మాసం.. విశేషం

కార్తీక కాంతులు
ఆంగ్లమాన క్యాలెండర్‌ ప్రకారం ఏడాదిలో పదకొండవ మాసం` నవంబర్‌్‌. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది ఎనిమిదవ మాసం. నవంబర్‌ మాసం ఆశ్వయుజ ` కార్తీక మాసాల కలయిక. నవంబర్‌ 4వ తేదీ వరకు ఆశ్వయుజ మాస తిథులు.. ఆపై నవంబర్‌ 5వ తేదీ నుంచి కార్తీక మాస తిథులు కొనసాగుతాయి. ఒకపక్క దీపాల పండుగ` దీపావళి.. మరోపక్క నెలంతా వెలుగులు విరజిమ్మే కార్తీక దీపాలు.. ఈ మాసమంతా ఆధ్యాత్మిక కాంతులే.

2021` నవంబర్‌ 1, సోమవారం, ఆశ్వయుజ బహుళ ఏకాదశి నుంచి
2021` నవంబర్‌ 30, మంగళవారం, కార్తీక బహుళ ఏకాదశి వరకు..
శ్రీప్లవ నామ సంవత్సరం ` ఆశ్వయుజం ` కార్తీకం ` శరదృతువు` దక్షిణాయనం

నవంబర్‌ మాసమంతా అటు దీపావళి పండుగ.. ఇటు కార్తీక దీపాల వేడుక. ఈ నెలలోని మొదటి నాలుగు రోజులు ఆశ్వయుజ మాసంలోనివి. ఈ వ్యవధిలోనే దీపావళి పండుగ పలకరిస్తుంది. దీపావళి పర్వదినం నాడే కేదార గౌరీ వ్రతం, ధనలక్ష్మీ పూజ కూడా ఆచరించడం మన సంప్రదాయం. ఆశ్వయుజం ముగియడంతోనే వానలకు తెరపడుతుంది. ఆ తరువాత వచ్చే మిగతా రోజులన్నీ కార్తీక మాస తిథులే. ఇక్కడి నుంచి చలికాలం మొదలవుతుంది. కార్తీకం శివారాధన మాసం. శివ`కేశవులిద్దరికీ ప్రీతికరమైనదీ నెల. కార్తీక మాసం వివిధ వ్రతాలకు నెలవు. దాదాపు నెల పొడవునా ఇవి ఉంటాయి. అటు ఆధ్యాత్మికంగానే కాకుండా.. ఇటు ఆరోగ్యపరంగా కూడా ఆలోచించి ఆయా వ్రతాలను, వాటి నియమాలను మన పెద్దలు ఏర్పరిచారని అనిపిస్తుంది. ఎందుకంటే కార్తీకంలో చలి వణికిస్తుంది. అందరి ఆరోగ్యాలపై ఈ మాసం ప్రభావం చూపిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆయా వ్రతాలను, వాటిలోని ధర్మాలను, నియమాలను ఆచరించడం ద్వారా, ఈ కాలంలో ఏయే రకమైన ఆహారం తీసుకోవాలో నిర్దేశించారు. ఇక కార్తీకంలో నదీ స్నానాలు చాలా ముఖ్యమైనవి. తెల్లవారుజామునే నదీ, సముద్ర స్నానాలు చేయడం ఉత్తమం. ఆ కాలంలో నదులు, సముద్రాలలో ఉండే లవణాలు స్నానాల సందర్భంగా ఒంటికి పట్టి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని అంటారు. ఉసిరి, తులసి.. ఈ రెండూ కార్తీక మాసంలో విశేషంగా పూజలందుకుంటాయి. ఈ మాసంలో ఉసిరిని ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని అంటారు. అలాగే, కార్తీక మాసాన్ని కౌముదీ మాసమని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసమంతా వెన్నెల పిండారబోసినట్టు పరుచుకుని ఉంటుంది. ఒకపక్క కార్తీక దీపాలు.. మరోపక్క ఆకాశంలో వెన్నెల కాంతులు.. ప్రకృతి అత్యంత శోభాయమానంగా ఉంటుంది. మత్స్య పురాణం ప్రకారం గృహ నిర్మాణాలను ఆరంభించడానికి కార్తీకం అనువైన మాసం. ఈ నెలలో ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ఇంకా కార్తీక మాసంలో కార్తీక మాసంలో విశేషంగా పూజలందుకుంటాయి. ఈ మాసంలో ఉసిరిని ఆహారంలో ఒక భాగం చేసుకోవాలని అంటారు. అలాగే, కార్తీక మాసాన్ని కౌముదీ మాసమని కూడా అంటారు. కౌముది అంటే వెన్నెల. కార్తీక మాసమంతా వెన్నెల పిండారబోసినట్టు పరుచుకుని ఉంటుంది. ఒకపక్క కార్తీక దీపాలు.. మరోపక్క ఆకాశంలో వెన్నెల కాంతులు.. ప్రకృతి అత్యంత శోభాయమానంగా ఉంటుంది. మత్స్య పురాణం ప్రకారం గృహ నిర్మాణాలను ఆరంభించడానికి కార్తీకం అనువైన మాసం. ఈ నెలలో ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తే ధనధాన్య లాభాలు కలుగుతాయని అంటారు. ఇంకా కార్తీక మాసంలో
ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగ ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండ పుణ్యం లభిస్తుందని అంటారు. ఆశ్వయుజ ` కార్తీక మాసాల్లో వచ్చే వివిధ తిథులు.. వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..

ఆశ్వయుజ బహుళ ఏకాదశి/రమైకాదశి/వాల్మీకి జయంతి
నవంబర్‌ 1, సోమవారం
ఇది నవంబర్‌ మాసం ప్రారంభ దినం.
ఆమాదేర్‌ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ ఏకాదశిని రమైకాదశిగా పేర్కొన్నారు. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తిని పొందగలిగాడని అంటారు. అలాగే, మరికొన్ని వ్రత గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జయంతిగా పేర్కొన్నారు. వాల్మీకి రామాయణ గ్రంథకర్త. భారతీయులకు గొప్ప ఆధ్యాత్మిక జీవన విధానాన్ని, ధర్మబద్ధ జీవనాన్ని రామాయణం ద్వారా ఈయన అందించారు. మొదట్లో కిరాతకుడైన ఈయన.. పరివర్తనతో మహర్షి అయ్యాడు. ఈయన భరతజాతికి అందించిన రామాయణ మహా కావ్యం భారతీయ సారస్వత సాహిత్యానికి తలమానికమైనది. రాముడిని ఆదర్శ పురుషుడిగా, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు.. ఇంకా వివిధ పాత్రల ద్వారా మనిషి నడవడి ఎలా ఉండాలో తెలుపుతూ అత్యద్భుతమైన జీవన విధానాన్ని ఈయన ప్రబోధించారు. అందుకు కృతజ్ఞతగా ఆయనను స్మరించుకునే పుణ్య తిథి ఇది. ఈనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన వాల్మీకి జయంతి వేడుకలను ఘనం నిర్వహిస్తారు.
