కార్తీక పౌర్ణమిలో.. గిరి ప్రదక్షిణ

కార్తిక పౌర్ణమి వేళలో గిరిప్రదక్షిణ ఆధ్యాత్మిక దివ్యానుభూతి! పున్నమి వెన్నెలలో అరుణాచలం హిమగిరిని తలపిస్తుంది. ఆ కొండ సాక్షాత్తూ, పరమ శివుడి ప్రతిరూపమని భక్తుల విశ్వాసం. శ్రీగిరి ప్రద క్షిణలో అడుగడుగునా దర్శనీయ స్థలాలే.
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలే శ్వర ఆలయం పంచభూతలింగాల్లో ఒకటి. కొండల మీద అనేక ఆలయాలు ఉండవచ్చు. ఏకంగా కొండే శివస్వరూపమైన క్షేత్రం మాత్రం ఇదొక్కటే. ఇక్కడ… ఆలయ ప్రదక్షిణ ఎంత పుణ్యప్రదమో, గిరి ప్రదక్షిణ అంతకు వేయిరెట్లు ప్రశస్తమైంది. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగం శ్రీకాళ హస్తిలో ఉండగా…. అగ్ని లింగం తిరువణ్ణా మలైలో ఉంది. తమిళంలో తిరు అంటే ‘శ్రీ’ అణ్ణామలై అన్న మాటకు అర్థం ‘పెద్దకొండ’. దీన్నే ‘అరుణాచలం’ అనీ, ‘అరుణగిరి’ అనీ అంటారు. అరుణ – రుణ బంధాల్ని హరించేదని అర్థం. రుణాల్ని తెంచుకోవడమే ముక్తి మార్గం. ‘సూర్యుని నుంచి కాంతిని అందుకునే చంద్రునిలా, ఇతర క్షేత్రాలు అరుణాచలం నుంచి పావనత్వాన్ని సంత రించుకుంటాయి’ అంటాయి. పురాణాలు. ‘అరుణాచలం ఓంకారమే. ఏటా కార్తిక మాసంలో ఈ కొండ మీద జ్యోతి రూపంలో దర్శనమిస్తాను’ అని సాక్షాత్తూ పరమశివుడే ప్రకటించాడంటారు. ‘చివరికి అంతా, అన్నీ అరుణాచలం చేరు కోవాల్సిందే’ అని నర్మగర్భంగా క్షేత్ర వైభవాన్ని చెప్పాడు రమణ మహర్షి.
కృతయుగం నాటిది….
అరుణాచలం కొండకు యుగయుగాల ప్రశస్తి ఉంది. కృతయుగంలో ఇది అగ్ని పర్వతమనీ, త్రేతాయుగం నాటికి స్వర్ణగిరిగా మారిందనీ, ద్వాపరయుగంలో తామ్రశైలమై ఓ వెలుగు వెలిగి, కలియుగం ప్రారంభంలో రాతికొండగా స్థిరపడిం దనీ పురాణాలు చెబుతున్నాయి. అరుణాచలం కొండ…. 260 కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్‍బాల్‍ సహాని నిర్థ్థా రించాడు. స్కంధ పురాణంలోని ‘అరుణాచలం మహాత్మ్యం’ క్షేత్ర ప్రశస్తిని వివరిస్తుంది. మహేశ్వర పురాణంలో సాక్షాత్తూ వేదవ్యాసుడే అరుణాచల వైభవాన్ని కొనియాడాడు. ఓ సందర్భంలో… బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పని కలహించు కుంటే – పరమశివుడు శివతత్వాన్ని చాటడానికి ఆదీ అంతమూ లేని తేజో లింగంగా వెలిశాడట! ఆ పురాణగాథ ఇక్కడే జరిగిందని ప్రతీతి.
అగ్ని లింగం….
