
1, మే, బుధవారం చైత్ర బహుళ ద్వాదశి నుంచి – మే 31, శుక్రవారం, వైశాఖ బహుళ ద్వాదశి వరకు
శ్రీ వికారి నామ సంవత్సరం-చైత్రం-వైశాఖం-వసంతరుతువు-ఉత్తరాయణం.
ఆంగ్లమానం ప్రకారం ఐదవ మాసం మే. ఇది తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర – వైశాఖ మాసాల కలయిక. చైత్ర మాసంలోని కొన్ని రోజులు, వైశాఖ మాసంలోని మరికొన్ని రోజులు ఈ నెలలో కలుస్తాయి. వైశాఖం తెలుగు మాసాలలో రెండవది. ఈ మాసంలో కార్మిక దినోత్సవం (మే డే), వరాహ జయంతి, రంజాన్ మాసారంభం, అక్షయ తృతీయ, బసవ జయంతి, అల్లూరి సీతారామరాజు వర్ధంతి, పరశు రామ ద్వాదశి, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం, బుద్ధ పూర్ణిమ, బుద్ధ జయంతి వంటి పండుగలు, పర్వదినాలు ముఖ్యమైనవి. ఇంకా డొల్లు కర్తరి, నిజ కర్తరి ప్రారంభం ఈ మాసంలోనే. మే మాసం.. చైత్ర బహుళ ద్వాదశి, మే 1, బుధవారం నుంచి ప్రారంభమై వైశాఖ బహుళ ఏకాదశి, మే 31, శుక్రవారంతో ముగుస్తుంది.
ఆధ్యాత్మిక సాధనకు అనువైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి. ఆధ్యాత్మికంగా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఈ మాసం అన్ని విధాలుగా అనుకూలమైనది అంటారు. అందుకే దీనిని సాధన మాసంగా కూడా పిలుస్తుంటారు. వైశాఖం, మాఘం, కార్తికం.. ఈ మూడు మాసాలలో ఆధ్యాత్మిక సాధన తగినంతగా చేయాలని మన పెద్దలు చెప్పారు. కార్తిక పురాణం, మాఘ పురాణాల మాదిరిగానే వైశాఖ పురాణం కూడా ఉనికిలో ఉంది. కానీ, దీని గురించి చాలా మందికి తెలియదు. దీనిని వ్యాసదేవుడు రచించాడు. వసంత రుతువులో వైశాఖం రెండో మాసం. వైదికంగా దీనిని ‘మాధవ మాసం’ అని కూడా అంటారు. మధు అని చైత్ర మాసానికి, మాధవ అని వైశాఖ మాసానికి పేర్లు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకు చాలా ప్రసిద్ధమైనది.
వైశాఖ మాసంలో ముఖ్యంగా ఆచరించాల్సిన వ్రతాలు రెండు అని అంటారు. వైశాఖంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా నిత్యం నారాయణుడిని తులసి దళాలతో ఆరాధించాలి. ఆ తులసి కూడా కృష్ణ తులసి అయి ఉండాలి. దీనిని విష్ణువుకు సమర్పించడం శ్రేష్ఠమని ధర్మశాస్త్రం చెబుతున్నది.
విష్ణు సహస్ర నామ పారాయణకు వైశాఖ మాసం చాలా ఉద్ధిష్టమైనది. వైశాఖ మాసం పొడవునా అశ్వత్థ వృక్షానికి నిండుగా నీళ్లు పోసి ప్రదక్షిణలు చేయాలి. మాసమంతా ఇలా చేస్తే అభీష్టసిద్ధి కలుగుతుందని అంటారు. పితృదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్ర వచనం.
అలాగే, శివారాధనకు కూడా వైశాఖ మాసం ప్రశస్తమైనది. ఈ నెలంతా శివుడికి అభిషేకం చేయాలి. ఈ మాసంలో చేసే శివారాధన, అభిషేకాలు ఆది ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాలను తొలగించి మనశ్శాంతిని కలిగిస్తాయి. శివాలయాలలో లింగానికి పైన ధారాపాత్ర ఏర్పాటు చేయాలి. దీని నుంచి ధారగా నీరు శివలింగంపై పడేలా చేయాలి. దీనివల్ల సృష్టిలో ఉన్న వేదనలు, తాపాలు, అరిష్టాలు నశిస్తాయని అంటారు.
వైశాఖం.. ఉదకుంభ మాసంగానూ ప్రసిద్ధి. అంటే నీటితో నింపిన పాత్రను దానం చేయడం. బాటసారులకు చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని దానం చేయడం వైశాఖంలో ముఖ్యమైనది. ఈ మాసం నాటికి ఎండలు మండిపోతాయి. సూర్యుడు పూర్తి స్థాయిలో ప్రతాపాన్ని చూపుతాడు. ఈ కాలంలో కలిగే వేసవి తాపం నుంచి పశుపక్ష్యాదులను, మనుషులను రక్షించేందుకు నీటిని దానం చేయాలనే నియమం ఏర్పడింది.
విష్ణువుకు ప్రీతికరమైన మాసం..
