మనసునుంచి పుట్టిన సరోవరం

మహిషాసుర మర్దిని

మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద వారికి కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు (వెలుగు.. ఒక శక్తి) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడు కోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా, అదే ఆదిశక్తిగా, అమ్మగా అవతరించింది. దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలను అమ్మకు ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, విశ్వకర్మ ఒక పదునైన గొడ్డలి (పరశువు)ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. పరాశక్తి ఆ సింహాన్ని వాహనంగా చేసుకుని పైన చెప్పిన ఆయుధాలను తీసుకుని వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు. మహిషాసురుడు అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి అమ్మను ముట్టడించబోయాడు. చివరకు తన సహజరూపమైన దున్నపోతు (మహిషం) రూపంలో, తన వాడి కొమ్ములతో అమ్మ మీద దండెత్తాడు. తన త్రిశూలంతో అమ్మవారు ఆ మహిషాసురుడి గుండెలను చీల్చిపారేసింది. మహిషాసురుడు ఆరుగురు రాక్షసులకు ప్రతిరూపమైనవాడు. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, మహిషాసుర.. ఈ ఆరు రూపాలు రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధి దేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసులనూ సహరించింది. అలా సంహరించిన రోజే దసరా అయ్యింది.

మానస సరోవరం

ఇది పవిత్ర తటాకం. ఇది హిమాలయ పర్వత శిఖరాల మధ్య టిబెట్టులో ఉంది. హిందువులకు ఇది అత్యంత తీర్థాస్థలి. ఇక్కడ సాక్షాత్తూ శివుడు కొలువు ఉంటాడని, ఆయన కైలాస పర్వతశ్రేణిలోనే ఈ పవిత్ర కొలను ఉందని నమ్మిక. ఇక్కడ ముక్కోటి దేవతలు నివసిస్తారని అంటారు. ఈ సరోవరానికి ఉత్తర దిక్కున కైలాస పర్వతం ఉంటుంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన జలం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచనల (మనసు) నుంచి ఈ సరస్సు ఆవిర్భవించిందని, అందుకే దీనిని మానస సరోవరం అంటారని చెబుతారు. జ్ఞానానికి, అందానికి ప్రతిరూపమైన హంసలు ఇక్కడ స్వేచ్ఛా విహంగాలై విహరిస్తాయి. భారతీయతకు మూలమైన వేదాలకు అధిదేవత అయిన వేద దేవత ఇక్కడే విహరిస్తుందని అంటారు. కైలాస మానస సరోవర యాత్ర అనేది ప్రతి హిందువు కలగనే ఆధ్యాత్మిక యాత్ర. బ్రహ్మపుత్ర, గంగ, సట్లజ్‍ నదులు మానస సరోవరం నుంచే పుట్టాయని కూడా అంటారు. శాస్త్రీయంగా కూడా ఇది శక్తి ప్రాంతం. ఇక్కడ అడుగు పెట్టగానే అద్భుతమైన శక్తి సొంతమైన భావన కలుగుతుంది.

Review మనసునుంచి పుట్టిన సరోవరం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top