్తగా వివాహమైన వారు ఈ వ్రతాన్ని ఆచరించాలి. వివాహమైన తరువాత వచ్చే మొదటి శ్రావణ మాసంలో మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. వరుసగా ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి.
(శ్రావణ మాసం, 2025 మంగళవారం తేదీలు: జూలై 29, ఆగస్టు 1, 8,15, 22).
• శ్రావణ మాసంలో వచ్చే సోమ, మంగళ,
శుక్రవారాలు అత్యంత పవిత్రమైనవి.
• శ్రావణ మాసంలోవచ్చే రెండో
శుక్రవారమే వరలక్ష్మీ వ్రతం ఆచరణకు యోగ్యమైనది. ఈనాడు తెలుగు లోగిళ్లు లక్ష్మీకళతో ఉట్టిపడతాయి.
• శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే మొదటి పదిహేను రోజులు ఎంతో పవిత్రమైనవి. ఈ పదిహేను రోజుల్లో ఒక్కో దేవుడిని పూజించాలి.
• శ్రావణ బహుళ (కృష్ణ) విదియ తిథి నాటి నుంచే మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన దినోత్సవాలు నిర్వహిస్తారు. ఈనాడు మంత్రాలయంలో విశేష పూజలు చేస్తారు. క్రీస్తు శకం 1671 సంవత్సరంలో విరోధికృత్‍ నామ సంవత్సరం, శ్రావణ బహుళ విదియ నాడు రాఘవేంద్రస్వామి సజీవ సమాధి చెందారు.
• బ్రాహ్మణులు ఈ మాసంలో పాత జంధ్యాన్ని త్యజించి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. ఇది జరిగేది శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు. అందుకే ఈ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. • శ్రావణ మాసం పూర్తి వర్షరుతు కాలం. రోగాలు ముసురుకుంటాయి. పిల్లలు, పెద్దలతో పాటు అందరూ ఎక్కువగా జలుబు, జ్వరాల బారిన పడుతుంటారు. అందుకే ఈ మాసం పొడవునా వివిధ వ్రతాలను నిర్దేశించారు. ఆయా వ్రతాల సందర్భంగా దేవీదేవతలకు సమర్పించే నైవేద్యాలను ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఎనలేని ఆరోగ్యం కలుగుతుంది.

శావణ శుద్ధ ఏకాదశి
ఆగస్టు 5, మంగళవారం

శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశిగా ప్రసిద్ధి. మహిజిత్తు అనే అతడు శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ఆచరించిన వ్రతం ఫలితంగా అతనికి పుత్ర సంతానం కలిగింది. పుత్రుడిని ప్రసాదించిన ఏకాదశి కాబట్టి ఇది పుత్రదైకాదశి, పుత్రద ఏకాదశి అయింది. ఈ మేరకు ఈ వ్రతం వివరాలు ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉన్నాయి. సంతానం లేని వారు, సత్సంతానం కావాలనుకునే వారు ఈ ఏకాదశి తిథి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇక, ఈనాడు మంగళగౌరీ వ్రతాన్ని విశేషంగా ఆచరిస్తారు.

శ్రావణ శుద్ధ ద్వాదశి
ఆగస్టు 6, బుధవారం

శ్రావణ శుద్ధ ద్వాదశి తిథి దామోదర ద్వాదశిగా ప్రతీతి. ఈనాడు విష్ణు ప్రతిమను లేదా సాలగ్రామాన్ని దానం చేస్తారు. దీనినే శ్రీధర పూజగా కూడా వ్యవహరిస్తారు. ఈనాడు ప్రదోష వ్రతం కూడా ఆచరిస్తారు. దామోదర ద్వాదశి శ్రావణ మాసపు శుక్ల పక్షంలో వచ్చే పన్నెండవ రోజు. ఈ ద్వాదశి గురించి విష్ణు పురాణంలో ప్రస్తావన ఉంది. శ్రావణ శుక్ల (శుద్ధ) ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం ఉండి మరుసటి రోజైన దామోదర ద్వాదశి రోజున సాలగ్రామ రూపంలో గల విష్ణువును పూజిస్తే మోక్షం లభిస్తుందని అంటారు. సాలగ్రామాన్ని పూజించడం వలన సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడిని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. సాలగ్రామాన్ని అభిషేకించడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఇలా అభిషేకించిన నీటిని తీర్థంగా స్వీకరించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని శాస్త్ర వచనం. ఉత్తర భారతదేశంలోని గండకీ నదిలో సాలగ్రామాలు విరివిగా లభిస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన సాలగ్రామాలను కొన్ని పుణ్యక్షేత్రాలలో విక్రయిస్తుంటారు. ఇంతటి విశిష్టమైన సాలగ్రామాన్ని దామోదర ద్వాదశి అయిన శ్రావణ శుద్ధ ద్వాదశి రోజున దానం చేయాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సాధారణంగా పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం చేసిన వారు దామోదర ద్వాదశి నాడు ఆ ఉపవాస దీక్షను విరమిస్తుంటారు. ఈనాడు విష్ణువును గంగాజలంతో అభిషేకించి, తులసి, గన్నేరు పూలతో అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. స్వామికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి.

శ్రావణ శుద్ధ త్రయోదశి
ఆగస్టు 7, గురువారం

శ్రావణ శుద్ధ త్రయోదశి అనంగ త్రయోదశిగా ప్రసిద్ధి. త్రయోదశి తిథి అనంగుడికి ప్రీతికరమైనది. అనంగుడు అంటే మన్మథుడు అని అర్థం. ఈ తిథి నాడు అనంగ వ్రతం చేయాలని, రతీమన్మథులను నెలకొల్పి పూజించాలని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. మినుములతో చేసిన మినపసున్ని ఉండలు, పాలను నివేదించాలి. మైనపువత్తితో హారతినివ్వాలి. ఈనాడు ఆయనకు పవిత్రారోపణం చేయాలని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఈ తిథి శని త్రయోదశి పర్వం కూడా. ఆయనకు ప్రీత్యర్థమైన నువ్వులు, నువ్వుల నూనెతో పూజించాలి.