అన్ని మాసాలలో శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైనదిగా వైశాఖ మాసాన్ని పేర్కొంటారు. అందుకే ఈ మాసానికి ‘మాధవ మాసం’ అనే పేరు కూడా ఉంది. చాంద్ర మానం ప్రకారం చంద్రుడు విశాఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసమనే పేరు వచ్చింది. విష్ణు భక్తులకు మాధవ మాసం అనబడే వైశాఖ మాసం పరమ పవిత్రమైనది. ఈ మాసంలో మహాలక్ష్మీసమేత విష్ణువును తులసీ దళాలతో పూజిస్తే ముక్తి లభిస్తుందని పురాణ వచనం.
వైశాఖం.. అనేక పర్వాల ప్రత్యేకం
వైశాఖ శుద్ధ పాడ్యమితో వైశాఖ మాసం ఆరంభమవుతుంది. ఈనాటి నుంచే వైశాఖ స్నాన వ్రతం ఆరంభమవుతుంది. వైశాఖ శుద్ధ తదియ మూడు పర్వాలకు ప్రసిద్ధి. ఈనాడు అక్షయ తృతీయ, బలరామ జయంతితో పాటు పద్మకల్పం ప్రారంభం. త్రేతా యుగాదిగానూ పరిగణిస్తారు. వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి పర్వదినం. వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి దినం. వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమిగా ప్రసిద్ధి. వైశాఖ శుద్ధ అష్టమి నాడు దేవీపూజ నిర్వహించాలి. వైశాఖ శుద్ధ నవమి ద్వాపర యుగాంతం. అలాగే, వృషభ సంక్రమణ పుణ్యకాలం. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు మోహినీ ఏకాదశి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కల్యాణోత్సవం కూడా ఈనాడే. వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ జయంతి దినమైతే.. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ పూర్ణిమ మహా వైశాఖిగా ప్రసిద్ధి. ఈనాడే బుద్ధావతార ఆవిర్భావం జరిగిందని అంటారు. అలాగే, పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి తిథి కూడా ఈనాడే. వైశాఖ బహుళ పాడ్యమి భూత మంత్రోత్సవంగా జరుపుకుంటారు. వైశాఖ బహుళ విదియ తిథి నారద జయంతి దినం. వైశాఖ బహుళ ఏకాదశి అపర ఏకాదశి పర్వదిన తిథి.
చైత్ర బహుళ త్రయోదశి, మే 1, గురువారం
చైత్ర బహుళ త్రయోదశి తిథి వరాహ జయంతి పర్వదినం. వరాహావ తారం విష్ణువు దశావతారాల్లో మూడవది. ఈ అవతారం శ్రీ రామావతారం జరిగిన చైత్ర శుద్ధ నవమి నాడే అని కొందరు అంటారు. కానీ, తెలుగు పంచాంగాల ప్రకారం ఈ అవతారం చైత్ర బహుళ త్రయోదశి నాడు జరిగిందని తెలుస్తోంది.
ఈ అవతారంలో విష్ణువు లోకకంటకుడైన హిరణ్యాక్షుడిని సంహ రించాడు. హిరణ్యాక్షుడు రాక్షసుడు. బలగర్వితుడై భూమిని చాపగా చుట్ట చుట్టి పట్టుకుపోయి పాతాళంలో దాక్కున్నాడు. భూదేవి తన బాధను శ్రీహరికి చెప్పుకుంది. దీంతో విష్ణువు ఒక పెద్ద వరాహ రూపాన్ని దాల్చి అవత రించాడు. ఆ పంది (వరాహం) శరీరం నల్లని పర్వతంలా ఉంది. కోరలు తెల్లగా, వాడిగా ఉన్నాయి. కళ్లు పెద్ద జ్యోతులుగా వెలుగొందుతున్నాయి. అది గర్జిస్తే ఉరుము ఉరిమినట్టు ఉంది. ఈ రూపంతో విష్ణువు హిరణ్యాక్షుడిని ఎదుర్కొన్నాడు. ఇద్దరికీ మధ్య ఘోర యుద్ధం జరిగింది. రాక్షసుడిని చివరకు సంహరించిన వరాహమూర్తి.. పాతాళంలో పడి ఉన్న భూమిని తన బలిష్టమైన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ఉంచాడు.
ఇక మరో కథ కూడా ప్రచారంలో ఉంది.
కల్పాంతంలో ఒకసారి సమస్తం జలమయమైపోయింది. బ్రహ్మాండ మంతా చీకట్లు కమ్ముకున్నాయి. విష్ణుమూర్తి ఆ జలార్ణవంలో వటపత్రశాయి అయి యోగనిద్రలో ఉండిపోయాడు. ముల్లోక వాసుల వేడుకోలుతో విష్ణు మేల్కొన్నాడు. తిరిగి జగత్ సృష్టికి పూనుకున్నాడు. మళ్లీ ప్రకాశింప చేసే ఉద్దేశంతో బ్రహ్మాండాన్ని రెండుగా చేశాడు. వాటిని పద్నాలుగు లోకాలుగా చేశాడు. అధోభాగాంఢ ఛిద్రం నుంచి యుల్బము భూమిపై పడింది. అది మేరు పర్వతమైంది. అనంతరం నానా విధాలైన పర్వతాలు, చెట్టు చేమలు, జంతువులు, మనుష్యుల భారానికి భూమి పాతాళానికి కుంగింది. అప్పటి భూదేవి స్థితి బురదలో కూరుకుపోయిన ఆవు మాదిరి ఉంది. ఆమె తన బాధను విష్ణువుకు చెప్పుకోవడంతో విష్ణువు వరాహావతారం దాల్చాడు. యజ్ఞ స్వరూపంలో ఉన్న ఆ వరాహం పాతాళ లోకానికి వెళ్లి తన కోరలతో భూమిని పైకి ఎత్తాడు. తిరిగి భూమి స్వస్థలానికి చేరింది.
