తెలుగు ‘పాట’వం

కరేణ కిం మాం గృహీతుం తే
హరే ఫణిశయ్యా సంభోగ
।।పల్లవి।।
జలే తవ సంచరణ మిహాధన్‍
స్థలే భవనం తవ సంతతం
బలే రూప ప్రకటన మతులా
చలే స్థానం చల చల రమణా
।।కరేణ।।
పదే భువన ప్రామాణ్యం తవ
హ్రదే ప్రచురణవిహరణ మిదం
ముదేమునీనాం మోహనం తనుం
మదే తవ నర్మ చ మాం విసృజ
।।కరేణ।।
స్మరే విజయ స్తవ విమలతురగ
ఖురే రతిసంకుల రచన
పురే తవ విస్ఫురణం వేంకట
గిరేపతే తే ఖేటాఘటిత
।।కరేణ।।

అవతారిక: తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవేంకటేశ్వరుడిపై రచించిన కీర్తనల్లో ఇదో సరస శృంగార కీర్తనం. దీనిని అన్నమయ్య గీర్వాణి రాగంలో వినిపిస్తున్నారు. మన అదృష్టం కొద్దీ ఇది శ్రీమన్నారాయణుని దశావతార కీర్తన. అక్కడక్కడా ప్రతిపదార్థమునకు గాక భావార్థమునకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. తెలుగులో దశావతార కీర్తన గురించి వివరించదలిస్తే ప్రతిపదార్థ వివరణకే ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ సంస్క•తంలో ప్రతిపదార్థ వివరణ ఇవ్వాలనుకోవడం మన బోటి వారికి శక్తికి మించిన పని. ఎందుకంటే గీర్వాణి రాగంలో మనకున్న పాండిత్యం అమావాస్య నాటి చంద్రుడి వంటిది. ఇక ఈ అన్నమయ్య కీర్తన విషయానికి వస్తే.. ‘ఓ శ్రీహరీ! ఫణీంద్రశయ్యపై సంభోగానందమును అందుకునే నీ కరములు నన్ను అనుగ్రహించకుండుట ఎందులకు?’ అని భక్తుడు దీనంగా దేవదేవుడిని వేడుకోవడం పై కీర్తనలోని పల్లవికి భావం.
భావ వివరణ: ఓ శ్రీహరీ! ఫణిశయ్యా సంభోగా! (ఫణీశుడైన ఆదిశేషుడు శయ్య (పడక) అయి ఉండగా, ఆ శయ్యపై సంభోగించుటకు ఆయత్తమైనవాడా!) నీ కరములు నన్ను అనుగ్రహించకుండా ఉండుట ఎందులకు ప్రభూ!.

సముద్రము నందు నీ యొక్క సంచలన మిట్టిది (మత్య్సావతారము). నీకు అడుగున నీ పైన భువనములు ఉన్నవి (ఇది కూర్మావతారాన్ని ఉద్దేశించిన ఫంక్తి). ఉన్నతమైన బల ప్రకటన జరుపు రూపమొప్పినది (వరాహావతారము). కొండ గుహలలో చరించు సింహభముఖరూపివి (నరసింహావతారము).
నీ పదములతో భువన ప్రమాణములను కొలిచితివి (వామనావతారంలో శ్రీమహావిష్ణువు మూడు అడుగులతో నింగీ నేల మొత్తాన్ని కొలిచేశాడని భావం). గొప్ప మడుగులో (తీర్థములలో) నీ యొక్క ప్రసిద్ధమైన విహారములు (యాత్రలు) జేసితివి (పరశురామావతారంలో పరశువు (గొడ్డలి)ను ధరించి భూ మండలం మొత్తం తిరిగినాడని భావం). మునులకు సైతం ఆనందమునిచ్చు మోహన రూపుడైతివి (శ్రీరాముని అవతార వర్ణన. ఈ అవతారంలో రాముడు ఎందరో మహర్షుల మనసు చూరగొన్నాడని భావం). నీ యొక్క ఔన్నత్యమునకు నన్ను విడనాడితివి (బుద్ధుని అవతారంలో అన్నీ త్యజించినాడనే వర్ణన).
నీ యొక్క విజయ చిహ్నమైన తెల్లని గుర్రపు గిట్టల నడక రతి సల్లాప సంకేతములైనవి (దేవేరితో కలిసి కరాలము చేతబూని కలియుగంలో సంచరించు కల్కి అవతారము గురించి వర్ణన).

ఓ శ్రీవేంకటగిరినాథా! సృష్టిలో నీ ప్రకాశముతో నీ యొక్క ఆట నాడించు నీ కరములతో నన్నేల పరిగ్రహించవు తండ్రీ!.
శేషపానుపుపై శయనించి అర్థనిమీలిత నేత్రాలతో నిద్రామగ్నుడై ఉన్న దేవదేవుడు భక్తుడి మొరను కూడా ఆలకించాలంటూ దశావతారాల వర్ణనతో చిక్కనైన తెలుగు పదాలతో అన్నమాచార్యుల వారు రచించి, గీర్వాణి రాగంలో ఆలపించిన కీర్తన ఇది.

Review తెలుగు ‘పాట’వం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top