అలాగే, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన గుర్తుగా ఈనాడు అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఆశ్వయుజ బహుళ ద్వాదశి/గోవత్స ద్వాదశి, ధన్వంతరి జయంతి/జాతీయ ఆయుర్వేద దినోత్సవం
నవంబర్‌ 2, మంగళవారం
ఆశ్వయుజ కృష్ణ (బహుళ) ద్వాదశి చాలా విధాలుగా ప్రసిద్ధమై ఉంది. ఈనాడు గోవత్స ద్వాదశిగానూ పరిగణిస్తారు. అలాగే ‘ధన్వంతరి జయంతి’గానూ వ్యవహరిస్తారు. ధన్వంతరి జయంతిని పురస్కరించుకుని కొన్నేళ్లుగా భారత ప్రభుత్వం ఇదే రోజును జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత్‌లో పురుడు పోసుకున్న ఆయుర్వేద వైద్య విధానాలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆచరణకు నోచుకుంటున్నాయి.
ధన్వంతరి విషయానికి వస్తే, ఆయన గొప్ప వైద్య విద్యావేత్త. అతని ప్రాదుర్భావాన్ని గురించి రెండు మూడు కథలు వ్యావహారికంలో ఉన్నాయి. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తియే ధన్వంతరిగా అవతరించాడని ఒక కథ.
ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అప్పుడు విష్ణువు ఆయనతో నీవు అబ్జుడవనే పేరు పొందాలని సూచించాడు. దీంతో ధన్వంతరి ‘తండ్రీ! నీ కుమారుడైన నాకు యజ్ఞ భాగం ఇప్పించే ఏర్పాటు చేయవలసింది’ అని విష్ణువును ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు విష్ణుమూర్తి` ‘యజ్ఞ భాగములు ఇదివరకే వారి వారికి నిర్దిష్టమై ఉన్నాయి. కాగా, నీ కోసం ఇప్పుడు కొత్త ఏర్పాటు చేయడానికి వీలులేదు. రెండవ ద్వాపర యుగంలో నీకు పెద్ద పేరు వస్తుంది. అప్పుడు యజ్ఞకర్తలు నిన్ను ఉద్దేశించి చాతుర్మంత్రములతో కొలుస్తారు’ అని పలికాడు.
రెండవ ద్వాపర యుగంలో దీర్ఘతపుడు అనే వాడు పుత్రుల కోసం అబ్జుడినుద్దేశించి తపస్సు చేశాడు. అప్పుడు ధన్వంతరి ప్రత్యక్షమై ‘నేనే నీ కడుపున కొడుకుగా పుడతాను’ అని చెప్పాడు. అలాగే, ఆయన ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి రోజున జన్మించాడు. పెరిగి పెద్దవాడైన తరువాత భరద్వాజుడికి శిష్యుడయ్యాడు. అతని వద్ద ఆయుర్వేద విద్యను నేర్చుకున్నాడు. దివోదాసు నామం ధరించాడు. కాశీకి రాజయ్యాడు.
ఇదంతా బ్రహ్మాండ పురాణంలో ఉన్న ధన్వంతరి గాథ. ఒకచేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో జన్మించాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం చేత అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం.
ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరిని పూజించే వారికి రోగ భయం ఉండదని అంటారు.
ఇంకా ఆశ్వయుజ బహుళ ద్వాదశి తిథి నాడు వ్యాఘ్ర ద్వాదశి వ్రతం ఆచరించాలని స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఉంది. ఈ పర్వాన్నే గుజరాతీలు ‘వాగ్‌ బరాస్‌’గా వ్యవహరిస్తారు. వాగ్‌ అంటే పెద్దపులి. బరాస్‌ అంటే ద్వాదశి. ఈనాడు మాళవ దేశపు స్త్రీలు గోవత్స ద్వాదశీ వ్రతం చేస్తారు. దూడతో కూడిన ఆవును పూజిస్తారు. ఈ రెండిరటికీ ఉడకపెట్టని ధాన్యం పెడతారు. వాటి నుదుటి మీద ఎర్రబొట్టు ఉంచుతారు. ఆవుల వల్ల లభ్యమయ్యే పాలు, పెరుగు, నేయి మొదలైనవేవీ ఈనాడు ఈ పూజ చేసే స్త్రీలు తినకూడదని నియమం. ఈ పూజను శిశువుల క్షేమార్ధం ఆచరించాలని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి` చతుర్దశి/ధన త్రయోదశి/నరక చతుర్దశి/గో త్రిరాత్ర్ర వ్రతం
నవంబర్‌ 3, బుధవారం
ఆశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన త్రయోదశి తిథి. ఇంకా ఈనాడు గో త్రిరాత్ర వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈనాటికి దీపావళి రెండు రోజులు ఉంటుంది. దీపావళి గుజరాతీయులకు సంవత్సరాది. వారి ఈ ఉగాదికి రెండు రోజులు ముందు, రెండు రోజులు తరువాత కూడా వారికి పండుగలై ఉన్నాయి. అంటే దీపావళి పర్వం గుజరాతీయులకు వరుసగా ఐదు రోజుల పర్వం. ఈ ఐదు రోజుల పండుగలలో త్రయోదశి మొదటిది. ఆమాదేర్‌ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని ‘ధన త్రయోదశి’గా పేర్కొన్నారు. ఈ పర్వాన్నే గుజరాతీలు ‘ధన్‌తేరాస్‌’ అంటారు. త్రయోదశి అనగా పదమూడో తితి. పదమూడు మంచి అంకె కాదని పాశ్చాత్యుల విశ్వాసం. మనకు మాత్రం పదమూడో తిథి మంచి రోజు.
ధన త్రయోదశిని గుజరాతీయులు, మహారాష్ట్రీయులు గొప్పగా నిర్వహించుకుంటారు. ఈనాడు వారు ఇళ్లను శుభ్రం చేస్తారు. అలికి, కడిగి, రంగురంగుల ముగ్గులు పెడతారు. వీధి వాకిలిలో కూడా రంగుల ముగ్గులు పెడతారు. శుచిగా ఉంచితే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ఈనాటి నుంచీ దీపాలు వెలిగించడం ప్రారంభమవుతుంది.
ఈనాడు అభ్యంగన స్నానం చేయాలి. మంచి బట్టలు కట్టుకుని సుగంధ ద్రవ్యాలు రాసుకుని ధనపూజ ఆచరించాలి.
ఇంట్లో ఉన్న బంగారు వస్తువులను, వెండి వస్తువులను పాలతో కడుగుతారు. శుభ్రం చేసి పూజ చేసే చోట ఉంచుతారు. ఈనాడు షావుకార్లు తమ డబ్బు నిల్వ సరిచూసుకుని లక్ష్మీపూజ చేస్తారు. ఈ పండుగకు యమలోకంలోని పితరులు కూడా తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ఈ కారణంగా వారు పితరులను ఆహ్వానిస్తూ ధన త్రయోదశి సాయంకాలం వేళ తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. తమ ఇంటికి వచ్చే పితరులకు అది దారి చూపిస్తుందని విశ్వాసం. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు. ఇంటి యజమానికి తల్లిదండ్రులు ఉంటే ఈ దీపం అసలు పెట్టనే పెట్టరు.
