మాఘం… అమోఘం

ఆంగ్ల కాలమానం ప్రకారం సంవత్సరాల వరుసలో రెండవది- ఫిబ్రవరి. తెలుగు పంచాంగం ప్రకారం ఇది మాఘ మాసం. పదకొండవది. ఈ మాసం రెండు విధాలుగా మహత్తయినది. ఒకటి- లోకాలను పాలించే మహా దేవుని మహా శివరాత్రి పర్వం, రెండు- లోకాలకు వెలుగులను పంచే వెలుగుల రేడు సూర్య భగవానుని రథ సప్తమి తిథి.. ఈ రెండూ మాఘ మాసంలోనే రావడం విశేషం. ఇంకా ప్రపంచంలోనే అతి పెద్దదైన మేడారం జాతర (ఫిబ్రవరి 5-6-7-8) జరిగేది ఈ మాసంలోనే. ఈనాడు సమ్మక్క, సారక్క అనే వన దేవతలను విశేషంగా పూజిస్తారు.
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం కనుక ఈ నెలకు ‘మాఘ’ మాసం అనే పేరు వచ్చింది.
యజ్ఞ యాగాదులకు అత్యంత శ్రేష్ఠమైనది ఈ మాసం. యజ్ఞాలకు అధి దైవం ఇంద్రుడు. అందుకే ఇంద్రుడిని ‘మఘవుడు’ అనీ కూడా అంటారు. మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ‘మాఘం’ అయ్యింది.
ఇది శిశిర రుతువు మాసం. చెట్లు ఆకులు రాల్చే కాలం. ఉసిరికలు విస్త•తంగా కాస్తాయి. శూన్యమాసంగా పరిగణించే పుష్యం తరువాత వచ్చే ఇది కల్యాణకారక మాసం. పవిత్ర స్నానా లకూ, భగవత్ చింతనకూ నెలవైన ఉత్క•ష్టమైన మాసమిది.
మాఘ మాసానికి వచ్చే సరికి చలి అంతగా ఉండదు. వానలు కూడా పెద్దగా ఉండవు. కాబట్టి వాతావరణపరంగా కూడా మాఘ మాసం అమోఘమైనదని పెద్దలు చెబుతారు.
ఇక, మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు (జనవరి 26, ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీలు, 2020) విశేషమైనవి.
ఈ కాలంలో ఉదయ స్నానం అత్యంత శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక, అరుణోదయాన దీపారాధన, తిలహోమం, తిలదానం, తిలభక్షణం మాఘ స్నానాల సందర్భంగా ఆచరించా ల్సిన ముఖ్య విధులు. శివుడు,. సూర్యనారాయణు డులను మాఘ మాసంలో పూజించడం అమితమైన ఫలాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాఘ మాసం ఎన్నో పవిత్ర పర్వాలకు నెలవు. మాఘ మాసంలో గృహ నిర్మాణాన్ని ఆరంభిస్తే ధనద్యానగమం అని మత్స్య పురాణంలో ఉంది. ఇక, ఈ మాసంలో వచ్చే ముఖ్య తిథులు, వాటి విశేషాల గురించి తెలుసు కుందాం.
మాఘ శుద్ధ విదియ, జనవరి 26, ఆదివారం
మాఘ శుద్ధ పాడ్యమి జనవరి 25తో మాఘ మాసం ప్రారంభమవు తుంది. ఇక, మాఘ శుద్ధ విదియ త్యాగరాజ స్వామి ఆరాధన తిథిగా ప్రసిద్ధి. ఈనాడు త్యాగరాజ కృతులను ఆలయాల్లో ఆలపించడం ఆనవాయితీ. త్యాగరాజ స్వామి దక్షిణాది రాష్ట్రాలలో ఈనాడు విశేష ఆరాధనలు అందుకుంటారు. జనవరి 26 భారత గణతంత్ర దినో త్సవం. ఈనాడు భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతాయి.
మాఘ శుద్ధ తదియ, జనవరి 27, సోమవారం
మాఘ శుద్ధ తదియ నాడు గుడలవణ దానం చేయాలని అంటారు. ఇంకా ఈనాడు ఉమాపూజ, లలితా వ్రతం, హరతృతీయా వ్రతం, దేవ్యా వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, మాఘ శుద్ధ తదియ మార్కండేయ మహర్షి జయంతి తిథి కూడా.