శ్రావణ శుద్ధ చతుర్దశి
ఆగస్టు 8, శుక్రవారం

శ్రావణ శుద్ధ చతుర్దశి వరలక్ష్మీ వ్రత దినం. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా ఉంది. ఈనాడు మహాలక్ష్మిని అష్టైశ్వర్యప్రదాయినిగా పూజిస్తారు. లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతోందని శ్రీగుణరత్న కోశం చెబుతోంది. మహాలక్ష్మికి మహదానందం చేకూర్చడం కోసమే శ్రీహరి ఈ లోకాలను సృజించాడని భాగవతం వెల్లడిస్తోంది. భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తోంది. సంకల్పం చేసేది హృదయస్థానం. విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి. మనం తలపెట్టే కార్యాల్ని జయప్రదంగా కొనసాగింపచేసే ధీయుక్తి, ‘లోకైక దీపాంకురమ్‍’ అని సిరులతల్లిని ఈనాడు విశేషంగా ఆరాధిస్తారు. శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీమహాలక్ష్మీ దేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ, వారిని కార్యోన్ముఖుల్ని చేసే శక్తియుక్తుల్ని అందిస్తుందని నమ్మకం. ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం. సకల జీవరాశులు ఆమె సంతానం. ఆ కృప కోసమే ఈనాడు విశేష వ్రతమాచరిస్తారు. అదే వరలక్ష్మీ వ్రతంగా ప్రసిద్ధి.
భృగు ప్రజాపతి ప్రాధాన్యం కలిగిన ‘భృగు’
(శుక్ర)వారం నాడు ప్రతి మాసంలోనూ లక్ష్మీ ఆరాధనను శాస్త్రం నిర్దేశించింది. మాసాల్లో ‘ఆర్థ్రత’కు ప్రధానమైన వర్ష రుతువు మొదటి మాసమే శ్రావణం. అందులో వృద్ధి చెందే చంద్రకళకు నెలవైన శుక్ల పక్షం, శుక్రవారం అత్యంత ప్రధానమైనవని ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ‘ఆర్ధ్రాం పుష్కరిణీం..’ అని శ్రీసూక్తం వర్ణించిన ఆర్ధ్ర శక్తి- శాంతికి, పంటకు, ఐశ్వర్యానికి సంకేతం. శ్రావణం లక్ష్మీదేవికి ప్రధానమైనది.
స్త్రీలో లక్ష్మీకళ ఉందని ‘దేవీ భాగవతం’ వంటి పురాణ వాంగ్మయం చెబుతోంది. అందుకే స్త్రీలను గౌరవించడం భారతీయుల ధర్మంగా భాసిల్లుతోంది. స్త్రీ మూర్తులు లక్ష్మీకళతో తేజరిల్లుతూ లక్ష్మీదేవిని ఆరాధించే పర్వమే- శ్రావణ శుద్ధ శుక్రవారం.
సౌశీల్య, సౌజన్య, సౌమ్య, సాత్విక, శాంత, సద్గుణ, సంపదల సాకారమే మహాలక్ష్మి. దేవిని ఆరాధించడం వల్ల అందరిలోనూ ఆ దివ్య భావనా కిరణాలు జాగృతమై ప్రకాశిస్తాయని, ప్రకాశించాలని విజ్ఞులు ప్రబోధించారు.
వరలక్ష్మి వ్రత కథలో సిద్ధి పొందిన కథానాయిక చారుమతి. మంచి మతి (బుద్ధి) మాత్రమే దేవీకృపకు పాత్రమవుతుందని మానవాళికి ఆ పాత్ర సంకేతమిస్తుంది. సంపదలను అడిగే ముందు ‘చారు’ (చక్కని) మతి కలిగి ఉండాలన్నదే అంతరార్థం. ఆ సందేశం అర్థమైతే వ్యక్తికి, సమాజానికి సౌభాగ్యప్రదం.
ఇక, చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు శివునికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి. కాబట్టి లింగవ్యాసం అంత కానీ, దాని ఎత్తు అంత కానీ లేక 12-8-4 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి, ముడి ముడికి మధ్య సమ దూరం ఉండి, ఆ ఖాళీలు 50, 38, 21 ఉండేలా దర్భలు వేలాడదీయాలి. ఈ పక్రియనే ‘శివ పవిత్రం’ అంటారు.

