రాముడు చెక్కిన ఆంజనేయుడు

శ్రీరాముడు అత్యంత ప్రేమతో చెక్కిన అంజన్న రూపాన్ని దర్శించుకోవాలంటే కడపలోని గండి ఆలయానికి వెళ్లాల్సిందే.
శేషాచల కొండల్లో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న పాపఘ్ని నదీ తీరాన ఉందీ వాయు క్షేత్రం. ఇక్కడ భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్న హనుమంతుడికి శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్‍ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్‍ ।।

అంటే.. శ్రీరామ సంకీర్తన ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్న వదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడు. అంతటి స్వామి భక్తి పరాయణుడైన అంజనీసుతుడు కాలిడిన చోట మహాలక్ష్మి స్థిరనివాసమై ఉంటుంది. ఈ కారణంగానే హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావించి శ్రావణ మాసం నెల రోజులూ విశేషంగా అర్చిస్తారు. వీటిలో శనివారాలు స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనవని భక్తుల విశ్వాసం. అందుకే ఆంధప్రదేశ్‍ రాష్ట్రం కడప జిల్లాలోని గండి క్షేత్రంలో శ్రావణమాసంలో వచ్చే నాలుగు శనివారాలు ప్రత్యేక జాతర నిర్వహిస్తారు.

త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా గండి ఆలయానికి చేరుకుంటారు. అప్పటికే వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామలక్ష్మణులిద్దరినీ సాదరంగా ఆహ్వానించి, ఇక్కడే కొంత కాలం ఉండి తన ఆతిథ్యాన్ని స్వీకరించాలని వేడుకుంటాడు.

‘రావణ వధ అనంతరం నీ కోరిక తీరుస్తాను’ అని రాముడు వాయు దేవుడికి వాగ్దానం చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణ సంహారం అనంతరం పుష్పక విమానంలో సీతారామలక్ష్మణులు వాయుదేవుడి వద్దకు బయల్దేరతారు. ఈ వార్త తెలుసుకున్న వాయుదేవుడు తన క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తాడు. పాపఘ్ని వేరు చేసే రెండు కొండల కొనలనూ కలుపుతూ బంగారు స్వాగత తోరణాన్ని కట్టిస్తాడు. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి సీతారాములు మంత్రముగ్ధులు అయిపోతారు. ఆ సమయంలోనే రామచంద్ర ప్రభువు అక్కడి బండ మీద కూర్చుని యుద్ధ సమయంలో ఆంజనేయుడు తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటాడు. అలా గుర్తు చేసుకుంటూ తన వద్ద ఉన్న బాణంతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే శుభ గడియలు దాటిపోతుండటంతో దాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు రాముడు బయల్దేరతాడు. దీనికి ప్రతీకగానే ఇప్పటికీ గండి క్షేత్రంలోని హనుమ చిత్రానికి ఎడమ కాలికి చిటి కెన వేలు ఉండదు. ఆ తర్వాత కాలంలో ఎంతోమంది శిల్పులు దీన్ని పూర్తి చేయాలని చూసినా వీలు కాలేదట.

శ్రీరాముడు తిరిగి గండి క్షేత్రానికి చేరుకున్నదీ, హనుమంతుని చిత్రాన్ని పూర్తి చేసిందీ శ్రావణ మాసంలోనేనని ప్రతీతి. అందుకే ఇక్కడ శ్రావణ మాసమంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణంలో వచ్చే నాలుగు శనివారాలు అంజన్నను నాలుగు రకాలుగా అలంకరిస్తారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే వివిధ సేవలు రాత్రి తొమ్మిదింటి వరకూ కొనసాగుతాయి.

వైఎస్సార్‍ కడప జిల్లా చక్రాయపేట మండలంలో గండి క్షేత్రం ఉంది. జిల్లా కేంద్రం కడప నుంచి పులివెందులకు వెళ్లే బస్సులో వెంపల్లె చేరుకోవచ్చు. అక్కడి నుంచి గండి క్షేత్రానికి ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుంచి వచ్చేవారు రాయచోటి మీదుగా ప్రయాణించి వీరాంజనేయుడిని దర్శించుకోవచ్చు.

Review రాముడు చెక్కిన ఆంజనేయుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top