మాఘ శుద్ధ చతుర్థి, జనవరి 29, బుధవారం
మాఘ శుద్ధ చతుర్ధికి ‘కుంద చతుర్థి’ అని కూడా పేరు. ఈనాడు శివపూజ చేయాలని, శివుడిని మొగలి పువ్వులతో పూజించాలని అంటారు. ఇంకా, ఈనాడు ఉమాపూజ చేయాలని నీలమత పురా ణంలో ఉంది. ఈ తిథి నాడు వరద గౌరీపూజ, శాంతా చతుర్థి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు. ఈనాడు గణేశ పూజ చేయాలని, ముఖ్యంగా డుంఠి గణపతిని పూజించాలని కూడా వివిధ గ్రంథాలలో ఉంది. మాఘ శుద్ధ చవితికి తిల చతుర్థి అనే పేరు కూడా ఉంది. ఈనాడు తిల దానం చేస్తే కోటిరెట్లు ఫలం ఇస్తుందని అంటారు.
మాఘ శుద్ధ పంచమి, జనవరి 30, గురువారం
మాఘ శుద్ధ పంచమి నాడు హరి పూజ చేయాలని, దాంతో పాటు వసంత పంచమి పర్వం కూడా నిర్వహించుకోవాలని హేమాద్రి పండితుడు చెప్పారు. వసంత పంచమి విద్యారంభ దినం. ఇంకా పర్వానికి రతి కామదమనోత్సవం, మదన పంచమి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈనాడే రతీదేవి కామదేవ పూజ చేసినట్టు కొన్ని పురాణాల్లో ఉంది. ఈనాటి కృత్యాలలో తైల స్నానం, నూతన వస్త్రధారణం ముఖ్యం. వంగ దేశంలో దీనిని శ్రీపంచమి అంటారు. ఈనాడు సరస్వతీ పూజ చేస్తారు. పుస్తకాలు, కలాలు సరస్వతీదేవి వద్ద ఉంచి, రోజంతా సరదాగా గడుపుతారు. సాయంత్రం దేవి విగ్రహాన్ని సమీపంలోని జలాశయంలో నిమజ్జనం చేస్తారు. దక్షిణాదిన వసంత పంచమి అంతగా ఆచారమై లేదు. రాజపుత్రులలో దీని ప్రభావం ఎక్కువ. ఈనాడు అక్కడి వారు రంగుబట్టలు ధరించి బుక్కా, వసంతం చల్లుకుంటారు. మాఘ శుద్ధ పంచమి తిథి గురించి పంచాంగకర్తలు ఈనాటి వివరణలో శ్రీపంచమి, మదన పంచమి, వసంతోత్స వారంభం, వసంత పంచమి, రతికామ దమనోత్సవం, సరస్వతీ జయంతి అని రాస్తారు. వసంత పంచమి నామాన్ని బట్టి ఇది రుతు సంబంధమైన పండుగగా భావించాలి. మాఘ ఫాల్గుణాలు శిశిర రుతువు. చైత్ర వైశాఖాలు వసంత రుతువు. శిశిర రుతువు ప్రారంభంలోనే వసంత రుతు సంబంధంగా ఈ వసంత పంచమి పర్వాన్ని నిర్వహించడానికి గల కారణం అయి ఉండవచ్చు. బహుశా రాగల వసంత రుతు సూచనలకు స్వాగత చిహ్నంగా ఈ పర్వం ఏర్పడి ఉండవచ్చు. పూర్వం ఈ తిథి నాడు ‘యవేష్ఠి’ అనే యజ్ఞం చేసే వారని తెలుస్తోంది. ఇప్పుడిది అంతగా ఆచరణలో లేదు. ‘యవ’ అంటే ఒక ధాన్య విశేషం. ‘ఇష్ఠి’ అనగా యజ్ఞం. సంక్రాంతికి ఇంటికి వచ్చే ధాన్యాన్ని ఈనాడు అన్నం వండి కులదేవతకు నైవేద్యం పెట్టి తినే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా నిలిచి ఉంది.