శ్రావణ శుద్ధ పూర్ణిమ
ఆగస్టు 9, శనివారం

శ్రావణ శుద్ధ పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అనీ, రాఖీ పూర్ణిమ (రక్షాబంధన్‍) అనీ, జంధ్యాల పౌర్ణమి అనీ వ్యవహరిస్తారు.
జంధ్యాన్ని ధరించే వారు శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడే పాతది వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే వేద పరిభాషలో ఉపాకర్మ అంటారు. ఈ ఉపాకర్మనే యజ్ఞోపవీతంగానూ వ్యవహరిస్తారు. జంధ్యం అంటే యోగకర్మతో పునీతమైన దారం అని అర్థం. ఈ కారణంగానే పాల్కురికి సోమనాథుడు ఈ పూర్ణిమను నూలి పూర్ణిమగా వ్యవహరించాడు. నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించే రోజు కాబట్టి ఆ విధంగా ఆయన వర్ణించారు. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు. ఈనాడు ఉపనయనం కూడా నిర్వహించే ఆచారం ఉంది.
రుతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని నిర్ణయించారు. అదే- శ్రావణ పూర్ణిమ.
ఈ రోజు ‘అధ్యాయోపాకర్మ’ జరుపుతారు. అంటే, వేదాధ్యయన ప్రారంభం. వేదాధ్యయన ఆరంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని ఆద్యంత రుక్కులను, ఉపనిషత్తుల ఆద్యంత వాక్యాలను పఠించాలి. ఇంటికి వచ్చి అధ్యయన హోమం ఆచరించాలి. మర్నాడు ఉపాకర్మాంగభూతంగా 1,008 సార్లు గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుతం ఈ తిథి రాఖీ పూర్ణిమగానే ఎక్కువ ఆచారంలో ఉంది. దీనినే మహారాష్ట్ర ప్రాంతంలో నార్లీ పూర్ణిమగా వ్యవహరిస్తారు. ఈనాడు అక్కడ వరుణ దేవుని పూజ కోసం సముద్రుడిని పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో దీనినే పౌవతి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శివ, విష్ణు, గణేశులను పూజిస్తారు. అలాగే, సర్వరోగ ఉపశమనం కోసం, సర్వ
శుభాల కోసం ఏం చేయాలని ధర్మరాజు కృష్ణుడిని అడిగాడట. అందుకు కృష్ణుడు ధర్మరాజుకు రక్షాబంధన విధిని ఉపదేశించాడట. శాస్త్రం ప్రకారం రక్షాబంధనం భార్య భర్తకు కట్టాలని ఉన్నా.. ఆచరణలో మాత్రం చెల్లెలు తమ్ముడు, అన్నకు చెల్లెలు కట్టడం ఆచారంగా మారింది. ఈ క్రమంలోనే శ్రావణ శుద్ధ పూర్ణిమ రాఖీ పూర్ణిమగానూ ప్రసిద్ధి చెందింది. ఇక, రాఖీ పూర్ణిమకు సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. తనను రక్ష కోరి వచ్చిన సోదరిని బలి చక్రవర్తి ఆమెను రక్షిస్తూ, ఈ క్రమంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా ఎదురొడ్డి నిలుస్తాడు. అటువంటి మహావీరునితో తన సోదరుడిని పోలుస్తూ సోదరి తన సోదరుడికి రక్షనివ్వాలని కోరుతూ కుడిచేతికి ఒక దారపు పోగును కడుతుంది. అదే రాఖీగా ప్రసిద్ధి. సోదర – సోదరి ప్రేమకు ప్రతీకగా నిలిచే పర్వమిది. మన హిందూ సంప్రదాయంలో కుటుంబ అనుబంధాలను బలపరిచే అనేక పర్వాలను ఏర్పరిచారు. అటువంటి అనేకానేక పర్వాల్లో రాఖీ పౌర్ణమి ఒకటి. ఈనాడు సోదరీమణులు తమ అన్నలకు, తమ్ముళ్లకు రాఖీని కట్టి అనుబంధాన్ని చాటుకుంటారు.
శ్రావణ పూర్ణిమ నాడు ముంబై ప్రాంతంలో ప్రజలు కొత్త బట్టలు కట్టుకుని సాయంకాలం చౌపతి సముద్ర తీరానికి వెళ్లి వరుణదేవుని తృప్తి కోసం కొబ్బరికాయలు సమర్పిస్తారు. కాబట్టే దీనికి నారికేళ పూర్ణిమ అనీ, నార్లీ పూర్ణిమ అనే పేర్లూ ఉన్నాయి. ఇంకా పూణె, గుజరాత్‍ ప్రాంతాల్లోనూ గొప్ప ఉత్సవంగా శ్రావణ పూర్ణిమను జరుపుకుంటారు.
అలాగే, ఈనాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు. హయగ్రీవుడు అంటే గుర్రపు ముఖము కలవాడని అర్థం.

శ్రావణ బహుళ పాడ్యమి
ఆగస్టు 10, ఆదివారం

ఈనాటి నుంచి శ్రావణ మాసపు కృష్ణ (బహుళ) పక్ష తిథులు ప్రారంభం. ఈ వరుసలో తొలి తిథి- శ్రావణ బహుళ పాడ్యమి. శ్రావణ బహుళ పాడ్యమి నాడు శివ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనినే ధనావాప్తి వ్రతం అని కూడా అంటారు. శ్రావణ బహుళ పాడ్యమి మొదలుకుని భాద్రపద పూర్ణిమ వరకు ఆచరించాల్సిన మాస (నెల) వ్రతమిది.

శ్రావణ బహుళ విదియ
ఆగస్టు 11, సోమవారం

శ్రావణ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరిస్తారు. ఈ మేరకు పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో దీని వివరాలు ఉన్నాయి. ఈ రోజు మొదలు నాలుగు నెలలు చంద్రార్ఘ్యాది కార్యకలాపాలు చేస్తూ చాతుర్మాస్య వ్రతం చేయాలని గ్రంథాంతరాలలో ఉంది. అందుచేతనే దీనిని చాతుర్మాస్య ద్వితీయ అని కూడా అంటారు. అయితే, ప్రస్తుతం ఈ తిథి శ్రీరాఘవేంద్రస్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు విష్ణువు వాకుడు చెట్టు పరుపుగా లక్ష్మితో కూడి శయనిస్తాడని ప్రతీతి. ఈనాడు వీరిద్దరిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుందని అంటారు.

శ్రావణ బహుళ తదియ
ఆగస్టు 12, మంగళవారం

శ్రావణ బహుళ తదియ తిథి నాడు తుష్టి ప్రాప్తి తృతీయా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో కబ్జలీ తృతీయా వ్రతం చేయాలని ఉంది.

శ్రావణ బహుళ చవితి
ఆగస్టు 13, బుధవారం

శ్రావణ బహుళ చతుర్థి నాడు సంకష్ట చతుర్థీ వ్రతం ఆచరించాలి. దీనికే ‘బహుళా చతుర్థి’ అనే పేరు కూడా ఉంది. ఇది గణపతి సంబంధ పూజ. అలాగే, ఈనాడు గోపూజ చేయాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు ఆచరించే సంకష్ట చతుర్థి వ్రతాచరణ వల్ల సమస్త కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. శివుడు, రావణుడు, రాముడు, ధర్మరాజు, పార్వతి, దమయంతి, అహల్య తదితరులు గణపతిని ఉద్దేశించి సంకష్ట హర చతుర్థి వ్రతం ఆచరించినట్టు వ్రత కల్పంలో ఉంది.

