
భారతీయు పరంపరాగతానికి పౌరాణిక కథనాల ప్రకారం ప్రతి వారి వంశానికి ఒక రుషి మూల పురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి అని భావిస్తారు. కొందరికి గోత్ర రూపంలో వారి పూర్వ రుషులు ప్రతి రోజూ స్మరణీయులే. మరికొందరికి వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు కూడా రుషులు ఉన్నారు. అందుకే వశిష్ఠ, కశ్యప, భరద్వాజ మున్నగు గోత్రాలతోనే నేటికీ పలువురు పూజలు ప్రారంభిస్తారు. ఆలయాల్లో పూజలు నిర్వహించేటప్పుడు, ఇతర శుభకార్యాలు ఆచరించేటప్పుడు పురోహితులు మొదటగా గోత్రం అడిగిన తరువాతే ఆయా కార్యాలకు శ్రీకారం చుడతారు.
కశ్యపోత్రి భరద్వాజా: విశ్వామిత్రోథ గౌతమ:।
వశిష్ఠో జమదగ్ని శ్చ సప్తైతే రుషయ: స్మ•తా: ।।
పై శ్లోకం ప్రకారం మనకు ఏడుగురు రుషులు ఉన్నారు. వారు..
1. కశ్యపుడు
2. అత్రి
3. భరధ్వాజుడు
4. విశ్వామిత్రుడు
5. గౌతముడు
6. జమదగ్ని
7. వశిష్ఠుడు
వీరు ఏడుగురినీ ‘సప్తర్షు’లని అంటారు. వీరు పూజనీయులు.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహా విష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకు అందించాడు. వ్యాసుడు- నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడు అని అంటారు.
ఇక సప్తర్షుల ఘనతల గురించి తెలుసు కుందాం.
1. కశ్యపుడు
సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు). దక్ష ప్రజాపతి పుత్రికల్లో పద మూడు మందిని, వైశ్వాసరుని పుత్రికల్లో ఇద్దరిని ఈయన వివాహమాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలత్పాతణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అసూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోము లను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని ఈయన పుత్రులుగా పొందాడు.
2. అత్రి మహర్షి
సప్తర్షుల్లో రెండో వాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అత్రి తన తపో బలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ మహా పతివ్రతా శిరోమణి. త్రిమూర్తులనే పసిబిడ్డలను చేసి వారి ఆకలిదప్పు లను తీర్చిన మహా మాత.
3. భరద్వాజుడు
ఈయన ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్త చాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.
4. విశ్వామిత్రుడు
ఈయన రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపో ఫలాన్ని, హరిశ్చంద్రునితో అసత్యం మాట్లాడించి కొంత ఫలాన్ని, మేనక వల్ల తపో విఘ్నం పొంది శకుంతల జననానికి మూల పురుషుడు అయ్యాడు. దుష్యంతుడు- శకుంతల పుత్రుడే భరతుడు. ఇతడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.
5. గౌతముడు
తీవ్ర క్షామం ఏర్పడినపుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపో బలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్శ్య వల్ల మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మ హత్యా పాతకం అంటగట్టు కున్నాడు. ఆ దోష పరిహారం కోసం గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి ఈయన. తన భార్య అహల్యను శిలగా మారేటట్టు శాపమిచ్చిందీ గౌతముడే.
6. జమదగ్ని
రుషి – రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్య పురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునితో జమదగ్ని నరికించాడు. ఆ తరువాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.
7. వశిష్ఠుడు
ఈయన భార్య అరుంధతి. వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్థ్వబాహుడు, సువ నుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడు గురు పుత్రులను పొందాడు. సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగి పోతాయని అంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు.. వీటిని ప్రాత:కాలంలో స్మరిస్తే శుభాలు కలుగుతాయని అంటారు.
Review ప్రాతః స్మరణీయులు సప్తర్షులు.