మాఘ శుద్ధ షష్ఠి, జనవరి 31, శుక్రవారం
ఇది కుమార స్వామికి ఇష్టమైన తిథి. అందుకే దీనిని స్కంద షష్ఠిగా పేర్కొంటారు. ఈనాటి పర్వానికి వరుణ షష్ఠి అని కూడా పేరు. విష్ణు స్వరూపుడైన వరుణ దేవుడిని ఈనాడు ఎర్రచందనం, ఎర్రని వస్త్రాలు, పుష్పాలు, ధూపం, దీపంతో పూజించాలని పురాణాలలో చెప్పారు.
మాఘ శుద్ధ సప్తమి, ఫిబ్రవరి 1, శనివారం
మాఘ మాసంలోనే మహత్తయిన తిథి ఇది. ఈనాడు సూర్య జయంతి తిథి. తెలుగు నాట రథ సప్తమిగా ప్రసిద్ధి. సౌర సప్తమి, భాస్కర సప్తమి అనే పేర్లు కూడా ఉన్నాయి. సప్తమి తిథులు నెలకు రెండుసార్లు వస్తాయి. అనగా, ఏడాదికి ఇరవై నాలుగు సప్తములు. వీటిలో మహత్తు గల సప్తమి- మాఘ సప్తమి. అందువల్లే మాఘ శుద్ధ సప్తమికి మహా సప్తమి అనే పేరు కూడా ఉంది. ఈనాడు సూర్యారాధన విశేషంగా జరుగుతుంది. ఆంధప్రదేశ్లోని అంతర్వేది వద్ద సముద్ర సంగమ క్షేత్రంలో పుణ్య స్నానాలను విశేషంగా ఆచరిస్తారు. ఇక్కడే ప్రసిద్ధి పొందిన లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా ఉంది.
మాఘ శుద్ధ అష్టమి, ఫిబ్రవరి 2, ఆదివారం
ఇది భీష్మాష్టమి పర్వదినం. పద్మ పురాణంలోనూ, హేమాద్రి వ్రత ఖండంలోనూ భీష్మాష్టమి గురించి వివరణ ఉంది. ఈ తిథి నాడు భీష్మునికి తిలాంజలి ఇచ్చే వారికి సంతానప్రాప్తి కలుగుతుందని అంటారు. మాఘ శుద్ధ సప్తమి మొదలు మాఘ శుద్ధ ఏకాదశి వరకు గల ఐదు రోజులకు భీష్మ పంచకం అని పేరు. భీష్ముడు అంపశయ్యపై ఉండి, మాఘ శుద్ధ అష్టమి నుంచి ఐదు రోజులలో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచ ప్రాణాలను విడిచాడని అంటారు. దీనివల్ల భీష్ముడు ఈ రోజునే మరణించినట్టు తెలుస్తోంది. మహా భారతంలో కూడా ఈ దినమే భీష్ముని నిర్యాణ దినంగా ఉంది. భీష్మ ద్వాదశి వ్రతం ఈనాడే ప్రారంభిస్తారని నిర్ణయ సింధువు అనే వ్రత గ్రంథంలో ఉంది. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం, తర్పణం విడిచిన వారికి సంవత్సర పాపం నశిస్తుందని అంటారు.
ఇంకా మాఘ శుద్ధ అష్టమి నాడు నందినీ దేవిపూజ చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆంధప్రదేశ్లోని సముద్ర సంగమ స్థానమైన అంతర్వేదిలో.. ఈనాడు అంతర్వేది తీర్థం వైభవంగా జరుగుతుంది.
