కార్మిక జీవనం మనది

ఈ లోకంలో ఉన్నంతకాలం పని చేస్తూనే ఉండాలి!. లేదంటే మనుగడ లేదు. మనిషిగా పుట్టింది..తనకు విధించిన కర్మలను, బాధ్యతలను నిరంతరం నిర్వర్తించడానికే. అంతేతప్ప.. మానవజన్మ ఎత్తింది, హాయిగా ప్రకృతి ఒడిలో సేదదీరుతూ అందాలను ఆస్వాదించడానికి కాదు. పని చేస్తూ విశ్రాంతి పొందాలి తప్ప.. విశ్రాంతి పొందడానికి, ఉన్నవి అనుభవించడానికి కాదు. అందుకే మానవజన్మను ‘కార్మిక జీవనం’గా అభివర్ణిం చారు. అంటే, కర్మలను ఆచరిస్తూ, కర్మలను చేస్తూ గడపాల్సిన జన్మ ఇది. కర్మలను ఆచ రించడమే ‘కార్మిక’ం. అదే కార్మిక జీవనం.

ఈశావాస్యోపనిషత్తులో గల పద్దెమినిమిది శ్లోకా లలో ఒక అత్యద్భుతమైన శ్లోకం ఉంది. అదొక్కటి చాలు నిష్ట గల సాధనాపరులకు.. దానర్థం ఇదీ..
‘‘ఈ లోకంలో కర్తవ్యాలు నిర్వహిస్తూ మాత్రమే నూరేళ్లు జీవించాలని ఆశించు. నీవంటి వారికి ఇది తప్ప వేరే దారిలేదు. అప్పుడే కర్మలు నిన్ను అంటవు’’.
ఈ లోకంలో జీవించాలంటే పని చేసి తీరాలి. ఆ పని ఫలితం మంచి కావచ్చు, చెడు కావచ్చు. అనుకూలమైనది కావచ్చు, ప్రతికూలమైనది కావచ్చు. ఫలితం ఏదైనా దానికి మనం దాసులం. అంటే ఫలితం కచ్చితంగా ఉంటుంది. మనం అనుభవించే సంపద, ఐశ్వర్యం, ఆయుష్షు అన్నీ భగవంతునివే. మనకు కర్మ ఫలం అంటకుండా ఉండాలంటే, మనకున్న సంపదంతా నాది కాదు అంతా భగ వంతునిదే అనే భావనతో పనిచేయాలి. అప్పుడే మనకు ఏ కర్మల ఫలం అంటదు. భగవంతుని ఆస్తులకు బాధ్యత వహిస్తూ మనం బతకాలి. ఆ విధంగా మన కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తే తద్వారా కలిగే ఫలితం మనలకు తాకదు. ఇలా పనిచేస్తూనే మనం నిండు నూరేళ్లు జీవించాలి.

కర్మ, కర్తవ్యాలంటే..

అసలు కర్మ అంటే ఏమిటి? కర్తవ్యం అంటే ఏమిటి?. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కాస్త వివరంగా విషయాన్ని విశ్లేషించుకోవాలి.
జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపో తున్నంత సేపు మనిషి దేని గురించీ, మరీ ముఖ్యంగా దేవుడి గురించి అసలు ఆలోచించడు. అనుకోకుండా కష్టాల పాలైనప్పుడు అకస్మాత్తుగా దేవుడు గుర్తుకువస్తాడు. ‘‘నా కర్మ కాలి ఇలా అయింది’’ అని వాపోతుంటా డు. అసలు కర్మ అంటే ఏమిటి? ఈ కర్మ సిద్ధాంతం ఎలా పుట్టింది?. కర్మ రహస్యం ఏమిటి?. మన పురాణేతి హాసాల్లో కర్మసిద్ధాంతం, దాని ఫలం గురించి విపులంగా వివ రించారు. మనిషి తన సుఖభోగాల కోసం ఎన్నో కర్మలు చేసి ఆశించిన ఫలితం అందక బాధతో దు:ఖాన్ని అనుభవిస్తాడట. కర్మ అనేది బంధాలకి మూలం. బంధాలు కలిగి ఉంటే తప్పనిసరిగా దు:ఖం కలిగి తీరుతుంది. అందు కోసం మనిషి తాను చేసిన పాపాలకి బదులుగా కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్లీ మళ్లీ జన్మనెత్తుతూనే ఉంటాడు.
పాప, పుణ్యాల ఫలమే కర్మ

భగవద్గీతలో కర్మఫలం గురించి ఇలా చెప్పారు..