తూర్పున అరుణాచలేశ్వర ఆలయం నిర్మిత మైంది. దీన్ని విశ్వకర్మ నిర్మించాడని చెబుతారు. ఇక్కడ శివుడు అగ్నిలింగ రూపంలో దర్శన మిస్తాడు. ఇది స్వయంభూ లింగమని భక్తుల విశ్వాసం. ఆలయానికి వెయ్యేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. తొమ్మిది, పది శతాబ్దాల్లో చోళ రాజులు నిర్మించినట్టు శాసనాలు స్పష్టం చేస్తున్నాయి. భార తీయ ఆలయ నిర్మాణ కౌశల్యానికి ఇదో ప్రతీక. రాజసంలో తొమ్మిది గోపురాలూ ఒకదానితో ఒకటి పోటీపడుతుటాయి. అందులో నాలుగు గోపు రాలూ…. ఆలయాల ప్రాకారాల నుంచీ బలిష్ట మైన గోడలతో చొచ్చుకు వచ్చి భీకరంగా కని పిస్తుంటాయి. తూర్పు రాజగోపురం 11 అంతస్తు లతో…. 217 అడుగుల ఎత్తుతో సాక్షాత్తూ పరమ శివుడే కళ్ళ ఎదుట నిలిచిన భావన కలిగిస్తుంది. ఆంధ్రభోజుడు కృష్ణదేవరాయలు ఈ ఆలయ ఆవరణలో కోనేరును నిర్మించాడు. మరికొన్ని కట్ట డాలకూ ప్రాణంపోశాడు.
కార్తిక దీపోత్సవం….
అరుణాచలేశ్వర ఆలయంలో ఏడాదికి నాలుగుసార్లు బ్రహ్మత్సవాలు జరుగుతాయి. తమిళ నెల కార్తికంలో (నవంబరు, డిసెంబరు మధ్య) జరిగే బ్రహ•త్సవాలు సుప్రసిద్ధం. పది రోజుల ఉత్సవాలు కార్తిక దీపంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అణ్ణామలై కొండ మీద మూడు టన్నుల నేతితో భారీ దీపాన్ని వెలిగిస్తారు. కొన్ని మైళ్ల దూరం దాకా జ్యోతి కనిపిస్తుంది. ఒక్కోసారి పదిరోజుల వరకూ అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. కార్తిక జ్యోతి దర్శనం ముక్తిప్రదమని విశ్వాసం. గిరి ప్రదక్షిణను, తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరిస్తారు. అరుణాచలం స్వయంగా శివుని ప్రతి రూపం కావడంతో… ఆలయం కంటే కొండకే భక్తులు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కొండ చుట్టూ తిరిగితే స్వయంగా శివుడికి ప్రదక్షిణ చేసినట్టేనని నమ్ము తారు. అందులోనూ పౌర్ణమి చాలా విశిష్టం. ప్రతి పౌర్ణమి రాత్రీ వేలాది భక్తులు అరుణాచలం చుట్టూ ప్రదక్షిణ చేసి శివుడిని ఆరాధిస్తారు. ఇక, కార్తిక పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ మహా పుణ్యప్రదమని అంటారు. మొత్తం పద్నాలుగు కిలో మీటర్ల ప్రదక్షిణ మార్గంలో అనేక ఆలయాలూ ఆశ్రమాలూ దివ్యపురుషుల బృందావనాలూ దర్శనమిస్తాయి. అద్వైత గురువు రమణ మహర్షి తిరువణ్ణామలై స్వామి సన్నిధిలో 53 ఏళ్లు నివసించి 1950లో తనువు చాలించారు. రమణ మహర్షి ఆశ్రమం కూడా గిరి ప్రదక్షిణ మార్గంలోనే ఉంది. ఆశ్ర మానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వినాయ కుడి గుడి నుంచి చూస్తే… అరుణాచలం నంది ఆకారంలో కనిపిస్తుంది. ప్రదక్షిణ మార్గంలో…. యమలింగం, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం మొదలైన అష్టలింగాలు దర్శన మిస్తాయి. అగస్త్య తీర్థాలూ ఉన్నాయి. చెన్నై, తిరుపతి నగరాల నుంచి తిరువణ్ణామలైకి నేరుగా బస్సులు ఉన్నాయి. ఈ క్షేత్రం చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Review కార్తీక పౌర్ణమిలో.. గిరి ప్రదక్షిణ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top