పరక చతుర్దశి పర్వం కూడా ఈనాడే..
ఇక, తెలుగు పంచాంగం ప్రకారం నరక చతుర్దశి తిథి కూడా నవంబర్‌ 3నే.. అంటే త్రయోదశి ఘడియల్లోనే ఉంది. కాబట్టి ఈనాడు నరక చతుర్దశి పర్వం. ఏ చతుర్దశి నాటి అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమ తర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి అని పేరని కొందరు అంటారు. నరక చతుర్దశికి ‘ప్రేత చతుర్దశి’ అనే పేరు కూడా ఉంది. ఈనాడు నరక విముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. గుజరాతీలు నరక చతుర్దశిని కాలచౌదశ్‌ అంటారు. సంస్కృతంలో కాళ చతుర్దశి, అంటే అంధకారపు చతుర్దశి అని అర్థం.
నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించడానికి చేసే ఉత్సవమనీ, తమకు నరకలోక ప్రాప్తి లేకుండా చేసుకునే కార్యకలాప దినమనీ నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి అని నమ్మకం.

చతుర్దశి నాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అంతా నరకం నుంచి స్వర్గానికి వెళ్తారని పురాణ వాక్కు.
ఈ తిథి నాడు చీకటి ఉండగానే, అంటే తెల్లవారకుండానే అభ్యంగన స్నానం చేయాలి. వేకువజామున తైలాభ్యంగం చేసుకుని యమతర్పణం చేసిన వారికి యమ దర్శనం లేదని శాస్త్ర వచనం. ఈనాడు స్నానానికి ఉపయోగించే నటిని ఉత్తరేణి, తగిరిస చెట్ల కొమ్మలతో కలియబెట్టాలి. అలా కలిపిన జలంలో విద్యుత్తు పుడుతుంది. పైగా ఆయా ఓషధుల సమ్మేళనం చేత ఆ జలంలో రసాయనికమైన మార్పులు వస్తాయి. అటువంటి నీటిని శరీరంపై పోసుకోవడం ఆరోగ్యప్రదం. స్నానం చేస్తూ ఉండగా తలచుట్టూ దీపం తిప్పడం, ఆపై టపాకాయలు కాల్చడం తెలుగునాట సంప్రదాయం.
సూర్యుడు రాకుండా చంద్రోదయ కాలాన శాస్త్రోక్తంగా ఈనాడు చేసే స్నానం వల్ల నరక బాధలు తప్పుతాయని అంటారు. నరకం నుంచి తప్పించినందుకు నరకస్వామి అయిన యముడికి తర్పణం చేయాలి. ఆ సమయంలో ఉత్తరేణి ఆకుల్ని తలపై ఉంచుకోవాలి. ఇది నెలలో పద్నాలుగవ తిథి. కాబట్టి యుముడిని పద్నాలుగు నామాలతో అర్చించాలి. దక్షిణాభిముఖంగా కూర్చోవాలి. ఒక్కో నామాన్ని ఉచ్ఛరిస్తూ తిలలతో కూడిన జలాలు మూడేసి చొప్పున విడవాలి.
నరక చతుర్దశి నాడు తినవలసిన ఆహార విషయమై మన పెద్దలు కొన్ని నియమాలు ఏర్పరిచారు. తిలలతో అనగా నువ్వులతో వండిన పిండి వంటలు ఈనాడు తప్పక తినాలి. మినుములతో చేసిన పదార్థాలు, ప్రేత చతుర్దశి నాడు మాష పత్ర భక్షణం చేయాలని అంటారు. అలాగే, అప్పాలు, కూరలు బాగా తినాలని నియమం.
నరక చతుర్దశి నాడు సాయంకాలం ప్రదోష కాలంలో దీపదానం చేయాలి. దేవాలయాల్లో, మఠాల్లో దీపపంక్తులు ఉంచాలి. లక్ష్మీకాములైన మానవులు ఈనాడు, దీపావళి నాడు, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు దీప ప్రదానం విధిగా చేయాలి.
కాగా, ఆశ్వయుజ బహుళ త్రయోదశి` చతుర్దశి తిథుల నడిమి కాలంలో శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా నరక చతుర్దశి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. అయితే, నరక చతుర్దశికి నరకాసురుడికి సంబంధం లేదనేది మరికొందరి వాదన.
ఆశ్వయుజ బహుళ అమావాస్య /దీపావళి/లక్ష్మీపూజ
నవంబర్‌ 4, గురువారం
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడే దీపావళి. దీనినే దీపావళి అమావాస్య అంటారు. దీపమాలికలతో లక్ష్మికి నీరాజనం ఇచ్చే దినం కావడం వల్ల దీపావళి అనే పేరు వచ్చింది. హిందూమత సంస్కృతికి, హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. లక్ష్మీదేవి క్షీరసాగరాన్ని చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని, ఆ శుభ సందర్భ స్మారకంగా దీపావళి పండుగ ఏర్పడిరది. అందుకే దీపావళి నాడు లక్ష్మీపూజ ప్రధానమైనది. ఈనాడు మట్టి ప్రమిదల్లో నెయ్యి లేక నూనె, పత్తితో చేసిన ఒత్తితో దీపం వెలిగించాలి. దీపావళి పండుగకు వెలుతురు ఇచ్చే, చప్పుడు చేసే, బాణసంచా కాల్చడం సంప్రదాయం. మహాలయ పక్షంలో స్వర్గం నుంచి దిగి వచ్చి భూలోకంలో తిరుగుతూ ఉండే పితరులు ఈనాడు తిరిగి పితృలోకానికి ప్రయాణమై వెళ్తారు. వారికి వెలుతురు చూపడం నిమిత్తం నరకలోక వాసులు చేతులతో కాగడాలు పట్టుకుని ఆకాశం వైపు చూపాలని శాస్త్ర వచనం. ఆ కాగడాలే నేడు దీపావళి పండుగలో మతాబులు, ఇతర టపాసులు కాల్చడంగా మారింది.
నరక చతుర్దశి నాడు కానీ, దీపావళి అమావాస్య నాడు కానీ స్వాతీ నక్షత్రం వస్తే ఉత్తమ యోగం. అది ఈ దీపావళికి రావడం విశేషమనే చెప్పాలి.