మాఘ శుద్ధ నవమి, ఫిబ్రవరి 3, సోమవారం
మాఘ శుద్ధ నవమిని మధ్వ నవమి అని కూడా అంటారు. ఈనాడు మహానంద నవమి వ్రతాన్ని ఆచరించాలని స్మ•తి కౌస్తుభం అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ శుద్ధ ఏకాదశి, ఫిబ్రవరి 5, బుధవారం
ఇంద్రసభలో పుష్పవంతుడు అనే గంధర్వుడు నాట్యం చేస్తున్నాడు. తన భార్యను చూస్తూ నాట్యం తప్పుగా చేశాడు. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చింది. పుష్పవంతుడిని, అతని భార్యను రాక్షసులు కావాల్సిందిగా శపించాడు. రాక్షసులై తిరుగుతున్న ఆ దంపతులకు మాఘ శుక్ల ఏకాదశి నాడు తినడానికి ఏమీ దొరకలేదు. అందుచేత వారు అనివార్యంగా ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ఆ ఉపవాస ఫలితంగా వారు శాప విముక్తులయ్యారు. ఇలా జరిగిన రోజు మాఘ శుద్ధ ఏకాదశి. ఈ కారణంగానే ఈ ఏకాదశికి జయైకాదశి అనే పేరు వచ్చినట్టు ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా, ఈనాడు భీమైకాదశీ వ్రతం ఆచరించాలని తిథి తత్వంలో రాశారు. గోదావరి – సముద్ర సంగమ క్షేత్రమైన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో గల శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ఈనాడు కల్యా ణోత్సవం ఘనంగా జరుగుతుంది.
ఇక, తెలంగాణలోని మేడారంలో గల సమ్మక్క, సారలమ్మ జాతర ఈనాడే ప్రారంభమవుతుంది. మహా జాతరగా పేరొందిన ఈ ఆదివాసీ వన దేవతల జాతర ప్రపంచంలోనే అతి పెద్దదిగా ప్రసిద్ధి పొందింది.
మాఘ శుద్ధ ద్వాదశి, ఫిబ్రవరి 6, గురువారం
మాఘ శుద్ధ త్రయోదశి కల్పాదిగా ప్రతీతి. విశ్వకర్మ జయంతి దినంగానూ ప్రసిద్ధి. విశ్వకర్మ దేవశిల్పి. ఆయన అన్ని కళలకు, అన్ని శిల్పాలకు, అన్ని విధాలైన చేతి పనులకు, అన్ని వృత్తులకు ఆద్యబ్రహ్మ. కాబట్టి విద్యారణ్య జయంతి, యాజ్ఞవల్క్య జయంతి దినాల వలే విశ్వకర్మ జయంతినీ వైభవోపేతంగా జరుపుకుంటారు. ఈయన దేవతలకు కావాల్సిన నగరాలు, మేడలు, మిద్దెలు, రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చాడు. సూర్యుడిని నేర్పుగా సానబట్టి.. రాలిన ఆ చూర్ణంతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. ఇంకా శివుడికి త్రిశూలాన్ని, ఇంద్రుడికి వజ్రాయుధాన్ని, రావణుడికి లంకా నగరాన్ని, శ్రీకృష్ణుడికి ద్వారకా బృందావనాన్నీ ఈయనే నిర్మించి ఇచ్చాడు. విశ్వకర్మ కొడుకు నలుడు సుగ్రీవుని కొలువులో ఉండేవాడు. రాముడు సముద్రాన్ని దాటడానికి కట్టిన వారధికి ఇంజనీరింగ్ నైపుణ్యం చూపింది ఇతడే. విశ్వకర్మ పాండవులకు ఇందప్రస్థ నగరాన్ని నిర్మించి ఇచ్చాడు. విశ్వకర్మ జయంతి కార్మికులకు పూజా దినం. ఈనాడు తమ వృత్తులకు, పనులకు ఆటవిడుపునిస్తారు.
మన దేశంలో విశ్వకర్మ విగ్రహాలు పలుచోట్ల చూడవచ్చు. అందులో కొన్నిటికి ఒకే ముఖం ఉంటుంది. మరికొన్నిటికి పంచముఖాలు ఉంటాయి. ఆయన చేతుల్లో ఉత్పత్తి సాధనాలు అనేకం ఉంటాయి. ఈయన వాహనం హంస. కాగా, మాఘ శుద్ధ ద్వాదశినే షట్ తిలా ద్వాదశి అని కూడా అంటారు. ఈనాడు ఇంకా వరాహ ద్వాదశీ వ్రతం, భీమ ద్వాదశీ వ్రతం కూడా చేస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది.