కర్మ చేయటమే నీ వంతు. కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు. ఫలితం ఆశించి పని చేయడం మహా పాపం. అలా అని అసలు పని చేయకుండా ఉండటం మహా పాతకం.
కర్మ అనే దానిని ఎవరో సృష్టించి మనకు అంటగట్టింది కాదు. కాకుంటే ఇది ఎక్కడి నుంచో పుట్టికొచ్చింది కూడా కాదు. మనం చేసుకున్న పాపపుణ్యాల ఫలితమే కర్మ. మన ప్రవర్తన, మన ఆలోచన, మన వాక్కు మొదలైన వాటి వల్ల సృష్టించుకున్నదే కర్మ. ధర్మాధర్మాల విచక్షణ లేకుండా మనిషి విచక్షణారహితంగా ప్రవ ర్తించడం, పాప పుణ్యాలను లెక్కచేయక దాన ధర్మాలు, దయాదాక్షిణ్యాలు లేక అమాయకుల ను హింసించి, సజ్జనులను, పెద్దలను, గురు వులను దూషించి, తల్లిదండ్రుల ను ఆదరించక ఇతర దుష్కర్మలకు పాల్పడడం వంటి చర్యలు మనిషిని కష్టాల్లోకి దించుతాయి. అందుకే మనిషి తాను చేసుకొన్న కర్మఫలాన్ని అనుభవిం చడానికి మళ్లీ మళ్లీ జన్మనెత్తుతూ ఉంటాడు. ఈ జన్మలో అయిపోగా మిగిలిన కర్మ ఫలం తన రుణాన్ని మరో జన్మలో తీర్చుకుంటుంది. అందుకు అనుగుణంగా ఈ భౌతికదేహం తనకు అనుకూల మైన మరో దేహాన్ని ఆశ్రయించి తన కర్మఫలాన్ని అనుభవిస్తుంది. మనిషి జన్మనెత్తిన తరువాత తనకు వచ్చే గొప్పతనం, పేరు ప్రఖ్యాతులు, దరిద్రం, కష్టాలు వంటివన్నీ కూడా పూర్వజన్మలో చేసుకొన్న కర్మఫలాన్ని అనుసరించే వస్తుంటాయి.

కర్మఫలానికి ఎవరూ అతీతులు కారు..

సత్కర్మ (మంచి పనులు) చేసిన వారికి మంచి ఆలోచనలు, సద్బుద్ధి, ఇతరుల పట్ల ప్రేమ, సేవాభావం, దయా దాక్షిణ్యాలు కలిగి ఉండి దాన ధర్మాలు చేసే వారై ఉంటారు. దుష్కర్మ చేసిన వారైతే వారిలో కోపం, చెడు బుద్ధులు, చోర ప్రవృత్తి, హింసా స్వభావం, వ్యభిచారం, సోమరి తనం, ఇతరుల ప్రతిభను దొంగి లించడం వంటి దుర్ల క్షణాలు కలిగి ఉంటారు. ఈ కర్మఫలం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు. నలుడు, హరిశ్చంద్రుడు, పాండవులు మొదలైన వారంతా దీని బారిన పడినవారే. షిర్డీ సాయినాథుడు కూడా కర్మఫలాన్ని అనుసరించే ఈ నేలపై నడయాడారు. చివరకు మనుష్య జన్మనెత్తిన రాముడు, శ్రీకృష్ణుడు కూడా కర్మఫలాన్ని అనుభవించక తప్పలేదు.