శ్రావణ బహుళ పంచమి
ఆగస్టు 13, బుధవారం

శ్రావణ బహుళ చవితి తిథి ఘడియల్లోనే పంచమి తిథి కూడా కూడి ఉంది. కాబట్టి ఇది కూడా ఆగస్టు 13నే వస్తుంది. శ్రావణ బహుళ పంచమిని రక్షా పంచమిగా వ్యవహరిస్తారు. ఈనాడు రక్షా పంచమి వ్రతం ఆచరించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే జ్యోతిషీ గ్రంథంలో ఉంది. రక్షా పంచమిని రక్షాబంధన్‍ పర్వం తరువాత వచ్చే ఐదో రోజున జరుపుకుంటారు. ఈ పర్వం ఒరిస్సాలో ఎక్కువ ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. ఈనాడు శివుడి అవతారమైన ‘బతుక్‍ భైరవుడి’ని పూజిస్తారు.

రక్షాబంధన్‍ నాడు రాఖీ కట్టడం మరిచిపోయిన వారు రక్షాపంచమి నాడు కట్టవచ్చనే నమ్మకం ఉంది. ముఖ్యంగా కొన్ని ఆటవిక తెగల వారు అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఈనాడు బతుక్‍ భైరవుడిని ప్రార్థిస్తారు. అలాగే కొన్ని ప్రాంతాలలో ఈనాడు నాగపూజ ఆచరిస్తారు.

శ్రావణ బహుళ షష్ఠి
ఆగస్టు 14, గురువారం

శ్రావణ బహుళ షష్ఠి తిథి బలరామ జయంతిగా ప్రసిద్ధి. ఈ తిథి నాడు హల షష్ఠి వ్రతం ఆచరించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. హలం అంటే నాగలి. ఇది వ్యవసాయ పనిముట్టు. ఇది శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడి ఆయుధ చిహ్నం. హలధారి (నాగలి చేతబట్టి ఉండేవాడు) అయిన బలరాముడిని కర్షకులు తమ ప్రతినిధిగా, తమ దైవంగా భావిస్తారు. కాబట్టి ప్రధానంగా రైతులు ఈనాడు బలరాముడిని పూజిస్తారు. కర్షకులకు నాగలే దైవం. దానిని పూజించడానికి శ్రావణ బహుళ షష్ఠి ఒక అనువైన పర్వదినం.
దశావతారాల్లో బలరామ అవతారం కృష్ణావతారానికి బదులుగా అష్టమ అవతారంగా జగత్ప్రసిద్ధం. కృష్ణుడు దేవకీ గర్భంలో ప్రవేశించడం ఒక విచిత్రం. బలరాముడి జన్మ వృత్తాంతం ఇందో అద్భుతం. మధురా నగరం యాదవ రాజులకు ముఖ్య పట్టణం. కంసుడు తన ముద్దుల చెల్లెలు దేవకికి వసుదేవుడితో వివాహం చేశాడు. కొత్త దంపతులను రథంలో తీసుకువెళ్తుండగా, దేవకి అష్టమ గర్భం నీ పాలిట మృత్యువని ఆకాశవాణి పలికింది. అది విన్న కంసుడు దేవకిని చంపబోతే, ఆ శిశువును నీకే అప్పగిస్తానని వసుదేవుడు మాటిచ్చాడు. అప్పటికి గండం గడిచినా దేవకీ వసుదేవులకు కారాగారం తప్పలేదు. హరి అనుగ్రహంతో వారికి బలరామకృష్ణులు జన్మించారు. అన్నదమ్ములు ధర్మానికి వెన్నుదన్నుగా నిలిచారు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు శిశువులను కంసుడు వధించాడు. ఆదిశేషుడు ఏడో శిశువుగా దేవకి గర్భంలోకి ప్రవేశించగా, యోగమాయ ఆ గర్భాన్ని రోహిణిలో ప్రవేశపెట్టింది. ఆ తేజం బలరాముడిగా అవతరించింది. ఆ తర్వాత దేవకి గర్భంలో విష్ణుమూర్తి, యశోద గర్భంలో ఆదిపరాశక్తి ప్రవేశించారు. కృష్ణుడు పుట్టగానే వసుదేవుడు యశోదకు అప్పగించి, ఆదిశక్తిని దేవకికి ఇచ్చాడు. శిశువు గురించి విన్న కంసుడు ఆడశిశువనే కనికరం లేకుండా ఛేదించబోయాడు. ‘మృత్యువు నీ కోసం గోకులంలో ఎదురుచూస్తోంది’ అని హెచ్చరించింది ఆదిశక్తి. బలరామకృష్ణులు ఒకేచోట పెరిగారు. ఆదిశక్తి చేసిన మహోపకారానికి భక్తిపూర్వకంగా వసుదేవుడు భద్రకాళి, విజయదుర్గ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక, ఇళ- ఇలా పద్నాలుగు విధాల సత్కరించాడు. అవన్నీ అమ్మవారి కళారూపాలే. ఇక, బలరాముడు తరువాత కాలంలో వ్యవసాయిక దైవంగా పూజలందుకుంటూ వస్తున్నాడు.

శ్రావణ బహుళ సప్తమి
ఆగస్టు 15, శుక్రవారం

శ్రావణ బహుళ సప్తమి నాడు శీతలా సప్తమి వ్రతం ఆచరించాలి. అలాగే, సప్తమి తిథి నాడు సూర్యుడిని విశేషంగా ఆరాధిస్తారు. అలాగే, ఈనాడు భారత స్వాతంత్య్ర దినోత్సవం. 1947, ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది. అందుకే ఏటా ఈ రోజున జాతీయ పతాకాలను ఆవిష్కరించి, గౌరవ వందనాలను సమర్పిస్తారు. ఇక, ఇదే రోజు అరవింద యోగి జన్మతిథి. ఈయన 1872, ఆగస్టు 15న పశ్చిమబెంగాల్‍లో జన్మించారు. సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు. కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలోనూ ఈయన పాల్గొన్నారు. వందేమాతరం గేయాన్ని ఆంగ్లంలోకి అనువదించినది ఈయనే. స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా ఈయన అలీపూర్‍లోని కారాగారంలో శిక్ష అనుభవించారు. ఆ సమయంలోనే ఆధ్యాత్మికత పట్ల ఆకర్షితులయ్యారు. యోగ, భగవద్గీతపై ఈయన పలు గ్రంథాలను రచించారు. ‘ది లైఫ్‍ డివైన్‍’ అనేది అరవిందుల ప్రసిద్ధ గ్రంథం.