దీపావళి నాటి రాత్రి చేసే లక్ష్మీపూజ పుణ్యప్రదమైనది. ఈనాడు లక్ష్మీదేవి భూలోకానికి దిగి వచ్చి ఇల్లిళ్లూ తిరుగుతుందని, శుభ్రంగా ఉన్న ఇంటిలో తన కళను ఉంచి వెళ్తుందని విశ్వాసం. అందుచే స్త్రీలు ఈనాడు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు. పగిలిపోయిన, పనికిరాని వస్తువులను తీసిపారేస్తారు. లక్ష్మీ విగ్రహానికి పూజ చేస్తారు. ఆమె విగ్రహం ముందు తమ ఇంట్లో ఉన్న బంగారపు వస్తువులు, నగలు, నాణేలు ఉంచుతారు. లక్ష్మీపూజ అనంతరం ఆనాటి రాత్రి ఇక నిద్రపోకూడదని నియమం. ఇలా పవిత్రంగా పూజ జరిగితే లక్ష్మి ప్రసన్నురాలై ఆ ఇంట ప్రవేశిస్తుందని అంటారు. దీపావళి అమావాస్య మొదలు నెల రోజులు అనగా, మళ్లీ అమావాస్య వరకు ఇంటి వెలుపల ఆకాశదీపం ఉంచడం కూడా ఆచారం. దీపావళి నాడు మాష పత్రాలు (మినప ఆకులు) పూజనీయం. మినుములతో చేసిన సున్నుండలు, ఇతర తినుబండారాలు దీపావళి పర్వాన్ని రుచిమయం చేస్తాయి.
కార్తీక శుద్ధ పాడ్యమి/ కార్తీక స్నానారంభం/బలి పాడ్యమి
నవంబర్‌ 5, శుక్రవారం
కార్తీక శుద్ధ పాడ్యమి.. కార్తీక మాసారంభ తిథి. స్మృతి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో పేర్కొన్న ప్రకారం.. ఈనాడు అన్నకూటము, గోవర్ధన ప్రతిపదము, అభ్యంగము, లక్ష్మీపూజ, ద్యూతము, గోవర్ధన పూజ, అన్నకూటోత్సవ అపరాహ్ణే మార్గపాలీ బంధనం వంటి వ్రత విధులు ఆచరించాలి. అలాగే, ‘గదాధర పద్ధతి’ అనే గ్రంథంలో` ఈనాడు బలిరాజోత్సవం, ద్యూతమ్‌, బలిప్రతిపత్‌, ద్యూత ప్రతిపత్‌ వ్రతాలు చేయాలని ఉంది. ‘పురుషార్థ చింతామణి’ అనే వ్రత గ్రంథం ప్రకారం.. ఈనాడు భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరించాలి. అంటే మొదటి ఐదు రోజుల పాటు అన్నం, తరువాత ఐదు రోజులు పెరుగు అన్నం తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వ్రత విధి. కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అని కూడా అంటారు. బలి చక్రవర్తికి ప్రీతికరమైన పాడ్యమి ఇది. దీనికి ముందు వచ్చే ఆశ్వయుజ మాసంలో వచ్చే నరక చతుర్దశి, అమావాస్యల మాదిరిగానే ఈనాడూ అభ్యంగన స్నానం చేసి దీపావళి ఉత్సవం నిర్వహించడం కొన్ని ప్రాంతాలలో ఆచారంగా
ఉంది.
కార్తీక శుద్ధ విదియ/ భగినీ హస్త భోజనం
నవంబర్‌ 6, శనివారం
కార్తీక శుద్ధ కార్తీక శుక్ల విదియ (ద్వితీయ) తిథి నాడు కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ వ్రతాలు ఆచరించాలి. అలాగే, ఈ తిథిని యమ ద్వితీయగానూ వ్యవహరిస్తారు. ఈనాడు యముడిని పూజించాలి. సోదరి ఇంట భోజనం చేయాలి. ఈ ప్రక్రియనే భగినీ హస్త భోజనం అంటారు. ఈనాడు చంద్రార్ఘ్య దానం తప్పక చేయాలని అంటారు. శుక్ల విదియ నాడు చంద్రుడు చిన్నగా కనిపిస్తాడు. కాగా, కార్తీక శుద్ధ పాడ్యమి నాడు పూజలు అందుకునే బలి చక్రవర్తి విదియ నాడు తిరిగి పాతాళానికి వెళ్లిపోతాడు. కాబట్టి ఈనాడు విధాయకంగా బలికి వీడ్కోలు పూజలు నిర్వహించాలి. అలాగే తాహతును బట్టి దాన ధర్మాలు నిర్వహించాలి.
ఇక, ఈనాడు ఆచరించే భగినీ హస్త భోజనం అనే పర్వం విశేషమైనది. మన సంప్రదాయంలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దం పట్టే పర్వాల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి` రాఖీ పూర్ణిమ. రెండవది` భగినీ హస్త భోజనం. సోదరీ సోదరుల ఆప్యాయతానుబంధాలకు అద్దం పట్టే ఒక సంప్రదాయమే భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె సోదరుడికి పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అయ్యింది. కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్లిన రెండవ నాడు ఈ వేడుకను నిర్వహిస్తారు. ఈనాడు అన్నదమ్ములు తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి, బహుమానాలు ఇచ్చి, వారి చేతి వంట తిని వారి చేత తిలకం దిద్దించుకుంటారు. పురాణ కథ ప్రకారం.. యమధర్మరాజు సోదరి యమున. ఆమె వివాహమై వెళ్లాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నోసార్లు పిలుస్తుంది. కానీ, యమధర్మరాజు వెళ్లలేకపోయాడు. చివరకు ఒకసారి కార్తీక మాస విదియ రోజున యమున ఇంటికి యముడు వెళ్తాడు. సోదరుడు వచ్చిన సంతోషంతో యమున సంతోషంగా పిండివంటలు చేసి సోదరుడికి పెడుతుంది. చాలా రోజుల తరువాత కలుసుకోవడంతో యముడు, యమున సంతోషిస్తారు. ఆ సంతోషంతో యముడు ఏదైనా కోరుకొమ్మని యమునతో చెబుతాడు. దీంతో ఆమె కార్తీక శుద్ధ విదియ నాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని యమున కోరుతుంది. యముడు సంతోషించి, అలా వేడుక జరుపుకునే వారికి అపమృత్యు దోషం (అకాల మరణం) లేకుండా ఉంటుందని, ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుందని వరాలిచ్చాడు. అందువల్లనే భగినీ హస్త భోజన విధి ఆచరణలోకి వచ్చింది.
కార్తీక శుద్ధ తదియ/ సోదరి తృతీయ
నవంబర్‌ 7, ఆదివారం
కార్తీక శుద్ధ తదియ తిథిని ‘సోదరి తృతీయ’ అని కూడా అంటారు. చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఈనాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని ఉంది. అలాగే ఈనాడు విష్ణు గౌరీ వ్రతం ఆచరించాలని కూడా అందులో రాశారు. లక్ష్మీదేవిని యథాశక్తి పూజించి, ముత్తయిదువులను పిలిచి మంగళ ద్రవ్యాలతో వారిని గౌరవించి, వారికి భోజనం పెట్టాలి. అలాగే మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉన్న ప్రకారం` ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని నియమం విధించారు. అయితే, వ్రతాలన్నిటి కంటే సోదరి తృతీయ పర్వంగానే ఈ తిథి మిక్కిలి ప్రసిద్ధి చెంది ఉంది. ఈనాడు సోదరి సోదరుడిని, సోదరుడు సోదరిని పరస్పరం గౌరవించుకుంటారు. అందుకే దీనికి ‘సోదరి తృతీయ’ అనే పేరు వచ్చింది.