చైత్ర బహుళ చతుర్దశి, మే 3, శుక్రవారం
చైత్ర బహుళ చతుర్దశి నాడు గంగా స్నానం చేస్తే పిశాచత్వం పోతుందని అంటారు. చైత్ర బహుళ చతుర్దశి పర్వం భౌమ వారం (మంగళవారం)తో కూడి వస్తే మరీ ఫలప్రదమైనది.
చైత్ర బహుళ అమావాస్య, మే 4, శనివారం
చైత్ర బహుళ అమవాస్య నాడు వహ్ని వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు పితృ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
‘అమావాస్య కూడా పర్వదినమేనా’ అని ఒక నానుడి ఉంది. కానీ చిరకాలంగా అమావాస్య కూడా ఒక పర్వంగానే పరిగణనలో ఉంది.
పూర్వం అచ్ఛోదం అనే కొలను ఉంది. సోమవులనే పితరుల మానస పుత్రిక దాని ఒడ్డున తపం చేస్తుండేది. దీంతో ఆమె పేరు అచ్ఛోద అయ్యింది. ఆమె తన పితరులను చిరకాలం వరకు చూడకుండా ఉండిపోయింది. అందుచేత వారిని చూడాలని ఆమెకు మనసు పుట్టింది. పితరులు ఒకనాడు ఆమెకు దర్శనమిచ్చారు. అందులో మావసుడు అనే పితృదేవుడు చాలా అందంగా ఉన్నాడు. పైగా అతను దివ్యాలంకార భూషితుడై ఉన్నాడు. అతనిని అచ్ఛోద మోహించింది. కానీ అతను చలించలేదు. ఆమె కోరికను నిరాకరించాడు. ఈ కారణం వల్ల ఆనాటికి అమావాస్య అనే పేరు వచ్చింది. అది పితరుల పాలిట పర్వదినంగా చెలామణిలోకి వచ్చింది. ఈనాడు మానవులు పితరులకు భక్తి ప్రపత్తులతో తిల తర్పణాదులను ఇవ్వడం ఆచారంగా వస్తోంది.
వైశాఖ శుద్ధ పాడ్యమి, మే 5, ఆదివారం
వైశాఖ శుద్ధ పాడ్యమి.. వైశాఖ మాస స్నాన వ్రతానికి ఆరంభ దినం. సర్వ పాపాలు వైశాఖ స్నానంతో పోతాయని ప్రతీతి. ప్రాతః కాలంలో నియమంగా స్నానం చేస్తే మాధవుడికి ప్రీతి కలుగుతుంది. స్నానానంతరం రావిచెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేయాలి. ఈ మాసంలో తులసి దళాలతో విష్ణువును పూజించాలి.
వైశాఖ శుద్ధ తదియ, మే 7, మంగళవారం
వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయగా ప్రసిద్ధి. ఇది గొప్ప పుణ్య దినం. అక్షయ తదియ సోమవారం కానీ, బుధవారం కానీ వస్తే మరీ పవిత్రమైనది. కృత్తిక రోహిణీ నక్షత్రంతో కూడిన ఈ పర్వం అతి ప్రశస్తమైనదిగా వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తిథి నాడు చేసే దానాలు, దేవతలకు, పితరులకు చేసే పూజలు అక్షయ ఫలాన్ని ఇస్తాయని అంటారు. అందుకే ఈ పర్వానికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది.
అక్షయ తృతీయ నాడు పెరుగన్నం, విసనకర్రలు, గొడుగులు, పాదుకలు, చెప్పులు, ఉదకుంభము మొదలైనవి దానం చేయాలని నియమం. వైశాఖ మాసంలో వైశాఖ పూజ అనే పేరుతో సంపన్నులు ఒక వ్రతం చేస్తుంటారట. అందులో వేసవికి అవసరమైనవి వేసవిలో బాగా దొరికే మామిడిపండ్లు, పనస తొనలు మొదలైనవి కూడా వ్రతం చివరిలో పంచి పెట్టే వారు. వేసవికి అవసరమైనవి, వేసవిలో దొరికేవి అయిన వస్తువులు విరివిగా దానం చేయడం అక్షయ తృతీయ వ్రతం విధాయ కృత్యాలలో ఒకటి.
స్మ•తి కౌస్తుభంలో, తిథి తత్వంలో, పురుషార్థ చింతామణి తదితర వ్రత గ్రంథాలలో ఈనాడు విష్ణువును పూజించాలని ఉంది.
