అమాయక శిష్యులు

పరమానందయ్య గారికి ఒక శుభకార్యం జరప వలసి వచ్చింది. దానికి కొంత డబ్బు అవసరమైంది. అందుకని చుట్టుపక్కల గ్రామాలకి వెళ్లి ధన, కనక, వస్తు వాహనాలు, విరాళాలు సేకరించుకు రావాలని శిష్యులను వెంటబెట్టుకుని బయలుదేరారు. నాలుగైదు గ్రామాలు తిరిగే సరికి వారికి విరాళాలు బాగానే వచ్చాయి. అప్పటికే సాయంత్రమైంది. తొందరగా ఇంటికి చేరకపోతే చీకటి పడిపోతుందని వాళ్లంతా గబగబా నడవసాగారు. దారిలో ఒక ఏరు అడ్డు వచ్చింది. ఆ ఏరు మోకాలి లోతున ప్రవహిస్తుంది.
అది చూసిన ఒక శిష్యుడికి బాగా కోపం వచ్చింది. ‘మా గురువు గారితో కలసి శిష్యులం వస్తుంటే మా ప్రయాణం ఆపాలనే దుర్భుద్దేమిటి ఈ ఏరుకి? దీనికి గురువుగారన్నా భయం లేదు’ అనుకుని ‘గురువు గారూ మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ నది పొగరు మేం చూసుకుంటాం’ అంటూ గురువు గారికి విశ్రాంతినిచ్చారు.
శిష్యులంతా బాగా ఆలోచించి.. ఏరుకి చురక వెయ్యాలని నిర్ణయించున్నారు. ఒకడు కాగడా తయారు చేసి మంట అంటించాడు. ఆ కాగడాను పట్టుకుని శబ్దం చేయకుండా ఏటిలోకి వెళ్లాడు. దాన్ని ఏరులో ముంచాడు. వెంటనే అది చుమ్మని శబ్దం చేసింది. దానికి, ఆ శిష్యుడు భయపడిపోయి పరిగెత్తు కొంటూ వచ్చి పడ్డాడు. ఈ గోలకి గురువు గారికి మెలకువ రాలేదు. ఆయనకు గాఢనిద్ర పట్టేసింది.
అది చూసిన మిగతా ‘శిష్యులు ఏమైందిరా? అని అడిగారు. ‘ఏరు పడుకోలేదురా.. మెలకువగానే ఉంది. నేను వాత పెట్టబోతుంటే పగబట్టిన నాగు పాములా బుస్సుమని పెద్ద పెద్ద కెరటాలతో నన్ను కాటేసింది అంటూ వణికిపోతూ భోరుమని ఏడి చేశాడు ఆ శిష్యుడు తోటివాళ్లతో. అదే సమయంలో అటునుంచి ఒక యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ ఏరు దాటడం చూసిన శిష్యుల ఆశ్చర్యానికి అంతులేదు.
ఈ యువకుడు ఎంత ధైర్యంగా వస్తున్నాడో ! ఏరు నిద్దరోతుందేమో.. అందుకే వాడినేమీ అనలేదు అనుకుని.. ‘ఇది మంచి సమయం. ఏరు నిద్ర పోతుందో లేదో చూసిరా.. మనం కూడా దాటేద్దాం అన్నాడు మరో శిష్యుడు. సరేనని ఓ శిష్యుడు నుదుటన విభూతి పెట్టుకుని.. ఆంజనేయ దండకం చదువుతూ ఏటి ఒడ్డుకు బయలుదేరాడు. ఏరులోకి వెల్లి మెల్లగా చేతిలోని కాగడాను ముంచాడు. కాగడాకి నిప్పు లేదు కనుక నీళ్లు ఏ శబ్దం చేయలేదు. ఏటి నుంచి ఏ శబ్దం రాకపోయేసరికి ఆ శిష్యుడు పరుగెత్తు కొచ్చి, ‘ఏరు నిద్దరోతోంది. ఇదే మంచి సమయం. అందరూ తయ్యారవ్వండి’ అని హడావుడి చేశాడు.
శిష్యులు గురుగారినెంత లేపినా ఆయనకు మెలకువ రాలేదు. ఆయనను మోసుకుపోదామను కున్నారు. అందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని, మూటల్ని, గురువు గారిని ఎత్తుకుని మొత్తానికి అవతలి ఒడ్డుకు చేరారు. అయినా గురువు గారికి మెలకువ రాలేదు. ఏరు దాటిన ఆనందంతో శిష్యులంతా గంతులేశారు. ఇంతలో వాళ్లలో ఓ శిష్యుడు అందరినీ వరుసగా నిలబడమని చెప్పాడు. అందరూ గోల చేయకుండా నిశ్శబ్దంగా వరుసలో నిలబడ్డారు.
ఒక శిష్యుడు ‘ఎందుకు? అని అడిగాడు.