కార్తీక శుద్ధ చవితి/ నాగుల చవితి
నవంబర్‌ 8, సోమవారం
కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి పర్వదినం. ఈనాడు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి తీర ప్రాంతాల్లో నాగ పూజలను విశేషంగా చేస్తారు. నాగుల చవితిగా వ్యవహరించే ఈనాడు పాముల పుట్టలలో పాలు పోస్తారు. చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేసే పదార్థం), అరటిపండ్లు, తాటి బుర్రగుంజు, తేగలు మొదలైనవి ఈనాటి నివేదన ప్రసాదాలు. ఈ సందర్భంగా పాముల పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు కాలుస్తారు. చిన్న పిల్లలు, యువతులకు ఆనందాన్ని పంచే పర్వమిది. భారతీయులలో చాలామంది ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయనే స్కంధుడు, కుమారస్వామిగానూ ప్రసిద్ధి. నాగుల చవితి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో పూజలందుకునేది ఈయనే. అలాగే, ఈనాడు నాగవ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. కార్తీక శుద్ధ పంచమి నాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరించాలని కూడా ఆ గ్రంథంలో ఉంది. ఈ తిథి మొదలు వరుసగా ఏడు రోజులు క్రమం తప్పకుండా రోజూ ‘యవాగుయావక శాకదధి క్షీరఘృత జలనామాహార’ అనే వ్రతాన్ని ఆచరించాలని అంటారు.
కార్తీక శుద్ధ పంచమి/ నాగపంచమి
నవంబర్‌ 9, మంగళవారం
కార్తీక శుద్ధ పంచమి తిథి నాగపంచమి పర్వం. ఈనాడు కూడా నాగులను పూజించడం ఆచారం. అలాగే, ఈనాడు జైనులు ఈనాడు తమ ఇళ్లలోని పాత పుస్తకాలను దులిపి, శుభ్రం చేసుకుని తిరిగి వాటిని యథా స్థానంలో ఉంచుతారు. ఇంకా ఈనాడు జయ పంచమి, జ్ఞాన పంచమి విధులు నిర్వర్తించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది.
కార్తీక శుద్ధ షష్ఠి/ స్కంద షష్ఠి
నవంబర్‌ 10, బుధవారం
కార్తీక శుద్ధ షష్ఠి తిథి మహా షష్ఠి పర్వంగా ప్రసిద్ధి. ఈనాడు వహ్ని పూజ చేయాలని అంటారు. కుమారస్వామిని పూజించడానికి ఈ తిథి మిక్కిలి అనుకూలమైనది. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఈ వివరాలన్నీ ఉన్నాయి. ఈ తిథి నుంచి వరుసగా మూడు రోజుల పాటు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలి. ఈ విధంగా వ్రతం ఆచరించడాన్ని మహేంద్ర కృచ్ఛ వ్రతమనీ అంటారు. అలాగే, ఈనాడు మనవాళ మహాముని తిరు నక్షత్ర తిథి కూడా.
కార్తీక శుద్ధ సప్తమి/ శాక సప్తమి/లక్ష్మీప్రద వ్రతం
నవంబర్‌ 11, గురువారం
కార్తీక శుద్ధ సప్తమి తిథి కల్పాది దినం. ఈనాడు శాక సప్తమీ వ్రతం కూడా ఆచరిస్తారు. కొన్నిచోట్ల లక్ష్మీప్రద వ్రతం కూడా ఆచరిస్తారు. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు మాత్రమే తీసుకుని ఈ వ్రతాన్ని ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉండటాన్ని బట్టి ఇది చాలా కఠిన నియమాలతో కూడిన వ్రతమని అర్థమవుతోంది.
కార్తీక శుద్ధ అష్టమి/ గోపూజ
నవంబర్‌ 11, గురువారం
కార్తీక శుద్ధ సప్తమి తిథి ఘడియల్లోనే అష్టమీ ఘడియలు కూడా ఉన్నాయి. కార్తీక శుద్ధ అష్టమి నాడు గోపూజ చేయాలని ఆయా వ్రత గ్రంథాలలో ఉంది. ఇంకా ఈనాడు గోపాష్టమి నిర్వహించే ఆచారం కూడా కొన్ని ప్రాంతాలలో ఉంది. దుర్గాష్టమి వ్రతాన్ని కూడా ఈనాడు ఆచరిస్తారు.
కార్తీక శుద్ధ నవమి/కృత యుగాది దినం
నవంబర్‌ 12, శుక్రవారం
కార్తీక శుద్ధ నవమి తిథి ‘కృత యుగాది’ దినం. యుగాలలో కృతయుగం శ్రేష్ఠమైనది. దీని కాల పరిమితి 1728000 మానవ సంవత్సరాలు. అలాగే ఈనాడు నదీ, సముద్ర స్నానం చేయడం గొప్ప ఫలాన్ని ఇస్తుందని శాస్త్ర వచనం. ఆమాదేర్‌ జ్యోతిషీ అనే గ్రంథంలో మాత్రం` ఈనాడు దుర్గా నవమి ఆచరించాలని ఉంది. తిథి తత్వం అనే మరో గ్రంథం ప్రకారం` ఈనాడు చండీపూజ చేయాలని ఉంది. ఇవి రెండూ అమ్మవారి ఆరాధనకు సంబంధించినవే కావడం విశేషం. అష్టమి తిథి అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది అనడానికి పై రెండు పూజలు నిదర్శనం.
కార్తీక శుద్ధ దశమి/
నవంబర్‌ 13, శనివారం
కార్తీక శుద్ధ దశమి నాడు విశేషమైన పర్వాలేమీ లేవు. చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో మాత్రం ఈనాడు సార్వభౌమ వ్రతం, రాజ్యాప్తి దశమి వ్రతం వంటివి ఆచరించాలని రాశారు.
కార్తీక శుద్ధ ఏకాదశి/దేవుత్తున ఏకాదశి/శయన ఏకాదశి
నవంబర్‌ 14`15, ఆది/సోమవారాలు
కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నవంబర్‌ 14, 15 తేదీలలో కొనసాగుతోంది. నవంబర్‌ 14 బాలల దినోత్సవం. భారత దేశ తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి దినాన్ని, బాలల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇక, కార్తీక శుద్ధ ఏకాదశి తిథి విష్ణువుకు ప్రీతికరమైనదని అంటారు. ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాసం కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. మొత్తం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వచ్చే ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైనవి. అత్యంత ప్రాశస్తమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి, దేవుత్తున ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు పాల సముద్రంలో శేష తల్పంపై విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర లేస్తాడు. అందుచేత, విష్ణువు నిద్రలేచిన దినం కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధిన్యేకాదశి అని కూడా అంటారు. ఈనాడు కాయ ధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ కూడా తినకూడదని వ్రత నియమం. ఫలాలు మాత్రమే తీసుకోవాలి. మహారాష్ట్రలోని పండరీపురంలో విఠలుని ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. పండరి భక్తులు అనేక మంది ఇక్కడకు కాలినడకన పాదయాత్రగా చేరుకుంటారు. ఇంకా స్మృతి కౌస్తుభం, చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథాలను బట్టి ఈనాడు ఆచరించాల్సిన వ్రతాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఏకాదశి తిథి సమయానుసారం ఈ ఏకాదశిని 15వ తేదీని జరుపుకోవాలి.