చైత్ర శుక్ల తృతీయ నాడు ప్రారంభించిన గౌరీ పూజ వ్రతాన్ని కొన్ని ప్రాంతాలలో నెల రోజులు కొనసాగి ఈనాడు ముగుస్తుంది. కాబట్టే పంచాంగాలలో ఈనాడు గౌరీపూజ, త్రిలోచన గౌరీ వ్రతం అని పేర్కొన్నారు.
అక్షయ తృతీయ ఉగాది తిథి. కృత, త్రేత, ద్వాపర, కలియుగం అనే నాలుగు యుగాల్లోనూ త్రేతాయుగానికి ఇది మొదటి రోజు. శ్రీరామావతారం త్రేతా యుగానికి చెందినది. అప్పటి మానవ ఆయుర్ధాయం మూడు వేల సంవత్సరాలు. శరీరంలో మాంసం ఉండే వరకు మనుషులు ప్రాణాలు ధరించి ఉండేవారట. త్రేతా యుగం రజత యుగం. ఆహవనీయ, గార్హపత్య, దక్షిణములనే త్రేతాగ్నులను పూజించిన కాలం కావడం చేత అది త్రేతాయుగం అయ్యింది.
అక్షయ తృతీయ నాడే కృత యుగం ఆరంభమైందని, కాబట్టి ఈ కృత యుగాదినే అక్షయ తృతీయ పర్వంగా నిర్వహించుకుంటారని అంటారు. ఈ అక్షయ తృతీయ గురించి భవిష్యోత్తర పురాణంలో వివరంగా ఉంది. సౌభాగ్యాన్ని వృద్ధి చేసే ఈ అక్షయ తృతీయ నాడు బదరీ నారాయణుడిని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని అంటారు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని పూజించే ఆచారం కూడా చాలాచోట్ల కనిపిస్తోంది. ఈ తిథి మొదలుకుని అన్నీ పర్వదినాలే..
వైశాఖ శుద్ధ తదియ బలరామ జయంతిగా ప్రసిద్ధి. రోహిణికి ఆదిశేషుడు బలరాముడుగా పుట్టాడని పురాణగాథ. విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించినపుడు బలరాముడూ అవతరించాడు. కృష్ణుని కంటే ఒక విధంగా బలరాముడే గొప్పవాడనే వర్ణణలూ మన కవుల రచనలలో ఉన్నాయి. ఈయన ఆయుధం నాగలి. ఒకసారి దుర్యోధనుడి కూతురైన లక్షణను కృష్ణుడి కుమారుడైన సాంబుడు వివాహార్థం తీసుకునిపోతుండగా, కౌరవ సైనికులు అతనిని బంధించి హస్తినా పురంలో చెరలో ఉంచారు. సాంబుడిని విడిపించడానికి బలరాముడు వెళ్లాడు. ఎంతగా హెచ్చరించినా కౌరవులు సాంబుడిని విడిచి పెట్టలేదు. దీంతో బలరాముడు తన నాగలితో హస్తినాపురాన్ని పెళ్లగించడానికి సిద్ధమయ్యాడు. దీంతో హస్తినాపురమంతా అల్లాడింది. భయపడిన కౌరవులు సాంబుడిని విడిచి పెట్టారు. ద్వివిదుడనే వానరుడు తన కోతి చేష్టలతో పచ్చని పొలాలను నాశనం చేయసాగాడు. అతనిని ఎంతగా బెదిరించినా వినకపోయే సరికి.. బలరాముడు తన హలాయుధంతో అతనిని సంహరించాడు.
బలరాముడు గదా యుద్ధ విద్యలో దుర్యోధనుడికి గురువు. కురుక్షేత్రంలో భీమ దుర్యోధనుల గదా యుద్ధంలో భీముడు దుర్యోధనుని వూరువుల మీద కొట్టాడు. అలా కొట్టడం అధర్మం కాబట్టి భీముడిని శిక్షించడానికి బలరాముడు తన హలాన్ని ఎత్తాడు. కృష్ణుడు అడ్డుపడి అన్నను శాంతపరిచాడు.
బలరాముడు ఒకసారి గోపికలతో కలిసి యమునా నదికి స్నానానికి వెళ్లాడు. ఆ సందర్భంలో అతను యమునా నదిని పిలిచాడు. కానీ ఆమె రాలేదు. దీంతో నదిని చీల్చి వేస్తానని నాగలిని ఎత్తాడు. దీంతో యమున పరుగున వచ్చిన అతనికి వినీల వస్త్రాలు కానుకగా ఇచ్చింది.
బలరాముడు తన నాగలితో ఆంధ్రులకు మహోపకారం చేశాడు. తన నాగలి చాలుతో ఆయన ఆంధ్రభూమిలో ఒక నదిని పుట్టించాడు. మహేంద్ర పర్వత శాఖ అయిన నిమ్మగిరుల నుంచి నూట పదిహేను మైళ్లు నడిపించి మోపసు బందరు వద్ద తూర్పు సముద్రంలో పడేటట్టుగా ఒక నదిని సృష్టించాడు. నాగలి వలన పుట్టిన నది కాబట్టి అది ‘నాగావళి’ అయ్యింది. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంది.