శ్రావణ బహుళ అష్టమి,
ఆగస్టు 16, శనివారం/కృష్ణాష్టమి
హరి సుందర నంద ముకుందా

శ్రావణ బహుళ అష్టమి బాలకృష్ణుడి జన్మతిథి. దీనినే కాలాష్టమి అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణాష్టమి అంటే- కృష్ణ, అష్టమి. ఇది కృష్ణపక్షంలో వచ్చే అష్టమి. కృష్ణుడు జన్మించిన అష్టమి. కృష్ణుని జన్మతిథి కాబట్టి ఇది జన్మాష్టమిగానూ ప్రసిద్ధి. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు. అందుచేత దీనిని గోకులాష్టమి అనీ అంటారు. కృష్ణ జయంతి నాడు ఉపవసించి ఆయనను పూజిస్తే సకల పాపాలు హరించిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ కృష్ణ పక్ష అష్టమి నాటి రాత్రికి శాక్తేయ సిద్ధాంతంలో ‘మోహ రాత్రి’ అని పేరు. కృష్ణ జన్మకు పూర్వమే ఈ రాత్రి ఉపాసకులకు ప్రధానమైనది. ప్రత్యేక మహిమ కలిగిన రాత్రి ఇది. కృష్ణుడు పుట్టిన సమయానికే నంద గోకులంలో యశోదాదేవికి పుత్రికగా మహా శక్తి యోగమాయ జన్మించింది. ఆ తల్లి పుట్టిన అష్టమి కూడా ఇదే. కృష్ణుడు జన్మించిన తిథి ఘడియలు కృష్ణాష్టమి అయితే, మహాశక్తి యోగమాయ జన్మించిన అదే తిథి కాలాష్టమి తిథి అయ్యింది. దైవీ గుణ సంపద గలవారి మోహాది మాయాజాలాన్ని క్షయింప చేసే మోక్ష కారకుడు, జగన్మోహనుడు శ్రీకృష్ణుడు. ఆ అవతారం అగాధమైనది. అనంతమైనది. పరమాత్మ తత్వాన్ని, ఉపనిషత్‍ రహస్యాలను తన లీలల ద్వారా ప్రకటించిన భగవానుడు ఆయన. ప్రేమ, రౌద్ర, వీర, కరుణ, హాస, శాంతాధి భావాలను ప్రకటించిన గోవిందుడి గాథ- వివిధ కోణాల్లో దివ్యత్వాన్ని ఆవిష్కరించింది.
కృష్ణుడిని పూజిస్తే ధర్మార్థ కామమోక్ష ప్రాప్తి, మహా జయం కలుగుతాయని స్కంద పురాణోక్తి. కృష్ణ జయంతిని ఆచరించని వారు మహా పాపాన్ని పొందుతారని, యమపాశంలో చిక్కుకుంటారని, మరుజన్మలో పాములై పుడతారని, క్రూర రాక్షసులుగా జన్మిస్తారని స్కాందాది పురాణాల్లో ఉంది. కృష్ణాష్టమి నాడు చంద్రుడికి అర్ఘ్యమివ్వాలని, బంగారంతో కానీ, వెండితో కానీ ద్వాదశాంగుల విస్తారమైన చంద్రబింబం చేసి వెండి, బంగారుపాత్రలలో దానిని ఉంచి, పూజించి అర్ఘ్యమివ్వాలని, అలా చేస్తే సర్వ కోరికలు నెరవేరుతాయని భవిష్యోత్తర పురాణంలో ఉంది. కృష్ణావతారం దశావతారాల్లో 8వది. కృష్ణ చరితం హరివంశ భాగవత విష్ణు పురాణాల్లో విపులంగా ఉంది. ఆబాల గోపాలానికి కృష్ణుని లీలలు, కొంటె చేష్టలు తెలిసినవే. కృష్ణుడు లోకోత్తర సుందరమూర్తి. మహాబల పరాక్రమశాలి. రాజనీతి నిపుణుడు. తత్త్వవేత్త. ఆయన ప్రపంచానికి అందించిన గొప్ప గ్రంథం- భగవద్గీత. కృష్ణుని కాలంలో కంసుడు, నరకాసురుడు, కాలయవనుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన రాజులు ఎవరికి వారు చక్రవర్తులమని, రాజాధిరాజులమని చెప్పుకొంటూ దుష్పరిపాలన సాగించేవారు. కృష్ణుడు తాను రాజ్యాధికారం కోరక, పాండవులచే మిగతా రాజులను హతులను చేయించి ధర్మరాజును పట్టాభిషి క్తుడిని చేశాడు. కృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రాన రాత్రి ఉద్భవించాడు కనుక అష్టమి నాడు పగలంతా ఉపవసించి, సాయంకాలం కృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తారు. వీధులలో ఉట్లు కట్టి వాటిని కొట్టే ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఇదే ఉట్ల పండుగగానూ ప్రసిద్ధి.
అవతార కాలంలోనే కాక, ఆ తరువాత కూడా తనను స్మరించి, ఆరాధించిన, కీర్తించిన యోగుల్ని తరింప చేసిన భగవానుడు కృష్ణుడు. శుక యోగి, ఆదిశంకరులు, రామానుజాచార్య, మధ్వాచార్య, చైతన్య మహాప్రభు, వల్లభాచార్య, జయదేవుడు, పోతన, లీలాశుకుడు, నారాయణ తీర్థులు, మధుసూదన సరస్వతి, మీరాబాయి, తుకారాం, సక్కుబాయి, సూరదాసు.. ఇలా ఎందరెందరో కృష్ణ యోగులున్నారు. వారందరూ సాత్విక, మధుర, దివ్య భక్తి మార్గంలో జ్యోతి స్వరూపులై లోకాన వెలుగులు నింపారు.