మన నిద్ర, చంచలగుణం, సోమరితనం, బద్ధకం వంటి దుర్గుణాలను వదిలిపెట్టనంత వరకు భగవంతుని అనుగ్రహం దక్కదు. భక్తి, ఆధ్యాత్మికత అంటే పూజాది కాలే కాదు. మనం చేయాల్సిన పని చిత్తశుద్ధితో చేయడం కూడా భగవంతుని సేవ కిందకే వస్తుంది. భక్తి పేరుతో పొద్దుపుచ్చడాన్ని బాబా సహించేవారు కాదు. మనిషై పుట్టిన ప్రతి ఒక్కరు నిరంతరం కర్తవ్యో న్ముఖులై ఉండాలని బోధించే వారు. బాబా తన భక్తుల్లోని సోమరితనాన్ని అసలు సహించే వారు కాదు. బద్ధకం, సోమరితనం మనిషిని నిర్వీర్యం చేస్తాయని, వాటిని వదులుకోనిదే మన కర్తవ్యాలు మనకు బోధపడవని పదేపదే చెబుతుండేవారు. అవి నిజంగా మనకి వ్యక్తిత్వ వికాస పాఠాలు.

ఆచితూచి కర్మలను ఆచరిస్తేనే పుణ్యఫలం..

మంచి పనులు చేసి సంపాదించుకున్న పుణ్య ఫలం ఒక్కోసారి మనం చేసే చెడు పనుల (దుష్కర్మ)ల వల్ల శక్తినంతా కోల్పోయి నిర్వీర్యమై మనిషిని కష్టాలపాల్జే స్తుంది. మనిషి స్వర్గ సుఖాలను, సిరి సంపదలను, భోగభాగ్యాలను అనుభవిస్తూ ఆదమరిచి పుణ్యకార్యాలను చేయడం మానుకొంటే, తాను నిలవ ఉంచుకున్న ఫుణ్య ఫలం కాస్తా హరించుకునిపోయి తిరిగి మనిషి కష్టాల పాలవుతాడు. దీనికై మనిషి పాపపు పనులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించి, ఈ పని ఎందుకు చేస్తున్నాను? దీని ఫలితం ఎలా ఉంటుంది? అది మనల్ని ఎలా వెంబడిస్తుంది? అనే విజ్ఞతను ప్రదర్శిస్తే సచ్ఛీలుడై వెలుగొందుతా డని మన పురాణేతిహాసాలు చెబుతున్నాయి.

మన శక్తి మనకు తెలియనంతవరకు మనం నిరుత్తరులుగానే మిగిలిపోతాం. మనలో చాలా వరకు శక్తి సామర్థ్యాలు నిద్రాణంగానే ఉండి పోతాయి. సద్గురువులు, యోగులు, మహ నీయులు అవతరించేది ఈ శక్తుల్ని మనలో మేల్కొల్పడానికే. అందుకే సద్గురువు బోధనల్ని వినాలి. వాటిని చదవాలి. చదివిన వాటిని ఆచరించడానికి ప్రయత్నించాలి. సద్గ్రంథ పఠనం వల్ల మంచి చెడుల పట్ల విచక్షణ కలగడంతోపాటు, ద్వందా తీతంగా ఉండగలుగుతాం.
ఏదీ తనకు తానుగా మన వద్దకు రాదు. మనం కనీసం ప్రయత్నం చేయకుండా గడ్డిపోచ కూడా మన వద్దకు ఎగురుకుంటూ రాదు. ఏదైనా శ్రమిస్తేనే లభిస్తుంది. నిజానికి గడ్డిపోచ ఎంతో అల్పమైనది. కానీ అది భూమిని చీల్చుకుని పుడుతుంది. ఆ సమయంలో అదెంత ఘర్షణ పడుతుందో ఆలోచించండి.

Review కార్మిక జీవనం మనది.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top