బలరాముని కేతన చిహ్నం.. కర్షకుల కల్పవృక్షమైన తాటి చెట్టు.
బలరాముడిని ఆంధ్రులు, ముఖ్యంగా రైతులు విశేషంగా కొలుస్తారు. ఈనాడు ఆంధ్ర కర్షకులు తమ పొలాల్లో, తమ పెరటిలో కూరపాదులు పెడతారు. అవి ఆ కాలాన మొలకెత్తి భరణి, కృత్తిక కార్తంలోని ఎండలను తట్టుకుంటూ నెమ్మ దిగా ఎదిగి మృగశిర కార్తె నాటికి ముంగిళ్లు చల్ల బడటంతోనే ఏపుగా ఎదిగి అప్పటి నుంచి అక్షయంగా కాస్తాయి.
వైశాఖ శుద్ధ తదియ చాలా విధాలుగా ప్రశస్తమై ఉంది. ఈనాడు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామికి చందనోత్సవం నిర్వహిస్తారు. అక్షయ తృతీయ నాడు సాధారణంగా కృత్తికా నక్షత్రం కూడి ఉంటుంది. కృత్తిక అగ్ని సంబంధమైనది. అగ్ని వల్ల తీక్షణత పుడుతుంది. ఆ తీక్షణం తగ్గించడానికి చందనం ఒక శైత్యోపచారం. సింహాచల స్వామికి విదియ నాటి రాత్రి గంధమును ఒలిచి వేస్తారు. తదియ నాటి ఉదయాన సహస్ర ఘటాభిషేకం చేస్తారు. అనంతరం స్వామి నిజరూప దర్శనం. స్వామి రూపం లింగాకృతిలో కనిపిస్తుంది. అనంతరం తిరిగి స్వామికి చందన చర్చ. ఈ గంధం ఒలుపు సహస్ర ఘటాభిషేకం, చందన సేవతో కూడి ఉంటుంది.
చందన లేపనం మంగళ ప్రదమైనది. ఆరోగ్యప్రదమైనది. చందనం అమూల్యమైన మూలిక. ప్రియమైన వాసన కలిగి ఇది దుర్గంధాన్ని పోగొడుతుంది. రక్త దోషాన్ని, పైత్యాన్ని తగ్గిస్తుంది. విషహరంగానూ, క్రిమిసంహారిణిగానూ పని చేస్తుంది. తాపాన్ని పోగొట్టి మిక్కిలి చలవ చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో దీనిని విరివిగా వాడతారు.
వైశాఖ శుద్ధ పంచమి, మే 9, గురువారం
వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతి పర్వం. ఈ తిథి నాడు శంకరాచార్యులు అవతరించారు. ఈనాడు శృంగేరి తదితర జగద్గురు పీఠాలలో జయంత్యుత్సవాలు నిర్వహిస్తారు. అద్వైతాన్ని ఈ లోకంలో అక్షయంగా నిలిపిన ఆదిశంకరుల వారు మన హైందవ ధర్మానికి పట్టుగొమ్మ. ఆదిశంకరులు చిన్ననాడే దరిద్ర నారాయణులను చూసి.. వారి కోసం కరుణా సముద్రుడై లక్ష్మీదేవిని స్తుతించి పేదల ఇళ్లను సౌభాగ్యాలకు నెలవు చేశాడు. ఆ లక్ష్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రంగా నేటికీ విరాజిల్లుతోంది.
శంకరుని మహిమలు అన్నీ ఇన్నీ కావు. కాశ్మీర దేశంలో శారదా దేవి పీఠం ఒకటి ఉందనీ, దానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయనీ, తూర్పు, పడమటి, ఉత్తర ద్వారాలను ఆయా దిక్కుల నుంచి వచ్చిన సర్వజ్ఞులైన పండితులు తెరిచారనీ, దక్షిణ ద్వారం తెరవగల పండితుడు లేనందున ఆ ద్వారం అలాగే మూసి ఉందని జనం చెప్పుకోవడం శంకరులు విన్నారు. దీంతో ఆయన కాశ్మీరానికి వెళ్లి, అక్కడి పండితులతో వాదించి దక్షిణ ద్వారం తెరుచుకునేలా చేసి విశేష కీర్తిని పొందారు. బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమం స్వీకరించిన శంకరులు సన్యాసి అయి ఉండీ తల్లికి అంత్యకర్మలు నిర్వహించారు. తన పండిత శక్తితో డెబ్బయి రెండు మతాల వారిని జయించారు. అనేక ఉద్గ్రంథాలను రచించారు. శంకరాచార్యులు అద్వైత మత స్థాపనాచార్యుడు. అద్వైత మతం మన వేదాలలో, ఉపనిషత్తులతో, భగవద్గీతలో ఉన్నదే. ప్రజలు దానిని మరిచిపోగా భారతదేశంలో ఆ కొస నుంచి ఈ కొస వరకు తిరిగి దానిని వెలుగులోకి తెచ్చారు.