శ్రావణ బహుళ నవమి
ఆగస్టు 17, ఆదివారం

శ్రావణ బహుళ నవమి నాడు చండికా పూజ చేస్తారు. చండికా పూజ అనేది దుర్గాదేవి ఉగ్రరూపం. ఈ పూజను ప్రధానంగా శత్రువులను జయించడానికి, కుజ దోషం తొలగిపోవడానికి, బాధలను తొలగించుకోవడానికి, జీవితంలో విజయం సాధించడానికి నిర్వహిస్తారు. దుర్గ, లక్ష్మి, సరస్వతి, కాళికాదేవి దేవతల కలయికగా చండీదేవిని భావిస్తారు. దుర్గా సప్తశతిలోని మంత్రాలను పఠిస్తూ హోమం చేయాలి. చండికా హోమం, చండీ పాఠ్‍, కుమారి పూజ, సువాసిని పూజల వంటివి కూడా ఈనాడు ఆచరిస్తారు. ముఖ్యంగా దుర్గాష్టమి సమయంలో చండికా పూజ విశేషంగా జరుగుతుంది. చండీదేవి ఆలయం మన దేశంలో హరిద్వార్‍లో ఉంది. దీనిని భక్తులు సిద్ధ పీఠంగా పూజిస్తారు. చండికా పూజలో నవాక్షరి మంత్రం, దుర్గా సప్తశతిలోని మంత్రాలను పఠిస్తారు. కొన్నిచోట్ల కౌమార దశలో ఉన్న బాలికలను, మరికొన్నిచోట్ల పెళ్లయిన స్త్రీలను దేవతగా పూజిస్తారు. రామకృష్ణ పరమహంస వర్ధంతి దినం కూడా ఈ రోజే. అలాగే, నవమి నాడు కొన్ని ప్రాంతాలలో రోహిణీ వ్రతం కూడా ఆచరిస్తారు.

శ్రావణ బహుళ ఏకాదశి
ఆగస్టు 19, మంగళవారం

శ్రావణ బహుళ ఏకాదశిని అజైకాదశి అనీ అంటారు. రాజ్యాన్ని, భార్యను, పుత్రుడిని కోల్పోయి హరిశ్చంద్రుడు శ్రావణ కృష్ణ ఏకాదశి నాడు విద్యుక్తంగా ఏకాదశీ వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా అతను తిరిగి భార్యను, పుత్రుడిని, రాజ్యాన్ని పొందాడు. ఇంకా ఈనాడు కామికా వ్రతం, శ్రీధర పూజ చేస్తారని కొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. కామికా వ్రతం ఆచరించే దినం కాబట్టి ఈ తిథిని కామికా ఏకాదశి అని కూడా అంటారు.

శ్రావణ బహుళ ద్వాదశి
ఆగస్టు 20, బుధవారం

శ్రావణ బహుళ ద్వాదశి నాడు రోహిణీ ద్వాదశీ వర్షం అనే పూజ చేస్తారు. అలాగే, ఈనాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. ప్రదోష వ్రతాచరణ ముఖ్యంగా శివారాధనకు సంబంధించినది. ఈనాడు శివుడికి పుష్ప నైవేద్యాలు, పండ్లు, ధూప ద్రవ్యాలను సమర్పించాలి. దైవాన్ని బిల్వ ఆకులతో అభిషేకించాలి. శివుడి 108 నామాలను పఠిస్తూ, శివలింగంపై నీరు, పాలు, తేనె, పెరుగు, నెయ్యి పోయాలి.

శ్రావణ బహుళ త్రయోదశి
ఆగస్టు 21, గురువారం

శ్రావణ బహుళ త్రయోదశి తిథి ద్వాపర యుగాది అని ఆమాదేర్‍ జ్యోతిషీ చెబుతోంది. అలాగే ఈనాడు మాస శివరాత్రి.

శ్రావణ బహుళ చతుర్దశి
ఆగస్టు 22, శుక్రవారం

శ్రావణ బహుళ చతుర్దశి తిథి అఘోర చతుర్దశి అని పేర్కొనడాన్ని బట్టి ఇది శివ సంబంధమైన పర్వంగా భావించవచ్చు. అలాగే ప్రతి నెలలోనూ బహుళ చతుర్దశి మాస శివరాత్రి పర్వంగా ఉంటుంది. కాబట్టి ఈనాడు శివుడిని పూజించాలని ఆమాదేర్‍ జ్యోతిషీ పేర్కొంటోంది.

శ్రావణ బహుళ అమావాస్య
ఆగస్టు 23, శనివారం

శ్రావణ కృష్ణ (బహుళ) అమావాస్య పోలామావాస్యగా ప్రసిద్ధి.
పోల + అమ= పోలామా అయ్యింది. ‘పోల’ అంటే కడుపు నిండా తిని, నీళ్లు తాగి పని పాటు లేకుండా పడి ఉన్న ఎద్దు అని అర్థం. ‘అమా’ అంటే అమావాస్య. ‘పోలామా’ అంటే ఎద్దులను బాగా మేపే అమావాస్య అని అర్థం. దీనిని బట్టి పోలామావాస్య గో, వృషభ పూజకు విశేషమైన దినమని అవగతమవుతోంది. ఈనాడు కర్షకులు వ్యవసాయ సంబంధ పనులేమీ, ప్రత్యేకించి ఎద్దులతో ఏ పనీ చేయించరు. మహారాష్ట్రలో దీనిని పిఠోరి అమావాస్య అని, ఆమాదేర్‍ జ్యోతిషీలో కౌశ్యమావాస్య అని, గ్రంథాంతరాల్లో ఆలోకామావాస్య అని వ్యవహరిస్తారు. ఇక, తెలుగు నాట ఇది పోలాంబ వ్రతంగా ప్రసిద్ధి. పోలేరమ్మ అనే గ్రామ దేవత ఈనాడు విశేష పూజలు అందుకుంటుంది. అలాగే, అనేక ఇతర గ్రామ దేవతలకు ఈనాడు ఉత్సవాలు జరుపుతారు. అలాగే, ఈనాడు కుశ గ్రహణంగా పంచాంగాలలో పేర్కొన్నారు. ‘కుశ’ అంటే దర్బ అని అర్థం. గ్రహణ సమయాలలో దర్బలను వినియోగించడం మన సంప్రదాయం.