మనమంతా ఇవతలి ఒడ్డుకు వచ్చామో లేదో తనిఖీ చేయడానికని బదులిచ్చాడు మరో శిష్యుడు.
‘మనం పన్నెండు మందిమి. గురువుగారు కాక శిష్యులం పన్నెండు మందిమి’ అంటూ ఆ శిష్యుడు ఒక్కొక్కరిని లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. తనను వదిలి మిగిలిన పదకొండు మందిని లెక్కపెట్టాడు ఆ వెర్రి శిష్యుడు. లెక్క తేలకపోయేసరికి, ‘బాబోయ్‍.. మనలో ఒకరిని ఏరు మింగేసింది’ అని గట్టిగా అరిచా డతను. ‘అవతలి ఒడ్డున ఉండిపోయాడేమో అన్నాడు ఇంకో శిష్యుడు.
‘లేదు. నేను వెనక్కి తిరిగి చూశాను కదా’ చెప్పాడు శిష్యుడు. అంటే నిజంగానే ఏరు మింగే సిందన్న మాట అంటూ శిష్యులంతా భోరున ఏడుస్తూ ఏరుని శాపనార్థాలు పెట్టసాగారు.
అంతలో అటుగా భుజాన కర్ర పట్టుకుని ఓ బాటసారి వస్తున్నాడు. శిష్యులను చూసిన ఆ రైతు వారిని సమీపించి, ‘మీరెవరు? ఎందుకు బాధపడ్తు న్నారు అని ప్రశ్నిచాడు.
‘మా గురువుగారు పరమానందయ్య గారు. మేము, ఆయన పన్నెండు మంది శిష్యులం. మేమంతా కలసి ఏరుదాటుకొస్తుంటే అది మాలో ఒకర్ని మింగేసింది అని చెప్పారు శిష్యులు.
బాటసారి వారిని ఒకసారి లెక్కపెట్టి చూశాడు. శిష్యుల తెలివి తక్కువతనం అతనిని అర్థమయ్యింది. అందుకే వారిని ఆటపట్టించాలనుకున్నాడు.
‘నేనెవరిని అని వారిని అడిగాడు బాటసారి.
‘తెలియదు అన్నారు శిష్యులు.
‘ఇంతకీ మీరెవరు? అన్నాడు ఓ శిష్యుడు.
‘నేనెవరో ఊరికే చెప్పేస్తానా? మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత ఇస్తే చెబుతాను అన్నాడు బాటసారి చాలా తెలివిగా.
‘మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని గురువుగారు చెప్పారు కదా? అందుకని ఇతనెవరో తెలుసుకుందాం’ అనుకున్నారంతా.
బాటసారికి ఓ మూట ఇచ్చి ‘చెప్పు నువ్వెవరు? అని అడిగారు.
‘నేను మారువేషంలో ఉన్న మాంత్రికుడిని. భూత పిశాచాలను పారద్రోలుతాను’ అన్నాడు.
‘నువ్వు ఏరు మింగేసిన మా వాడిని తీసుకురా గలవా’ అని అడిగారు శిష్యులు.
‘తీసుకువస్తాను కానీ, కొంచెం ఖర్చవుతుంది’ అన్నాడు బాటసారి.
‘మనిషికంటే డబ్బు ముఖ్యం కాదని మా గురువు గారు చాలాసార్లు చెప్పారు ఇదిగో మరో మూట’ అని డబ్బు ఇచ్చారు. అప్పుడు ఆ బాటసారి ఏదో ఓ పిచ్చిమంత్రం చదువుతున్నట్లు నటించాడు. అతను శిష్యులందర్నీ వరుసగా నిలబెట్టి, ఒక్కొక్కరిని ఒక్కో అంకె లెక్కపెట్టమని చెప్పాడు. అలా లెక్కపెట్టగా పన్నెండు మంది శిష్యులు లెక్క వచ్చారు.
అప్పుడు బాటసారి, ‘చూశారా మీ వాడిని తెప్పిం చేశాను’ అన్నాడు. శిష్యుల ఆనందానికి, ఆశ్చర్యానికి అవధులు లేవు. ‘మీరు సామాన్యులు కారు. ఏరు మింగేసిన మావాడిని తెప్పించగలిగారు. మీకేమిచ్చి రుణం తీర్చుకోగలం?. అయినా మీ ప్రతిభకేదో మా వద్ద ఉన్నంత సమర్పించుకొంటాం’ అంటూ మిగతా డబ్బు మూటలు కూడా బాటసారికి ఇచ్చేశారు. అవి తీసుకుని సంతోషంతో అక్కడనుండి వెళ్లిపోయాడు బాటసారి.
అప్పుడు మెలకువ వచ్చింది గురువు గారికి. డబ్బు గురించి అడగ్గా శిష్యులు జరిగిందంతా విపులంగా చెప్పారు. వాళ్ల తెలివి తక్కువతనానికి నెత్తీనోరూ బాదుకొన్నారు గురువుగారు.

Review అమాయక శిష్యులు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top