
ఈసారి అమెరికా ఎన్నికల్లో ఇండో- అమెరికన్ భారతీయులు విశేషంగా పోటీపడ్డారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఎనిమిది మంది, సెనేట్కు ఇద్దరు ఇండో- అమెరికన్లు పోటీపడ్డారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 40 లక్షల మంది వరకు భారతీయులు ఉన్నారు. వీరిలో ఓటుహక్కు కలిగిన వారు 25 లక్షల మంది వరకు ఉన్నారు. వీరిలో 13 లక్షల మంది కేవలం టెక్సాస్, మిచిగన్, ఫ్లోరిడా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం.
- 2020 అమెరికా ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయుల్లో డాక్టర్ అమీ బెరా, ప్రమీలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఉన్నారు. ఈ నలుగురూ డెమొక్రటిక్ పార్టీ సభ్యులే కావడం విశేషం. కాగా, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. భారతీయ మూలాలున్న వారే కావడం గమనార్హం.
- తాజాగా ఎన్నికైన సభ్యుల్లో రాజా కృష్ణమూర్తి.. వరుసగా మూడోసారి గెలుపొంది సత్తా చాటారు. ఇల్లినాయిస్ కౌంటీ నుంచి ఆయన ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్పై కృష్ణమూర్తి గెలుపొందారు.
- 44 ఏళ్ల రో ఖన్నా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన తోటి భారతీయ – అమెరికన్ రితేష్ టాండన్ను 50 శాతం కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. కాలిఫోర్నియాలోని 17వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి రో ఖన్నా కూడా వరుసగా మూడోసారి విజయం సాధించారు.
- ‘సమోసా కాకస్’ సీనియర్ మోస్ట్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా వరుసగా ఐదోసారి కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లాను సులభంగా గెలుచుకున్నారు. ఈయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బజ్ ప్యాటర్సన్పై 25 శాతానికిపైగా పాయింట్ల తేడాతో గెలుపొందారు.
- ప్రమీలా జయపాల్ కూడా మరోసారి వాషింగ్టన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఈమె 2016 అమెరికా ఎన్నికల్లో గెలుపొందిన ఏకైక భారతీయ – అమెరికన్ మహిళగా గుర్తింపు పొందారు. తాజా ఎన్నికల్లోనూ మరోసారి విజయబావుటా ఎగురవేశారు.
ఇక, రిపబ్లికన్ పార్టీకి చెందిన మంగ అనంతత్ములా వర్జీనియాలోని 11వ కాంగ్రెషనల్ జిల్లాలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జెర్రీ కొన్నోలి చేతిలో ఓడిపోయారు. అలాగే, రిపబ్లికన్ పార్టీకే చెందిన నిషా శర్మ కూడా తొలిసారిగా కాంగ్రెస్కు పోటీపడి ఓడిపోయారు
Review అమెరికాలో భారతీయం.