భాద్రపద శుద్ధ పాడ్యమి
ఆగస్టు 24, ఆదివారం

ఆగస్టు మాసంలో ఈనాటి నుంచి భాద్రపద మాసం ఆరంభమవుతుంది. ప్రారంభ తిథి భాద్రపద శుద్ధ పాడ్యమి. అలాగే, చంద్ర దర్శనం కూడా ఈనాటి నుంచే. భాద్రపద పాడ్యమి నాడు ఆడపడుచులు ఆడిపాడతారు. పెందరాళే లేస్తారు. తలంటి పోసుకుంటారు. అనేక పిండివంటలు వండుతారు. భోజనానంతరం స్త్రీలు విలాసంగా పొద్దుబుచ్చుతారు. సాయంకాలం తిరిగి పిండి వంటలతో భోజనం చేస్తారు. పడకకు చేరే లోపుగా ప్రతి వారు జొన్న కంకిలో గింజలు కొన్ని, ఒక దోసకాయ ముక్క తిని తీరాలని నియమం. అయితే, ఈ పర్వం పేరేమిటో, దానికి సంబంధించిన నేపథ్యమేమిటో ఇదమిత్థముగా తెలియరాదు. అయితే, భద్రచతుష్టయ వ్రతం, మృగశీర్షా వ్రతం వంటివి ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.

భాద్రపద శుద్ధ విదియ
ఆగస్టు 25, సోమవారం

భాద్రపద శుద్ధ విదియ కల్కి జయంతి దినంగా ప్రసిద్ధి.

భాద్రపద శుద్ధ తదియ
ఆగస్టు 26, మంగళవారం

భాద్రపద శుద్ధ తదియ నాడు హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఇదే తెలుగు నాట పదహారు కుడుముల తద్దిగా ప్రాచుర్యంలో ఉంది. సౌభాగ్యవంతమైన స్త్రీలు, కన్యలు ఆచరించే వ్రత పర్వమిది. ఈ వ్రతం ఆచరించే పార్వతీదేవి శివుడిని భర్తగా పొందిందని పురాణగాథ. ఈనాటి పూజకు అరటి స్తంభాలతో మండపం నిర్మించి, వివిధ వర్ణాల పట్టుబట్టలతో, తోరణాలతో దానిని అలంకరించాలి. పూజ తరువాత ఉపవాసం ఉండాలి. ఉత్తర భారతదేశంలోనే ఈ వ్రతాచరణ ఎక్కువగా ఉనికిలో ఉంది. ఇదే నాడు మన తెలుగు నాట పదహారు (16) కుడుముల తద్ది పర్వాన్ని జరుపుకుంటారు. ఇది నోము. ఓ రాజ కుమార్తెకు పార్వతీదేవి ఈ నోము గురించి స్వయంగా చెప్పినట్టు వ్రతకథలో ఉంది. భాద్రపదంలో ఇది చాలా విశేషమైన తిథి. ఇంకా ఈనాడు ఉత్కల దేశంలో గౌరీ తృతీయ పేరిట నోము ఆచరిస్తారు. కాంచన గౌరీ పూజ, ఉమా పూజ, కోటీశ్వరీ వ్రతం, అనంత తృతీయా వ్రతాలు ఆచరించాలని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. ఈ తిథి నాడే వరాహ జయంతి అని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. వరాహ జయంతి నాడు సామవేదోపకర్మలు ఆచరించే సంప్రదాయం ఉంది.

భాద్రపద శుద్ధ చవితి
ఆగస్టు 27, బుధవారం

భాద్రపద శుద్ధ చతుర్థి (చవితి) వినాయక చవితిగా ప్రసిద్ధి. గణపతి మొత్తం దేవతల్లోనే విశిష్ట దైవం. వినాయక ‘చవితి’ అయినా కానీ, ఇది వేర్వేరు చోట్ల అంతకంటే ఎక్కువ రోజులే ఆచరిస్తారు. మహారాష్ట్రలో 11 రోజులు, ఆంధ్ర దేశంలో 3,5,7,9,11 రోజుల పాటు గణపతిని పూజిస్తారు. ఈ దేవుడికి 21 మోదకాలు నైవేద్యంగా పెడతారు. ఆ రోజు దేవునికి సమర్పించే పత్రిలో అతి పవిత్రమైనవి దూర్వా పత్రాలు (గరిక పోచలు). గజాననుడు మంగళాదైవతం. కాబట్టి ప్రతి కార్యానికి ముందు గజానన పూజ చేయడం ఆచారమైంది.
తెలుగు నాట నాలుగు చతుర్థులు గణేశపరంగా ప్రసిద్ధం. అవి- 1) సంకష్ట చతుర్థి,
2) దూర్వా గణపతి (శ్రావణం లేదా కార్తీకంలో శుద్ధ చతుర్ధి నాడు ఈ వ్రతం ఆచరిస్తారు),
3) సిద్ధి వినాయక వ్రతం (భాద్రపద శుద్ధ చతుర్థి),
4) కపర్ధి వినాయక వ్రతం (శ్రావణ శుక్ల చతుర్థి).
దక్షిణ భారతదేశంలో వినాయక చతుర్థి మిక్కిలి ప్రసిద్ధిం. దీన్ని కొన్నిచోట్ల రాళ్ల పండుగ అనీ అంటారు. రాజస్థాన్‍లో ఇది వివాహ నిశ్చయాలకు మంచి రోజు. విద్యను కోరే వారు చవితి తిథిలో సరస్వతీ పూజ చేయాలని అంటారు. త్రిమూర్తులు కూడా గణపతిని పూజిస్తారని ప్రతీతి.