వైశాఖ శుద్ధ షష్ఠి, మే 10, శుక్రవారం
వైశాఖ శుద్ధ షష్ఠి రామానుజాచార్య జయంతి తిథి. శంకర, రామానుజ, మధ్వ అనే త్రిమతాచార్యులలో ఈయన రెండవ వారు. ఈయన విశిష్టాద్వైత మతోద్ధారకుడు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం చెప్పిన ఈయన షష్ఠి నాడు జన్మించిన కారణంగా ఈ తిథి నాడు విశేష పూజలు చేస్తారు. తిరుక్కోటి యార్నంబి దగ్గర మోక్షప్రాప్తి కోసం తీసుకున్న రహస్య మంత్ర రాజ్యాన్ని లోకులందరినీ పిలిచి రామానుజుడు ఆనందంగా చెప్పేశాడు. రహస్యమైన దానిని బహిరంగపరిచాడనే గురువు ఆగ్రహాన్ని కూడా లోకుల కోసం భరించడానికి సంసిద్ధమైన రామానుజాచార్యుని గొప్పదనం తెలుసుకుని ఆ మార్గంలో నడవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతైనా ఉంది. అలాగే ఈ తిథి నాడు పుత్ర ప్రాప్తి వ్రతం కూడా ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
వైశాఖ శుద్ధ సప్తమి, మే 11, శనివారం
వైశాఖ శుద్ధ సప్తమి గంగా సప్తమిగా ప్రసిద్ధి. గంగా నది జహ్నుముని చెవి నుంచి పుట్టిన రోజు వైశాఖ శుద్ధ సప్తమి. ఈ రోజున గంగానదిలో స్నానం చేసి పూజ చేయాలి. శర్కరా సప్తమి, నింబా సప్తమి, అనోదన సప్తమి, ద్వాదశ సప్తమి తదితర వ్రతాలను కూడా ఈనాడు ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు.
తన పినతండ్రులు కపిల ముని కోపావేశానికి కాలి బూడిద కావడం చూసి సహించలేని భగీరథుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తపస్సు చేసి కైలాసనాథుని మెప్పించి ఆకాశగంగను భువిపైకి తీసుకుని వచ్చాడు. ఈ గంగోత్పత్తి కూడా వైశాఖ మాస సప్తమి నాడే జరిగింది. దీనిని పురస్క రించుకుని ఈనాడు గంగా స్నానం, గంగాస్తుతి చేసిన వారి సకల పాపపు రాశిని పతితపావన గంగ హరిస్తుందని పండితులు చెబుతారు.
వైశాఖ శుద్ధ అష్టమి, మే 12, ఆదివారం
వైశాఖ శుద్ధ అష్టమి దుర్గాష్టమి తిథి.
వైశాఖ శుద్ధ ఏకాదశి, మే 15, బుధవారం
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహినీ ఏకాదశిగా ప్రతీతి. ఈ రోజు ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి మహా విష్ణువు అక్షయంగా సంపదలు ఇస్తాడని, వారు ఇహలోక ఆనందాన్ని అనుభవించిన పిమ్మట వారికి విష్ణులోక ప్రవేశం కలుగుతుందని పురాణ ప్రవచనం.
మోహినీ ఏకాదశికి సంబంధించి ఒక కథ కూడా ఉంది. ధనవంతుడైన ఒక వైశ్యుడు తన ధనాన్ని అంతా దుర్వినియోగం చేశాడు. దీంతో అతనిని బంధువులు ఇంటి నుంచి వెళ్లగొట్టారు. దీంతో అతను ఒక అడవికి వెళ్లి తిరుగుతుండగా, ఒక ముని కనిపించాడు. ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించి ఆచరించాలని చెప్పాడు. ఆ వైశ్యుడు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పుణ్యం సంపాదించి, తిరిగి ధనవంతుడు అయ్యాడు. ఈ ఏకాదశివైశాఖ శుద్ధ ద్వాదశి, మే 16, గురువారం
వైశాఖ శుద్ధ ద్వాదశి పరశురామ జయంతి తిథి. తండ్రి మాటను జవదాటకుండా పితృవాక్య పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్న జమదగ్ని కుమారుడే పరశురాముడు. ఈ భూమిని ఏలే రాజుల దాష్టీకాన్ని చూడలేక పరశువు (గొడ్డలి)ని పట్టుకుని ఇరవై ఒక్క సార్లు రాజులపై దండయాత్ర చేశాడు. అటువంటి పరశురాముడు దశరథ తనయుడు, రాముడు శివచాపాన్ని విరిచాడన్న వార్త విని ఆ రాముని బలమేమిటో తెలుసుకుందామని వచ్చి రామునికి తన అస్త్రాలన్నిటినీ సంతోషంతో ధారపోసి మహేంద్రగిరికి తరలిపోతాడు. ఈ ప్రాంతం ప్రస్తుత ఒరిస్సాలో ఉంది. అక్కడి నుంచి ఆయన మలబారు ప్రాంతానికి వలస వెళ్లాడని అంటారు. అస్సాంలోని కామాక్షి దేవి ఆలయం ఉంది. అదే జమదగ్ని ఆశ్రమం అని అంటారు. ఈ ప్రాంతంలో పరశురామాలయం కూడా ఉందని తెలుస్తోంది. దక్షిణ భారతదేశంలో మలబారు భూమి ఉన్న చోట కరువు ఉండదట. రత్నగిరిలో పరశురామ మందిరం ఉంది. అక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంటుంది. ఈ తిథి నాడు పరశురామునికి అర్ఘ్యం ఇస్తే శత్రు నాశనమవుతుంది.
