కోటలో శివుడు భక్త సులభుడు

భక్త సులభుడూ, భోళా శంకరుడూ అయిన పరమశివుడు ఎన్నో రూపాల్లో పూజలందుకుంటున్నాడు. వాటిలో ప్రముఖమైనదీ, అతి ప్రాచీనమైనదీ శిలా వరంగల్‍లోని కోటలో వెలసిన స్వయంభూ శంభులింగేశ్వర స్వామి క్షేత్రం. కాకతీయుల ఆరాధ్య దైవంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న స్వామి దర్శనం సర్వ శుభప్రదం.
చెంబెడు నీళ్లు అభిషేకిస్తే చాలు మహధానంద పడిపోయే ఆ జంగమయ్య ఆర్తితో తలచినంతనే నేనున్నానంటూ అభయం ఇస్తాడు. ఆ దేవదేవుడి నిలయంగా పురాతన క్షేత్రాల్లో ఒక్కటిగా గుర్తింపు పొందిన ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ఇతర ఆలయాలకు భిన్నంగా దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే సందీశ్వరుడి చెవిలో కోరికను చెబితే అది పరమేశ్వరుడికి చేరుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు శంభులింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం నందీశ్వరుడి చెవిలో తమ కోర్కెలు చెబుతారు. అవి నెరవేరిన తరువాత మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.

విశిష్ట చరిత్రకు నెలవు
హన్మకొండ రాజధానిగా పరిపాలన సాగించిన కాకతీయ రాజులు అప్పట్లో అరణ్యంగా ఉన్న ఖిల్లా వరంగల్‍ ప్రాంతానికి వేటకు వచ్చారు. మార్గ మధ్యంలో వారి రథం భూమిలో దిగబడి పోయింది. రథ చక్రాన్ని బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా రాలేదు. అలసిన రాజులు అక్కడే సేదదీరారు. ఆ రాత్రి స్వప్నంలో రాజులకు పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. రథ చక్రం కూరుకుపోయిన ప్రాంతంలో తన ఆలయం ఉందని చెప్పి అదృశ్యం అయ్యాడు. ఆ వెంటనే మేల్కొన్న వారికి భూమిలో కూరుకుపోయిన ఇనుప రథ చక్రం కాస్తా బంగారంగా మారి కనిపించింది. వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టగా పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఎవరూ ప్రతిష్ఠించకుండానే వెలసిన దేవాలయంగా స్వయంభూ శంభులింగేశ్వరస్వామి క్షేత్రం ఏర్పడినట్టు స్థల పురాణం తెలియ చెబుతోంది. అప్పటి నుంచీ కాకతీయులు శివుడిని తమ ఆరాధ్య దైవంగా భావించి పూజించారు. ఈ దేవస్థానాన్ని క్రీస్తు శకం 1162వ సంవత్సరంలో గణపతిదేవ చక్రవర్తి అభివృద్ధి చేశాడు. భూ భాగం పుష్పాకారా నీన, పై కప్పు నక్షత్ర ఆకారాన్నీ పోలినట్టుగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం కాలంలో త్రిభుజాకారంలో నలభై అడుగుల ఎత్తున ఉన్న గోపురాన్ని హైందవ సంప్రదాయం ప్రకారం తేలికపాటి ఇటుకలను ఉపయోగించి నిర్మించారు. దేవాలయ ప్రాంగణంలోనే అంత రాలయం, నాట్య మండపం ఏర్పాటు చేశారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు..
ఈ ఆలయంలోని శివలింగం భూమికి అతి తక్కువ ఎత్తులో ఉంటుంది. ప్రత్యేక అభి షేకాలు చేసిన అనంతరం భక్తులే స్వయంగా శివలింగానికి పూజలు చేయడం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటి.
సాధారణంగా కాకతీయులు నిర్మించిన వివిధ దేవాలయాల్లో ఉత్తర ముఖంగా నందీశ్వరుడు ఉంటాడు. కానీ, ఈ క్షేత్రంలో మాత్రం నందీశ్వరుడు దక్షిణ ముఖంగా దర్శన మిస్తాడు.
దక్షిణ ద్వారం వద్ద వీరభద్రస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
ఏటా శివరాత్రి మహోత్సవం సందర్భంగా ఇక్కడ విశేష పూజలూ, శివపార్వతుల కల్యా ణాలూ, మహా రుద్రాభిషేకాలూ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు.
ప్రతి సోమవారం రుద్రాభిషేకాలూ, అర్చనలూ, ప్రత్యేక హారతులతో పూజలు జరుగుతాయి.
శ్రీరామ నవమి రోజున సీతారాముల కల్యా ణాన్ని ఇక్కడ అత్యంత వైభవంగా నిర్వ హిస్తారు.
ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్స వాలనూ నిర్వహిస్తారు.

ఎలా చేరుకోవాలి?
ఈ క్షేత్రానికి చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రైలులో వస్తే వరంగల్‍ రైల్వే స్టేషన్‍ సమీప కేంద్రం. అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఖిలా వరంగల్‍ కోటకు చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచి వరంగల్‍కు బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా వచ్చేవారు చింతల్‍ బ్రిడ్జి వద్ద దిగి కోటకు చేరుకోవచ్చు. ఖమ్మం నుంచి నర్సంపేట మార్గంలో ప్రయాణించే వారు పెట్రోలు పంపు కూడలిలో దిగి శంభులింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకోవచ్చు

Review కోటలో శివుడు భక్త సులభుడు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top