భాద్రపద శుద్ధ పంచమి
ఆగస్టు 28, గురువారం

భాద్రపద శుద్ధ పంచమి తిథి రుషి పంచమిగా ప్రసిద్ధి. దీని గురించి భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది కేవలం ఆడవాళ్ల వ్రతం. రుతుస్రావ దోషాలు పోగొట్టుకోవడానికి ఈ వ్రతాన్ని ఆచరించాలని అంటారు. బాద్రపద శుక్ల పంచమి మధ్యాహ్న సమయంలో నదికి కానీ చెరువుకు కానీ వెళ్లి స్నానం చేయాలి. ఒకప్పుడు సితాశ్వరాజు బ్రహ్మని తక్షణమే పాపాల్ని తగ్గించే వ్రతాన్ని గురించి చెప్పమన్నాడు. అప్పుడు బ్రహ్మ ‘రుషి పంచమి’ వ్రతం గురించి ఉపదేశించాడట. ఈ వ్రతం గురించి కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు భవిష్యోత్తర పురాణంలో ఉంది. ఇది ప్రాయశ్చిత్తాత్మకమైన వ్రతం. అంటే తెలిసో తెలియక చేసే తప్పులు ఈ వ్రతాచరణ ద్వారా పోగొట్టుకోవచ్చని అంటారు.
వినాయక చవితి మర్నాడు వచ్చే ఈ రుషి పంచమిని మన భారతీయ ధర్మానికి, ఆధ్యాత్మికతకు మూలస్తంభాలైన సప్తర్షులను స్మరించుకునే దినమని కూడా అంటారు. అందుకే ఈనాడు అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర, జమదగ్ని అనే ఏడుగురు రుషులను తప్పక స్మరించుకోవాలి. భారతీయ సంప్రదాయంలో రుషులు ఎందరో ఉన్నా సప్తర్షులే ప్రధానంగా ఖ్యాతికెక్కారు. వారి వివరాలివీ..
అత్రి మహర్షి: సాక్షాత్తూ ఆ మహా విష్ణువునే పుత్రునిగా పొందిన వాడు అత్రి మహర్షి. శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లినపుడు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. ఆ సమయంలో అత్రి మహర్షి వారికి తన ఆశీర్వాదాన్నిచ్చారు.
భరద్వాజ: శ్రీరాముడికి అరణ్యవాస సమయంలో చిత్రకూట పర్వతానికి దారి చూపించిన వాడు.
గౌతముడు: తన భార్య అహల్యకు శాప విమోచనం కలిగించిన శ్రీరాముడికి తన తప:శక్తిని మొత్తం ధారపోసిన వాడు.
విశ్వామిత్రుడు: రామలక్ష్మణులకు యుద్ధవిద్యలను నేర్పినవాడు. వారి చేత రాక్షస సంహారం చేయించిన వాడు.
వశిష్ఠుడు: ఇక్ష్వాకు వంశ కుల గురువు. శ్రీరాముడికి ఈయనే తొలి గురువు.
జమదగ్ని: శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒక అవతారమైన పరశురాముడి తండ్రి ఈయన.
కశ్యపుడు: శ్రీ మహావిష్ణువు దశావతారాలలో మరొక అవతారమైన వామనుడి తండ్రి కశ్యప మహర్షి.
ఈ ఏడుగురు మహర్షులను రుషిపంచమి నాడు స్మరించుకోవాలని అంటారు.

భాద్రపద శుద్ధ షష్ఠి
ఆగస్టు 29, శుక్రవారం

భాద్రపద శుద్ధ షష్ఠి నాడు సూర్యపూజ చేయాలని పురుషార్థ చింతామణిలో ఉంది. ఉద్యాపన పూర్వకమైన సూర్యషష్ఠి వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, కృత్యసార సముచ్చయము అనే గ్రంథాలలో కూడా ఉంది. ఈనాడు స్కంద దర్శనం చేసుకోవాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన కుమారస్వామి ఆరాధనకు ఉద్దేశించిన తిథి షష్ఠి. స్కంద అంటే కుమారస్వామికి గల అనేకానేక పేర్లలో ఒకటి.

భాద్రపద శుద్ధ సప్తమి
ఆగస్టు 30, శనివారం

భాద్రపద శుద్ధ సప్తమి నాడు ముక్తాభరణ వ్రతం ఆచరించాలని, దీనినే ఆముక్తాభరణ వ్రతం అని అంటారని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కుక్కుటీ వ్రతం చేసి సాంబశివ పూజ చేయాలని తిథి తత్వంలో రాశారు. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు ద్వాదశ సప్తమి, అనంత ఫల సప్తమి, పుత్ర సప్తమి, అపరాజితా సప్తమి వ్రతాలు ఆచరించాలని ఉంది. ఈనాడు లలితా సప్తమి అని ఆమాదేర్‍ జ్యోతిషీలో ఉంది. నీలమత పురాణంలో ఈనాడు అలంకార పూజ చేయాలని ఉంది.

భాద్రపద శుద్ధ అష్టమి
ఆగస్టు 31, ఆదివారం

భాద్రపద శుద్ధ అష్టమి తిథితో ఆగస్టు మాసం ముగుస్తుంది. ఈనాడు దుర్గాష్టమి వ్రతం, మహాలక్ష్మి వ్రతం కూడా ఆచరిస్తారు. అలాగే అష్టమి తిథిని రాధాష్టమిగా కూడా వ్యవహరిస్తారు. రాధ శ్రీకృష్ణుడి ప్రియురాలు. స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ప్రతిరూపం ఆమె. పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పే రాధాకృష్ణులను ఈనాడు పూజించాలి.

Review లక్ష్మీ దీవెన..గణపతి పాలన.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top