వైశాఖ శుద్ధ చతుర్దశి, మే 17, శుక్రవారం
వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి తిథి. తన భక్తుని కోరిక మేరకు సర్వాన్ని ఆక్రమించిన మహా విష్ణువు నృసింహుడై స్తంభం నుంచి ఆవిర్భవించి లోకకంటకుడైన హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఈ విధంగా లోకాలను కాపాడిన రోజు శుద్ధ చతుర్దశిగా భావించి నృసింహ జయంతిని నిర్వహిస్తారు. హిరణ్య కశిపుడిని అంతమొందించడానికి శ్రీ మహా విష్ణువు అవతరించినది ఈ దినమే. ఈ తిథి నాడు ఉపవాసం ఉండి స్వామిని పూజించడం వల్ల లేదా స్వామి వారి వ్రతం ఆచరించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఈనాడు స్వామి వారు ఉద్భవించిన స్తంభం, ఇంటి గడపలను పూజించడం కూడా ఆచారం.
వైశాఖ శుద్ధ పూర్ణిమ, మే 18, శనివారం
వైశాఖ శుద్ధ పూర్ణిమ ఎన్నో విధాలుగా ప్రశస్తమై ఉంది. ఇరవై ఏడు నక్షత్రాలలో విశాఖ నక్షత్రం పదహారవది. ఇది ఐదు నక్షత్రాల కూటమి. ఇది కుమ్మరి సారెలా ఉంటుంది. విశాఖకు కాంతిని వ్యాపింప చేసేది అని అర్థం. అటువంటి విశాఖ నక్షత్రంతో కూడిన పూర్ణిమకు వైశాఖి అని పేరు. ఏ మాసంలో వైశాఖి పూర్ణిమ వస్తుందో ఆ మాసానికి వైశాఖ మాసమని పేరు. వైశాఖిని మహా వైశాఖి అనీ అంటారు.
ఈనాడు సముద్ర స్నానం చేయాలి. ధర్మరాజు ప్రీత్యర్థం నానావిధ దానాలు చేయాలి. ఈనాడు బుద్ధుని జన్మ మహోత్సవమని నీలమత పురాణంలో ఉంది. సుబ్రహ్మణ్య స్వామి విశాఖ పూర్ణిమ నాడే అవతారమెత్తినట్టు చెబుతారు. కూర్మావతారం కూడా ఈనాడు ఆవిర్భవించింది.
సిద్ధార్థుడు శాక్య వంశంలో జన్మించాడు. ఆ రాజ కుమారుడు భవిష్యత్తులో సన్యాసి అవుతాడని పండితుడు అతను పుట్టగానే చెప్పారు. దీంతో కష్టం, దు:ఖం తెలియకుండా తండ్రి ఆ బాలుడిని పెంచాడు. అయినా నాలుగు దృశ్యాలు సిద్ధార్థుడి కంటపడ్డాయి. అవి..
వృద్ధుడు,
రోగి,
శవం (మరణం),
సన్యాసి.
ఆ స్థితుల్ని చూసి చలించిన సిద్ధార్థుడు అంతర్ముఖుడయ్యాడు. ఇల్లు వదిలి, భార్యాబిడ్డలను వదిలి వెళ్లిపోయాడు. సమర్పిస్తారు. బుద్ధగయలో బోధి వృక్షం కింద ఆయనకు జ్ఞానోదయమైంది. ఆర్య సత్యాలు వెల్లడించాడు. అష్టాంగ యోగమార్గం బోధించాడు. బుద్ధుడిగా తన మొదటి జ్ఞానబోధను సారనాథ్లో ప్రారంభించాడు. దాన్ని ‘ధర్మచక్రం’ అంటారు. కొన్నేళ్ల పాటు ధర్మబోధ చేసిన బుద్ధుడి తరువాత బౌద్ధ మతం హీనయాన, మహాయాన అనే రెండు శాఖలుగా విడిపోయింది. ఆయన ఉండగానే ఆ మతం చైనా, సింహళ, టిబెట్ వంటి దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం అది విశ్వమంతా ఉంది.
వైశాఖ పూర్ణిమనాడు మహాపరి నిర్యాణం. బుద్ధుడికి విశేష ధర్మ సిద్ధాంతం. అహింస, కరుణ ఉండాలని, కోరికలు లేకుండా జీవించాలని మానవాళికి బోధించాడు. అందుకే ఆయనను లోకం ‘ప్రపంచ జ్యోతి’గా వర్ణించింది.
బుద్ధ గయలో జరిగే బుద్ధ పూర్ణిమ ఉత్సవాలను చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో యాత్రికులు వస్తారు. బుద్ధ గయ తరువాత బౌద్ధ మతానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చే సారనాథ్లోనూ బుద్ధ పూర్ణిమ ఉత్స వాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి.