మాఘ శుద్ధ త్రయోదశి, ఫిబ్రవరి 7, శుక్రవారం
మాఘ శుద్ధ త్రయోదశి తిథి శనీశ్వరుడికి ప్రీతికరమైన తిథి. ఈనాడు ఆయన ప్రీత్యర్థం తిలలు (నువ్వులు) దానం చేయాలి. ఆయన ఆలయాలు ఉన్నచోట ఈనాడు విశేష పూజలు జరుగుతాయి. శని గ్రహ ప్రభావం ఉన్న వారు శాంతి పూజలు నిర్వహించడానికి ఈ తిథి ఉద్ధిష్టమైనది.
మాఘ శుద్ధ చతుర్దశి, ఫిబ్రవరి 8, శనివారం
ఈనాటితో మేడారం జాతర ముగుస్తుంది. ఫిబ్రవరి 5న ప్రారంభమై నాలుగో రోజైన ఈనాడే వన దేవతలు తిరిగి వన ప్రవేశం చేస్తారు. దీంతో జాతర ముగిసినట్టవుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర నిర్వహిస్తారు.
మాఘ శుద్ధ పూర్ణిమ, ఫిబ్రవరి 9, ఆదివారం
మాఘ శుద్ధ పూర్ణిమకే మహా మాఘి, మాఘ పూర్ణిమ అని పేరు. ఈనాడు బ్రహ్మవైవర్తన పురాణం దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. మేఘ నక్షత్రానికి అధి దేవత బృహస్పతి. కాబట్టి ఈనాడు ఆయనను పూజించాలని అంటారు.
మాఘ పూర్ణిమ సతీదేవి అవతరించిన దినమని పురాణ కథ. పార్వతి ఒకసారి దక్షిణావర్త శంఖపు ఆకారాన్ని ధరించి సరయూ నదిలోని కాళింది మడుగులోని ఒక పద్మంలో పడింది. దక్ష ప్రజాపతి అక్కడ స్నానం చేస్తూ పద్మంలోని శంఖాన్ని చూశాడు. అది దక్షిణావర్తమై ఉంది. దక్షిణావర్త శంఖం అపురూపమైనది. అది ఎవరి వద్ద ఉంటుందో వారికి గొప్ప భాగ్యం పడుతుంది. ఈ సంగతులు తెలిసిన వాడు కావడం చేత దక్ష ప్రజాపతి ఆ శంఖాన్ని అందుకోబోయాడు. అతని హస్తస్పర్శ తగలడంతోనే ఆ శంఖం ఒక చక్కని చిన్నారి కన్యగా మారింది. ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ బిడ్డే సతీదేవి. శంఖం బాలికగా మారిన రోజు మాఘ పూర్ణిమ. అందుచేత మాఘ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం అయ్యింది.
మాఘ మాసంలో అరుణోదయాన స్నానం చేయడం మన మత విధులలో ఒకటి. చలికి వెరవక మంచుతో కప్పబడి ఉన్న నదీ జలాల్లో స్నానం చేయాలని మన పెద్దలు మాఘ మాసపు విధిగా నిర్ణయించారు.
మాఘ స్నానంతో పాటు తిలహోమం, తిలదానం, తిల భక్షణం కావించాలని చెబుతారు. ఈ ఆచారాలన్నీ ఆరోగ్యప్రదమైనవి. మాఘ మాసం పొడవునా ఈ ఆచారాలను పాటించలేకపోయినా కనీసం ఆ మాసపు పర్వాల్లో అయినా పాటించడం మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.
మాఘ పూర్ణిమకు కాళహస్తిలో స్వర్ణముఖి నదీ స్నానం మహత్తు కలదని అంటారు.
రామేశ్వరం వద్ద సేతువులో రత్నాకరం మహోధుల సంగమం ఒకటుంది. ఇక్కడ స్నానం కూడా విశేషమైనదే.
ప్రయాగలో త్రివేణీ సంగమంలో మాఘ పూర్ణిమ స్నానం మహా పాతక నాశినిగా ఉంటుందని అంటారు.
గురుడు సింహరాశి గతుడైనపుడు తమిళనాడులోని కుంభకోణం లో మహామాఘి ఉత్సవం మరీ వైభవంగా జరుగుతుంది.