కార్తీక శుద్ధ ద్వాదశి/యోగేశ్వర ద్వాదశి/క్షీరాబ్ధి ద్వాదశి/తులసీ వ్రతం
నవంబర్‌ 16, మంగళవారం
కార్తీక శుద్ధ ద్వాదశి తిథి అనేక వ్రతాలకు ఆటపట్టు. ఈ తిథి నాడు పలు వ్రతాలను ఆచరించాలనే నియమం ఉండటాన్ని బట్టి ఇది విశిష్టమైన తిథిగా భావించాలి. కార్తీక శుద్ధ ద్వాదశి తిథి చిల్కు ద్వాదశిగా ప్రసిద్ధి. తులసీ వ్రతాన్ని ఈనాటి నుంచే ఆరంభించాలి. వివిధ వ్రత గ్రంథాలలో ఈ తిథిని మథన ద్వాదశిగా పేర్కొన్నారు. క్షీర సముద్రాన్ని కార్తీక శుద్ధ ద్వాదశి నాడే దేవతలు మథించారని (చిలకడం), అందుకే ఇది మథన ద్వాదశి దినం అయ్యిందని అంటారు. దీనినే మన తెలుగు నాట ‘చిల్కు ద్వాదశి’గా వ్యవహరిస్తారు. మథించడాన్నే చిలకడం అని కూడా అంటారు. అలాగే క్షీర సముద్ర మథన సంబంధ పర్వం కాబట్టే కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు క్షీరాబ్ధి నుంచి బయల్దేరి కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి తులసీ బృందావనానికి చేరుకుంటారు. కాబట్టి ఈ తిథి నాడు తులసి మొక్కను విశేషంగా పూజించే ఆచారం ఉంది. అలాగే, కార్తీక శుద్ధ ద్వాదశిని కొన్ని వ్రత గ్రంథాలలో యోగిని ద్వాదశిగా కూడా పేర్కొన్నారు. ఇంకా విభూతి ద్వాదశి, గోవత్స ద్వాదశి, నీరాజన ద్వాదశి అనే పేర్లతో కూడా ఈనాడు వ్రతాలు ఆచరించే సంప్రదాయం వివిధ ప్రాంతాలలో ఉంది. ఈ వ్రతాల నియమాలన్నీ చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో వివరంగా ఉన్నాయి. కాగా, ఈనాటితో చాతుర్మాస వ్రతం ముగుస్తుంది.
కార్తీక శుద్ధ త్రయోదశి/శని త్రయోదశి
నవంబర్‌ 17, బుధవారం
కార్తీక శుద్ధ త్రయోదశి తిథి శనిదేవునికి, శివుడికి ప్రీతికరమైనది. ఈనాడు శని త్రయోదశి పూజలు విశేషంగా నిర్వహిస్తారు. శనీశ్వరుడిని విశేషంగా పూజిస్తారు. అలాగే గో త్రిరాత్ర వ్రతం కూడా ఈ తిథి నాడే ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
కార్తీక శుద్ధ చతుర్దశి/వైకుంఠ చతుర్దశి
నవంబర్‌ 18, గురువారం
విష్ణువు వైకుంఠం నుంచి బయల్దేరి వారణాసికి వెళ్లి స్వయంగా శివుడిని ఈ తిథి నాడు పూజించాడని అంటారు. శివ, కేశవుల మధ్య ఎలాంటి భేదం లేదనడానికి ఈ తిథినే నిదర్శనంగా చెబుతారు. విష్ణువు స్వయంగా శివపూజకు కాశీకి వెళ్లినందున ఈ తిథి దినం వైకుంఠ చతుర్దశి అయ్యింది. కాబట్టి కార్తీక శుద్ధ చతుర్దశి తిథిని పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు.
కార్తీక శుద్ధ పౌర్ణమి/దీపోత్సవం
నవంబర్‌ 19, శుక్రవారం
కార్తీక మాసం అంటేనే దీపోత్సవ మాసం. దీపకాంతులు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ నలుదిశగా వెలుగొందుతుంటాయి. కార్తీకమంతా వెలిగే కార్తీక దీపం కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు మరింత దేదీప్యమానం అవుతుంది. కార్తీక పూర్ణిమ ఒక విధంగా దీపాల పండుగ వంటిదే. అదీ నిండు పున్నమి నాడు జరిగే దీప వేడుక ఇది. ‘ఈనాటి రాత్రి స్త్రీలు తులసి చెట్టు వద్ద 720 దూది వత్తులు నేతిలో ముంచి పెద్ద దీపం వెలిగిస్తార’ని కొఠారీస్‌ హిందూ హాలీడేస్‌ అనే గ్రంథంలో ఈ పర్వం గురించి వివరించారు. కార్తీక శుద్ధ పూర్ణిమ నాడే ఈశ్వరుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. శివుడికి, త్రిపురాసురుడికి మధ్య మూడు రోజుల పాటు కఠోర యుద్ధం జరిగింది. ఎట్టకేలకు శివుడు త్రిపురాసురుడిని సంహరించడంలో దేవలోకమంతా ఆయనను ఘనంగా స్తుతించింది. ఈ విజయ చిహ్నంగానే కార్తీక పూర్ణిమ నాడు దీపాల పండుగను జరుపుకుంటారని కొందరు వ్రతకారుల అభిప్రాయం. అలాగే, ఈ దినం త్రిపురాసురుని సంహరించిన దినం కాబట్టి ఈ పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు. ఈనాడు శివుడి గౌరవార్థం పూజలు నిర్వహిస్తారు. మునిమాపు వేళ తులసి కోట వద్ద దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు వెలిగించేది కొన్ని ప్రాంతాల్లో మహిళలు అయితే, వాటి వద్ద పూజలు చేసేది మాత్రం పురుషులు.
