ప్రాణం తీసిన దురాశ

సంస్క•త భాషలో అద్భుతమైన నీతి కథలను నీతి చంద్రిక, పంచతంత్రము, హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో పండిన మహానుభావులు రచించారు. ‘హితోపదేశం – మిత్రలాభం’లో నారాయణ కవి చెప్పిన గొప్ప నీతి ఉన్న చిన్న కథ ఒకటి ఉంది. దాని గురించి తెలుసుకుందాం.

వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవాడు. రోజూ అడవికి వెళ్లి, రకరకాల ఆహార పదార్థాలను సేకరించి, వాటితో తన కుటుంబాన్ని పోషించుకునే వాడు. అడవిలో దొరకనిది ఏముంది? ఆకులు, దుంపలు, కాయలు, పండ్లు, తేనె, వెదురు బియ్యం.. ఇలా ఎన్నో లభిస్తాయి. కానీ, ఈ శాఖాహారం కంటే కుందేలు, జింక, అడవిపంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్లు ఇష్టపడతారు.

భైరవుడు ఒకనాడు ఒక బలసిన జింకను వేటాడి చంపాడు. ఇంటిల్లిపాదీ ఆనందంగా విందు చేసుకోవచ్చుననుకుంటూ, దానిని భుజంపైన వేసుకుని తన ఇంటి దారి పట్టాడు. అయితే, ఆ అడవి మార్గంలో అనుకోకుండా బాగా మదించి, కోరలు ఉన్న అడవి పంది కనిపించింది.

భైరవుడు తన భుజం మీద ఉన్న జింక శవాన్ని నేలపైకి దించి, తన విల్లమ్ములు తీసుకున్నాడు. పదునైన బాణంతో ఆ అడవిపంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం, మొండితనం ఎక్కువ. వేటగాడి బాణం వెనుదిరిగి వచ్చిందా అన్నట్టు, అది అతి వేగంగా వచ్చి భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తరువాత అదీ చనిపోయింది. వీరి తొక్కిసలాటలో అటుగా వచ్చిన పాము కూడా ప్రాణాలు విడిచింది.

ఇంతలో క్షుద్రబుద్ధి అనే పక్క ఆహారం వెతుక్కుంటూ అటు వైపు వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడు, జింక, పంది, పాము.. ఇవన్నీ దానిని కనులవిందుగా కనిపించాయి. నక్కలు స్వయంగా వేటాడలేదు. పులి, సింహం వంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తిపడతాయి. అందుకే ఒకేసారి నాలుగు శవాలు కనిపించే సరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది.

నక్క ఇలా ఆలోచించింది- ‘ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినొచ్చు. జింక, పంది శవాలను రెండు నెలల పాటు భోం చేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒకరోజంతా కడుపు నింపుకోవచ్చు. అంటే మూడు నెలల ఒక్క రోజు పాటు ఆహారం గురించి వెతికే పని లేదన్న మాట. మరి ఈ పూట మాటేమిటి? ఆ! ఈ వేటగాడి ధనుస్సుకు కట్టి ఉన్న, కమ్మని వాసన వేస్తున్న, నరాలతో చేసిన అల్లెత్రాటిని తింటే సరిపోతుంది’.

క్షుద్రబుద్ధి ఆ కళేబరాలను సమీపించి, లాగి బిగించి ఉన్న అల్లెత్రాడును కొరికింది. అంతే! పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుని ఒంటిని చీల్చేసింది. తన దురాశకు చింతిస్తూనే క్షుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది. ఇప్పుడక్కడ ఐదు శవాలు పడి ఉన్నాయి. భైరవుడు దొరికిన జింకతో తృప్తి పడక మరో మృగాన్ని వేటాడబోయి చచ్చాడు.

క్షుద్రబుద్ధి ఎటువంటి కష్టం లేకుండా మూడు నెలలకు సరిపడే తిండిని దొరికించుకుని కూడా తన పిసినారి తనంతో వింటినారిని కూడా తినాలనే అత్యాశతో తానూ శవమైంది.

నీతి: అత్యాశ మంచిది కాదు. మానవుడు ఆశాజీవి. కానీ దురాశకు పోతే దుఖమే మిగులుతుంది.

Review ప్రాణం తీసిన దురాశ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top