మాఘ కృష్ణ పాడ్యమి, ఫిబ్రవరి 10, సోమవారం
ఈనాటి నుంచి బహుళ (కృష్ణ) తిథులు ఆరంభమవుతాయి. మాఘ కృష్ణ పాడ్యమి తిథి నాడు సౌభాగ్య వ్యాప్తి వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ కృష్ణ సప్తమి, ఫిబ్రవరి 15, శనివారం
మాఘ కృష్ణ సప్తమి తిథి కూడా ప్రధానంగా సూర్యారాధనకు ఉద్దేశించినదే. ఈనాడు నిక్షుభార్క సప్తమి, సర్వవ్యాప్తి సప్తమి మున్నగు వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో పేర్కొన్నారు.
మాఘ కృష్ణ అష్టమి, ఫిబ్రవరి 16, ఆదివారం
మాఘ కృష్ణ అష్టమి నాడు మంగళావ్రతం ఆచరించాలి. దీనినే సీతాష్టమి అనీ, కాలాష్టమీ అని కూడా అంటారని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో ఈనాడు జానకి జయంతిని జరుపుకుంటారు.
మాఘ కృష్ణ ఏకాదశి, ఫిబ్రవరి 19, బుధవారం
మాఘ కృష్ణ ఏకాదశిని కొన్ని ప్రాంతాలలో విజయ సంకేతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తమిళనాడులో ఈ తిథి విశేషమైనది. ఎందుకంటే, ఈ తిథి నాడే శ్రీరాముడు లంకపై దండెత్తడానికి అనువుగా చేపట్టిన సేతువు నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాడని నమ్మిక. అందుకే ఈ తిథి నాడు వివిధ పనులు విజయవంతమవ్వడానికి శ్రీకారం చుట్టే ఆచారం ఏర్పడింది. ఆమాదేర్ జ్యోతిషీ అనే వ్రత గ్రంథంలో మాఘ బహుళ (కృష్ణ) ఏకాదశి తిథిని విజయైకాదశిగా పేర్కొనడం కూడా ఈ నమ్మకానికి బలమిస్తోంది.
మాఘ కృష్ణ ద్వాదశి, ఫిబ్రవరి 20, గురువారం
మాఘ కృష్ణ ద్వాదశిని నీల ద్వాదశి అని కూడా అంటారని నీలమత పురాణంలో ఉంది. ఈ తిథికి ముందురోజున ఉపవాసం ఉండి ఈనాడు నువ్వులు దానం చేయాలని నియమం. అయితే, ఈనాడు తిల ద్వాదశీ వ్రతం, కృష్ణ ద్వాదశీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది.
మాఘ కృష్ణ త్రయోదశి, ఫిబ్రవరి 21, శుక్రవారం
ఇది ద్వాపర యుగాది తిథి. ఈ యుగ సంధిలోనే వేదవ్యాసుడు అవతరించి వేదాన్ని విభాగించాడని, ధర్మశాస్త్ర పురాణేతిహాసాలను రచించాడని ప్రతీతి. ఈనాడు విరివిగా దానాలు చేయాలని అంటారు. ఈ యుగాన్ని తామ్ర యుగమనీ అంటారు. ప్రజల్లో వైరుధ్య బుద్ధులు, సందేహాలు ఎక్కువవుతాయనీ, ప్రతి విషయంలో ప్రజలు సంశయ పీడితులుగా ఉండటం వల్ల ఈ యుగానికి ద్వాపర యుగం అనే పేరు వచ్చిందని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ఈ యుగంలోని మనుషులు శరీరంలో రక్తం ఉన్నంత కాలం ప్రాణాలు ధరించి ఉంటారు. మాఘ కృష్ణ త్రయోదశి తిథి నాడు విరివిగా దానాలు చేస్తారు. త్రయోదశి తిథి నాడే ఈసారి మహా శివరాత్రి పర్వం. శివయోగ యుక్తమైన ఈ తిథి మహా శివరాత్రి పర్వదినమని శివరాత్రి మహాత్మ్యం అనే గ్రంథం చెబుతోంది.