జ్వాలాతోరణ ఉత్సవం
కార్తీక శుద్ధ పూర్ణిమ నాడు పలుచోట్ల జ్వాలా తోరణ ఉత్సవం నిర్వహిస్తారు. ఇంకొన్ని చోట్ల ఈ తిథి నాడు శివాలయానికి ఎదుట రెండు స్తంభాలు పాతి అడ్డంగా ఒక దూలాన్ని కడతారు. ఎండు గడ్డి వెంటులు ఆ మూడు బాజులకు దట్టంగా చుడతారు. దానికి నిప్పంటిస్తారు. ఆ గడ్డి ప్రజ్వలంగా మండుతుండగా శివుడిని, పార్వతిని ఒక పల్లకిలో ఉంచి దాని కిందుగా మూడుసార్లు తిప్పుతారు. ఈ సందర్భంగా మండుతున్న గడ్డిని కొందరు రైతులు పెనుగులాడి బయటకు లాగుతారు. అలా దక్కించుకున్న గడ్డిని వెంటనే తమ పశువులకు మేతగా వేస్తారు. మరికొందరు ఆ గడ్డిని తమ గడ్డిమేట్ల లోపల దూర్చి దాచివేస్తారు. ఆ గడ్డి తిన్న పశువులు భద్రంగా ఉంటాయని, బాగా పాలు ఇస్తాయని విశ్వాసం. పార్వతీదేవి మొక్కు ఫలితంగా జ్వాలా తోరణ ఉత్సవం ఏర్పడిరదని పురాణాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఆమె చేసిన సహగమన ప్రయత్నానికి ఈ ఉత్సవం ఒక సూచనమని అంటారు. సహగమనం అంటే అందరికీ సందేహం రావచ్చు. దీని వెనుక నేపథ్యమిదీ. ఒకనాడు శివుడు రాక్షసులను చంపడానికి వెళ్లి చాలా కాలం వరకు తిరిగి రాలేదు. ఎంత ప్రయత్నించినా ఆయన క్షేమ సమాచారం పార్వతికి లభించలేదు. దీంతో తన భర్త యుద్ధంలో మరణించి ఉంటాడని ఆమె భావించింది. ఆ సందర్భంలో ఒక కార్తీక పౌర్ణమి నాడు ఆమె సహగమనానికి సిద్ధిమైందని అంటారు. అలాగే, రాక్షసులను జయించి వచ్చిన శివుడికి దృష్టి దోష పరిహారార్థం ఏర్పాటు చేసిన విజయచిహ్నమే ఈ పర్వమనే మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
ఇంకా, కార్తీక పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రాశస్త్యమైనది. ఈనాడు మార్కండేయ పురాణాన్ని దానం చేస్తే పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం కలుగుతుందని శాస్త్ర వచనం.
కార్తీక పౌర్ణమిని ఆధారంగా చేసుకుని అనేక నానుడులు వ్యావహారికంలో ఉన్నాయి. ‘కర్ణుడు చనిపోయాక భారతం లేదు. కార్తీక పౌర్ణమి వెళ్లాక వానలు లేవు’ అని తెలుగు రాష్ట్రాలలో ఒక నానుడి బాగా వ్యాప్తిలో ఉంది. ఈనాటితో ఇక, వానలుండవు. చలిమంచు తెరలు దట్టంగా కమ్ముకుంటాయి. శీతాకాలం పరాకాష్టకు చేరుకుంటుంది.
కార్తీక పూర్ణిమ నాడు కార్తీక పూర్ణిమ వ్రతం కూడా ఆచరిస్తారు. వ్రతాలలోనే గొప్ప వ్రతమిది. తెలుగు నాట ఈనాడు చలిమిడి చేస్తారు. పార్వతీదేవి కూడా ఒకనాడు కార్తీక పూర్ణిమ వ్రతం ఆచరించిందని అంటారు. మహిషాసురుడితో యుద్ధం చేసే సమయంలో పార్వతి (దుర్గ) తనకు తెలియకుండానే ఒక శివలింగాన్ని బద్దలుగొట్టిందట. ఆ పాపం పోవడానికి ఆమె ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు శివారాధన చేసిందట. దీంతో దోష పరిహారం జరిగింది.
గురునానక్‌ జయంతి దినం కూడా ఈనాడే. అలాగే, తెలుగు వారి ఆరాధ్య దైవం పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి పుణ్యతిథి కూడా ఈనాడే.
కార్తీక బహుళ పాడ్యమి/అన్నదానం
నవంబర్‌ 20, శనివారం
కార్తీక బహుళ పాడ్యమి నాడు రోహిణీ వ్రతం ఆచరిస్తారు. అలాగే, ఈ తిథి నాడు లావణ్య వ్యాప్తి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది. ఈ వ్రతాన్ని నెల రోజుల పాటు నిష్టగా చేయాల్సి ఉంటుంది. ఈ తిథి నాడు చేసే అన్నదానం మహా ఫలాన్నిస్తుందని అంటారు.
కార్తీక బహుళ విదియ
నవంబర్‌ 21, ఆదివారం
కార్తీక బహుళ విదియ తిథి నాడు అశూన్య వ్రతాన్ని ఆచరించాలి. దీనినే చాతుర్మాస్య ద్వితీయ పర్వంగానూ వ్యవహరిస్తారు. ఈ వ్రతం గురించి పురుషార్థ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
కార్తీక బహుళ తదియ
నవంబర్‌ 22, సోమవారం
కార్తీక బహుళ తదియ నాడు భద్ర వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇది దేవికి సంబంధించిన వ్రతమో ఇతమిద్దంగా తెలియకున్నది.
కార్తీక బహుళ చతుర్ధి/కరక చతుర్థి వ్రతం
నవంబర్‌ 23, మంగళవారం
కార్తీక బహుళ చవితి స్త్రీలకు సౌభాగ్యప్రదమైన వ్రతాన్ని అందిస్తోంది. కరక చతుర్థి అనే పేరు గల ఈ వ్రతం స్త్రీలకు ఉద్ధిష్టమైనది. ఈనాడు ఉదయాన్నే స్నానం చేసి మడి బట్టలు కట్టుకుని, నగలు ధరించి వినాయకుడిని పూజించాలి. గణపతికి పది రకాలైన పిండి వంటలతో కూడిన పళ్లాలను నివేదించాలి. అనంతరం వాటిని ముత్తయిదువులకు పంచాలి. చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చి భోజనం చేయాలి. ఇది పన్నెండు, పదహారు సంవత్సరాల పాటు కానీ లేదా జీవితాంతం కానీ ఆచరించాల్సిన వ్రతం.
కార్తీక బహుళ సప్తమి/ పైతామహాకృచ్ఛ వ్రతం
నవంబర్‌ 26, శుక్రవారం
కార్తీక బహుళ సప్తమి నాడు ఓ భిన్నమైన వ్రతం ఉంది. మనకు సంప్రదాయానుసారం వచ్చే అనేక వ్రతాలలో మిక్కిలి విచిత్రమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో పైతామహాకృచ్ఛ వ్రతం ఒకటి. కార్తీక బహుళ సప్తమి నాడు ఆచరించాల్సిన ఈ వ్రతం గురించి చతుర్వర్గ చింతామణిలో రాశారు. ఇది కొంత ఆశ్చర్యకరమైన వ్రత విధానంతో కూడి ఉన్నది. ఈ వ్రతాచరణ ప్రకారం` సప్తమి నాడు నీళ్లు, అష్టమి నాడు పాలు, నవమి నాడు పెరుగు, దశమి నాడు నెయ్యి మాత్రమే తిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో వివరించారు.
