శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర మహిమ

శ్రీకాళహస్తి పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది- శ్రీ- సాలె పురుగు, కాళ- సర్పము, హస్తి- ఏనుగు అనే మూగ జీవాలకు ముక్తినిచ్చిన క్షేత్రమనే విషయం. అయితే ఎక్కువగా వాడుకలో ఉన్నది ఈ సాలె పురుగు, పాము, ఏనుగు కథే. కానీ, దీనికంటే ముందే ఇక్కడ చాలా ఉదంతాలు జరిగిన దాఖలాలున్నాయి.
గతంలో శ్రీకాళహస్తి ప్రాంతాన్ని గజకాననం అని పిలిచే వారు. బ్రహ్మ ఇక్కడ పరమశివుడి గురించి తపస్సు చేసిన తరువాతనే సృష్టి కార్యం ప్రారంభించాడని అంటారు. ఇక్కడ శివుడు జ్ఞానానికి ప్రతీక అయిన దక్షిణామూర్తి స్వరూపంలో కూడా వెలిసి ఉన్నాడు.
వశిష్ట మహర్షికి విశ్వామిత్రునితో వైరం వల్ల తన నూరుగురు కుమారులనూ పోగొట్టుకుంటాడు. ఆయన జ్ఞాన సంపన్నుడే అయినప్పటికీ, పుత్ర శోకంతో మాయ కప్పివేయడం వల్ల గజకాననానికి వచ్చి ఒక పర్వతం ఎక్కి ఆత్మహత్య చేసుకోబోయాడట. అప్పుడు భూమాత ఆయనను రక్షించింది. శివుడి గురించి తపస్సు చేయాలని కర్తవ్య బోధ చేసింది. అలా కొన్నేళ్ల పాటు తపస్సు చేసిన వశిష్టునికి మహా శివుడు.. దక్షిణామూర్తి స్వరూపంలో మర్రిచెట్టు కింద దర్శనమిచ్చాడు. ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మహా జ్ఞాని అయిన వశిష్టుడు ప్రాపంచిక విషయాల గురించి ఏం కోరుకుంటాడు? అందుకే లోక కల్యాణం కోసం శివుడిని జ్ఞాన ప్రదాతగా ఆ క్షేత్రంలో కొలువై ఉండిపోవాలని కోరుకున్నాడు. అలా శ్రీకాళహస్తి జ్ఞాన క్షేత్రమైంది. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ.
శ్రీకృష్ణ దేవరాయలు కొలువులోని అష్ట దిగ్గజాల్లో ధూర్జటి ఒకరు. అవి ప్రబంధ సాహిత్యపు రోజులు. అందరు కవులూ రాజుల గురించి ఇతివృత్తాలను ఎన్నుకుంటుంటే, ఆయన మాత్రం తన ఇష్టదైవమైన శ్రీకాళహస్తీశ్వరుడిని ఇతివృత్తంగా ఎన్నుకొని శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంగా రాశాడు. అలాగే, శ్రీకాళహస్తీశ్వర శతకం కూడా రాశాడు. ఆయన రచనా శైలి గురించి రాయలు ఎంతో గొప్పగా ప్రశంసించారు. కాగా, తరువాత కాలంలో ధూర్జటిపై కొందరు ఏవో నిందలు వేయడంతో రాయల వారు ధూర్జటికి రాజ్యబహిష్కార శిక్ష విధించారు. వెంటనే ధూర్జటి కట్టు బట్టలతో భార్యతో కలిసి ఒక అడవికి వచ్చేశాడు. అక్కడే ఇద్దరు ముని దంపతుల ఆశ్రమంలో ఉంటూ వాళ్లకు సేవచేస్తూ, వాళ్లు పెట్టే భోజనం తింటూ దైవ ప్రార్థనలో ప్రశాంత జీవనం గడిపే వాడు.
ఒకరోజు ధూర్జటి దంపతులు నదీ స్నానం కోసం వెళ్లగా అక్కడి వచ్చిన రాయల వారి సైనికులు వీరిని గుర్తుపట్టి, ‘మీపై వేసిన నిందలు అసత్యాలుగా నిరూపితం అయ్యాయి. రాయల వారు మిమ్మల్ని తిరిగి రాజ్యానికి ఆహ్వానిస్తున్నారు’ అని చెబుతారు.
వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తూ ధూర్జటి దంపతులు ఆశ్రమం వైపు నడుస్తున్నారు. కానీ, వారికి ఎంతసేపు వెతికినా ఆ ఆశ్రమం కనిపించలేదు. వృద్ధ దంపతులూ కనిపించలేదు. చివరకు అది కాళహస్తీశ్వరుడి మహత్తుగా భావించి, తాము రాజ్యానికి రాబోమని చెప్పి సైనికులను పంపించి వేసారు ధూర్జటి దంపతులు. తమ శేష జీవితాన్ని శ్రీకాళహస్తి క్షేత్రంలోనే గడిపాడని చెబుతారు. అయితే, దీనికి చారిత్రక ఆధారాలేమీ లేవు.
ఇక్కడ ప్రవహించే స్వర్ణముఖీ నది అసలు పేరు సువర్ణముఖి నది. అగస్త్య మహర్షి ప్రభావంతో ఈ నదీ ప్రవాహం ఏర్పడిందని స్థల పురాణం చెబుతోంది

Review శ్రీకాళహస్తీశ్వర క్షేత్ర మహిమ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top