కాళిదాసు గర్వభంగం

మహాకవి కాళిదాసు ఒకనాడు మండు వేసవిలో మిట్ట మధ్యాహ్నం ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. దాహం వేయడంతో కాళిదాసు ఓ గుడిసె వద్దకు వెళ్లాడు.
‘దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వండి’ అని గుమ్మం ఎదుట నిలిచి అడుగుతాడు.
గుడిసె లోపలి నుంచి ఓ ముదుసలి మహిళ వచ్చి ‘మీరెవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు?’ అని ప్రశ్నిస్తుంది.
‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? నేను ఓ పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతారు’ అన్నాడు కాళిదాసు ఒకింత గర్వంగా.
ఆ మాటలు విన్న ముసలావిడ నవ్వి, ‘మీరు అసత్యమాడుతున్నారు. మీరంత గొప్ప వారైతే ప్రపంచంలో ఇద్దరు బలవంతులు ఎవరో చెప్పండి’ అంటుంది.
కాళిదాసు కాసేపు ఆలోచించి, ‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతుంది. ముందు నీళ్లివ్వండి’ అని బతిమాలుతాడు.
‘ఆ ఇద్దరు బలవంతులు ఆకలి, దాహం. ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని మళ్లీ ఆ ముసలావిడ రెట్టించి అడుగుతుంది.
‘నేను బాటసారిని’ అంటాడు కాళిదాసు.
‘అయితే, ఈ లోకంలో అలసిపోకుండా సంచరించే ఇద్దరు బాటసారులు ఎవరో చెప్పండి’ అని మళ్లీ అడుగుతుంది ముసలావిడ.
కాళిదాసు తెల్లముఖం పెట్టి, ‘మాతా! నీళ్లివ్వండి. లేకపోతే దాహంతో చచ్చిపోయేలా ఉన్నాను’ అని ప్రాథేయపడతాడు కాళిదాసు.
‘అలాగా! నేను చెబుతాను వినండి. వాళ్లు సూర్యచంద్రులు. ఇప్పుడు చెప్పండి. మీరెవరో చెబితే నీళ్లిస్తాను’ అంటుంది ముసలావిడ.
కాళిదాసు దీనంగా, ‘నేను అతిథిని’ అని బదులిస్తాడు.
‘మీరు మళ్లీ అసత్యం చెబుతున్నారు. ఈ సృష్టిలో అతిథులు ఇద్దరే.ఒకటి` ధనం. రెండోది` యవ్వనం. అవెప్పుడు వస్తాయో, ఎప్పుడు పోతాయోఎవరికీ తెలియదు’ అంటుంది ముసలావిడ.
‘నా సహన పరీక్ష తరువాత చేద్దురు. ముందు నీళ్లివ్వండి’ అని వేడుకుంటాడు కాళిదాసు.
‘ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు. వారెవరో సెలవివ్వగలరా?’ అని మరో ప్రశ్న వేస్తుంది ముసలావిడ.
బిక్కముఖం వేసిన కాళిదాసుతో` ‘ఒకటి భూమి, రెండోది వృక్షం’ అని విశదీకరించి, ‘ఇప్పుడు నిజం చెప్పండి. మీరెవరు?’ అని మళ్లీ అడుగుతుంది.
ఓపిక నశించిన కాళిదాసు` ‘నేను మూర్ఖుడను. ఈ మూర్ఖుడికి ఇప్పుడైనా నీళ్లిస్తారా?’ అని సాగిలపడతాడు.
ఆ ముసలావిడ పకపకా నవ్వుతూ` ‘ఇదీ అబద్ధమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు` ఈ రాజ్యాన్ని పాలించే రాజు. అతడు అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చలాయిస్తున్నాడు. రెండో వాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’ అంటుంది.
దీంతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ అవ్వ కాళ్లపై పడి క్షమాపణలు కోరతాడు.
ఆ అవ్వే తరువాత సరస్వతీదేవిగా సాక్షాత్కరిస్తుంది.
‘నాయనా! విద్యతో వినయం వృద్ధి చెందాలి. అహంకారం కాదు. ప్రతిష్టల మాయలో పడిపోయిన నీ బుద్ధిని సరిచేయడానికే ఈ పరీక్ష’ అని మంచినీరు అందించి దాహం తీరుస్తుంది.
విద్య, ధనం, అధికారం.. వీటి కారణంతో మనిషి తనలో అహంకారం పెరగకుండా చూసుకోవాలి.

Review కాళిదాసు గర్వభంగం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top