మాఘ కృష్ణ చతుర్దశి, ఫిబ్రవరి 22, శనివారం
మాఘ కృష్ణ చతుర్ధశి తిథి శివుడికి ప్రీతికరమైనది. ఈనాడు విష్ణు చిత్తరామానుజ స్వామి తీర్థం కూడా. మాఘ బహుళ చతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేసి యమునికి గల పద్నాలుగు నామాలతో తర్పణం, నువ్వులు, దర్భ, నీరు కలిపి ఇవ్వాలి. ఈనాడు పులగం తినాలి. శివుడిని బిల్వార్చనం, తుమ్మి పూలతో పూజించాలి. మాఘ కృష్ణ చతుర్దశి నాడు రంతీ చతుర్దశి వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు అరుణోదయాన్నే స్నానం చేసి యమ తర్పణం చేయాలని శాస్త్ర వచనం. ఈనాడు కృష్ణ చతుర్దశీ వ్రతం, సర్వకామ వ్రతం చేయాలని హేమాద్రి వ్రత ఖండంలో ఉంది.
మాఘ కృష్ణ అమావాస్య, ఫిబ్రవరి 23, ఆదివారం
మాఘ కృష్ణ అమావాస్య దినం మన్వాది అని ఆమాదేర్ జ్యోతిషీ పేర్కొంటుండగా, ఈనాడు నవనీతను దానం చేయాలని పురుషార్థ చింతామణి చెబుతోంది. అలాగే, ఈనాడు శ్రీకృష్ణుడి సోదరుడైన బలరాముడిని యథాశక్తి కొలవాలి. మాఘ కృష్ణ అమావాస్య కుంభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలం. ఈ కాలంలో సుజనావ్యాప్తి వ్రతం, సంక్రాంతి స్నానం వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. పితృకర్మలు నిర్వహించడానికి ఇది అనువైన తిథి. ఇది మాఘ మాసపు చివరి దినం.
మాఘ మాసం.. వేద మాసం..జ్ఞాన మాసం.
భారతీయ సంవత్సరానికి పదకొండో చాంద్రమాసం, పదవ సౌర మాసం.. మాఘ మాసం. ‘మఘ’ నక్షత్రయుక్త ‘పూర్ణిమ’ ఈ మాసంలో రావడం వల్ల ఇది మాఘ మాసమైంది. వాస్తవానికి సంవత్సర కాలంలోని ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాలు చాలా పవిత్రమైనవి. ఈ నాలుగు మాసాల్లో మాఘ మాసానికి విశిష్ట స్థానం ఉంది. ఈ నాలుగు మాసాల పూర్ణిమ దినాలు అత్యంత పవిత్రమైనవి. ఈ దినాల్లో ప్రధానంగా సముద్ర స్నానాలు చేయడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. శరీరాలు సముద్రంలోని ఉప్పునీటిలో సంవత్సరంలో కనీసం నాలుగు సార్లయినా స్నానం చేయడం వల్ల ఆ ఉప్పదనం, రోమాల ద్వారా మన శరీరంలోకి వెళ్లి మాలిన్యాలను, వ్యర్థ లవ ణాలను తొలగిస్తుందని వైద్య శాస్త్రం చెబుతోంది. ఇలాంటి సముద్ర స్నానాలు పూర్ణిమ నాడే ఎందుకు చేయాలంటే- చంద్రుడి పదహారు కళల శక్తీ సముద్రంలో ఉండేది ఆ ఒక్క పూర్ణిమ తిథి నాడే కాబట్టి. పౌరాణికులు మాఘ మాసాన్ని జ్ఞాన మాసంగా అభివర్ణించారు. అహం అనే పాపాన్ని తొలగించేది, అజ్ఞానమనే మృత్యువును హరించేది, నశింప చేసేది మాఘమని వేద ప్రవచనం. అందుకే దీన్ని వేద మాసం అన్నారు.
మాఘాది పంచకం.. సకల శుభాలకు శ్రీకారం
మాఘ ఫాల్గుణ మాసాలు కలిపి శిశిర రుతువు. ఈ కాలంలో వీచే శీతల గాలుల ప్రభావంతో శరీరం ఇక్కలాక్కుని పోతుంది. అంటే శరీరంలో ఉండే ఊబ తగ్గిపోతుంది.