కార్తీక బహుళ అష్టమి/దాంపత్యాష్టమి
నవంబర్‌ 27, శనివారం
కార్తీక బహుళ కార్తీక బహుళ అష్టమి తిథి నాడు దాంపత్యాష్టమి. సంవత్సరం పొడవునా వచ్చే వివిధ అష్టమి తిథుల నాడు వివిధ రకాలైన పూలతో శివుడిని పూజిస్తారు. ఈ క్రమంలో కార్తీక బహుళ అష్టమి నాడు వచ్చే తిథి దాంపత్యాష్టమిగా ప్రతీతి. ఈ వ్రతం చేయాలంటే ప్రతి సంవత్సరంలో వచ్చే అష్టమి నాడు శివుడిని వివిధ రకాల పూలతో పూజించాలని వ్రత నియమం. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఈ తిథి నాడు కాలభైరవుడిని పూజిస్తారు. ఇంకా కార్తీక బహుళ అష్టమి నాడు ఆచరించే వ్రతాలలో ప్రథమాష్టమి, కృష్ణాష్టమి, కాలాష్టమి అనేవి కూడా ఉన్నాయి.
కార్తీక బహుళ ఏకాదశి/ఉత్పత్యైకాదశి
నవంబర్‌ 30, మంగళవారం
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశిగా ప్రతీతి. ఏకాదశీ దేవి ఈనాడు ఉత్పత్తి పొందినది. కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి దేవి మురాసురుడనే రాక్షసుడిని వధించిందని అంటారు. మురాసురుడిని సంహరించిన ఏకాదశిదేవిని మెచ్చిన విష్ణువు, ఆమెను మూడు వరాలు కోరుకొమ్మన్నాడు. దాంతో ఆమె` ‘నా పేరు ఏకాదశి. నేను ఎల్లప్పుడూ మీకు ప్రియురాలిగా ఉండాలి, అన్ని తిథుల్లోనూ నాకు అధిక ప్రాముఖ్యం ఉండాలి, నా తిథి (ఏకాదశి) నాడు ఉపవాసం ఉండి, మిమ్మల్ని (విష్ణువు) ఉపాసించే వారికి మోక్షం ప్రసాదించాలి’ అని మూడు వరాలు కోరుకుంది. దీంతో ఆ మూడు వరాలను విష్ణువు ఆమెకు ప్రసాదించాడు. అలాగే, ఈనాడు కామధేను వ్రతం కూడా ఆచరిస్తారని కొన్ని వ్రత గ్రంథాలలో ఉంది.

శివుడికి ప్రీతికరం.. కార్తీక సోమవారం
కార్తీక సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ నెలలో సోమవారం వ్రతం చేసే వారు పరమశివుని అనుగ్రహానికి పాత్రులై, శివ సాయుజ్యాన్ని పొందుతారు. సోమవారం తెల్లవారుజామునే స్నానం చేసి దీపం పెడతారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడికి కార్తీక సోమవారం నాడు పొద్దుటి నుంచి అభిషేకాలు చేసి, సాయంత్రం ప్రత్యేక పూజలు చేస్తారు. పొద్దుటి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలు వచ్చాక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన తరువాత తింటారు.

కార్తీకం ప్రత్యేకం.. ఉసిరిక
కార్తీక మాసంలో తప్పక తీసుకోవాల్సిన పదార్థం` ఉసిరిక. దీనికి మంచి రసాయనిక గుణాలున్నాయి. ఉసిరికాయతో చేసిన పదార్థాలను తింటే శరీరానికి అనేక విధాల మేలు కలుగుతుంది. ఉసిరిక శీతగుణం కలది. తీపి, పులుపు, కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. శరీరంలో ఉండే వేడిని పోగొడుతుంది. కండ్ల మంటలు, పాదాల మంటలు తగ్గుతాయి. అరుచిని పోగొడుతుంది. దాహం తగ్గుతుంది. ఉసిరికాయను ఏదో ఒక రూపంలో రోజూ ఆహారంలో తీసుకోవచ్చు.

కార్తీకంలో నదీస్నానం.. ఆరోగ్యదాయకం
కార్తీక మాసంలో వాతావరణ మార్పు వల్ల సంభవించే చిన్న చిన్న రుగ్మతలను నాశనం చేసే గుణం మనకు గల ఏడు ప్రధాన నదుల్లోని నీటిలో ఉంది. అందుకే ఈ నదుల్లో కృత్తిక నక్షత్రం వెళ్లిపోకుండా సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేస్తే మంచి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈ నెలలో తెల్లవారుజామున మెడ వరకు నీటిలో మునిగి కొంత సమయం ఉండి స్నానం చేస్తే ఉదర సంబంధ వ్యాధులు నయం అవుతాయని శాస్త్రం చెబుతోంది.
తులసి మొక్క గాలి.. ఉసిరి చెట్టు నీడ
కార్తీక మాసంలో పూజనీయమైనవి ఉసిరి, తులసి. ఈ రెండూ పరమ పవిత్రమైనవి. తులసి చెట్టు గాలి వలే ఉసిరిక చెట్టు నీడ, గాలి చాలా ఆరోగ్యకరమైనవి. కార్తీక మాసంలో వన భోజనాలు, వన సంతర్పణలు ఉసిరి చెట్టు నీడనే జరపడం ఈ చెట్టుకున్న ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. అదీగాక, ఈ రెండు చెట్ల ప్రాముఖ్యత తెలిపేలా ఉసిరి, తులసి ఒకేచోట పుట్టినట్టు పురాణ గాథలు చెబుతున్నాయి. ధాత్రి అనేది ఉసిరిక గల మరో పేరు. క్షీరాబ్ధి ద్వాదశి నాడు కాయలతో కూడిన దీని కొమ్మను తులసితో కలిపి పూజించడం ఆచారం.

కార్తీక పౌర్ణమి నాడు 33 పున్నముల నోము
కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. ఈ కారణంగానే ఈ మాసానికి కార్తీకమనే పేరొచ్చింది. ఈ రోజు పుణ్య నదుల్లో స్నానం చేసి జపాలు, పూజలు చేస్తారు. 33 పున్నముల నోము అంటూ కార్తీక పౌర్ణమి నాడు స్త్రీలు నోములు చేస్తారు. ఈ రోజు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారు. అన్న సంతర్పణలు చేస్తారు. పౌర్ణమి నాడు సాయంత్రం పూర్ణ చంద్రుడు వచ్చాక ఎవరైతే పూజలు చేస్తారో వారింట్లో శ్రీ మహా విష్ణువు లక్ష్మీసమేతుడై కొలువు ఉంటాడని ప్రతీతి. ఆ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో కళకళలాడుతుంది.

తులసీ ధాత్రి సహిత విష్ణువు
కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును భక్తితో పూజిస్తారు. ద్వాదశి రోజున తులసి చెట్టు, ఉసిరిక (ధాత్రి)లోనూ విష్ణువు ఉంటాడు. అందుకే తులసీ ధాత్రి సహిత లక్ష్మీనారాయణుడిని ఈ రోజు పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. తులసి కోట దగ్గర ఆవు నేతిలో దీపాలు వెలిగిస్తారు. ద్వాదశి నాడు ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం. పూజానంతరం దక్షిణ తాంబూలాలు పంచితే విశేష ఫలం లభిస్తుంది. ఆ పరమాత్మకు పండ్లు, కొబ్బరికాయ నైవేద్యం పెడతారు. ఉసిరితో తినే పదార్థాలను తయారు చేస్తారు.

Review మాసం.. విశేషం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top