వైశాఖ పూర్ణిమ బౌద్ధులకు పెద్ద పండుగ. బౌద్ధ మత సిద్ధాంతం ప్రకారం దేన్నీ ఇష్టంగా లేదా అయిష్టంగా తీసుకోకూడదు. కనుక బౌద్ధులు ఈ బుద్ధ పూర్ణిమ వేడుకలను చాలా శాంతంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవాలలో బుద్ధుని గౌరవార్థం బౌద్ధ పతాకాన్ని ఎగురవేస్తారు. బౌద్ధ స్తూపాన్ని ప్రార్థిస్తారు. బుద్ధుని బోధనలను స్మరించుకుంటారు.
ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ధర్మ సూత్రాన్ని బౌద్ధం నొక్కి వక్కాణిస్తుంది. సత్యం, ధర్మం గురించిన కథలను ఈనాడు బౌద్ధులు గుర్తు చేసుకుంటారు. బౌద్ధ మతస్తులు ఈనాడు పూవులు, దీపాలు, అగరవత్తులు బుద్ధునికి సమర్పిస్తారు. అందమైన పూవులు కొద్ది సేపటికి వాడిపోతాయి. కాంతులొలికే దీపం, మధురమైన అగరవత్తులు కాసేపటికే ఆవిరైపోతాయి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని చెప్పడానికి ప్రతీకలుగా గురువు గారికి వీటిని ఇస్తారు.
గౌతముడు (బుద్ధుడు) అనారోగ్యం, వృద్ధాప్యం, మృత్యువు లాంటి దుఖాలను చూసి చలించిపోయాడు. కష్టాలకు కారణం ఏమిటో అన్వేషిస్తూ, దేశాటన చేస్తూ, ఎంతో శోధించిన మీదట, చివరకు గయలో బోధి వృక్షం కింద ‘కోరికలే దు:ఖానికి మూల కారణం’ అని కనుగొన్నాడు. తాను కనుగొన్న సత్యాన్ని ఆయన ప్రచారం చేశాడు. ‘మనకు కష్టం కలిగిందీ, దుఃఖిస్తున్నామూ అంటే అందుకు ఏదో ఒక కోరికే కారణం. కనుక కోరికలను జయించాలి’ అని ఆయన బోధించాడు.
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతీదీ మార్పు చెందుతుంది. చివరికి నశించిపోతుంది. మార్పు సహజం కనుక దానిని ఆమోదించాలి. మంచి, చెడు.. దేనికీ ప్రతిస్పందించవద్దు’ అనే బుద్ధుని బోధనలు ఉత్క•ష్ట మైనవి. వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడే కూర్మ జయంతి కూడా. పుష్య శుక్ల ద్వాదశి నాడు కూర్మ ద్వాదశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో ఉంది. కూర్మావతారం విష్ణువు యొక్క దశావతారాలలో రెండవది. పాల సముద్రాన్ని మథించిన సందర్భంలో మందర పర్వతాన్ని కవ్వంగా దేవతలు, రాక్షసులు (అమృతం కోసం) చేసుకున్నారు. ఆ మందర పర్వతాన్ని తన వీపు మీద మోయడానికి విష్ణువు పెద్ద తాబేలు ఆకారాన్ని ధరించాడు. కూర్మావతారం ఆంధ్ర దేశమంతటా పూజితం.
వైశాఖ బహుళ పాడ్యమి, మే 19, ఆదివారం
వైశాఖ బహుళ పాడ్యమి నాడు భూత మాత్రోత్సవం’ ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఈనాడు మొదలుకుని జ్యేష్ఠ పూర్ణిమ చివరి వరకు శ్రీ ప్రాప్తి వ్రతం ఆచరించాలని కూడా ఇందులో రాశారు.
వైశాఖ బహుళ విదియ, మే 20, సోమవారం
వైశాఖ బహుళ విదియ నారద జయంతి దినం. ఈనాడు వీణా దానం చేయాలని అంటారు. నారదుడు గొప్ప గాన విద్యా కుశలుడు. ఆయన చేతిలో ఉండే వీణకు ‘మహతి’ అని పేరు. ఈ వీణ ఆధారంగానే ఆయన నిత్యం విష్ణుగానం చేస్తూ ముల్లోకాలలోనూ సంచరిస్తూ ఉంటాడు. నారదుడు గడిచిన కల్పంలో ఉపబర్హణుడునే గంధర్వుడిగా పుట్టాడట. అతను ఆ కాలంలో నారాయణ కథలు గానం చేసేవాడు. తరువాత కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడైనాడు.
వైశాఖ బహుళ ఏకాదశి, మే 30, గురువారం
వైశాఖ బహుళ ఏకాదశి అపరైకాదశి తిథి. ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించి ఉపవాసం ఉంటే పవిత్ర తీర్థాల్లో స్నానం చేసిన ఫలం, పలు విధాలైన దానం చేసిన ఫలం కలుగుతుందని అంటారు.
Review మాధవ మాసం.