సంవత్సరంలోని పదో మాసమూ, హేమంత రుతువులోని రెండో మాసమూ అయిన పుష్య మాసం తెలుగు వారికి శూన్య మాసం. సంవత్సరంలోని నాలుగో మాసమూ, గ్రీష్మ రుతువులోని రెండో మాసమూ అయిన ఆషాఢ మాసం కూడా తెలుగు వారికి శూన్య మాసం. శూన్య మాసాలు శుభ శోభనాలకు పనికిరావు. ఒక సంవత్సరం చివరి పాదంలో వచ్చే పుష్య మాసానికి మరు సంవత్సరం రెండో పాదం ఆదిలో వచ్చే ఆషాఢ మాసానికి మధ్య ఐదు మాసాలు. అందుకే ఆ ఐదు మాసాలకు మాఘాది పంచకం అని పేరు. కార్యకలాపాలకు అనుకూల మాసం మాఘం. మాఘ మాసంలో వాన బాధ అంతగా ఉండదు. చలి తీవ్రత కూడా తగ్గుతుంది. వస్త్ర సమస్య, గృహ సమస్య ఇబ్బందిని కలిగించేవిగా ఉండవు. మాఘ మాసంలో ధాన్యలక్ష్మి ఆరు బయట విరివిగా మసులుతుందని అంటారు. శాకలక్ష్మి విషయంలో సమృద్ధి సంతృప్తికరంగా ఉంటుంది. అటువంటి అనుకూలమైన మాస పంచకానికి తొలి మాసం మాఘం.
మాఘ స్నానం.. మహా పుణ్యప్రదం..
మాఘ పురాణం మాఘ మాస మహిమలను వివరిస్తోంది. అలాగే, మాఘ స్నానం మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం తెలియ చెబుతోంది. మాఘ మాసంలో సూర్యోదయానికి ముందు గృహ స్నానం చేస్తే ఆరు సంవత్సరాల యజ్ఞ స్నాన ఫలం లభిస్తుందని ప్రతీతి. బావినీటి స్నానం పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం శత గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలం ఇస్తాయని పురాణ వచనం. మాఘ మాస స్నానాలకు అధిష్ఠాన దైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘ మాసంలో సూర్యోదయానికి పూర్వం గృహ స్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని అంటారు. అందుకే మాఘ మాసం పొడవునా సూర్యుడిని ఆరాధించడం సంప్రదాయంగా మారింది. మృకండ ముని, మనిస్విని దంపతుల మాఘ స్నాన పుణ్య ఫలమే వారి కుమారుడైన మార్కండేయుడిని అప మృత్యువు బారి నుంచి తొలగించిందని పురాణ వచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరడం సంప్రదాయం. స్నానం చేసే సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
జనవరి 20 – మార్చి 30 మధ్య.. ప్రాత:స్నానం.. ఆరోగ్యప్రదం.
మాఘ మాసంలో వచ్చే ఆదివారాలు (జనవరి 26, ఫిబ్రవరి 2, 9, 16, 23వ తేదీలు, 2020) మహిమాన్వితమైనవి. ఈ రోజుల్లో సూర్యపూజ చేస్తే ఆరోగ్యప్రాప్తి. ప్రాత: స్నానం అతి ముఖ్యం. సూర్యుడు మకరరాశి గతుడు ఎప్పుడవుతాడో అప్పటి నుంచి ప్రాత: స్నానం తప్పనిసరి. మాఘ మాసంలో నదులు, చెరువులు, మడుగులు, కొలనులు, బావులు, తుదకు నీటి పడియలో కానీ స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. అనారోగ్యం కారణంగా ఈ కాలంలో స్నానం చేయడానికి సమర్థత లేనివారు పొద్దు పొడిచిన జాము లోపల స్నానం చేయాలి. మాఘ మాసంలో అరుణోదయాన దీపారాధన, తిలహోమ తిలదానం, తిలభక్షణం, మాఘ స్నానం చేయాలి. వైశాఖ – కార్తీక మాసాల మాదిరిగా మాఘ స్నానాలూ పవిత్రమైనవి. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాస సంప్రదాయం. సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్య కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరతాయి. ఆ సమయాల్లో సూర్య కిరణాల్లో ఉండే అతినీలలోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమైనవనీ అంటారు.

Review మాఘం… అమోఘం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top